Sanitation
-
పల్లెల్లో పడకేసిన పాలన
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ పాలక మండళ్ల పదవీకాలం ముగియడంతో గతేడాది ఫిబ్రవరి నుంచి అంటే దాదాపు 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. వారికి ఇతర బాధ్యతలు ఉండటంతో పంచాయతీలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. పైగా కేంద్ర, రాష్ట్రాల నిధులు ఆగిపోయాయి. దీనితో మెజారిటీ పల్లెల్లో పాలన పడకేసింది. మొత్తం 12,754 గ్రామ పంచాయతీల్లో 30శాతం వరకు జనాభాపరంగా పెద్ద పంచాయతీలు. వాటిలో పన్నుల వసూలు, ఇతర రూపాల్లో కొంత ఆదాయ వనరులు ఉండటంతో.. నెలవారీ ఖర్చులు కొంతవరకు వెళ్లదీసుకోగలిగే స్థితిలో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ వంటివి చేపట్టగలుగుతున్నాయి. మిగతా 70శాతం పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఆదాయం సరిపోక పంచాయతీ సెక్రెటరీలు, ఇతర అధికారులు అప్పోసప్పో చేసి బండి లాగాల్సి వస్తోంది. అదీ రోజువా రీ నిర్వహణ కోసమే ఇబ్బంది ఎదురవుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా కుంటుపడ్డాయి. అప్పులు చేసి నడిపించిన సర్పంచులు.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చెత్త సేకరణ, ఇతర అవసరాల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలనే నిబంధన అమలుచేశారు. దానితో బ్యాంకు రుణాలతో ట్రాక్టర్లు కొన్నారు. ఇప్పుడు వాటి వాయిదాలు చెల్లించలేక, డీజిల్, డ్రైవర్ జీతం, ఇతర నిర్వహణ ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది ఎదురవుతోంది. సర్పంచులు ఉన్నప్పుడు తమ సొంత నిధులు ఉపయోగించి, తమ పరప తితో అప్పులు తీసుకుని వచ్చి పారిశుధ్యం, ఇతర పనులు నిర్వహించారు. 15వ ఆర్థిక సంఘం నుంచి క్రమం తప్పకుండా నిధులు అందేవి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచి్చనా, రాకపోయినా గ్రామాల్లో నెలవారీ ఖర్చులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేవి. పంచాయతీ పాలకవర్గాల గడువు ముగిశాక ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సుమారు రూ.1,600 కోట్లు ఆగిపోయాయి. దీనితో సొంత ఆదాయ వనరులు లేని గ్రామాల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులూ అందక.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి కొన్ని నెలలతోపాటు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని నెలలుగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు సరిగా విడుదల కావడం లేదు. పంచాయతీలకు ప్రతినెలా కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల చేస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రతినెలా కేంద్రం ఇచ్చే రూ.220 కోట్లకు మ్యాచింగ్గా రూ.220 కోట్లను కొన్నినెలల పాటు ఇచి్చంది. క్రమంగా రాష్ట్ర సర్కారు ఇచ్చే మొత్తం రూ.150 కోట్లకు తగ్గించింది. ఆ తర్వాత మొత్తంగా నిలిచిపోయింది. పంచాయతీలకు ఇవ్వాల్సిన మొత్తం సుమారు రూ.వెయ్యి కోట్లకుపైనే ఉంటుందని అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ సందర్భాల్లో గ్రామ పంచాయతీలకు రూ.700 కోట్ల దాకా విడుదల అధికారవర్గాలు చెబుతున్నాయి. దీనితోపాటు పంచాయతీ సిబ్బంది వేతనాలను గ్రీన్చానెల్లో చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. దీంతో పంచాయతీలపై కొంతమేర అయినా ఆర్థిక భారం తగ్గొచ్చునని భావిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శుల పాట్లు గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం, ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉంటుండటంతో.. పూర్తి బాధ్యత గ్రామపంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. దాదాపు 14 నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులేమీ రాకపోవడంతో.. పంచాయతీ పరిధిలో సమకూరే అరకొర ఆదాయంతోనే నెట్టుకొస్తున్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ సిబ్బందికి జీతాలు, గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ, మొక్కలకు నీళ్లు పోయడం, తాగునీటి పైపులైన్ల లీకేజీ మరమ్మతులకు, మోటార్లు పాడైతే మరమ్మతులు చేయించడం, ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటి పనులు చేయించడానికి కూడా ఇబ్బంది ఎదురవుతున్న పరిస్థితి. గ్రామాల్లోని వీధుల్లో చెత్తాచెదారాన్ని తీసుకెళ్లి ఊరవతల ఇష్టమొచి్చనట్టుగా పడేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అప్పులు తెచ్చి నడిపిస్తున్నా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా కూడా అందక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. రోజువారీ నిర్వహణ కోసం కూడా ఇబ్బంది ఎదురవుతుండటంతో పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి నడిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిల ఆధ్వర్యంలో సమ్మర్ యాక్షన్ ప్లాన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పులు తెచ్చి గ్రామాలను నడుపుతున్నామని, పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కార్యదర్శులు కోరగా.. పరిశీలిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు జరగడం లేదు ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామంలో అభివృద్ధి పనులు జరగడం లేదు. సర్పంచులు ఉన్నప్పుడే పనులు ఎంతో కొంత జరిగేవి. ఇప్పుడు ఎక్కడి చెత్త అక్కడే కనిపిస్తోంది. రహదారులు అస్తవ్యస్తంగా మారాయి. అధికారులను అడిగితే నిధులు లేవని చెబుతున్నారు. – పాలకూరి దుర్గేష్, రెగట్టే గ్రామస్తుడు, కనగల్ మండలం, నల్లగొండ జిల్లా రూ.7లక్షలు అప్పు తెచ్చి పెట్టిన.. ప్రస్తుతం గ్రామాల్లో పాలకవర్గాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు. ఏడాదిన్నరగా ప్రజల సమస్యలను తీర్చేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటివరకు ఏడు లక్షల రూపాయలు అప్పుగా తెచ్చి వివిధ పనులకు ఖర్చు చేశాను. – సోమయ్య, అనంతారం గ్రామ కార్యదర్శి జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారిపల్లి గ్రామంలో 1,500 జనాభా ఉన్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి పంచాయతీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. తాగునీటి మోటార్ల మరమ్మతులు, బ్లీచింగ్ కొనుగోలు, వీధి దీపాల నిర్వహణ, చెత్త తరలింపు, ట్రాక్టర్ కిస్తీ, డీజిల్ ఖర్చులకు కూడా ఇబ్బంది ఎదురవుతోంది. ఇప్పటివరకు లక్షకుపైగా అప్పులు తెచి్చ, రోజువారీ నిర్వహణను నెట్టుకొస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి చెబుతున్నారు. వీధి లైట్లు వెలగక.. ఇబ్బందిగా.. హనుమకొండ జిల్లా కమలాపూర్ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి ఎస్సీ హాస్టల్ మీదుగా కాసీంపల్లికి వెళ్లే మార్గంలో సుమారు 20 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. లైట్లు పెట్టించాలని పంచాయతీ అధికారులకు చెబితే.. నిధుల కొరతతో ఇబ్బంది ఉందంటూ జాప్యం చేస్తున్నారు. చీకటి పడిందంటే చాలు ఆ మార్గంలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోందని స్థానికుడు శనిగరపు రంజిత్ పేర్కొన్నారు. రోడ్ల నిండా మురుగు పారుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా వలిగొండ మండల కేంద్రంలో పారిశుధ్యం దుస్థితి ఇది. అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిండిపోయి, మోరీల పైపులు పగిలిపోయి రోడ్లపైన మురుగు పారుతోందని ప్రజలు ఫిర్యాదు చేసినా.. నిధులు లేక ఏమీ చేయలేకపోతున్నామంటూ పంచాయతీ అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి ఉంది. గ్రామంలో సుమారు 50 వీధి దీపాలు పని చేయడం లేదని, రాత్రయితే వీధులన్నీ చీకటేనని స్థానికులు చెబుతున్నారు. ‘‘సర్పంచులు పోయినప్పటి నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపై మురుగు పారుతున్నా, వీధి దీపాలు వెలగకున్నా.. నిధులు వచ్చాక పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు ఇచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలి’’ అని గ్రామానికి చెందిన నానచర్ల రమేష్ డిమాండ్ చేస్తున్నారు. ఊరంతా కంపు కొడుతోంది మేజర్ గ్రామపంచాయతీ అయిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయింది. మురుగు కాల్వలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పాలక వర్గాలు లేక, నిధులు లేక అధికారులు పనులేవీ చేయించడం లేదు. ఇక నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లి గ్రామంలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. డ్రైనేజీలకు మరమ్మతులు చేయించలేని దుస్థితి నెలకొంది. గ్రామస్తులు ఇదేమిటని నిలదీస్తే.. రోజువారీ నిర్వహణ కోసమే అప్పులు చేయాల్సి వస్తోందని గ్రామ కార్యదర్శి తలపట్టుకుంటున్నారు. పంచాయతీ కోసం నియమించిన స్పెషలాఫీసర్ ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త చెదారం నిండి, డ్రెయినేజీలు పూడుకుపోయి గ్రామంతా కంపు కొడుతోందని వాపోతున్నారు. నాలుగైదు లక్షల చొప్పున అప్పులు తెచ్చి పెట్టాం ‘‘గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో ఒక్కో పంచాయతీ నిర్వహణ కోసం ఇప్పటివరకు రూ. నాలుగైదు లక్షలు అప్పులు తెచ్చి పెట్టాం. ట్రాక్టర్ డీజిల్, తాగునీటి ఎద్దడి నివారణకు మోటార్లు, పైపులైన్ల రిపేర్లకు అప్పులు తెచ్చి పెడుతున్నాం. నిధులు లేక సక్రమంగా నిర్వహణ చేయలేకపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా గ్రాంటు విడుదల చేసి సమస్యను పరిష్కరించాలి. – బానోత్ రమేశ్నాయక్, పంచాయతీ కార్యదర్శుల సంఘం గార్ల మండల అధ్యక్షుడు, మహబూబాబాద్ జిల్లా -
ఈ బాధలు ఎప్పటికీ తీరేను.. పాలకులు పట్టించుకోరా?
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 2013 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ టాయిలెట్ దినోత్సవం’ జరుపుకుంటున్నా నేటికీ ప్రపంచంలో 350 కోట్ల ప్రజలకు టాయిలెట్ (మరుగుదొడ్డి) సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. టాయిలెట్ సౌకర్యలేమి కారణంగా ముఖ్యంగా మహిళలు, పిల్లలు, బాలికలు... తీవ్రమైన మానసిక, ఆరోగ్య, సామాజిక సమస్యలకు గురవుతున్నారు. అనేక పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర పని ప్రదేశాల్లో సరైన టాయిలెట్ సదుపాయాలు, మంచినీటి సౌకర్యం వంటివి లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.ప్రపంచవ్యాప్తంగా 41.9 కోట్లమంది బహిరంగ మలవిసర్జన చేస్తున్నారనీ, సుమారు 220 కోట్లమంది ప్రజలకు మంచినీటి సౌకర్యం లేదనీ, 11.5 కోట్లమంది కుంటలూ, చెరువులు, బావులు వంటి వాటిలోని సురక్షితం కాని నీరు తాగుతున్నారనీ గణాంకాలు చెబుతున్నాయి. సరైన మంచినీరు, శానిటేషన్, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడంతో ప్రతిరోజూ వెయ్యి మంది ఐదేళ్ల లోపు పిల్లలు మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇక మన భారతదేశంలో 2019–21లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం 69.3 శాతం మంది మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నేటికీ 19.4 శాతం మంది మనదేశంలో బహిరంగ మలవిసర్జన చేస్తున్నారు. 2014 అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్ మిషన్‘ ప్రారంభించినా నేటికీ అందరికీ టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి రాలేదు.చదవండి: మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!మనదేశం త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి ‘వికసిత్ భారత్’గా ఆవిర్భవించాలనే లక్ష్యాలను నిర్దేశించుకుంది. కనీసం ప్రజలందరికీ టాయిలెట్ సౌకర్యం కల్పించకుండా ఇది సాధ్యంకాదు. అందుకే ప్రభుత్వాలు ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి.– ఐ. ప్రసాదరావు; ఉపాధ్యాయుడు, కాకినాడ (నవంబర్ 19న ప్రపంచ టాయిలెట్ దినోత్సవం) -
ఆమ్రపాలి.. ఆన్ డ్యూటీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు. నారాయణగూడ క్రాస్రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించడం తెలిసిందే. సమావేశానికి సిద్ధం కండి ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. -
Fathers Day 2024: తండ్రి కళ్లలో కోటి వెలుగులు తెచ్చింది
ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో గ్రాడ్యుయేట్ అయిన మాన్సీ జైన్కు రాజేష్ జైన్ తండ్రి మాత్రమే కాదు ఆప్త మిత్రుడు. దారి చూపే గురువు. తన తండ్రితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘డిజిటల్ పానీ’ అనే స్టార్టప్ను మొదలుపెట్టింది. పరిశ్రమలు, నివాస ్రపాంతాలలో మురుగు జలాలను తక్కువ ఖర్చుతో శుద్ధి చేయడానికి ఉపకరించే కంపెనీ ఇది. తండ్రి మార్గదర్శకత్వంలో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించిన మాన్సీ జైన్ గురించి...స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో పట్టా పుచ్చుకున్న తరువాత ఇండియాకు తిరిగి వచ్చిన మాన్సీ జైన్లో స్టార్టప్ కలలు మొదలయ్యాయి. తన ఆలోచనలను తండ్రి రాజేష్తో పంచుకుంది.‘నువ్వు సాధించగలవు. అందులో సందేహమే లేదు’ కొండంత ధైర్యం ఇచ్చాడు తండ్రి.మాన్సీ తండ్రి రాజేష్ జైన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దిల్లీలో కెమికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాడు. వాటర్ అండ్ ఎనర్జీ ఇండస్ట్రీలో ఇంజినీర్గా పాతిక సంవత్సరాలు పనిచేశాడు.వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ విషయంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. తండ్రి నుంచి చందమామ కథలు విన్నదో లేదు తెలియదుగానీ నీటికి సంబం«ధించిన ఎన్నో విలువైన విషయాలను కథలు కథలుగా విన్నది మాన్సీ. పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదవడానికి తాను విన్న విషయాలు కారణం అయ్యాయి.‘మన దేశంలో తొంభైవేల మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. 95 శాతం పని మాన్యువల్గానే జరుగుతోంది. ప్రతి ప్లాంట్లో ఆపరేటర్లను నియమించారు. లోపాలను ఆలస్యంగా గుర్తించడం ఒక కోణం అయితే చాలామంది ఆపరేటర్లకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేకపోవడం మరో అంశం. ఈ నేపథ్యంలోనే సరిౖయెన పరిష్కార మార్గాల గురించి ఆలోచన మొదలైంది’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది మాన్సీ.మురుగునీటి శుద్ధి ప్లాంట్లలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల గురించి తండ్రితో ఎన్నో రోజుల పాటు చర్చించింది మాన్సీ. ఆ మేథోమధనంలో నుంచి పుట్టిందే... ‘డిజిటల్ పానీ’ స్టార్టప్.నివాస ్రపాంతాలు, పరిశ్రమలలో నీటి వృథాను ఆరికట్టేలా, తక్కువ ఖర్చుతో మురుగునీటిని శుద్ధి చేసేలా ‘డిజిటల్ పానీ’కి రూపకల్పన చేశారు.ఎక్విప్మెంట్ ఆటోమేషన్, వాట్సాప్ అప్డేట్స్, 24/7 మేనేజ్మెంట్.., మొదలైన వాటితో వాటర్ మేనేజ్మెంట్ ΄్లాట్ఫామ్గా ‘డిజిటల్ పానీ’ మంచి గుర్తింపు తెచ్చుకుంది.‘నీటి మౌలిక సదుపాయాలకు సంబంధించి మా ΄్లాట్ఫామ్ని వైద్యుడిగా భావించాలి. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి దాని నివారణకు తగిన మందును ఇస్తుంది. సాంకేతిక నిపుణులకు దిశానిర్దేశం చేస్తుంది. ఎన్నో రకాలుగా క్లయింట్స్ డబ్బు ఆదా చేయగలుగుతుంది’ అంటుంది మాన్సీ.టాటా పవర్, దిల్లీ జల్ బోర్డ్, లీలా హాస్పిటల్స్తో సహా 40 పెద్ద పరిశ్రమలు ‘డిజిటల్ పానీ’ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ‘డిజిటల్ పానీ’ ప్రస్తుతం పద్నాలుగు రాష్ట్రాలలో పనిచేస్తోంది. ‘ఎకో రివర్’ క్యాపిటల్లాంటి గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీకి అవసరమైన నిధులను సేకరించారు.‘వాళ్ల సమర్ధమైన పనితీరుకు ఈ ΄్లాట్ఫామ్ అద్దం పడుతుంది’ అంటున్నారు ‘డిజిటల్ పానీ’లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయం తీసుకున్న ‘ఏంజియా వెంచర్స్’కు చెందిన కరుణ జైన్, శివమ్ జిందాల్.‘డిజిటల్ పానీ’కి ముందు కాలంలో... ఎన్నో స్టార్టప్ల అపురూప విజయాల గురించి ఆసక్తిగా చర్చించుకునేవారు తండ్రీ, కూతుళ్లు. ఆ స్టార్టప్ల విజయాల గురించి లోతుగా విశ్లేషించేవారు. ఈ విశ్లేషణ ఊరకే పోలేదు. తమ స్టార్టప్ ఘన విజయం సాధించడానికి అవసరమైన పునాదిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం అయింది.‘షార్క్ ట్యాంక్ ఇండియా’ టీవీ పోగ్రామ్లో తండ్రి రాజేష్తో కలిసి పాల్గొంది మాన్సీ. తాగునీటి సమస్య, నీటి కాలుష్యం... మొదలైన వాటి గురించి సాధికారికంగా మాట్లాడింది. జడ్జ్లు అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు తడుముకోకుండా జవాబు చెప్పింది.‘మీరు చాలా తెలివైనవారు’ అని జడ్జి ప్రశంసించేలా మాట్లాడింది. ఆసమయంలో తండ్రి రాజేష్ జైన్ కళ్లలో ఆనంద వెలుగులు కనిపించాయి. కుమార్తెతో కలిసి సాధించిన విజయం తాలూకు సంతృప్తి ఆయన కళ్లలో మెరిసింది. నాన్న హృదయం ఆనందమయంపిల్లలు విజయం సాధిస్తే ఎంత సంతోషం కలుగుతుందో, వారితో కలిసి విజయం సాధిస్తే అంతకంటే ఎక్కువ సంతోషం కలుగుతుంది. మాన్సీ తండ్రిగా ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నాడు రాజేష్ జైన్. స్టార్టప్ పనితీరు గురించి పక్కా ప్రణాళిక రూ΄÷ందించడం నుంచి అది పట్టాలెక్కి మంచి పేరు తెచ్చుకోవడం వరకు కూతురికి అండగా నిలబడ్డాడు. దిశానిర్దేశం చేశాడు. బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్ ‘షార్క్ ట్యాంక్’లో కుమార్తె మాన్సీతో కలిసి పాల్గొన్న రాజేష్ జైన్లో సాంకేతిక నిపుణుడు, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కంటే చల్లని మనసు ఉన్న తండ్రి కనిపించాడు. కుమార్తెతో కలిసి సాధించిన విజయానికి ఉ΄÷్పంగి పోతున్న తండ్రి కనిపించాడు. -
సిటిజన్ ఫీడ్ బ్యాక్లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్లో టాప్లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్తో 4వ స్థానంలో మహబూబ్నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్కు 4,830, సర్టిఫికేషన్కు 2,500, సిటిజన్ వాయిస్కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్రూరల్: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ, సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం మావలలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వానాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని 468 గ్రామపంచాయతీల్లో పారిశుధ్య పనులను నిరంతరంగా కొనసాగించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సెగ్రిగేషన్ షెడ్కు తరలించాలన్నారు. రోడ్లపై వర్షపునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే మురుగు కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. దోమలతో వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది 25 లక్షల 5వేల మొక్కలు నాటేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఖాళీ స్థలాలు గుర్తించడం, గుంతలు తవ్వడం వంటి ఏర్పాట్లు చేసుకోవాలని, నాటిన ప్రతీ మొక్కను సంరక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 30 నుంచి 8,702 ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ ఉంటుందన్నారు. అర్హులైన బీసీ చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రెండో విడత దళితబంధులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 1100 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఎంపీడీవోల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన, అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. సమగ్ర ఓటరు జాబితా తయారీకి బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఇటీవల జాతీయ జలశక్తి అవార్డు అందుకున్న కలెక్టర్ను అధికారులు సత్కరించారు. సమావేశంలో జెడ్పీ ిసీఈవో గణపతి, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్, ఐటీడీఏ డీడీ దిలీప్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, డిప్యూటీ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా పారిశుధ్య నిర్వహణ... కమిషనర్ను ప్రశ్నిస్తున్న కౌన్సిలర్లు
సదాశివపేట(సంగారెడ్డి): మున్సిపల్ పరిధి రోజురోజుకు విస్తరించడంతోపాటు జనాభా పెరుగుతోందని, అయితే శానిటేషన్ నిర్వహణ అధ్వానంగా తయారైందని, లై అవుట్లలో రోడ్లు, లైట్లు తదితర పనులు పూర్తి కాకుండానే తుది అనుమతి ఎలా ఇస్తారని కౌన్సిలర్లు కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం అనంతరం అనధికారికంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు శానిటేషన్, లేఅవుట్లు, ఇతర అభివృద్ధి పనులు విషయంలో అధికారుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. పట్టణంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆరోపించారు. మురుగు కాల్వల్లో పూడిక పెరుకుపోతుందని, పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేట్కు అప్పగించవద్దని 3వ వార్డు కౌన్సిలర్ చౌదరి ప్రకాశ్ చెప్పినట్లు సమాచారం. ప్రైవేట్ చెత్తసేకరణను రద్దుచేసి మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో చేయించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది చాలడంలేదని, సిబ్బంది సంఖ్యను పెంచాలన్నారు. పట్టణ పరిధిలో ఎన్ని లే అవుట్లను బ్లాక్ లిస్ట్లో పెట్టారని, లే అవుట్లలో రోడ్లు, మురుగునీటి కాల్వలు, వాటర్ ట్యాంకు నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా పైపులైన్ నిర్మించకుండా ఫైనల్ రిలీజ్ ఎందుకు చేస్తున్నారని కౌన్సిలర్ ఇంద్రమోహన్గౌడ్ కమిషనర్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనట్లు తెలిసింది. లే అవుట్లలో అభివృద్ధి పనులు జరగకున్నా, ఇతర సౌకర్యాలు లేకున్నా ప్లాట్లు కొనుగోలు చేసినవారికి ఎలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారని, నిబంధనల మెరకే లే అవుట్ ఫైనల్ చేస్తున్నామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు సమాచారం. సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణ పనులు నాణ్యతా జరగడంలేదని కౌన్సిలర్లు నాగరాజ్గౌడ్, చౌదరి ప్రకాశ్ నిలదీశారని, నాణ్యతగా పనులు చేపట్టేందుకు ఇంజనీర్ను ఆదేశిస్తామని కమిషనర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడు నెలలకోసారి కాకుండా ప్రతీనెల సమావేశాలు నిర్వహిస్తే ప్రజాసమస్యలు సులువుగా పరిష్కారమవుతాయని మెజార్టీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ, వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు విద్యాసాగర్రెడ్డి, గుండు రవి, శ్రీనివాస్, ఇలియాస్ షరీఫ్, నాగరాజ్గౌడ్, గుండు రవి, ఖుద్దూస్, పిచర్యాగడి రేణుక, కోఆప్షన్ మెంబర్ కలీమ్ పటేల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేతివాట.. డస్ట్బిన్, బకెట్, చీపుర్లు.. ఏదీ వదలడం లేదు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం, వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ వస్తువులైన డస్ట్బిన్, చీపుర్లు, ఇతర సామగ్రిని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్కేర్ విభాగంలో పని చేసే ఓ మహిళ ఆస్పత్రి నుంచి డస్ట్బిన్ బకెట్, చీపుర్లను పట్టుకుని బయటకు రాగా అదే ఆస్పత్రిలో పని చేసే ఓ సెక్యూరిటీగార్డ్ తన ద్విచక్రవాహనంపై వచ్చి సదరు మహిళను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇదే ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదిలా ఉండగా వస్తువులను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన విషయంలో పేషెంట్కేర్లో పని చేసే మహిళ, సెక్యూరిటీగార్డుపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
చక్కని ప్రణాళిక, మెరుగైన నగరాలు
న్యూఢిల్లీ: చక్కని ప్రణాళికతో నిర్మితమైన నగరాలే దేశ భవితను నిర్దేశిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో అలాంటి కనీసం 75 నగరాలను నిర్మించుకున్నా ప్రపంచ వేదికపై భారత్ ఎప్పుడో గొప్ప స్థాయికి చేరి ఉండేదన్నారు. కేంద్ర బడ్జెట్పై చర్చా పరంపరలో భాగంగా బుధవారం ‘పట్టణ ప్రణాళిక, అభివృద్ధి, పారిశుధ్యం’పై వెబినార్లో ఆయన మాట్లాడారు. దేశం శరవేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తుపై దృష్టిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పారు. ‘‘రాబోయే పాతికేళ్లలో దేశ ప్రగతి పట్టణ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ‘‘మన నగరాలు వ్యర్థ, నీటి ఎద్దడి రహితంగా, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండటం చాలా ముఖ్యం. చక్కని ప్రణాళిక అందుకు కీలకం. కొత్త నగరాల అభివృద్ధి, ఉన్నవాటి ఆధునికీకరణ కూడా పట్టణాభివృద్ధిలో కీలకమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల్లో పట్టణ ప్రణాళిక వ్యవస్థ బలోపేతం, ప్రైవేట్ రంగంలో నైపుణ్యాన్ని అందుకు సమర్థంగా వినియోగించుకోవడం, పట్టణ ప్రణాళికను అత్యున్నతంగా తీర్చిదిద్దే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణానికి ఏం చేయాలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రణాళిక సరిగా లేకున్నా, దాని అమలులో విఫలమైనా పెను సమస్యలకు దారి తీయడం ఖాయం’’ అని సూచించారు. పట్టణాభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. టైర్–2, టైర్–3 నగరాల ప్రణాళిక, అభివృద్ధిలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందన్నారు. -
కిటికీ అద్దాలు తుడిస్తే చాలు..కోటి రూపాయిల జీతం!
శానిటైజేషన్ వర్క్ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. ఇంతకీ శానిటైజేషన్ వర్కర్లకు చెల్లించే జీతం ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయిలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఆ పనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సదరు సంస్థలు వేతనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేడయం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా డాక్టర్లు, ఇంజినీర్ల శాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు..క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2021 నుంచి దేశం మొత్తం క్లీనింగ్ విభాగంలో డిమాండ్ ఎక్కువైంది. గతంలో అంటే 2021 ముందు క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటకు రూ.2700 ఇస్తే ఇప్పుడు రూ.3600వరకు చెల్లిస్తున్నాయి. అంతేకాదు అత్యవసర సమయాల్లో గంటకు రూ.4700 చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సిడ్నీకి చెందిన అబ్సిల్యూట్ డొమెస్టిక్ (Absolute Domestics) సంస్థతో పాటు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే..బ్రిటన్కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు. -
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్భంజ్లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
శానిటేషన్.. పరేషాన్!
♦వనపర్తి ప్రభుత్వాస్పత్రిలో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉన్న ప్రసూతి వార్డు ఇది. గతంలో 100 పడకలతో ఉన్న ఈ ఆస్పత్రిని 330 పడకలకు అప్గ్రేడ్ చేశారు. ఇక్కడ కనీసం 80 మంది శానిటేషన్ వర్కర్లు అవసరం. కానీ ఉన్నది 44 మందే. ఎప్పటికప్పుడు చెత్తాచెదారాన్ని తొలగించకపోవడం, సరిగా శుభ్రం చేయకపోవడంతో వార్డులన్నీ కంపు కొడుతున్నాయి. పలు వార్డులు, గదుల్లో పందికొక్కులు తిరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ♦సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వంద పడకల ప్రభుత్వాస్పత్రి శానిటేషన్ స్టోర్ గది, ఆస్పత్రిలో వాడే నాసిరకం ఫినాయిల్, ఇతర సామగ్రి ఇవి. ఇక్కడ తగిన శుభ్రత కోసం వినియోగించే సామగ్రి లేదు. కాస్త ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ మాత్రమే ఉన్నాయి. 3 నెలలుగా పరిస్థితి ఇలాగే ఉందని సిబ్బంది, రోగులు చెప్తున్నారు. ♦రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్యం దుస్థితికి ఇవి చిన్న ఉదాహరణలు. ఆస్పత్రుల్లో శానిటేషన్ పనులు చేసే కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తగిన సంఖ్యలో సిబ్బందిని అందుబాటులో ఉంచకపోవడం.. ఏమాత్రం నాణ్యతలేని సామగ్రిని వినియోగించడం.. చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోవడం.. తూతూమంత్రంగా క్లీనింగ్ చేయడం వంటివి పరిపాటిగా మారిపోయాయి. అధికారవర్గాలు దీనిని పట్టించుకోకపోవడంతో ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రుల్లో శానిటేషన్ పరిస్థితిపై ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రత్యేక కథనం.. సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగిని ఎలుకలు కొరకడం.. గతంలో మెదక్ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని పందికొక్కులు కొరుక్కుతినడం వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇందుకు ప్రధానంగా పారిశుధ్య లోపం, కొరవడిన పర్యవేక్షణ కారణమనేది సుస్పష్టం. ఇలాంటి సమయంలో అసలు సమస్య ఎక్కడ? ఎవరు బాధ్యులు? ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రక్షాళన చేపట్టాల్సిన అధికార యంత్రాంగం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని.. దీనిని ఆసరాగా తీసుకుని శానిటేషన్ కాంట్రాక్టు ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రభుత్వాస్పత్రుల్లో బుధవారం ‘సాక్షి’ చేపట్టిన విజిట్లో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. ప్రైవేట్ ఏజెన్సీల తెంపరితనం, రోగుల అవస్థలు వెలుగుచూశాయి. సిబ్బంది లేరు.. పరిశుభ్రత అసలే లేదు.. ♦ప్రభుత్వాస్పత్రుల్లో నిబంధనల ప్రకారం ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పర్యాయాలు వార్డులు, ఆవరణ, ఐసీయూ, ఇతర గదులను షిఫ్టుల వారీగా శుభ్రం చేయాలి. కానీ చాలాచోట్ల రెండుసార్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు. ♦శానిటేషన్ ఏజెన్సీలు అగ్రిమెంట్ ప్రకారం.. నాణ్యమైన డెట్టాల్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, ఇతర సామగ్రి వినియోగించాలి. చాలాచోట్ల డెట్టాల్ వాడటంలేదు. ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ కూడా నాసిరకాలవి వినియోగిస్తున్నారు. ♦శానిటేషన్ సిబ్బంది హాజరుకు సంబంధించి ఒకట్రెండు చోట్ల మినహా ఎక్కడా బయోమెట్రిక్ హాజరు లేదు. ఏజెన్సీల నిర్వాహకులు దీనిని ఆసరాగా చేసుకుని కొందరితో హాజరుపట్టికలో సంతకాలు చేయించి బయట పనులకు వినియోగించుకుంటున్నారు. ప్రతినెలా పదుల సంఖ్యలో సిబ్బంది వేతనాలను మిగుల్చుకుంటున్నారు. ♦నిబంధనల ప్రకారం శానిటేషన్ సిబ్బందికి నెలకు రూ.9,400 వేతనం ఇవ్వాలి. కా>నీ చాలాచోట్ల రూ.8 వేలు, కొన్నిచోట్ల అయితే రూ.6,500 మాత్రమే చెల్లిస్తుండటంతో పారిశుధ్య సిబ్బంది పనిపై శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ♦కొత్తగా మెడికల్ కళాశాలలు ప్రారంభమైన చోట.. వాటికి అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య సిబ్బంది సంఖ్య పెంచలేదు. దానితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నెలాఖరులోగా నోటిఫికేషన్ వేసి టెండర్ ఆహ్వానిస్తామని అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇదే దుస్థితి.. ♦ఖమ్మం జిల్లాలో 400 పడకల ప్రభుత్వాస్పత్రిలో 80 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. అందులోనూ కొందరే విధుల్లో ఉంటున్న పరిస్థితి. ఊడవడం, తుడవడం వంటివి ఒకరిద్దరే.. అదీ తూతూమంత్రంగా ముగిస్తున్నారని రోగుల బంధువులు చెప్తున్నారు. టాయిలెట్ల క్లీనింగ్ దారుణమని, బ్లీచింగ్ పౌడర్ కూడా సరిగా చల్లడం లేదని మండిపడుతున్నారు. ♦మెదక్ జిల్లాలోని వంద పడకల ఆస్పత్రిలో మూడు విడతల్లో కలిపి కేవలం 15 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. వీక్లీ ఆఫ్లు, సెలవులు పోగా.. రోజూ పనిచేసేది ముగ్గురు, నలుగురే. దీనితో పారిశుధ్యం కొరవడింది. ఆస్పత్రి ఆవరణలో మార్చురీ పక్కన చెత్తాచెదారం నిండిపోయింది. జనగామ జిల్లా ఆస్పత్రిలో ఫ్లోర్ను తుడుస్తున్న శానిటేషన్ వర్కర్ ఇతను. ఆస్పత్రిలో 17 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. వార్డులను రోజూ మూడుసార్లు శుభ్రం చేయాల్సి ఉండగా.. రెండుసార్లే క్లీన్ చేస్తున్నారు. సోప్ ఆయిల్, హైపోక్లోరైడ్, యాసిడ్, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటివి నాసిరకంగా ఉన్నాయి. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో 170 మంది పారిశుధ్య సిబ్బందికిగాను 112 మంది మాత్రమే ఉన్నారు. దానితో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇక మంచిర్యాల ఆస్పత్రి 200 పడకలకు అప్గ్రేడ్ అయినా.. 40 మందే శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తున్నా పట్టించుకోవట్లేదు కాలుకు గాయమవడంతో చికిత్స కోసం భువనగిరి జిల్లా ఆస్పత్రికి వచ్చాను. రెండు రోజులుగా వార్డులో ఉంటున్నాను. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. –నర్సింహ, రామచంద్రపురం, భువనగిరి -
బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించం
హస్తినాపురం: డివిజన్లోని కాలనీల ప్రధాన రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే సహించేది లేదని కార్పొరేటర్ బానోతు సుజాతానాయక్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని నందనవనం కాలనీలో పారిశుద్ధ్య సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా అధికారులు తరచూ పరిశీలించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ గణేశ్, జవాన్ శంకర్, నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి , మల్లేశ్గౌడ్ , రాజుగౌడ్, మారం శ్రీధర్ పాల్గొన్నారు. -
పారిశుధ్యం మెరుగుదలకు ప్రత్యేక చర్యలు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మునిసిపాలిటీల్లో 256 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ (జీటీఎస్)లు నిర్మిస్తోంది. ప్రస్తుతం మునిసి పాలిటీల్లోని వార్డుల్లో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఓ ప్రాంతంలో పోగు చేస్తున్నారు. తర్వాత టిప్పర్ల ద్వారా డంపింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. చెత్తను బహిరంగ ప్రదేశంలో పోగేయడం వల్ల అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యం మెరుగు, వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పోగు చేయకుండా 8 నుంచి 10 లేదా స్థానిక పరిస్థితులను బట్టి మరికొన్ని వార్డులను కలిపి ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను పోగు చేయడానికి జీటీఎస్లు నిర్మించాలని నిశ్చయించింది. రూ.213 కోట్లతో 256 జీటీఎస్ల నిర్మాణం రాష్ట్రంలో 123 మునిసిపాలిటీల్లో రూ.213.39 కోట్లతో 256 జీటీఎస్ల నిర్మాణానికి ఆ శాఖ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 104 మునిసిపాలిటీల్లో 210 జీటీఎస్ల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు లభించాయి. 92 మునిసిపాలిటీల్లో 189 జీటీఎస్ల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించారు. 72 మునిసిపాలిటీల్లో 136 జీటీఎస్లకు టెండర్లు పూర్తయ్యాయి. 68 మునిసిపాలిటీల్లో 124 జీటీఎస్ల నిర్మాణానికి వర్క్ ఆర్డర్లు చేయడం ముగిసింది. శ్రీకాకుళం, మచిలీపట్నం, ఒంగోలు కార్పొరేషన్లు, హిందూపురం, వినుకొండ, నంద్యాల, పుంగనూరు, నగరి సహా 30 మునిసిపాలిటీల్లో 46 జీటీఎస్ల నిర్మాణం ప్రారంభించారు. మిగిలిన జీటీఎస్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. 30 సెంట్ల నుంచి అర ఎకరం, ఎకరం, మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో కూడా పలు మునిసిపాలిటీల్లో జీటీఎస్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను నేరుగా ఇక్కడికి తరలిస్తారు. అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలకు తరలిస్తారు. -
శుభ్రతకు 'క్లాప్' కొడదాం
సాక్షి, అమరావతి: పరిశుభ్రతలో రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలబెట్టేందుకు రూపొందించిన ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సన్నద్ధమవుతోంది. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం కోసం ముందుగా పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు ఇంటింటి నుంచి చెత్త సేకరణపై విస్తృత అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. 21.19 లక్షల మంది పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు భాగస్వామ్యం కల్పించింది. వీరికి రెండంచెల శిక్షణ కార్యక్రమాన్ని మెప్మా నిర్వహిస్తోంది. వార్డు సచివాలయాల కేంద్రంగా కార్యాచరణ చేపట్టింది. ముందుగా ప్రతి మున్సిపాలిటీకి ఒకరుతోపాటు ఆ మున్సిపాలిటీ పరిధిలో పైలట్ వార్డుకు ఇద్దరు చొప్పున మాస్టర్ ట్రైనర్లను ఎంపిక చేసింది. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్, మెప్మా అధికారులు వారికి క్లాప్ కార్యక్రమంపై శిక్షణ ఇచ్చారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటి నుంచి చెత్త సేకరించే తీరు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులు మొదలైన వాటిపై వారికి అవగాహన కల్పించారు. అలాగే రాష్ట్రంలో 3,826 వార్డు సచివాలయాల పరిధిలో 7,652 మంది రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసిన మెప్మా.. వీరికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇప్పించింది. ఈ రిసోర్స్ పర్సన్ల ద్వారా డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తారు. వీరంతా కలసి వార్డు సచివాలయాల సిబ్బంది సహకారంతో పట్టణాలు, నగరాల్లోని ప్రజలకు క్లాప్ కార్యక్రమం గురించి వివరిస్తారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా మూడు బుట్టల్లో వేయడం, ఇంటింటికి వచ్చే పారిశుధ్య కార్మికులకు వాటిని అందించడం, వీధిలో ఎక్కడా చెత్తపారేయకుండా ఉండాల్సిన అవసరం మొదలైన వాటిని వివరిస్తారు. ఇక ముందుగా డ్వాక్రా సంఘాల మహిళలు చెత్త రుసుమును స్వచ్ఛందంగా చెల్లించేందుకు ముందుకు వచ్చారు. తద్వారా తమ ప్రాంతాల్లో శాస్త్రీయంగా పారిశుధ్య నిర్వహణ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేస్తారు. పరిశుభ్ర పట్టణాలే లక్ష్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణాలు, నగరాలను పూర్తి పరిశుభ్ర ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి చెప్పారు. మాస్టర్ ట్రైనర్లకు నిర్దేశించిన యూనిఫాంలను ఆమె గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలను భాగస్వాములుగా చేసుకుని క్లాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. – వి.విజయలక్ష్మి, మెప్మా ఎండీ -
YS Jagan: పరిశుభ్రతకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక నంబర్ను డిస్ప్లే చేయాలి. కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వ్యర్థాలను సేకరించి, ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించాలి. మురుగు నీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డ్రెయిన్లను తరచూ శుభ్రం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బలమైన పారిశుధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. ప్రధానంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాల వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్ అంబాసిడర్స్, 4,482 గ్రీన్ గార్డ్స్ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్స్, 5,551 మంది గ్రీన్ గార్డ్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణకు భారీగా యంత్రాలను వినియోగించాలని, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంకా ఏమన్నారంటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి వ్యర్థాల సేకరణతో పాటు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి. పీపీఈ కిట్స్ డిస్పోజల్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి. ఈ అంశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. – ఫోన్ చేయగానే వ్యర్థాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్ ఉండాలి. 6 లక్షల మంది మహిళలకు సుస్థిర జీవనోపాధి కింద లబ్ధి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్థిర జీవనోపాధి కింద ఈ ఏడాది 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. టై అప్ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు కలిగినవిగా చూసుకోవాలి. మార్కెటింగ్ సామర్థ్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలి. సమగ్ర భూ సర్వే, ఉపాధి పనులు వేగవంతం సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ చేయాలి. ఈ ఏడాది ఉపాధి హామీ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. జియో ట్యాగింగ్ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్లు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా చిన్న చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టాలి. ప్రగతిపథంలో పనులు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం వివరాలు తెలిపారు. నాడు–నేడులో భాగంగా పనులు చేపడుతున్న ఆస్పత్రులు, స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైఎస్సార్ బీమా, జలజీవన్ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 9,148 ఇన్సినిరేటర్స్ (బూడిదగా మార్చేవి), 3,279 మిస్ట్ బ్లోయర్స్ (పిచికారి చేసేవి), 3,197 బ్రష్ కట్టర్స్ (గడ్డి కత్తిరించేవి), 3130 హైప్రెషర్ టాయ్లెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ పి.రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
పరిశుభ్రంగా పల్లెలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలందరూ స్వచ్ఛమైన వాతావరణంలో జీవనం సాగించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా.. గ్రామీణ ప్రాంతాలలో మురుగు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు వంటి ప్రభుత్వ కార్యాలయాల్లోని మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు యంత్రాలను కొనుగోలు చేయనుంది. అలాగే, పల్లెల్లో రోడ్లపై మురుగునీటి ప్రవాహం ఓ పెద్ద సమస్య. సైడ్ కాల్వలు శుభ్రం చేసేందుకు చాలాచోట్ల కూలీలు ముందుకు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కూలీ రేటు ఎక్కువగా డిమాండ్ చేస్తుండడంతో ఈ పని గ్రామ పంచాయతీలకు పెనుభారంగా మారింది. దీంతో ఈ సమస్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం శాశ్వతంగా చెక్ పెట్టనుంది. ప్రతి మండలంలోని మురుగు కాల్వల్లో పూడిక తీయడంతో పాటు కాల్వల పక్క పెద్దస్థాయిలో పెరిగే పిచ్చి మొక్కలను తొలగించడానికి డివిజన్కు ఒకటి చొప్పున బాబ్కాట్ మిషన్లను గ్రామాలకు అందుబాటులో ఉంచనుంది. దీనికి తోడు.. గ్రామాల్లో సాధారణ మురుగు తొలగించడానికి మండలానికి ఒకటి చొప్పున మెకనైజ్డ్ డ్రెయిన్ క్లీనింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాక్టరు నడపడం వచ్చినవారు ఈ మిషన్ ద్వారా రోజుకు 6–8 కి.మీ. పొడవున మురుగు కాల్వలను శుభ్రంచేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటిద్వారా మండల పరిధిలోని ప్రతి గ్రామంలో ఏడాదికి కనీసం రెండు మూడు సార్లు మురుగుకాల్వలన్నింటినీ శుభ్రం చేయించనున్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 660 మిషన్లను గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉంచనుంది. ప్రతీ పంచాయతీకి టాయిలెట్ క్లీనర్ గ్రామంలో ఉండే కమ్యూనిటీ టాయిలెట్లతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ సచివాలయం సహా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో మరుగుదొడ్లను కూడా ప్రతిరోజూ శుభ్రం చేసేందుకు ప్రతి గ్రామ పంచాయితీకి ఒక హైపవర్ టాయిలెట్ క్లీనర్ మిషన్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అందజేయనుంది. బ్యాటరీ ద్వారా పనిచేసే ఈ మిషన్ను సాధారణ నైపుణ్యం ఉండే ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 13,371 గ్రామ పంచాయితీలకుగాను ప్రస్తుతం 2,640 చోట్ల ఈ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన పంచాయితీల్లోనూ వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నాయి. ఫాగింగ్ మిషన్లతో దోమల నివారణ ఇక గ్రామాల్లో దోమల నివారణ కోసం ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి చొప్పున ఫాగింగ్ మెషీన్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రస్తుతం 2,743 గ్రామాల్లో ఇప్పటికే ఇవి అందుబాటులో ఉండగా, మిగిలిన 10,628 గ్రామాలకు ఒక్కొక్కటి చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. -
పట్టణాలకు దీటుగా పల్లెలు
సాక్షి, అమరావతి: పట్టణాలకు దీటుగా పల్లెల్ని కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు సర్పంచ్లు ముందుండి పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8 నుంచి వంద రోజులపాటు చేపట్టే ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాల్లో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఆ రోజు ఈ స్వచ్ఛ సంకల్పం యజ్ఞాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక శంఖారావం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఉద్దేశించి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డితోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్కుమార్, జగనన్న స్వచ్ఛ సంకల్పం ఓఎస్డీ దుర్గాప్రసాద్లు తాడేపల్లి కమిషనర్ కార్యాలయం నుంచి పాల్గొనగా.. ప్రతి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి ఆయా మండలంలో సర్పంచులందరూ ఈ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్లతో మంత్రి ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి గ్రామం పరిశుభ్రత, పచ్చదనంతో కళకళలాడాలని సీఎం వైఎస్ జగన్ తపిస్తున్నందున ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమ రూపంలో ప్రజల్లోకి తీసుకువస్తున్నామన్నారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలో 567 పల్లెలు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా గుర్తింపు పొందడం విశేషమని పెద్దిరెడ్డి అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని 13,371 పంచాయతీల్లో జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతం చేయాలని కోరారు. పరిశుభ్రతతో 95 శాతం అంటువ్యాధులు తగ్గాయి గత ఏడాది కాలంగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు 95 శాతం తగ్గినట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో, గ్రామాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని సర్పంచ్లకు సూచించారు. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్.. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన 11,412 మంది సర్పంచులకు సోమవారం నాటికి చెక్ పవర్ బదలాయింపు ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. మరో 1,680 మందికీ ఒకట్రెండు రోజులలోనే బదలాయించనున్నట్లు తెలిపారు. అలాగే, పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,704 కోట్లను పంచాయతీల ఖాతాల్లో జమచేశామన్నారు. మంచి ఫలితాలను సాధించిన సర్పంచ్లు, అధికారులను ప్రభుత్వం సన్మానిస్తుందని తెలిపారు. కాగా, వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయపల్లి సర్పంచ్ ఇందిరెడ్డి స్వాతి, కర్నూలు జిల్లా ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష, నెల్లూరు జిల్లా జమ్మలపాలెం సర్పంచ్ బి. శ్రీదేవి, ప్రకాశం జిల్లా జువ్వలేరు సర్పంచ్ ఎస్. సుధాకర్రెడ్డి మాట్లాడారు. రీచ్ల నుంచే నేరుగా జగనన్న కాలనీలకు ఇసుక విజయవాడలో మంత్రి పెద్దరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నేరుగా రీచ్ల నుంచే జగనన్న కాలనీల్లో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనివల్ల రవాణా చార్జీలు తగ్గడంతోపాటు డిపోల నుంచి ఇసుకను తీసుకెళ్లే హ్యాండ్లింగ్ చార్జీలు కూడా ఆదా అవుతాయన్నారు. లేనిపక్షంలో వీటిని ప్రభుత్వమే భరించాల్సి వస్తుందన్నారు. కడుతున్న ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా, వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని.. నెలాఖరులోపు ఈ సీజన్కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. -
5 సంవత్సరాల్లో గ్రామాల్లో పరిశుభ్రత, మంచినీటికి 6,140 కోట్లు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో మెరుగైన పరిశుభ్రత, మంచినీటి సరఫరా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో భారీగా నిధులు వెచ్చించనుంది. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు కేటాయించే 15వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6,140 కోట్లను ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. అదనంగా ఇతర కార్యక్రమాలు, పథకాల నిధులను వీటికి జతచేసి ఈ అవసరాల కోసం వినియోగిస్తారు. ఈ మేరకు ఆర్థిక సంఘం నిధుల వినియోగం నిబంధనల్లో మార్పులు తేనున్నారు. దీనికి సంబంధించిన ముసాయిదాను ప్రభుత్వం సిద్ధం చేసింది. 60 శాతం నిధులు.. స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం ఏటా కేటాయించే నిధుల్లో 60 శాతం పరిశుభ్రత, మంచినీటి అవసరాలకు ఖర్చు చేయాలని ముసాయిదాలో పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ప్రతి గ్రామంలో ఏడాది పొడవునా తాగునీటి లభ్యత సౌకర్యాల కల్పన, రోజూ ప్రతి ఇంటికీ నీటి సరఫరాకు మౌలిక వసతుల ఏర్పాటు, పర్యవేక్షణ, రహదారులు, ఇతర ఖాళీ స్థలాల్లో మురుగు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం, క్రమ విధానంలో చెత్త సేకరణ తదితరాల కోసం ఈ నిధులను వెచ్చిస్తారు. ప్రతి గ్రామానికి ఐదేళ్ల ప్రణాళిక.. గ్రామంలో పరిశుభ్రత, మంచినీటి సరఫరా సౌకర్యాల కోసం ప్రతి పంచాయతీకి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులు, అదనపు సౌకర్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రణాళిక రూపొందిస్తారు. తుపాన్లు లాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. గ్రామసభలో ప్రణాళికపై చర్చించి తుది ఆమోదం తీసుకోవాలి. ప్రణాళికల అమలుకు సర్పంచ్ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కమిటీని నియమించుకోవచ్చు. కమిటీలో మహిళలు, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు వారి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు
బంజారాహిల్స్: కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన ప్రభుత్వం మైక్రో కంటైన్మెంట్ జోన్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలో వీర్నగర్, ప్రేమ్నగర్, బాపునగర్, ఎల్లారెడ్డిగూడ. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్ తదితర ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ జోన్లలో జీహెచ్ఎంసీ అధికారులు తగిన జాగ్రత్తలు, పారిశుద్ధ్య సమస్యలపై దృష్టిసారించాల్సి ఉంటుంది. రోజువారి పర్యవేక్షణ కూడా అవసరం. ►పర్యవేక్షణ కరువు.. మేయర్ ►దృష్టిసారిస్తేనే ముందుకు.. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గత వారం రోజుల నుంచి సంబంధిత సిబ్బంది, అధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. కనీసం అటువైపు తొంగిచూడటం లేదు. ►తాజాగా బుధవారం గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రోడ్ నెం.12లోని ఎన్బీటీ నగర్ జోన్లో క్రిమి సంహారక స్ప్రే (ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని)ను చేయించారు. ఇదంతా రోజువారి కార్యక్రమం కాగా మేయర్ దృష్టిసారిస్తేనే సంబంధిత సిబ్బంది ఒక రోజుకు కదిలారు. మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ►శానిటైజేషన్ చేపట్టేందుకు ఇప్పటిదాకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ►ఇటీవల నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య డ్రైవ్ లు మాత్రం నిర్వహించారు. ►మైక్రో కంటైన్మెంట్ ఏర్పాటు చేసినట్లు కొంత మంది అధికారులకు సమాచారమే లేదని తెలుస్తుంది. ►మైక్రో డిపార్ట్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య శాఖ నుంచి కానీ, ఉన్నతాధికారుల నుంచి కానీ ఎలాంటి ఆదేశాలు, సూచనలు జారీ కాలేదని అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఒకరు స్పష్టం చేశారు. ►ఈ విషయంపై ఖైరతాబాద్ జోన్ జీహెచ్ఎంసీ అధికారులు కూడా మాట్లాడేందుకు ముందుకు రావడం లేదు. ►మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రతిరోజూ పారిశుద్ధ్య సిబ్బంది పర్యటించి చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. ►ప్రజలు ఇష్టారాజ్యంగా బయట తిరగకుండా నిబంధనలు ఉండాలి. ►ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించిన తర్వాతనే రోడ్లపై తిరగాల్సి ఉంటుంది. ►నిత్యం హైడ్రో క్లోరైట్ స్ప్రే చేయాల్సి ఉంటుంది. ►ఈ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందని బోర్డులు ఏర్పాటు చేయడమే కాకుండా స్థానికులను అప్రమత్తం కూడా చేయాల్సి ఉంటుంది. ►ఇలాంటి ప్రోటోకాల్స్ ఏవీ మైక్రో ఈ జోన్లలో అమలు చేయడం లేదు. ►తమ నివాసిత ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉందనే విషయమే అక్కడ ప్రజలకు తెలియదంటూ కోవిడ్–19పై అధికారులు ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ►మాకు ఎలాంటి సూచన లేదు.. మేమేం చేయాలి.. ►సరైన సూచనలు, జాగ్రత్తలు లేకపోతే తాము మాత్రం ఏం చేయాలంటూ జీహెచ్ఎంసీ కింది స్థాయి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ►మేయర్ కదిలింది కాబట్టి ఒక రోజు స్ప్రే చేశారు. ►మరి మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది అధికారులకే తెలియాలి. ►మైక్రో కంటైన్మెంట్ జోన్ అన్నది కాగితం మీదనే కనబడుతున్నదని క్షేత్రస్థాయిలో దాని జాడే లేదని స్థానికులు దుయ్యబడతున్నారు. (చదవండి: హైదరాబాద్లో అసలు కర్ఫ్యూ ఉందా? ఓ యువతి ట్వీట్ ) -
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వండి
సాక్షి, అమరావతి: కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. అన్ని గ్రామాల్లో శానిటేషన్, రక్షిత మంచినీటి సరఫరాకు అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. సర్పంచ్లు, వార్డు సభ్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పారు. తాడేపల్లిలో బుధవారం అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను కూడా కేటాయించామని చెప్పారు. రూ.1,486 కోట్ల ఖర్చుతో గ్రామాల్లో 1,944 కిలోమీటర్ల మేర చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైఎస్సార్ జలకళ పథకాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు. బోర్వెల్ డ్రిల్లింగ్కు రూ.2,340 కోట్లు, పంపుసెట్లకు రూ.1,875 కోట్లు, విద్యుత్ పరికరాలకు రూ.1,500 కోట్ల మేర అంచనాలతో ఈ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్కుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎస్సీ సుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి, వాటర్షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
GHMC Sanitation: పేరు గొప్ప.. ఊరు దిబ్బ
సాక్షి, హైదరాబాద్: ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కోసం తాపత్రయ పడే జీహెచ్ఎంసీలో వాస్తవ పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. వరుసగా మూడో రోజు ఆకస్మిక తనిఖీల్లోనూ మేయర్కు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలు, అధ్వాన్నపు పారిశుధ్య పరిస్థితులు దర్శనమిచ్చాయి. చెత్త తీసుకువెళ్లేందుకు స్వచ్ఛ ఆటోల వాళ్లు రావడం లేదని పలు ప్రాంతాల్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ప్రాంతాల్లో పారిశుధ్యం జరగడం లేదని నింబోలిఅడ్డాలోని ప్రజలు మేయర్ దృష్టికి తేగా, సంబంధిత ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)ను తొలగించాలని ఆదేశించడంతో అందుకనుగుణంగా సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. మేయర్ గద్వాల విజయలక్ష్మి క్షేత్రస్థాయి పర్యటనలతో చెత్త సమస్యలపై ఇప్పుడు దృష్టి సారించినప్పటికీ, జీహెచ్ఎంసీ ఈ అంశాన్ని ఎంతోకాలంగా వదిలేసింది. క్షేత్రస్థాయిలో ఈ పనులు నిర్వహించాల్సిన డీసీలు, ఏఎంఓహెచ్లు, ఎస్ఎఫ్ఏలపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పట్టు లేకుండా పోయింది. దాంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారు. పేరుకు బయోమెట్రిక్ హాజరైనప్పటికీ, ఏ ఒక్కరోజు కూడా పారిశుధ్య సిబ్బంది టీమ్స్లోని సభ్యులందరూ హాజరు కారు. ఇవన్నీ పైస్థాయిలోని వారికి తెలియక కాదు. తెలిసినా పట్టించుకోలేదు. కేవలం స్వచ్ఛ ర్యాంకింగ్స్ కోసం.. స్వచ్ఛ సర్వేక్షణ్ బృందాలు నగరానికి తనిఖీలకు వచ్చినప్పుడు హడావుడి చర్యలతో వారిని ఆకట్టుకునే పనులు చేస్తున్నారు. అంతేకాదు.. పౌరస్పందన విభాగంలో మార్కులు పొందేందుకు ప్రజల బదులు జీహెచ్ఎంసీ సిబ్బందే, అసలు విధులు పక్కనపెట్టి ఫీడ్బ్యాక్ పంపించారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. ర్యాంకుల సర్టిఫికెట్లపై చూపే మోజులో నాలుగోవంతైనా వాస్తవ పరిస్థితులపై దృష్టి సారిస్తే ప్రజలకు చెత్త సమస్యలు తప్పుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు చేసినా ఉన్నతస్థాయిలోని యంత్రాంగం పట్టించుకోకపోవడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ చదవండి: అదే భయం.. ఎప్పుడేం జరుగుతుందో.. వెళ్లిపోతాం సారు హైదరాబాద్ సిటీ బస్సులు తిరిగేది ఇక ఈ సమయంలోనే! -
పారిశుద్ధ్యంపై జనచైతన్యం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై స్థానిక ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఇటీవల ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామాల్లో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోలిస్తే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మలేరియా వ్యాధులు సగానికి పైగా తగ్గగా.. డెంగీ, డయేరియా తదితర వ్యాధులు దాదాపు 20 శాతానికే పరిమితమయ్యాయని పంచాయతీరాజ్శాఖ పరిశీలనలో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజాచైతన్యాన్ని మరింత పెంచడం ద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను పూర్తిగా నియంత్రించేందుకు ఆ శాఖ నడుంకట్టింది. ► మనం – మన పరిశుభ్రత పేరుతో పంచాయతీరాజ్శాఖ రాష్ట్రంలో ఉన్న 13,371 గ్రామాల్లోనూ విడతల వారీగా సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లో ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 1,320 గ్రామాల్లో , రెండో విడతలో 4,740 గ్రామాల్లో ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. ► దీనికి తోడు ప్రజాచైతన్యం కోసం సోషల్ మీడియాను ఉపయోగించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 2.70 కోట్ల వరకు జనాభా ఉన్నట్లు అంచనా. వీరిలో కోటిమందికిపైగా ఇంటర్నెట్ వసతితో కూడిన మొబైల్ ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించింది. వీరిలో 66 లక్షల మంది ఫేస్బుక్, వాట్సాప్లను, 40 లక్షలమంది ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లను ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. ► పరిసరాల అపరిశుభ్రత కారణంగా సంక్రమించే వ్యాధులు, ఫలితంగా కలిగే ఆర్థికభారం, సంపూర్ణ పారిశుద్ధ్యం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ స్క్రీన్షాట్లను రూపొందించి గ్రామాల్లో మొబైల్ ఫోన్ల వినియోగదారులకు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ప్రాంతాల వారీగా సబ్ గ్రూపుల రూపకల్పనకు ఆలోచిస్తున్నారు. ► గ్రామీణ ప్రాంతానికి ఎక్కువగా సంబంధం ఉండే ఉన్నత పా´ఠశాలలు, జూనియర్ కాలేజీ విద్యార్థులతో పాటు ఇతరత్రా చురుగ్గా ఉండే వారిని వారి గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చేపట్టే చర్యల్లో భాగస్వాముల్ని చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
ముంపు గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక జాగ్రత్తలు
సాక్షి, అమరావతి: తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన 112 గ్రామాలకు ప్యాకెట్లు, క్యాన్లు, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ సరఫరా చేస్తోంది. పాక్షికంగా నీట ముంపునకు గురైన వాటితో కలిపి మూడు జిల్లాల్లో 330 గ్రామాల వరకు వరద నీటి ప్రభావం ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ముంపు గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డిలు మంగళవారం సాయంత్రం మూడు జిల్లాల డీపీవోలు, జడ్పీ సీఈవోలు, ఎస్ఈలు, ఇతర పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్లో పేర్కొన్న ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ► ముంపు గ్రామాల ప్రజల తాగునీటి అవసరాల కోసం 4.86 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 20 లీటర్ల సామర్ధ్యం కలిగిన 1,160 క్యాన్లు, 5 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 3 ట్యాంకర్లను గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలకు ఇప్పటికే తరలించింది. ► ముంపు గ్రామాల్లో డయేరియా, మలేరియా, అంటు వ్యాధులు ప్రబలకుండా ఆయా గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాల ఓవర్హెడ్ ట్యాంకులు, బోర్ల నీటిని రెండు, మూడు రోజుల పాటు తాగొద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించాలి. ► ముంపు గ్రామాల్లో ప్రతి బోరు, బావి నుంచి నీటి శాంపిల్స్ సేకరించి, అవి తాగునీటి అవసరాలకు పనికి వస్తాయా లేదా అని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహించి, ప్రతి రోజూ క్లోరినేషన్ ప్రక్రియ చేపట్టాలి. ► తాగడానికి పనికొస్తాయని నిర్ధారణ అయిన బోర్లను గుర్తించి, వాటిలోని నీటిని మాత్రమే వినియోగించుకోవాలని ప్రజలకు తెలియజెప్పాలి. ► ఆయా ప్రాంతాల్లో నీరు పూర్తిగా గ్రామం నుంచి వెళ్లగానే పారిశుధ్య కార్యక్రమాలు వేగంగా చేపట్టాలి. ► మేట వేసిన మట్టిని తొలగించి బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ చల్లాలి. ► రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఎక్కడైనా రోడ్లపై చెట్లు విరిగిపడితే, వాటిని వెంటనే తొలగించాలి. -
ప్రమాదకరంగా పశ్చిమ బెంగాల్ రవాణా
కోల్కతా: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూ దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొన్ని రాష్ట్రల్లో ప్రజా రవాణా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని అనేక ప్రాంతాల్లో బస్సులను శానిటైజ్ చేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సు మొదలైనప్పుడు తప్ప మరెక్కడ బస్సును శానీటైజ్ చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. పశ్చిమ మిడ్నపూర్లో జిల్లా మేజిస్టేట్ బస్సులను శానిటైజ్ చేయాలని ఆదేశించినప్పటికీ బస్సు యజమానులు ఖాతరు చేయడం లేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో డ్రైవర్లకు, కండక్టర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. (చదవండి: కరోనా మృతులకు 10 లక్షలు.. ఉద్యోగం) దీంతో మిగిలిన వారు కూడా విధులకు రావడానికి సంకోచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో బస్సులు ఆగిపోయాయి. కరోనా పాజిటివ్ సోకిన ఒక కండక్టర్ 30 మంది ఇతర సిబ్బందితో కలిసి ఉండటం కలకలం రేపింది. ఈ విషయం గురించి ప్రైవేట్ బస్సు యజమానులు మాట్లాడుతూ.. బస్సుకు 20 మందినే అనుమతించడం వల్ల తమకు చాలా నష్టం వస్తుందని, ఇక శానిటైజర్లు వాడటం, బస్సులను శానిటైజ్ చేయించడం అంటే తమ వల్ల కాదని చెప్పారు. ఈ విషయంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ సిన్హా స్పందిస్తూ.. ‘బెంగాల్లో బస్సు సదుపాయాలను కల్పిస్తామని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ సిబ్బందికి ఇప్పటి వరకు సరైన మాస్క్లు, గ్లౌజ్లు కూడా ఇవ్వలేదు’ అని ఆయన ఆరోపించారు. (చదవండి: కరోనా కట్టడికే ఆన్లైన్ ప్రజావాణి) -
నేటినుంచి గ్రేటర్ శానిటేషన్ డ్రైవ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై నేటినుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సీఎం కేసీఆర్ సూచనలకనుగుణంగా జూన్ 1 నుంచి (సోమవారం) 8వ తేదీ వరకు గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా రోడ్ల వెంబడి, ఓపెన్ ప్లాట్లలో చెత్తాచెదారాన్ని తొలగించనున్నారు. నాలాలు, నీటి నిల్వ ప్రాంతాల్లో డీసిల్టింగ్, పిచ్చిమొక్కలు, గుర్రపుడెక్కను, రహదారులు, ఓపెన్ ప్లాట్లలోని కన్స్ట్రక్షన్, డిమాలిషన్ వ్యర్థాలు తదితరాలను తొలగించనున్నారు. ఆయా కార్యక్రమాల అమలు కోసం వార్డుల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు కమిషనర్ తెలిపారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాల కోసం అన్ని వార్డులనూ మ్యాపింగ్ చేయడంతో పాటు తగినన్ని వాహనాలను సమకూర్చి అవసరమైన సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాలను డిప్యూటీ, జోనల్ కమిషనర్లు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని, అవసరానికనుగుణంగా అదనపు సిబ్బంది, వాహనాలను సమకూర్చనున్నట్లు కమిషనర్ తెలిపారు. నిరాడంబరంగా అవతరణ వేడుకలు జూన్ 2వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో జాతీయ పతాకావిష్కరణ తదితర కార్యక్రమాలను ఎలాంటి ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా నిర్వహించాలని కమిషనర్ జోనల్, డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సూచించారు. కోవిడ్– 19 నివారణ నిబంధనలకనుగుణంగా మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజింగ్ స్ప్రే, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచడం వంటివి అమలు చేయాలన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు పతాకావిష్కరణ చేయాలని సూచించారు. -
ఒకటీ రెండు కేసులకే మూసేయొద్దు
న్యూఢిల్లీ: కంపెనీలు, సంస్థలు ఒకటీ రెండు కరోనా కేసులు బయటపడిన సందర్భాల్లో తమ కార్యాలయ భవనం లేదా పని ప్రాంతాన్ని మొత్తాన్ని మూసివేయాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. భవనాన్ని శానిటైజ్ చేసి కార్యకలాపాలను ప్రారంభించవచ్చని తెలిపింది. భారీగా కేసులు నిర్ధారణ అయితే ఆ భవనాన్ని 48 గంటలపాటు మూసి ఉంచాలని సూచించింది. భవనాన్ని శానిటైజ్ చేసి, సురక్షితమని ధ్రువీకరించుకున్నాకే ప్రారంభించాలని, సిబ్బంది ‘వర్క్ ఫ్రం హోమ్’విధానంలో పనిచేయాలని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు పని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కార్యాలయ సిబ్బంది ఎవరైనా ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారు ఆఫీసులకు రావద్దని, స్థానిక ఆరోగ్య శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరింది. ఒక గదిలో లేదా ఆఫీసు ప్రాంతంలో ఎవరైనా కోవిడ్–19 సోకిన లక్షణాలతో బాధపడుతుంటే వారిని మరో చోట ఒంటరిగా ఉంచి, వైద్యుని సలహా తీసుకోవాలని సూచించింది. అటువంటి వ్యక్తులు, కోవిడ్–19 అనుమానిత లేక పాజిటివ్ అని తేలితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపింది. ‘50 శాతం జూనియర్ స్టాఫ్ విధులకు హాజరు కావాలి’ డిప్యూటీ సెక్రెటరీ కంటే తక్కువ స్థాయి పోస్టుల్లో ఉన్న జూనియర్ ఉద్యోగుల్లో 50 శాతం మంది కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా 33 శాతం మంది మాత్రమే విధులకు హాజరవుతున్నారు. ఇకపై జూనియర్ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసులకు వచ్చేలా అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు రోస్టర్ను రూపొందించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్ కారణంగా తీవ్రమైన హృద్రోగ సమ స్యలు తలెత్తే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రక్తం గడ్డకట్టడం లాంటి సమస్యలకు కోవిడ్ కారణమౌతోందని, కోవిడ్ మందుల వల్ల హృద్రోగులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని అమెరికాలోని వర్జీనియా వర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కరోనా భయమా? మీకో బుల్లి పెట్టె : రూ.500 లే
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్...ఇది అతి సూక్ష్మ జీవి అయినా విశ్వం మొత్తాన్ని గజగజ లాడిస్తోంది. ఎక్కడ ఎలా పొంచి వుందో తెలిదు..ఎటునుంచి దాపురిస్తుందో తెలియదు..ఏ వస్తువుపై దాక్కొని ఎలా పంజా విసురుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశప్రజలను పట్టి పీడిస్తున్న ఆందోళన ఇది. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు, మందులు, కూరగాయలు, కిరాణా లాంటి అత్యవసర వస్తువులను విక్రయిస్తున్న దుకాణదారులను ఈ భయం వెంటాడుతోంది. అయితే కరోనా మహమ్మారి భయాలకు చెక్ పెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రోపార్ ఒక కొత్త పరికరాన్ని రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మనం వాడే నిత్యాసర సరుకులను ఈ వైరస్ బారినుంచి కాపాడుకోవచ్చని వెల్లడించింది. అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీతో ట్రంక్ ఆకారపు పరికరాన్ని అభివృద్ధి చేసింది. డబ్బులు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, ఆన్ లైన్ ద్వారా డెలివరీ అయిన వస్తువులు, చేతి వాచీలు, పర్సులు, మొబైల్ ఫోన్లు ఇలా దేన్నైనా ట్రంక్ పెట్టెలో ఉంచి, శుభ్రం చేసుకోవచ్చని బృందం సిఫార్సు చేస్తోంది. వాటర్ ప్యూరిఫైయర్లలో ఉపయోగించే అతినీలలోహిత జెర్మిసైడల్ రేడియేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని గుమ్మం వద్దనే పెట్టుకోవాలని, అపుడు బయట నుంచి తీసుకొచ్చిన సరుకులు, డబ్బులను దాని కింద ఉంచి త్వరగా శుభ్రం చేసుకోవచ్చని తెలిపింది. కేవలం 30 నిమిషాల సమయంలో వైరస్ను అంతం చేస్తుందని పేర్కొంది. 30 నిమిషాలు శానిటైజ్ చేసిన తర్వాత ఓ పది నిమిషాలు చల్లబడే వరకు అలాగే వదిలేయాలని చెప్పింది. అంతేకాదు దీని ధర రూ.500 కన్నా తక్కువ ధరకే లభిస్తుందని కూడా స్పష్టం చేసింది. ఎలాంటి ఆందోళన లేకుండా, సులువుగా కరెన్సీ నోట్లతో సహా బయటి నుండి తీసుకువచ్చిన అన్ని వస్తువులను శుభ్రం చేసుకోవచ్చని ఐఐటీ రోపర్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ నరేష్ రాఖా ప్రకటించారు. (కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం) ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరిపోదు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నివారించాలంటే మరిన్ని జాగ్రత్తలు తప్పవని నరేష్ రాఖా సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది కూరగాయలను కూడా వేడి నీళ్లలో కడుగుతున్నారు. అయితే, డబ్బులను అలా కడగలేం కదా. అందుకే ఈ పరికరాన్ని తయారు చేశామని చెప్పారు. గుమ్మం దగ్గర. లేదా, ఇంటి లోపలికి రావడానికి ముందు బయట ఎక్కడైనా పెట్టుకుని తెచ్చుకున్న సరుకులను శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు. అయితే ట్రంక్ లోపల కాంతి హానికరం కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా చూడకూడదని,ప్రమాదమని హెచ్చరించారు. కాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం కరోనావైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 199కు పెరిగింది. 6,412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు గుడ్ న్యూస్ జియో కొత్త యాప్, రీచార్జ్ చేస్తే కమీషన్ -
పంచాయతీలకు ఊరట
సాక్షి, అనంతపురం: నిధుల్లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2018 నుంచి పెండింగ్లో ఉండిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2019–20 సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు కలిపి మొత్తం మూడు విడతలుగా రావాల్సి ఉండగా 2018–19 సంవత్సరానికి సంబంధించిన ఒక విడత నిధులు రూ.72,25,71,000 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గత టీడీపీ సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిరీ్వర్యం చేసింది. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లించగా.. గ్రామాల్లో రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులే రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు కావడంతో పంచాయతీలకు ఊరట వచ్చింది. నిధుల వ్యయం ఇలా.. జిల్లాలో మొత్తం 1,003 (ప్రస్తుతం 1,044) పంచాయతీలకు గాను జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. కాగా ఈ మొత్తం నిధులన్నీ తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 13,386 చేతిపంపులుండగా..చేతిపంపుల నిర్వహణకు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో చేతిపంపు నిర్వహణకు రూ.వెయ్యి కేటాయించారు. ఇక రక్షిత తాగునీటి అవసరాలకు రూ.42.27 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జిల్లా పరిషత్ ద్వారా ఖర్చు చేయనున్నారు. అంటే ఈ నిధులను పంచాయతీ నుంచి జిల్లా పరిషత్కు మళ్లించనున్నారు. తక్కిన నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు. -
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, హైదరాబాద్: పట్టణాల్లో పారిశుధ్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని, ఇందుకోసం పారిశుధ్య సిబ్బంది, వైద్య శాఖాధికారులతో కలిసి సమన్వయం చేసుకోవాలని తమ శాఖ అధికారులకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పట్టణంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసిన నేపథ్యంలో.. ఈ సమయంలో పట్టణాల్లో ఖాళీగా ఉన్న రోడ్లపైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో ప్రస్తుతం అసంఘటిత రంగ కార్మికుల ఉపాధి అవకాశాలకు కొన్ని ఇబ్బందులు ఏర్పడటంతో రూ.5 భోజనం (అన్నపూర్ణ కౌంటర్లు) కొనసాగించాలని, ఆయా కౌంటర్ల వద్ద గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇళ్లులేని వారిని ఆయా పట్టణాల్లోని నైట్షెల్టర్లకు తరలించాలని సూచించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన లేదా కరోనా వ్యాధి లక్షణాలున్న వారితో సన్నిహితంగా మెలిగి, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్న పౌరులను ఇళ్లకే పరిమితంచేస్తూ, వారిపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు. అలాగే, ఆయన పరిశ్రమలు, ఐటీ శాఖలపైనా సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో టెలిఫోన్లో మాట్లాడారు. ఆ ప్రాంతాల్లో నిరంతరం పారిశుధ్యం పారిశ్రామికవాడలు, ఐటీ పార్కుల్లో నిరంతరం పారిశుధ్య పనులను కొనసాగించాలని కేటీఆర్ ఆదేశించారు. ఇండస్ట్రియల్ లోకల్ అథారిటీలు ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. పారిశ్రామికవాడల్లో పనిచేసే కాంట్రాక్టు, రోజువారీ కూలీల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నియంత్రణ కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను ఉపయోగించేందుకు ముందుకురావాలని మంత్రి కేటీఆర్ కంపెనీలను కోరారు. పట్టణ ప్రజలు ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందని, ఈ డిమాండ్కు వీలుగా బ్యాండ్విడ్త్ను పెంచాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను మంత్రి కోరారు. వారి విషయంలో ఆలోచించండి.. లాక్డౌన్ నేపథ్యంలో అత్యవసర సేవలు, వివిధ రంగాల సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయని, వీరి విషయంలో పోలీసులు కొంత సానుకూలంగా వ్యవహరించేలా చూడాలని హోంమంత్రి మహమూద్ అలీతో పాటు డీజీపీ మహేందర్రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలు, వివిధ రంగాల సిబ్బంది మూవ్మెంట్ కోసం పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని వారిని కోరారు. ప్రస్తుతం సమాజమంతా ఆపత్కాలంలో ఉన్నందున లాక్డౌన్ నిబంధనలకు ప్రజలంతా సహకరించాలని కోరారు. -
కరోనా అలర్ట్ : మెట్రో రైళ్లలో శానిటేషన్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పట్ల ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు డీటీసీ బస్సులు, క్లస్టర్ బస్సులు,మెట్రో రైల్, ఆస్పత్రుల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. ఢిల్లీలో ఇప్పటివరకూ మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, ఒక కేసు పరిశీలనలో ఉందని చెప్పారు. కరోనా వైరస్ రోగుల కోసం 25 ఆస్పత్రుల్లో 168 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు. గత రెండు వారాల్లో విదేశాల నుంచి మీ చుట్టుపక్కల ఎవరైనా నగరానికి వచ్చినట్టు గమనిస్తే ప్రభుత్వానికి తెలపాలని నగరవాసులను కోరారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. విమానాశ్రయంలో ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వైరస్కు లోనవకుండా ఉండేందుకు ప్రజలు తరచూ సబ్బు నీటితో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. చదవండి : కరోనా ఎఫెక్ట్ : 16 రెట్లు పెంచేశారు.. -
నా మిసెస్కే ఫైన్ వేశా..!
సాక్షి, జనగామ: ‘పరిశుభ్రత పాటించని వారిపై ఫైన్ వేయాలి.. భయం లేక పోతే మార్పు రాదు.. ఇటీవల మా ఊరికి పోయిన.. ఊర్లో తిరిగిన.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయడంతో మొదట నా మిసెస్కే ఫైన్ వేశా.. అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామలో బుధవారం కలెక్టర్ నిఖిల అధ్యక్షతన జరిగిన ‘పల్లె ప్రగతి–పట్టణ ప్రగతి’ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. మంత్రుల కంటే కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉన్నాయి.. గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచ్, ఉప సర్పంచ్లపై వారు చర్యలు తీసుకుంటారు.. అధికారులే పని చేయకపోతే సీఎం కేసీఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు రూ.330 కోట్లను విడుదల చేస్తున్నామన్నారు. నాటే మొక్కల్లో 85 శాతం బతకాలని, లేక పోతే సర్పంచ్ల పదవి ఊడిపోతుందని హెచ్చరించారు. j -
ప్రగతి మాట...పల్లెబాట
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం–పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. పల్లె ప్రగతి రెండో విడతలోనూ దీనికే పెద్దపీట వేస్తోంది. సెప్టెంబర్లో 30 రోజుల గ్రామ ప్రణాళిక స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పల్లెసీమలను ప్రగతిబాట పట్టించాలని భావిస్తోంది. ఈనెల 2నుంచి 12వ తేదీవరకు రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగనుంది. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల నిర్వహణ, ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచే లా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనుంది. తొలి రోజు గ్రామ సభ నిర్వహించి.. మొదటి విడతలో చేపట్టిన పనులు, చేసిన చెల్లింపు వివరాలను ప్రజల ముందుంచనుంది. అలాగే సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వివిధ పద్దుల కింద ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, దాతల విరాళాల సమాచారాన్ని గ్రామస్తులకు చదివి వినిపించనుంది. 11 రోజులు పారిశుద్ధ్యం.. పల్లెప్రగతిలో భాగంగా 11 రోజులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. కూలిపోయిన ఇండ్లు, పాడుబడిన పశువుల కొట్టాలు, పిచ్చిచెట్లను తొలగించాలని నిర్దేశించింది. పాఠశాలలు, సంతలు, రోడ్లను క్లీన్గా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించింది. పచ్చదనం పెంపొందించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శాశ్వత నర్సరీని ఏర్పాటు చేయాలని, అటవీశాఖ అధికారుల నుంచి సాంకేతిక సహకారం తీసుకోవాలని ఆదేశించింది. గ్రామ బడ్జెట్లో పదిశాతం విధిగా పచ్చదనం పెంచడానికి కేటాయించాలని స్పష్టం చేసింది. పల్లెప్రగతిలో భాగంగా పవర్వీక్ను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిపోయిన విద్యుత్ పనులు పూర్తి చేయాలని, వేలాడుతున్న, వదులుగా ఉన్న కరెంటు తీగలు, స్తంభాలను సవరించాలని సూచించింది. గ్రామాల్లో తప్పనిసరిగా ఎల్ఈడీ బల్బులు వినియోగించేలా చూడాలని పేర్కొంది. వార్షిక ప్రణాళిక తప్పనిసరి 2021 వార్షిక ప్రణాళిక రూపొందించి.. దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలని నిర్దేశించింది. అప్పులు, వేతనాలు, కరెంట్బిల్లుల చెల్లింపులను మదింపు చేయాలని, ఆస్తిపన్ను వసూలు, పన్ను పరిధిలోకి రాని ఇళ్లను గుర్తించడం, మొక్కలు నాటడం, స్మశానవాటికలు, డంపింగ్యార్డుల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధులను వినియోగించాలని స్పష్టం చేసింది. నిధుల సమీకరణకు ప్రభుత్వ కేటాయింపులేగాకుండా.. సీఎస్ఆర్ నిధి, దాతల నుంచి విరాళాలు సేకరించాలని సూచించింది. ప్రతి పల్లెకు ప్రత్యేకాధికారి పల్లె ప్రగతి కార్యక్రమం అమలుకు ప్రతి పంచాయతీకి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించారు. మండల స్థాయిలో మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) పర్యవేక్షకుడిగా వ్యవహరించనున్నారు. వీరికి అదనంగా జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయి. కాగా, ఈ సారి అఖిల భారత సర్వీసుల అధికారుల (ఏఐఎస్) సేవలను కూడా ప్రభుత్వం వినియోగించుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యేక అధికారులు (ఫ్లయింగ్ స్క్వాడ్)గా నియమించింది. 12 మండలాలకు ఒక అధికారిని నియమిస్తున్న ప్రభుత్వం.. సగటున రెండు పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించేలా రూట్మ్యాప్ తయారు చేసింది. ఏయే మండలాలను కేటాయించారనే సమాచారాన్ని చివరి నిమిషంలో తెలియజేయనుంది. ఈ అధికారులు విధిగా పంచాయతీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. అక్కడ జరుగుతున్న కార్యక్రమం తీరు, వైకుంఠధామం, శాశ్వత నర్సరీ, డంపింగ్ యార్డుల నిర్మాణం, నిర్వహణ ఇతర పనులను ప్రత్యక్షంగా పరిశీలించాల్సి వుంటుంది. అలాగే, తొలిదశలో గుర్తించిన పనులు, పనుల పురోగతి, ప్రస్తుతం చేపట్టిన పనులు, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపు, వార్షిక ప్రణాళిక అమలులో స్థానిక పాలకవర్గం పనితీరును మదింపు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో అలసత్వం వహించినట్టు తేలితే బాధ్యులైన అధికారులు, సర్పంచ్లపై చర్యలకు సిఫారసు చేసే అధికారాన్ని ఈ ప్రత్యేక బృందాలకు కట్టబెడుతోంది. -
జిల్లాలో వణికిస్తున్న వైరల్
‘సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో 943 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి కుటుంబంలోనూ ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు ఉన్నారు. చిన్నపాటి జ్వరంతో ఆరంభమై మరుసటి రోజుకే ఒక్కసారిగా ప్లేట్లెట్స్ పడిపోవటంతో చికిత్స కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. జ్వరం తగ్గినప్పటికీ ఒళ్లు, కీళ్ళ నొప్పులతో అనేక మంది బాధపడుతున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు వైద్యులు డెంగీ పేరు చెప్పి రోగులను దోచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, అమరావతి : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైరల్ జ్వరాలతో ప్రజలు వణికిపోతున్నాయి. పది రోజులుగా జిల్లాలో వైరల్ జ్వరాల తీవ్రత పెరిగింది. ఇటీవల జిల్లాలో పది మందికిపైగా జ్వరంతో చనిపోయారు. ముప్పాళ్ల మండలంలో ఎక్కువ మంది జ్వరాల బారిన పడ్డారు. కొంత మంది మాత్రం జ్వరం సోకగానే డెంగీ అని హడలిపోతున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడ డెంగీ మరణాలు నమోదు కాలేదని చెబుతున్నారు. అనధికారికంగా అయితే ఇటీవల వైరల్ జ్వరాల బారినపడి చనిపోయిన వారు డెంగీతోనే చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పల్లెల్లో జ్వరం రాగానే భయంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగు తీస్తున్నారు. డెంగీ జ్వరం బూచిగా చూపి ప్రైవేటు వైద్యులు భారీగా డబ్బులు గుంజుతున్నారు. వైరల్ జ్వరాలు సోకిన వెంటనే ప్రజలను చైతన్య పరచాల్సిన వైద్యాధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చాగంటివారిపాలెంలో రుద్రబాటి సత్యనారాయణ(75), కలగొట్ల నారాయణమ్మ(45), రాజారపు పేరమ్మ (65), మేడా నవీన్కుమార్ (5), నీలం కోటయ్య (70), కోటా కాశమ్మ (40), మొచర్ల మధు (6) మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది జ్వరాలతో మృతి చెందినట్లు అనుమానాలు ఉన్నాయి. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు వైద్యాధికారుల లెక్కల ప్రకారం ఐదు వేల మందికిపైగా జ్వరాల బారిన పడి చికిత్స పొందారు. వీరి సంఖ్య అనధికారికంగా ఏడు వేలకుపైగా ఉండవచ్చు. మలేరియా జ్వరంతో 400 మంది, డెంగీ జ్వరంతో 500 మంది ఆస్పత్రి పాలయ్యారు. గుంటూరు నగరంలో పేరుగాంచిన సీనియర్ వైద్య నిపుణుడు సైతం ఇటీవల కాలంలో డెంగీ జ్వరంతో చనిపోవడం కలవరపాటుకు గురి చేసింది. పల్లెల్లో లోపించిన పారిశుద్ధ్యం ఇటీవల వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దీనికితోడు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా ఉండటంతో వారు పారిశుద్ధ్యంపై దృష్టి సారించడం లేదు. డ్రెయిన్లో సరిగా పూడిక తీయకపోవటంతో రోడ్లపైన మురుగు నీరు నిలుస్తోంది. గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లో మురికి నీరు నిల్వ ఉంటోంది. చెత్తా చెదారం సరిగా తొలగించకపోవటంతో దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరగటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేదు. ఫాంగింగ్ చేయటం లేదు. ఇలా చేస్తే వ్యాధులు రావు దోమల నియంత్రణ కోసం ఇంటి లోపల, బయట నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. వారానికి ఒకసారి నీటి నిల్వలు లేకుండా ఇళ్లలో ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలి. ఇంటి ఆవరణలో ఖాళీ కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, రోళ్లలో నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎయిర్ కూలర్లు, పూల కుండీలలో నీటిని మూడురోజులకు ఒకసారి మార్చాలి. ఓవర్హెడ్ ట్యాంక్లకు మూతలు బిగించటంతోపాటుగా వారానికి ఒకసారి నీటి గుంటలలో కిరోసిన్, మడ్డి ఆయిల్ చల్లించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. దోమ తెరలు తప్పనిసరిగా వాడాలి. జ్వరం రాగానే కంగారు పడకూడదు ఏ జ్వరమో తెలియకుండా ముందస్తుగా మాత్రలు వేసుకోకూకదు. మలేరియానా, డెంగీ జ్వరమా లేక వైరల్ ఫీవరా అనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవాలి. వైద్యుల సూచనల మేరకే మందులు వాడాలి. ఏ జ్వరమో తెలియక మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ప్రమాదం ఉంది. కాళ్ల నొప్పులు ఉన్నాయి జ్వరం తగ్గినా కాళ్ళు, కీళ్ళు నొప్పులు తగ్గటం లేదు. ఐదు రోజుల క్రితం జ్వరం వచ్చింది. స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నా. జ్వారం తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ కాళ్ల నొప్పులు తగ్గటం లేదు. – మధిర నాగమల్లేశ్వరి, చాగంటివారిపాలెం -
టాయిలెట్ కాలేజ్.. రికార్డు శిక్షణ
న్యూఢిల్లీ: పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇవ్వడంలో ఓ కళాశాల చరిత్ర సృష్టించింది. మహారాష్ట్రలోని హార్పిక్ వరల్డ్ టాయిలెట్ కళాశాల ఏకంగా 3200మందికి శిక్షణ ఇచ్చింది. భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఈ కళాశాల పారిశుధ్య కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తునే ప్రమాదాలకు గురవ్వకుండా అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యాలుగా కళాశాల మెనెజ్మెంట్ చెబుతుంది. ఈ కళాశాల ఆగస్టు 2018న స్థాపించబడింది. భారత్లో ఇదే మొదటి టాయిలెట్ కాలేజ్. బ్రిటన్కు చెందిన కన్య్జూమర్ గూడ్స్ మేజర్ రెకిట్ బెంకీసర్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సందర్భంగా బెంకీసర్ మాట్లాడుతూ.. తమ కళాశాల పారిశుధ్య కార్మికులకు శిక్షణ ఇస్తునే వంద శాతం స్థిరమైన ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన కార్మికులు జాతీయ, ప్రాంతీయ సంస్థలలో ఉపాధి పొందారని ఆయన గుర్తుచేశారు. ఈ కాలేజీలో 25నుంచి30 మంది కార్మికులను ఒక బ్యాచ్గా తీసుకుంటారు. రోజుకు మూడు గంటల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో, మహిళా కార్మికులకు మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు గంటల వరకు, పురుష కార్మికులకు నాలుగు నుంచి ఏడు గంటల వరకు శిక్షణ ఇస్తున్నట్లు కంపెనీ వారు తెలిపారు. అయితే, పారిశుధ్య కార్మికులకు అపారమైన నైపుణ్యాన్ని అందించామని, వారు సమాజానికి ఎంతో మేలు చేస్తారని కంపెనీ ఆశాభవాన్ని వ్యక్తం చేసింది. -
‘డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టండి’
సాక్షి, పాలకొల్లు: డెంగీ నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు అధికారులను ఆదేశించారు. సోమవారం మంత్రి పాలకొల్లు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ కుమార్ రాజును సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. పాలకొల్లు ప్రధాన మురుగు కాలువ పూడికతీత పనులు వేగవంతం చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ వాహనాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన మూడు రోజుల్లో పూడికతీత పూర్తి చేయాలన్నారు. పట్టణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. ఇటీవల విష జ్వరాల బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రితో మాట్లాడి సాయం అందేలా చేస్తామని తెలిపారు. మంత్రి వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, యడ్ల తాతాజీ తదితరులు ఉన్నారు. -
చిన్నారుల సంక్షేమంపై దృష్టి పెట్టండి
న్యూఢిల్లీ: చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ మహిళా ఎంపీలను కోరారు. బీజేపీకి చెందిన 30 మందికి పైగా మహిళా ఎంపీలతో శుక్రవారం ఆయన తన నివాసంలో భేటీ అయ్యారు. ప్రతి వారూ తమ నియోజకవర్గం పరిధిలోని చిన్నారుల ఆరోగ్యం, పారిశుధ్యం, పోషకాహారలోపం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి మహిళా ఎంపీ ఒక వ్యవస్థ వంటి వారని, ప్రజలతో సులభంగా మమేకం కాగలిగిన అద్భుత నైపుణ్యం మహిళల సొంతమన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధానితో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, అధికార పార్టీకి చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ జరుపుతున్న వరుస భేటీల్లో ఇది ఐదోది. ఇప్పటి వరకు ఆయన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యువ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల ద్వారా ఉభయ సభలకు చెందిన పార్టీలోని అన్ని వర్గాల ఎంపీలు ప్రధానితో పరిచయం చేసుకోవడంతోపాటు నేరుగా వివిధ అంశాలపై చర్చలు జరిపే అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. -
తడి, పొడిపై అవగాహన ఏది?
సాక్షి, కరీంనగర్కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరి« దిలో తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కరువైంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో తడి, పొడి చెత్తను వేరు చేసి డంపింగ్కు తరలించాలనే లక్ష్యం నీరుగారుతోంది. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసిన నగరపాలక సంస్థ ఆ తర్వాత పర్యవేక్షణ మరిచింది. తడిచెత్త, పొడి చెత్త రెండూ ఒకే డబ్బాల్లో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా చెత్తను ఎక్కడికక్కడే తగ్గించడానికి అమల్లోకి తీసుకొచ్చిన విధానం స త్ఫలితాలివ్వడం లేదు. ప్రతీ ఇంటికి రెండు డబ్బాలు ఇ చ్చి తడి, పొడి చెత్తను వేరు చేసి రిక్షాలకు ఇవ్వాలని ప్రచా రం చేశారు. రిక్షాల ద్వారా కూడా తడి, పొడి వేరు చేసేం దుకు వాటికి కూడా డబ్బాలను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వేరు చేయకపోవడంతో ఇబ్బందులు చెత్తను వేరు చేసేందుకు రెండు రకాల డబ్బాలు ఇచ్చినప్పటికీ ప్రజల నుంచి స్పందన రావడం లేదు. తడి, పొడి చెత్తను ఒకే డబ్బాలో వేసి రిక్షాలకు ఇస్తున్నారు. దీంతో గతంలో మాదిరిగానే చెత్త డంప్యార్డుకు చేరుతుంది. దీంతో డంపింగ్యార్డు పూర్తిగా నిండింది. ఇటీవల పలుమార్లు అగ్నిప్రమాదం జరిగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తడి, పొడి చెత్తను వేరుచేయడం ద్వారా డంప్యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. తడి చెత్తను వర్మీ కంపోస్టు యార్డుకు తరలించడం, పొడి చెత్తను పాత సామగ్రి కింద కా>ర్మికులు అమ్ముకునే అవకాశం కల్పించారు. ఇదంతా చెత్త సేకరణ సమయంలోనే చేయడం ద్వారా డంప్యార్డుకు చెత్త తగ్గుతోంది. తడి, పొడి ఒకే డబ్బాలో.. నగరంలోని కొన్ని డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించడానికి రిక్షాలకు డబ్బాలు అమర్చారు. ఇంటి యజమానుల దగ్గర ఉన్న వేర్వేరు డబ్బాల్లో తడి, పొడి చెత్తను వేసి రిక్షాల్లో ఉన్న డబ్బాలలోనే తడి, పొడి చెత్తను వేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త సేకరణకు నగరపాలక సంస్థ అన్ని డివిజన్లకు డబ్బాలు పంపిణీ చేశారు. ఒక్కొక్క డబ్బాకు రూ.120 ఖర్చుచేసి ఇస్తుండగా ఇంటి యజమానులు తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో స్వచ్ఛసర్వేక్షణ్ లక్ష్యం నీరుగారిపోతుంది. ఇప్పటికైనా అధికారులు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించి వేర్వేరుగా సేకరిస్తే డంప్యార్డుకు చెత్తను తగ్గించే అవకాశం ఉంది. -
‘మరుగు’న‘బడి’!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మరుగుదొడ్ల నిర్మాణంలో అడుగడుగునా అలసత్వం కనిపిస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు మల, మూత్ర విసర్జన కోసం ఇబ్బందిపడొద్దనే ఉద్దేశంతో ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణాలను చేపట్టింది. ముఖ్యంగా విద్యార్థినుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణాలను ప్రతి పాఠశాలలో చేపట్టారు. అయితే నిర్మాణాలు సకాలంలో పూర్తికాకపోవడంతో విద్యార్థినులు, ఉపాధ్యాయినులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాల్సిన ఆవశ్యకతను అధికారులు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 251 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గుర్తించిన పనులపై నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించారు. దీంతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఒక్కో మరుగుదొడ్డికి రూ.1.20లక్షల నుంచి రూ.1.50లక్షల వరకు మంజూరు చేసింది. ఇందులో విద్యాశాఖ 60శాతం, ఉపాధిహామీలో 40శాతం నిధులను వినియోగించాల్సి ఉంటుంది. తొమ్మిది శాతమే పూర్తి.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా.. అనుకున్న మేరకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేయలేకపోతున్నారు. అనేక పాఠశాలల్లో నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 251 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా.. కట్టడాలు మాత్రం పూర్తి కాలేదు. ఇప్పటివరకు కేవలం 94 పాఠశాలల్లో మాత్రమే మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభమైంది. ఇందులో 70 మరుగుదొడ్లు నిర్మాణంలో ఉండగా.. 24 నిర్మాణాలు పూర్తయ్యాయి. అంటే మొత్తం మరుగుదొడ్ల లక్ష్యంలో 9.56 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి ఎప్పటికి పూర్తవుతాయో కూడా తెలియని పరిస్థితి. నిర్మాణాలకు నిధులు విడుదలవుతాయో? లేదో? అనే సందేహంతో కాంట్రాక్టర్లు నిర్మాణాలపై దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. వీటి నిర్మాణం విషయంలో అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు శ్రద్ధ తీసుకుంటేనే నిర్మాణాలు ముందుకు సాగే అవకాశం ఉంది. మరుగుదొడ్లు లేకపోవడంతో.. పాఠశాలల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. మూత్ర విసర్జన చేయాలంటే సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. ఎస్ఎంసీలతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్లు మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేలా బాధ్యత తీసుకోవాల్సి ఉంది. పలుచోట్ల గతంలో సర్పంచ్లు కూడా కాంట్రాక్టర్లుగా వ్యవహరించగా.. వీరి పరిధిలోని నిర్మాణాలు ముందుకు సాగలేదు. పలు పాఠశాలల్లో నత్తనడకన.. జిల్లాలోని పలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తిరుమలాయపాలెం మండలంలోని పాఠశాలల్లో 12 మరుగుదొడ్లు మంజూరయ్యాయి. అయితే ఇక్కడ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు. ఖమ్మం రూరల్ మండలంలో 10 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. కారేపల్లి మండలంలో 12 మరుగుదొడ్లు మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. నేలకొండపల్లిలో 10 మంజూరు కాగా.. రెండు మాత్రమే ప్రారంభమయ్యాయి. కామేపల్లిలో 16 మంజూరు కాగా.. ఒకటి మాత్రమే ప్రారంభమైంది. ఖమ్మం అర్బన్లో 17 మంజూరు కాగా.. ఒక్కటి మాత్రమే ప్రారంభమైంది. త్వరితగతిన పూర్తి చేయిస్తాం.. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఉపాధిహామీ సిబ్బంది మరుగుదొడ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభం కాని వాటిపై దృష్టి కేంద్రీకరించి త్వరితగతిన పనులు ప్రారంభించి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – మదన్మోహన్, జిల్లా విద్యాశాఖాధికారి -
కంపుకొడుతున్న గ్రామాలు
సాక్షి, కొత్తూరు : ప్రత్యేకాధికారుల పాలనలోనూ పంచాయతీల్లో ప్రత్యేకత కానరావడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీల్లో పూడికలు, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. అంటు రోగాలు వ్యాపిస్తాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపుకొడుతున్న గ్రామాలు కొత్తూరు మండలంలో మండల కేంద్రంతో పాటు నివగాం, దిమిలి, పారాపురం, కలిగాం అఫీషియల్ కాలనీ, ఎన్ఎన్ కాలనీతో పాటు మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. ఎల్.ఎన్.పేట మండలంలో ఎల్ఎన్పేట, యంబరాం, గొట్టిపల్లి, దబ్బపాడు తదితర గ్రామాల్లో మురుగుకాలువల్లో పూడిక తీతపనులు చేపట్టకపోవడంతో వీధుల్లో మురుగునీరు ప్రవహిస్తోంది. హిరమండలం మండలంలో రెల్లివలస, పిండ్రువాడ, హిరమండలం, మహలక్ష్మీపురం తదితర గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. మెళియాపుట్టి మండలంలో చాపర, చీపురుపల్లి, గొప్పిలి గ్రామాల్లో ఆరు నెలలుగా పారిశుద్ధ్య పనులు చేపట్టలేదు. పాతపట్నం మండలంలో మండల కేంద్రంతో పాటు ఏఎస్ కవిటి, నల్లబొంతు, బూరగాంతో పాటు మరికొన్ని గ్రామాల్లో అపారిశుద్ధ్యం అలముకుంది. స్పందించని అధికారయంత్రాంగం పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తికావడంతో వారిస్థానంలో ప్రత్యేకాధికారులను నియమించారు. అయితే పంచాయతీ నిధులు ఖర్చు చేసేందుకు వారికి పూర్తిస్తాయిలో అధికారాలు ఇవ్వకపోవడంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో మురుగు కాలువల్లో పూడికలు పేరుకుపోయాయి, వీధుల్లో చెత్తకుప్పలు దర్శనమిసుతన్నాయి. దుర్గంధం, దోమలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. అయినా అధికారులు, పాలకుల్లో స్పందన లేకపోవడం దారుణం. నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు స్వచ్ఛభారత్ లక్ష్యంలో భాగంగా అన్ని పంచాయతీల్లో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను నిర్మించారు. గ్రామాల్లోని చెత్తను సేకరించి ఆయా కేంద్రాలకు తరలించేందుకు ప్రతీ పంచాయతీకి చెత్త సేకరణ రిక్షాలు కేటాయించారు. అయితే వాటిని ఇప్పటి వరకు వినియోగించిన దాఖలాలు లేవు. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన రిక్షాలు మూలకు చేరాయి. రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన చెత్తశుద్ధి కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బోరు చుట్టూ మురుగు మంచినీటి బోరు చుట్టూ మురుగునీరు చేరడంతో బోరుకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. తాగునీరు కలుషితమవుతోంది. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. – బొమ్మాలి నగేష్, కొత్తూరు రోగాల బారిన పడుతున్నాం మురుగుకాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో ఇళ్ల ముందు మురుగు నిల్వ ఉంటోంది. దుర్గంధంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయి. రోగాల బారిన పడుతున్నాం. కూలి డబ్బులు మందులకే సరిపోతున్నాయి. – పి.రాజేశ్వరి, బీసీ కాలనీ, కొత్తూరు ఇళ్లలో ఉండలేకపోతున్నాం మురుగుకాలువలు నిండిపోవడంతో రోడ్డుపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. వర్షం కురిస్తే మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. దుర్గంధం వెదజల్లుతుండడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నాం. – కొయిలాపు రాజారావు, కొత్తూరు ఇళ్ల ముందు నిల్వ ఉంటోంది కాలువల్లో పూడికలు తొలగించకపోవడంతో ఇళ్ల ముందు మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో ఇంట్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మేమే కాలువలను శుభ్రం చేసుకోవాల్సి వస్తోంది. – నిద్దాన లక్ష్మమ్మ, రెల్లి వీధి పారిశుద్ధ్య పనులు చేపడతాం మండలంలోని పలు పంచాయతీల్లో పారిశుద్ధ్యం లోపించినట్లు గుర్తించాం. వెంటనే ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అక్కడి సిబ్బందికి ఆదేశించాం. అన్ని పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. – నారాయణమూర్తి, ఈవోపీఆర్డీ, కొత్తూరు -
‘టాయిలెట్ చూడటానికి సగం ప్రపంచం తిరిగాను’
సామాజిక మాధ్యమాల్లో పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకునే విధంగా పలు ఛాలెంజ్లు వైరల్ అవుతున్నాయి. అందులో టీబీటీ(త్రో బ్యాక్ థర్స్డే) ఛాలెంజ్ కూడా ఒకటి. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పలువురు ఈ ఛాలెంజ్లో పాల్గొని తమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ టీబీటీ చాలెంజ్లో భాగంగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఫొటోను షేర్ చేశారు. గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఒకరైప్పటికీ సాధారణ జీవితాన్ని గడపటానికి ఇష్టపడుతుంటారు. గతంలో ఓ టాయిలెట్ వద్ద తాను దిగిన ఫొటోను గేట్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ సమయంలో ఓ టాయిలెట్ను చూడటానికి తాను సగం ప్రపంచం తిరిగానని ఆయన పేర్కొన్నారు. గేట్స్ షేర్ చేసిన ఫొటోలోని టాయిలెట్ చెక్కతో చేసినది చూడటానికి అపరిశుభ్రంగా ఉంది. పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడాని బిల్ గేట్స్, ఆయన భార్య మెలిండా గేట్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీరు ‘రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్పో’ పేరుతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. View this post on Instagram #TBT to that time I traveled halfway across the world to look at a toilet. A post shared by Bill Gates (@thisisbillgates) on Feb 21, 2019 at 7:10am PST -
మహిళల ‘కష్టాలు’ తీర్చే బుల్లి సాధనం
న్యూఢిల్లీ: అపరిశుభ్రంగా ఉండే ప్రజా మరుగుదొడ్లు, వాష్రూమ్స్లో మహిళలు నిలబడే మూత్రవిసర్జన చేసేందుకు ఉపయోగపడే అత్యంత సురక్షితమైన చిన్న వస్తువును ఐఐటీ విద్యార్థులు తయారుచేశారు. వరల్డ్ టాయిలెట్æ డే ను పురస్కరించుకుని సోమవారం దాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తెచ్చారు. వాష్రూమ్లోని టాయిలెట్ సీటుకు తగలకుండా నిలబడే మూత్రవిసర్జన చేసేలా శాన్ఫీ(శానిటేషన్ ఫర్ ఫిమేల్)ని డిజైన్ చేశారు. దీని ధర కేవలం రూ.10. ఎయిమ్స్లో దీని ప్రయోగపరీక్షలు గతంలోనే పూర్తయ్యాయి. స్టాండప్ ఫర్ యువర్సెల్ఫ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా లక్ష శాంపిళ్లను ఉచితంగా పంపిణీచేయనున్నారు. ‘పనిమీద బయటికొచ్చిన సందర్భాల్లో ఇకపై మహిళలు మూత్రాన్ని ఉగ్గబట్టుకోవాల్సిన పనిలేదు. గర్భిణిలు, వికలాంగులు ఇలా మహిళలందరికీ అనువుగా దీన్ని తయారుచేశాం. రైల్వేస్టేషన్లు, రైళ్లు, బస్స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్లలో వాడేందుకు వీలుగా డిజైన్ చేశాం. శాన్ఫీ పైభాగం నీటికి తడిచిపోదు. ఒకసారి మాత్రమే వాడి పడేసే ఇది పర్యావరణహితం. రుతుస్రావ సమయంలోనూ దీన్ని వాడుకోవచ్చు’ అని అర్చిత్ వివరించారు. -
బిల్గేట్స్ వింత పని!
బీజింగ్: పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బిల్గేట్స్ వింత పని చేశారు. మానవ వ్యర్థాన్ని ఓ గాజు సీసాలో సదస్సు వేదికపైకి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్లో మంగళవారం చోటుచేసుకుంది. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ బీజింగ్లో ‘రీ ఇన్వెంటెడ్ టాయిలెట్ ఎక్స్పో’ పేరుతో పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఈ సందర్భంగా బిల్గేట్స్ మానవ వ్యర్థాల జాడీతో వేదికపైకి చేరుకుని మాట్లాడుతూ.. ‘ఆరోగ్యం, తినడానికి కావాల్సినంత ఆహారం.. ఒక మనిషికి కావాల్సింది ఇది మాత్రమే కాదు. ఈ జాబితాలో పరిశుభ్రమైన మరుగుదొడ్లను కూడా చేర్చాలి. ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవు. చైనా అధినేత షీ జిన్పింగ్ ప్రారంభించిన ‘టాయిలెట్ విప్లవం’తో దేశంలో పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగైంది. ఈ పథకం అద్భుతం’ అని తెలిపారు. -
సారు లేరు.. వదిలేశారు వీరు..!
విశాఖసిటీ: జీవీఎంసీ పరిధిలో పారిశుధ్యం పడకేసింది. వారం రోజుల కిందట వ్యక్తిగత సెలవుపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ వెళ్లిపోవడం, పలు కారణాల వల్ల ఇన్చార్జి కమిషనర్ మార్నింగ్ విజిట్స్ చేయకపోవడంతో పారిశుధ్యంపై సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై ముసురుకుంటున్న వ్యాధులు, విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా జ్వరాలతో ప్రజలు ఆందోళన చెందుతున్న తరుణంలో వారి ఆరోగ్యంపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన జీవీఎంసీ.. నిర్లక్ష్యం చూపుతోంది. కమిషనర్ సెలవులో ఉండడంతో అడిగేవారు లేరనేలా కొన్నిచోట్ల పారిశుధ్య సిబ్బంది వ్యవహరిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారంతో వీధులు కంపుకొడుతున్నాయి. పలువురు పారిశుధ్య కార్మికులు రోజువారీ పనులను నిర్వర్తిస్తుండగా.. మరికొన్ని చోట్ల డంపర్ బిన్లను కూడా ఖాళీ చేయని దుస్థితి ఏర్పడింది. ఇంకొన్ని చోట్ల ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులు రావట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను వీధుల్లో పారబోసేస్తున్నారు. ఇక కమిషనర్ రారంటగా..? కమిషనర్ హరినారాయణన్ మార్నింగ్ విజిట్ పేరుతో ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి అక్కడి పారిశుధ్య పరిస్థితులు, టౌన్ ప్లానింగ్, రోడ్లు, మంచినీటి సరఫరా, గ్రీనరీ, పార్కుల నిర్వహణ మొదలైన అంశాలను పర్యవేక్షించేవారు. ఈ నెల 14 నుంచి కమిషనర్ వ్యక్తిగత సెలవుపై తమిళనాడు వెళ్లారు. ఆయన స్థానంలో ఇన్చార్జి కమిషనర్గా వుడా వీసీ బసంత్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా హరినారాయణన్ బదిలీపై ఊహాగానాలు రావడం, అదే సమయంలో దాదాపు 15 రోజుల పాటు ఆయన సెలవులో వెళ్లడంతో వదంతులు జోరందుకున్నాయి. ఈ నెలాఖరున జరిగే ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్లో భాగంగా ఆయన బదిలీ అవుతున్నారనీ కార్పొరేషన్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్ జి.సృజన వస్తారని కొందరు, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ వస్తారని మరికొందరు, హరినారాయణన్ బదిలీ కావడం లేదని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తుండడంతో కార్పొరేషన్లో ఇదే హాట్ టాపిక్గా మారిపోయింది. ఒక వేళ ఆయన బదిలీ అయితే.. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ ఆడుతూ పాడుతూ పనిచేస్తామనే ఉద్దేశంతో కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రేటర్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. కమిషనర్ హరినారాయణన్ మాత్రం.. పలు పనులకు సంబంధించిన నివేదికలు మెయిల్స్, వాట్సప్ ద్వారా పంపించమని చెబుతూ పరిశీలనలు మాత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజులుగా నో విజిట్.. ఈ నెల 16 నుంచి కమిషనర్ స్థానంలో ఇన్చార్జి కమిషనర్గా బసంత్కుమార్ను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పలు పరిపాలన పరమైన కారణాల వల్ల కమిషనర్ షెడ్యూల్లో ఒకటైన మార్నింగ్ విజిట్ చేయలేకపోతున్నారు. దీంతో పరిశీలించేవారే ఉండరనే ఉద్దేశంతో పారిశుధ్య సిబ్బందితో పాటు పలు విభాగాల సిబ్బంది సైతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బాధ్యతగా వ్యవహరించాలి వారం రోజులుగా అధికారిక పనులపై పలు ప్రాంతాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అనంతరం పురపాలక శాఖ మంత్రి సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాలతో అధికారులంతా నిమగ్నమయ్యారు. మరోవైపు సీఎంహెచ్వో సహా పలువురు ప్రజారోగ్య శాఖాధికారులు గుంటూరులో జరిగిన సదస్సుల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇకపై గ్రేటర్ పరిధిలోని ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం. సిబ్బంది బాధ్యతగా వ్యవహరించి పనిచేయాలి. అప్పుడే నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉంచగలం.– పట్నాల బసంత్కుమార్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ -
‘చెత్త’ కష్టాలు
నిజాంసాగర్(జుక్కల్) : పరిసరాల పరిశుభ్రత, సం పూర్ణ పారిశుధ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రా ధాన్యత ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులకు చెత్తపై చిత్తశుద్ధి కరువైంది. ఇంటింటా వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామాలు సాధ్యమంటున్నా అమలులో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జనావాసాలు, కాలనీల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. చెత్త తరలింపు కోసం రిక్షాలు, చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్యార్డు లు ఊరురా వృథాగా మారుతున్నాయి. ఉపాధి నిధులు డంపింగ్ యార్డుల పాలు.. ‘పల్లె సీమలను పట్టుగొమ్మలుగా నిలపాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతపై దృష్టి సారించాయి. అందులో భాగంగా జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలు, ఆయా గ్రామాల్లో చెత్త నిల్వల కోసం డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. తద్వారా జిల్లాలో 314 గ్రామాల్లో డంపింగ్ యార్డుల తవ్వకానికి ఉపాధి హామీ పథకం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులను ఉపాధి కూలీలతో తవ్వించారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో, చెత్తపై సమరానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్క డంపింగ్ యార్డు తవ్వకానికి ఉపాధి పథకం కింద రూ.1.7 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డుల్లోకి చెత్తను తరలించేవారు గ్రామ పంచాయతీల్లో కరువయ్యారు. దీంతో ఆయా గ్రామ శివారు ప్రాంతాల్లో, కాలనీలు, జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండటంతో వీధులు అపరిశుబ్రంగా మారాయి. మురికి కాలువల్లో నుంచి తీసిన చెత్తను రోడ్లపై పారేయడంతో కాలనీలు దుర్గంధంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్ యార్డులు వృథాగా మారాయి. తద్వారా గ్రామాల్లో తవ్విన డంపింగ్ యార్డులు సైతం కనుమరగవుతున్నాయి. మూలనపడ్డ రిక్షాలు.. జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది చెత్తరిక్షాలను సరఫరా చేసింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మూడు చొప్పున మూడు చక్రాల చెత్త రిక్షాలను సరఫరా చేసినా చె త్తను తరలిం చేసిబ్బంది లేకపోవడంతో రిక్షాలు మూలనపడ్డాయి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి పట్టణాలు, మండల కేంద్రాల్లో తప్ప మిగతా గ్రామ పంచాయతీల్లో చెత్తరిక్షాలను ఉపయోగించిన దాఖలాలు కన్పించవు. వందశాతం సంపూర్ణ పారిశుధ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ఒక్కొక్క పంచాయతీకి మూడు చెత్తరిక్షాలను సరఫరా చేశారు. గ్రామ పంచాయతీల్లో సరిౖన సిబ్బంది లేకపోవడంతో చెత్తరిక్షాలు ఉపయోగం లేక తుప్పుపడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. అధికారులు ఇకనైనా స్పందించి చెత్తరిక్షాలు, డంపింగ్ యార్డులను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎక్కడి చెత్త అక్కడే..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా చెత్త తొలగింపు పనులు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉన్నాయి. జాతరకు వచ్చిన భక్తులు పడేసిన ప్లాస్టిక్ గ్లాజులు, పేపర్లు, వ్యర్థాలు పంట పొలాల్లో పేరుకుపోయాయి. ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేసిన రాజమండ్రి కార్మికులు.. జాతర ముగిసిన తర్వాత వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అరకోర కూలీలతో చెత్తను తొలగించడం సాధ్యం కావడం లేదు. గత జాతర కంటే ఈసారి పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేస్తామనుకున్న అధికారులు అంచనాలు తలకిందులయ్యేలా ఉంది. నామమంత్రంగా పనులు చేపట్టి చివరికి చేత్తులెత్తేస్తారేమోననే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలో రైతులు పంట పొలాల్లో చెత్తాచెదారం తొలగించపోవడంతో పశు వుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. జాతర సందర్భంగా పాడి రైతులు జాగ్రత్త తీసుకోవాలని పశువైద్యులు సూచించారు. ఈ మేరకు జాతర ముందు నుంచి ఇప్పటికి 20 రోజుల పాటు ఇళ్లలోనే పశువులను కట్టేస్తున్నారు. ఎక్కువ రోజులు పశువులను కట్టేయం వల్ల అవి అనారోగ్యానికి గురియ్యే ప్రమాదం ఉందని యాజమానులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా చెత్త తొలగింపునకు చర్యలు తీసుకోవాలని, లేకుంటే పశువులను బయటకు వదిలితే ప్లాస్టిక్ పేపర్లు తిని వ్యాధుల బారిన పడతాయని రైతులు చెబుతున్నారు. గ్రామాల్లో దుర్గంధం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. జాతర ముగిసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చెత్తను తొలగించ లేదు. దీంతో నార్లాపూర్, వెంగ్లాపూర్ గ్రామాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోందని అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కలుషిత వాతావరణంతో వ్యాధుల వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కూలీల సంఖ్యను పెంచి చెత్తను తొలగించాల్సిన అవసరం ఉంది. సరిపడా కూలీలు లేక.. మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, ఊరట్టం, కొత్తూరు, నార్లాపూర్, వెంగ్లాపూర్ గ్రామాల్లోని పంట పొలాలు చెత్తాచెదారంతో పరుచుకున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ నాలుగు రోజుల పాటు పారిశుద్ధ్య పనులు చేశారు. తల్లుల వనప్రవేశం అనంతరం వారిని పంపించారు. జాతర సమయంలో వీరి అవసరం ఎంత ఉందో జాతర తర్వాత కూడా అంతే ఉంటుంది. అయితే రాజమండ్రి కార్మికులు వెళ్లడంతో స్థానిక కూలీలతో చెత్తను సేకరించడం సాధ్యం కావడం లేదు. ప్రస్తుత మేడారం, రెడ్డిగూడెం గ్రామాల్లో మాత్రమే పనులు చేస్తున్నారు. మేడారం నుంచి జంపన్న వాగు, కొత్తూరు, నార్లాపూర్ వరకు పంట పొలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. సరిపడా కూలీలు లేకపోడంతో చెత్త తొలగింపు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదని అధికారులే చెబుతుండడం గమనార్హం. వాసన భరించలేకపోతున్నాం భక్తులు పడేసిన చెత్తాచెదారం కూళ్లిపోయి దుర్వాసన వస్తోంది. బయటకు వెళ్తే చాలు ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి. జాతరకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలకుండా సౌకర్యాలు కల్పించిన అధికారులు.. స్థానిక గ్రామాల్లోని ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. – ఎనగంటి రాములు, మాజీ ఎంపీపీ -
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం
పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆదాయం వచ్చే పనులపై చూపుతున్న శ్రద్ధ పారిశుద్ధ్యం మెరుగుపై కనబరచడం లేదు. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వరాల బారిన పడుతున్నారు. అనంతపురం సిటీ: సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. విషజ్వరాలు, డెంగీ, అతిసార తదితర జబ్బులతో రోగులు విలవిలలాడుతున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో రోజుకు రెండు వేల దాకా రోగులు ఇన్పేషెంట్లుగా వైద్యం చేయించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షపునీరు ఎక్కడికక్కడ నిలుస్తోంది. రోజుల తరబడి అలాగే నిల్వ ఉండటంతో మురికిగుంటలుగా తయారవుతున్నాయి. మరోవైపు డ్రెయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం లేదు. ఏ వీధికెళ్లినా చెత్తదిబ్బలు కనిపిస్తూనే ఉన్నాయి. అపరిశుభ్రత కారణంగా దోమల బెడద అధికమైంది. పగలంతా ఈగలు, రాత్రి అయితే దోమల మోతతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. గ్రామకార్యదర్శుల కొరత జిల్లాలో 1003 పంచాయతీలను 572 క్లస్టర్లుగా విభజించారు. 330 మంది గ్రామ కార్యదర్శులు ఉన్నారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన మరో 98 మంది కార్యదర్శులు ఉన్నారు. 575 మంది గ్రామ కార్యదర్శులను నియమించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంత వరకు పట్టించుకోలేదు. గ్రామ కార్యదర్శుల కొరత కారణంగా ఉన్న వారు అదనపు పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్యంపై చిన్నచూపు గ్రామపంచాయతీల ఆదాయంలో 30 శాతం పారిశుద్ధ్య పనులకు వెచ్చించాలి. డ్రెయినేజీలో పూడికతీత, చెత్తదిబ్బల తొలగింపు, మురికికుంటల పూడ్చివేతతోపాటు దోమల నివారణకు గంబూషియా చేపలను వదిలి, వేస్ట్ ఆయిల్, ఇతర రసాయనాలు చల్లి, ఫాగింగ్ తదితర కార్యక్రమాలు చేపట్టాలి. అయితే జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ఈ పనులేవీ జరగడం లేదు. ఆదాయం తెచ్చి పెట్టే సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, వీధిలైట్ల ఏర్పాటు పనులు తప్ప పారిశుద్ధ్యాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనికితోడు పదేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించలేదు. 26 మేజర్పంచాయతీల్లో కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. మైనర్ పంచాయతీల్లో ఆ ఊసే లేదు. దీంతో గ్రామాల్లో ఎక్కడా చూసినా అపరిశుభ్రత తాండవిస్తోంది. కనీసం దోమలు నివారించేందుకు, దుర్వాసనలు రాకుండా ఉండేందుకు వాడే బ్లీచింగ్ పౌడర్, సున్నం కొనుగోలు చేయడంలో కూడా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మెరుగైన సేవలందిస్తున్నాం వర్షాల కారణంగా పరిస్థితి మొదట దయనీయంగా ఉన్నా.. కలెక్టర్ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మెరుగైన సేవలందించాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సమస్యను అధిగమించడానికి ఎంపీడీఓలు, విస్తరణాధికారులతో పాటు అన్ని శాఖల అధికారులూ సహకరించారు. ఇక కార్యదర్శుల కొరత విషయం ఈనాటిది కాదు...చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి గ్రామాలను చక్కదిద్దుతాం. – సుధాకర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి -
పద్మశ్రీ వనజీవి రామయ్యకు ప్రధాని మోదీ లేఖ
ఖమ్మం రూరల్: స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి సహకరించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ పద్మశ్రీ వనజీవి రామయ్యను కోరారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి వాసి వనజీవి రామయ్యకు పీఎంవో నుంచి ప్రధాని సంతకంతో కూడిన లేఖ అందింది. లేఖలో ‘స్వచ్ఛత, పారిశుధ్యం కోసం మహాత్మా గాంధీ ఎంతో పాటుపడ్డారు. గాంధీ కలలను స్వాప్నికం చేసేందుకు దేశంలోని సామాజిక వేత్తల సహకారం కోరుతున్నాం. అందులో భాగంగానే రామయ్యా జీ.. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి మీ సహకారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన భారతావని కోసం కలసికట్టుగా.. సమిష్టిగా పాటుపడదాం. ఇదే మనం మహాత్మా గాంధీకి.. గాంధీ జయంతి రోజున ఇచ్చే కానుక అని’ రాసి ఉంది. -
‘పశ్చిమ’పై ‘డెంగీ’ పంజా
ఏలూరు : జిల్లాపై డెంగీ పంజా విసిరింది. ఇటీవల ఒక్కరోజే జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు డెంగీ జ్వరాల బారిన పడడం రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా జిల్లా అంతటా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ వర్షాల పట్ల ఒక పక్క హర్షం వ్యక్తం అవుతుంటే మరోపక్క నానాటికీ పెరుగుతున్న జ్వరాల వ్యాప్తితో ప్రజానీకం మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే జిల్లాను టైఫాయిడ్, మలేరియా తదితర జ్వరాలు పీడిస్తుండగా తాజాగా జిల్లాపై డెంగీ పంజా విసురుతోంది. పలువురిని ఆసుపత్రుల పాలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంత మాత్రంగా ఉండే పారిశుద్ధ్యం ఈ వర్షం ధాటికి మరింత అధ్వానంగా తయారైంది. దాంతో గ్రామీణులను వ్యాధుల భయం వణికిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలంలో పారిశుద్ధ్య లోపం కారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయి. వాస్తవానికి ఈ రోగాల నివారణకు కేవలం ఒక్క వైద్యారోగ్య శాఖాధికారులు మాత్రమే స్పందిస్తే సరిపోదు. గ్రామీణ నీటి సరఫరా శాఖ, పంచాయతీరాజ్, పురపాలక, వైద్య ఆరోగ్యశాఖలు సమన్వయంతో విధులు నిర్వహిస్తేనే ఈ రోగాలను ఆదిలోనే నివారించే అవకాశం ఉంది. శాఖల మధ్య కొరవడిన సమన్వయ లోపం జిల్లా వ్యాప్తంగా పంచాయతీ, గ్రామీణ తాగునీటి సరఫరా, పురపాలక, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే ఈ శాఖలు సమన్వయంతో కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు. దీంతో వర్షాకాలం వచ్చిందంటే వైద్యారోగ్యశా>ఖాధికారులదే లోపం అన్నట్లుగా ఇతర శాఖలు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి వర్షాకాలానికి అనుగుణంగా వైద్యారోగ్య శాఖాధికారులు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచారు. వైద్యులను, సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో కలుషిత తాగునీటి సమస్యలను పూర్తిగా తొలగించి పరిశుభ్రమైన తాగునీరు అందుతుందో లేదో అనే విషయాన్ని మానిటర్ చేయాలి. పైపులైన్లు లీకేజీ వంటి వాటిని పూర్తిస్థాయిలో నివారించాలి. అదే విధంగా గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు పరిశుభ్రమైన నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ శాఖలతో సమన్వయంతో పనిచేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యసేవలు అందించేందుకు నిరంతరం పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో మాత్రం శాఖల మధ్య సమన్వయం లోపించి ఎవరి బాధ వారే పడతారనే రీతిలో విధులు నిర్వహిస్తున్నారు. నెలల వ్యవధిలో మూడు డెంగీ కేసులు మే నెలలో పెదవేగి మండలం రాయన్నపాలెంలో ఒక డెంగీ కేసు నమోదు అయితే సోమవారం ఒక్కరోజే జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఒక డెంగీ కేసు, అదే విధంగా ఎల్బి చర్ల సారవ గ్రామంలో మరో డెంగీ కేసు నమోదైంది. పారిశుద్ధ్య లోపం కారణంగానే జిల్లాలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయనేది స్పష్టం అవుతోంది. వర్షాకాలం ప్రారంభంలోనే మూడు డెంగీ కేసులు నమోదయితే వర్షాలు మరింత ముదిరితే ఈ కేసులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్, కె.కోటేశ్వరి ఇప్పటికే డెంగీ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి అందుకు అనుగుణంగా వైద్య సేవలు అందించాలని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. అప్రమత్తం కాకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది జిల్లాలో ఆయాశాఖలు, ముఖ్యంగా వైద్యారోగ్యశాఖాధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా వ్యాప్తి చెందుతోంది. దీన్ని నివారించడంలో ఏజెన్సీలో చూపిస్తున్న శ్రద్ధ ఇతర ప్రాంతాల్లోనూ, ఇతర రోగాలపైనా చూపించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం జిల్లాలో ఒకే రోజు రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్యాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎవరైనా జ్వరపీడితులు ఉంటే వారి నుంచి రక్త నమూనాలు సేకరించి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆధికారులను సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. పాజిటివ్ కేసుల్లో బాధితులను జిల్లా ఆసుపత్రులకు తరలించి పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. తాగునీరు కలుషితం కాకుండా గ్రామీణ నీటి సరఫరా శాఖ, గ్రామ పంచాయతీలతో సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యంపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో జ్వరాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చాం. – డాక్టర్ కె. కోటేశ్వరి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి -
పారిశుద్ధ్యంపై ‘సమ్మె’ పిడుగు
– కాంట్రాక్ట్ కార్మికుల విధుల బహిష్కరణ – పట్టణాల్లో తొలగని చెత్త – కర్నూలులో ఇంటింటి చెత్త సేకరణకు బ్రేక్ కర్నూలు (టౌన్): జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులు చేపడుతున్న సమ్మె మొదటిరోజే ప్రభావం చూపింది. తమ డిమాండ్లు పరిస్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు కర్నూలు కార్పొరేషన్తో (570)పాటు నంద్యాల (200), ఆదోని (200) ,ఎమ్మిగనూరు (150), డోన్ (150), గూడూరు, నందికొట్కూరు (60), ఆళ్లగడ్డ, ఆత్మకూరు నగరపంచాయతీలలో పనిచేస్తున్న దాదాపు 1800 మంది మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. విధులను బహిష్కరించడంతో కర్నూలు నగరంతో పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. నగరంలో, 14 వార్డులు 1.50 లక్షల జనాభా ఉన్న కల్లూరు ఏరియాలో మెజారిటీగా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరంతా సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి ఇబ్బందిగా మారింది. కృష్ణానగర్, న్యూ కృష్ణానగర్, ఆదిత్యనగర్ కాలనీలలో ఇంటింటి చెత్తను సేకరించే కార్మికులు రాలేదు. దీంతో ఇంట్లో చెత్త బయటే పడేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాగే అనేక మున్సిపాల్టీలలోనే సమస్య ఇబ్బందిగా మారింది. 2014 సంవత్సరంలో ఏర్పడిన కొత్త మున్సిపాల్టీలు, నగరపంచాయతీల్లోను ఇదే పరిస్థితి. ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్టు పద్ధతిన పనిచేసే కార్మికులు ఉన్నారు. దీని వల్ల ఆయా మున్సిపాల్టీలో చెత్త సమస్య ప్రారంభమైంది. ప్రభుత్వం మరింత జాప్యం చేస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఇప్పటికే యూనియన్ నాయకులు ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేసిన విషయం విదితమే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకుంటే మున్సిపాల్టీలలో దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. -
ఖర్చు బారెడు ఫలితం జానెడు..
♦ పారిశుద్ధ్యం పేరుతో చేతివాటం ♦ నగరానికి డంపింగ్యార్డు కష్టాలు నెల్లూరు(పొగతోట): నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం మెరుగుకు కోట్లు ఖర్చుచేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండడంలేదు. నగరంలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలు దరశనమిస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో సరైన డంపింగ్యార్డు అందుబాటులో లేని కారణంగా నిత్యం టన్నుల కొద్ది చెత్త నగరంలో నిలిచిపోతోంది. అంతేకాక డంపింగ్యార్డు నగరానికి దూరంగా ఉండడంతో చెత్తను తరలించడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా నగరంలోని ఆచారివీధి, పొగతోట, వేదా యపాళెం ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శ నమిస్తున్నాయి. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంతాలి వద్ద 12 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్యార్డు ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను రెండు దశల్లో డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సుమారు 8 లక్షల మంది నివశిస్తున్నారు. దాదాపు 1.50 లక్షల నివాస గృహాలు ఉన్నాయి. వాటితో పాటు వందల సంఖ్యలో ఆస్పత్రులు, హోటళ్లు ఉన్నాయి. నిత్యం 350 ట న్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. కాగా చెత్తను తరలించేందుకు 20 టి ప్పర్లు, 4 ట్రాక్టర్లు, 54 ఆటోలు, 5 డంపర్లను కార్పొరేషన్ అధికారులు వినియోగిస్తున్నారు. 1500 మంది పారిశుద్ధ్య కార్మికులు నిత్యం పని చేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం రెండు డంపింగ్యార్డులను ఉపయోగిస్తున్నా రు. నగరంలో ఉత్పత్తయిన చెత్తను మొ దట వాహనాల ద్వారా బోడిగాడితోట లోని డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. అనంతరం అక్కడి నుంచి దొంతలిలో ఏర్పాటు చేసిన డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. ఇలా రెండు దశల్లో తరలిం చడం వల్ల ఖర్చులు అధికమవుతున్నా యి. వాహనాలకు డీజిల్, కార్మికులకు వేతనాలు తడిసి మోపెడవుతున్నాయి. కాగా చెత్త తరలింపులో అధికారులు చేతి వాటం ప్రదర్శించి నగదు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు పనికి రాకపోయిన వచ్చి నట్లు మస్టర్లు వేసి నగదు మింగేస్తున్నారు. అలాగే వినియోగించని వాహనాల నుంచి డీజిల్ డ్రా చేసి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తరలించిన తర్వాత బ్లీచింగ్ చేయడంలేదు. ఫలితంగా దోమలు ఉత్పత్తై ప్రజలు రోగాల భారిన పడుతున్నారు. గతంలో ఆల్లీపురం సమీపంలో బైపాసురోడ్డుకు పక్కన డంపింగ్యార్డు ఏర్పా టు చేశారు. దానిని ప్రస్తుతం వినియోగించడంలేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. అరంభంలో ఆటోల్లో మైకులు పెట్టి ప్రచారం చేసి చెత్త సేకరించారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంటింటా చెత్తను సేకరించే పారిశుద్ధ్య కార్మికులు గృహాల యాజమానుల నుంచి నెలకు రూ.30 నుంచి 50 వసూలు చేస్తున్నారు. చెత్తను తరలించే వాహనాలు పాతవి కావడంతో వాటిలో వేసిన చెత్త జారీ రోడ్డుపై పడిపోతోంది. -
డెంగీపై అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్ : ‘వర్షాకాలం ప్రారంభమైంది. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డెంగీ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి. డెంగీ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించండి’ అని కలెక్టర్ వీరపాండియన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి డెంగీ వ్యాధి, గృహ నిర్మాణం, నీరు - ప్రగతి పనులపై వేర్వేరుగా ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి నాల్గో శనివారం దోమలపై దండయాత్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజలను చైతన్యపర్చాలన్నారు. ఆర్ఎంపీలు జ్వరంతో వచ్చిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయాలని, అలా కాకుండా వైద్యం అందిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ గృహ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల తీరు సక్రమంగా లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 11,487 ఇళ్లు గ్రౌండింగ్ చేశారని, 2,285 మాత్రమే పూర్తి చేశారని, పట్టణాల్లో 2,590 గ్రౌండింగ్ చేశారని, 153 మాత్రమే పూర్తి చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామసభలు నిర్వహించి 2017 - 18, 2018 - 19 సంవత్సరాలకు లబ్ధిదారులను వారం రోజుల్లోగా ఎంపిక చేయాలని ఆదేశించారు. నీరు - ప్రగతి కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. టెండర్ల ద్వారా చేపట్టాల్సిన పనులకు సంబంధించి వారంలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సమావేశంలో జేసీ - 2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, హౌసింగ్ పీడీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- పారిశుద్ధ్య పరిరక్షణపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ - శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో సమావేశం కర్నూలు(టౌన్): పారిశుద్ధ్యలోపం తలెత్తితే అందుకు బాధ్యలైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ హెచ్చరించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించి పారిశుద్ధ్యలోపం తలెత్తేందుకు కారణమైతే ఐపీసీ 408, 409 సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఇందుకు సంబంధించి శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నగరపాలక ఆరోగ్యశాఖ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య సమస్యపై ఇటీవలి కాలంలో అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, మున్సిపల్ కార్మికులు సీరియస్గా తీసుకొని మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతిరోజు రెండు పూటల పనులు చేపడుతున్నట్లు మస్టర్లలో దొంగ సంతకాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్.. ఇకపై పనులను తానే స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. సక్రమంగా పనులు చేస్తే అభినందిస్తానని చెప్పిన ఆయన పనులు సరిగా లేకుంటే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. వార్డులవారీగా శానిటేషన్ వివరాలు తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, పర్యావరణ ఇంజినీర్ బాలసుబ్రమాణ్యం, శానిటరీ సూపర్ వైజర్ మురళీకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు సి.వి. రమణ, నాగరాజు, శ్రీనివాసులు, రమేష్బాబు, సూపరింటెండెంట్ గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్వచ్ఛతా మొబైల్ ఆప్ పోస్టర్ను విడుదల
కర్నూలు : పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛత మొబైల్ ఆప్ పోస్టర్ను కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎస్పీ ఆకే రవికృష్ణ గురువారం ఉదయం ఆవిష్కరించారు. స్వచ్ఛతా ఆప్ను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎక్కడైనా చెత్త ఉండే పరిసరాలను ఫొటో తీసి ఈ ఆప్ ద్వారా అప్లోడ్ చేస్తే సంబంధిత మున్సిపల్ అధికారులకు సమాచారం నేరుగా వెళ్తుందని ఎస్పీ తెలిపారు. ఆప్ ద్వారా చెత్త సమస్యలను తెలియజేయడం ద్వారా స్వచ్ఛ కర్నూలుకు సహకరించాలని కోరారు. స్వచ్ఛతా ఆప్ను ప్రతి కాలేజ్, ప్రభుత్వ కార్యాలయం, ఎన్జీఓల సహకారంతో ప్రచారం చేస్తామని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు, మేనేజర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్రీన్ మార్కెట్ యార్డుగా అభివృద్ధి
- శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు - శరవేగంగా ర్యాంపులు, షెడ్ల నిర్మాణం - వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు కర్నూలు (వైఎస్ఆర్సర్కిల్): పారిశుద్ధ్య చర్యలు చేపట్టి కర్నూలు మార్కెట్ యార్డును..రెండు నెలల్లో పచ్చదనంతో నింపాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖ రాష్ట్ర కమిషనర్ మల్లికార్జునరావు ఆదేశించారు. శనివారం ఉదయం ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు తదితర యార్డులను పరిశీలించిన అనంతరం సాయంత్రం ఆయన కర్నూలు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని కూలేందుకు సిద్ధంగా ఉన్న షెడ్లతో పాటు శిథిలావస్థలోని గోదాములను పరిశీలించారు. రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జంబో గోదామును తనిఖీ చేసి మార్చిలోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం లోపించిన మరుగుదొడ్లను, షెడ్ల వద్ద ఉన్న అపరిశుభ్రతను గమనించి.. అధికారులకు సూచనలు చేశారు. స్వచ్ఛ భారత్ పథకం కింద యార్డుల్లో పచ్చదనం వెల్లవిరిసేలా బృహత్తర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. అంగవైకల్యం కల్గిన రైతులు గోదాములోకి వెళ్లేలార్యాంపుల నిర్మాణం శరవేగంగా జరగాలని ఆదేశించారు.మార్కెట్ల శిథిల భవనాల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తామని హామీనిచ్చారు. కూలిని పెంచాలని హమాలీలు.. కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. వ్యాపారులు, రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి కమిషనర్ భరోసానిచ్చారు. మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు సుధాకర్, ఏడీఎం సత్యనారాయణ చౌదరి, యార్డు కార్యదర్శి నారాయణమూర్తి, సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరుబయటకే..!
రాష్ట్రంలో అధ్వానస్థితిలో ఉమ్మడి ఆదిలాబాద్ దిగువ నుంచి రెండోస్థానం నాలుగు జిల్లాల్లో సగటున 21.03 శాతం కుటుంబాలకే మరుగుదొడ్లు బహిరంగ విసర్జన లేని గ్రామాలు కేవలం 66 మంచిర్యాల : స్వచ్ఛభారత్ సంకల్పం మన ముందు చిన్నబోతోంది. పారిశుధ్యం తీరు పరిహసింపబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని జిల్లాల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉంది. మరుగుదొడ్లు లేక బహిరంగ మల, మూత్ర విసర్జనలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానం మనదే. 2012 సంవత్సరం వరకు మొత్తం కుటుంబాల్లో 10 శాతం మాత్రమే మరుగుదొడ్లతో అత్యంత దయనీయంగా ఉన్న గ్రామీణ ఆదిలాబాద్.. భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యతతో కొంత మెరుగైంది. అయినా రాష్ట్రంలోని పాత పది జిల్లాల పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలు, గ్రామాలు అధికంగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ నిలవడం దౌర్భగ్యం. కొత్తగా ఏర్పాటైన నాలుగు జిల్లాల సగటును లెక్కిస్తే కేవలం 21.03 శాతం కుటుంబాలకే ఈ సౌకర్యం ఉంది. ప్రోత్సాహకం పెంచినా.. మరుగుదొడ్డి అనేది కుటుంబ వ్యక్తిగత అవసరాల్లో ముఖ్యమైనది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకం కూడా అందిస్తోంది. గతంలో ఇచ్చే మొత్తాన్ని ఏకంగా రూ.12 వేలకు పెంచింది. ఇంత చేసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనునకబడే ఉంది. ఇప్పుడు నాలుగు జిల్లాలుగా విడిపోగా.. ఇకనైనా పారిశుధ్య ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత కళ్లకు కడుతోంది. మరోవైపు.. కొన్ని మండలాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్నా వినియోగించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ లెక్కన కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మంచిర్యాలలో 80.91 శాతం, నిర్మల్ జిల్లాలో 79.84 శాతం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 77.44 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 76.06 శాతం గ్రామీణులకు దొడ్లు లేవని గుర్తించారు. కాగా.. నాలుగు జిల్లాల్లో అభివృద్ధిలో మంచిర్యాల ముందు స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెపుతుండగా, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గ్రామాల విషయంలో కూడా ముందే ఉండడం గమనార్హం. గోండు తెగకు చెందిన గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్లు మిగతా రెండు జిల్లాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. పొరుగు జిల్లాలు కరీంనగర్, సిరిసిల్లలో వంద శాతం ఉమ్మడి ఆదిలాబాద్ను ఆనుకొని ఉన్న కరీంనగర్ మరుగుదొడ్ల వినియోగంలో ముందు వరుసలో ఉంది. విభజన తరువాత ఏర్పాటైన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని గ్రామాలన్నీ వంద శాతం మరుగుదొడ్లు ఉన్నవిగా గుర్తింపు పొందాయి. మంచిర్యాల పక్కన గోదావరి ఆవల ఉన్న పెద్దపల్లి జిల్లాలోని పల్లెల్లో సైతం 71.65 శాతం మరుగుదొడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మంగళవారం నాటికి 6,17, 297 గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగగా, మన నాలుగు జిల్లాలో మాత్రం ఆశించిన పురోగతి లేదు. ఇప్పటికైనా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకొని స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తే ‘అవతలికి’ పోయే బాధ ప్రజలకు తప్పుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినట్లవుతుంది. ఓడీఎఫ్ గ్రామాలు 66 వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు గల కుటుంబాలు నివసించే గ్రామాలను ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) గ్రామాలుగా చెబుతారు. రాష్ట్రంలోని 8,700 గ్రామ పంచాయతీల పరిధిలోని 10,969 గ్రామాల్లో 1,524 ఈ కేటగిరీలో చేరాయి. కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్లో మాత్రం 1,606 గ్రామాలకు గాను 66 గ్రామాలే ఓడీఎఫ్ స్థాయిని ప్రకటించుకున్నాయి. వీటిలో 31 గ్రామాలను స్వచ్ఛభారత్ మిషన్ తనిఖీ చేసి ఆమోదించింది. కరీంనగర్, సరిసిల్ల జిల్లాల స్థాయిలో వందశాతానికి చేరుకోవాలంటే ఎంత కాలం పడుతుందో చూడాలి. -
ఆర్థిక సంఘం నిధులు పారిశుధ్యానికే
జెడ్పీ సీఈఓ, డీపీఓ రామిరెడ్డి ఇస్కపాళెం(బుచ్చిరెడ్డిపాళెం): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధుల్లో 75 శాతం పారిశుధ్యానికి, 25 శాతం మాత్రమే సీసీ రోడ్లకు ఉపయోగించాలని జెడ్పీ సీఈఓ , జిల్లా పంచాయతీ అధికారి రామిరెడ్డి అన్నారు. మండలంలోని ఇస్కపాళెం పంచాయతీని గురువారం ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. సరిగా లేకపోవడంపై సక్రమంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుకు నోటీసు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 110 పంచాయతీ కార్యాలయాలకు భవనాలు మంజూరయ్యాయన్నారు. ఒక్కొక్క దానికి రూ.15 లక్షలు నిధులు కేటాయించారని, ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు జరుగుతాయన్నారు. జిల్లాలో 436 క్లస్టర్లకు గానూ 411 క్లస్టర్లకు పంచాయతీ కార్యదర్శులున్నారని, మిగతా 25 కార్యదర్శులు ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇస్కపాళెం పంచాయతీకి 14వ ఆర్థిక సంఘం కింద రూ.12 లక్షలు మంజూరయ్యాయని, అందులో రూ.3 లక్షలు విద్యుత్ బిల్లులు చెల్లించారన్నారు. పాఠశాలల వద్ద చెత్త ఉంచొద్దు పంచాయతీ పరిధిలోని పల్లిపాళెం ప్రాథమిక పాఠశాల వద్ద చెత్త తిష్టవేయడంపై ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోని విషయాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే తొలగించాలని సీఈఓ చెప్పారు. పాఠశాలల వద్ద చెత్త ఉంచొద్దని ఆయన ఎంపీడీఓ నరసింహారావుకు సూచించారు. నెలరోజుల్లో బుచ్చిరెడ్డిపాళెం పంచాయతీకి శాశ్వత కార్యదర్శిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నమ్మ పాల్గొన్నారు. -
ఈ ప్రశ్నలకేదీ జ‘బాబూ’
చంద్రబాబుకు జిల్లా వాసుల సూటి ప్రశ్న జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి అతీగతీ లేదని ఆవేదన దోమలపై దండయాత్ర సాధ్యమా? నిధుల్లేని పంచాయతీల మాటేమిటీ? ‘‘ఓ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అడగక్కుండానే.. అమలు కానీ ఎన్నో హామీలు జిల్లావాసులకు ఇచ్చారు. ట్రిపుల్ ఐటీ, పెట్రో వర్సిటీ అంటూ ఇలా కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపారు. తీరా ఎన్నికల్లో గెలిచాక.. ఇలా చేశారేంటి ‘‘మహానుబాబా’’!. నిధుల లేమితో పంచాయతీలు కొట్టుమిట్టాడుతుంటే, అరకొర జీతాలతో కార్మికులు అల్లల్లాడుతుంటే..‘‘పారిశుద్ధ్యంపై పోరాటం.. దోమలపై దండయాత్ర’’ అంటున్నారు. కాకినాడలో చెత్త వేసేందుకు డంపింగ్ యార్డు లేదు కాని.. దోమలపై యుద్ధమా! దానికి మీరు సిద్ధమా? ఇదేం ప్రచార ఆర్భాటం.’’ అంటూ జిల్లావాసులు విస్తుపోతున్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ∙ భానుగుడి(కాకినాడ) : నాలుగు లక్షల జనాభా ఉన్న నగరం. జిల్లా ప్రగతికి ఆయువుపట్టు. కోట్లాది రూపాయల వ్యాపారానికే కాదు. విద్య, వైద్యం, పర్యాటకం అన్నింటికీ కాకినాడ కేంద్రబిందువే. అయితేనేం పాలకుల నిర్లక్ష్యంతో ప్రగతి పథకంలో వెనుకబడింది. అధికార పార్టీ అలసత్వం కారణంగా ఆరు విలువైన ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కాకినాడలో ‘దోమలపై దండయాత్ర’కు అమరావతి నుంచి వస్తున్న సీఎం చంద్రబాబునాయుడు కాకినాడకు మంజూరైన కేంద్ర ప్రాజెక్టులపై పెదవి విప్పాలని ప్రజలు కోరుతున్నారు. తరలిన పెట్రో యునివర్సిటీకి బదులేదీ! 60లక్షలకు పైగా జనాభా ఉన్న జిల్లా, అపార చమురు నిక్షేపాలున్న ప్రాంతాన్ని కాదని పెట్రోవర్సిటీని విశాఖపట్నానికి తరలించారు. కేంద్రం ఎంపిక చేసిన ప్రాంతంలో కాకుండా సొంతనిర్ణయంతో ఒక కేంద్ర ప్రాజెక్టును తరలించడం సబబా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా ఇక్కడ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని, ఇక్కడి ప్రాంతం పెట్రో ఎడ్యుకేషనల్ హబ్గా మారే అవకాశం చేజార్చుకుందని ఆవేదన చెందుతున్నారు. పెట్రోవర్సిటీకి బదులుగా ఒక భారీ కేంద్రస్థాయి ప్రాజెక్టును కాకినాడ నగరానికి అందించి 2014 ఎన్నికల్లో పెట్రోవర్సిటీ ఏర్పాటు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి నిలుపుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మెయి¯ŒS రైల్వే లై¯ŒS ఆధునికీకరణ ఎప్పుడు? కాకినాడ–పిఠాపురం రూ.వందకోట్లతో మెయి¯ŒS రైల్వేలై¯ŒS ఆధునికీకరణ పనులు చేపడుతున్నామంటూ ఏడాది కాలంగా చెప్పుకొస్తున్నారే గానీ పనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. దీనికి కేంద్రప్రభుత్వం రూ.50కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.50కోట్లు ఇవ్వాల్సి ఉంది. స్మార్ట్సిటీలో భాగంగా రూ.కోట్లతో పోర్టు, సిటీ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తామంటూ ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న నేతలు ఆ పనులు పట్టాలెప్పుడు ఎక్కుతాయో చెప్పడం లేదు. పరిశీలన దశలోనే డీజీఎఫ్టీ, ఐఐపీ, ఎ¯ŒSఐఎఫ్టీ. విదేశీ వర్తకం కాకినాడ నుంచే నిర్వహించేందుకు డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫార¯ŒS ట్రేడ్(డిజీఎఫ్టీ), ప్యాకేజింగ్ రంగంలో విద్యార్థులకు అవకాశాలు కల్పించడానికి ఇండియ¯ŒS ఇనిస్టిట్యూట్ ఆఫ్ప్యాకేజింగ్(ఐఐపీ), ఫ్యాష¯ŒS రంగంలో ప్రగతికి గాను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాష¯ŒS టెక్నాలజీ( ఎ¯ŒSఐఎఫ్టీ)లను కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారే గాని ఏళ్లు గడుస్తున్నా పాలకుల ప్రకటనలే గాని పనులు జరగడం లేదు. ట్రిపుల్ ఐటీ ఏది బాబూ! రాష్ట్రవిభజన నేపథ్యంలో 2014లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ట్రిపుల్ ఐటీ మంజూరుచేసింది. రూ.180 కోట్లతో వంద ఎకరాల్లో తొండంగి మండలంలో దీనిని ఏర్పాటు చేసేందుకు జేఎ¯ŒSటీయూకే క్రీడామైదానంలో అప్పటి కేంద్రమంత్రి పళ్లంరాజు దీనికి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అయితే ఇది గడిచి రెండేళ్లయినా దీనిని పట్టించుకున్న నాథుడు లేడు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎంపీ తోట ఒక్కసారైనా పార్లమెంటులో ప్రస్తావించిన దాఖలాలు లేవు. దోమలపై దండయాత్రకు దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ సారైనా ట్రిపుల్ఐటీ గురించి ఏదో ఒక తీపి కబురు చెప్పాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిధులు లేకుండా నిర్మూలన ఎలా.. బోట్క్లబ్(కాకినాడ) : ప్రభుత్వం ప్రచారం కోసం రోజుకో కార్యక్రమం చేపట్టాలని పంచాయతీలపై రుద్దడంతో డబ్బులు లేని మైనర్ పంచాయతీలు నిత్యం అవస్థలు పడుతున్నాయి. ప్రభుత్వం దోమలపై దండయాత్ర పేరుతో నెలల తరబడి గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించడంతో ఇది సాధ్యం కాదని అంటున్నారు పంచాయత పాలకవర్గ సభ్యులు, అధికారులు. ప్రతిరోజూ గ్రామాల్లో చెత్త మొత్తం తరలించి డ్రైనేజీల్లో పూడిక తీయాలంటే కనీసం రూ.రెండు వేలకు పైగా ఖర్చవుతుందని, ఇప్పటికే జిల్లాలో సగానికి పైగా పంచాయతీల్లో నిధులు లేక కొట్టుమిట్టాడుతున్నాయని వారంటున్నారు. జిల్లాలో 1069 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 350కిపైగా మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో నిధులకు అంత ఇబ్బందులు లేవు. మిగిలిన 719 పంచాయతీల్లో సగానికి పైగా పంచాయతీల్లో డబ్బులు లేక అవస్థలు పడుతున్నాయి. పారిశుద్ధ్య పనులు చేసేందుకు కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇంటి పన్నుల మీద వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికే సరిపోతోంది. ఇక పారిశుద్ధ్య పనులు చేసే అవుట్సోర్సింగ్ ఇబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వడానికి, కచ్చా డ్రైయిన్లు తవ్వేందుకు, విద్యుత్దీపాల నిర్వహణకు డబ్బులు సరిపోని పరిస్థితి ఉంది. ప్రత్యేక డ్రైవ్ తమ వల్ల కాదు ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధా్యనికి ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రోజూ గ్రామాల్లోని రోడ్డుపై పేరుకుపోయిన చెత్త, చెదారం, డ్రై¯ŒSలోని పూడిక తీత, మంచినీటి పథకాలు శుభ్రం చేయడం, రోడ్లపై బ్లీచింగ్ చల్లడం వంటి పనులు చేయాలని సర్పంచ్లు, కార్యదర్శులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఉన్న సిబ్బందితో ఈ కార్యక్రమాలు చేయాలంటే కష్టం కావడంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు. వీరికి డబ్బులు ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శులు ఏమీ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. దండయాత్రసరే.. డంపింగ్యార్డు ఏది? కాకినాడ : మున్సిపాలిటీ నుంచి కార్పొరేష¯ŒSగా అప్గ్రేడ్ అవ్వడం, స్మార్ట్సిటీగా ఎంపికైన కాకినాడలో డంపింగ్యార్డు లేదు. అయితే దోమలపై దండయాత్ర పేరుతో కాకినాడ నగరంలో చేస్తున్న ప్రచార ఆర్భాటాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబే దోమలపై దండయాత్ర పేరుతో శనివారం కాకినాడ విచ్చేస్తున్న తీరు చూసి జనం విస్తుపోతున్నారు. అరకొర సిబ్బంది.. దాదాపు నాలుగు లక్షల జనాభా కలిగిన కాకినాడలో నగరపాలక సంస్థ అధికారుల సమాచారం మేరకు దాదాపు 724 కిలోమీటర్ల మేరకు రహదారులు విస్తరించి ఉన్నట్టు అంచనా. గతంలో రూపొందించిన నిబంధనల ప్రకారం కిలోమీటర్కు కనీసం ఇద్దరు కార్మికులు చొప్పున అంటే 1448 మంది పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కాకినాడలో 456 మంది రెగ్యులర్, మరో 400 మంది ప్రైవేటు కార్మికులు కలిపి 856 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 14 శానిటరీ సర్కిల్స్ పరిధిలో ఉన్న ఈ అరకొర సిబ్బందితోనే ఇంటింటికీ చెత్త సేకరణ, డ్రైన్లు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, చెత్తను తరలించడం వంటి అన్ని పనులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఇదంతా చేస్తే నిత్యం 220 టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే దీనిని తరలించడం మరో పెద్ద సమస్యగా ఏర్పడింది. నగర పరిధిలో ఎక్కడా డంపింగ్యార్డు లేకపోవడంతో లోతట్టు ప్రాంతాలు, ఖాళీస్థలాల్లో డంపింగ్ చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీంతో నగరంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, డ్రైన్లు సక్రమంగా శుభ్రం చేయకపోవడం వంటి కారణాలతో దోమల తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. ఫ్యాగింగ్, యాంటీలార్వా కెమికల్స్ వినియోగంతో కొంత మేరకు ప్రయత్నాలు చేస్తున్నా వాటి వల్ల ప్రజలకు అంతగా ప్రయోజనం కనిపించడంలేదు. కొత్త సిబ్బంది నియామకం లేదని, దాదాపు తేల్చేసిన ప్రభుత్వం 279 జీవో ద్వారా పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డంపింగ్యార్డు లేకుండా.. ఉన్న అరకొర సిబ్బందితో సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ చేయకుండా దోమలను ఎలా నియంత్రించగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి ఈ ప్రధాన సమస్యలపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. భూసేకరణ జరగాలి రైల్వే మార్గం నిర్మాణానికి సంబం«ధించి భూసేకరణ జరగాలి. రైల్వే, రెవెన్యు అ«ధికారులు ఈ పనులు వేగంగా నిర్వహించాలి. అటువంటివేమీ లేకుండా ని««దlులు అవిగో..ఇవిగో అని చెప్పడం సమంజసం కాదు. దీనిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకుని కాకినాడ– పిఠాపురం ప్రధాన రైలు మార్గం పనులు పూర్తిచేయించాలి. – డా.వై.డి.రామారావు ( కాకినాడ రైల్వే ప్రయాణికుల సంఘం అధ్యక్షుడు) మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటు చేయాలి ఏడాదికి 20మిలియ¯ŒS టన్నుల ఎగుమతి, దిగుమతులు జరుగుతూ 2500 మీటర్ల పొడవున్న కాకినాడ సీపోర్టు ప్రాంతంలో ఇప్పటికైనా ఒక మెరై¯ŒS వర్సిటీ లేకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి మెరై¯ŒS వర్సిటీ ఏర్పాటుకు కృషిచేయాలి. – దూసర్లపూడి రమణరాజు(సామాజిక వేత్త) -
డెంగీ పంజా!
* జిల్లాలో 15 మంది మృత్యువాత * జ్వరపీడితులతో ఆస్పత్రులు కిటకిట * గుంటూరు జీజీహెచ్లో ఒక్కరోజే 11 డెంగీ పాజిటివ్ కేసులు * దోమలపై దండయాత్ర ఆర్భాటమేనా! డెంగీ మహమ్మారి దెబ్బకు జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో జనం విషజ్వరాలతో బాధపడుతూ మంచాలపై మూలుగుతున్నారు. మీరెన్ని దండయాత్రలైనా చేసుకోండి... మా పని మేము కాని చేస్తామన్న రీతిలో దోమల దండు విజృంభిస్తోంది. జిల్లాలో డెంగీ బారిన పడి ఇప్పటివరకు సుమారు 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. సాక్షి, గుంటూరు : రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు 11,078 మంది జ్వర పీడితులకు రక్తపరీక్షలు చేయగా.. 1,546 మందికి డెంగీ పాజిటివ్ ఉన్నట్లు నిర్థారించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి అధికారికంగా ఇచ్చిన నివేదిక ఇది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ఈ ఏడాది జనవరి నుంచి నేటివరకు 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు మాత్రమే నమోదైనట్లు కాకి లెక్కలు చెబుతున్నారు. జిల్లాలో 169 హైరిస్క్ ప్రాంతాలను ప్రకటించినప్పటికీ డెంగీ ప్రబలకుండా తగు నివారణ చర్యలు చేపట్టడంలో వైద్య శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ఈ నెల 15వతేదీన 40 మంది జ్వరంతో బాధపడుతూ ఆపత్రిలో చేరగా.. 22 మందికి డెంగీ ఉన్నట్లు అనుమానించారు. వీరిలో 11 మందికి డెంగీ పాజిటివ్ ఉందని ధ్రువీకరించారు. 16న 11 డెంగీ పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎంఈకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఒక్క జీజీ హెచ్లోనే రోజుకు పదికి పైగా డెంగీ కేసులు నమోదవుతుంటే జిల్లా వ్యా ప్తంగా వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉం టుందో అర్థం చేసుకోవచ్చు. డెంగీని నిర్థారించాలంటే గుంటూరు వైద్య కళాశాలలో ఉన్న మైక్రోబయాలజీ వార్డుకు సీరంను పంపి ఎలిసా పరీక్ష చేయాలి. ఈ తతంగమంతా పూర్తయి డెంగీ నిర్థారణ కావాలంటే వారానికి పైగా పడుతుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ఈ ల్యాబ్కు సీరంను పంపేందుకు వెనుకాడుతున్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం.. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, గుంటూరు నగరంతో సహా అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దోమలపై దండయాత్ర పేరుతో హడావుడి చేయడం మినహా అధికారులు ఏమీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డెంగీ, మలేరియా సంచార వాహనాల పేరుతో మొబైల్ వాహనాలను తిప్పుతున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేయకపోవడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. డెంగీతో చనిపోయింది ఇద్దరే.. జిల్లాలో 175 డెంగీ కేసులు, 269 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు డెంగీతో తాడేపల్లి, ఫణిదం గ్రామాల్లో ఇద్దరు మాత్రమే చనిపోయారు. మెడాల్ సంస్థ స్ట్రిప్ ఆధారంగా డెంగీ పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఎలిసా టెస్ట్ ద్వారా మాత్రమే డెంగీని పక్కాగా నిర్థారించవచ్చు. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో డెంగీ నివారణ చర్యలు చేపట్టాం. – డాక్టర్ పద్మజారాణి, డీఎంహెచ్వో -
పారిశుద్ధ్యాన్ని ప్రజాస్వామీకరిద్దాం..!
పారిశుద్ధ్య పనిని పూర్తిగా యాంత్రీకరిస్తే తప్ప పాకీపనివారి కుల బాని సత్వం రూపుమాయదని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్ స్పష్టం చేశారు. గత 32 ఏళ్లుగా పాకీపని నిర్మూలనకై పోరాడుతున్న విల్సన్ కొన్ని లక్షలమంది పాకీ పనివారిని ఈ వృత్తిలోనుంచి విముక్తి చేయడమే ఈ దేశంలో అతి పెద్ద ప్రజాస్వామిక చర్య అని తేల్చి చెప్పారు. తరతరాలుగా సమాజంలోని ఒక కులం ప్రజల చేత ఇలాంటి దారుణమైన పని చేయించినం దుకు ప్రస్తుత ప్రభుత్వం, దేశ ప్రజలు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మన ఇంట్లో కంపు లేకుండా చేయడానికి, మనం శుభ్రంగా ఉండ టానికి ఏటా వందలాది పారిశుద్ధ్య కార్మికులు బలవుతున్నప్పటికీ ఈ దేశమూ, సమాజమూ, మన శాస్త్రజ్ఞులూ.. దీనిపై ఒక చిన్నపరిష్కారం కూడా ఇంకా ఎందుకు కనుగొనలేదని ప్రశ్నిస్తున్నారు. స్వచ్చ భారత్ కాదు.. మన ఆలోచనలను పూర్తిగా మార్చే భారత్ కావాలంటున్న బెజవాడ విల్సన్.. ఫ్రీలాన్స్ జర్నలిస్టు సునీతా రెడ్డికి ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు... గత 32 ఏళ్లుగా సాగుతున్న మీ సుదీర్ఘ పోరాటం ఎలా మొదలైంది? ఏదో చెయ్యాలని నేను ఏదీ మొదలుపెట్టలేదు. పథకం ప్రకారం చేయ లేదు. ఏదో ఒక సంఘటన జరగటం. దానికి స్పందించే మనస్తత్వం ఉండేది. ఎలా చెయ్యాలని తెలిసేది కాదు. పాకీ పనిచేసే తల్లిదండ్రులు, అన్న... బాల్యం నుంచి వారి కష్టం చూడటం... బలమైన జ్ఞాపకాలుగా మిగిలాయి. చాలా అవమానాలకు కూడా మీరు గురయ్యారని చెప్పారు! ఈ దేశంలో అంటరాని కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ అవమానాలకు చెందిన స్వీయ అనుభవాలు ఉంటాయి. కానీ వాటికి కారణం ఏమిటనేది అనుభవించేటప్పుడు అర్థం కాదు. నన్నెందుకు తక్కువ చేసి మాట్లాడతావు అనిపించేది. అయితే కులం పేరుతో దూషించే పిల్లలకు కూడా ఎందుకిలా దూషిస్తున్నాము, దూషిస్తే వాళ్లు ఎంత బాధపడతారు అనేది తెలీదు. కర్నా టకలో తమిళ ప్రభావం ఉండే కొన్ని ప్రాంతాల్లో మమ్మల్ని తోటి వాళ్లు అనే వారు. తోటి అని పిలిచినప్పుడు మిగతా వాళ్లంతా నవ్వేవాళ్లు. దీంతో ఆ పదం వెనుక ఏదో ఉంది అని అనుమానంతో బాధ కలిగేది. ఒకదశలో మీరు ఆత్మహత్య చేసుకోవాలని కూడా భావించినట్లున్నారు? నేను కుప్పం ప్రభుత్వ హాస్టల్లో చదువు పూర్తి చేసి కేజీఎఫ్కు తిరిగొ చ్చాక మావాళ్లు గంపల్లో మానవ మలాన్ని తీసుకుళ్లడం, బక్కెట్లో ముంచడం చూసినప్పుడు కాస్త కష్టమనిపించింది. ‘మీరెందుకు ఇలా తాగుతారు. తప్ప తాగి వచ్చి ఇంట్లో అందరినీ పట్టుకుని కొడతారు’ అని అడిగేవాణ్ణి. తాగితే అట్లా అవుతారని.. తాగటం తప్పు అనుకుని.. తాగొద్దు అని చెప్పేవాణ్ణి. అప్పుడు మా బంధువు కల్పించుకుని.. ‘నేనేం పని చేస్తున్నానో ఒకసారి చూడు.. నేనెందుకు తాగుతున్నానో నీకు అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో ఒకసారి వెళ్లి చూసాను. ఆరోజు నాకు చాలా బాధ అనిపించింది. ఎలా దాన్ని ప్రతిఘటించాలి అంటూ ఒకరోజు రాత్రి నేను ఆలోచించాను. ఎక్కడికైనా వెళ్లి చెబితే వింటారా మనమాట? పైగా చదువుకోలేదు. పేదరికం. ఎక్కణ్ణుంచైనా దుమికి చనిపోతే ఈ పరిస్థితి అంతమవుతుంది అనుకున్నాను. కాని చనిపోతే సమస్య పోదు కదా అని భావించి.. చావడం మార్గం కాదనుకున్నాను. మొదట్లో మీ వాళ్లలో చైతన్యం తీసుకురావడమే చాలా కష్టమైందట కదా? ఏదైనా ఒక పనిలో ఒక జాతినో, వ్యక్తులనో, సమూహాలనో చాలా శతా బ్దాల పాటు అందులోనే ఉంచి, అదే పని చేయాలని చెప్పి అలవాటు చేయిస్తే ఆ సమూహానికి, ఆ జాతికి ఆ పని తప్ప వేరే పని చేయాలన్నా, వేరే వృత్తిని చేయాలన్నా ధైర్యం ఉండదు. దానంతటికీ ఒక కారణం కులం. మనుషులు ఏం పని చేయాలి అనేది కులం నిర్దేశిస్తుంది. పుట్టుక, కులం, వృత్తి అనేది ఒక ట్రయాంగిల్ లాగా వచ్చేస్తాయి. ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని ఛేదించడం ఈ సమాజంలో చాలా కష్టం. పైగా వారికోసం ప్రదర్శించే సానుభూతి కూడా వాళ్లను అదే పనిని నిరంతరం చేసేలాగా, బానిసత్వంలోకి నెట్టేస్తుంది. సపాయి కర్మచారి ఆందోళన్వల్ల ఏదైనా సాధించగలిగారా? సపాయి కర్మచారి ఆందోళన్ను ఈ రోజుకీ రిజిస్టర్ చేయలేదు. ఆ సంస్థకు బ్యాంకు ఎకౌంట్లు, రిజిస్ట్రేషన్లు ఏం లేవు. దీన్ని ఒక ఉద్యమంగానే తీసుకొద్దాం అన్నారు. ఉద్యమం అంటే మొదట ప్రచారం చేయాలి. కేంపె యిన్ ఎగైనెస్ట్ స్కావెంజింగ్ అని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్ర, తమిళ నాడుల్లో చాలా చోట్లకు వెళ్లి పనిచేయడం మొదలెట్టిన తర్వాత సమస్య అర్థమయింది. మేం పాకీ పని ఆపేయమని చెప్పలేదు. ఎందుకీ పని చేస్తున్నా వని అడగలేదు. మేమెందుకు కేంపెయిన్ చేస్తున్నామో, మేమెవరమో చెప్పే వాళ్లం. చెప్పాల్సింది చెప్పి నేను దిగి వచ్చేటప్పుడు అక్కడున్న మహిళలు వచ్చి ఆపి, ‘అదెప్పుడో నీకు 1975, 80లలో జరిగిందని అనుకోవద్దు. నిన్న కూడా నా మనవరాలికి స్కూల్లో అలాగే జరిగింది. నేను స్కూలుకు పోను అని ఏడుస్తోంది. నువ్వు వచ్చి ఒక మాట చెప్పు’ అనేవారు. మనం ఏదైనా పోరాటం, ఉద్యమం చేయాలంటే ఇక్కడే చేయాలి అని అప్పుడే అనిపించేది. పాకీపనిని నిషేధిస్తూ 1993లో వచ్చిన చట్టం మీ ప్రచారం వల్లే వచ్చిందా? నాలాంటి చాలామంది కృషి ఫలితమది. 1990లో అంబేద్కర్ శత జయంతి సందర్భంగా దళితులకు సంబంధించి ఏమేం చేయవచ్చు అని ఆలో చిస్తూ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చినట్లు ఉంది. మేం కూడా పార్లమెం టుకు లేఖ రాశాం కానీ చట్టం రాసే పని మేం పెట్టుకోలేదు. వేరేవాళ్ల చేత మలమూత్రాలను శుభ్రం చేయిస్తే ఒక ఏడాది జైలు శిక్ష అని ఆ చట్టం కాపీలో రాశారు. దేశమంతా ఈ చట్టం గురించి చెబుతూ తిరగటం మొదలెట్టాం. ఆ చట్టం ఇప్పటికీ కాగితం మీదే ఉంది కాని ఎక్కడా అమలు కాలేదు కదా? 2013లో కొత్త చట్టం వచ్చేంతవరకు దాదాపు 20 ఏళ్లు ఆ చట్టం ఉనికిలో ఉంది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీసం దీని ప్రాతిపదికన ఒక్క కేసూ పెట్టలేదు. ఈ వృత్తిలో ఇంతమంది చనిపోతున్నా, ఇంత జరుగుతున్నా.. సాక్ష్యాలిచ్చినా.. కోర్టుకెళ్లినా.. ఎంత చెప్పినా మార్పు జరగలేదు. దళితులకు, పాకీపనివాళ్లకి, మహిళలకు, ఇతర మైనారిటీలకు చెందిన చట్టం తీసుకొస్తే, ఒక్క కేసు కూడా పోలీసు స్టేషన్లో నమోదు కాదు. 430 మంది కలెక్టర్లను కలిసి మాట్లాడినా ఫలితం లేదు. సపాయి కర్మచారి సంస్థను ఎప్పుడు స్థాపించారు? ఎవరు తోడ్పడ్డారు? 1982 నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాము. 93లో శంకరన్గారు రిటై రయ్యారు. పాల్ దివాకర్ çనన్ను తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. ప్రత్యేకంగా మళ్లీ వెళ్లి కలిశాక చాలా విషయాలు చెప్పారాయన. అంబే డ్కరును కూడా మరొక రూపంలో పరిచయం చేశారు. జీవితంలో ఇంకొక వైపు నేను చూసినట్లయింది. చూడ్డానికి మాలాగే సింపుల్గా ఉండే శంకరన్ చనిపోయేంతవరకు తానెవరైందీ నాకు చెప్పలేదు. ‘ఐ విల్ బి విత్ యు’ అన్నారు అంతే. 2010 అక్టోబర్ 7న ఆయన చనిపోయారు. సఫాయి కర్మచారి ఉద్యమానికి ఆయన చివరివరకూ అండగా నిలిచారు. సుప్రీంకోర్టులో పాకీపనికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు కదా? అవునండీ, 1993లో చట్టం వస్తే 2003లో పిల్ వేశాం. నేనెప్పుడూ అను కుంటాను. సపాయి కర్మచారీ ఆందోళన అనేది కేవలం పాకీపనికో మరో దానికో సంబంధించినది మాత్రమే కాదు. దేశంలోని అనేక వ్యవస్థలను ప్రజా స్వామీకరించడం కూడా ఒక బాధ్యతగా మామీద ఉండేది. మేం కోర్టులను ఆశ్రయించడం కూడా మనకున్న హక్కును కాపాడుకోవడానికే అనుకునే వాళ్లం. కోర్టు ముందు అందరూ సమానులే అనిపించింది. మెగసెసె అవార్డు ఇస్తామని ప్రతిపాదిస్తే వద్దన్నారట? రామన్ మెగెసెసే అవార్డు నాకు ఇవ్వకముందు వారినుంచే నేరుగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరిదో అని వదిలేసాను. కొన్ని రోజుల తర్వాత మా ఆఫీసుకే ఆమె ఫోన్ చేసి తన కాల్ని రిసీవ్ చేసుకోవాలని, ఇది సపాయి కర్మచారీ ఆందోళన్కు దాని భవిష్యత్తుకు సహాయపడుతుంది అని ఆమె ఇంగ్లీషులో చెప్పిందట. తర్వాత నేను వారి కాల్ అందుకున్నాను. అది రామన్ మెగసెసె ఫౌండేషన్ డైరెక్టర్ నుంచి వచ్చిన కాల్. మీకు ఈసారి మెగసెసె అవార్డు ఇవ్వాలని మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు అని చెబితే నాకు అవసరం లేదన్నాను. మీరు చేస్తున్న పని వివరాలు నా వద్ద ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎవరు చేయగలరు అని చెప్పారామె. కానీ నాకు మీ అవార్డు వద్దు. అవసరమైతే మా బోర్డు సభ్యులకు చెబుతాను అని చెప్పాను. తర్వాత వరుసగా మరో రెండు రోజులు ఆమె కాల్ చేసింది. ఇక తప్ప దనుకుని మా వాళ్లకు విషయం చెప్పాను. ఈలోగానే వాళ్లు ఏవో పత్రాలు పంపి పూర్తి చేసి పంపమన్నారు. నేనయితే ఏవీ పంపలేదు. 27వ తారీకున వారు నేరుగా ప్రకటించేశారు. నేనెందుకు ఈ అవార్డును మొదట్లో వద్దన్నా నంటే ఈరోజుకీ చేతులతో మలమూత్రాదులు ఎత్తేటటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. దేశమంతటా ఒక లక్షా అరవై వేలమంది ఈ పని చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేసిన తర్వాత వారు ప్రభుత్వం నుంచి ఏ సహాయం పొందనప్పటికీ, తమ స్వాభిమానం కోసం వారు మలమూత్రాలు ఎత్తుతున్న గంపలను విసిరేశారు. నా ఉద్దేశంలో ఈ ప్రపంచంలో ఏదయినా అవార్డు అనేది ఉంటే దానికి వాళ్లు నిజమైన అర్హులు అనిపించింది. పాకీ పని నిర్మూలనలో లోపం ఎక్కడుంది? సఫాయి కర్మచారి మహిళలు వెళ్లి సుప్రీంకోర్టులో కేసు వేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో భాగమే. ఈ దేశంలో సెప్టిక్ ట్యాంకులు, భూగర్భ మురికి కాలువల్లో పడి.. రెండేళ్లలో దాదాపు 1,373 మంది చనిపో యినట్లు డేటా ఉంది. అలా పనిచేస్తే చనిపోతారు అని మనందరికీ తెలుసు. అయినా ఈ దేశమూ, సమాజమూ, మన శాస్త్రజ్ఞులూ.. ఇలాంటి వారు చని పోకుండా ఒక చిన్నపరిష్కారం కూడా ఇంకా తయారు చేయలేదు. ఆవైపు ఆలోచించలేదు. అది మన మెదడుకు పట్టిన ఒక తెగులు. చాలాసార్లు స్వచ్ఛభారత్ అని చెబుతుంటాం. కాని మనక్కావలసింది ఏమిటంటే మన మైండ్సెట్ని మార్చే భారత్ కావాలి, మన ఆలోచనా తీరులోనే కొంత పొర పాటు ఉంది. అందుకే మన కళ్లముందే జరుగుతున్న ఇలాంటి మరణాలను నేను రాజకీయ హత్యలు అనుకుంటున్నాను. రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవలసిన సమయంలో తీసుకోలేకపోతే పౌరులు చనిపోతారు. మనం శుభ్రంగా ఉండటానికి, మన ఇంట్లో కంపు లేకుండా ఉండటానికి ఎవరినో ఒకరిని బలి ఇచ్చేస్తున్నాం. ఇలాంటి హత్యలను మనం ఎంత త్వరగా ఆపగలి గితే.. మనం నిజంగా సభ్య సమాజమే అనిపించుకోవచ్చు. దీన్ని ఆలోచిం చకుండా మనమేదో రాకెట్ లాంచ్ చేశామని గొప్పలకు పోతే ఎలా? రాకెట్ లాంచ్ చేయవద్దని చెప్పడం లేదు. దాంతో పాటు అవసరమైనవన్నీ చేయాలి. వీటితో పాటు చాలా ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత కల్పించాలి. పారిశుధ్య రంగాన్ని ప్రజాస్వామ్యీకరించాలి. అన్నింటినీ ఆధునికమైన రీతుల్లో నవీక రించి మనుషుల ప్రమేయం లేకుండా చేయగలిగే ఒక వ్యవస్థను తీసుకొస్తే.. అది దేశానికీ, ప్రజలకూ, అందరికీ మంచిది. స్వచ్ఛభారత్ నినాదంతో పని లేకుండా ఆచరణాత్మక మార్పు సాధ్యమా?! అవును. ప్రధానమంత్రి స్థాయిలో అలాంటి మార్పు తీసుకురాగలిగితే... ఒక లక్షా అరవైవేలమంది సపాయి కార్మికులు వెంటేనే బానిసత్వం నుంచి విముక్తి పొందుతారు. తరతరాల నుంచి ఒక సమూహం చేత, ఒక సమాజం చేత.. ఇలాంటి పనులు చేయించినందుకు భారత ప్రభుత్వం, ఈ దేశ ప్రజలూ క్షమాపణ చెబితే సపాయి కార్మికుల మనస్సులు కూడా శాంతి స్తాయి. మరలా ఇలాంటి పని మరొకరు చేయకుండా మనమూ, మన పిల్లలూ అందరూ ఇలా సమాజం గురించి ఆలోచన చేసినప్పుడు. ఎవరో ఒకరు మనిషి మలం తీసుకుని నెత్తి మీద మోయటం అనేది యావద్దేశానికీ సిగ్గుచేటు అని అందరూ గ్రహిస్తారు. నా బాల్యంలో ఆ దృశ్యాన్ని నేను చూసి నప్పుడు ఎంతో బాధపడ్డాను. అలా చూడకుండా ఉండే సమాజాన్ని మనం నిర్మిస్తే అదే చాలనిపిస్తుంది. బెజవాడ విల్సన్తో సునీతా రెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో.. https://www.youtube.com/watch?v=4ds_FLRSgJQ -
సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు కృషి
జెడ్పీ సీఈవో సూరజ్కుమార్ కరీంనగర్ అర్బన్ : జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా మార్చేందుకు అధికారులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని జెడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో ఎస్.సూరజ్కుమార్ సూచించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీల్లో చేపట్టాల్సిన పారిశుధ్య పక్షోత్సవాలు, స్వచ్ఛభారత్ మిషన్పై శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూరజ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం బాపూజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి గ్రామసభలు నిర్వహించాలన్నారు. 3న గ్రామజ్యోతి కార్యాచరణ కమిటీలతో సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధి ప్రణాళికలపై చర్చించి ఆమోదించాలని చెప్పారు. 4న బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా కార్యాచరణ రూపొందించి మరుగుదొడ్డి లేని గృహాలను సర్వే ద్వారా గుర్తించి వంద శాతం నిర్మాణాలు చేపట్టాలని కోరారు. 5న రోడ్లను పరిశుభ్రం చేసి చెత్తాచెదారం, ముళ్ల పొదలు తొలగించాలన్నారు. 6న సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. 7న మురికి కాలువల పరిశుభ్రత, 8న ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, రక్షిత మంచినీటి పథకాల పరిశుభ్రత, 13న చేతుల పరిశుభ్రతపై పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. 14న మíß ళా ఆరోగ్య పారిశుధ్యంపై స్వశక్తి, గ్రామైక్య సంఘాలతో సమావేశాలు, అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. 15న చేపట్టిన కార్యక్రమాలపై స్వచ్ పాఖ్వాడ సమీ„ý నిర్వహించి అందుకు సంబంధించిన రిపోర్టును జిల్లా పంచాయతీ అధికారికి పంపాలని సూచించారు. డివిజనల్ పంచాయతీ అధికారులు శ్రీనివాస్రెడ్డి, చంద్రశేఖర్, జిల్లా శిక్షణ మేనేజర్లు కోట సురేందర్, సంతోష్, విస్తరణాధికారి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులకు మంగళం
నాలుగు నెలలుగా విడుదల కాని గౌరవ వేతనం రూ.2.22 కోట్ల బకాయి జిల్లాలో 2.520 పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు రాయవరం : ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణ చేపట్టాలని విద్యాశాఖ భావించింది. విద్యాశాఖలో భాగమైన సర్వశిక్షాభియాన్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులను మంజూరు చేస్తుంది. గ్రామాణాభివృద్ధి శాఖలో అంతర్భాగంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించారు. గ్రామ సంఘాలు నియమించిన వ్యక్తులు పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతున్నారు. వీరికి ఇస్తున్న అరకొర గౌరవ వేతన నాలుగు నెలలుగా నిలిచి పోయింది. అసలు ఈ నిధులు విడుదల అవుతాయా? లేదా? అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 3,301 ప్రాథమిక పాఠశాలలు, 414 ప్రాథమికోన్నత పాఠశాలలు, 659 ఉన్నత పాఠశాలలున్నాయి. అయితే 2,110 ప్రాథమిక, 214 ప్రాథమికోన్నత, 202 ఉన్నత పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అనుమతి వచ్చింది. ఈ పాఠశాలల మరుగుదొడ్ల పారిశుద్ధ్య నిర్వహణకు డ్వాక్రా మíß ళలను నియమించారు. ప్రాథమిక పాఠశాలలో పారిశుద్ధ్యం నిర్వహించే వారికి నెలకు రూ.2 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకైతే రూ.2,500, ఉన్నత పాఠశాలలో నిర్వహించే వారికి రూ.4 వేలు గౌరవ వేతనంగా నిర్ణయించారు. వీరి గౌరవ వేతనం నుంచి ప్రాథమిక పాఠశాలకు ఫినాయిల్, హార్పిక్, బ్లీచింగ్, చీపుర్లు కింద రూ.200 తగ్గిస్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.300, ఉన్నత పాఠశాలకు రూ.500 చొప్పున తగ్గించి ఆ సొమ్ముతో పాఠశాల పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. 2014 నుంచి పారిశుద్ధ్య నిర్వహణ.. పాఠశాలల్లో విద్యార్థులకు నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను ఎస్ఎస్ఏ 2014 నవంబరు నుంచి చేపడుతుంది. అప్పట్లో ఆరు నెలలకు ఎస్ఎస్ఏ నేరుగా నిధులను పాఠశాల ఎస్ఎంసీ అకౌంట్లకు బదిలీ చేసింది. గతేడాది నవంబరు 20 నుంచి పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతలను డీఆర్డీఏ ద్వారా డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గౌరవ వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. మార్చి నుంచి ఆగస్టు వరకు నాలుగు నెలలకు రావాల్సిన గౌరవ వేతనం విడుదల కాలేదు. జిల్లాలో వీరి గౌరవ వేతనం కింద రూ.రెండు కోట్ల 22 లక్షల 52 వేలు విడుదల కావాల్సి ఉంది. అదిగో ఇదిగో అంటున్నారు.. జెడ్పీ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేసే పని చేస్తున్నాను. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. – గుబ్బల వీరయ్యమ్మ, వెదురుపాక, రాయవరం మండలం నిధులు మంజూరు కావాల్సి ఉంది.. పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణ చేస్తున్న వారికి గౌరవ వేతనం నిధులు విడుదల కావాల్సి ఉంది. ఫిబ్రవరి వరకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. – మల్లిబాబు, ప్రాజెక్టు డైరెక్టర్, డీఆర్డీఏ, కాకినాడ -
దోమలను తరిమికొడదాం
అనంతపురం ఎడ్యుకేషన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమలను తరిమికొడదామని జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పిలుపునిచ్చారు. శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం జేసీ మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహనలు కల్పించాలన్నారు. సాయంత్రం 5–6 గంటలకే తలుపులు, కిటికీలు మూసేసి,దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ అంజయ్య, సమాచార శాఖ ఏడీ తిమ్మప్ప,తహశీల్దార్ శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వాళ్లు మారరు... తీరూ మారదు
గ్రంథాలయం పక్కనే చెత్తాచెదారం ఇబ్బందులు పడుతున్న పాఠకులు సమస్య పరిష్కరించాలని విన్నపం నిర్మల్ రూరల్ : వాళ్లంతా స్వయం ఉపాధి పొందుతున్న యువకులు. తమ వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే తలంపుతో ఉన్నవాళ్లు. తలా కొంత డబ్బు కూడబెట్టి ప్రజల అవసరాన్ని గుర్తిస్తూ సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పట్టణంలోని గాంధీచౌక్లో స్వామి వివేకానందుడి పేరిట గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దాదాపు పదేళ్లుగా ఇక్కడ సేవలందిస్తున్నారు. అయితే వీరందించే సేవలకు ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. పాఠకుల కోసం.. పట్టణానికి చెందిన యువకులు గంగిశెట్టి ప్రవీణ్, కూన రమేశ్, అబ్దుల్ అజీజ్, నాయిడి మురళీధర్, వారల్ మనోజ్, అంక శంకర్, ఆర్. శ్రీధర్, శ్రీరామోజీ నరేశ్, తాళ్లపెల్లి నారాయణ, మదన్మోహన్లు నిర్మల వివేకానంద సేవా సమితిగా ఏర్పడి సేవలందిస్తున్నారు. గతంలో గాంధీచౌక్లో ఉన్న ప్రభుత్వ శాఖా గ్రంథాలయాన్ని భాగ్యనగర్కు తరలించారు. దీంతో గాంధీచౌక్, సోమవార్పేట్, బేస్తవార్పేట్, కాల్వగడ్డ, బ్రహ్మపురి, వెంకటాద్రిపేట్, బంగల్పేట్, నాయుడివాడ, బుధవార్పేట్ తదితర వీధుల ప్రజలకు గ్రంథాలయం చాలా దూరభారమైంది. దీంతో పాఠకులు చాలా ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను గుర్తించిన సేవా సమితి సభ్యులు గ్రంథాలయ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తాము సంపాదించిన దాంట్లో నుంచే తలా కొంత వేసుకొని అందరికీ అందుబాటులో ఉండేలా గాంధీచౌక్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. వివిధ దినపత్రికలతో పాటు వారపత్రికలు, పోటీ పరీక్షల పత్రికలను అందుబాటులో ఉంచుతున్నారు. ముక్కు మూసుకొని చదువుతూ.. వివేకానంద గ్రంథాలయానికి నిత్యం యాభై నుంచి వందమంది వరకు పాఠకులు వస్తుంటారు. ఉదయం, సాయంత్ర వేళల్లో గ్రంథాలయాన్ని తెరిచి ఉంచుతారు. పాఠకుల్లో విశ్రాంత ఉద్యోగులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు, విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్గా వచ్చే పాఠకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే గ్రంథాలయం పక్కనే చెత్తచెదారం వేస్తుండటం, గ్రంథాలయ గోడలపై మూత్ర విసర్జన చేస్తుండటంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన వస్తుండటంతో ముక్కు మూసుకొని చదవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పలుమార్లు సూచించినా.. గ్రంథాలయం వద్ద చెత్త వేయొద్దని, ఇక్కడ మూత్రం చేయొద్దని నిర్వాహకులు పలుమార్లు విన్నవించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. స్థానికులు కొంతమేరకు సహకరిస్తున్నా.. దూరప్రాంతాల నుంచి చెత్తను తీసుకువచ్చి ఇక్కడ పోస్తున్నారని పేర్కొంటున్నారు. ఇక మున్సిపల్ అధికారులే ఏదైనా శాశ్వత పరిష్కారం కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు. -
దారి చూపండి..
సాక్షి, సిటీబ్యూరో: ‘నగరంలో మౌలిక సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా ధ్వంసమయ్యాయి. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా అవి పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. దోమలు దండెత్తుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి...తక్షణమే స్పందించండి. ఈ సమస్యలకు పరిష్కారం చూపండి. నాలాలలపై కబ్జాలను సీరియస్గా తీసుకోవాలి..’ అని నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో గళమెత్తారు. సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో నాలాలతోపాటు అధ్వాన్నపు రహదారులు, డెంగీ కే సులు, పారిశుధ్య కార్యక్రమాలపై సభ్యులు తమ వాణి వినిపించారు. సదరు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నగరంలోని నాలాలన్నీ ఆక్రమణలకు గురైనందునే వరదనీరు వెళ్లే మార్గం లేక నాలాలు పొంగిపొర్లుతూ మృత్యుమార్గాలుగా మారాయన్నారు. నిబంంధనలను ఉల్లంఘించి నాలాల వెంబడి భవన నిర్మాణాలకు అనుమతులిస్తుండటంవల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు.నగరం మరో చెన్నయ్లా మారకుండా ఉండాలంటే అనుమతులిచ్చేముందు సంబంధిత విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పరిస్థితులిలా ఉంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరదనీరు, డ్రైనేజీ కలగలసి పారుతుండటాన్ని నిరోధించాలని కోరారు. శివార్లలో సివరేజి బాధ్యతలు పూర్తిగా జలమండలికి అప్పగించాలని కోరారు. బల్కాపూర్ నాలావల్ల తీవ్ర సమస్యలు ఎదురువుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించాలని కోరారు. పాతబస్తీలోని నాలాల సమస్యలపై ఒక కమిటీ వేయాలని ఎంఐఎం సభ్యులు కోరారు. నాలాలు, రోడ్ల సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సూచించారు. మురికినాలా ఒక్కటే మొత్తం భారం మోయలేనందున అదనపు వరదకాలువల అవసరం ఉందని ఎమ్మెల్యే బలాలా సూచించారు. సరూర్నగర్ చెరువు నీటిని మూసీకి తరలించే చర్యలు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్లు కోరారు. చేపలచెరువు కబ్జాదారులను ఖాళీ చేయించాలన్నారు. గ్రేటర్లోని పనులన్నీ కొందరు కాంట్రాక్టర్లే చేపడుతున్నందున పనుల్లో నాణ్యత ఉండటం లేదని, వారే నగరాన్ని నాశనం చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఒక్కో కాంట్రాక్టర్కు అప్పగించే పనులకు పరిమితి ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పారిశుధ్య కార్మికుల పిల్లలకు రెసిడెన్షియల్ విద్య
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు మెరుగైన విద్యను అందజేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి సోమవారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న బాలికలను రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల్లో చేర్పించి విద్యనందించాల్సిందిగా కోరారు. జీహెచ్ఎంసీలోని దాదాపు 27 వేలమంది పారిశుధ్యకార్మికుల్లో ఎక్కువమంది ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందినవారే కావడంతో అందుకు ప్రవీణ్కుమార్ సుముఖత వ్యక్తం చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇందుకుగాను పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో 6వ తరగతి చదువుతున్న బాలికల వివరాలు సేకరించాల్సిందిగా ఆయన డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిందిగా అడిషనల్ కమిషనర్(ఆరోగ్యం–పారిశుధ్యం) రవికిరణŠ కు సూచించారు. -
భయపెడుతున్న ‘డెంగీ’ భూతం
అధికారులను పరుగులు పెట్టిస్తున్న మహమ్మారి తగ్గుముఖం పట్టాయంటున్న డీఎంహెచ్ఓ కాకినాడ రూరల్ : జిల్లాలో డెంగీ కేసులు నమోదు కావడం ఇటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అటు పంచాయతీ అధికారులకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. రోజుకో గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడం, కొన్ని గ్రామాల్లో జ్వర పీడితులు చనిపోవడంతో అధికారులు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ మండలం పాత గైగోలుపాడులో ఓ మహిళ డెంగీ లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో, ఆ ప్రాంతానికి వైద్య శాఖ, పంచాయతీ అధికారులు చేరుకున్నారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, ఇంటింటా రక్తపూతలను సేకరిస్తున్నారు. జిల్లా వైద్యాధికారి చంద్రయ్య పాత గైగోలుపాడులో ఎంపీడీఓ సీహెచ్కే విశ్వనాథరెడ్డి, మండల వైద్యాధికారి ఐ.ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి టీవీవీ సత్యనారాయణతో కలసి పర్యటించారు. విషజ్వరాలు తగ్గుముఖం : ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో విషజ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. విషజ్వరాలు సోకడానికి పారిశుద్ధ్య లోపమే కారణమని గుర్తించినట్టు వివరించారు. జిల్లాలో డెంగీ వల్ల నలుగురు చనిపోయారని, 102 కేసులు నమోదయ్యాయని వివరించారు. 600 మందికి పైగా విషజ్వరాలు సోకినట్టు గుర్తించామన్నారు. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లో 92, ఏజెన్సీ ప్రాంతాల్లో 282 వైద్యశిబిరాలను ఏర్పాటు చేసి, ప్రజలకు వైద్యసేవలు అందజేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ప్రతి వీధిలోను వైద్య సిబ్బంది పర్యటించి, ప్రజల ఆరోగ్య విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ అపరిశుభ్రత కనిపించినా వెంటనే పంచాయతీ అధికారులకు సమాచారం అందజేయాలని చెప్పారు. ఎవరైనా పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యసిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైగోలుపాడులో చనిపోయిన మహిళ డెంగీతో మరణించలేదని, ఆమెకు వరుసగా రెండు సార్లు జ్వరం రావడంతో వైద్యం చేయించుకోవడంలో కొంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని తెలిపారు. -
పారిశుధ్యంపై అధ్యయనం
కలెక్టర్ను కలిసిన యూఎస్ఏ బృందం ముకరంపుర: యూఎస్ఏ స్మిత్ కాలేజీలో ప్రొఫెషనల్ మానిటర్ టౌన్ ఇంజినీర్ డానియల్ మర్ఫి, విద్యార్థినులు మిరాయలా, జేఫర్సన్ విద్యార్థినుల బృందం బుధవారం క్యాంపు ఆఫీసస్లో కలెక్టర్ను కలిశారు. టౌన్ ఇంజినీర్ డానియల్ మర్పీ మాట్లాడుతూ శానిటేషన్పై సర్వే చేసేందుకు ఇండియాకు వచ్చామని వివరించారు. కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ ఆహ్వానం మేరకు తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాలో శానిటేషన్పై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గురువారం ఎంపీ దత్తత గ్రామం వీర్నపల్లిలో సర్వే చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా స్వచ్ఛభారత్ పథకంలో బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలుగా మార్చుటకు చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు సత్ఫలితాలిస్తుందన్నారు. కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ వీర్నపల్లి 3వేల జనాభాగల మారుమూల వెనుకబడిన గ్రామమని, అక్కడ వంద శాతం మరుగుదొడ్లు నిర్మించినట్లు తెలిపారు. వందశాతం అక్షరాస్యత, గుడుంబా రహిత గ్రామంగా మార్చామని తెలిపారు. గుడుంబాపై జీవనోపాధి పొందేవారికి వివిధ రకాల రుణాలిప్పించి స్వయం ఉపాధి కల్పించామని తెలిపారు. అంతర్గత రోడ్లు నిర్మించామని, మెడికల్ క్యాంపులు నిర్వహించామని వివరించారు. రైతులకు ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. -
సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామం కాట్రపాడు
కాట్రపాడు (దాచేపల్లి): మండలంలోని కాట్రపాడును సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామంగా ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డ్వామా ఏపీడీ ఆర్. శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా రూ.2 లక్షల చెక్ను సర్పంచ్ అందుకుంటారని వెల్లడించారు. ఈ మేరకు గ్రామ సర్పంచ్ రెడ్డిచర్ల నాగమ్మను ఆయన అభినందించారు. గ్రామంలో 133 ఇళ్లు ఉన్నాయన్నారు. ఇందులో పాతవి 34 మరుగుదొడ్లు ఉండగా, కొత్తగా 99 నిర్మించారన్నారు. ఏపీడీ వెంట ఏపీవో జి. వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి పి. విజయ్కుమార్, వీఆర్వో రాఘవేంద్ర, స్థానికులు రెడ్డిచర్ల బాబు తదితరులున్నారు. -
అదుపులోకి రాని అతిసార
బాన్సువాడ : బాన్సువాడ పరిధిలో పక్షం రోజులుగా అతిసార అదుపులోకి రావట్లేదు. ప్రతిరోజు సగటున 70 మందికి పైగా అతిసార రోగులు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అతిసారతో బీర్కూర్ మండలం దుర్కిలో ఇద్దరు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆ గ్రామంలో అతిసారతో గంగవ్వ (50), మురళి (24) మృత్యువాత పడ్డారు. జూలైలో అతిసారతో చికిత్సపొందిన వారు సుమారు 1500మంది ఉండగా, ఆగుస్టులో ఇప్పటికే 1500కి పైగా అతిసారకు గురయ్యారు. పారిశుధ్యలోపమే కారణం.. గ్రామాల్లో పారిశుధ్య లోపం, కలుషిత నీటిని తాగడమే అతిసార ప్రబలడానికి ప్రధాన కారణం. బాన్సువాడ, బీర్కూర్, నిజాంసాగర్, పిట్లం మండలాల నుంచి అధికంగా రోగులు వస్తున్నారని తెలుస్తోంది. గతేడాది బాన్సువాడ ప్రాంతంలో సుమారు 8మందికి డెంగీ సోకిన విషయం విదితమే. వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం కలుషిత నీరు, దోమలు, పందులు. కలుషిత నీటి వల్ల డయేరియా ప్రబలుతోంది. పందులు, దోమల వల్ల జ్వరం, డెంగీ, మలేరియా, చికెన్గున్యా వంటి రోగాలు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో అస్తవ్యస్తమైన మురికికాలువలు, చెత్తచెదారమే ఈ రోగాలకు కారణం. బాన్సువాడ, బీర్కూర్, కోటగిరి, వర్నీ మండలాల్లో మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. కోనాపూర్, హాన్మజిపేట, ఇబ్రాహింపేట, బరంగేడ్గి, హంగర్గ తదితర గ్రామాల్లో పారిశుధ్యం గురించి పట్టించుకొనేవారు కరువయ్యారు. పట్టించుకోని అధికారులు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసుకుని వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన వైద్య శాఖ అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. దుర్కిలో గత వారం రోజులుగా అతిసార రోగులు ఇబ్బందుల పాలవుతున్నా, గ్రామ పంచాయతీ అధికారులు పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టలేదు. అలాగే గ్రామాల్లో మంచినీరు అందించడంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విఫలమవుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారిపై పర్యవేక్షణ కరువవడంతో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారు. మరుగుదొడ్ల పథకం ఎటుపోయింది.. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన పారిశుధ్య నివారణ ^è ర్యల్లో తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. నీరు కాలుష్యం కావడానికి ఇది కారణమవుతోంది. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఏదో మారు మూల ప్రాంతంలో ఇలా బహిరంగ మ విసర్జన జరుగుతుంటే అధికారులకు తెలియలేదని అనుకోవచ్చు. కానీ మండల కేంద్రాల్లో, మేజర్ గ్రామ పంచాయతీల్లోనే బహిరంగ మల విసర్జన జరుగుతోంది. దీంలో అపారిశు«ధ్యం నెలకొంటోంది. ప్రజలు అంటురోగాల బారిన పడుతున్నారు. -
ఆరోగ్యం జాగ్రత్త సుమా ?
విస్తరిస్తున్న విరేచనాలు గుంటూరు, బెజవాడల్లో భారీగా కేసులు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం లబ్బీపేట: పుష్కర యాత్రికలు డయోరియా (విరేచనాలు) బారిన పడుతున్నారు. విజయవాడ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నారు. గుంటూరుజిల్లాలో 700లకు పైగా డయేరియా కేసులు నమోదు కాగా, విజయవాడలో సైతం పలువురు భక్తులు అస్వస్థతకు గురవుతున్నారు. వారికి పుష్కర వార్డుల్లో చికిత్స చేసి పంపిస్తున్నారు. కలుషితనీరు. ఆహారం, పారిశుద్ధ్య సమస్యకారణంగానే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న తరుణంలో అధికారులు ఇప్పటికైన అప్రమత్తం కాకుంటే వ్యాధుల చుట్టుముట్టే అవకాశం ఉందని చెపుతున్నారు. కలుషిత జలాల వల్లే మన తాగే నీరు , తీసుకునే ఆహారం కలుషితమైనప్పుడు డయోరియా సోకుతుందని వైద్య నిపుణులు చెపుతున్నారు. ప్రస్తుతం Mýృష్ణానదిలో తక్కువ నీటి మట్టం ఉండటం, పెద్ద సంఖ్యలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. దీంతో మల మూత్రాలు, ఇతరత్రా వ్యర్థాలతో కలుషితమైన నీటిని స్నానం చేసేసమయంలో పొరపాటు నోట్లోకి వెళ్లినప్పుడు మింగేస్తే డయేరియా, టైఫాయిడ్, జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రవాహం తక్కువుగా ఉన్న Mýృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో స్నానం చేసే వారికి ఇలాంటి సమస్యలు వచ్చినట్లు ్ల చెపుతున్నారు. చర్మ సమస్యలు, కంటి, గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముంది. పుష్కర నగర్లలో పారిశుధ్య లేమి యాత్రికులకు పుష్కరనగర్లలో ఉచితంగా అందజేస్తున్న అల్పాహారం, భోజనాలు కలుషితమైనా జబ్బులు వ చ్చే ప్రమాదముంది. అక్కడే పెద్దఎ తు ్తన టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, స మీపంలోనే భోజనాలు వడ్డించడంతో ఆహారం కలుషితమవుతున్నట్లు చెపుతున్నారు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి ఆరోగ్య వంతమైన పుష్కర స్నానం కోసం,.. నదిలో మునిగే సమయంలో నోట్లోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. నదిలో స్నానమయ్యాక మరోసారి మంచినీటితో స్నానం చేయడం ఉత్తమం. పుష్కర నగర్లో పెట్టే ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో చూడాలి. ఆ ప్రాంతంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నా, దుర్గం« దం వస్తున్నా అక్కడ ఆహారం తీసుకోరాదు. వీలయినంత వరకూ మినరల్ వాటర్నే తీసుకోవాలి. -
ఇంత ‘చెత్త‘గా చేస్తారా?
విజయవాడ సెంట్రల్ : నగరంలో పారిశుధ్యం చాలా అధ్వాన్నంగా ఉంది. ఇలా అయితే కష్టం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులకు క్లాస్ తీసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి చంద్రబాబు ఘాట్ల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మార్గమధ్యంలో రోడ్లపై దుమ్ముదూళి పేరుకుపోయి ఉండటం, డీసిల్టింగ్పనులు చేసినట్లు కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పారిశుధ్యానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, ఆశించిన స్థాయిలో ఎందుకు మెరుగుపర్చడం లేదని అధికారుల్ని నిలదీసినట్లు భోగట్టా. నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పారిశుధ్య పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిందిగా ఎంపీ కేశినేని నాని ని ఆదేశించారు. అందుకే ఆయన దీంతో హడావుడిగా కౌన్సిల్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. నైపుణ్యం లేని కార్మికులు నగరపాలక సంస్థలో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడంతో పాలన గాడితప్పింది. పుష్కర పనులు ముగింపు దశకు చేరుకున్నాక కానీ కార్పొరేటర్లతో సమావేశం ఏర్పాటు చేయలేదంటే పరిస్ధితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ మాత్రం అనుభం లేని కాంట్రాక్టర్లకు పారిశుధ్య పనుల్ని అధికారులు కట్టబెట్టారు. వారు గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కూలీలను పనులకు తీసుకువస్తున్నారు. గడ్డి పీకడం, పిచ్చి మొక్కలు తొలగించడం, రోడ్లు ఊడ్చడం వంటి పనుల్ని మాత్రమే తాము చేస్తామని, కాల్వల్లో సిల్టు తీయలేమని కూలీలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వంటి కారణాలతో ఆశించిన స్థాయిలో పారిశుధ్య పనులు జరగడం లేదనేది బహిరంగ రహస్యం. వెహికల్ డిపో పనితీరు అధ్వాన్నంగా ఉందని స్వయంగా మేయర్ కోనేరు శ్రీధర్ మొత్తుకుంటున్నా అధికారులు వినిపించుకొనే స్థితిలో లేరు. నగరపాలక సంస్థలో 3,400 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండగా నెల రోజుల క్రితం అదనంగా 1,100 మందిని తీసుకున్నారు. దీనివల్ల ఖర్చు పెరిగింది తప్ప, ఏమాత్రం ప్రయోజం లేకుండా పోయింది. 18 వేల మంది కార్మికుల్ని పుష్కర విధులకు ఎంపిక చేసిన అధికారులు వారితో ఎలా పనిచేయిస్తారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. -
తూతూమంత్రంగా ఎంపీ పుష్కర సమీక్ష
విజయవాడ సెంట్రల్ : పుష్కరాల నిర్వహణపై ఉదయం 11 గంటలకు ఎంపీ కేశినేని నాని సమావేశం నిర్వహిస్తారని సమాచారం. పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు చెప్పిన సమయానికి హాజరయ్యారు.12.30 గంటలకు తీరుబడి వచ్చిన ఎంపీ సమావేశాన్ని ప్రారంభించారు. రూ. 1,800 కోట్ల ఖర్చుతో కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారంటూ ఎంపీ కేశినేని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు, చుట్టాలకు అదిరిపోయేలా అతిథ్యం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ చంద్రబాబును చూసే అభివృద్ధి నేర్చుకున్నారంటూ స్వోత్కర్ష ప్రారంభించారు. డివిజన్ల వారీగా ఎదురవుతున్న పారిశుధ్య సమస్యల్ని చెప్పాలని సభ్యుల్ని కోరారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అదనపు సిబ్బంది కార్పొరేటర్ల మాట వినకపోవడం వల్ల చెత్త సమస్య మొదలైందన్నారు. టీడీపీ కార్పొరేటర్లు చెన్నుపాటి గాంధీ, జాస్తి సాంబశివరావు, కాకు మల్లిఖార్జున యాదవ్ ప్రసంగించారు. పనిచేయని కార్మికుల్ని వెనక్కు పంపేస్తున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్లు, సిబ్బంది 1,100 మందిని డిప్యుటేషన్పై తీసుకుంటున్నట్లు తెలిపారు. నిజాలు మాట్లాడితే.. గద్దించిన మేయర్ సీపీఎం ఫ్లోర్లీడర్ గాదె ఆదిలక్ష్మి మాట్లాడుతూ 37వ డివిజన్లో మంచినీరు కలుషితం అవుతోందన్నారు. దీన్ని తాగడం వల్ల అనేక మంది ఆసుపత్రుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే పుష్కరాలకు వచ్చే చుట్టాలకు మంచినీళ్ళు కూడా ఇవ్వలేమన్నారు. చెప్పింది చాల్లే ఇక కూర్చోండి అంటూ మేయర్ ఆమెను గద్దించారు. అప్పుడే కొట్టుకుపోయిన రోడ్లు వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల, కార్పొరేటర్ చందన సురేష్ సమస్యల గురించి ప్రస్తావించేందుకు సమాయత్తం కాగా, తనకు వేరే అత్యవసర సమావేశం ఉందంటూ ఎంపీ అర్ధాంతరంగా సభ నుంచి Ðð ళ్లిపోయారు. ఎంపీ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మేయర్, కమిషనర్ను కదలనివ్వలేదు. తాము చెప్పే సమస్యల్ని వినే ఓపిక లేనప్పుడు సమావేశానికి ఎందుకు పిలిచారని పుణ్యశీల ప్రశ్నించారు. కార్పొరేటర్లు షేక్బీజాన్బీ, అవుతు శ్రీశైలజ, బి.సంధ్యారాణి, చందనసురేష్ మాట్లాడుతూ రోడ్ల నిర్మాణ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కబేళా వద్ద పెట్రోల్బంకు రోడ్డు వేసిన ఆరు నెలలకే కొట్టుకుపోయిందన్నారు. మళ్లీ ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. -
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆందోళన
కాగజ్నగర్ : కాగజ్నగర్ మున్సిపాలిటీ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు, ఎన్ఎంఆర్ కార్మికులు బుధవారం వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్ చాంబర్ల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ 7 నెలల నుంచి కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రతి రోజూ పట్టణంలోని పలు వార్డుల్లో చెత్తా చెదారాన్ని తొలగిస్తూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమను అధికారులు జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వేతనాలు చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు రమేశ్, వెంకటేశ్, శంకర్, సాంబయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టణంలో పారిశుధ్య పనులు
చెన్నూర్ : పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మట్టి, ఇసుక మేటపెట్టింది. రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టామని సర్పంచ్ కృష్ణ తెలిపారు. -
జనాలకు జర మొస్తోంది..!
గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం ప్రబలుతున్న వ్యాధులు వ్యాధుల బారినపడుతున్న ప్రజలు చెన్నూర్ : వర్షం వచ్చింది రైతుల్లో సంతోషం తెచ్చింది. గ్రామ స్థాయి అధికారులు, పాలకులు స్పహతో ఉండి ఉంటే జనాలూ సంతోషం ఉండేవారు. కానీ పారి‘శుద్ధి’పై చిత్తశుద్ధి లోపించడంతో జనాలకు జరమొస్తోంది. దీంతో గ్రామీణులు దావఖానాల పాలవుతున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు జ్వరాల, డయోరియా బారినపడి ఆస్పత్రులపాలయ్యారు. అధికారులు చెత్తపై చిత్తశుద్ధితో సమరం చేస్తే జనాలు వ్యాధుల బారిన పడరనేది వైద్యుల మాట... గ్రామాలు స్వచ్ఛగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఆమలు చేస్తున్నాయి. స్వచ్ఛ భారత్ లక్ష్యం మంచిదే అయినప్పటికీ ఆచరణకు నోచుకోకపోవడంతో నేడు గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ లోపించి ప్రజలు రోగాలపాలవుతున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలి మంచాన పడుతున్నారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా సోకి ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. జ్వరం.. భయం... చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని ప్రజలు జ్వరాలు, డయోరియా వ్యాధులు ప్రబలి మంచం పడతున్నారు. రోజు రోజుకూ జ్వరాలు, డయోరియా రోగులు పెరుగుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో చెన్నూర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి నిండిపోతోంది. చెన్నూర్ మండలంలోని కిష్టంపేట, చెన్నూర్ పట్టణంలోని మహాంకాళివాడ, కోటబొగుడ, బొక్కలగూడెం, బేతాళవాడలతో పాటు కోటపల్లి మండల కేంద్రంలోని ఆశ్రమ గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులు, జనాలు అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. లోపించిన పారిశుధ్యం చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్, ఇందిరానగర్ , బేతాళవాడ, చెన్నూర్ మండలంలోని కత్తరశాల, సుద్దాల, కిష్టంపేట, సుద్దాల, అంగ్రాజుపల్లి, అస్నాద్, దుగ్నెపల్లి, కొమ్మెర, కోటపల్లి మండలంలోని పారుపల్లి, ఎడగట్ట, ఎసాన్వాయి, ఎధుల్లబంధం, జనగామా, పిన్నారం, మల్లంపేట, పంగిడిసోమారం, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ లోపించింది. ఈ ప్రాంతాల్లో మురికి కాలువల వ్యవస్థ లేక పోవడంతో వర్షపు నీరు ఎక్కడ పడితే అక్కడే నిలిచి పోవడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు అప్రమత్తమై పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే జనాలు ఆస్పత్రులపాలు కాక తప్పదు. -
2019 నాటికి సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యం
భూదాన్పోచంపల్లి : తెలంగాణలో 2019 నాటికి బహిరంగ మలవిసర్జన లేకుండా సంపూర్ణ పారిశుద్ధ్య సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరక్టర్ ఎం.రామ్మోహన్రావు తెలిపారు. మంగళవారం మండంలోని దేశ్ముఖిలోని సాయి బృందావనంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి దశలో నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వంద శాతం పూర్తి చేస్తామని అన్నారు. ఇలా మూడేళ్లలో దశల వారీగా రాష్ట్రంలో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట ఘంటా నారాయణస్వామిజీ, ఎంపీటీసీ దాసర్ల జంగయ్య ఉన్నారు. -
లక్ష్యం..దూరం
నత్తనడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో నివాసమున్న కుటుంబాలు : 4,77,712 వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరమున్న కుటుంబాలు: 2,61,992 ఈ ఏడాది వందగ్రామాల్లో లక్ష్యం: 20,000 ఇప్పటి వరకు నిర్మించిన మరుగుదొడ్లు: 4200 వివిధ దశల్లో ఉన్న మరుగుదొడ్లు: 2600 ఇంకా మొదలుపెట్టనివి: 13,200 కడప ఎడ్యుకేషన్: సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే దిశగా జిల్లాలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. లక్ష్యాన్ని అధిగమించేందుకు అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రెండేళ్లు గడిచినా మరుగుదొడ్ల నిర్మాణంలో ఆశించిన పురోగతి మాత్రం కన్పించడంలేదు. గ్రామీణ ప్రాంతంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్న చోట కొంత ఫర్వాలేదనిపించినా నూరుశాతం సాధించడంలో మాత్రం వెనుకబడిపోయారనే చెప్పొచ్చు. జిల్లాలో 2014 అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జిల్లాలోని 51 మండలాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే లక్ష్యంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువ కింద 2,61,992 కుటుంబాలను గుర్తించారు. ఇందులో భాగంగా 790 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో 2015-16కు గాను 59 పంచాయతీల్లో గత ఏడాది 11,225 మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ లబ్ధిదారులు సహకరించకపోవడం, సరైన అవగాహన లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో అధికారులు వెనుకబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది 2016-17 ఏడాదికి గాను వంద గ్రామ పంచాయతీల్లో 20 వేలు వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందులో ఇప్పటికి 4200 మరుగుదొడ్లను పూర్తి చేయగా, 2600 వివిధ దశల్లో ఉన్నాయి. ఈ లక్ష్యం 2017 మార్చి నాటికి కనుక ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇందులో భాగంగా మండలాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం వచ్చే వారికి అవగాహన కల్పించడంతోపాటు వారికి అవసరమైన డాటాను నమోదు చేసేందుకు మండలానికి ఒక ఎమ్మార్పీని ఈ ఏడాది ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల్లో నిర్లిప్తత వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి గతంలో మంజూరు చేసిన నిధుల కంటే అధికంగా పెంచి రూ. 15 వేలు చొప్పున నిధులను మంజూరు చేస్తోంది. గతంలో నిధులు తక్కువగా మంజూరు చేయడం, లబ్దిదారులు సైతం సొంత డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం నిధులు పెంచి మంజూరు చేస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో నిర్లిప్తత కనిపిస్తోంది. ఆరుబయట మలవిసర్జన వల్ల పారిశుద్ధ్య సమస్య, నీరు కలుషితం కావడం వంటి ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అయితే వీరిలో చైతన్యం తీసుకువచ్చే విధంగా అవగాహన సదస్సులతోపాటు ప్రదర్శనలు నిర్వహిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుంది. -
ఖమ్మంలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఖమ్మం కార్పొరేషన్ ముందు బైఠాయించి ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో సుమారు 300 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. -
పడకేసిన పారిశుద్ధ్యం
పబలుతున్న రోగాలు పందుల సైరవిహారం పట్టించుకోని పాలకులు, అధికారులు కొత్తకోట పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీంతో దోమలు వద్ధి చెందిన ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న ముసురు వర్షాలకు డ్రెయినేజీల్లో వరదనీటితోపాటు ఇళ్లల్లోని మురుగునీరు ముందుకు వెళ్లలేక దుర్వాసన వెదజల్లుతోంది. దీనికితోడు పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమలు వద్ధి చెంది ప్రజలు సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులపాలవుతున్నారు. పట్టణంలోని 20 వార్డుల్లో 26వేల మంది జనాభా నివసిస్తున్నారు. పలు కాలనీల్లో డ్రెయినేజీ సౌకర్యం లేక రోడ్ల పైనే మురుగునీరు ప్రవహిస్తోంది. మరికొన్ని కాలనీల్లో ఇళ్లమధ్యనే దుర్గంధపునీరు చెరువులా నిల్వ ఉంటున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్టాండు,పాత పోలీస్స్టేషన్,మటన్ మార్కెట్,శంకరసముద్రం కాలువలు మరింత దుర్గంధంగా మారాయి. దీంతో దోమలు వద్ధి చెంది రాత్రి పూట నిద్రపోనివ్వడంలేదని పట్టణవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రోజుకు వంద మంది అస్వస్థత వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందాయి. పారిశుద్ధ్యలోపం, పందులు, దోమలబెడదతో ప్రజలు చలిజ్వరం, వాంతులు, బేదులు, మలేరియా వంటి రోగాల బారిన పడుతున్నారు.ప్రతి రోజూ వందకు పైగా జనం అస్వస్థతకు గురవుతున్నారు. రోగులతో ప్రభుత్వ,ప్రై వేటు ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం డ్రెయినేజీలో మురుగునీరు నిల్వ ఉన్నా, రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మురుగుకాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరినా స్పందించడంలేదని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్పంచ్ చెన్నకేశవరెడ్డి పట్టణంలో నెలకొన్న పరిస్థితులపై దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
వైద్య, ఆరోగ్య శాఖకు అంచనాల కమిటీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను శాసనసభ అంచనాల కమిటీ ఆదేశించింది. ఏజెన్సీ ప్రాంతాలు, పట్టణాల్లోని మురికివాడల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అధ్యక్షతన శనివారం అసెంబ్లీ కమిటీ హాలులో వైద్య, ఆరోగ్య శాఖపై సమావేశం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈ శాఖకు బడ్జెట్లో నిధులు పెంచామని, వాటిని సద్వినియోగం చేయాలని అధికారులకు సోలిపేట సూచించారు. గత ఏడాది బడ్జెట్లో రూ.2,472 కోట్లు, ఈ ఏడాది రూ.3,504 కోట్లు కేటాయించామన్నారు. నిధుల సక్రమ వినియోగ కోసమే కమిటీ పనిచేస్తోందన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ, నిధుల ఖర్చుకు సబంధించి పూర్తి వివరాలతో కార్యాచరణ ప్రణాళికను వారంలోగా అందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ తదితర ఆసుపత్రుల పనితీరునూ కమిటీ చైర్మన్ సమీక్షించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవాలు పేదలకు భారంగా మారాయని, ఒక్కో ప్రసవానికి కనీసం రూ.50 వేల దాకా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, మందుల స్టాకు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో రోగులకు, వారి సహాయకులకు అందించే ఆహారం కల్తీ కాకుండా చూడాన్నారు. నిధులు సక్రమంగా వాడకపోతే అధికారులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. మరో వారంలో సమావేశం కావాలని, ఈసారి నేరుగా ఆస్పత్రులను సందర్శించాలని కమిటీ నిర్ణయిం చింది. సమావేశంలో ఎమ్మెల్యేలు డి.కె. అరుణ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ 8.కోట్లు ‘ఊడ్చేశారు’!
పారిశుధ్యం పేరిట నిధుల దుబారా.. ఎక్కడి చెత్త అక్కడే.. అయినా పెరిగిన వ్యయం రెండు నెలల్లో రూ. 8 కోట్లు అదనంగా ఖర్చు సిటీబ్యూరో: గత ఆర్థిక సంవత్సరం పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం వివిధ పనులకు జీహెచ్ఎంసీ దాదాపు రూ. 420 కోట్లు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాల నిర్వహణలో రవాణా విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని, నిధుల దుబారా జరుగుతోందని అధికారాలను వికేంద్రీకరించారు. అదనపు వాహనాలు అవసరమైనప్పుడు ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని నిర్వహణ బాధ్యతలను వికేంద్రీకరించారు. తద్వారా ఖర్చు తగ్గడంతోపాటు ఎప్పటికప్పుడు పనులు జరుగుతాయని, పారిశుధ్యం బాగుపడుతుందని భావించారు. నిర్వహణను జోనల్/సర్కిల్ స్థాయికి వికేంద్రీకరించారు. అయినా.. పారిశుధ్యం మెరుగు పడలేదు. ఎక్కడ చూసినా ఎప్పటిలాగే చెత్తకుప్పలు. కొన్ని ప్రాంతాల్లోనైతే మరింతగా పేరుకుపోతున్న చెత్తగుట్టలు. నిధుల దుబారా తగ్గి ఖర్చు తగ్గిందా అంటే అదీలేదు. పెపైచ్చు పెరిగింది. గడచిన మే, ఏప్రిల్ రెండు నెలల్లోనే కేవలం అదనపు వాహనాల అద్దెకోసమే దాదాపు రూ. 8 కోట్లు అదనంగా ఖర్చు చేశారని విశ్వసనీయ సమాచారం. నగరంలో చెత్త కుప్పలు ఉండరాదని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకని చెప్పి ఏకంగా 193 అదనపు వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వీటిల్లో 25 టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 44, పది టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 22 , ఆరు టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 76, జేసీబీలు 51 ఉన్నాయి. వీటికోసం చెల్లించే అద్దెలను లెక్కిస్తే నెలకు దాదాపు రూ. 4 కోట్ల వంతున రెండు నెలలకు వెరసి రూ. 8 కోట్లు ఖర్చు పెరిగిందని తెలుస్తోంది. పారిశుధ్యం మెరుగుపడిందా అంటే మాత్రం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్తను యార్డుకు తరలించేందుకే ఈ అదనపు వాహనాలను తీసుకున్నప్పటికీ, పరిస్థితి మాత్రం మారలేదు. మేయర్ ఆదేశాలు బేఖాతర్.. చెత్త బయట పడకుండా ఉండేందుకు, దుర్వాసన రాకుండా ఉండేందుకు చెత్త తరలించే వాహనాలకు కవర్ ఉండాలని మేయర్ బొంతురామ్మోహన్ ఆదేశించారు. అయినప్పటికీ దానిని అమలు చేయడం లేరు. ఎలాంటి కవర్ లేకుండానే రోడ్లపై జనసమ్మర్ధం ఉన్న సమయంలోనే చెత్తను తరలిస్తుండటంతో గాలికి అది రోడ్లపై, ప్రయాణికులపై పడుతోంది. దాంతో కొన్ని సందర్భాల్లో చెత్త కళ్లల్లోపడి ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. -
సిద్దిపేట నెం.1
♦ జాతీయ ఖ్యాతి ♦ ‘పంచాయతీ స్వశక్తికరణ్’ పేరిట మూడు అవార్డులు ♦ 24న ప్రధాని చేతుల మీదుగా ప్రదానం ♦ మండలంలో హర్షాతిరేకాలు ♦ క్రెడిట్ అంతా మంత్రిదేనని స్పష్టీకరణ సిద్దిపేట రూరల్: సమష్టి కృషితో సిద్దిపేట పరుగులు తీస్తోంది. అభివృద్ధితోపాటు పారిశుద్ధ్యం, ప్రభుత్వ పథకాల అమలులో దూసుకుపోతోంది. ఓవైపు మంత్రి హరీశ్రావు సహకారం.. మరోవైపు ప్రజాప్రతినిధుల ఉత్సాహం.. ఇంకోవైపు అధికారులు, సిబ్బంది చురుకుదనం కలగలసి సిద్దిపేట అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. సిద్దిపేట మండలం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పంచాయతీ స్వశక్తికరణ్’ అవార్డులను మూడింటిని దక్కించుకుని రికార్డు సృష్టించింది. మూడు కేటగిరీల్లోనూ సిద్దిపేటకు స్థానం లభించింది. ప్రభుత్వ కార్యకలాపాల సక్రమ నిర్వహణకు గాను సిద్దిపేట మండలం, పారిశుద్ధ్య విభాగంలో ఇబ్రహీంపూర్, పథకాల అమలు (సోషల్ సెక్టార్)లో లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉత్తమంగా ఎంపికయ్యాయి. ఇందులో ఇబ్రహీంపూర్ మంత్రి హరీశ్రావు దత్తత గ్రామం కావడం గమనార్హం. ఈ అవార్డులను ఈనెల 24న ప్రధాని చేతుల మీదుగా అందుకోనున్నారు. అవార్డుల పంట పండడంతో మండలంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మండలంతోపాటు ఆయా గ్రామాల ప్రజలు ఆనందంలో మునిగిపోయారు. చేసిన కష్టానికి ఫలితం లభించిందని వ్యాఖ్యానించారు. తామెంత చేసినా ఇందులో మంత్రి హరీశ్రావు చొరవే అధికమని వారు చెబుతున్నారు. ఈ అవార్డుల ఫలితం కూడా మంత్రికే దక్కుతుందని వారు భావిస్తున్నారు. ఐక్యతే ముందుకు నడిపించింది... ఇబ్రహీంపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా ఐక్యంగా కదిలారు. పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాం. ప్రతి ఇంటిముందు ఐదు మొక్కలు నాటించాం. వాటి సంరక్షణ బాధ్యత ఆ ఇంటి యజమానికే అప్పగించాం. గ్రామంలో జరుగుతోన్న అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుతున్నారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో పారిశుద్ధ్యంలో నంబర్ వన్గా నిలిచాం. - కుంబాల లక్ష్మి, సర్పంచ్, ఇబ్రహీంపూర్ అందరి సహకారంతో... ప్రజలందరి సహకారంతో లింగారెడ్డిపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాం. పాలకవర్గంతోపాటు గ్రామస్తులతో చర్చించి అభివృద్ధి పనులపై నిర్ణయం తీసుకుంటాం. ప్రధానంగా తడి,పొడి చెత్త వేరు చేయడం మంచి సత్ఫలితాలనిచ్చింది. మంత్రి హరీశ్రావు సంపూర్ణ సహకారంతో గ్రామంలో అన్ని పథకాలు ప్రజల దరికి చేరవేరుస్తున్నాం. - బొండ్ల రామస్వామి, సర్పంచ్, లింగారెడ్డిపల్లి మంత్రి సహకారంతోనే అవార్డులు... మంత్రి హరీశ్రావు సహకారంతో మండలం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తోంది. జాతీయ స్థాయిలో సిద్దిపేట మండలానికి మూడు పురస్కారాలు రావడం వెనుక మంత్రి కృషి ఎంతో ఉంది. మండలంలో అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయి. పథకాల అమలుపై కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట మండలంతోపాటు, ఇందులోని ఇబ్రహీంపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలు అవార్డులకు ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. - ఎర్ర యాదయ్య, ఎంపీపీ సిద్దిపేట -
అమ్మో..ఆస్పత్రి!
♦ భెల్ దవాఖానాకు బూజు ♦ లోపించిన పారిశుద్ధ్యం ♦ రావడానికి జంకుతున్న రోగులు ♦ పసికందులపైనా నిర్లక్ష్యమే.. భెల్: భెల్ కాలనీలోని ఆస్పత్రిలోకి వెళితే గుండె గుభేల్ మనడం ఖాయం.. ఆస్పత్రిలో ఎటు చూసినా పారిశుద్ధ్య లేమి.. బూజు పట్టిన గోడలు, పరికరాలే దర్శనమిస్తాయి. రోగులు ఇక్కడికి రావాలంటే భయపడుతున్నారు. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల కోసం భెల్ కాలనీలో ఆస్పత్రిని నిర్మించారు. కాని నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రోగు లు నరక యాతన అనుభవిస్తున్నారు. రోగం నయం కోసం వస్తే.. కొత్త రోగాలతో బయటకు వెళ్లాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. నిర్వహణ కోసం ఏటా రూ. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. కనీసం బూజు దులపలేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పారిశుద్ధ్యంపై కూడా శ్రద్ధ చూపడంలేదని కార్మికులు మండిపడుతున్నారు. వైద్య సేవలు కూడా సరిగా లేవని రోగులు వాపోతున్నారు. అప్పుడే పుట్టిన పసికందులను ఉంచడానికి ఏర్పాటు చేసిన వార్డుల్లో ఎక్కడ పడితే అక్కడ బూజు పట్టి ఉంది. దీనిపై బలింతలు, వారి కుటుంబ సభ్యులు చూసి తమ పిల్లలకు ఎటువంటి క్రీమికిటకాలు చేరి ఇన్ఫెక్షన్ వస్తే పరిస్థితి ఏమిటని భయందోళనకు గురువుతున్నారు. చిన్నారుల వార్డుల్లోకి వచ్చిపోయే బంధువులను ఆరోగ్య నియమాలను పాటించాలని డాక్టర్లే పదేపదే చెప్పుతుంటారు. పాదరక్షలు వదలనిదే లోపలికి అనుమతించరు. మరి అటువంటి వైద్యులకు, అసుపత్రి వర్గాలకు, భెల్ యాజమాన్యానికి చిన్నారుల వార్డుల్లోనూ అపరిశుభ్రత కనిపించడంలేదనా అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా భెల్ యాజమాన్యం అసుపత్రి వైద్యంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్నీ సమస్యలే.... బీహెచ్ఈఎల్ అసుపత్రిలో చికిత్స పొందే ప్రతి రోగి నరకం చూస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికూనలను సైతం అపరిశుభ్ర వాతావరణ వార్డుల్లో పెట్టడం విడ్డూరం. ఈ దవాఖానాకు రావడానికి రోగులు జంకుతున్నారు. అంతేకాకుండా మరమ్మతుల పేరుతో కార్పొరెట్ ఆస్పత్రులకు తరిలించి కోట్లాది రుపాయాలు వృధా చేస్తున్నారు. -జాషువ, కార్మిక నాయకుడు -
'బహిర్భూమికి బయటకు వెళితే కేసులే'
షాద్నగర్: వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోకుండా ఆరు బయటే మలవిసర్జన చేస్తే కేసులు పెడతామని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ డెవల ప్మెంట్ ఆఫీసర్ (సీడీవో) హేమలత హెచ్చరించారు. శనివారం ఆమె షాద్నగర్ మండలం ఫరూక్నగర్లో పర్యటించారు. స్థానిక హరిజనవాడలో చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. అందరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని కోరారు. నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. -
స్వచ్ఛ భారతీయుడు
ఆదర్శం ఇప్పుడంటే పారిశుధ్యం గురించి ప్రచారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మారుమోగి పోతోందిగానీ, మూడు నాలుగు దశాబ్దాల క్రితం... అది ప్రజల్లో అంతగా అవగాహన లేని విషయం. ‘ఇది కూడా ఓ సమస్యేనా’ అనుకునే కాలం. అలాంటి కాలంలోనే డా॥మపుస్కర్ పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడానికి శంఖం పూరించారు. గత 50 ఏళ్లుగా పల్లెల్లో పారిశుధ్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తూ ఉన్నారు. మెడిసిన్ పూర్తి చేసిన తరువాత పునే(మహారాష్ట్ర)కు దగ్గరిలోని దెహు గ్రామ హాస్పిటల్లో డాక్టర్గా చేరారు మపుస్కర్. డ్యూటీలో చేరిన తొలిరోజు రాత్రి హాస్పిటల్ బయట పడుకోవడానికి సిద్ధమైనప్పుడు- ‘‘అయ్యా! ఇక్కడ పడుకోవడం ప్రమాదకరం. దెయ్యాలు తిరుగుతుంటాయి’’ అన్నారు ఒకరు. ఆ మాటలు తేలిగ్గా తీసుకొని హాయిగా నిద్రపోయాడు యువ డాక్టర్. తెల్లవారిన తరువాత కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయిలెట్ కోసం వెతుకుతుంటే, ‘‘ఊళ్లలో టాయిలెట్లు ఉండవు సార్. చెట్ల చాటుకు వెళ్లాల్సిందే’’ అన్నాడు సిబ్బందిలో ఒకరు. అప్పుడే దృఢంగా అనుకున్నారు... ‘ఈ పరిస్థితిలో మార్పు తేవాలి’ అని! దానికి తోడు దెహు గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడు తున్నారని తెలిసింది. పారిశుధ్య లోపమే ప్రజల అనారోగ్యానికి కారణమవుతుందని ఆయనకు అర్థమైంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే బహిరంగ మలవిసర్జన అలవాటును మానిపించాలి. టాయిలెట్ల విలువ గురించి తెలియజేయాలి అనుకున్నారు మపుస్కర్. ‘దెయ్యాలున్నాయి’ అని చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్లి- ‘‘నిజమే... ఈ ఊళ్లో దెయ్యాలున్నాయి. అయితే అవి మీరనుకునే దెయ్యాలు కాదు. అపరిశుభ్రత అనే దెయ్యాలు’’ అన్నారు మపుస్కర్. తన కోసం హాస్పిటల్ పరిసరాల్లో తాత్కాలికంగా ట్రెంచ్ టాయిలెట్ నిర్మించారు. దీనికి మందుల బాక్సుల అట్టలను నలువైపులా గోడలుగా అమర్చారు. తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) వాళ్లు వేసిన ఒక పుస్తకం నుంచి ఓ నమూనాను ఎంపిక చేసుకుని, దాని ప్రకారం గ్రామంలో పది టాయిలెట్లు నిర్మించారు. కానీ డబ్ల్యూహెచ్వో పుస్తకంలోని డిజైన్లు ఇండియాకు సరిపోవనే విషయం అర్థమైంది. వానాకాలంలో అవి పనికి రాకుండా పాడైపోయాయి. అయినా తన ప్రయత్నం వీడకుండా పరిసరాల పరిశుభ్రత గురించి అలుపెరు గని ప్రచారాన్ని నిర్వహించారు మపుస్కర్. అయితే ఆయన తపనను తక్కువమంది అర్థం చేసుకున్నారు. ‘ఈయనకు పెద్దగా పని లేనట్లు ఉంది’, ‘చాదస్తం కాకపోతే పల్లెల్లో టాయిలెట్లు ఏమిటి?’ లాంటి కామెంట్లు ఎక్కువగా వినిపించేవి. అయినా తగ్గకుండా మరుగుదొడ్ల ప్రాము ఖ్యతను గురించి గ్రామంలో విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఊరేగింపులు, చర్చలతో మొదలైన ప్రచారం చివరికి ఉద్యమ రూపం తీసుకుంది. ప్రజలు టాయిలెట్ల గురించి ఆసక్తిగా ఆరా తీయడం మొదలైంది. గ్రామ మరుగుదొడ్డి నిర్మాణ కమిటీ కూడా ఏర్పడింది. ‘నో ప్రాఫిట్-నో లాస్’ సూత్రంతో ఏర్పడిన ఈ కమిటీ ఒక్క నెలలోనే వంద టాయిలెట్లను నిర్మించింది. 1980 వచ్చేసరికి లక్ష్యానికి 90 శాతం చేరువయింది. ఆ తరువాత బయోగ్యాస్ టాయిలెట్ల గురించి ప్రచారం మొదలు పెట్టారు మపుస్కర్. దాంతో గ్రామంలో చాలామంది బయోగ్యాస్ టాయిలెట్ల నిర్మాణం వైపు మొగ్గు చూపారు. కేవలం దెహు గ్రామం దగ్గరే ఆగిపోలేదు మపుస్కర్. ‘జ్యోత్స్న ఆరోగ్య ప్రభోధన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి దేశవ్యాప్తంగా పారిశుధ్యం గురించి ప్రచారం చేస్తున్నారు. ఆ మధ్యనే వృత్తి విరమణ పొందారు కానీ లక్ష్యం నుంచి మాత్రం కాదు! -
నీరసంగా నిర్మల్
⇒ నిర్మల్ గ్రామాల్లో కానరాని పారిశుధ్యం ⇒ ఎంపికచేసి చేతులుదులుపుకున్న వైనం ⇒ పూర్తికాని వ్యక్తిగత మరుగుదొడ్లు స్మార్ట్ సిటీ.. స్మార్ట్ విలేజ్ అంటూ ఊహాలోకాల్లో విహరిస్తున్న పాలకులు దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల్లో అభివృద్ధిని మాత్రం గాలికొదిలేస్తున్నారు. నిర్మల్ పురస్కారాల ఎంపిక సమయంలో చేస్తున్న హడావుడి ఆ తర్వాత కనిపించడం లేదు. ఎంపిక సందర్భంగా ఇచ్చే నిధులతో హడావుడిగా పనులు చేసి అందిన కాడికి బొక్కేయడం తప్ప గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు పట్టించుకున్న పాపానపోవడం లేదు.పేరుకు నిర్మల్ పురస్కార గ్రామాలే అయినప్పటికీ అపారిశుధ్యంలో ఇతర పంచాయతీలకు తామేమీ తీసిపోమన్నట్టుగా తయారవుతున్నాయి. విశాఖపట్నం: నిర్మల్ గ్రామాలంటే చాలా అందంగా ఉంటాయని, పారిశుధ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, అందరికీ వ్యక్తిగత మరుగుదొడ్లు ఉంటాయని అనుకుంటాం. కాని చాలా నిర్మల్ గ్రామాల్లో కనీస పారిశుధ్య పరిస్థితులు కూడా కనిపించడం లేదు. జిల్లాలో 925 పంచాయతీలున్నాయి. 2008-09 నుంచి ఇప్పటివరకు 25 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది ఒక్క విశాఖ జిల్లాలోనే అత్యధికంగా 8 పంచాయతీలు నిర్మల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఇందుకోసం గతేడాది ఆగస్టు 22న విశాఖలో జరిగిన రాష్ర్ట స్థాయి నిర్మల్ పురస్కారాల పంపిణీ కార్యక్రమంలో ఆయా పంచాయతీలకు రూ.22 లక్షలు అందజేశారు. మార్చి-31నాటికి కనీసం వంద పంచాయతీలను బహిరంగ మల మూత్ర విసర్జన రహితం (ఓడీఎఫ్)గా ప్రకటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ పంచాయతీల్లో 30 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని నిర్దేశించారు. కానీ ఇప్పటివరకు 12 పంచాయతీల్లో మాత్రమే నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి ఓడీఎఫ్ పంచాయతీలుగా ప్రకటించారు. ఈ పంచాయతీల పరిధిలో ఉన్న కుటుంబాల ఆధారంగా సుమారు 5 వేల వ్యక్తిగత మరుగు దొడ్లను నిర్మించగలిగారు. దీంతో ఈ పంచాయతీలకు మాత్రమే 2015 -16 ఆర్థిక సంవత్సరం కింద నిర్మల్ పురస్కారాలు దక్కనున్నాయి. మిగిలిన స్వచ్ఛ గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. స్థలా భావం వల్ల చాలా మంది మరుగుదొడ్ల నిర్మాణానికి దూరంగా ఉంటే.. లబ్ధిదారుల ఎంపికలో..బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వలన మరుగుదొడ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. పాత పరిస్థితులే పునరావృతం ఇప్పటివరకు ప్రకటించిన 25 నిర్మల్ పురస్కార గ్రామాల్లో కూడా పాత పరిస్థితులే పునరావృతమవుతున్నాయి. పురస్కారాలకు ఎంపికైన గ్రామాలతో ఇక మా పనైపోయిందన్నట్టుగా ఉంది అధికారులు తీరు. నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి.. బహిరంగ మల మూత్రవిసర్జన కు తావు లేని విధంగా పారిశుధ్యాన్ని మెరుగుపర్చిన పంచాయతీలను నిర్మల్ పురస్కారాలకు ఎంపిక చేస్తారు. గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఆయా పంచాయతీలు చేస్తున్న కృషిని కూడా పరిగణన లోకి తీసుకుంటారు. ఎంపిక సమయంలో అధికారులు చూపిస్తున్న శ్రద్ధ ఆ తర్వాత ఆ పంచాయతీలపై చూపించడం లేదు. ఎంపిక సమయంలో పాటించే ప్రామాణికాలు ఆ తర్వాత అమలవుతున్నది లేనిది పట్టించుకునే నాధుడు లేడు. నిర్మల్ పురస్కారాలకు ఎంపికైన గ్రామాల్లోనే కాదు.. ఈ ఏడాది స్వచ్ఛ గ్రామాలుగా ఎంపికచేసిన పంచాయతీల్లో కూడా పారిశుధ్య పరిస్థితులు అంతంతమాత్రం గానే ఉన్నాయి. ఇవన్నీ పేరుకే బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామాలు. నూరు శాతం మరుగుదొడ్లు కలిగి ఉండాలన్న ప్రాథమిక నిబంధన కూడా ఎంపిక తర్వాత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఈ గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారవుతోంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన, స్వచ్ఛ గ్రామాలుగాప్రకటించిన గ్రామాల్లో సాక్షి బృందం పర్యటిస్తే ఏ గ్రామం చూసినా ఏమూన్నది గర్వకారణం అన్నట్టు అక్కడ పరిస్థితులు దర్శనమిచ్చాయి. లక్ష్యానికి దూరంగా మరుగుదొడ్ల నిర్మాణం ఉదాహరణకు పాయకరావుపేట మండలంలో 2012-13 ఆర్థిక సంవత్సరం కింద గతేడాది నిర్మల్ పురస్కారానికి ఎంపికైన కొత్తూరు పంచాయతీలో 119 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 62 మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేశారు. సీసీరోడ్లు నిర్మాణం, తాగునీటి పథకాలకు రూ.2 లక్షలు, పారిశుధ్య నిర్వహణకు కేటాయించారు. నేటికీ గ్రామంలో సరైన డ్రైనేజి వ్యవస్థలేక పోవడంతో పాటుగ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక పంచాయతీ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. రాజగోపాలపురం పంచాయతీలో 157 వ్యక్తిగత మరుగుదొడ్లు లక్ష్యం కాగా కేవలం 84 నిర్మాణం జరిగాయి. ఇక్కడ డ్రైనేజీల నిర్మాణం జరగ లేదు. కేశవరంలో నూరుశాతం మరుగు దొడ్ల నిర్మాణం జరిగినా తాగునీటి పథకాలు, పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. అచ్యుతాపురం మండలంలో నిర్మల్ పురస్కా రాలకు ఎంపికైన ఇరువాడ, జంగులూరు, దొప్పెర్ల, చీమలాపల్లి, ఎర్రవరం, ఆవసోమవరం పంచాయతీల్లో ఎంపిక సమయంలో చూపినంత చిత్తశుద్ధి ప్రస్తుతం కన్పించడం లేదు. ఆవసోమవరంలో రోడ్డు , కమ్యూనిటీ భవనం, పంచాయతీ భవనం శిథిలమయ్యాయి. చెత్తబండి పాడైపోయింది. చీమలాపల్లిలో గ్రామానికి సమీపంలోనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ డ్రైనేజీసమస్య ఉంది. జంగులూరు, దొప్పెర్ల, ఎర్రవరం పంచాయతీలలో పారిశుధ్యం కార్మికులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేక ఇబ్బందిపడుతున్నారు. వీటికి భిన్నంగా మునగపాక మండలంలో నిర్మల్ పురస్కారానికి ఎంపికైన అరబుపాలెంలో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి.13వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో రైతుల ప్రయోజనార్థం రెండు కల్వర్టులు, 27 కొళాయిల దిమ్మలు, బట్టలు ఉతుక్కునేందుకు వీలుగా దిమ్మలు, తాగునీటి ఇబ్బందులు లే కుండా నూతనంగా పైప్లైన్ ఎక్స్టెన్సన్ పనులు చేపట్టారు. రూ 2లక్షల వ్యయంతో దళితవాడలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. -
సగం ఖాళీ
మున్సిపాలిటీల్లో సిబ్బంది కొరత పట్టణాలుగా మారినా ఫలితం లేదు ఉన్నవారితోనే నెట్టుకొస్తున్న పురపాలికలు సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలు హన్మకొండ : సిబ్బంది కొరతతో మున్సిపాలిటీల్లో పాలన మందగించింది. పారిశుద్ధ్యం, టౌన్ప్లానింగ్ వంటి కీలక విభాగాల్లో ఇన్చార్జుల పాలన కొనసాగుతోంది. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ను మినహాయిస్తే జనగామ, మహబూబాబాద్ మున్సిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఆ పురపాలికలు సగం సిబ్బందితోనే నెట్టుకొస్తున్నాయి. భూపాలపల్లి, పరకాల, నర్సంపేటలు మేజర్ గ్రామపంచాయతీల నుంచి నగర పంచాయతీలుగా 2011లో అప్గ్రేడ్ అయినా ఉద్యోగుల సంఖ్య పెరగలేదు. దీంతో పట్టణ ప్రజలకు మెరుగైన సేవ లు అందడం లేదు. భూపాలపల్లి నగర పంచాయతీ పరిధిలో 20 వార్డులు ఉండగా 31 మంది ఉద్యోగులు ఉండాలి. కానీ, కేవలం 9 మందే విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది మంది ఉద్యోగులు ఇక్కడ పోస్టింగ్ రాగానే ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్పై వెళ్లిపోతున్నారు. గతేడాది భూపాలపల్లిలో పోస్టింగ్ తీసుకున్న మేనేజర్ కొద్ది రోజుల్లోనే మెదక్ జిల్లా దుబ్బాకకు డిప్యూటేషన్పై వెళ్లారు. దీంతో పరిపాలనకు సంబంధించిన పనులు పెండింగ్లో ఉంటున్నాయి. అకౌంట్స్ విభాగంలో ముగ్గురు ఉద్యోగులు ఉండాలనే నిబంధనలుండగా ఒక్కరూ లేకుండా పోయారు. ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పరకాల ఏఈ ఇక్కడ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లి, పరకాలకు ఒక్కరే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఉన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో తాగునీటి నిర్వహణ గాడిన పడటం లేదు. పరకాల నగర పంచాయతీలో 30 పోస్టులు మం జూరు కాగా కేవలం ఆరుగురే విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులపైనే పనిభారం పడుతోంది. టౌన్ ప్లానింగ్లో ఉద్యోగుల పోస్టులు భర్తీ కాకపోవడంతో భవన నిర్మాణ అనుమతుల విషయంలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. భవనాల నిర్మాణ అనుమతి కోరుతూ వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పర్యవేక్షణ అధికారులు లేక పో వడంతో పట్టణంలో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణా లు వెలుస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొంద రు ప్రజాప్రతినిధులు బినామీలను నియమించుకుని నోటీసులు జారీ చేస్తామని బెదిరిస్తూ అక్రమ భవన నిర్మాణ యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. నర్సంపేట నగర పంచాయుతీలో 63 వుంది ఉద్యోగులకుగాను కేవలం 27వుంది ఉన్నారు. వివిధపను ల కోసం కార్యాలయం వచ్చే వారు చిన్న పనికి కూ డా రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. మున్సిపల్ సిబ్బంది మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయా యి. నిత్యం ఒకవర్గంపై మరోవర్గం ఫిర్యాదులు చే సుకుంటూ ప్రజాసేవలను పక్కకు పెడుతున్నారు. అక్కడా అంతే.. 1953లోనే మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన జనగామ మున్సిపాలిటీలోనూ సిబ్బంది కొరత ఉంది. ప్రస్తుతం గేడ్-్ర2 మున్సిపాలిటీగా ఉన్న జనగామలో మొత్తం 132 పోస్టులకు గాను 70 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 62 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా పరిపాలన విభాగంలో 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పట్టణ అభివృద్ధికి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వాన్నంగా మారింది. ఇంజనీరింగ్ విభాగంలో 22 పోస్టులకు గాను 14 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఆధ్వర్యంలో సరైన ప్రణాళికా లేకుండా నిర్మించిన డ్రెరుునేజీలతో కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. వర్షకాలంలో మురుగునీరు, వరద నీటితో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. పబ్లిక్ హెల్త్ వర్కర్లు 57 మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది ఉన్నారు. 2011లో మహబూబాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి ఏకంగా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహబూబాబాద్ మున్సిపాలిటీ జనాభా 52 వేలు. కానీ, అనధికారికంగా సుమారు 70 వేల జనాభా ఉంటుంది. జనాభాకు తగ్గ సిబ్బంది లేరు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ పోస్టు దాదాపు ఏడాదిగా ఖాళీగా ఉంది. దీంతో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఐదు పోస్టులకు గాను ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కొత్త భవనాల నిర్మాణాలకు అనుమతులు కష్టంగా మారాయి. మరికొందరు ఎటువంటి అనుమతి లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. పురపాలక సంఘం పాలకమండలి సమావేశంలో సైతం అక్రమ నిర్మాణాలపై చర్చ జరిగింది. తాగునీటి సమస్య దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. పర్మినెంట్ రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు లేకపోవడంతో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోతున్నాయి. పేరుకే గ్రేటర్ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో 160 పోస్టులకు గాను 124 మంది సిబ్బంది ఉన్నారు. 36 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల 42 విలీన గ్రామాలు కార్పొరేషన్లో విలీనమయ్యాయి. దీంతో దాదాపు 3 లక్షల జనాభా పెరిగింది. ఇందుకు తగ్గట్లుగా పోస్టుల సంఖ్య పెరగాల్సి ఉంది. పరిపాలన విభాగంలో సి బ్బంది కొరత లేకపోవడంతో పాలన వ్యవహారాలకు చాలా వరకు సాఫీగానే సాగుతున్నాయి. కానీ టౌన్ప్లానింగ్, అకౌంట్స్, ప్రజారోగ్య విభాగాల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. టౌన్ప్లానింగ్ విభాగంలో సిబ్బంది లేకపోవడంతో లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, ప్రభుత్వ స్థలాలపై స్పష్టత కరువైంది. రికార్డుల ప్రకా రం 600 ఖాళీ స్థలాలు ఉండగా ప్రస్తుతం 180 స్థలాలనే గుర్తించారు. మిగిలిన స్థలాలు సర్వే చేసేందుకు సరిపడా సిబ్బంది లేరు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఇందుకు అనుగుణంగా వేగంగా పనులు జరిగేందుకు వీలుగా కొత్త పోస్టులు మంజూరు చేయడంతో పాటు పాత పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
పేదల ఆస్పత్రిపై పగ
పేదల పెద్దాస్పత్రిపై పాలకులు పగబట్టారు. ఒకటి కాదు రెండు కాదు వరుస సంఘటనలు ఎన్ని జరుగుతున్నా మాత్రం కళ్లు తెరవడం లేదు. ఆస్పత్రిలో రోజురోజుకు పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా ఆలకించే నాథుడే లేకుండా పోయారు. హాస్పటల్ ప్రాంగణంలో ఎటుచూసినా మురుగునీరు, ఏపుగా పెరిగిన గడ్డి, ఎండిపోయిన చెట్లు, బయో వ్యర్థాలు, ఇతరత్రా పదార్థాలు క్వింటాళ్ల కొద్దీ పేరుకొని కన్పిస్తాయి. దీని వల్ల ఎలుకలు, పందికొక్కులు, ఇతరత్రా కీటకాలు, తాజాగా పాములు సైతం చొరబడే పరిస్థితి దాపురించింది. భరించలేని దుర్వాసనతో ఆస్పత్రికొచ్చే వారు భయాందోళన చెందుతున్నారు. ఆస్పత్రి ఆవరణే దుర్గంధంగా ఉంటే ఇక వార్డుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. పారిశుద్ధ్యం మెరుగుదల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆచరణలో ఆశించిన ఫలితాలు మాత్రం సాధించలేకపోతున్నారు. గుంటూరు మెడికల్: ప్రతి సంఘటనను తమకు అనుకూలంగా మలుచుకుని అధికార పార్టీ నేతలు ఏదో విధంగా లాభపడే ప్రయత్నం చేస్తున్నారు. జీజీహెచ్లో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన సంఘటనను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. గతంలో శానిటేషన్ను రద్దు చేసి టీడీపీ ఎంపీకి చెందిన బంధువులకు కాంట్రాక్టును ఎలాంటి టెండరు లేకుండానే అప్పనంగా అప్పగించారు. గతంలో చెల్లిస్తున్న దానికంటే అదనంగా రెండింతలు ఎక్కువ డబ్బులు అధికార పార్టీ నేతలకు చెందిన కాంట్రాక్టర్కు డబ్బులు ఇస్తున్నప్పటికీ శానిటేషన్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడ మాదిరిగానే ఉంది. ప్రభుత్వం ఇకనైన చిత్తశుద్ధితో బంధు ప్రీతిని పక్కన పెట్టి పెద్దాసుపత్రి పారిశుద్ధ్యంపై దృష్టి సారించకపోతే పాములు, ఎలుకల నిలయంగా ఆసుపత్రి మారే ప్రమాదం ఉంది. నీటి మూటలుగానే పాలకుల, అధికారుల మాటలు... రాష్ట్రంలోనే అతిపెద్ద పేదల పెద్దాసుపత్రి, రాజధాని జిల్లా ఆస్పత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శానిటేషన్ మెరుగుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామంటూ ఆస్పత్రి అధికారులు, పాలకులు చెబుతున్న మాటలు కేవలం నీటి మాటలుగానే ఉన్నాయే తప్పా చేతల్లో కాదనే విషయం ఆస్పత్రిలో పాము ప్రత్యక్షం అవ్వటంతో రుజువైంది. గతంలో ఒక సారి పాము రాగా తాజాగా డిసెంబర్ 31న పాము ప్రత్యక్షం అవ్వటంతో ఆస్పత్రిలో బ్రహ్మండంగా శానిటేషన్ పనులు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న శానిటేషన్ నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు ప్రాణాలు పోవటంతో ప్రభుత్వం, అధికారులు హడావుడి చేశారు. శానిటేషన్ కాంట్రాక్ట్ను రద్దుచేసి ఎలాంటి టెండర్లు లేకుండానే నేరుగా టీడీపీ ఎంపీ బంధువులకు చెందిన పద్మావతి శానిటేషన్కు సర్వీసెస్కు 2015 సెప్టెంబర్ 4 నుంచి జీజీహెచ్ శానిటేషన్ బాధ్యతలు అప్పగించారు. గతంలో సుమారు రూ.21 లక్షలు నెలకు చెల్లిస్తుండగా దానిని రెండంతలు చేసి నూతన శానిటేషన్ నిర్వాహకులకు బాధ్యతలు అప్పగించారు. కేవలం కాంట్రాక్టర్లు మారారే తప్ప ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగుదల విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు. -
నా తప్పేంటి?
అమ్మ... కడుపు చించుకుంటే పుట్టాన్నేను! అమ్మకు... కడుపుకోత మిగిల్చి వెళ్లాన్నేను! అమ్మకింత పెద్ద శిక్షేంటి? నాన్నకింత తీరని శోకమేంటి? చెత్తకుండీలో పడేసినా బతికి ఉండేవాడినేమో! ఐసీయూలో పెట్టి చంపేశారు!! అమ్మ ఇచ్చే స్తన్యం అమ్మ చేయించే స్నానం అమ్మ పొత్తిళ్లు అమ్మ లాలిపాట... ఏవీ నాకు దక్కకుండానే ఐసీయూ నన్ను కొరికేసింది! నాన్న పెట్టే ముద్దులు నాన్న పట్టే రథాలు నాన్న పుణికే బుగ్గలు నాన్న పడే సంబరాలు... ఏవీ నాకు లేకుండానే ఐసీయూ నన్ను కాటికి పంపింది! గర్భంలా కాపాడుతుందనుకుంటే... ఐసీయూ నాకు ఆగర్భశత్రువైంది! ఇలా పుట్టాను. అలా చనిపోయాను. నాదొకటే ప్రశ్న! నేను చేసిన తప్పేంటి? మా అమ్మానాన్నలు చేసిన పాపమేంటి? నాదే ఇంకొక ప్రశ్న! నన్ను చంపింది ఆకలిగొన్న ఎలుకలా? అలక్ష్యాల పందికొక్కులా? బ్రహ్మ కడిగిన పాదమూ...! బ్రహ్మ సృష్టికర్త అతని సృష్టే ఈ చిన్నారి పాదాలు కడుపులో తన్నినప్పుడు తల్లి పులకిస్తుంది. గుండెల మీద తన్నినప్పుడు తండ్రి పరవశిస్తాడు. బుడిబుడి అడుగులు వేసినప్పుడు కృష్ణపాదాలను తలచుకుంటాం. ముద్దాడాల్సిన ఈ పాదాలు రక్తపు ముద్దలుగా మారాయి. మనకు రక్తం ఉడకదా? ప్రతి తల్లికీ... నెత్తుటి కన్నీరు కారదా? మురికిని పెంచారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో 1170 పడకలు ఉన్నాయి. వీళ్లకు కనీసం వేయి మంది అటెండర్స్ ఉంటారు. వీళ్లు గాక రోజూ 2500 మంది ఔట్ పేషెంట్స్ వస్తుంటారు. వీరందరూ తెచ్చే ఆహార పదార్థాలు వాటి వ్యర్థాలు రోజూ గుట్టలుగా పోగవుతుంటాయి. దీని కోసం 300 మంది పారిశుద్ధ్య సిబ్బంది పని చేయాలి. కానీ సగం మంది కూడా పని చేయడం లేదు. అందువల్ల ఎలుకలు పెరిగాయి. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. వైద్యులు తక్కువయ్యారు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి సిబ్బందిని మంజూరు చేయడం లేదు. 15 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7 అసోసియేట్ ప్రొఫెసర్లు, 22 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయి. వాటినీ నింపలేదు. 400 మంది నర్సులు ఉండాలి. కానీ 200 మంది కూడా లేరు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు వరకూ ఓపి. కానీ డాకర్లు ఒకటి రెండు గంటలు కూడా చూడరు. క్లాసులు చెప్పుకుంటూ ప్రయివేటు ప్రాక్టీసు చేసుకుంటూ ఉంటారు. నర్సులు కంటికి కనిపించరు. ఈ దేశంలో ప్రాణం ఖరీదు చాలా తక్కువ. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో డెడ్ చీప్. ఈ లోపాలన్నింటికీ రోగులు ప్రాణాలను ఫీజుల కింద చెల్లిస్తుంటారు. జవాబుదారీ లేదు: కొంతకాలంగా జీజీహెచ్కు రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉండడం లేదు. అధికార పార్టీ నాయకులు నియమించిన వారే ఇన్చార్జి సూపరింటెండెంట్లుగా చలామణి అవుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే అనేక వైద్యుల కంటే వీరు జూనియర్లు కావడంతో వీరి మాటను ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనికితోడు సమస్యలపై వీరికి సరైన అవగాహన ఉండటం లేదు. చిత్తశుద్ధితో బాధ్యతలనూ నిర్వర్తించడం లేదు. పాత కట్టడాల పాపం: జీజీహెచ్లో పారిశుద్ధ్యం మొదటినుంచీ అధ్వాన్నమే. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కట్టడాలు బాగానే ఉన్నప్పటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా ఉండటంతో ఎలుకలు, పాములుకు నిలయంగా మారిపోయింది ఆసుపత్రి. లంచాల పీడ: ఆస్పత్రిలో రోజూ వారి చెత్తతో పాటు ప్రతిరోజూ ప్రసవాల వల్ల, శస్త్ర చికిత్సల వల్ల కనీసం 300 కిలోల జీవ వ్యర్థాలు పోగవుతాయి. వీటిని శుభ్రపరచడానికి కాంట్రాక్టర్కు నెలకు 21 లక్షల రూపాయలను కేటాయించారు. కాంట్రాక్ట్ ప్రకారం సరిగ్గా వ్యర్థాలను తీస్తున్నాడా, లేదా గమనించి అధికారులు బిల్లులు శాంక్షన్ చేయాలి. కాని లంచాల కారణంగా పని సరిగ్గా జరగకపోయినా బిల్లులు శాంక్షన్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కనుక చెత్త పెరిగిపోయింది. పాలకులు ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను పదవి చేపట్టాక దాదాపు 20 సార్లు గుంటూరుకు వచ్చి వెళ్లారు. కాని ఒక్కసారి కూడా జి.జి.హెచ్ను సందర్శించలేదు. సందర్శించి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. పసిపిల్లాడిని ఎలుకలు కొరికి చంపిన ఘటన తర్వాత కూడా ఆయన రాలేదు. వచ్చిన నాయకులు కంటితుడుపు మాటలే మాట్లాడారు. ఉత్తుత్తి సస్పెన్షన్లు చేశారు. సిబ్బందిలో తాము తప్పు చేస్తే శిక్ష ఉంటుందనే భయం రాలేదు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు చేసిన గొడవ వల్లే ఈ మాత్రమైనా స్పందన వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. వైద్యం చేయించుకుంటారా? గుంటూరు జిల్లాలో ప్రముఖులైన నేతలు ఎందరో ఉన్నారు. వారి వైద్యం అంతా కుటుంబ సభ్యుల వైద్యం అంతా ప్రయివేటు ఆస్పత్రుల్లో, లేదంటే హైదరాబాదులోని ఖరీదైన ఆస్పత్రుల్లో జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రభుత్వాధికారులు కూడా వైద్యం కోసం ఈ వైపు రారు. వస్తే వారికి పేదల బాధలు తెలిసేవి. వచ్చే పేదల గోడు అర్థమయ్యేది. ‘ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లోనే చదివించాలి’ అంటూ అలహాబాద్ హైకోర్ట్ పేర్కొన్న మాటలు (దిగువన ఉన్న ‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కు పంపండి’ బాక్స్ చూడండి) అమలైతే ప్రభుత్వ బడుల్లో ఎంతో మార్పు వస్తుంది. అలాగే, ప్రభుత్వ సిబ్బంది అంతా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలి అనే నిబంధన పెడితే తప్ప ఈ ఆస్పత్రుల్లో మార్పు రాదేమో. ఏం శిక్ష పడింది? ఎలుకల దాడిలో శిశువు మరణించిన సంఘటనకు బాధ్యులను చేస్తూ ప్రభుత్వం జీజీహెచ్ సూపరింటెండెంట్, పిల్లల శస్త్రచికిత్స విభాగాధిపతులపై బదిలీ వేటు, సీఎస్ఆర్ఎంఓ, శానిటరీ ఇన్స్పెక్టర్, హెడ్నర్సు, స్టాఫ్నర్సులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రకటన చేసింది. అయితే ఇంత వరకు ఎటువంటి ఉత్తర్వులూ జారీ కాలేదు. అధికారులు, నర్సులు హాయిగా విధుల్లో కొనసాగుతున్నారు. సంఘటనకు బాధ్యులు ఎవరో ఇంత వరకు ప్రభుత్వం తేల్చలేకపోయింది. రాలే పసిమొగ్గలు... గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం పల్లెల నుంచి చుట్టుపక్కల పట్టణాల నుంచి పేదలు మధ్యతరగతి వారు వస్తుంటారు. ముఖ్యంగా నవజాత శిశువులు కాని, చిన్న పిల్లలు కాని రోజుకు 30 మంది ఇన్ పేషెంట్స్గా చేరుతుంటారు. కాని వీరిలో ఊపిరి పోసుకుని తిరిగివెళ్లేవారి సంఖ్య ఆశాజనకంగా లేదు. ఈ జూలైలో 367 మంది నవజాత శిశులు ఇన్పేషెంట్స్గా చేరితే 117 మంది చనిపోయారు. చిన్నపిల్లల ఐసియూలో 78 మంది చేరితే 32 మంది చనిపోయారు. ఆగస్టులో 224 మంది నవజాత శిశువులకు 78 మంది చనిపోయారు. చిన్నపిల్లల్లో 58 మంది చేరితే 10 మంది చనిపోయారు. జనవరి నుంచి ఆగస్టు వరకు లెక్కలు తీస్తే 913 మంది శిశు/చిన్నారుల మరణాలు అంటే ముప్పై శాతం మరణాలు నమోదయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో రావడం ఒక కారణమైనా పూర్తి స్థాయి వైద్యం అందించే పరికరాలు, వైద్యులు లేకపోవడం మరో ప్రధాన కారణం. -
ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో మంగళవారం వార్డుల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఒకటవ వార్డు సందర్శనకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, చైర్పర్సన్ శ్రీదేవిని స్థానికులు అడ్డుకున్నారు. నెలరోజులుగా కుళాయిల ద్వారా బురదనీరు సరఫరా చేస్తుండడంపై మండిపడ్డారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంపై ప్రశ్నించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన స్థానిక టీడీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. -
ఊడ్చిన చెత్త ఊరినెత్తిన
పల్లెల్లో కొరవడిన పారిశుధ్యం పంచాయతీల్లో కానరాని డంపింగ్ యార్డులు నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం మహారాణిపేట (విశాఖ): పల్లెల్లో పారిశుధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. స్వచ్ఛభారత్ కార్యక్రమం తొలినాళ్లలో కొందరు చీపుళ్లు పట్టుకుని హడావుడి చేశారు. ప్రభుత్వ కార్యాలయల పరిసరాల్లో ఊడ్చడం, పరిశుభ్రం చేయడం కనిపించేది. దీంతో గ్రామాల స్వరూపం మారిపోతుందని అంతా ఆశించారు. పారిశుధ్యం మెరుగు పడుతుందని ఆశించారు. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం రెండడుగులు ముందుకేసి ప్రతి గ్రామంలోనూ డంపింగ్యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు 20 నుంచి 30 సెంట్లు భూమి కేటాయించాలని తహశీల్దార్లు, సర్పంచ్లను ఆదేశించింది. అధికారుల పట్టించుకోని తనమో, సర్పంచ్ల నిర్లక్ష్యమో కాని జిల్లాలో ఇది అమలు కాలేదు. ఒక్క పంచాయతీలోనూ డంపింగ్యార్డు ఏర్పాటు కాలేదు. అవగాహన లోపంతో గ్రామీణులు ఇళ్లల్లో ఊడ్చిన చెత్తను తెచ్చి రోడ్లపై వేసేస్తున్నారు. దీంతో పారిశుధ్యం కొరవడి పరిస్థితి దయనీయంగా ఉంటోంది. 12 పంచాయతీల్లోనే స్థలాల గుర్తింపు జిల్లాలో 925 పంచాయతీల్లో కేవలం 12మంది సర్పంచ్లు మాత్రమే డంపింగ్యార్డులకు స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. మిగతా వారు పట్టించుకోలేతదు. అసలు ఈ యార్డులు ఎవరు ఏర్పాటు చేయాలన్న దానిపై ఇంత వరకూ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఈ లక్ష్యం నీరుగారిపోతోంది.గ్రామాల్లో పారిశుధ్యం కొరవడి అన్ని వీథుల్లోనూ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. జనం రోగాలతో మంచానపడి విలవిల్లాడుతున్నారు. యార్డుల ఏర్పాటు ఎలా అంటే.. డంపింగ్యార్డుకు 20 నుంచి 30 సెంట్లు స్థలం ఉండాలి. దానిని గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్లే గుర్తించాలి. పంచాయతీ స్థలం లేకపోతే రెవెన్యూ అధికారులు కేటాయించాలని సర్పంచ్ మండల తహశీల్దార్కు లేఖ రాయాలి. అప్పుడు రెవెన్యూ అధికారులు ఆ పంచాయతీ పరిధిలో 30సెంట్లు స్థలం గుర్తించి ఇవ్వాలి. ఉపాధిహామీ పథకంలో ఈ డంపింగ్యార్డు ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఊడ్చిన చెత్తనంతటినీ తెచ్చి ఇక్కడ వేయాలి. ఈ విధానం ఏ మండలంలోనూ కానరావడం లేదు. అసలు ఈ డంపింగ్యార్డులు గురించి పంచాయతీ అధికారులే పట్టించుకోవడం లేదు. గ్రామపంచాయతీలపై ఈవోపీఆర్డీల పర్యవేక్షణ లేదు. ఇబ్బంది కరంగా ఉంది శ్రీరాంపురంలో పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ప్రాంతాల్లో రోడ్డుకు ఇరు వైపులా రోజూ చెత్త వేసేస్తున్నారు. వ ర్షం పడితే ఇబ్బందిగా ఉంటోంది. డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటకయినా అధికారులు స్పందించాలి. రోడ్డు పక్కన చెత్త వేయకుండా చూడాలి. -ఎం.శ్రీనివాసరావు, శ్రీరాపురం -
ఈ మరణాలు ఆగవా.. ?
ఏజెన్సీలో పెరుగుతున్న మృతుల సంఖ్య - ఇప్పటికే 11మంది కన్నుమూత - పారిశుధ్యం, వైద్యసేవల్లో లోపమే కారణమంటున్న ఆదివాసీలు జైనూర్ : ఉట్నూర్ ఏజెన్సీలోని జైనూర్, సిర్పూర్-యూ తదితర ఏజెన్సీ గ్రామాల్లో మరణాలు ఆగడం లేదు. జ్వరాలతో పాటు ఇతరత్రా వ్యాధులు ప్రబలడంతో ప్రతిరోజూ ఒకరు లేదా ఇద్దరు మృత్యువాత పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు తీవ్రంగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్య లోపానికి తోడు సరైన వైద్యసేవలందకే మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని తెలుస్తోంది. మొన్న ఇద్దరు.. నిన్న ఇద్దరు జ్వరాల బారిన పడి సరైన వైద్యసేవలందక జైనూర్ మండలంలోని అడ్డెసారకు చెందిన గిరిజన బాలిక పంద్ర తాటిగూడకు చెందిన ధనలక్ష్మి (8), జంగాం కిషన్నాయక్తండాకు చెందిన రాథోడ్ దుర్రిబాయి(45) శుక్రవారం మృతి చెందారు. ఇక సిర్పూర్-యూ సీతాగోంది గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి ఆత్రంయశ్వం త్రావు(11)తోపాటు కనక దేవుబాయి(60) శనివారం మృతి చెందారు. ఇలా ఇప్పటివరకు పరిశీలిస్తే గత నెల నుంచి 11మంది వరకు మృతి చెందిన ట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నా మెరుగైన వైద్యం అందక పలువురు మృతి చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే, కొన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటుచేస్తున్నా సరిపడా మందులు అందజేయకపోవడంతో ఫలితం ఉండడం లేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి పరిస్థితి నెలకొంటోంది. అలాగే, సిర్పూర్- యూ మండలం పంగడి సబ్సెం టర్కు ఏఎన్ఎం పోస్టు ఖాళీగా ఉండడంతో వైద్య సేవలందడం లేదని పం గిడి సర్పంచ్ జాలింషా తెలిపారు. జైనూర్ పీహెచ్సీలో శనివారం అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ ప్రభాకర్, డీఎంఓ అల్హం రవి నిర్వహించిన సమీక్ష పమావేశంలో పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ సరైన మందులు లేవని చెప్పడం శాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇకనైనా మృతుల సంఖ్య పెరగకముందే అధికారులు మేల్కొని జ్వరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గిరిజనులు కోరుతున్నారు. -
వామ్మో.. అతిసారం
జిల్లా ఆస్పత్రిలో పెరుగుతున్న బాధితులు కలుషిత నీరే కారణమంటున్న వైద్యులు తాండూరు రూరల్ : మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెతో కొన్నిరోజులుగా వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో అతిసారం ప్రబలగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో రోగులు చేరుతున్నారు. అసలే వర్షాకాలం.. ఆపై పారిశుద్ధ్యం పట్ల ప్రజాప్రతిని ధులు, అధికారులు, వైద్యసిబ్బంది జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోజురోజుకూ గ్రామీణ ప్రజలు అతిసారంతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే దీని బారిన పడుతున్నారని ఇక్కడి వైద్యులు నిర్ధారిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటిని సరఫరా చేసే ఓవర్హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతోనే ఈ సమస్య పెరుగుతోంది. దీనికితోడు పైప్లైన్లు లీకేజీలు లేకుం డా, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలేవీ తీసుకోవడం లేదు. తాండూరు డివిజన్లోని చాలా గ్రామాల్లో తాగునీటి కుళాయిల వద్ద మురుగు చేరి, చేతిపంపుల వద్ద అపరిశుభ్రంగా మారింది. ఈనెల 1 నుంచి 13వ తేదీ వరకు 367 మంది అతిసారం రోగులు జిల్లా ఆస్పత్రిలో చేరారు. 1న 26 మంది, 2న-30 మంది, 3న 25 మంది, 4న 26 మంది, 5న 30 మంది, 6న 26 మంది, 7న 27 మంది, 8న 20 మంది, 9న 31 మంది, 10న 30 మంది, 11న 31మంది, 12న 33 మంది, 13న 32 మంది ఈ ఆస్పత్రికి వచ్చారు. కాగా, జిల్లా ఆస్పత్రిలో రోగులకు కనీస వసతులు లేవు. సరైన మంచాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులు పడుకొని వైద్యం చేయించుకునే పరిస్థితి నెలకొంది. మొరపెట్టుకున్నా స్పందనలేదు గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని పలుమార్లు ‘ప్రజాదర్బారు’లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో గ్రామంలో చాలా వరకు అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా తాగునీటి కుళాయిల వద్ద మురుగు, అపరిశుభ్ర వాతావరణంతోనే ఈ సమస్య పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్యసిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. - వెంకటేషం, గౌతాపూర్ జాగ్రత్తలు తప్పనిసరి ప్రస్తుతం వర్షాకాలం ఉంది కాబట్టి తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మరిచిపోవద్దు. ఎక్కువగా ఫిల్టర్ నీటిని లేదా మరగబెట్టిన నీటిని తాగే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. తాగునీటి కుళాయిల వద్ద పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా జాగ్రత్తలు పాటించాలి. - జయప్రసాద్, వైద్యుడు, తాండూరు జిల్లా ఆస్పత్రి -
యువర్ అటెన్షన్ ప్లీజ్...ముక్కుమూసుకోండి..
- బెజవాడ రైల్వేస్టేషన్లో క్షీణించిన పారిశుధ్యం - దుర్గంధం వెదజల్లుతున్న ప్లాట్ఫారాలు - ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు రైల్వేస్టేషన్ : రాష్ట్రంలోనే ప్రధాన జంక్షన్గా ఉన్న విజయవాడ రైల్వేస్టేషన్లో పారిశుధ్యం క్షీణించింది. ప్లాట్ఫారాలు, ట్రాక్లపై చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సెప్టిక్ ట్యాంకుల నుంచి లీకేజీలతో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తుండడంతో ప్రయాణికులు ముక్కులు మూసుకొని ప్రయాణించాల్సి వస్తోంది. రాజధాని నగరానికి అతి పెద్ద జంక్షన్లో సౌకర్యాల మాట ఎలా ఉన్నా కనీసం పారిశుధ్య లోపం లేకుండా చూస్తే చాలని ప్రయాణికులు అంటున్నారు. రైల్వేస్టేషన్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. శనివారం వరకు పుష్కర యాత్రికుల రాకపోకలతో కిక్కిరిసి ఉండడంతో పారిశుధ్య పరిస్థితులు దిగజారాయి. పలు ప్లాట్ఫారాలు చెత్తతో దర్శనమిస్తున్నాయి. ట్రాక్ల్లో సైతం చెత్తతో నిండిపోయాయంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థమవుతుంది. ఏడో నంబరు ప్లాట్ఫాంపై మురుగునీటి పైపు లీక్ కావడంతో ఆ ప్రాంతంలో మురుగు పాకుడు చేరింది. ఈ ప్లాట్ ఫాంపై నడవాలంటే ముక్కుమూసుకోవాల్సిందే. వెస్ట్బుకింగ్ వైపు పదో నంబరు ప్లాట్ఫాంపై ఇటీవల సెప్టిక్టాంక్లీకు కావడంతో ఆ ప్రాంతమంతా మల, మూత్రాలతో నిండిపోయింది. దీంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. స్టేషన్ నుంచి ఇవి రోడ్డుపైకి కూడా చేరడంతో స్థానికులు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాటిని తొలగించారు. వెస్ట్బుకింగ్ వైపు పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. రైల్వేస్టేషన్లో పారిశుధ్య పనుల కోసం వందలాది మంది సిబ్బంది ఉన్నా వారు సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నిత్యం వేలాది మంది ప్రయాణించే రైల్వేస్టేషన్ను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఆదర్శం మరుగు
ఇది కౌతాళం ఎంపీపీ లక్ష్మి ఇల్లు. ప్రజాప్రతినిధిగా సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతున్న ఈమె ఇంట్లో మరుగుదొడ్డి లేదంటే నమ్మలేని నిజం.వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన నాయకులే ఆరుబయటకు వెళ్తుంటే.. మార్పు ఎలా సాధ్యం. ఆత్మకూరుమండల పరిషత్ అధ్యక్షురాలు సౌజన్య.. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడు సర్పంచ్ నాగన్న.. కురుకుంద ఎంపీటీసీ సభ్యురాలుశిరీష.. కౌతాళం ఎంపీటీసీ-2 సభ్యురాలు నర్సమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే మరుగుదొడ్డి లేని నేతల జాబితా చాంతాడు. - మరుగుదొడ్డీ లేని ప్రజాప్రతినిధులు - జిల్లాలో 6వేల మంది ఇళ్లలో ఇదే పరిస్థితి - అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం - నీరుగారుతున్న లక్ష్యం కర్నూలు సిటీ: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. కనీసం నాయకుల్లోనూ మార్పు తీసుకురాలేని పరిస్థితి. ఆర్థిక స్థోమత ఉండి కొందరు.. లేక మరికొందరు ఇప్పటికీ బహిర్భూమికి ఆరుబయటకే వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నేతల తీరు నవ్వులపాలు చేస్తోంది. స్వచ్ఛ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించాలనే లక్ష్యం ఎంచుకున్నా.. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలంలో 15 మంది సర్పంచ్లు ఉండగా 7గురు, 16 మంది ఎంపీటీసీల్లో 5గురు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించుకోవడం చూస్తే ప్రచారం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల మాట సరేసరి. పల్లెల్లో ప్రజాప్రతినిధులు శివారులోని వాగులు, ముళ్లకంపల చాటులో కాలకృత్యాలు తీర్చుకోవడం ఇప్పటికీ సర్వసాధారణమే. పురుషుల మాట అటుంచితే.. మహిళలూ ఆరుబయటకే వెళ్లాల్సిన పరిస్థితి చూస్తే హైటెక్ అభివృద్ధి ఎక్కడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. సెల్ఫోన్ విషయంలో చూపే శ్రద్ధ మరుగుదొడ్డి నిర్మించుకునే విషయంలో కనపర్చకపోవడం వారిలోని చైతన్యానికి నిదర్శనం. ప్రోత్సాహకం పెంచినా.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మల భారత్ అభియాన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం గతంలో రూ.12వేలు చొప్పున మంజూరు చేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు దిశగా చేపట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రోత్సాహకాన్ని రూ.15వేలకు పెంచింది. అయితే ఏడాది కావస్తున్నా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో నిర్మాణాలు లేకపోవడం గమనార్హం. నాయకా.. రాష్ట్ర ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులందరి ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు పంచాయతీ అధికారులతో సర్వే చేయించగా.. జిల్లాలోని 6,698 మంది ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లు గుర్తించారు. ఇందులో ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు 412.. గ్రామ పంచాయతీ సర్పంచ్లు 462, వార్డు సభ్యులు 5514 మంది, 310 పంచాయతీ కార్యాలయాల్లో మగురుదొడ్లు లేనట్లు వెల్లడైంది. వీరందరికీ జూన్ లోపు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా ఎంచుకున్నా.. నేటికీ 10 శాతం మించకపోవడం స్వచ్ఛ భారత్పై అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. -
నగరమా.. నరకమా?
-
పుర‘పోరు’ ఉధృతం
మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె నిలిచిన పారిశుద్ధ్య పనులు.. పట్టణాల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారం మంత్రి యనమల వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికుల మండిపాటు ఆదివారం అర్ధరాత్రి నుంచి కరెంటు, నీరు సేవలు బంద్ సోమవారం నుంచి రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమం పుష్కర విధుల బహిష్కరణ హెచ్చరికలు విజయవాడ బ్యూరో, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఉధృత రూపం దాల్చింది. పది ప్రధాన డిమాండ్లపై ఈ నెల పదోతేదీ అర్ధరాత్రి నుంచి చేపట్టిన సమ్మెతో పారిశుద్ధ్య సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 36వేల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది సమ్మె బాట పట్టారు. 25వేల మంది పర్మినెంట్ ఉద్యోగుల్లో 80 శాతం మంది సమ్మెలోకి దిగారు. కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వ మనుషులు కాదని, వారి డిమాండ్లు నెరవేర్చనవసరంలేదని మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాలో మున్సిపల్ కార్మికులు భార్య, పిల్లలతో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో చెత్తాచెదారాన్ని మున్సిపల్ చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మి, కౌన్సిలర్లు శుభ్రం చేశారు. ప్రకాశం జిల్లాలో పంచాయతీ కార్మికులతో పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు చేయించే ప్రయత్నాలు చేశారు. విశాఖలో కార్మికులకు అధికారులు నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పుష్కరాలపై సమ్మె ప్రభావం.. ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె తీవ్ర ఇబ్బందికరంగా మారింది. కార్మికులు సమ్మె విరమించకపోతే పలు జిల్లాల్లోని పంచాయతీల పారిశుద్ధ్య కార్మికుల్ని పుష్కర పనులకు తరలించేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఒత్తిళ్లు పెంచుతోంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించండి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించి, వారి చేత సమ్మెను విరమింపజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆదివారం లేఖ రాశారు. ప్రభుత్వం మొండివైఖరి విడనాడి మున్సిపల్ కార్మికుల సమస్యలను మానవతా దృక్ఫథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. నీరు, కరెంటు సేవలు బంద్... సమ్మె చేపట్టి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మంచినీరు, కరెంటు సేవలను కూడా బంద్ చేయాలని మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. ఆదివారం నుంచి దశలవారీగా నీరు, కరెంటు సేవలను అందించే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తున్నారని జేఏసీ నేత వి.ఉమామహేశ్వరరావు సాక్షికి చెప్పారు. సోమవారం నుంచి అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 14వ తేదీనుంచి జిల్లా కలెక్టరేట్లు, మున్సిపల్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించేందుకు కార్మిక సంఘాలు తీర్మానించాయి. 16న విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట ప్రదర్శన నిర్వహించేందుకు జేఏసీ నాయకులు తీర్మానించారు. -
నగరం చెత్త మయం
- కార్మికుల సమ్మెతో పేరుకుపోయిన చెత్త - దుర్గంధంతో ప్రజల ఇక్కట్లు - పొంచి ఉన్న రోగాల ముప్పు సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్త. వీధుల్లో నిండిపోయి దర్శనమిసుతన్న చెత్తకుండీలు. కంపు కొడుతున్న కాలనీలు. ముసురుతున్న ఈగలు.. దోమలు.. వాటి చుట్టూ వీధి కుక్కలు.. ఇదీ నగరంలో పారిశుద్ధ్య పరిస్థితి. రెండో రోజైన మంగళవారం కూడా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె కొనసాగించడంతో నగరం దుర్గంధంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎక్కడి చెత్త అక్కడే గుట్టలుగా పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధాన రహదారులపై పరచినట్లుగా చెత్త పేరుకుపోయింది. జీహెచ్ఎంసీలోని పారిశుద్ధ్య కార్మికులతోపాటు, దోమల నివారణ, తదితర విభాగాల్లోని కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దాదాపు 26 వేల మంది ఉన్నారు. వీరంతా విధులను బహిష్కరించడంతో నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పూర్తిగా పడకేశాయి. ఏమూల చూసినా చెత్త గుట్టలు గుట్టలుగా పోగైంది. ప్రధాన రహదారుల్లోనూ ఇదే దుస్థితి. గ్రేటర్లో రోజూ దాదాపు 3800 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తారు. అలాంటిది గత రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు విధులను బహిష్కరించడంతో నగరం దుర్గంధభరితంగా మారింది. దీంతో వెక్టర్బోర్న్ వ్యాధుల ప్రభావం పొంచి ఉంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు అన్ని జోన్లు, సర్కిళ్ల పరిధిలోనూ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో పరిస్థితి తీవ్రత కనిపించింది. మంగళవారం జరిగిన చర్చల్లోనూ యూనియన్ల డి మాండ్లు పరిష్కారం కాకపోవ డంతో సమ్మె కొనసాగుతుందని ఆయా కార్మికసంఘాలు స్పష్టం చేశాయి. సమ్మె నిర్వహిస్తున్న యూనియన్లలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఎంఎస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, ఏఐయూటీయూసీ, టీఆర్ఎస్ కేవీ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాలున్నాయి. సమ్మెలోకి మేం కూడా: జీహెచ్ఎంఈయూ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తుండటంతో బుధవారం నుంచి తాము కూడా సమ్మెలోకి దిగుతున్నట్లు అధికార పార్టీకి అనుబంధ యూనియన్ అయిన టీఆర్ఎస్ కేవీ- జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు. గోపాల్ తెలిపారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషన్ కమిషనర్(పరిపాలన)లకు సమ్మె నోటీసు అందజేశామన్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి నిరవధికంగా సమ్మె కొనసాగిస్తామన్నారు. తమ యూనియన్లో 14 వేల మంది ఔట్సోర్సింగ్ కార్మికులతోపాటు 4వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారన్నారు. వీరందరూ సమ్మెలో పాల్గొంటారని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు : కమిషనర్ సోమేశ్కుమార్ సాక్షి, సిటీబ్యూరో రంజాన్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కార్మికులు వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరుకావాల్సిందిగా కమిషనర్ సోమేశ్కుమార్ విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నందున వెంటనే విధులకు హాజరు కావాలని కోరారు. మరోవైపు.. సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా సోమేశ్కుమార్ సీనియర్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు పర్యవేక్షించాలని స్వచ్ఛ కమిటీలకు సూచిం చారు. జీహెచ్ఎంసీ కార్మికులు విధులకు హాజరుకాని పక్షంలో స్థానికంగా అందుబాటులో ఉండే కార్మికుల సేవలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని సూచించారు. -
'జీతాలు ఈరోజే చెల్లించండి'
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఢిల్లీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలకు విముక్తి లభించింది. వారి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జతకట్టి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రభుత్వాన్ని విమర్శల దాడికి దిగిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చింది. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించకుండా ఉన్న జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలన్న వారి డిమాండ్ కు ప్రభుత్వం స్పందించి రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే, ఆలోపే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం రోజే వారికి మొత్తం రూ.493 కోట్లు విడుదల చేయాల్సిందిగా నగర మేయర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వెంటనే వారికి జీత భత్యాలు చెల్లించాలని కోరారు. ఈ నెల జూన్ 2 నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగడంతో ఢిల్లీలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. -
'మీ ధర్నాలో ఎన్నిగంటలయినా కూర్చుంటా'
-
'మీ ధర్నాలో ఎన్నిగంటలయినా కూర్చుంటా'
న్యూఢిల్లీ: పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ అన్నారు. ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికులతో కలసి ఆయన ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఢిల్లీ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు మద్ధతు తెలిపిన రాహుల్ వారితో కలసి రోడ్డుపై బైఠాయించారు. గత మూడు నెలలుగా జీత భత్యాలు చెల్లించడం లేదంటూ చేస్తున్న ధర్నాలో ఆయన దాదాపు గంటపాటు వారితో కూర్చున్నారు. అంతకుముందు ధర్నా వద్దకు వచ్చిన రాహుల్ తనకు మీ ఆందోళనలో పాలు పంచుకోవాలని ఉందని, ఎన్నిగంటలయినా మీతో కలిసి ధర్నాలో కూర్చోవాలని ఉందని చెప్పారు. అనంతరం ఢిల్లీ సర్కారు, కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ మండిపడ్డారు. యూపీఏ హయాంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేశారని అన్నారు. -
తెల్లవారక ముందే రోడ్లూడిస్తే జైలుశిక్ష
స్వచ్ఛ భారత్ కోసం సాక్షాత్తు ప్రధాన మంత్రే చీపురుపట్టి రోడ్లూడుస్తుంటే...జార్జియాలోని శాండీ స్ప్రింగ్స్ నగరంలో మాత్రం ఓ పారిశుద్ధ్య కార్మికుడు చెత్త 'శుద్ధి' ఎక్కువై తెలతెలవారక ముందే రోడ్లు ఊడుస్తుంటే బొక్కలోతోశారు పాపం! 30 రోజులు జైలు శిక్ష కూడా విధించారు. ఆ నగరంలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల మధ్యనే రోడ్లూడవాలనేది అక్కడ రూల్. అంతుకుముందు రోడ్లూడుస్తుంటే మేడలు, మిద్దెల్లో నివసించే విలాసవంతుల నిద్రకు భంగం కలుగుతుందని నగర మున్సిపల్ అధికారులు ఈ రూల్ తీసుకొచ్చారట. మూడు నెలల క్రితమే పనిలో చేరిన పారిశుద్ధ్య కార్మికుడు మ్యాక్గిల్ ఓ రోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోడ్లూడుస్తూ అధికారుల కంటపడ్డాడు. అంతే అతని పెడరెక్కలు విరిచి పట్టుకొని తీసుకెళ్లి బొక్కలో వేశారు. మ్యాక్గిల్కు సొంతంగా లాయరును పెట్టుకొనే స్థామత లేకపోవడంతో అధికారుల తరఫున చీఫ్ ప్రాసిక్యూటర్ బిల్ రిలే కోర్టులో వీరంగం వేశారు. చట్టాలను అతిక్రమించి తెల్లవారుజామునే పారిశుద్ధ్య కార్మికులు రోడ్లూడవడం తరచూ జరుగుతోందని, నష్టపరిహారంతో దారికి రావడం లేదని, జైలు శిక్ష వేయడమే తగిన శిక్షంటూ తెగవాదించారు. ఆయన వాగ్ధాటికి కోర్టులో ఆసీనులైవున్న జడ్జీగారు మురిసిపోయారో, భయపడ్డారో తెలదుగానీ మ్యాక్గిల్కు 30 రోజుల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పు చెప్పారు. అయితే ఆ తర్వాత మ్యాక్ గిల్ శిక్షను కోర్టు తగ్గించింది. -
పల్లెల్లో పరిశుభ్రతకు ‘వాష్’
నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంశాలకు ప్రాధాన్యం పైలట్ ప్రాజెక్టుగా ప్రతీ జిల్లా నుంచి రెండేసి గ్రామాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మానవ అభివృద్ధి సూచిక మెరుగుదల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఎంపిక చేసిన 150 మండలాల్లో ‘వాష్’(వాటర్, శానిటేషన్, హైజిన్) పథకాన్ని అమలు చేయాలని సంకల్పించింది. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల విస్తృతమైన అవగాహన కల్పించడం, ఆయా ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టేలా ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. పైలట్ ప్రాజెక్టు కింద ప్రతీ జిల్లా నుంచి రెండు గ్రామాల్లో ‘వాష్’ను అమలు చేయనున్నారు. ఫలితాలను సమీక్షించాక దీన్ని విస్తరించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు నిర్ణయించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ పథకంలో భాగంగానే ‘వాష్’ ఈ నెల 13 నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్గా అమలు కానుంది. ప్రాజెక్టు అమలు ఇలా.. ఎంపిక చేసిన గ్రామంలో ‘వాష్’ బాధ్యతలను గ్రామ సమాఖ్యలు చేపడతాయి. గ్రామాల్లో మార్పు కమిటీలను ఏర్పాటు చేసి, వాటిని బలోపేతం చేయనున్నారు. ప్రధానంగా ఆరుబయట మల విసర్జనను రూపుమాపేందుకు ప్రజలను చైతన్య పరుస్తారు. ఎంపిక చేసిన వాలంటీర్లు నీరు, పరిశుభ్రత, పారిశుద్ధ్యం.. అంశాలకు సంబంధించి గ్రామంలోని కుటుంబాల వారీగా ప్రస్తుత పరిస్థితిపై బేస్లైన్ సర్వే నిర్వహిస్తారు. వాలంటీర్లకు అవసరమైన సహకారాన్ని ఇందిరా క్రాంతి పథం సిబ్బంది అందజేస్తారు. ప్రతీ పల్లెలోను గ్రామసభ నిర్వహించి బేస్లైన్ సర్వేలో వెల్లడైన వివరాలను ప్రజలతో ముఖాముఖి చర్చిస్తారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ నిర్ణీత సమయంలోగా ప్రతీ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా తీర్మానం చేస్తారు. ‘వాష్ ’ అమలు చేసే నిమిత్తం మూడు (ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్, విజిలెన్స్) ఉప కమిటీలను నియమిస్తారు. ఈ కమిటీల్లో గ్రామ సమాఖ్య సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు ఉంటారు. మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రణాళికకు ముందు మేస్త్రీలు, మెటీరియల్ పంపిణీదారులతో ‘వాష్’ సంప్రదింపులు చేయాలి. ప్రతీ మరుగుదొడ్డి నిర్మాణానికి ముందస్తుగా రూ.1,200లను గ్రామ సమాఖ్య ద్వారా‘సెర్ప్’ అందజేస్తుంది. ఇతరుల నుంచి కూడా విరాళాలను సేకరించవచ్చు. ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించడంతో పాటు, దానిని సక్రమంగా వినియోగిస్తున్నారా, ఆరుబయట మల విసర్జనను మానేశారా.. లేదా వంటి అంశాలను నిర్ధారించాల్సిన బాధ్యత విజిలెన్స్ కమిటీలదే. ‘వాష్’ ప్రణాళిక, అమల్లో గ్రామ పంచాయతీ సమగ్రమైన భాగస్వామ్యం వహించాలి. గ్రామ సభల నిర్వహణ, వాష్ ప్రణాళిక అభివృద్ధికి సహకరించాలి. వాష్ కమిటీలకు సర్పంచులే నేతృత్వం వహిస్తారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)ల ఆధ్వర్యంలో పనిచేసే గ్రామ సమాఖ్యలకు రూ.50 లక్షలు చక్రనిధిని గ్రామీణ నీటి పారుదల, పారిశుద్ధ్య(ఆర్డబ్ల్యూఎస్ఎస్) విభాగం అందజేస్తుంది. వాటిని గ్రామ సమాఖ్యలు మరుగుదొడ్ల నిర్మాణానికి అడ్వాన్స్గా వినియోగించుకోవచ్చు. -
పుష్కరాలతో ప్రభుత్వ ప్రతిష్ట పెరగాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచే విధంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. పుష్కరాల నిర్వహణకు రూ.వెయ్యి కోట్లను కేటాయించామని, రహదారులు, పారిశుద్ధ్యం, ఘాట్ల నిర్మాణం, దేవాలయాల జీర్ణోద్ధరణ, భక్తుల వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు వీటిని ఖర్చు చేయాలని సూచించారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. -
పద్ధతి మార్చుకోండి
అధికారులకు సీఎం హెచ్చరిక నగరంలో చంద్రబాబు మూడు గంటల పర్యటన మున్సిపల్ కమిషనర్, మేయర్కు వార్నింగ్ ప్రభుత్వాస్పత్రి అధికారులపై ఆగ్రహం విజయవాడ : ‘నేను నగరంలో ఉన్నప్పుడే ఇలా ఉంది.. లేకపోతే ఇంకెలా ఉంటుందో.. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఈ రోజు నుంచి మీరు, మేయర్ ఉదయం ఆరు గంటలకు రోడ్లపైకి వచ్చి నగరంలోని శానిటేషన్ను మెరుగుపరచాలి. మీ సిబ్బంది అందరినీ రోడ్లపైకి తీసుకురండి. రాజధాని నగరం ఇలాగేనా ఉండేది.. ఐదారుసార్లు నగరంలో పర్యటించి ప్రక్షాళన చేస్తా..’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, మేయర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ‘నేను ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా మీరు ఆలస్యంగా వస్తారా.. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు.. మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తా. మీ భార్యాపిల్లలకు కష్టం వస్తే తెలుస్తుంది.. మర్యాదగా చెబుతున్నా.. మీరు అలవాట్లు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటా..’ అంటూ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు విభాగం ఆర్ఎంవో డాక్టర్ రవికుమార్, డెప్యూటీ సూప రింటెండెంట్ రమేష్లపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం సుమారు మూడు గంటలపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. అతిథి గృహం నుంచి బయలుదేరి... ముఖ్యమంత్రి తొలుత రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఓపెన్ టాప్ జీప్లో స్క్యూబ్రిడ్జి వద్దకు వెళ్లారు. అనంతరం రామలింగేశ్వరనగర్లోని కృష్ణానది కరకట్ట నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్, స్థానికులు పంచకర్ల సాయికుమారి, సుధారాణిలతో పాటు పలువురు స్థానికులు చెప్పిన సమస్యలు విని మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ.52 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాల్వల పరిశీలన. జాతీయ రహదారి మీదుగా బందరు కాల్వ, రైవస్ కాల్వలను సీఎం పరిశీలించారు. నగరంలో కాల్వల ద్వారా జల రవాణా, ఆధునీకరణ తదితర అంశాలను ముఖ్యమంత్రికి మంత్రి దేవినేని ఉమా వివరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కాల్వగట్లను పరిశీలించిన చంద్రబాబు చెత్తాచెదారంతో నిండి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్లపై సీరియస్ అయ్యారు. ‘కాల్వగట్లను ఇలాగేనా ఉంచేది.. నేను వచ్చి చెప్పేదాకా బాగుచేయారా..’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాస్పత్రి అధికారులపై ఫైర్ : పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగాన్ని సీఎం తనిఖీ చేశారు. నూజివీడు మండలం యనమందల గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రావణి అనే మహిళ తన బిడ్డకు కడుపులో చీము చేరిందని, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని చెప్పగా, రూ.7 వేలు అందజేయాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. తమకు వైద్యం సరిగా అందడం లేదని, ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలను పడుకోబెడుతున్నారని, డెలివరీ చేస్తే సిబ్బంది రూ.500 డిమాండ్ చేస్తున్నారని, మందులు సరిగా ఇవ్వడం లేదని, కూర్చునేందుకు బెంచీలు కూడా లేవని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆస్పత్రి డెప్యూటీ సూపరింటెండెంట్, ఆర్ఎంవోలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రసూతి విభాగంలో ప్రసవించి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు రూ.5 వేలు చొప్పున అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ నేత దివి ఉమామహేశ్వరరావు చైర్మన్గా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నియమిస్తామని చెప్పారు. కలెక్టర్, ఆస్పత్రి అధికారులు కలిసి అభివృద్ధి చేయాలని, ఇందుకోసం తొలుత రూ.5 కోట్లు ఇస్తానని సీఎం పేర్కొన్నారు. డబ్బులు డిమాండ్ చేసే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆరు నెలల్లో ఆస్పత్రిలో సమూల మార్పు రావాలన్నారు. వైఎస్సార్ కాలనీని చూడకుండానే.. : అక్కడ నుంచి జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీని సందర్శించాలని అధికారులు నిర్ణయించారు. చిట్టినగర్ వద్దకు చేరుకునేసరికి చంద్రబాబు మనసు మార్చుకున్నారు. దీంతో సమయం లేక పర్యటనను కుదించారని అధికారులు ప్రకటించారు. -
విద్య, వైద్యం, పారిశుధ్యంపై అవగాహన
సంగారెడ్డి అర్బన్: విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి అంశాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లాను పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశామని ప్రధానమంత్రి సలహాదారు, కొలంబియా విశ్వవిద్యాలయం సౌత్ ఏషియా ఇన్చార్జి డాక్టర్ నిరుపం బాజ్పాయ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యవైద్యం పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలు, వాటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను దేశంలో 6 జిల్లాలను ఎంపిక చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మెదక్, మహబూబ్నగర్ జిల్లాలను ఎంపిక చేసి గ్రామీణ స్థాయి నుంచి వీటిపై అవగాహన కల్పించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ కృషి చేస్తుందని, ఇందుకు గానూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వీటిపై అవగాహనకల్పించాలన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ విద్య, వైద్యం పారిశుద్ధ్యం, తాగునీటి వినియోగంపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లాలోని ములుగు మండలాన్ని పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశామన్నారు. తదనంతరం దీనిని జిల్లా అంతటా కొనసాగిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అవగాహన వచ్చినట్లయితే జిల్లా దేశంలోని మోడల్ జిల్లాగా రూపొందుతుందన్నారు. అంతకు ముందు డీఎంహెచ్ఓ బాలాజీ పవార్, రాజీవ్ విద్యామిషన్, విద్యాశాఖ తదితర శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. సమావేశంలో ఏజేసీ మూర్తి, డీఎంహెచ్ఓ బాలాజీ పవార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ నరేంద్రబాబు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయప్రకాశ్ , డీఈఓ రాజేశ్వర్రావు, ఆర్వీఎంపీఓ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ అబద్ధం
సాక్షి, కడప: ఏ ఊరు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. ప్రతి ఊరు చరిత్ర సమస్తం మురికిమయం అన్న చందంగా తయారైంది జిల్లాలో పరిస్థితి. దేశానికి స్వాత ంత్య్రం సిద్ధించి 65 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రతి చోటా పారిశుద్ధ్య పరిస్థితి అధ్వానంగానే దర్శనమిస్తోంది. నిధులు పుష్కలంగా ఉన్నా మురికి కాలువలు పొర్లి పొంగుతున్నాయి. కడప, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో దోమలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల మురుగు కాలువలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నారుు. ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ను యజ్ఞంలా నిర్వహిస్తున్నా మరోవైపు పారిశుద్ధ్యం అధ్వానంగా దర్శనమిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పరిస్థితి ఘోరంగా ఉండటంతో దోమల ధాటికి జ్వరాలు కూడా ప్రబలుతున్నాయి. మురికి కాలువలున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ప్రధాన పట్టణాల్లో ఇప్పటికీ ఫాగింగ్ సైతం చేయకపోవడం దుస్థితికి అద్దం పడుతోంది. ప్రజారోగ్యం విషయంలో అధికారులు కాకి లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు. ప్రబలుతున్న జ్వరాలు జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారై దోమలు పెరిగి జ్వరాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో డెంగీ కేసులు అధికారికంగా 11 అని చెబుతున్నా 30-40 కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసులకు సంబంధించి వేలూరు, తిరుపతి, కర్నూలులో చికిత్స పొందుతున్నారు. అలాగే మలేరియాతో 368 మంది, టైఫాయిడ్తో 300 మంది బాధపడుతున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటికైనా పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
కాకినాడ రూరల్కు జ్వరమొచ్చింది
కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ మండలానికి జ్వరమొచ్చింది. మండలంలోని తిమ్మాపురం, ఇంద్రపాలెం, స్వామినగర్, తూరంగి, కొవ్వూరు, రమణయ్యపేట, వాకలపూడి, సూర్యారావుపేట, వలసపాకల గ్రామాల్లో జ్వరపీడితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. రెండు రోజుల కిందట ఇంద్రపాలెంలో 12 ఏళ్ల బాలుడికి జ్వరం వచ్చి ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది. అతడికి డెంగీ పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో జ్వరాల తీవ్రతను గుర్తించేందుకు వైద్యాధికారులు అన్ని గ్రామాలనూ జల్లెడ పడుతున్నారు. వారం రోజుల క్రితం బినిపే కామేష్ అనే వ్యక్తి గల్ఫ్ నుంచి తిమ్మాపురం వచ్చాడు. వచ్చినప్పటి నుంచీ జ్వరంతో బాధ పడుతున్నాడు. పండూరు పీహెచ్సీ వైద్యురాలు జి.లక్ష్మి ట్రీట్మెంట్ ఇచ్చినా జ్వరం తగ్గకపోగా, చుట్టుపక్కల ఉన్న మరో ఏడుగురు కూ డా జ్వరాలబారిన పడ్డారు. దీంతో తిమ్మాపురంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సలాది మహేష్, సలాది పాప అనే ఇద్దరు జ్వరం, విరేచనాలతో బాధపడుతూండడంతో అధికారులు ఆగమేఘాల ప్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. గత ఏడాది తూరంగి డ్రైవర్స్ కాలనీలో ఇద్దరు పిల్లలు డెంగీతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా డెంగీ విజృంభిస్తుందేమోనని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధ్వానంగా పారిశుద్ధ్యం పారిశుద్ధ్య లోపమే జ్వరాల తీవ్రతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నగరం, గ్రామం అన్న తేడా లేకుండా అంతటా పారిశుద్ధ్యం అధ్వానంగానే ఉంది. గ్రామాల్లో మురుగు కాలువల నిర్మాణం సరిగా లేకపోవడం, పూడికలు తీయకపోవడంతో కొన్నిచోట్ల రోడ్లపైనే మురుగు మడుగు కడుతుంది. ఈ ప్రాంతాలు దోమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో ఇళ్ల మధ్యనే పెంటకుప్పలు ఉంటున్నాయి. ఇక్కడ పందులు, కుక్కలు చేరడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. కొన్ని కాలనీలు, గ్రామాల్లో సిమెంటు రోడ్లు నిర్మించినా కాలువలను విస్మరించడంతో ఇళ్లలో వాడుక నీరు, మురుగు నీరు ఎక్కడికక్కడే నిలచిపోతోంది. గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా వాటిని అధికారులు ఖర్చు చేయడం లేదు. ఫలితంగా పారిశుధ్యం నానాటికీ దిగజారుతోంది. ఈ లక్షణాలుంటే.. * విపరీతంగా చలి, చెమట, తలపట్టడం, వాంతులతో కూడిన జ్వరం వస్తే మలేరియాగా అనుమానించాలి. సమీప ఆరోగ్య కేంద్రాల్లో రక్త పరీక్షలు చేయించుకోవాలి. * జలుబు, దగ్గుతోపాటు జ్వరం వస్తే వైరల్ జ్వరంగా అనుమానించాలి. జలుబు, దగ్గు ఉన్న వ్యక్తి నోటికి, ముక్కుకు రుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. లేకుంటే వైరస్ మరో వ్యక్తికి వ్యాపిస్తుంది. * ఒక్కసారిగా 100 నుంచి 102 డిగ్రీల జ్వరం వచ్చి మళ్లీ తగ్గుతూ ఉంటుంది. ఇలా రోజుకు నాలుగైదుసార్లు ఉంటుంది. వారంపాటు ఇలాగే ఉంటే టైఫాయిడ్గా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. కలుషిత నీరు, ఫంగస్ వల్ల ఈ జ్వరం వస్తుంది. * 103 నుంచి 104 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు వచ్చి కొద్ది రోజుల తరువాత మళ్లీ తిరగపెడితే చికున్గన్యా జ్వరంగా భావించాలి. ఒకసారి ఈ జ్వరం వస్తే నీర్సం, నొప్పుల నుంచి తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కీళ్ల నొప్పులతో కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాళ్లు, చేతులు వాచుతాయి. దోమ కాటు ద్వారా ఈ జ్వరం వ్యాపిస్తుంది. * హఠాత్తుగా జ్వరం, కళ్లు కదిలించలేని పరిస్థితి, ఎముకలు, కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తే డెంగీగా అనుమానించాలి. జ్వరం వచ్చిన రెం డో రోజు నుంచి వెన్నెముక నొప్పి, కనుబొమ్మ ల వాపు, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. వారం రోజుల పాటు ఇలానే ఉంటే రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గుతుంది. ఒకసారి వచ్చిన జ్వరం 10 రోజుల తరువాత మళ్లీ తిరగబెడుతుంది. వాంతులు, వికారం, రక్తంతో కూ డిన మలవిసర్జన వ్యాధి తీవ్రమైందనడానికి గు ర్తులు. ఇది దోమ ద్వారానే వ్యాప్తి చెందుతుం ది. పూర్తిగా వైద్యుని పర్యవేక్షణలోనే ఉండాలి. -
శానిటేషన్ టెండర్లు రద్దు
త్వరలోనే కొత్త టెండర్లు.. అప్పటివరకు పొడిగింపు కరీంనగర్ నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుల నియామకానికి నిర్వహించిన టెండర్లను అధికారులు రద్దు చేశారు. అవకతవకలు జరిగాయని తేటతెల్లమైనప్పటికీ మొదట నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికారులు... ‘సాక్షి’ వరుస కథనాలతో మొద్దునిద్ర వీడారు. అక్రమాలు నిజమేనని, దిద్దుకోలేని చర్యగా భావిస్తూ రద్దుకే మొగ్గు చూపారు. త్వరలో కొత్త టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. టవర్సర్కిల్ : పారిశుధ్య కార్మికుల నియామకం కోసం రూ.10 కోట్ల విలువైన టెండర్లను అర్హత లేని శ్రీరాజరాజేశ్వర ఏజెన్సీకి కట్టబెట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు అన్నీ సిద్ధం చేసిన వైనాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అక్రమాలపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, బల్దియా ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు తేలడంతో టెండర్లు రద్దు చేస్తూ కమిషనర్ శ్రీకేశ్ లట్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయిలో ఈ అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంజినీరింగ్శాఖ అధికారులు చేసిన తప్పిదంతో నగరపాలక సంస్థ పరువు బజారున పడినట్టయింది. టెండర్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం, టెక్నికల్ బిడ్ తెరవడం మొదలుకుని ఫైనాన్స్ బిడ్ ఓపెన్ చేసేవరకూ అంతా గందరగోళంగానే జరిగింది. అర్హత లేని ఏజెన్సీలను గుర్తించి కూడా అత్యుత్సాహంతో సదరు ఏజెన్సీలకు సంబంధించిన ఫైనాన్స్బిడ్ తెరిచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయంపై ఏకంగా ఉన్నతాధికారులను, పాలకవర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి బండారం బయటపడింది. అక్రమాల చిట్టా బయటపడడం కార్పొరేషన్ను ఒక కుదుపు కుదిపింది. అయితే బాధ్యులని తేలిన తర్వాత కూడా సదరు అధికారులను ఉపేక్షించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ పొడిగింపులే... నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తొమ్మిదేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే శానిటేషన్ కార్మికుల నియామకం కోసం టెండర్లు జరిగాయి. 2005లో ఒకసారి టెండర్లు జరగగా, అప్పటినుంచి 2013 వరకు పొడిగింపులే జరిగాయి. 2013లో టెండర్లు నిర్వహించగా పాతవారికే పనులు దక్కాయి. 2014 జూలై 31తో టెండర్ల గడువు ముగియగా టెండర్ల ప్రక్రియ అప్పటినుంచి మూడు నెలలు కొనసాగింది. ఈ మూడు నెలలతోపాటు కొత్త టెండర్లు పూర్తయ్యేవరకు మరో మూడు నెలలు పాత కాంట్రాక్టర్కే పొడిగింపు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘క్లీన్ పాడేరు’కు శ్రీకారం
పారిశుద్ధ్యంపై సమరభేరి చీపుర్లు పట్టిన ఎమ్మెల్యే, పీఓ, సబ్ కలెక్టర్లు పాడేరు : స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ పాడేరుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయాన్నే పాత బస్టాండుకు చేరుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జన్మభూమి ప్రత్యేక అధికారి, అటవీశాఖ కన్సర్వేటర్ భరత్కుమార్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్చంద్, సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులంతా పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రారంభించారు. వీరంతా తొలుత చీపుర్లు పట్టి రోడ్డును ఊడ్చారు. అంబేద్కర్ సెంటర్ నుంచి మెయిన్రోడ్డు, సినిమాహాల్ సెంటర్, మోదమాంబ ఆలయ ప్రాంతాలకు మూడు బృందాలుగా విడిపోయిన ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులంతా పెద్ద ఎత్తున పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. క్లీన్ పాడేరు-గ్రీన్ పాడేరు పేరిట పట్టణ పురవీధుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహనకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాల, పలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ వేషధారణలో రెవెన్యూ ఉద్యోగి అచ్చంనాయుడు, మరో బాలుడు అందర్నీ ఆకట్టుకున్నారు. పాడేరును తీర్చిదిద్దండి : ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాడేరును క్లీన్ పట్టణంగా తీర్చి దిద్దేందుకు ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. పాతబస్టాండ్ వద్ద ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏజెన్సీలో విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ నివాసాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, ఎంపీపీ వి.ముత్యాలమ్మ, జెడ్పీ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, ఎంపీటీసీ సభ్యులు కూడి దేవి, కిల్లో చంద్రమోహన్కుమార్, చెండా శ్రీదేవి, బొర్రా విజయరాణి, కో-ఆప్షన్సభ్యులు ఎండీ తాజుద్దీన్, సర్పంచ్ కె.వెంకటరత్నం, ఎంపీడీఓ కుమార్, వైఎస్సార్ సీపీ నేత పాంగి పాండురంగస్వామి, పార్టీ విద్యార్థి సంఘం నేతలు జి.నిరీక్షణరావు, కె.చిన్న, టీడీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొర్రా నాగరాజు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, సీడీపీఓ లలితకుమారి, ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ శోభారాణి, ఆదినారాయణ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్యలతో పాటు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జన్మభూమితో ప్రజల్లో చైతన్యం
qస్వచ్చ భారత్ కార్యక్రమంలో అందరూ భాగ స్వామ్యం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చూచించారు. గ్రామాల్లో మురుగులేకుండా సైడుకాలువలు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామం చివరన చెత్త డంప్పింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కు ప్రభుత్వం పెంచిందని అవి అర్హులైన వారికి అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పశువైద్యశిరాన్ని తనిఖీ చేసి పశువులకు టీకాలు వేశారు. జన్మభూమికి నిధులు ఇవ్వండి: కాకాణి జన్మభూమి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాకుటూరు సభలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాల్లో చేపట్టే పనులకు నిర్మాణంతోపాటు నిర్వహణ అవసరమని, నిధులు కేటాయించాలని తెలిపారు. మొక్కుబడిగా కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని, పింఛన్ల విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. ప్రజలు రూ.200 నుంచిరూ. 1000 వస్తుందని ఆనందంగా ఉన్నారని ఏదోఒక కారణంపెట్టి తొలగించకుండా ్లకలెక్టర్ , ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సర్వేపల్లి నియోజక వర్గ ప్రజలు తమ విజయానికి సహకరించారని వారి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, అందుబాటులో వారికి తోడుగా ఉంటానని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటాలు చేైసైనా మంచి పాలన అందజేస్తానని తెలిపారు. జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి, ప్రత్యేకాధికారి చంద్రమౌళి, తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ సుగుణమ్మ పాల్గొన్నారు. -
భక్తులకు ఇబ్బందులు రానీయం
‘సాక్షి’తో దుర్గగుడి ఈవో వి.త్రినాథరావు సాక్షి, విజయవాడ : నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగి జరుగుతున్న దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.త్రినాథరావు ‘సాక్షి’కి తెలిపారు. మరో కొద్ది గంటల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమౌతున్న నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరించారు. ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి వీఐపీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అరునప్పటికీ భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉచితంగా భోజనం, ప్రసాదం ఉత్సవాలు ప్రారంభమయ్యే 25వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ ముగింపు రోజు వరకు(తొమ్మిది రోజులు) ఇంద్రకీల్రాది దిగువభాగంలో శృంగేరి పీఠంలో 90వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, అలాగే ఉత్సవాలు జరిగే రోజుల్లో రోజుకు 8 వేల మందికి, మూల నక్షత్రం రోజున 12 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేస్తామన్నారు. కనకదుర్గానగర్లో ఏడు, జమ్మిదొడ్డి,బస్స్టేషన్, రైల్వేస్టేషన్, కొండపైన వీఐపీల కోసం ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది భక్తుల కోసం 16లక్షల లడ్డూలు, 20 టన్నుల పులిహోర చేయిస్తున్నామని, భక్తులు కోరినన్ని లడ్డూలు విక్రయిస్తామని ఈవో తెలిపారు. స్నానఘాట్టాలు, కేశఖండన.. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు దుర్గాఘాట్తో పాటు పద్మావతీఘాట్, దోబీఘాట్, సీతమ్మవారిపాదాలు, పున్నమిఘాట్, భవానీఘాట్లలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశామని, ప్రమాదాలు జరగకుండా బారికేడింగ్ నిర్మాణం, జల్లు స్నానాలు ఏర్పాటు చేశాం. తలనీలాలు సమర్పించేందుకు దేవస్థానంలో ఉండే 105 మంది క్షురకులకు అదనంగా, ఇతర దేవస్థానాల నుంచి 800 మందిని క్షురకులను రప్పిస్తున్నట్లు చెప్పారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి మూలానక్షత్రం, విజయదశమి రోజున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు కనుక పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సుమారు 900 మంది మూడు షిఫ్టులలో పనిచేస్తారని ఈవో చెప్పారు. దుర్గాఘాట్లో భక్తులు వదిలివేసే దుస్తులు, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలిస్తారన్నారు. సెల్ఫోన్లు తీసుకురావద్దు! దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు సాధ్యమైనంత తక్కువ లగేజిని తెచ్చుకోవాలని, సెల్ఫోన్లు తీసుకోరావద్దని సూచించారు. ఆలయంలోకి సెల్ఫోన్లను అనుమతించబోమని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బంది భక్తుల లగేజిని ఎప్పుడైనా తనిఖీ చేస్తారని, సాధ్యమైనంత వరకు ఖాళీ చేతులతో వచ్చి అమ్మవార్ని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని చె ప్పారు. కొబ్బరికాయలు కొట్టే చోట, తలనీలాలు సమర్పించే చోట భక్తులు అదనంగా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లే దని, ఎవరైనా డబ్బులడిగితే ఫిర్యాదు చేయూలని పేర్కొన్నారు. తెప్పోత్సవానికి ఏర్పాట్లు అక్టోబరు మూడో తేదీన కృష్ణానదిలో జరిగే అమ్మవారి తెప్పోత్సవానికి, భక్తుల గిరి ప్రదక్షిణకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో చెప్పారు. భక్తుల కోసం ఐదు క్యూలైన్లు.... భక్తుల కోసం ఐదు క్యూలైన్లు ఏర్పాటు చేశామని ఇందులో రెండు క్యూలైన్లు కేవలం ధర్మదర్శనం కోసం వచ్చే భక్తులకు కేటాయించామని, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనం ఉంటుందని ఈవో తెలిపారు. రూ.500, రూ.1000 టికెట్లు కొన్నవారు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. లక్ష కుంకుమార్చన టికెట్లు కొన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి భవానీ మండపానికి చేరుకోవాలేని సూచించారు. -
కదలని ఆరోగ్య శాఖ
డేంజరస్గా ‘డెంగీ’ - ఇప్పటికే ముగ్గురు మృతి - 35కు పైగా కేసులు నమోదు - ఊరూరా పారిశుధ్య లోపం - వాతావరణ మార్పులే కారణం నిజామాబాద్ అర్బన్ : జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే 35 డెంగీ కేసులు నమోదయ్యాయి. అధికారికంగా 22 కేసులను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. వ్యాధి బారినపడి ముగ్గురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పులు, పారిశుధ్య లోపమే డెంగీ వ్యాధి ప్ర బలడానికి ప్రధాన కారణంగా వైద్యశాఖ అధికారులు తేల్చారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాధులను అదుపుచేయడంలో వైద్యశాఖ ఉన్నతాధికారుల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 35 కేసులు నమోదు... ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఇద్దరు మృతి చెందడంతో పాటు 14 డెంగీ కేసులు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో గతనెల 12న నీరడి శ్రీజ డెంగీతో మృతిచెందింది. వర్ని మండలం రుద్రూరు గ్రామంలో మొహినొద్దీన్పటేల్ (65) అనే వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. లింగంపేట మండలం జగదంబ తం డాలో మరో వ్యక్తి డెంగీతో మృతిచెందాడు. డిచ్పల్లి మండలం చంద్రాయన్పల్లిలో ఏడుగురికి డెంగీ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. రెంజల్ మండలం బోర్గాం గ్రామంలో గోదావరి అనే మహిళ , జుక్కల్ మండలం కండేబల్లూరులో ఎనిమిది మందికి డెంగీ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. బీర్కూరు మండలం అన్నారం గ్రామంలో సంధ్య, అర్షిత్ అనే పిల్లలు వ్యాధి బారినపడ్డారు. కామారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ... వ్యాధులను నియంత్రించడంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమవుతోంది. కాలానికి అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు అదనపు బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ, ఈ ఏడాది వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పర్యటనలు నామమాత్రంగానే ఉన్నాయి. సగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా పర్యటించకపోవడం గమనార్హం. ప్రతి నెల క్లస్టర్ వైద్యాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నా ఎలా ంటి ప్రయోజనం లేకుండా పోయింది. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించి నివేదికలను చేరవేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వ్యాధుల ప్రభావం తీవ్రంగా ఉన్నా కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారిస్తే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంది. అస్తవ్యస్తంగా పారిశుధ్యం గ్రామాలలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇదే వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణమని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. గ్రామాలలో అపరిశుభ్రత నిర్మూలనకు ప్రతి మూడు నెలలకోసారి శానిటేషన్ నిధులను మంజూరు చేస్తున్నారు. ఇవి క్షేత్రస్థాయిలో ఖర్చుచేయడం లేదు. కొన్ని పీహెచ్సీలలో నిధులు ఖర్చు చేయ లేక తిరిగి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరోవైపు శానిటేషన్ పేరున నిధులను దుర్వినియోగం కూడా కొనసాగుతోంది. శానిటేషన్ నిధులతో మురికి కాల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నిర్మూలన వంటి కార్యక్రమాలను చేపట్టాలి. కానీ, ఇవి సక్రమంగా అమలు కాకపోవడంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలడానికి కారణమవుతున్నాయి. దోమల ప్రభావం పెరిగింది జిల్లాలో దోమల ప్రభావం పెరిగింది. అందుకే డెంగీ విజృంభిస్తోంది. ప్రస్తుతం 20 వరకు కేసులు నమోదయ్యాయి. వ్యాధి నిర్మూలనకు తీవ్రంగా కృషిచేస్తున్నాం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. వ్యాధి ప్రబలిన చోట ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. - లక్ష్మయ్య, జిల్లా మలేరియా నిర్మూలన అధికారి -
కొలువు పారిశుధ్యం....టార్గెట్ ఖాకీ ఉద్యోగం
అందరిలాగే.. ఆమె కూడా తన బంగారు భవిత గురించి అందమైన కలలు కంది. ఉన్నత చదువులు చదివి పోలీస్ ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. కానీ, వాటిని సాకారం చేసుకోలేకపోరుుంది. పేదింటి తల్లిదండ్రులు ఆడకూతుర్ని పెళ్లిచేసి పంపటానికే ప్రాధాన్యతనిచ్చారు. అత్తింటి వారు మాత్రం ఆమె ఆసక్తిని అర్థం చేసుకుని అక్కున చేర్చుకున్నారు. చదువుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడామె పగలంతా పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తూనే.. రాత్రంతా చదువుకు కేటారుుస్తూ.. పోలీస్ ఉద్యోగమే లక్ష్యంగా పరుగులు తీస్తోంది. మర్రిపాలెం ఎస్టీ (యూనాదులు) కాలనీకి చెందిన ఇళ్ల ఈశ్వరీపాప నాగాయలంక గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతుండగానే.. పెళ్లి సంబంధం రావడంతో చదువుకు బ్రేక్ పడింది. తన స్వగ్రామం గుంటూరు జిల్లా రేపల్లె మండలం లక్ష్మీపురం నుంచి మర్రిపాలెం ఎస్టీ కాలనీలోని అత్తారింటికి చేరింది. అప్పటికే నాగాయలంక పంచాయతీలో పారిశుధ్య పనిచేస్తున్న ఆమె అత్త నాగేంద్రమ్మ గిరిజన నాయకురాలిగా ఉన్నారు. కోడలికి చదువుపై ఉన్న మమకారాన్ని గమనించిన ఆమె గ్రామ కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతో అవనిగడ్డ నవజీవన్ సంస్థ నిర్వహిస్తున్న ఓపెన్ స్కూలులో ఈశ్వరీపాపను చేర్పించింది. పగలంతా పారిశుధ్య పని, రాత్రంతా చదువుపై దృష్టిపెట్టిన ఈశ్వరి పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం ఆమె ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్మీడియెట్ చదువుతోంది. ప్రతి ఆదివారం పారిశుధ్య పనికి సెలవు పెట్టి తరగతులకు హాజరవుతోంది. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పారిశుధ్య పనిచేస్తోంది. ‘చదువు పూర్తిచేసి పోలీస్ కానీ, హోంగార్డు కానీ అవుతా. మా గిరిజనుల్లో చదువుపై ఆసక్తి కలిగిస్తా. భర్త శ్రీను, అత్త నాగేంద్రమ్మ, కార్యదర్శి శైలజాకుమారి ప్రోత్సాహంతోనే నేను చదువుకుంటున్నా.’ అని ఈశ్వరీపాప చెప్పింది. - నాగాయలంక -
గ్రామాల్లోనూ ఉపాధి
కల్వర్టు, డ్రైనేజీ నిర్మాణాలకు ప్రతిపాదన పల్లెల్లో మెరుగుపడనున్న పారిశుద్ధ్యం అభివృద్ధి చెందనున్న గ్రామాలు పేదలను ఆదుకుంటున్న ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం గ్రామాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే భూ అభివృద్ధి పనులతో వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేందుకు అంగీకరించగా, తాజాగా గ్రామాల్లో కల్వర్టుల నిర్మాణం, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రతిపాదిస్తున్నారు. నర్సీపట్నం రూరల్ : గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపాధి పథకాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఒక పక్క రైతులకు ప్రయోజనకరంగా ఉండే భూ అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయానికి అనుసంధానంగా పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పనులపై స్పష్టత రావడంతో ఇక గ్రామాల అభివృద్ధి పనులపై దృష్టిసారించనున్నారు. గ్రామాలకు సంబంధించి గతంలో పంచాయతీ భవనాలు, రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీ తదితర పనులు చేపట్టగా కొన్ని గ్రామాల్లో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పాటు ఏజెన్సీలో కూలీల స్థానే యంత్రాలు వినియోగించడంతో ఈ పథకం ఆశయం దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అప్పట్లో ఈ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితి దయనీయంగా మారింది. గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేవలం తాగునీరు, విద్యుత్ వినియోగానికే సరిపోతున్నాయి. రోడ్లు వేసినా డ్రైనేజీలు లేని దుస్థితి. ఈక్రమంలో ఎక్కడినీరు అక్కడే నిలిచిపోవడంతో పారిశుద్ధ్యం కొరవడి దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు గ్రామీణులు గురవుతున్నారు. తాజాగా ప్రభుత్వం కల్వర్టులు, డ్రైనేజీలను విస్తారంగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. వాటిని ఏ విధంగా చేపట్టాలనే దానిపై అధికారులతో చర్చిస్తోంది. కేంద్రాన్ని ఒప్పించి గ్రామాల్లో ఉపాధిహామీ అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. -
పేరుకే పెద్దాసుపత్రి..
కర్నూలు(హాస్పిటల్): జబ్బు నయం చేయించుకునేందుకు ఎక్కడి నుంచో వచ్చే వారికి కొత్త రోగాలు అంటుకుంటున్నాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీతులు చెప్పే వైద్యులు ఆసుపత్రిలో లోపించిన పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు. కర్నూలు సర్వజన వైద్యాశాల పందులకు నిలయంగా మారింది. వార్డుల చుట్టూ పందుల సంచారం అధికం కావడంతో రోగులు బెంబేలెత్తుతున్నారు. పేరుకే పెద్దాసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. టీబీ వార్డు పక్కన ఉన్న స్త్రీల మెడికల్ వార్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ వార్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో మూసివేశారు. దీని పక్కనే మరో స్త్రీ మెడికల్ వార్డు(కొత్త భవనం) నిర్మించారు. అయితే మహిళా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మూసివేసిన ఈ వార్డును మళ్లీ తెరిపించారు. సౌకర్యాలు కల్పించడం అధికారులు మరిచారు. వేధిస్తున్న మంచాల కొరత.. స్త్రీల మెడికల్ వార్డుకు టీబీ, జ్వరం, ఆయాసం వంటి జబ్బులతో బాధపడుతున్న వారు వస్తుంటారు. రోగులకు వైద్యం సంగతి దేవుడెరుగు. పడుకునేందుకు మంచాలు సరిపడక వార్డు ఆవరణలో నిద్రిస్తున్నారు. వార్డు చుట్టూ పందులు స్వైర విహారం చేస్తుండటంతో దుర్వాసన వస్తోంది. వార్డుకు ఆనుకుని మురుగు కాల్వ ఉంది. ఇందులో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఈ ప్రాంతంలో దోమలు వృద్ధి చెందడంతో రోగులు అల్లాడుతున్నారు. తగినన్ని ఫ్యానులు లేక, ఉన్న ఫ్యాన్లలో కొన్ని చెడిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. సరిపడ బాత్రూమ్లు, టాయిలేట్లు లేక మహిళా రోగులు అవస్థలు పడుతున్నారు. రోగుల చుట్టే పందులు.. ఆసుపత్రి ఆవరణలో పందుల సంచారం అధికమైంది. రోగుల చుట్టూ తిరుగుతుండటంతో వ్యాధిల భారీన పడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డు ఆవరణలో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
అనాథల ఆక్రందన
సాక్షి, ముంబై: ప్రభుత్వ అనాథ శరణాలయాల్లోని చిన్నారుల పౌష్టికాహారం కోసం కోట్ల రూపాయలు నిధులు విడుదలవుతున్నా, వారికి కనీస పరిమాణంలో పోషక పదార్థాలు దొరకడం కూడా కష్టమేనని తేలింది. మహారాష్ర్టతోపాటు మరో మూడు రాష్ట్రాల్లో 52 శాతం మంది అనాథ చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. వీరికి పారిశుద్ధ్యం, మంచి దుస్తులు కూడా కరువేనని వెల్లడయింది. ఉదాహరణకు.. పుణేలోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్న తొమ్మిది ఏళ్ల శివం బరువు కేవలం 15 కిలోలు మాత్రమే. వైద్య ప్రమాణాల ప్రకారం ఈ వయస్సు బాలుడు కనీసం 28 కిలోల వరకు బరువు ఉండాలి. శివం గత మూడేళ్లుగా పుణేలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్ (సీసీఐ)లో ఉంటున్నాడు. ఇతడి మాదిరిగానే రాష్ర్టంలో వేలాది మంది అనాథబాలలకు పోషకాహారం అందుబాటులో లేకపోవడం తో ఎదుగుదల లోపించడం, అనారోగ్యం బారిన పడడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తేలింది. మహారాష్ట్ర, గోవా, మధ్యప్రదేశ్, ఒడిశాలో సేవలు అందిస్తున్న ‘క్యాథలిక్ ఫర్ సోషల్ యాక్షన్’ (సీఎస్ఏ) అనే సామాజిక సేవాసంస్థ అనాథ చిన్నారుల జీవితాలపై నిర్వహించిన అధ్యయనం ద్వారా పైవిషయాలు బయటికి వచ్చాయి. ఆరు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న 1,412 మంది అనాథలపై ఈ సర్వే నిర్వహించినట్టు సీఎస్ఏ వర్గాలు తెలిపాయి. వీరిలో 26 శాతం మంది మధ్యస్తంగా పోషకాహారం లోపంతో ఉన్నారని గుర్తించగా, మరో 26 శాతం మంది బాలలు స్వల్పంగా పోషకాహార లోపంతో ఉన్నట్లు గుర్తించారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారికి సరైన పదార్థాలు అందిచకుంటే ఏ సమయంలోనైనా తీవ్ర అనారోగ్యానికి గురికావొచ్చని సీఎస్ఏ డెరైక్టర్ సిడ్నీరోచా అభిప్రాయపడ్డారు. అనాథ శరణాలయాల్లో నివసిస్తున్న అత్యధిక చిన్నారులకు తండ్రి లేదా తల్లి (సింగిల్ పేరెంట్) మాత్రమే ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరూ ఉండి కూడా పిల్లలను పోషించలేక ఇక్కడ వదిలేసిన వారూ ఉన్నారని తేలింది. శివం తండ్రి ఓ తాగుబోతు కాగా, తల్లి కూలీ పని చేస్తుంటుంది. దీంతో ఈ దంపతులు తమ కొడుకుని పోషించే స్తోమత లేక అనాథ శరణాలయంలో వదిలేసి వెళ్లారు. ‘డబ్బులు లేక శివం ఎన్నోసార్లు పస్తులు ఉన్నాడు. ఇతనికి మూడు పూటల సరైన భోజనం అందజేస్తే శరీరం ఎదిగే అవకాశం ఉంటుంది. లేకుంటే ఎదుగుదలలో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు’ అని రోచా అన్నారు. చాలీచాలని నిధులు.. మహారాష్ట్రలోని చాలా అనాథ శరణాలయాలకు సమగ్ర శిశుసంరక్షణ పథకం కింద నిధులు అందుతున్నాయి. అంతేగాక ఈ ఏడాది నుంచి ప్రతి చిన్నారిపై వెచ్చించాల్సిన ఖర్చు మొత్తాన్ని కూడా రూ.650 నుంచి రూ.రెండు వేలకు పెంచినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలా వుండగా అనాథ శరణాలయాల నిర్వాహకులు మాత్రం తమకు ఈ నిధులను సక్రమంగా అందడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. పెంచిన మొత్తాలను కూడా విడుదల చేయడం లేదని చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిశుసంరక్షణ పథకానికి రూ.62.7 కోట్లు కేటాయించారు. ఈ నిధుల ద్వారా సరఫరా చేస్తున్న వాటిలో పోషక పదార్థాలు ఉండడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. కొన్ని అనాథ శరణాలయాల్లో పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వడం లేదని సీఎస్ఏ సమన్వయకర్త అనుపమ్ శుభదర్శన్ పేర్కొన్నారు. అనాథ పిల్లల్లో పరిశుభ్రత, మంచి అలవాట్లు లోపిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. ‘చాలా మంది పిల్లలకు రెండు లేదా మూడు జోళ్ల దుస్తులు మాత్రమే ఉంటున్నాయి. దుస్తులు సరిగ్గా లేని వాళ్లు తడి బట్టలనే తొడుక్కోవడంతో చర్మ వ్యాధులు సోకుతున్నాయి. అంతేకాకుండా వీరి ఒంటిపై తెల్లటి మచ్చలు కూడా వస్తున్నాయి’ అని వివరించారు. -
‘చెత్త’శుద్ధి ఏదీ?
మొయినాబాద్ రూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు కాలువలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. అధికారులకు ‘చెత్త’శుద్ధి లోపించింది. ఏదో తూతూమంత్రంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి వదిలేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్, హిమాయత్నగర్, బాకారం, ముర్తజా గూడ, కాశింబౌళి, నదీంమ్పేట్, ఎన్కేపల్లి, మొయినాబాద్ గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగుకాలువలు శుభ్రం చేయాలనే లక్ష ్యంతో ఏటా చేపట్టే పారిశుద్ధ్య వారోత్సవాలను అధికారులు 20రోజుల క్రితం నిర్వహించారు. అయినప్పటికీ ఒనగూరిన ప్రయోజనం శూన్యం. రోడ్లపై ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా ఏటా పంచాయతీలకు రూ.10వేలు మంజూరు చేసేవారని, ఈసారి అవి కూడా రాలేదని ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. రోగాలు దరిచేరకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
ఖర్చు ఘనం.. చెత్త పదిలం!
రూ.కోట్లలో నిధులు వృథా ఎక్కడి చెత్త అక్కడే అధ్వానంగా పారిశుద్ధ్యం వానొస్తే చిత్తడి పొంచి ఉన్న వ్యాధులు ఇదీ గ్రేటర్ తీరు సాక్షి, సిటీ బ్యూరో: జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు...వ్యర్థాలతో నిండిపోయినా ఖాళీ కాని డంపర్ బిన్లు... మురికి గుంటలు...వాటిలో కుటుంబాలతో నివాసం ఉండే దోమలు... ఆస్పత్రుల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులు...ఇదీ గ్రేటర్ చిత్రం. వ్యాధులు రాకుండా ఆదిలోనే అరికట్టేందుకు.. ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్య నిపుణులను సైతం పారిశుద్ధ్య సేవల్లో వినియోగిస్తున్నారు. అదీ ఫలితమివ్వడం లేదు. అదే వైద్యులను ఆస్పత్రుల్లో నియమిస్తే అక్కడైనా సక్రమంగా సేవలందే అవకాశం ఉంటుందనే విమర్శలు ఎదుర్కోవడం తప్పితే ఉపయోగం ఉండడం లేదు. అదనపు సిబ్బందిని నియమిస్తున్నా ప్రయోజనం కానరావడం లేదు. కొన్ని కార్పొరేషన్ల వార్షిక బడ్జెట్ కంటే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య నిర్వహణకు చేస్తున్న ఖర్చే ఎక్కువ. ఏటా దాదాపు రూ.300 కోట్లు పారిశుద్ధ్యానికి వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. కారణాలెన్నో... అడుగడుగునా అవినీతి.. లెక్కలు, రికార్డుల్లో తప్ప, క్షేత్ర స్థాయిలో కనిపించని సిబ్బంది. కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు.. వాహనాల అదనపు ట్రిప్పులు. కొందరు అధికారులు.. మరికొందరు కార్పొరేటర్ల సొంతలాభం .. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్యం క్షీణించడానికీ ఎన్నో కారణాలు. దీన్ని చక్కదిద్దేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కడదాకా సాగడం లేదు. ఇటీవల కొన్ని మార్గాల్లో పారిశుద్ధ్యం బాధ్యతను ప్రైవేటు కాంట్రాక్టర్లకు క ట్టబెట్టారు. అయినా ఏ మార్పూ కనిపించడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణలో ఖర్చులు పరిశీలిస్తే... ఇది ఇళ్ల నుంచి వచ్చే చెత్తను వేసేందుకు అవసరమైన డంపర్బిన్ల కోసం చేసిన ఖర్చు. ఇవి కాక ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరించేందుకు 5,638 రిక్షాలు ఉన్నాయి. వీటిలో 2691 రిక్షాలు మరమ్మతుల్లో ఉన్నాయి. రెండేళ్ల క్రితం వార్డుల్లోని చెత్తను తరలించేందుకు 3000 రిక్షాలను కార్పొరేటర్లకు ఇచ్చారు. త్వరలో మరో 1500 రిక్షాలు అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ వాహనాలు.. డంప్ బిన్ల నుంచి చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు, అక్కడి నుంచి డంపింగ్ యార్డులకు తరలించేందుకు మొత్తం 564 వాహనాలను వినియోగిస్తున్నారు. వీటిలో 458 జీహెచ్ఎంసీవి కాగా, మరో 106 అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఇంకో 44 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. ధరలో తేడా రావడంతో ప్రస్తుతానికి ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ఇవి కాక సీజన్ల వారీగా తీసుకునే అదనపు వాహనాలు.. అదనపు సిబ్బంది.. స్పెషల్ డ్రైవ్ల పేరిట అదనపు పనులు, ఇతరత్రా పనుల పేరిట వెరసి ఏటా దాదాపు రూ. 300 కోట్లు పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తరలింపు తదితరాలకు ఖర్చు చేస్తున్నారు. వీఐపీలకే ప్రాధాన్యం గ్రేటర్లో మొత్తం 6411 కి.మీ.ల మేర రహదారులు ఉన్నప్పటికీ, వీఐపీలు ఉండే మార్గాలు..వారు ప్రయాణించే రహదారులు. ప్రధాన రహదారుల్లో మాత్రమే పారిశుద్ధ్య పనులు సవ్యంగా చేస్తున్నారు. మిగతా ప్రాంతాలను గాలికి వదిలేస్తున్నారు. వీఐపీలు ఉండేవి, ప్రధాన రహదారులు కలిపి దాదాపు 2 వేల కి.మీ. ఉన్నాయి. పారిశుద్ధ్య పనులకు దిగువ స్థాయి కార్మికుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఉన్నారు. కార్మికుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించే శానిటరీ సూపర్వైజర్ల నుంచి మొదలు పెడితే.. శానిటరీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (ఏఎంఓహెచ్), డిప్యూటీ మున్సిపల్ కమిషనర్, జోనల్ కమిషనర్, అడిషనల్ కమిషనర్లు ఈ కార్యక్రమాల పర్యవేక్షణకు పని చేస్తున్నారు. కార్మికులు దాదాపు 18 వేల మంది ఉండగా, శానిటరీ సూపర్వైజర్లు వేయిమంది ఉన్నారు. 18 మంది డిప్యూటీ కమిషనర్లు, ఐదుగురు జోనల్ కమిషనర్లు ఉన్నారు. పొంచి ఉన్న వ్యాధులు వర్షాకాలంలో వ్యర్థాలు త్వరితంగా కుళ్లి దుర్గంధం వెదజల్లే పరిస్థితులు ఎక్కువ. దీన్ని చక్కదిద్దేందుకు, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకు వర్షాకాలంలో ప్రత్యేక ఏర్పాట్లంటూ లేవు. దీంతో వర్షాలొస్తే దోమలు, ఈగలు, క్రిమికీటకాలు వృద్ధిచెంది రోగాలు వ్యాపించే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. నగరంలో ఈ ఏడాది ఇంకా గట్టి వర్షాలే కురియలేదు. అయినప్పటికీ అనేక సర్కిళ్లలో ఇప్పటికే మలేరియా, డెంగీ వంటి కేసులు గుర్తించారు. మలక్పేట, చార్మినార్, కార్వాన్, హిమాయత్నర్, ఆబిడ్స్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ సర్కిళ్లలో 73 మలేరియా కేసులు, ఆబిడ్స్, హిమాయత్నగర్, ఖైరతాబాద్ సర్కిళ్ల పరిధిలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికైనా పరిస్థితిని చక్కదిద్దకపోతే రోగాలు ప్రబలే ఆస్కారం ఉంది. -
మంచంపట్టిన ప్రజలు.. సకాలంలో అందని వైద్యం..
ఉట్నూర్ : ఖానాపూర్ నియోజకవర్గంలో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో వ్యాధులు ‘ముసురు’కుంటున్నాయి. ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్, ఇంద్రవెల్లిలోని గ్రామాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గంలోని మండలాల్లో జ్వరాలు, వ్యాధులతో ఈ ఏడాది ఇప్పటివరకు 22 మంది మృత్యువాతపడ్డారు. గ్రామాల్లోని నీటి పథకాలను వారానికోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉన్నా మారుమూల గ్రామాల్లో ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఔట్పేషంట్ల సంఖ్య రోజు 60 నుంచి 100 వరకు ఉంటోందని వైద్యులు తెలిపారు. ఉట్నూర్ పీహెచ్సీలో ఔట్పేషంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారంటే.. జ్వరాల తీవ్రత ఎలా ఉందో తెలుస్తోంది. వ్యాధులు ప్రబలుతుండడంతో ఇప్పటికే కళాజాత బృందాలు గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా.. అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పిన్ పాయింట్ కార్యక్రమం ద్వారా వైద్య సిబ్బంది గ్రామాలను సందర్శించి చర్యలు తీసుకోవాల్సిన ఉన్నా అమలు కావడం లేదు. పీహెచ్సీల్లో సిబ్బంది కొరత భైంసా : ముథోల్ నియోజకవర్గంలో వర్షాలు కురుస్తుండడంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. కుంటాల మండలం సేవాలాల్తండాలో రెండ్రోజులుగా ఆరుగురు విషజ్వరాల బారినపడ్డారు. సూర్యంతండాలో నలుగురు, ముథోల్ మండల వ్యాప్తంగా 40 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. కుభీర్కు చెందిన ఆశన్న చలి జ్వరంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భైంసా పట్టణంలో జ్వరాల బారిన పడిన ప్రజలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. విషజ్వరాలు సోకిన సూర్యంతండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. రాయపూర్కాండ్లిలో నలుగురు జ్వరాల బారినపడ్డారు. వ్యాధులకు కారణమైన పారిశుధ్య లోపంపై అధికారులు నామమాత్ర చర్యలు తీసుకుంటున్నారు. డ్రెయినేజీలు, పెంటకుప్పలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. తాగునీటి పథకాలు, డ్రెయినేజీలు క్లోరినేషన్ చేయడం లేదు. అన్నింటా ఖాళీలే.. ముథోల్, కుభీర్, కుంటాల, లోకేశ్వరం, తానూర్ పీహెచ్సీల్లో సిబ్బంది ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కుంటాల పీహెచ్సీ వైద్యురాలు వందన డెప్యూటేషన్పై ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్కు వెళ్లారు. ల్యాబ్టెక్నీషియన్నూ డెప్యూటేషన్పై పంపించడంతో ల్యాబ్కు తాళం పడింది. అప్పటి నుంచి వైద్య సేవలు అందడం లేదు. కాంట్రాక్టు వైద్యులు సమయానికి రాకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షల కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి పంపిస్తున్నారు. తానూర్ పీహెచ్సీలో వైద్యులు, ఏఎన్ఎంల పోస్టులు నాలుగు చొప్పున ఖాళీగా ఉన్నాయి. లోకేశ్వరంలో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఖాళీగా ఉంది. ముథోల్ ప్రాంతీయ ఆస్పతిలో ఐదుగురు వైద్యుల, నలుగురు నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుభీర్లో ఇద్దరు డాక్టర్లు, నలుగురు ఏఎన్ఎంలు, ఇద్దరు హెల్త్సూపర్వైజర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాగునీరు కలుషితమై.. బెల్లంపల్లి : వర్షాలతో నీరు కలుషితమై, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్, బెల్లంపల్లి, భీమిని, నెన్నెల మండలాల్లోని పల్లెల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పక్షం రోజుల క్రితం భీమిని మండలం అక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఆరేపల్లి చంద్రమౌళి జ్వరంతో చనిపోయాడు. జ్వరాల తీవ్రత ఉన్న గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. జ్వరాలతో బాధపడుతూ బెల్లంపల్లి ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు 438 మందికి రక్తపరీక్షలు నిర్వహించగా.. 200 మందికి టైఫాయిడ్ జ్వరం ఉన్నట్లు తేలింది. ఐదుగురికి మలేరియా, మరో 20 మందికి వైరల్ ఫీవర్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జ్వరంతో బాధపడుతూ రోజుకు ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆస్పత్రిలో ఇన్పేషంట్లుగా చేరుతున్నారు. మరో 30 నుంచి 40 మంది ఔట్పేషంట్లుగా ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. భీమిని మండలం ఖర్జీభీంపూర్, అక్కళ్లపల్లి, భీమిని(బారెవాడ)లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. పది నుంచి పదిహేను మంది వరకు జ్వరంతో బాధపడుతున్నారు. అక్కళ్లపల్లిలో 15రోజుల క్రితం జ్వరాలు విజృంభించగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జ్వరాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. నెన్నెల మండలం ఘన్పూర్, జంగాల్పేట, నందుపల్లి గ్రామాల్లో ప్రజలు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. నిత్యం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 నుంచి 30 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. నెన్నెల, జంగాల్పేట, ఘన్పూర్లో కొందరు కలుషిత నీరు తాగ డం వల్ల వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. తాండూరు మండ లం మాదారం-3 ఇంక్లైన్, అన్నారం, కాసిపేట, కొత్తపల్లి గ్రామాల్లో ప్రజలు జ్వరాల బారినపడ్డారు. తాండూర్ పీహెచ్సీకి ప్రతిరోజు 50 మంది వైద్యం కోసం వస్తున్నారు. మాదారం-3 ఇంక్లైన్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందించారు. -
ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తాం: మృణాళిని
హైదరాబాద్: కొత్త పెన్షన్ విధానాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మృణాళిని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. నూతనంగా అమలు చేసే విధానం వల్ల 43 లక్షల మందికి లబ్ది చేకూరుతుందని మంత్రి మృణాళిని తెలిపారు. కొత్త పెన్షన్ విధానాన్ని ఆధార్ను లింక్ చేస్తున్నామని ఆమె అన్నారు. ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తామని.. ఆగస్టు 30 లోగా పెన్షన్దారులకు ఆధార్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. పెన్షన్ల కోసం 3788 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, 9 లక్షల పెన్షన్లను కేంద్రం మంజూరు చేస్తుందని మంత్రి మృణాళిని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి 7640 కోట్లు రూపాయలు ఖర్చు అవుతుందని, రిజిస్టర్ అయన ప్రతి డ్వాక్రా గ్రూప్కు లక్ష రూపాయల మాఫీ వర్తిస్తుందన్నారు. డిఫాల్టర్ల గ్రూప్లకు కూడా రుణమాఫీ వర్తింపు చేస్తామని మరో ప్రశ్నకు మంత్రి మృణాళిని సమాధానమిచ్చారు. -
పారిశుధ్య కార్మికుల సమ్మె, ఎక్కడ చెత్త అక్కడే
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెతో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య విభాగంలోని కార్మికులతోపాటు రవాణ, ఎంటమాలజీ, బయోడైవర్సిటీ, వెటర్నరీ సహ మొత్తం 13 కేటగిరీల్లోని కార్మికులకు కూడా 27 శాతం ఇంక్రిమెంట్ను ఇవ్వాలనే ప్రధాన డిమాండ్తో అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో చెత్తను తరలించే 850 వాహనాలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లను నెరవేర్చేవరకూ సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. కాగా జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్....గురువారం ఉదయం పారిశుధ్య కార్మికు సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. సమ్మె విరమించాలని ఆయన కోరారు. మరోవైపు కార్మికుల సమ్మె కారణంగా చెత్త తరలింపు విషయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోనల్ కమిషనర్లకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. -
అభివృద్ధికి ‘ప్రత్యేక’ బ్రేక్
సాక్షి, రాజమండ్రి / న్యూస్లైన్, మండపేట :ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 74 రోజుల పాటు అమలైన ఎన్నికల కోడ్కు తెరపడింది. ప్రజాపాలన వచ్చినా.. ప్రమాణ స్వీకారాలు పూర్తవ్వకపోవడంతో స్థానిక సంస్థల్లో ఇంకా ప్రత్యేక పాలనే కొనసాగుతోంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరేందుకు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా పరి పాలన సాగించాల్సిన ప్రత్యేకాధికారుల్లో చాలా మంది సంతకాలకు ‘నో’ చెబుతుండడం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో మా ర్చి మూడో తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అవి పూర్తయ్యే నాటికి పరిషత్ ఎన్నికల రాక తో కోడ్ కొనసాగింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లాలో ఎన్నికలు జరిగాయి. అవి పూర్తయిన వెంటనే ఏప్రిల్ 12 నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా, 16న ఓట్ల లెక్కింపుతో కోడ్ ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. దాదాపు 74 రోజుల పాటు సా గిన ఎన్నికల కోడ్కు తెరపడడంతో అభివృద్ధి కార్యక్రమా లు ఇక జోరందుకుంటాయనుకుంటున్న తరుణంలో ‘ప్రత్యేక’ రూపంలో వాటికి బ్రేక్ పడుతోంది. విభజనాం తరం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందు కు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్, మండల, జెడ్పీ పాలక వర్గాలు ప్రమాణ స్వీ కారం చేయాల్సి ఉంది. నాటి వరకు ప్రత్యేక పాలనలోనే ఆయా సంస్థలు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధుల ఎన్నిక పూర్తవ్వడంతో, ఈ గొడవ తమకెందుకన్న ఆలోచనలో ప్రత్యేకాధికారులున్నట్టు సమాచారం. కొత్త తీర్మానాలపై సంతకాలు చేసేందుకూ వెనుకాడుతుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఆగిపోయిన వర్క్ ఆర్డర్లు జిల్లాలోని నగరపాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల పరిషతుల్లో అనేక అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల కోడ్ రాకతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. కోడ్ పూర్తవ్వడం, త్వరలో కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా పనులపై వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు అనేక మంది ప్రత్యేకాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. పనులు పూర్తి చేయాలని కొత్త ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండగా, ప్రత్యేకాధికారుల సంతకాలు చేయకపోవడంతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేక చాలామంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీలు, మండల పరిషతుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యేక అధికారులు సెలవులపై వెళ్లిపోవడంతో పనులు ఎలా పూర్తిచేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం స్పందించి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేంత వరకు పరిస్థితి చక్కబడేలా పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త పాలక మండళ్లు కొలువు తీరాకే.. ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకూ ఎన్నికల నిర్వహణ ఖర్చులు, పారిశుధ్యం, నీటి నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇతర కార్యాలయ సంబంధ ఫైళ్లు మినహా మిగిలిన వాటికి చలనం లేదు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులపై మాత్రం కొత్త కౌన్సిళ్లు కొలువు తీరేలోగా ఆమోదం తెలిపేందుకు ఒకరిద్దరు కమిషనర్లు దృష్టి పెట్టినట్టు తెలిసింది. -
నీళ్లకోసం ఘర్షణ
కత్తులతో దాడులు నలుగురికి తీవ్ర గాయాలు మదనపల్లెక్రైం, న్యూస్లైన్: మంచినీళ్ల కోసం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపాటి ఘర్షణ చినికిచినికి పెద్దది కావడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆది వారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. రాత్రి పూట కరెంటు సరఫరా ఉండడంతో వేంపల్లెలో అర్ధరాత్రి మంచినీటి సరఫరా చేస్తున్నా రు. గ్రామానికి వేసిన పైపులైన్లలో ప్రధాన పైపులైను చెరువుకట్ట మీద నుంచి వెళుతోంది. ఆ పైపు పగిలిపోవడంతో గ్రామానికి సరిగ్గా నీళ్లు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామానికి చెందిన శ్రీనివాసులు(38), ఇతని కుమారుడు రాజశేఖర్(21) గమనించి నీరు వృథాకాకుండా పైపును తాడుతో గట్టిగా కట్టేశారు. తెల్లవారే సరికి తిరిగి ఆ తాడు ను స్థానికంగా ఉంటున్న రమేష్ అతని కుమారుడు రాఘవేంద్ర తెంపేస్తున్నారు. ఇలా రెండు రోజులు చేశారు. ఎన్నిసార్లు పైపును కట్టినా తెంపేస్తుండడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆదివారం రాత్రి తిరిగి శ్రీనివాసులు, రాజశేఖర్, శ్రీనివాసులు అన్న నారాయణ (40), కుమారుడు చెన్నకేశవ(21) నలుగురు కలిసి నీటి సరఫరా జరిగే సమయంలో చెరువుకట్టమీదకు వెళ్లి నీటిపైపును తాడుతో బిగి స్తున్నారు. అక్కడికి వచ్చిన రమేష్, అతని కుమారుడు రాఘవేంద్ర, వీరి బంధువు నరేష్ అడ్డు తగిలారు. పైపును కట్టడానికి మీరెవరు.. సర్పంచ్ను పిలవండి అంటూ పరుష పదజాలంతో దూషించారు. ‘‘నీళ్లు వృథాగా పోతుంటే సర్పంచే రానక్కరలేదు.. ఎవరైనా సరిచేయవచ్చు’’ అంటూ వారు పైపును కడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పరస్పర దాడులకు పూనుకున్నారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రమేష్, రాఘవేంద్ర, నరేష్ పక్కనే ఉన్న కత్తులు, బాకులతో దాడులు చేశారు. బాధితుల అరుపులు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, శ్రీనివాసులు, నారాయణ, చెన్నకేశవను 108 వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి గ్రామంలో జరిగిన సంఘటనపై విచారించారు. హత్యాయత్నానికి పాల్పడినట్టు విచారణ లో తేలడంతో నలుగురు నిందితులపై 326, 307, 324, 323 రెడ్విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇలాగేనా ఆలోచించేది?!
నోరు జారడం, కూడదీసుకోవడం మన రాజకీయ నాయకులకు బాగా అలవాటైన విద్య. అందరినీ కలవరపరిచే సమస్యపై తొందరపడి ఏదో అనేయడం, ఎలా తోస్తే అలా నిర్ణయం తీసుకోవడం, ఆనక తీరిగ్గా విచారించడం ఈమధ్యకాలంలో తరచు చూస్తున్నాం. సున్నితంగా ఆలోచించే మనస్తత్వాన్ని కోల్పోతే, సమస్యను లోతుగా విశ్లేషించుకునే తత్వాన్ని అలవరచుకోకపోతే, బండబారితే వచ్చే ఫలితమిది. అలాంటివారి జాబితాలో తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేరినట్టు కనబడుతోంది. ఆయన ఈమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరసగా మూడోసారి అధికారంలోకొచ్చి చరిత్ర సృష్టించారు. 230 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీకి 165 స్థానాలు లభించాయి. అయితే, ఆ విజయం సమస్యలను గుర్తించడంలో, పరిష్కారాలు వెదకడంలో దృష్టిని మసకబార్చకూడదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈమధ్య రూపొందించిన ఒక పుస్తకం చూస్తే అలాంటి పరిస్థితి ఏర్పడిందన్న అనుమానం కలుగుతుంది. కాలకృత్యాలను బహిర్భూమిలో తీర్చుకునే వారిని దారికి తెచ్చేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆ పుస్తకం నిండా ఏకరువు పెట్టారు. ఆ సమస్యపై ఎలాంటి అవగాహనా లేనివారు దాన్ని రూపొందించారని పుస్తకం చూడగానే ఎవరికైనా అర్ధమవుతుంది. దాన్నిండా సూచించిన పరిష్కారాలు భయంకరమై నవి. అనాగరికమైనవి. అందరూ నిరసించేవి. కాలకృత్యాలను బహిర్భూమిలో తీర్చుకొనే స్థితి ఉండటం నిజంగా బాధాకరమైన విషయం. స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు దాటుతున్నా మరుగుదొడ్లు లేని ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 67 శాతం వరకూ ఉన్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ జాతీయ సగటుకు మించి ఉన్న రాష్ట్రాల్లో అగ్రస్థానం జార్ఖండ్ది కాగా, దాని తర్వాత స్థానం మధ్యప్రదేశ్ది. జార్ఖండ్లో 91 శాతం ఇళ్లకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మధ్యప్రదేశ్ 86 శాతంతో రెండోస్థానంలో ఉంది. మరుగుదొడ్లపై చేసే ఖర్చు వృథా వ్యయమని గ్రామీణ ప్రాంతాల్లో భావిస్తారని నిపుణులు చెప్పే మాటల్లో అర్థసత్యమే ఉంది. పల్లె ప్రజానీకం సెల్ఫోన్లపైనా, కలర్ టీవీ సెట్లపైనా ఖర్చు చేస్తారు తప్ప మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రారని కేంద్రమంత్రి జైరాం రమేష్ గతంలో అన్నారు. అయితే, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం పర్యవసానంగా రెండు పూటలా తినడానికే తిండిలేని పరిస్థితులున్నప్పుడు ప్రజలు ఇలాంటి వ్యామోహాలకు లోనవుతున్నారనడం హాస్యాస్పదమవుతుంది. బహిర్భూమికి వెళ్లే పరిస్థితులుండటంవల్ల మహిళలపైనా, బాలికలపైనా నేరాలు ఎక్కువ జరుగుతున్నాయని జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఈ తరహా నేరాలు మధ్యప్రదేశ్లో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. వాటిని సాధించలేక చతికిలబడుతు న్నాయి. మధ్యప్రదేశ్ విషయమే తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో 2017కు, గ్రామీణ ప్రాంతాల్లో 2025కు అన్ని ఇళ్లకూ మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ దిశగా వేసిన అడుగులు గమనిస్తే నిరాశ కలుగు తుంది. కొత్తగా పెళ్లయి అత్తారింటికొచ్చి, మరుగుదొడ్డి లేదని తెలిసి వెనుదిరిగి సంచలనం సృష్టించిన అనితాబాయిని మరుగుదొడ్ల విషయమై చైతన్యం కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. కానీ, అందుకోసం ఆమెకు అందించిన మొత్తం రూ. 500 మాత్రమే. ఈ సొమ్ముతో జిల్లాలకు వెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నిస్తే జవాబిచ్చేవారే లేరు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం కుటుంబాలకిచ్చే సొమ్ము కూడా అరకొరగానే ఉంటున్నదని గ్రామీణుల ఆరోపణ. వాస్తవాలు ఇవికాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన పుస్తకం ఈ లోటుపాట్లపై దృష్టి సారించడం మాని చిత్రమైన పరిష్కారాలను సూచిస్తున్నది. అందులో బహిర్భూమికెళ్లేవారిపై కేకలేయడం దగ్గర్నుంచి అలాంటివారిని ఫొటోలు తీయడం వరకూ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ పుస్తకంలో ముద్రించిన రేఖాచిత్రాలు కూడా ఈ సూచనలతో పోటీపడ్డాయి. అందరికీ కంపరం పుట్టించాయి. సమస్య తీవ్రతను, దానికి గల కారణాలనూ అర్ధం చేసుకోకుండా... అందులో తమ వైఫల్యం పాత్ర ఎంతో గమనించుకోకుండా పౌరులను తప్పుబట్టేలా, వారిని అవహేళన చేసేలా రూపొందించిన ఈ పుస్తకం ప్రభుత్వాధినేతల కళ్లుగప్పి వచ్చిందనుకోవడానికి లేదు. ఆ పుస్తకానికి శివరాజ్సింగ్ చౌహాన్ ముందుమాట కూడా ఉంది. దేశంలో రెండున్నర లక్షల గ్రామాలుండగా అందులో కేవలం దాదాపు 30,000 గ్రామాల్లో మాత్రమే ఇంటింటికీ మరుగుదొడ్లు ఉన్నాయని ప్రపంచబ్యాంకు నివేదిక ఆమధ్య వెల్లడించింది. ఈ గ్రామాలను మాత్రమే అది సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలుగా పరిగణనలోకి తీసుకుంది. సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్మల్ గ్రామ పురస్కారాలను ఏర్పాటుచేసినా ప్రణాళికా సంఘం వంటివి దీనిపై పూర్తి దృష్టి పెట్టకుండా పరిష్కారం లభించదు. అసలు ప్రభుత్వ పాఠశాలలన్నిటా మరుగుదొడ్లు ఉండేలా చూడమని సుప్రీంకోర్టు ఆదేశించడం మొదలెట్టి రెండేళ్లవుతోంది. ప్రతి వాయిదాకూ ప్రభుత్వపరంగా హామీలివ్వడమే తప్ప ఆచరణలో ఎలాంటి ఫలితమూ ఉండటం లేదు. ఇప్పటికీ దేశంలో లక్షలాది పాఠ శాలలకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. సుప్రీంకోర్టు దృష్టిపెట్టిన సమస్య విషయం లోనే పరిస్థితి ఇలావుంటే మిగిలినవాటి గురించి చెప్పేదేముంటుంది? సమస్యల్ని గుర్తించి, పరిష్కారాల గురించి ఆలోచించి, అవసరమైన పథకాల రూపకల్పనకు పూనుకోవాల్సిన పాలకులు అందుకు విరుద్ధంగా ప్రజలనే తప్పుబట్టాలని చూడటం చేతకానితనమే అవుతుంది. ప్రక్షాళనో, పారిశుద్ధ్యమో ముందు తమ మెదళ్లకు జరగాలని ఆ పుస్తక రచయితలు, దానికి అంగీకారం తెలిపిన పాలకులు గ్రహించాలి. -
ప్రజారోగ్యంతో చెలగాటమొద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్: మంచినీటి ట్యాంకులను శుభ్రపర్చడం లేదు.. కోరినేషన్ను పట్టించుకోవడం లేదు.. శానిటేషన్పై దృష్టి సారించడం లేదు.. ఈవిధంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి ఈవోఆర్డీలను హెచ్చరించారు. మంచినీటి ట్యాంకుల దుస్థితి.. అధికారుల అలసత్వంపై ‘సమరసాక్షి’ శీర్షికన ఈనెల 9న నియోజకవర్గాల వారీగా ప్రచురించిన కథనాలకు కలెక్టర్ స్పందించారు. గురువారం ఈవోఆర్డీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలాల వారీగా మంచినీటి ట్యాంకుల తాజా స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ట్యాంకులు క్లీన్ చేశామని చెబితే సరిపోదని.. తేదీలతో కూడిన ఫొటోలు చూపాలని ఆదేశించారు. ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్పై ఇక నుంచి డీఎల్పీఓలు, ఈఓఆర్డీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మేజర్, మైనర్ పంచాయతీలకు స్వయంగా వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశించారు. కల్లూరు ఈఓఆర్డీ ట్యాంకు క్లీనింగ్కు సంబంధించి ఒక్క ఫొటో కూడా చూపకపోవడంతో కలెక్టర్ ఆగ్రహించారు. ప్రతి శుక్రవారం విధిగా ట్యాంకులన్నింటినీ శుభ్రం చేసి ఆరబెట్టాలన్నారు. నీటిని క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీపీఓను ఆదేశించారు. 13 ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీల్లో డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పని ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత ఫొటోలు తీయాలన్నారు. జిల్లా పరిషత్ నిధులను సీసీ రోడ్లకు వెచ్చించాలని సూచించారు. మంచినీటి బోర్ల చుట్టూ ప్లాట్ఫాం నిర్మించి నీరు కాల్వలో కలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో డంపింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టే పనులను జనవరి చివరికల్లా పూర్తి చేసి యూసీలు అందజేయాలన్నారు. పంచాయతీ భవన నిర్మాణాలకు తగిన స్థలం లేకపోతే తహశీల్దార్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సూర్యప్రకాష్, డీపీఓ శోభ స్వరూపరాణి, కర్నూలు, నంద్యాల, ఆదోని డీఎల్పీఓలు, అన్ని మండలాల ఈఓఆర్డీలు పాల్గొన్నారు. -
‘ప్రత్యేకం’ అస్తవ్యస్తం..
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్లైన్ : ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. మొన్నటి వరకు పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, ఎన్నికల అనంతరం కొంత గాడిలో పడింది. అయితే జిల్లా, మండల పరిషత్లు, మున్సిపాలిటీల్లో మాత్రం ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతూనే ఉంది. ఇది వారికి అదనపు బాధ్యత కావడంతో ఎక్కడికక్కడ పాలన నత్తనడకన సాగుతోంది. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండటంతో అభివృద్ధి కుంటుపడుతోంది. వీటికి స్పెషలాఫీసర్లుగా ఉన్నవారు జిల్లాస్థాయి అధికారులు కావడంతో మండలాలపై దృష్టి సారించలేకపోతున్నారు. వారికి తీరిన సమయంలో అప్పుడప్పుడు సమీక్షలు నిర్వహించి వ దిలేస్తున్నారు. దీంతో మండలస్థాయిలో నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్, కొత్తగూడెం మున్సిపాలిటీకి జేసీ సురేంద్రమోహన్, పాల్వంచ మున్సిపాలిటీకి ఆర్డీవో శ్యామ్ప్రసాద్, సత్తుపల్లికి ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డి ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తున్నారు. వీరు జిల్లా, డివిజన్ స్థాయి సమస్యలతో సతమతమవుతున్నారు. దీంతో పట్టణాల్లో, మండలాల్లో సమస్యల పై దృష్టి సారించలేకపోతున్నారు. జీతభత్యాలు, ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఉద్యోగులే ఆయా అధికారుల వద్దకు వెళ్లి ఫైళ్లపై సంతకాలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే పాలక వర్గాలు ఉంటే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సమావేశాల్లో తీర్మానాలు చేసి ఎక్కడ సమస్యలున్నాయి... వాటిని ఎలా పరిష్కరించాలి అనే అంశాలపై చర్చలు నిర్వహించి నిర్ణయాలు తీసుకునేవారని పలువురు అంటున్నారు. అధికారులు ఆయా మున్సిపాలిటీల పరిధిలో పర్యటించకపోవడంతో స్థానిక సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాలు, పట్టణాల్లో సమస్యలు నెలకొన్నాయి. గ్రా మాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ము రుగు కాలువల్లో పూడిక తీయకపోవడంతో చెత్తాచెదా రం పేరుకుపోయి చిన్నపాటి వర్షాలకే వీధులన్నీ బురదమయమవుతున్నాయి. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించి దోమల బెడద మొదలైం ది. కనీసం దోమల నివారణకు మురికి కాలువల్లో ఆ యిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ చే యడం వంటి చర్యలేవీ చేపట్టడం లేదు. మండల, జి ల్లా పరిషత్లకు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పల్లెలను, పట్టణాలను పట్టించుకునేవారే కరువయ్యారు. పంచాయతీలకు నిధుల కొరత.. పంచాయతీలలో పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు నిధులు లేవు. ఇప్పటికే బ్లీచింగ్ అందుబాటులో ఉంచడంతో పాటు స్ప్రే, ఫాగింగ్ కూడా ప్రారంభించాలి. కానీ అలాంటి చర్యలు లేకపోవడంతో దోమలు ప్రబ లి, ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి మూడు నుంచి ఐదు గ్రామాల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో వారికి పనిభారం ఎక్కువై ఆయా గ్రామాల్లో పారిశుధ్య చర్యలపై దృష్టి సారించడం లేదు. గ్రామాల్లో తాగునీరు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ఇళ్లల్లోని మురుగునీరు ఒకేచోట చేరడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. మురుగునీరు నిల్వ కారణంగా దోమలు, క్రిములు స్వైర విహారం చేస్తున్నాయి. వీటికితోడు పందులు జనావాసాల్లో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మంచినీటి పైపులైన్లు లీకవుతున్నాయి. తాగునీటి సరఫరాలో క్లోరినేషన్ కొరవడి పలు ప్రాంతాల్లో కలుషిత నీరే సరఫరా అవుతోంది. ప్రజలు ఆ నీటిని తాగుతూ అస్వస్థతకు గురవుతున్నారు. మొక్కుబడిగా పర్యటనలు మాతృశాఖలో సమస్యల పరిష్కారానికి సతమతమవుతున్న అధికారులు మండలస్థాయిలో సమస్యలను పట్టించుకోలేకపోతున్నారు. ప్రత్యేకాధికారులుగా ఉన్న వీరు ఆరునెలలకు ఒకసారి మొక్కుబడిగా ఆయా మండలాలకు వెళ్లి తూతూమంత్రంగా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. పింఛన్ల కోసం ప్రజలు మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు సాగడం లేదు. మండలంలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి అభివృద్ధి పనులు నిర్వహించాల్సిన ప్రత్యేక అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో మూలుగుతున్న నిధులు... మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కోట్ల రూపాయల నిధు లు మూలుగుతున్నప్పటికీ వాటిని ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించే పాలకవర్గాలు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఈ నిధులు మురిగిపోయే అవకాశం కూడా ఉంది. ఏ పనులకు ఎన్ని నిధులు కేటాయించాలో అర్థం కాని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఉన్నారు. ప్రత్యేకాధికారులు మున్సిపాలిటీలపై దృష్టి సారిస్తే వీధి దీపాలు, డ్రెయిన్లు, రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలు పరిష్కారం అవుతాయని పలువురు ఆశిస్తున్నారు. -
సమ్మె విరమించిన పారిశుధ్య కార్మికులు
-
కార్మికుల సమ్మెలో చెత్తమయంగా మారిన మహానగరం