తూతూమంత్రంగా ఎంపీ పుష్కర సమీక్ష
విజయవాడ సెంట్రల్ :
పుష్కరాల నిర్వహణపై ఉదయం 11 గంటలకు ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహిస్తారని సమాచారం. పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు చెప్పిన సమయానికి హాజరయ్యారు.12.30 గంటలకు తీరుబడి వచ్చిన ఎంపీ సమావేశాన్ని ప్రారంభించారు. రూ. 1,800 కోట్ల ఖర్చుతో కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఎంపీ కేశినేని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు, చుట్టాలకు అదిరిపోయేలా అతిథ్యం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబును చూసే అభివృద్ధి నేర్చుకున్నారంటూ స్వోత్కర్ష ప్రారంభించారు. డివిజన్ల వారీగా ఎదురవుతున్న పారిశుధ్య సమస్యల్ని చెప్పాలని సభ్యుల్ని కోరారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అదనపు సిబ్బంది కార్పొరేటర్ల మాట వినకపోవడం వల్ల చెత్త సమస్య మొదలైందన్నారు. టీడీపీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, కాకు మల్లిఖార్జున యాదవ్ ప్రసంగించారు. పనిచేయని కార్మికుల్ని వెనక్కు పంపేస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్లు, సిబ్బంది 1,100 మందిని డిప్యుటేషన్పై తీసుకుంటున్నట్లు తెలిపారు.
నిజాలు మాట్లాడితే.. గద్దించిన మేయర్
సీపీఎం ఫ్లోర్లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ 37వ డివిజన్లో మంచినీరు కలుషితం అవుతోందన్నారు. దీన్ని తాగడం వల్ల అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పుష్కరాలకు వచ్చే చుట్టాలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేమన్నారు. చెప్పింది చాల్లే ఇక కూర్చోండి అంటూ మేయర్ ఆమెను గద్దించారు.
అప్పుడే కొట్టుకుపోయిన రోడ్లు
వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్ చందన సురేష్ సమస్యల గురించి ప్రస్తావించేందుకు సమాయత్తం కాగా, తనకు వేరే అత్యవసర సమావేశం ఉందంటూ ఎంపీ అర్ధాంతరంగా సభ నుంచి Ðð ళ్లిపోయారు. ఎంపీ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మేయర్, కమిషనర్ను కదలనివ్వలేదు. తాము చెప్పే సమస్యల్ని వినే ఓపిక లేనప్పుడు సమావేశానికి ఎందుకు పిలిచారని పుణ్యశీల ప్రశ్నించారు. కార్పొరేటర్లు షేక్బీజాన్బీ, అవుతు శ్రీశైలజ, బి.సంధ్యారాణి, చందనసురేష్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కబేళా వద్ద పెట్రోల్బంకు రోడ్డు వేసిన ఆరు నెలలకే కొట్టుకుపోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు.