
మన సంస్కృతీ సంప్రదాయాలు
వాక్కు సాక్షాత్తూ వాగ్దేవతకు ప్రతిరూపం. మంచిగా, మధురంగా మాట్లాడే వాళ్లకు అందరూ మిత్రులే. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ‘మంచిమాట’, ‘తేనెచినుకులు’, ‘దీక్ష’ ‘విదురనీతి కథలు’ వంటి పాఠకాదరణ పొందిన పుస్తక రచయిత విశ్రాంత అధ్యాపకులు సూర్యప్రసాదరావు ఎందరో మహనీయులు చెప్పిన ఎన్నో మంచి మాటలను ఎంతో నేర్పుగా, మరెంతో ఓర్పుగా ఒకచోట గుదిగుచ్చారు. దానికి మకరంద బిందువులు అనే పుస్తక రూపమిచ్చారు.
ఈ పుస్తకంలో భగవత్ స్వరూపాన్ని నిర్వచించే సత్యమ్.. శివమ్...సుందరమ్, గృహస్థాశ్రమ ధర్మాన్ని, విశిష్టతను వివరించే మంచిమాటలు, మన సంస్కృతికి మాత్రమే సొంతమైన ‘వందన’ ప్రాధాన్యత, అక్షరార్చన ఆవశ్యకతను ఆవిష్కరించే అక్షరం.. అక్షరాభ్యాసం, అందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించే ఓం శాంతిః శాంతిః శాంతిః అనే వ్యాస కుసుమాలు గుబాళించాయి. రాసిన ప్రతిదానినీ ప్రామాణిక మంత్రశ్లోకాలతో సమన్వయం చేశారు రచయిత.
మకరంద బిందువులు; పుటలు: 238, వెల రూ. 150; ప్రతులకు: ఎం. సూర్యప్రసారావు, విశ్రాంత
అధ్యాపకులు, ఇంటినం. 5-6-18/బి, పాకబండ బజార్, పెట్రోల్ బంక్ వెనక, ఖమ్మం- 507 001.
- డి.శ్రీలేఖ