
న్యూఢిల్లీ: త్వరలోనే ఆపరేటర్లతో సమావేశంకానున్నట్లు టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) వెల్లడించింది. వినియోగదారులకు ఇబ్బందికరంగా మారిన అనుచిత వాణిజ్య కాల్స్ (పెస్కీ కాల్స్), మెసేజ్లకు సంబంధించి తాము రూపొందించిన నిబంధనలపై సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) లేవనెత్తిన పలు అభ్యంతరాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు.
నూతన నిబంధనలకు అనుగుణంగా వ్యవస్థల ఏర్పాటు, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వినియోగానికి టెలికం ఆపరేటర్స్ అసోసియేషన్ చెబుతున్న ప్రతికూల అంశాలపై చర్చిండం కోసం వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తమ అధికారును కోరినట్లు వెల్లడించారు. ‘రెగ్యులేటర్లు చెబుతున్న దానికి, ఆపరేటర్లు అర్థం చేసుకుంటున్న వాటికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండి ఉండవచ్చు. నిబంధనల అమలుకు బహుశా కొన్ని సమస్యలు ఉండవచ్చు.
అనుచిత వాణిజ్య కాల్స్, మెసేజ్ల అంశాన్ని తీవ్రమైనదిగానే పరిగణించాలే తప్ప నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఆపరేట్లతో చర్చించి సమస్యలు ఎక్కడ ఉన్నయో చూడాలి. కంపెనీలపై అనవసరపు భారం లేకుండా సమస్యను అధిగమించాల్సి ఉంది.’ అని అన్నారు. ట్రాయ్ నూతన నిబంధనల కారణంగా సుమారు రూ.200–400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, పూర్తి వ్యవస్థ ఏర్పాటుకు కనీసం ఏడాదిన్నర సమయం అవసరమని సీఓఏఐ వివరించిన విషయం తెలిసిందే.