
టాప్ జాబితా నుంచి టాటా గ్రూప్ ఔట్
న్యూయార్క్ : టాటాసన్స్ కొత్త ఛైర్మన్ను ఎన్నుకున్న రోజే టాటా గ్రూప్కు చేదు వార్త తెలిసింది. మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ చోటుకోల్పోయింది. 2016 సంవత్సరానికిగానూ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాను గురువారం విడుదల చేసింది. రెండేళ్లుగా టాప్ 50 జాబితాలో స్థానం సంపాదిస్తూ వచ్చిన టాటా గ్రూప్ 2016 జాబితాలో తన స్థానాన్ని కోల్పోయింది. యాపిల్, గూగుల్, టెస్లా, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు టాప్ 5 స్థానాల్లో చోటు సంపాదించాయి.
గత జాబితాతో పోల్చితే తొలి నాలుగు స్థానాల్లో మార్పులేకపోయినా ఐదో స్థానంలో ఉన్న సామ్సంగ్ను వెనక్కినెట్టి అమెజాన్ ఆస్థానాన్ని కైవసం చేసుకుంది. తాజా జాబితాలో భారత్కు చెందిన ఏ దిగ్గజ సంస్థలకు కూడా చోటు దక్కలేదు. 2015 జాబితాలో టాటా మోటార్స్ 26వ స్థానం దక్కగా, అంతకు ముందు 2014లో టాటా గ్రూప్కు చెందిన టీసీఎస్కు 43వ స్థానం దక్కింది. 2016 టాప్50 మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల జాబితాలో 34 అమెరికా, 10 యూరోప్, 6 ఆసియాకు చెందిన కంపెనీలకు చోటు దక్కింది.
కాగా, మరోవైపు టాటాసన్స్ కొత్త ఛైర్మన్ గా టీసీఎస్ ఎండీ ఎన్ చంద్రశేఖరన్ ఎంపికయ్యారు. గురువారం నిర్వహించిన టాటా సన్స బోర్డ్ సమావేశంలొ ఈ మేరకు నిర్ణయం జరిగింది. దీంతో ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సంస్థ సీఈవో గా రాజేష్ గోపీనాథన్ ను టాటా గ్రూపు నియమించింది. అలాగే ఎన్ జీ సుబ్రమణియం కొత్త సీవోవోగా ఎంపికయ్యారు.