
రహదారులపై తనిఖీలు పారిశుధ్య పనులపై ఆరా..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి నగరంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నల్లకుంట శంకర్మఠ్ సమీపంలో ఆర్ఎఫ్సీ వాహన డ్రైవర్తో మాట్లాడి చెత్త తరలింపు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే దారిలో తనకు తారసపడిన ఓ విద్యార్థినితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించే విధంగా తోటి విద్యార్థులకు అవగాహన కల్పించి స్వచ్చ హైదరాబాద్ సాధనకు కృషి చేయాలని ఆ విద్యారి్థనికి చెప్పారు.
నారాయణగూడ క్రాస్రోడ్స్ దగ్గర నిరి్మంచిన మార్కెట్ గదుల కేటాయింపులు పూర్తిచేయాలని జోనల్ కమిషనర్కు సూచించారు. కమిషనర్ వెంట తనిఖీలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రవికిరణ్ పాల్గొన్నారు. కాగా ఐఏఎస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, కార్యాలయాలకే పరిమితం కారాదని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించడం తెలిసిందే.
సమావేశానికి సిద్ధం కండి
ఈ నెల 6న నిర్వహించనున్న జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశానికి ఆయా విభాగాల అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉన్నతాధికారులకు సూచించారు. బుధవారం తన చాంబర్లో ఆయా విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. 4న జరగనున్న స్టాండింగ్ కమిటీ, 6న జరగనున్న సర్వసభ్య సమావేశం ఎజెండా అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కౌన్సిల్ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే ప్రశ్నలకు సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమగ్ర వివరణ ఇచ్చేలా సిద్ధం కావాలన్నారు. సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయా విభాగాలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment