Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Huge Relief For Sakshi Tv In Ap High Court1
ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట

సాక్షి, అమరావతి: అక్రమ కేసులపై కూటమి సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది ఏపీ హైకోర్టులో సాక్షి టీవీకి భారీ ఊరట లభించింది. కేఎస్‌ఆర్‌(కొమ్మినేని శ్రీనివాసరావు) లైవ్‌ షోకు సంబంధించి సాక్షి టీవీపై నమోదైన కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. సాక్షి టీవీపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేనికి సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.పాత్రికేయుల వాక్‌ స్వాతంత్య్ర హక్కును హరించిన టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్‌ షోలో ఓ ప్యానలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్‌ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సాక్షి మీడియాపై కుట్రతోనే..ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సాక్షి మీడియాపై కుట్రతోనే చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా అక్రమ కేసు నమోదు చేసింది. కొమ్మినేని శ్రీనివాసరావు. సాక్షి మీడియా యాజమాన్యంపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ అందుకు నిదర్శనం. అసలు ఉదంతంతో ఏ మాత్రం సంబంధం లేని బీఎన్ఎస్ సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసింది. బీఎన్ఎస్ సెక్షన్లు 79, 196(1), 353(2), 299, 356(2) 61(1) కింద కేసు నమోదు చేయడం. ప్రభుత్వ కుట్రకు తార్కాణం.ఎందుకంటే కుట్రపూరితంగా కుట్ర పూరితంగా వ్యవహరించడం, విద్వేషాలను వ్యాపింప చేయడం తదితర నేరాలకు ఈ సెక‌్షన్లు వర్తిస్తాయి. అంతేగానీ ఓ టీవీ చానళ్లో స్వతంత్ర విశ్లేషకుడు వ్యక్తం చేసిన అభిప్రాయానికి ఆ సెక్షన్లు నమోదు చేయడం విడ్డూరం. అసలు చర్చా గోష్ఠిలో ఎక్కడా కుల ప్రస్తావనే లేకపోయినా, బీఎన్ఎస్ 3(1)(యు) సెక్షను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉండన్నది సుస్పష్టం. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్‌ చేసేస్తారా. నవ్వడమే తప్పయితే, మేం ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటాం. లైవ్‌ షోలో ప్యానలిస్ట్‌ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదు. ఓ జర్నలిస్టుగా లైవ్‌ న్యూస్‌ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులు, ప్రభుత్వంపై ఉంది. అప్పుడే ఆయన వాక్‌ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుంది’’ :::కొమ్మినేనికి బెయిల్‌ సందర్బంలో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు

Chhattisgarh ready for maximum utilization of Godavari tributary waters2
ఇంద్రావతికి కట్టడి!

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉప నది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్‌గఢ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజా రిటీ జలాలను వినియోగించుకునేలా బోద్‌ఘాట్‌ బహుళార్థక సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతినిచ్చిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి ప్రకటించారు. ఇంద్రావతి నీటినే నమ్ముకొని తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రాజెక్టులు చేపడుతుండటం గమనార్హం. కాగా ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ వినియోగించని జలాలనే ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి–కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఎగువ నీళ్లకు ఎగువనే అడ్డుకట్ట.. ఇంద్రావతిలో ప్రతి ఏటా సుమారు 600–800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్‌గఢ్‌లో 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మేడిగడ్డ దిగువన, సమ్మక్క–సారక్క బరాజ్‌ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్‌ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఆయా జిల్లాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన, గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ.. దేవాదుల (38 టీఎంసీలు), సీతారామ (70 టీఎంసీలు), సమ్మక్క–సారక్క (50 టీఎంసీలు మొత్తంగా 158 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టింది. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలావుండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్‌గఢ్‌ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడంతో.. ఈ నీటిని మిగులు జలాలుగా గుర్తించిన కేంద్రం.. నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్‌లో ఛత్తీస్‌గఢ్‌ (అప్పటి మధ్యప్రదేశ్‌)కు గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిలో వాడుకోని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాలను జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి–నాగార్జునసాగర్‌–సోమశిల మీదుగా కావేరి గ్రాండ్‌ ఆనకట్ట వరకు తరలించేలా నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు, వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చేవరకు అనుసంధానం పక్కన పెట్టాలని తెలంగాణ, ఏపీలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్‌గఢ్‌ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలనే గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. ఆవిరి, ప్రవాహ నష్టాలు పోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్‌ సర్కార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపింది. చెప్పినట్టే చేస్తున్న ఛత్తీస్‌గఢ్‌ తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకు పోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్‌గఢ్‌ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం బోద్‌ఘాట్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇందావ్రతి నీటిని ఒడిసిపట్టేలా రూ.29 వేల కోట్లతో బోద్‌ఘాట్‌ ఆనకట్టని, అదనంగా మరో రూ.20 వేల కోట్లతో మహానది–ఇంద్రావతి లింక్‌ను చేపట్టనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మెగావాట్ల విద్యుదుత్పత్తితో పాటు దంతెవాడ, సుక్మా, బీజాపూర్‌ జిల్లాల్లోని 359 గ్రామాల పరిధిలోని 3.78 లక్షల హెక్టార్లకు (9.45 లక్షల ఎకరాలకు) సాగునీటిని అందించాలని నిర్ణయించింది. అదనంగా తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటిని ఇచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం కూడా ప్రశ్నార్థకమే..! ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటి పారుదల నిపుణులు అంటున్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు. కాగా దీనిపై తెలుగు రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Sakshi Editorial On Air India flights3
ఎయిరిండియా రద్దుల పద్దు!

చూడబోతే ఎయిరిండియాకు కష్టాలన్నీ ఒక్కసారే కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. ఈ నెల 12న గుజరాత్‌లో జరిగిన దురదృష్ట ఘటనలో 272 మంది మరణించిన తర్వాత ఎయిరిండియా విమానాలు ఎక్కాలన్నా, ప్రత్యేకించి ప్రమాదం సంభవించిన బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ రకం విమానాల్లో ప్రయాణించాలన్నా చాలామంది భయపడుతున్నారు. అందుకు తగినట్టే ఆ సంస్థ అంతర్జాతీయ, దేశీయ మార్గాల్లో వినియోగించే దాదాపు 90 విమాన సర్వీసుల్ని అంచెలంచెలుగా రద్దుచేస్తూ పోతోంది. శుక్రవారం కూడా ఎనిమిది విమానాలు రద్దయ్యాయి. నిర్వహణాపరమైన, సాంకేతికమైన సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చెబుతోంది. వీటికితోడు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇరాన్‌ గగనతలాన్ని మూసివేయటం వంటివి కూడా విమాన సర్వీసుల రద్దుకు దోహదపడ్డాయి. జూలై రెండో వారం వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులు 15 శాతంమేర తగ్గించనున్నామని ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు కూడా ఏమంత భరోసాతో లేరు. అసలు విమానయానమే వద్దనుకున్నవారు కొందరైతే, బోయింగ్‌ విమానాలు ఎక్కరాదని మరికొందరు నిర్ణయించుకుని ప్రయాణాలు రద్దుచేసుకున్నారు. విమానయాన సంస్థలను నియంత్రించే పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఎయిరిండియా విమానాల్లో భద్రతకు సంబంధించిన ప్రధాన లోపాలేమీ లేవని, కేవలం నిర్వహణాపరమైన సమస్యలే ఉన్నాయని చెబుతోంది. భిన్న విభాగాల మధ్య సమన్వయం అవసరమవుతుందని సలహా ఇచ్చింది. ఎక్కడ ఏ చిన్న లోపాన్ని గమనించినా దాన్ని నమోదు చేయటం, వెనువెంటనే సరిదిద్దటం వంటివి జరగాలని సూచించింది. ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు రేటింగ్‌ ఇచ్చే అంతర్జాతీయ స్వతంత్ర ఆన్‌లైన్‌ సంస్థ పరిశీలనలో ఇండిగో, ఆకాశ సంస్థలు ఏడు అంశాల్లో ఆరు పాయింట్లు సాధించాయి. స్పైస్‌ జెట్‌ ఏడుకు ఏడు పాయింట్లు పొందగా, ఎయిరిండియా కేవలం నాలుగు పాయింట్లే సాధించటం గమనించదగ్గ అంశం. ఇక బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ భద్రతా లోపాలపై ఫిర్యాదు చేసిన ఇంజినీర్‌ జార్జి బార్నెట్‌ అనుమానాస్పద స్థితిలో నిరుడు మార్చిలో మరణించిన ఉదంతం కలవరపరుస్తుంది. ఆ సంస్థ క్వాలిటీ కంట్రోల్‌లో 32 ఏళ్లు పనిచేసిన బార్నెట్‌ రెండ్రోజులు విచారణకు హాజరై మూడో రోజు ఎందుకు తుపాకీతో కాల్చుకుంటాడన్నది ప్రశ్నార్థకమైంది.టాటా ఎయిర్‌లైన్స్‌గా ఉన్న సంస్థను 1953లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయం చేసి, ఎయిరిండియాగా నామకరణం చేశారు. దేశీయ విమాన సర్వీసుల కోసం ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఆవిర్భవించింది. ఈ రెండూ పబ్లిక్‌ రంగ సంస్థలు కావటంతో పౌర విమానయాన రంగంలో అవి దిగ్గజ సంస్థలుగా వెలిగాయి. కానీ దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలై విమానయానంలో ప్రైవేటు సంస్థలు ప్రవేశించటం, తక్కువ ధరకే ప్రయాణికులను చేరేవేసే సంప్రదాయాన్ని ప్రారంభించటంతో అంతక్రితమే నష్టాలతో ఉన్న ఆ సంస్థ మరింతగా కుంగిపోవటం మొదలైంది. అసలు విమానయాన రంగంలో ప్రైవేటును అనుమతించినప్పుడే ఎయిరిండియా నిర్వహణను పూర్తిగా నిపుణులకు వదిలేయాల్సింది. కానీ పగ్గాలు ప్రభుత్వం దగ్గరే ఉండటం, దానికి లోబడి సంస్థ పనిచేయాల్సి రావటంతో ఎన్నో సమస్యలు చుట్టుముట్టాయి. టాటా సన్స్‌ 2022లో ఎయిరిండియాను తీసుకున్నప్పుడు విమానయాన రంగాన్నే సంపూర్ణంగా మారుస్తామని ప్రకటించింది. దశాబ్దాల అసమర్థ ఉద్యోగస్వామ్యాన్ని తొలగించి, గర్వించదగిన గొప్ప సంస్థగా తీర్చిదిద్దుతామని తెలిపింది. మూడేళ్లు గడిచాయి. కానీ చెప్పుకోదగ్గ మార్పుల జాడలేదు. అలాగని ఎయిరిండియా ఏమీ చేయలేదని కాదు. సిబ్బందికి పునఃశిక్షణనిచ్చింది. వారి యూనిఫాంని మార్చింది. యాప్‌ను సరికొత్తగా తీసుకొచ్చింది. అయితే, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలు జరగలేదన్న మాటేగానీ లోపాల పరంపర గురించిన ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇందులో పారిశుద్ధ్యం మొదలుకొని విరిగిపోయిన సీట్లు, నాసిరకం ఉపకరణాలు వగైరాలున్నాయి. అయినా పెద్దగా ఫలితం లేదు. ఇక అస్వస్థతగా ఉండి సెలవు పెట్టినవారిని సైతం ఒత్తిడి తెచ్చి విధినిర్వహణకు పిలిచిన సందర్భాలున్నాయని పైలెట్ల ఫిర్యాదు. ఇవన్నీ విడివిడి ఘటనలుగా కొట్టిపారేయటం కాక వాటివెనక అల్లుకునివున్న నిర్లక్ష్యాన్నీ, అలసత్వాన్నీ సకాలంలో గమనించుకుంటే పరిస్థితి మెరుగుపడేది. నిరుడు ఢిల్లీ–శాన్‌ఫ్రాన్సిస్కో సర్వీస్‌ విమానం ఇంజన్‌ వైఫల్యం కారణంగా రష్యాలో రోజుల తరబడి నిలిచిపోయింది. మరుగుదొడ్లు పనిచేయక చికాగోకు బయల్దేరిన విమానం కాసేపటికే వెనుదిరిగింది. టాటా బ్రాండ్‌కు మార్కెట్‌లో మంచి పేరుంది. వాటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం ఉంది. ఎయిరిండియా దాన్ని అందుకోలేకపోయింది. నిరుడు మే నెలలో ముంబై–లండన్‌ సర్వీసు బోయింగ్‌ 787 విమానంలో తలుపు సరిగా పనిచేయటం లేదంటూ ఫిర్యాదు చేశాక, దాన్ని వెనక్కు తీసుకోవాలని తమపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, నిరాకరించినందుకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, 48 గంటలు దాటకుండా ఉద్యోగం నుంచి తొలగించారని సీనియర్‌ ఫ్లయిట్‌ అటెండెంట్లు ఇద్దరు ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేయటం గమనించదగ్గది. ప్రవర్తన సరిగా లేకపోవటం, విధి నిర్వహణ సక్రమంగా చేయక పోవటం వంటి కారణాలతోనే వారిని తొలగించామని సంస్థ సంజాయిషీ ఇస్తోంది. అంతా సవ్యంగా గడిచినంతకాలం నిర్వాహకులు తమను తాము అభినందించుకుంటూ కాలం గడుపుతారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేసే నియంత్రణ వ్యవస్థ ఉంటే ఇలాంటివి చోటుచేసుకోవు. ఈ విషాద ఘటన నుంచి అయినా గుణపాఠం నేర్చుకోవాలి. అత్యంత జాగరూకతతో మెలగాలి.

Sakshi Guest Column On Iran and Israel Issues4
అణు ఉపద్రవం

‘‘ఇరాన్‌ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్‌) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబార్డ్‌ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్‌ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్‌ ఈ జూన్‌ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్‌లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్‌లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్‌పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్‌ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్‌ అభిప్రాయం ట్రంప్‌ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్‌ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్‌ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్‌ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్‌ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్‌ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్‌లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్‌ఫహాన్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఇజ్రాయెల్‌ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్‌ న్యూక్లియర్‌ కాంప్లెక్స్‌ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్‌ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్‌ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్‌ బ్లాస్ట్‌ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్‌ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్‌ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్‌ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్‌ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్‌పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్‌ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్‌ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్‌ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్‌ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్‌ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్‌–ఇరాక్‌ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్‌పై దాడికి ఇరాక్‌ ఉపక్రమించింది. ఇరాన్‌లోని నగరాలపై ఇరాక్‌ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్‌ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్‌ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్‌లో మాదిరిగానే ఇరాన్‌లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్‌ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్‌ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌లో విశిష్ఠ సభ్యుడు

Iran Deadly Cluster Bomb Attack On Israel5
పోటాపోటీగా దాడులు

టెల్‌ అవీవ్‌/టెహ్రాన్‌/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్‌లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్‌ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్‌ తన వద్ద పోగుబడిన క్లస్టర్‌ బాంబులను ప్రయోగించింది. ఇరాన్‌ క్లస్టర్‌ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్, హైఫా, బీర్‌షెబా, రెహోవోట్‌ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్‌ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్‌ యొనా యాహవ్‌ చెప్పారు. రెహోవోట్‌లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్‌ పట్టణంలో షెల్టర్‌లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్‌ టెహ్రాన్‌లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్‌ మిస్సైల్‌ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇయాల్‌ జమీర్‌ చెప్పారు. ఇరాన్‌ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్‌లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్‌ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్‌లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్‌లో బుషెహర్‌ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్‌ రఫేల్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్‌లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్‌బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్‌ నయీమ్‌ ఖాసిమ్‌ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్‌ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్‌లో హెబ్‌బొల్లా, యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్‌బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్‌బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్‌లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్‌ బాంబులు వేసింది.ఇజ్రాయెల్‌ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్‌లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్‌ సిటీల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్‌తో పోరాడుతున్న ఇజ్రాయెల్‌ కొత్తగా ఇరాన్‌తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్‌ అవీవ్‌లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్‌లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్‌ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను పునరుద్ధరించారు. ఇరాన్‌లోని బ్యాంక్‌ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్‌ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్‌కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్‌ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్‌ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్‌వేర్‌లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్‌ నేతలుస్విట్జర్లాండ్‌లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్‌ యూనియన్‌ విదేశీవిధానాల చీఫ్‌తో ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

నరేంద్ర మోదీ-ట్రంప్‌(ఫైల్‌ఫోటో)6
అందుకే డొనాల్డ్‌ ట్రంప్‌ డిన్నర్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా: ప్రధాని మోదీ

భువనేశ్వర్‌: తనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిన్నర్‌కు ఆహ్వానించినా అందుకు వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించి, ధన్యవాదాలు తెలిపానన్నారు. తనకు ఒడిశాలో ప్యూరీ జగన్నాథ్‌ పుణ్యభూమికి వెళ్లడం ముఖ్యమని ట్రంప్‌కు చెప్పినట్లు మోదీ తెలిపారు. ఈ రోజు(శుక్రవారం, జూన్‌ 20) ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. సుమారు 18 వేల కోట్ల విలువైన 100కు పైగా ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. దీనిలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మోదీ మాట్లాడారు. ‘నాకు ట్రంప్‌ నుంచి డిన్నర్‌ ఆహ్వానం అందింది. నేను జీ-7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు నన్ను వాషింగ్టన్‌కు రమ్మని ట్రంప్‌ ఆహ్వానించారు. అయితే మహాప్రభు జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లే అవసరం ఉండటంతో నేను ట్రంప్‌ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాను. రెండు రోజుల క్రితం కెనడా పర్యటనలో ఉన్నపపుడు వాషింగ్టన్‌ మీదుగా రమ్మని ట్రంప్‌ అన్నారు. కలిసి డిన్నర్‌ చేసి మాట్లాడుకుందాం అన్నారు. కానీ అంతకంటే ఎక్కువగా ఒడిశా జగన్నాథుని పుణ్యభూమికి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పా’ అని మోదీ తెలిపారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంలో తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలోనే అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారాయన.#WATCH | Bhubaneswar, Odisha: "Just two days ago, I was in Canada for the G7 summit and the US President Trump called me. He said, since you have come to Canada, go via Washington, we will have dinner together and talk. He extended the invitation with great insistence. I told the… pic.twitter.com/MdLsiYnNCQ— ANI (@ANI) June 20, 2025 ఏడాది విజయవంతంగా పూర్తయ్యిందిఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుందని కొనియాడారు. ఇది తమకు చాలా ప్రత్యేకమైన రోజన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడం ఒక్కటే కాదు.. మంచి పరిపాలన అందించినందుకు కూడా తొలి వార్షికోత్సవమన్నారు. ఏడాది కాలంలోనే బీజేపీ ప్రజల నమ్మకాన్ని చూరగొందని మోదీ పేర్కొన్నారు.

Shubman Gill hits century on Test captaincy debut7
వారెవ్వా గిల్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే అద్బుత సెంచరీ

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ త‌న కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మైన తొలి టెస్టులో గిల్ సెంచ‌రీతో మెరిశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్‌.. విరాట్ కోహ్లిని తలపించాడు. తొలుత దూకుడుగా ఆడిన శుబ్‌మన్‌, జైశ్వాల్ ఔటయ్యాక ఆచిచూచి తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 140 బంతుల్లో గిల్ తన ఆరో టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 14 ఫోర్లు ఒక సిక్సర్‌ ఉన్నాయి. అతడి ​కంటే ముందు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్బుత సెంచరీతో చెలరేగాడు. 159 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 16 ఫోర్లు, 1 సిక్సర్‌తో 101 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్సీ డెబ్యూలో సెంచరీతో చెలరేగిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లఖించుకున్నాడు.భారత టెస్టు కెప్టెన్‌గా అరంగేట్ర ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన నాలుగో ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. ఈ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం విజయ్ హజారే అగ్రస్ధానంలో ఉన్నారు. 1951లో కెప్టెన్‌గా తన అరంగేట్ర ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పైనే సెంచరీ చేశారు.భారత టెస్ట్ కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..164* విజయ్ హజారే వర్సెస్‌ ఇంగ్లండ్‌, ఢిల్లీ 1951116 సునీల్ గవాస్కర్ vs న్యూజిలాండ్‌ ఆక్లాండ్ 1976115 విరాట్ కోహ్లీ vs ఆస్ట్రేలియన్ అడిలైడ్ 2014102*శుబ్‌మన్ గిల్ vs ఇంగ్లాండ్ హెడింగ్లీ 2025భారీ స్కోర్‌ దిశగా భారత్‌..తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా దూసుకుపోతుంది. 78 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 మూడు వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్‌ పంత్‌(46), గిల్‌(112) ఉన్నారు.

