ఆస్తుల అమ్మకానికి రాణా స్కెచ్‌‌.. | Rana Kapoor Was Planning To Flee After He Was Tipped Off The Investigation | Sakshi
Sakshi News home page

ఆస్తుల అమ్మకానికి రాణా స్కెచ్‌‌..

Published Wed, Mar 11 2020 11:02 AM | Last Updated on Wed, Mar 11 2020 11:06 AM

Rana Kapoor Was Planning To Flee After He Was Tipped Off The Investigation - Sakshi

ఆస్తులు అమ్మి విదేశాలకు చెక్కేసేందుకు రాణా కపూర్‌ ప్రయత్నాలు

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో తమకున్న రూ 1000 కోట్ల విలువైన ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలన్న యస్‌ బ్యాంక్‌ వ్యవస్ధాపకుడు రాణా కపూర్‌ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. యస్‌ బ్యాంక్‌ కేసులో దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్న రాణా కపూర్‌ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న క్రమంలో దేశ రాజధానిలో తన భార్య బిందూ కపూర్‌ పేరిట ఉన్న మూడు విలాసవంతమైన భవనాలను విక్రయించేందుకు రాణా కపూర్‌ ప్రయత్నాలు చేశారని తెలిసింది. రూ 4300 కోట్ల అనుమానిత లావాదేవీలు జరిగిన యస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో బిందూ కపూర్‌ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోని ప్రైమ్‌ లొకాలిటీలో 40, అమృత షెర్గిల్‌ మార్గ్‌లోని భవంతిని బిందు బ్లిస్‌ అడోబ్‌ సంస్థ పేరిట కొనుగోలు చేశారు.

బ్లిస్‌ విల్లా ప్రైవేట్‌ లిమిడెట్‌ పేరుతో ఢిల్లీలోనే మరో రెండు ఆస్తులను కొనుగోలు చేశారు. రూ 1000 కోట్ల విలువైన ఈ భవంతులను విక్రయించేందుకు తగిన పార్టీలను అన్వేషించాలని ఢిల్లీలోని కొందరు ప్రాపర్టీ డీలర్లను రాణా కపూర్‌ సంప్రదించినట్టు సమాచారం. తనపై ఈడీ దర్యాప్తు సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ, ముంబైలోని ఆస్తులను అమ్మి అమెరికా కాకుంటే బ్రిటన్‌ లేదా ఫ్రాన్స్‌కు మకాం మార్చాలని రాణా కపూర్‌ యోచించారని తెలిసింది. దేశాన్ని విడిచేలోగా భారత్‌లో తనకున్న ఆస్తులను అన్నింటినీ విక్రయించాలన్నది ఆయన ఉద్దేశంగా చెబుతున్నారు.

మరోవైపు అవంత రియల్టీ యస్‌ బ్యాంక్‌కు చెల్లించాల్సిన రుణం బకాయి పడటంతో అదే సంస్థకు చెందిన అమృత షెర్గిల్‌ మార్గ్‌లోని విలాసవంతమైన భవనాన్ని బిందు కపూర్‌ బ్లిస్‌ అడోబ్‌ కంపెనీ పేరిట కొనుగోలు చేయడం గమనార్హం. అవంత రియల్టీకి యస్‌ బ్యాంక్‌ రూ 500 కోట్ల రుణం మంజూరు చేసింది. ఇక రుణ మొత్తాన్ని రికవర్‌ చేసేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించని యస్‌ బ్యాంక్‌ బ్లిస్‌ అడోబ్‌కు కేవలం రూ 380 కోట్లకే కట్టబెట్టింది. ఢిల్లీలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన అమృత షెర్గిల్‌ మార్గ్‌లోని ఈ భవంతి విలువ రూ 450 కోట్లు పలుకుతుందని భావిస్తున్నారు.. ఢిల్లీలో రాణా కపూర్‌కు చెందిన మూడు ఆస్తుల విలువ దాదాపు రూ 1000 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆస్తుల విక్రయానికి కపూర్‌ చేసిన ప్రయత్నాలకు ఈడీ చెక్‌ పెట్టింది.

చదవండి : కో–ఆపరేటివ్‌లకూ యస్‌ బ్యాంక్‌ కష్టాలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement