
విశాఖ నుంచి నేపాల్కు కార్గో రైళ్లు
బాక్స్ రైళ్లు నడపనున్న పోర్టు
విశాఖపట్నం: నేపాల్కు సరకు రవాణా పెరుగుతుండటంతో దానికి విశాఖ పోర్టు నుంచి ట్రాన్షిప్మెంట్ అవసరాలు కూడా అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి సరకు పంపేందుకు బాక్స్ రైళ్లు నడపాలని విశాఖ పోర్టు భావిస్తోంది. తగిన ఏర్పాట్లు కోసం రైల్వే శాఖతో సంప్రతింపులు మొదలెట్టింది. కోల్కతా పోర్టుతో ఇబ్బందులు పడుతున్న నేపాల్ వాణిజ్య రంగం... విశాఖ పోర్టును ప్రత్యామ్నాయంగా తీసుకుంటుండటడమే దీనిక్కారణం. ప్రస్తుతం నేపాల్కు ట్రాన్షిప్మెంట్ పోర్టుగా కోల్కతాను వాడుతున్నారు. అంటే సరకులు అక్కడికి నౌకల్లో వచ్చి... అక్కడి నుంచి నేపాల్కు భూ మార్గంలో వెళతాయన్న మాట. అయితే కోల్కతాలో చిన్న చిన్న వెసల్స్లో రవాణా చేస్తుండటంతో టర్నరౌండ్కు రెండున్నర రోజులు పడుతోంది. విశాఖ పోర్టు కేవలం ఒక్క పూటలోనే మదర్షిప్ నుంచి సరుకు దిగుమతి చేస్తోంది. దీంతో ప్రతి కంటైనర్పై రెండు వందల డాలర్ల లగేజీ ఖర్చు మిగులుతుంది. దీన్ని కూడా నేపాల్ పరిగనలోకి తీసుకుంటోంది.
1400 కిలోమీటర్లు..17 రోజులు: విశాఖ పోర్టు నుంచి నేపాల్లోని బీర్గంజ్కు మధ్యనున్న దూరం1400 కిలోమీటర్లు. గంటకు 100 కి.మీ. వేగంతో ప్రయాణించే రైళ్లను 90 బాక్స్లతో నడపడానికి ప్రత్నిస్తున్నట్లు విశాఖ పోర్టు అధికారులు చెప్పారు. కోల్కతా పోర్టు నుంచి నేపాల్కు దూరం సగమే. కానీ తాము కోల్కతా కన్నా త్వరగా సరకును గమ్యానికి చేరుస్తామని, అదే తమకు అనుకూలమని పోర్టు డిప్యూటీ చైర్మన్ ఎల్.హరనాధ్ నేపాల్కు ఇప్పటికే చెప్పారు.