
న్యూఢిల్లీ: గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు చేసిన వారి సంఖ్యలో మంచి వృద్ధి చోటు చేసుకుంది. జూలై వరకు దాఖలు చేయాల్సిన గడువును ఆగస్ట్ నెల వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 31తో గడువు ముగియగా, మొత్తం 5.65 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన 5.42 కోట్ల ఐటీఆర్లో పోలిస్తే 4 శాతం వృద్ధి నమోదైంది. రికార్డు ఏమిటంటే... ఆగస్ట్ 31 ఆఖరి ఒక్క రోజే 49,29,121 మంది ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేయడం. ఆగస్ట్ 27 నుంచి 31 నాటికి 1,47,82,095 రిటర్నులు దాఖలయ్యాయి. ఇక, నమోదైన 5.65 కోట్ల రిటర్నుల్లో ఇప్పటి వరకు 3.61 కోట్ల రిటర్నుల వెరిఫికేషన్ కూడా పూర్తయినట్టు ఆదాయపన్ను శాఖ తెలియజేసింది.