ఉల్లి కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా
కర్నూలు(అగ్రికల్చర్): ఉల్లి కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... అర్హులైన ప్రతి రైతుకు మద్దతు ధర (క్వింటాల్కు రూ.600) వర్తించే విధంగా చూడాలన్నారు. మార్కెట్కు కమీషన్ ఏజెంటు వారీగా.. వచ్చే ఉల్లి నాణ్యతను బట్టి గ్రేడులు ఇవ్వాలని, ఏ గ్రేడ్కు దాదాపు రూ.600 ఆపైన ధర లభించాల్సి ఉందని, బీ, సీ గ్రేడ్లకు రూ.400 నుంచి రూ.450 ధర లభించాలని అలా కాకుండా అతి తక్కువ ధరలు రికార్డు అవుతే అక్రమాలు జరిగినట్లేనని వివరించారు. ఎలాంటి అక్రమాలకు తావు ఉండరాదని, ఇందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తగిన ప్రణాళికలు తయారు చేసుకోని రావాలని వివరించారు. ఉల్లి కొనుగోళ్లు, నాణ్యత, ధరల నిర్ణయం తదితర వాటిని పరిశీలించేందుకు ప్రత్యేక టీములను వేస్తామని వివరించారు. ఉల్లి ధర క్వింటా రూ.50, 100కు పోతే ఏమి చేయాలనే దానిపై కూడ తగిన సూచనలతో రావాలని వివరించారు. అవసరమైతే ఉల్లి కొనుగోళ్ల ప్రక్రియ కలెక్టరేట్ ఆద్వర్యంలో నిర్వహిసామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి మార్కెట్లో ఉల్లి అమ్మిన రైతుల జాబితాలను తయారు చేయాలని వివరించారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రంలోగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని..14నుంచి కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. సమావేశంలో మార్కెటింగ్శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి, కర్నూలు మార్కెట్ కమిటీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.