నేడు చంద్రగ్రహణం: ఆలయాలు మూసివేత
Published Mon, Aug 7 2017 11:33 AM | Last Updated on Mon, Sep 11 2017 11:31 PM
హైదరాబాద్: చంద్రగ్రహణం సందర్బంగా సోమవారం మధ్యాహ్నం నుంచి అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. భద్రాద్రి రాముల వారి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు మూసివేస్తారు. తిరిగి రేపు ఉదయం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరిచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి మంగళవారం తెల్లవారుజామున స్రంప్రోక్షణ అనంతరం 4 గంటలకు తెరుస్తారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు మూసివేసి సంప్రోక్షణ అనంతరం రేపు ఉదయం 6 గంటలకు తెరుస్తారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనృహింహస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటలకు మూసివేసి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తెరుస్తారు.
ఆంధ్రప్రదేశ్లో...
చంద్ర గ్రహణం సందర్భంగా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని సాయంత్రం 4 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సంప్రోక్షణ అనంతరం తెరుస్తారు. ఈ సందర్భంగా విశేష పూజ, ఆర్జిత సేవలను రద్దు చేశారు. కాలిబాట భక్తులకు 6 వేల దర్శన టికెట్లు మాత్రమే టీటీడీ జారీ చేయనున్నది. గ్రహణ సమయంలో కంపార్టుమెంట్లలోకి భక్తులెవరినీ అనుమతించరు. ఆలయంతో పాటు అన్న ప్రసాద కేంద్రం, శ్రీవారి పోటును కూడా మూసివేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సోమవారం సాయంత్రం 4 గంటలకు మూసివేస్తారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు.
అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయకుని ఆలయాన్ని కూడా మధ్యాహ్నం నుంచి మూసి ఉంచుతారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గ, శ్రీమల్లికార్జునస్వామి ఆలయాలను కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత మూసివేస్తారు. తిరిగి మంగళవారం తెల్లవారుజామున తెరిచి ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గ్రహణం సందర్భంగా మంగళవారం ఖడ్గ మాల సేవను రద్దు చేశారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఉదయం 11 గంటల నుంచి మూసివేస్తారు. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు.
శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుంది
శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహిస్తుంటారు కావున ఆలయాన్ని గ్రహణ సమయాల్లోనూ యథావిధిగా తెరిచి ఉంచి భక్తులను అనుమతిస్తారు.
Advertisement
Advertisement