stories
-
యువ కథ: సిల్లు పడ్డ సీర
‘వురెయ్ బామ్మర్ది ఇయ్యాలేటో వొల్లంత పచ్చి పుండు నాగుందిరా’ అప్పుడే నిద్రలేచొస్తూ అన్నాడు ఆదిబాబు. గుమ్మంలో తాపీగా చుట్ట కాల్చుకుంటున్న వీరయ్య ‘ఆ.. నిన్నంతా పనుల్తోటి అలిసిపోయినావు కద బావా. మరామాతరం సలుపులుంటాయినే’ అన్నాడు. ‘ఆ.. అంతేలాగుందిరా బాబూ. ఒలే! బూలచ్చిమి.. బూలచ్చిమీ..’ ఆమె పలికే వరకూ పిలుస్తూనే వున్నాడు ఆదిబాబు. ‘ఆ’ అరిచినట్టే పలికింది భూలక్ష్మి. ‘యేడి నీలెట్టే సానం సేత్తాను’ అని ఒక కేక పెట్టాడు. ‘నానంత కాలీగేటి నేను. నువ్వేల్లెట్టుకో’ లోపల నుంచి విసురుగా సమాధానం వచ్చింది. ‘ఆ.. యేటి దీని తల పొగరూ’అనుకుంటూ పక్కనే వున్న వీరయ్య వైపు చూసి ‘అదేట్రా మీయప్ప తెల్లారికే అలాగరత్తంది. లెగిసాకా కూడా సుసేను.. యేటో సెత్రువుని సూసినట్టు సూసింది. యేతంతావు కారనవు?’ అడిగాడు. వీరయ్య సన్నగా నవ్వుతూ ‘యేటి బావ నిన్న వొచ్చినోలు దెగ్గర యెతేన నాగేవేటి పేకాట్ల’ అని రహస్యంగా అడిగాడు. అడ్డంగా తలాడిస్తూ ‘మీయప్ప వల్ల సుకం నేదు నాకు. ఆగు ఇప్పుడే వత్తాను’ అంటూ లుంగీ ఎత్తి పట్టి నడుముకి చుట్టుకుంటూ పక్కనున్న సందు వైపు నడిచాడు ఆదిబాబు. అక్కడ ప్లాస్టిక్ బకెట్లోని నీళ్లని మొహం మీద జల్లుకుని, పుక్కిలించి ఉమ్మి, గూట్లో వున్న వేపపుల్లని నమిలి పిప్పిచేసి వదిలాడు. దండెం మీద తువ్వాలు కోసం వెదుకుతూ ఆ దండెం మీదే ఆరేసున్న చీరని పరిశీలనగా చూస్తూ నిలబడిపోయాడు. ‘బావా.. ఇగో తువ్వాలు’ పిల్చాడు వీరయ్య. ఆ పిలుపు వినబడనట్టే ఉండిపోయాడు ఆదిబాబు. అతని బుర్రలో వేల ప్రశ్నలు. ‘యేటలగ కొయ్యలాగ కదలడు’ అనుకుంటూ ఆదిబాబు దగ్గరకు వెళ్ళాడు వీరయ్య. ‘అలగ వుండిపోనవు యేటైంది బావ’ అడిగాడు. ‘యేటి నేదురా.. ఈ సీరేటి ఇక్కడుందని సూత్తన్ను. ఇది మాయమ్మ సిర.. దీన్ని ఇక్కడెవులు యేసేరూ?’ తనలో తనే మాట్లాడుకుంటున్నట్టు అన్నాడు. వీరి అదో పెద్ద విషయమే కాదన్నట్టు మొహం పెట్టి ‘నిన్నే కదేటి బావా! మీయమ్మ సవస్రికవైంది. యేదో అవస్రానికి తీసుంతారు’ అన్నాడు. ‘ఎంత అవసరం వుంతే మాత్రం పెట్టెలున్న అడుగు సీరే తియ్యల? ఇగో సూడు ఈ సీరకి పెద్ద సిల్లు కూడా పడింది. ఒలే బూలచ్చిమీ.. బూలచ్చిమీ’ భార్యని ఏకధాటిగా పిలవడం మొదలుపెట్టాడు. వెంటనే వీరయ్య కంగారుగా ‘ఇప్పుడు దాన్నేల పిలత్తన్నవు బావా పల్లకో’ అన్నాడు. ‘మాయమ్మకి ఇట్టవైన సీరరా ఇది. దాని గేపకంగా దాసుకున్నాను. దాన్నిప్పుడు బైటకి నాగే అవసరం యేటొచ్చింది. దానిక్తోడు ఈ సిల్లోటి. ఇంత నిర్లక్సం యేటి దానికి’ అంటూనే కోపం ఆపుకోలేక మళ్ళీ పిలిచాడు ‘ఓలి బూలచ్చిమీ! ఇనబడట్నేదేటే’ ఈసారి అతని కఠం ఖంగుమంది.ఆ అరుపులని ఆదిబాబు గోలని గమనిస్తున్న భూలక్ష్మి నిదానంగా వచ్చి గుమ్మంలో నిలబడింది. ఆమె ఎప్పట్లా లేదనిపించింది అతనికి. బెదురు చూపులకి బదులు తెగింపు ఆమె కళ్ళలో. అలా తనని చూడగానే అడగడానికి లక్ష ప్రశ్నలున్నా వాటన్నింటినీ మర్చిపోయాడు ఆదిబాబు. భూలక్ష్మి కాసేపు అతన్నే తేరిపార చూసి, నిదానంగా అడిగింది ‘యేటి నీ కాకి గోల?’ ఆ మాటకి ఆదిబాబు కోపం నషాలానికెక్కింది.‘ఈ సీర బైటకెలగొచ్చింది?’ భూలక్ష్మి మొఖం చిట్లిస్తూ ‘ఏమో నాకేటి తెలుసు?’ అంది. ‘ఏటే ఆ సమాదానము.. ఈ ఇంట్ల యెంతమంది వున్నారు వచ్చి తీసీడానికి. వున్నదే మనిద్దరం. తీత్తే నువ్వు తియ్యాలి లేదంటే నాను తియ్యాలి. సక్కగ సెప్పు యెలా తీసేవో’‘ఏటి యకసెక్కాల గుందా? నాకు తెలీదని సెప్తున్ను కదా! నిన్న ఇల్లంతా సుట్టాలే! ఎవులు తీసేరో? యానికి తీసేరో?’ అంది. ‘యెంత నిర్లక్సమే నీకు. మాయమ్మ సీర, దానికి ఇట్టవైన సీర.. దాని గేపకార్దం నాను దాసుకుంటే దాన్ని బైటికి నాగిందే కాకంట దానికి సిల్లు కూడ యెట్టారు. ఇది ఎవులు ఎందుకోసం సేసేరో నాకు తెలిసీవరకు నేనొగ్గను’ తెగించినట్టే అన్నాడు ఆదిబాబు.భూలక్ష్మి చీర కొంగును బొడ్డులో దోపుకుంటూ ఇంటి గుమ్మం దాటి బైటకొచ్చింది. ‘యేటేటి.. మల్లి సెప్పు. ఈ సీరంటే నీకిట్టవా.. దీన్ని మీయమ్మ గేపకంగా దాసుకున్నవా.. ఓలమ్మొ ఓలమ్మో నాను ఎంత గుడ్డిదాన్ని.. నా మొగిడి గొప్ప హుదయం సూడలేకపోన్ను. ఎప్పుడూ తాగుబోతు నా కొడుకని తిట్టుకునీదాన్ని గానీ ఇంత గొప్పోడని తెలిత్తే దండేసి దండవెట్టీకపోనా’ అంది నాటకీయంగా చేతులు తిప్పుతూ. ఆమె ఉద్దేశం అర్థమైన ఆదిబాబు ‘నంగనాసిదానా నాటకాలాపే నీయమ్మ.. ఒల్లెలగుందే’ అన్నాడు ఆమె పైపై కెళ్తూ.‘నేకపోతే ఏట్రా సెత్తనాకొడకా... పెపంచకంలో నీదే గొప్ప పేమ అన్నట్టు హెచ్చులు పోతన్నవు. నువ్వడిగేవి దిక్కుమాలిన పెస్నలు. మల్లీ దానికో సమధానం కూడా సెప్పాలా..థూ’ ఆవేశంతో వూగిపోయింది. ‘అవునే సెప్పాలి. నువ్వు మగా ఇల్లాలివని నీ పీలింగ్ కదా.. ఇందల సూపించే నీ ఇల్లాలితనం. ఇంట్ల యేటి జరుగుతందో ఎవరేటి తీస్తన్రో తెలీకుండా బతకతంది.. ఇదొక ఇల్లాలు... దీనికో సపోర్టు’ఆ మాటకి భూలక్ష్మి నవ్వీ ‘పోనీ నానైతే మగా ఇల్లాలిని కానులే. నువ్వయితే గొప్ప ఈరుడివి కదా.. మరి నువ్వు కానుకోలేకపోనవా ఆ సీర ఎవులు తీసేరని. నీకు ఈ సీర మీదున్న ఇట్టానికి అలగ దాని ముందే కూకోలేకపోనవా? దాన్ని నీ బుర్రమీదెట్టుకొని వూరేగలేకపోనవా?’ అంది భూలక్ష్మి. ఆదిబాబుకి రోషం పొడుచుకొచ్చింది. ‘ఒలే నన్ను రెచ్చగొడితే మనిసిని కాను..’ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు. ‘నువ్వెలగు మనిసివి కాదన్న ఇసయం నాకు తెలుసులే ఇంక పల్లకో. మీయమ్మ బతికున్నప్పుడు సక్కగ సూసుకోడం సేతగానేదు గనీ ఇప్పుడేదో పేమ కారిపోతన్నట్టు గుండైపోతండు’ అందామె గుమ్మంలో వున్న అరగుపైన కూర్చుంటూ. ‘మగాడి పేమలన్నీ బైటికి అగుపిత్తాయేటే.. మనసులుంటయి గనీ’ ఆమెకు దగ్గరగా వెళ్తూ అన్నాడు ఆదిబాబు. ‘ఆ.. పేమొకటే దాసుకున్నవా.. యేరే రగస్యాలు కుడా దాసినావా ఆ మనసలా’ ఆమె గొంతులో వెటకారం ధ్వనించింది. ఆదిబాబూ ఆవేశంగా ముందుకు ఊరికాడు. ‘లక్స తొంబై దాసుకుంతానే నీకెందుకు? ముందీ సీర ఇసయం తేల్సు’ అంటూ ఆమె దగ్గరకి వెళ్ళబోతుంటే వీరి అడ్డుపడ్డాడు. ‘యేట్రా నీ గోల. ఆడోలు సీర్లు ఎందుకు తీత్తారు కట్టుకోడానికి తీత్తరు. అదెంత పాత సీరో కట్టుకోబోతే పుసుక్కున సిరిగుంటది. ఇంత సిన్న ఇసియానికా యానికలగ రంకె లేత్తన్నవు’ చిరాకుగా మొఖం పెడుతూ అంది.ఆమె చిరాకు అతడికి ధిక్కారంలా తోచింది. అవమానంతో గుండె భగ్గున మండింది. ఏం మాట్లాడాలో అర్థంకాక మౌనంగా వున్నాడు. కాసేపటి తర్వాత ‘యేవి ఈ ఆడోలికి సీర్లే కరువైపోనాయా. మాయమ్మ సీరే కావల్సొస్సిందా?’ అని అనగలిగాడు. అది కూడా వీరయ్య వైపు చూస్తూ. ‘యేటి రా నాయన. మీ యమ్మ సీరలోనున్న మగత్యవు. ఏటి దాసిస్సేవేటి ఈ సీరల ఇలగ గింజీసికుంతన్నవు’ భూలక్ష్మీ తగ్గలేదు. ఆదిబాబు నీళ్ళు నమిలాడు. అతనేం చెప్తాడా అన్నట్టు ఎదురు చూశాడు వీరయ్య. భూలక్ష్మి భర్తలో మారే రంగులను చూస్తూ ‘యేటాది బాబు.. పలకవు సెప్పు..’ రెట్టించింది.ఆదిబాబు తెగించాడు. ‘యేటి సెప్పాలే. నిజం తెలిసిపోనాక ఇంకేటి సెప్పాలి. నువ్వే ఆ సీర తీసేవ్. యానికో కూడా నాకు తెలుసు’ అని ఆగి, ‘దీనికి ఇసయం తెలుసని అరదమైపోనాది. మరి నేనెలా సెప్పాలి? దాన్నె ఇరకాటంల యెట్టి సెప్పిత్తాను’ అనుకుని, ‘మా యమ్మ మీద కోపంతో నువ్వే ఆ సీర సింపీసినావు. యేరు దాటాక తెప్ప తగలేసే రకవే నువ్వు. అది తెలక ఆ ముసిల్ది నీకు సపోర్టు సేసింది’ కసిగా అన్నాడు. అతను విషయాన్ని ఎలా నరుక్కొస్తున్నాడో అర్థమైంది భూలక్ష్మికి. అతని నోటి నుంచి నిజం రాదని గ్రహించి, తన వ్యూహాన్ని రచించింది. ‘మీయమ్మతో ఏ నాడైన పేమగ మాటాడేవా నువు? అదే సేసుంటే నాకెలా సపోర్టు సేస్తది మీ యమ్మ?’ ‘ఎదో మందెట్టుంటావు’ టక్కున అన్నాడు. ‘ఓలమ్మ నాను మందెట్టీసినానట. ఈలమ్మని పొట్టనెట్టుకుంది ఈడు.. సుట్టు తిరిగి నన్నంతండు’ అంది భూలక్ష్మి అతడి అహాన్ని దెబ్బకొడుతూ. అది చీర విషయంగా రేగిన గొడవలా ఇంకెంతమాత్రం అనిపించలేదు వీరయ్యకి. చుట్టూ జనం గుమిగూడారు. పొద్దున్నే భార్యభర్తల గొడవ భలే రంజుగా వుంది వాళ్ళకి. మాటలు కరువైన ఆదిబాబు ‘ఇదో బూలచ్చిమి.. పోన్లే కదని వూరుకంటంటే పెట్రేగిపోతనవు. మాయమ్మని నేను పొట్టనెట్టుకోడవేటే?’ అన్నాడు. ‘సిక్కింది సేప’ అనుకుంది భూలక్ష్మి. ‘నేనండవేటి వూరు వూరే అంతంతే.. కాలంటే ఇలందరి నుండి సాచ్చకం తీసుకొత్తాను’ అంది. ‘నీ సాచ్చకాలేటి నాకక్కర్నేదు. అది నా తల్లే. నేనేటైన సేసుకుంతాను నా ఇట్టం. నీకేటి మజ్జిల’ ఆవేశంతో అతని గొంతు వణికింది. ‘ఇంత తెగించీసినోడివి మరి నీకేల ఈ సీర ఇసయం. అది సిరిగిపోతే నీకేవి అరిగిపోతే నీకేవి’ మళ్ళీ తిరిగి విషయాన్ని అక్కడికే తీసుకొచ్చింది భూలక్ష్మి. ‘నీయమ్మ ఎంత పొగరే నీకు’ అంటూ పైపై కొచ్చాడు ఆదిబాబు. ‘యేటి కొడతావా? కొట్టు. నువ్వేనేటి నేనూ సెయ్యగలనా పని’ అంటూ భూలక్ష్మి ఓ మూలనున్న రోకలి తీసుకొని వచ్చింది. అదంతా చూస్తున్న వీరయ్య కంగారుగా వాళ్ళ మధ్యలో దూరి ‘సుకంగుండడం సేతకాదేటి మీకు? సిన్న సీరముక్క కోసం గొడవలు పడుతన్రు’ అన్నాడు. ఆదిబాబు కోపంతో బుసలు కొడుతున్నాడు. ‘ఇసయం సీర కాదురా ఈరీ.. ఆడి గొడవ సీర కోసం అంతకన్నా కాదు. ఆ సీరలో దాసిపెట్టిన ఆత్తి పత్రాలేవి అని అడగలేక ఈ బాద’ అంది భూలక్ష్మి. అందరూ ఆశ్చర్యపోయారు. ‘ఏటవుతుంది బావా ఇక్కడా.. ఆత్తి పత్రాలేటి దాన్ని దాసిపెడ్డం యేటి.. ఈ గోలేటి?’ అడిగాడు వీరి. దానికి సమాధానం ఎం చెప్పాలో తెలియక ఉక్రోషం ఆపుకోలేక భూలక్ష్మిని కొట్టడానికి వురికాడు ఆదిబాబు. ‘ఇద ఈ పాపిట్టిదాన్వల్లే నా బతుకిలగ అయ్యింది. నా ఆత్తి మీద నాకు అక్కు లేకుండ సేస్సేవు కదే దొంగ ముండా’ అంటూ ఆమె చెంపల మీద ఆపకుండా కొట్టాడు. చుట్టూ వున్న వాళ్ళు బలవంతంగా అతన్ని వెనక్కి లాగి ఆమె దగ్గరకు వెళ్ళకుండా శక్తి కొలది పట్టుకున్నారు. భూలక్ష్మి వాచిన చెంపలను తడుముకోకుండా రేగిన జుట్టును సర్దుకోకుండా అలాగే ఆదిబాబును చూస్తూ వుంది. ‘అప్ప ఇద.. ఈ నీలు తాగు’ అని నీళ్ళందించాడు వీరయ్య. వెంటనే అతడి చేతిలో వున్న గ్లాసుని విసురుగా తీసుకొని బలంగా నేలకేసి కొట్టింది. ‘నా మీద నీ పెతాపం సుపిత్తే యేడుసుకొని మూల కూకున్న రోజులు పోనాయి. నువ్వేటో వూడబొడుత్తవని లక్సలు పోసి కట్టబెట్టారు మాయమ్మోల్లు. నువ్వా పైసాకి పనికి రానోడివి. నా కట్టం తిని నన్నే తన్నెవోడివి. మీయమ్మ సచ్చిపోయాక కనీసం దాని సావుకి కారనం కూడ అడక్కండా డవిరెక్టుగ ఆత్తి ఇవరాలు అడిగినోడివి. తూ నీ బతుకు! ఇదో అందరినండి. యేదో ఆలమ్మ మీద పేమ కారిపోతున్నట్టు అంతెత్తున ఎగిరి పడతన్డు గనీ ఆయమ్మ బతికున్నపుడు ఒక్కరోజు కూడా ఈడు పేమగా సూసింది లేదు. దాని ఆస్పెత్రి కర్సులకి దాసుకున్న డబ్బులు కూడా తీస్కెలి తాగిన తాగుబోతోడీడు. దాని శవం కాడికి కూడ తాగేసొచ్చిన యదవ. ఇంత కాత్ర లేనోడికి ఆయమ్మ ఆత్తెలా రాత్తది? అందికే పోయే ముందే పెద్దోల్నెట్టి ఆయమ్మ కూతురు పేర్న నా పేర్న దానికున్నదంతా ఇచ్చీమని యీలునామా రాయింసింది. ఆ యీలునామాని సింపిసినాడీ బాడుకోవు. ఇప్పుడీ ఆత్తి పత్రాలు దాసీసి ఆత్తికి అక్కుదారుడైపోదమని ఈడి ఆలోసన. ఆడముండలం మాకు ఆత్తంత వచ్చీసినాదని ఈడీ యేడుపు. ఇప్పుడు సెప్పండర్రా ఆ పత్రాలని ఈడికి తెలకుండా తీసీడం తప్పా’ అంటూ బలంగా ఊపిరి పీల్చుకుంది భూలక్ష్మి. ఎటు పోయి ఎటొస్తుందోనని జనం మెల్లగా జారుకున్నారు. వీరయ్య ఆ మొగుడూ పెళ్లాలను చూస్తూ నిలుచున్నాడు. ఏవేవో ఆలోచనలు బుర్రలో సుడులు తిరుగుతుండగా ఆదిబాబు ‘మీకు సాచ్చకాలే లేవు. సింపీసిన ఈలునామ వొట్టుకొని యే కోరుటుకెల్తారు. ఒకేల యెల్లినా గెలిసేది నాయవేనే. అది నా కాడుంది గుర్తెట్టుకో’ అన్నాడు. ‘ఏటా నాయం.. తాగీసొచ్చి ఒల్లు పై తెలీకండా తల్లిని, ఆలిని సితకబాదడవా? ఆడోల కట్టం మీద తిని తొంగోడవా?’ సూటిగా చూస్తూ అడిగింది భూలక్ష్మి.‘ఇయ్యనిటి కన్న పెద్ద అర్గత.. నాను మగాడ్నవ్వడవేనే..’ ఆదిబాబు స్వరంలో గర్వం. అతడి వైపు అసహ్యంగా చూసి ‘తూ! మగాడివైపోతేటిరా ఆరతట్టాలా? నువ్వు మాలాటి మడిసివే గుర్తెట్టుకో. అయినా పుట్టకలో మగాడివైపోతే సరిపొద్దేటి. గునంలో నవ్వక్కర్నేదా?’ అందామె. బుసలు కొడుతూ ఆదిబాబు జారిపోతున్న లుంగీని బిగించి కట్టుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. ఏ అఘాయిత్యం చేస్తాడోనన్న భయంతో వీరయ్య అక్క దగ్గరకొచ్చి ‘ఓలే బావా యెలిపోతున్నాడే’ అన్నాడు కంగారుగా. ‘యెల్లని ఆడేటి సెయ్యినేడు.. తాగి తొంగుంటే ఆడి ముడ్డి, మూతి కడిగి పెతిరోజు జెబ్బలరిగిపోయినట్టు పనిసేసేది నానైతే యేటి సెయ్యనోడికి ఆత్తేటి. మల్లి ఇదే నాయవని ఆడు ఇర్రీగడవేటి. ఆడాలికి ఆత్తి ఎందుకొద్దు. అది ఆల్ల అక్కు కాదా? అక్కులు ఎవరియ్యరట. మావే పోరాడి లాక్కోలట. ఇప్పుడు అదే కదా సేశాను. ఇక పైన కూడ అదే సెయ్యాలి. సేత్తను..’ అంది భూలక్ష్మి స్థిరంగా. వింటున్న వీరయ్యకి ఏదో సత్యం బోధపడ్డట్టు కళ్ళు విశాలమయ్యాయి. -
చంద్రబాబు ఏడు చేపల కథ.. |
-
యువ కథ : అబార్షన్
‘మరోసారి ఆలోచించుకోండి. మళ్లీ కావాలనుకుంటే కుదరక పోవచ్చు.. నేను చెప్పాల్సింది చెప్పా.. తర్వాత మీ ఇష్టం’ అంది డాక్టర్ పద్మ. ఐదు నిమిషాల భయంకర నిశ్శబ్దం. పెద్ద శబ్దం విని ఉలిక్కిపడ్డ చిన్నపిల్లలా ఉంది సంధ్య. ఆమె మాట్లాడేలా లేదని అర్థమైంది డాక్టర్కు.‘రెండు రోజుల తర్వాత మీరు రావచ్చు’ అంటూ అసహనంగా టేబుల్ మీద ఉన్న బెల్ నొక్కింది. తనకెందుకో డాక్టర్ తన ముఖంపైనే గెటవుట్ అని చెప్పినట్లనిపించింది సంధ్యకు. ‘సరే’ అన్నట్లుగా తల ఊపుతూ పక్కనే ఉన్న భర్త వైపు చూసింది. ‘ఏం ఫరవాలేదు నా నిర్ణయం సరైనదే’ అన్నట్లు చూశాడు నరేంద్ర. ఇద్దరూ పైకి లేచి డాక్టర్ గారికి నమస్కరించి బయటికి వచ్చి ఇంటికి వెళ్లడానికి హాస్పిటల్ బయట పార్క్ చేసిన వారి బైక్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ బైక్ వెనుక టైర్ మీద చేయాల్సిన పని చేసి వెళ్లిపోయింది. మరో చిన్న కుక్కపిల్ల బైక్ ముందు చక్రం దగ్గర పడుకొని వుంది. నరేంద్రని చూసి తోక ఊపుతూ అతని చెప్పులు నాక బోయింది. విసురుగా కాలితో ఒక్క తోపు తోశాడు నరేంద్ర. కుయ్కుయ్ మంటూ అరవ సాగింది ఆ కుక్కపిల్ల. ఇంతలో దాని తల్లి ఒక్కసారిగా నరేంద్రని చూస్తూ భౌ భౌమని అరుస్తూ వెళ్లి తన బిడ్డను ఆప్యాయంగా నాకుతూ సముదాయిస్తూ వుంది.ఆ కుక్కపిల్లనూ దాని తల్లినీ చూస్తూ ఉంది సంధ్య. కాలు విరిగిన తన తల్లి బాగోగులు చూడడానికి భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ అడ్డమని తేల్చి అబార్షన్స్ చేయించడానికి డాక్టర్ దగ్గరికి తీసుకు వచ్చిన భర్త వైపు కూడా చూసింది. భర్త మాటకు తాను కనీసం ఎదురు కూడా చెప్పలేకపోయానని, ఆ మూగ జీవానికున్న ధైర్యం కూడా లేనందుకు తన మీద తనే జాలి పడుతూ భర్త బైక్ వెనుక సీటు పైకి ఎక్కి కూర్చుంది. అయితే ప్రతిసారిలాగా భర్త భుజంపై చేయి వేయలేదు. బైకు వెనుక మాత్రమే పట్టుకుని కూర్చుంది.బైక్ బయలుదేరింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం తిష్ట వేసుకుని కూర్చుంది. ఎక్కుపెట్టిన బాణంలా స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా నిదానంగా వెళ్ళకుండా వేగంగా వెళుతోంది బైక్. వెనుక మరింత గట్టిగా పట్టుకుని కూర్చుంది సంధ్య. మెల్లగా పొమ్మని చెబితే ‘అమ్మ బెడ్ మీద ఉందని తెలుసుగా. మనం వచ్చి ఒక గంట పైన అయింది. త్వరగా వెళ్ళవలసిందే’ అని తన భర్త ఎలాగూ అంటాడు. అందుకే మౌనంగా ఉండిపోయింది. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళడానికి 20 నిమిషాలు పట్టింది. సంధ్యను ఇంటి గుమ్మం దగ్గర వదిలి ఆఫీసుకి వెళ్ళిపోయాడు నరేంద్ర.ఇంటి బయట చెప్పులు వదిలి మెయిన్స్ డోర్ తలుపు తీసింది సంధ్య.‘రామ్మా.. రా.. కొంచెం కాఫీ కలిపి ఇవ్వమ్మా... తల పగిలిపోతోంది’ అంది సరోజినమ్మ.‘సరే అత్తయ్య..’ అంటూ వంటింట్లోకి వెళ్ళి టీ గిన్నెలో కొన్ని పాలు పోసి, స్టవ్ మీద పెట్టి డ్రెస్ చేంజ్ చేసుకుందామని బెడ్రూమ్లోని వార్డ్రోబ్ దగ్గరికి వెళ్ళింది. వార్డ్రోబ్ అద్దంలో తన పొత్తికడుపు వైపు చూసుకుంది. ఒక చేయి పొట్ట మీద ఉంచుకొని మరొక చేత్తో నైటీతో కన్నీళ్లు తుడుచుకుంటూ తన కడుపులో పెరుగుతున్న బిడ్డతో ‘నాలుగు నెలల నిన్ను చంపుకుంటున్నాను. నన్ను క్షమించరా..’ అంటూ వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్ళు ఆగటం లేదు. ‘సంధ్యా .. ఒసేయ్ సంధ్యా.. పాలు మరిగిపోతున్నాయి. సోకులు చేసుకోవడం ఆపి బయటికిరా..’ అంటూ సరోజినమ్మ అరుస్తూ తన చేతి కర్రతో మంచాన్ని గట్టిగా కొట్టేసరికి ఈలోకంలోకి వచ్చి, గబగబా నైటీని దూర్చుకొని హడావిడిగా వంటింట్లోకి పరుగు పెట్టింది. దారిలో టీపాయ్ అంచు రోజు మాదిరిగానే మోకాలిని ముద్దాడింది.‘అబ్బా’ అని గట్టిగా అరిస్తే ‘ఇంకా కళ్ళు కూడా పోయాయా? చూసుకొని నడవలేవా?’ అనడానికి అత్తయ్య రెడీగా ఉంది. అందుకే బాధనంతా పంటిబిగువున పట్టి, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి అత్తయ్య చేతిలో పెట్టింది.తన మొహం కూడా చూడకుండా కాఫీ అందుకుని దానిని తాగే పనిలో పడిపోయిందామె.‘అత్తయ్యా.. మీతో విషయం చెప్పాలి’ అంది సంధ్య లోగొంతుతో.‘ఏంటి?’ అంది అత్తయ్య గొంతు కరుగ్గా.‘అదీ .. అదీ.. అత్తయ్యా .. నాకు ఇప్పుడు నాలుగో నెల..’ అని సంధ్య అంటుండగానే..‘తీయించే కడుపు నాలుగో నెల అయితే ఏమి? ఐదో నెల అయితే ఏమి?’ అంది సరోజినమ్మ. సంధ్య నోట మాట రాలేదు. తాను విన్నది నిజమేనా అన్నట్లు సరోజినమ్మ ముఖం వైపు చూస్తూ ఉండిపోయింది. అప్పటివరకు అబార్షన్స్ చేయించాలనుకున్న నిర్ణయం కేవలం భర్తది మాత్రమే అనుకుంది.అత్తయ్యకు కూడా ఈ విషయం తెలిసుంటుందని ఊహించలేకపోయింది. కనురెప్పలు కంటిని మూయడం మరిచిపోయాయి సరోజమ్మ మాటలకు. మొదటిసారి తన ఇల్లే తనకి భయాన్ని పరిచయం చేసింది. అమ్మా కొడుకులు కలిసి తన బిడ్డను, తన అమ్మతనాన్ని, తన నుంచి దూరం చేయాలనే నిర్ణయం తీసేసుకున్నారని, మొద్దుబారిన ఆమె మెదడుకు అర్థమయ్యేసరికి కన్నీళ్ళు చెంపల నుంచి గుండెల వైపుకి చేరసాగాయి.నెమ్మదిగా గొంతులోకి ధైర్యాన్ని నింపుకొని ‘అత్తయ్యా .. నేను బిడ్డను ఉంచుకుంటాను అత్తయ్యా.. వారికి మీరే ఎలాగైనా చెప్పి ఒప్పించండి.. ప్లీజ్’ అంది.‘చూడమ్మాయ్.. నేను కాలు విరగ్గొట్టుకొని మంచాన పడున్నాను. ఆరు నెలలు లేవడానికి లేదు.నీవు కడుపని పుట్టింటికి వెళితే నన్నెవరు చూసుకుంటారు? అందుకే తీయించేసేయమన్నాను. కడుపుదేముంది ఎన్నిసార్లైనా తెచ్చుకోవచ్చులే. అయినా నేను మీ సంబంధం ఖాయం చేసేటప్పుడే మీ నాన్నతో చెప్పా.. మాకు మీరు కట్నం ఎలాగూ ఇవ్వలేరు. ఇంటి పనులు చేసే పిల్లయి ఉంటే చాలు అని.తల్లి లేని పిల్ల కదా అని పెళ్ళి కూడా తేరగా చేసుకుంటే ఇప్పుడు మేము మీకు సేవలు చేస్తూ కూర్చోవాలా?’ అంటూ ఇంకా ఏవేవో నా¯Œ స్టాపుగా మాట్లాడుతోంది సరోజినమ్మ.సంధ్యకు అంతవరకు మాత్రమే ఆ మాటలు వినపడ్డాయి. ఇక తర్వాత తనకు ఏమీ వినపడలేదు. కాసేపటి తర్వాత ‘నీ మొగుడు వచ్చినట్టున్నాడు వెళ్ళి తెలుపు తియ్..’ అన్న సరోజినమ్మ మాటలతో ఉలిక్కిపడింది. కంటిన్యూగా మోగుతున్న కాలింగ్ బెల్ శబ్దం తను వెళ్ళి తలుపు తీయగానే ఆగిపోయింది.‘ఎక్కడ చచ్చావ్? ఇంతసేపు?’ అంటూ విసురుగా లోపలికి వచ్చి ఆఫీస్ బ్యాగు సోఫాలో విసిరేసి ‘కాఫీ తీసుకురా’ అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళాడు నరేంద్ర.కాఫీ కలిపి తెచ్చి భర్త చేతికందిçస్తూ.. ‘అబార్షన్స్ విషయం మరొకసారి ఆలోచించకూడదా?’ అని అడగబోయే లోపలే.. ‘రేపు ఉదయం నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా?’ అంటూ కాఫీ తాగడంలో నిమగ్నమైపోయాడు నరేంద్ర.నిస్సహాయత కమ్ముకుంది సంధ్యను.ఉదయం చూసిన తల్లి కుక్క గుర్తొచ్చింది. అది కనీసం మొరగనైనా మొరిగింది. తనకు నోరు లేదా? దేని గురించి తాను భయపడుతున్నట్టు?సంధ్యను తండ్రి మగరాయుడిలా పెంచాడు. తల్లి లేకపోవడంతో ఇంట్లోని ప్రతి పనీ సంధ్యకు బాగా వచ్చు. తండ్రికి సేద్యంలో సాయానికి వెళ్ళి పొలంలో దిగిందంటే మట్టిని గింజను కాపాడుకొని పంట ఇంటికి తెచ్చుకోవడం తెలుసు. పాడి పొదుగు పాలు తెలుసు. తండ్రి రూపాయి తెస్తే పావలా దాచి మిగిలిన డబ్బుతో ఇల్లు నడపడం తెలుసు. తండ్రి తనని టౌన్స్ లో ఇచ్చి చేసింది ఈ పనులకు దూరంగా కూతురు కాస్తంతైనా సుఖపడాలని. జీతగాడైన భర్త తెచ్చే జీతంతో హాయిగా ఉండాలని. కాని జీతం తెచ్చే వాడంటే జీవితంలోని ప్రతి నిర్ణయానికి అధిపతి అని ఆమె అప్పుడు అనుకోలేదు. ఇప్పుడు అర్థం చేసుకుంది. అయితే ఏంటి? ఇంటి నుంచి తరిమేస్తారు. లేదా విడాకులు ఇవ్వొచ్చు. చిన్నప్పుడే కలుపు కూలీల బిడ్డల్ని సరదాగా వీపుకు కట్టుకుని పని చేసేది సంధ్య. ఇప్పుడు సొంత బిడ్డను గుండెకు అదుముకుని ఎలా బతకాలో తెలియదా!సంధ్య మౌనంగా ఇంట్లోకెళ్ళి ఒక చిన్న సంచిలో కొన్ని బట్టలు పెట్టుకొని బయటికొచ్చి నిలబడేసరికి అత్త, భర్త నోరు తెరిచారు. ‘మా ఇంటికి వెళుతున్నాను. అక్కడ ఉంటానో లేదో తెలియదు. మా నాన్న ఇక్కడకు తిరిగి వెళ్ళమని అంటే వేరే ఎక్కడికో వెళ్ళి నా బిడ్డను క్షేమంగా కంటాను. ఆ తర్వాత కష్టం చేసి పెంచుకోవడం నాకు వచ్చు. మీ అమ్మ అంటే నాకు గౌరవమే. ఆమె కాలు విరిగితే ఎలా సేవ చేయాలో ఈ క్షణం వరకూ ఆలోచిస్తూనే ఉన్నాను. కాని మీ సౌకర్యం కోసం నా బిడ్డ ప్రాణాలు తీయడంలో కనీసం నా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని అనుకోలేదు మీరిద్దరూ. అంటే నన్ను మీలో ఒకరు అని అనుకోలేదన్న మాట. నేను కూలిదాన్ని కాదు.. కోడల్ని. భార్యని. ఇప్పుడు కేవలం కాబోయే తల్లిని. నాకై నేను వద్దనుకుంటే తప్ప నా కడుపులోని బిడ్డను ఎవరూ తాకలేరు. ఇప్పుడు వెళుతున్నాను. అత్తయ్యా.. మీ అబ్బాయి వచ్చి క్షమాపణలు చెప్పి మీరూ క్షమాపణలు చెప్పాక నా కడుపులోని బిడ్డతో పాటు నలుగురం కూచుని మన ఇంట్లో ఎవరూ ఏ ఇబ్బంది పడకుండా ఎలా ఈ సందర్భాన్ని దాటొచ్చో ఆలోచిద్దాం.మరో విషయం. మీరు కాలు విరిగి మాత్రమే మంచం మీద పడ్డారు. నేను గనక ఇప్పుడు ఇల్లు దాటితే మీ అబ్బాయి నడుమే విరుగుతుంది జాగ్రత్త’ అంది సంధ్య.ఒక చేతిలో సంచి పట్టుకుని, మరో చేతిని కడుపులో ఉన్న బిడ్డకు చేరువ చేస్తూ నిలబడి ఉన్న సంధ్యను సరోజినమ్మ, నరేంద్ర భీతిల్లి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ముఖాలు చూస్తుంటే వాళ్ళ ఆధిపత్యం ఏ క్షణమైనా అబార్షన్స్ టేబుల్ ఎక్కేలా ఉందనిపించింది సంధ్యకు.ఆమె ధైర్యంగా అలాగే నిలుచుంది. -
యువ కథ: నీలం కారు
‘ఏమిటీ ఈ డొక్కు కారు ఇక్కడా!! ఎవరిది ఇది?’ అనే మాట వినిపించే సరికి చురుక్కున చూశాను.ఇస్త్రీ చేసిన చొక్కా, గాలి వీస్తున్నా వడలిపోని జరీ అంచు కుచ్చిళ్ళు, ఎండకి మెరుస్తున్న పంచె, నున్నగా గీసిన గడ్డం, నల్ల కళ్ళజోడు, ఇతగాడికి ఎండ తాకకుండా వెనుక గొడుగు పట్టుకొని మా రాముడు. అర్థం అయింది కొత్త పెళ్ళికొడుకు అని. రెండేళ్ళ నుండి మూలన పడి వున్నా ఇన్నేళ్ళుగా నన్ను ఎవరూ కదిలించింది లేదు పట్టించుకోనూ లేదు. ఇలా ఈసడించిన వాళ్ళు కూడా లేరు. అలాంటిది ఉన్నట్టుండి డొక్కు కారు అని వినేసరికి కుంభకర్ణుడికి నిద్రాభంగం అయినట్టు లేచాను. ‘ఇది మా షావుకారుగారి మొదటి కారు అయ్యగారూ.. మా షావుకారు అనే కాదు, ఇది ఈ ఊర్లోనే మొదటి కారు’ నన్ను నాకు గుర్తుచేస్తూ, నా గత వైభోగం గురించి గొప్పగా చెప్పాడు రాముడు.‘అయితే?’ అన్నాడు కొత్త పెళ్ళికొడుకు.నేను అక్కడ ఉండటం, అలా ఉండటం అతగాడికి బొత్తిగా నచ్చనట్టు ఉంది. అతనికి నచ్చకపోయేసరికి రాముడు చిన్నబుచ్చుకుంటూ నన్ను చూశాడు.పాపం నన్ను ఇంటికి మొదటిసారి తీసుకొని వచ్చినప్పుడు నాకు దిష్టి తీసింది రాముడే. అలా తీసినందుకు షావుకారు రాముడికి, అతని భార్యకి, కొడుకుకి కలిపి ఒక రూపాయి నోటు ఇచ్చారు. నన్ను చాలా ఆప్యాయంగా, సొంత బిడ్డలా చూస్తూ తాకిన మా షావుకారి చేతి స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుంది. నన్ను ఒక కారులా కాకుండా ఇంట్లో ఒకరు అన్నట్టు చూసుకునే వాళ్ళు. డ్రైవర్ పేరుతో బయట మనిషి కూడా నన్ను తాకకుండా షావుకారు అన్నీ తానే అన్నట్టు అల్లారుముద్దుగా చూసుకునే రోజులవి.మొదటిసారి నేను ఊరిలోకి వచ్చిన క్షణం నాకు ఇంకా గుర్తుంది. అది ఒక జాతర అనే చెప్పాలి. లేదా నేను ఒక గ్రహాంతరవాసిని అయినా అయ్యుండాలి.మా షావుకారుగారు నన్ను తోలుకుంటూ ఊరిలోకి వస్తుంటే, ఏదో తెలియని అమాయకపు హోదాని ఇస్తూ గడపల దగ్గర, అరుగుల మీద కూర్చున్న వాళ్ళంతా లేచి నిలబడి చూడటం; మా షావుకారి గారినో, నన్నో చూసి చూసి మురిసిపోవటం, బుడత గాళ్ళందరూ నా వెనుకనే పరిగెత్తుకుంటూ రావటం, కొందరు సైకిల్ టైరుని కొట్టుకుంటూ నా వెనుక పరిగెత్తటం, రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళందరూ నన్ను చూస్తూ అలా ఆగిపోవటం... ఆహా!! ఇంటికి వచ్చాక వాహన పూజ అన్నట్టు అయ్యగార్లు మంత్రాలని వల్లిస్తుంటే ఎంత వినసొంపుగా ఉండేదో. కొత్త ముతైదువుని అలకరించినట్టు పసుపు కుంకుమలతో నన్ను సింగారించి, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి, చిన్న పిల్లలందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఇలాంటి మధుర స్మృతులన్నీ నెమరు వేసుకొంటుండగా టపీమని ఒక చేతి అచ్చు పడింది బోనెట్ మీద. ఒక్కసారిగా కలలో నుండి ఇలలోకి వచ్చినట్టు అయ్యింది. ఎవరా అని చూస్తే ఇంకెవరు కొత్త పెళ్ళికొడుకే!‘ఎందుకూ పనికి రాని ఇనుము ఇంట ఉంచరాదు అని తెలియదా రాముడూ’ అంటున్నాడు.‘నిజమే నయ్యా!! కానీ ఈ కారుని ఇనుము అని ఇంటిల్లిపాది ఎప్పుడూ అనుకున్నదే లేదు. ఈ కారు వచ్చాకనే ఇంటికే కాదు, ఊరికి కూడా చాలా విషయాలు కలిసొచ్చాయి.’తన మాటకు ఎదురు పలుకుతున్నందుకు రాముణ్ణి కొత్త పెళ్ళికొడుకు గురాయించి చూస్తుంటే నా ఒళ్ళు వుడికిపోతోంది. అయ్యగారి చూపులని గమనించిన రాముడు తనని తాను తమాయించుకున్నాడు. దూరంగా చూస్తే చిన్నమ్మాయి గారు. నన్ను పరిచయం చేయటానికే ఏమో ఇటుకేసి వస్తున్నారు. నేను ఇంటికి వచ్చిన కొత్తల్లోనే పెద్దమ్మాయి గారికి పెళ్ళయింది. పెళ్ళి పిలుపుల దగ్గర నుండి అప్పగింతల వరకు తిరిగింది నేనే, తిప్పింది నన్నే. ఎంత హడావిడి వున్నా కారు తీయాలంటే షావుకారు గారే వచ్చే వాళ్ళు కానీ పొరపాటున కూడా నన్ను ఇంకొకరి చేతిలో పెట్టలేదు. పెద్దమ్మాయికి నేనంటే చాలా సెంటిమెంట్. అందుకే అత్తారింటికి వెళ్ళే ముందు నాకు నమస్కారాలు పెట్టి తృప్తిగా తడిమి మరీ వెళ్ళిందా బంగారుతల్లి.ఇక మా చిన్నమ్మాయి గారు నేను ఫ్రెండ్స్. తన కాలేజీ చదువులకు, పరీక్షలకు, టైపింగ్ నేర్చుకునేందుకు, పట్టణంలో షాపింగ్కి, స్నేహితురాళ్లతో కలిసి సినిమా చూడటానికి అన్నిటికీ నేనే... అంటే అదే నా తోడునే.ఒకసారేమో ఊరి అవతల వైపు ఉండే అమ్మాయి గారి స్నేహితురాలు లలితకి పురిటినొప్పులు మొదలు అయ్యాయి. మంత్రసాని ఊరిలో లేదాయె. సమయానికి షావుకారు కూడా ఊరిలో లేరు. చిన్నమ్మాయి గారే ధైర్యం చేసి తోలారు నన్ను. చాలా జాగ్రత్తగా లలితను తీసుకొని పక్క ఊరిలోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పసికందు పుట్టాక ఇంటికి తీసుకొని వచ్చింది కూడా నాతోనే. డ్రైవ్ చేయటానికి కొంచెం దడ ఉన్నా దాన్ని బయటకు చూపించకుండా బాగానే తోలారు. ఆ ఒక్క సంఘటనతో అమ్మాయి గారికే కాదు వాళ్ళ స్నేహితురాళ్లందరికీ కూడా నేనంటే మక్కువ. ఒక్కోసారి పూలతో, మరోసారి బొట్లతో, ఇంకోసారి ఓణీలతో రకరకాలుగా ముస్తాబు చేసే వాళ్ళు నన్ను. అలా నన్ను చూసి ఎవరైనా ఏమైనా అంటే మా కారు మా ఇష్టం అని నన్ను హత్తుకునే వాళ్ళు. ఈ రకంగా నేను వాళ్ళల్లో ఒకరిలా కలిసిపోయాను. షావుకారు గారు ఎటైనా ఏదైనా పని మీద వెళ్ళడం మా అమ్మాయి గారు నన్ను తీసుకొని షికారుకి వెళ్ళటం. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు మా అమ్మాయి గార్ని సతాయించాలనుకుంటే స్పీడ్ పెంచి మేము వాళ్ళని బెదరకొట్టటం. భలే ఉండేదిలే మా సావాసం. పై చదువులు అని అమ్మాయి గారిని పట్టణం పంపేశాక ఇదే మళ్ళీ చూడటం. చాలా మారిపోయారు అప్పటికీ ఇప్పటికీ. ఈ రెండేళ్ళలో ఇంటికి మరో కారు వచ్చింది. కానీ నాకు ఇచ్చిన స్వాగతం, హోదా ఆ కారుకి లేదు. ఊరు చిన్నదే అయినా ఇప్పుడు మరో నాలుగైదు కార్లు వచ్చాయి. ఇదంతా ఎపుడు జరిగిందో కూడా తెలియలేదు. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గర వాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. ఆ ఫొటోలన్నీ హాల్లో గోడలకి వేలాడుతుండేవి. ఇపుడు కట్నం పేరిట కొత్త పెళ్ళికొడుక్కు ఒక కొత్త మోడల్ కారు వెళ్తుందంట! మా అమ్మాయి గారు దగ్గరికి వచ్చేశారు.‘ఓరి కొత్త పెళ్ళికొడకా... ఇప్పుడు చూడు ఆమె నీకెలా గడ్డి పెడుతుందో’ అనుకున్నాను.చిన్నమ్మాయి గారు వచ్చి రాగానే ‘ఈ కారు ఇంకా ఇక్కడనే ఉందా?!’ అన్నారు. ’రాముడూ! నాన్నకంటే చాదస్తం ