
వెన్నుపోటుదారుకు మళ్లీ చోటా?
అనపరిత: ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలో చేర్చుకోవడంపై పెదపూడి మండలం తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నా రు. అనపర్తి టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పెదపూడి మండల టీడీపీ కార్యకర్తల సమావేశం బొడ్డు చేరికపై వేడెక్కింది. పెదపూడి మండల టీడీపీ అధ్యక్షుడు జేవీవీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని.. బొడ్డును ఎందుకు చేర్చుకున్నారంటూ పెదపూడికి చెందిన మార్నీ కాశీ నిలదీశారు. ఆయనకు పెదపూడికి చెందిన వాసు, శహపురానికి చెందిన కృష్ణ వత్తాసు పలికారు. ‘బొడ్డు డౌన్ డౌన్, బొడ్డును టీడీపీ నుంచి తరిమి కొట్టాలి’ అన్న నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది.
ఎమ్మెల్యే వారించబోయినా ఖాతరు చేయని కార్యకర్త లు తమను సంప్రదించకుండా బొడ్డును ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నిం చా రు. నియోజకవర్గంలో ఏకతాటిపై నడుస్తున్న పార్టీలో బొడ్డు చేరిక వల్ల గ్రూ పులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బురదజల్లి వైఎస్సార్సీపీలో చేరిన వాడిని ఎలా చేర్చుకున్నారని మండిపడ్డారు. బొడ్డు టీడీపీలో, ఆయన తనయుడు వైఎస్సార్ సీపీలో ఉండడాన్ని తప్పుపట్టారు. బొడ్డు టీడీపీలో కొనసాగితే పార్టీకి రాజీనామా చేస్తామని తెగేసి చెప్పారు. ఆగ్రహోదగ్రులైన కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే ఎంత యత్నించినా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరినా లక్ష్యపెట్టలేదు. చివరికి కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోననడంతో కొంత శాంతించారు.