Burqa, 1000 km escape, no food stops: Latest updates on the Sonam Raghuvanshi honeymoon incident8
సోనమ్‌ మేఘాలయా హనీమూన్‌ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌..

షిల్లాంగ్‌: సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్‌ హత్యకేసు మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసే కొద్దీ ప్రతి సంఘటన ఒక్కో క్లైమాక్స్‌ను తలపిస్తోంది.తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. పెళ్లైన పదకొండు రోజులకే సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీకి ఇష్టం లేకపోయినా హనీమూన్‌ పేరిట మేఘాలయాకు తీసుకెళ్లి, ముందస్తు ప్లాన్‌ ప్రకారం.. సుపారీ కిల్లర్ల సాయంతో హత్య చేయించిన విషయం తెలిసిందే. హత్య అనంతరం, మేఘాలయా నుంచి తన పుట్టినిల్లు ఉత్తరప్రదేశ్‌ వచ్చేందుకు సోనమ్‌ రఘువంశీ బురఖా ధరించి సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ప్రయాణం సమయంలో కనీసం ఎక్కడా తినకుండా నిర్విరామంగా ప్రయాణించినట్లు పోలీసుల విచారణలో ఆమెను బోర్డర్‌ దాటించిన వెహికల్‌ డ్రైవర్‌ చెప్పాడు.రాజా రఘువంశీ కేసును మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఇండోర్‌లో సోనమ్‌ రఘువంశీని ఉత్తర్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చిన కారు డ్రైవర్లు మోహిత్‌,పియూష్‌లను అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్‌ ఏజెన్సీలో పనిచేసిన మోహిత్‌ను పోలీసులు విచారించారు.సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహా ‘జూన్‌ 8 మేఘాలయా నుంచి ఉత్తర ప్రదేశ్‌కు చేర్చేందుకు తీసుకెళ్లేందుకు ఎర్టిగో మాట్లాడుకున్నారు. రాజ్ సూచన మేరకు మోహిత్, పియూష్‌ ఆమెను తీసుకెళ్లారు. ప్రయాణం నిమిత్తం నన్ను(మోహిత్‌),పియూష్‌ని పనిలోకి తీసుకున్నారు. అప్పటికే మేఘాలయ సోహ్రాలోని ఓ లోయలో కుళ్ళిన రాజా రఘువంశీ రాజ్ మృతదేహాం లభ్యమై ఏడు రోజులవుతుంది.ఇక ఎర్టిగోలో మా ప్రయాణం ప్రారంభమైంది. సోనం బుర్ఖాలో మారువేషంలో ఉంది. మేం ఏదైనా తినాలని రోడ్డు పక్కన కారు ఆపినా అందుకు ఒప్పుకోలేదు. ఇలా మేఘాలయ నుండి వారణాసికి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణం జరిగింది. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు సోనంను ప్రశ్నిస్తున్నారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకే ఇన్ని వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించిందా? తాజా పరిణామంతో రాజా రఘువంశీ హత్యలో కూడా ఆమె ప్రమేయం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

NHRC serious on the Kuppam Incident: Woman Tied to Tree9
Kuppam: మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

సాక్షి,గుంటూరు: చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై ఎన్.హెచ్.ఆర్.సీ. సీరియస్ అయ్యింది. సుమోటోగా కేసు విచారణకు తీసుకుంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్,డీజీపీని ఆదేశించించింది.తన భర్త చేసిన అప్పులు తీర్చలేదని నారాయణపురంలో మహిళను టీడీపీ కార్యకర్త, కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటనను సాక్షిటీవీ వెలుగులోకి తెచ్చింది. నేషనల్ మీడియా సైతం వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. A video from #Kuppam surfaced where a woman was tied to tree after her husband failed to repay loan of 80,000. Police had registered a case & accused taken in custody.#AndhraPradesh CM @ncbn orders strict action against those who attacked the woman. pic.twitter.com/D3nID4char— Aneri Shah Yakkati (@tweet_aneri) June 17, 2025‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను’‘అప్పు తీర్చేందుకు తాళిబొట్టు కూడా అమ్ముకున్నాను. చివరకు వికలాంగురాలైన నా కుమార్తెకు వచ్చే రూ.6 వేల పింఛన్‌ సైతం వాళ్లే లాక్కుంటున్నారు. అయినా వాళ్ల ధనదాహం తీరలేదు. చివరకు నన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి బాకీ తీర్చాలంటూ దాడి చేశారు’ అని చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాధితురాలు శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప, అతడి కుటుంబ సభ్యులు... శిరీష అనే మహిళను భర్త చేసిన అప్పులు తీర్చాలంటూ చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన ఘటన విదితమే. మేం బాగా బతికినోళ్లమే‘నా భర్త పేరు తిమ్మరాయప్ప. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేం బాగా బతికినోళ్లమే. మాకు జేసీబీ కూడా ఉండేది. తమ్ముడు చేసిన అప్పులు తీర్చేందుకు నా భర్త రూ.16 లక్షలు అప్పులు చేశాడు. జేసీబీని అమ్మేసి కొంతవరకు అప్పులు తీర్చాం. మిగిలిన అప్పులు తీర్చేందుకు నారాయణపు­రానికి చెందిన మునికన్నప్ప కుటుంబం వద్ద రెండేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసు­కున్నాం. వారికి ప్రతినెలా నూటికి రూ.5 నుంచి రూ.30 వరకు వడ్డీలు చెల్లించాం. వడ్డీలు అయితే కట్టాం కానీ అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది.’ అని తెలియజేసింది.నా భర్తను కూడా చెట్టుకు కట్టేసి కొట్టడంతోనే వెళ్లిపోయాడు‘అసలు మొత్తం చెల్లించాలని 6 నెలల క్రితం నా భర్త తిమ్మరాయప్పను చెట్టుకు కట్టేసి గ్రామస్తుల మధ్య తీవ్రంగా అవమానించారు. దీన్ని తట్టుకో­లేక నా భర్త గ్రామం నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి వికలాంగురాలైన నా పెద్ద కుమార్తె, కుమారుడు, మరో కుమార్తెను మా అమ్మ వద్ద వదిలి నేను బెంగళూరు వెళ్లాను. అక్కడ కూలీ పనులు చేసి కొద్దికొద్దిగా అప్పు తీరుస్తున్నాను. వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో నా తాళిబొట్టును కూడా అమ్మి అప్పు కట్టాను. అయినా వారి ధనదాహం తీరలేదు.వికలాంగ పెన్షన్‌ను కాజేశారుమా పెద్ద కుమార్తెకు నెలనెలా వచ్చే వికలాంగ పెన్షన్‌ రూ.6 వేలను కూడా మూడు నెలల నుంచి మునికన్నప్ప కుటుంబమే తీసుకుంటోంది. దీంతో నా పిల్లలు తినేందుకు తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని కూడా నా వెంట తీసుకెళ్లేందుకు బెంగళూరు నుంచి తిరిగొచ్చాను. స్కూలు నుంచి టీసీలు తీసుకుని పిల్లల్ని వెంటబెట్టుకుని వస్తుంటే మునికన్నప్ప కుటుంబ సభ్యులు నన్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. బట్టలు చించేందుకు ప్రయత్నించారు. నా కొడుకు పక్కనే ఏడుస్తున్నా వాళ్లు కనికరించలేదు. పోలీసులు రాకపోతే నా గతి ఏమయ్యేదో’ అంటూ శిరీష బోరున విలపించారు.

Elon Musk plans to launch X branded credit and debit cards10
ఫైనాన్షియల్‌ సెక్టార్‌పై మస్క్‌ కన్ను

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్‌ సెక్టార్‌పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట​్‌ఫామ్‌ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్‌ యూజర్లు ప్లాట్‌ఫామ్‌ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్‌మెంట్‌.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్‌ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్‌లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒ‍ప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్‌లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్‌లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్‌లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement