
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్ 21న రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన పార్టీ శ్రేణులకు ఒక సర్క్యులర్ను జారీచేశారు. పోరాట యోధుడు, జననేత అయిన జగన్ స్ఫూర్తితో ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు, రక్తదాన శిబిరాల నిర్వహణతో పాటు ఇంకా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.
పార్టీ నాయకులు ఉదయాన్నే వారి పూజించే ప్రార్థనాలయాలను సందర్శించి ప్రార్థనలు చేయాలన్నారు. జిల్లా కేంద్రాలతో పాటుగా అవకాశమున్న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసి శ్రేణులు రక్తదానం చేయాలని పేర్కొన్నారు. రక్తంలేని కారణంగా ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండేందుకు ఈ చర్య దోహదపడుతుందని విజయసాయిరెడ్డి వివరించారు. ఇక జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.