
విద్యార్థులకు ‘పరీక్ష’
– లేపాక్షిలో కళాశాల..చిలమత్తూరులో పరీక్షలు
– అన్ని వసతులు ఉన్నా...పరీక్ష కేంద్రానికి నోచుకోని వైనం
అనంతపురం ఎడ్యుకేషన్ : లేపాక్షి జూనియర్ కళాశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు వచ్చాయంటే.. వారికి ‘పరీక్షే. లేపాక్షిలో కళాశాల ఉంది. కళాశాల సెంటర్కు నోచుకోకపోవడంతో 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షలొచ్చాయంటే వారికి నిజమైన అవస్థలే.
ఇంటర్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 1 నుంచి 16 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు 66 కేంద్రాలు, థియరీ పరీక్షలకు 99 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వసతులు ఉన్న ప్రతి ప్రభుత్వ కళాశాల పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ‘అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా తయారైంది లేపాక్షి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి. కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 90 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 121 మంది చదువుతున్నారు. తరగతి గదులు, ల్యాబ్ గదులతో పాటు పరీక్షలు నిర్వహించేందుకు అన్ని వసతులూ ఉన్నా...ఇక్కడ పరీక్ష కేంద్రానికి అనుమతి రాలేదు.
15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే.. :
విద్యార్థులు సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఈ కళాశాల 2001లో ప్రారంభమైంది. అయితే శాశ్వత భవనాలు లేక విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఈ పరిస్థితుల్లో ఆర్డీటీ సహకారం అందించి రూ.కోటి నిధులు మంజూరు చేసింది. 2013–14లో ఒక బ్లాక్లో నాలుగు తరగతి గదులు, మరోబ్లాక్లో రెండు తరగతి గదులతో పాటుతో పాటు స్టాఫ్, ప్రిన్సిపల్, లైబ్రెరీలకు ఒక్కో గది చొప్పున.. ల్యాబ్కు రెండు గదులు నిర్మించారు. మరిన్ని గదులు నిర్మాణంలో ఉండడంతో ఆ విద్యా సంవత్సరం ఇక్కడ పరీక్ష కేంద్రాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని వసతులూ ఉన్నా ఏటా ఇక్కడ కేంద్రాన్ని రద్దు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈసారి కూడా సెంటర్కు నోచుకోలేదు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చిలమత్తూరుకు వెళ్లి పరీక్షలు రాయాలంటే ఇబ్బందేనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.విశేషమేమంటే కళాశాల ప్రిన్సిపల్ వెంకటరమణ ప్రస్తుతం కళాశాల విద్య రీజినల్ జాయింట్ డైరెక్టర్ (కడప)గా ఎఫ్ఏసీగా పని చేస్తున్నారు. కానీ సెంటర్ మంజూరుకు నోచుకోలేదు.
ఆర్ఐఓ వెంకటేశులు ఏమంటున్నారంటే...
వసతులు లేమి కారణంగా నాలుగేళ్లుగా లేపాక్షిలో సెంటర్కు అమనుతి లేదు. ఆర్డీటీ సహకారంతో నూతనంగా గదులు నిర్మాణాలు జరిగినా...గతేడాది మధ్యలో మాకు అప్పగించారు. ఈసారి పరీక్ష కేంద్రంగా ఇవ్వలేకపోయాం. వచ్చే ఏడాది నుంచి పరీ„ýక్ష కేంద్రంగా అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం.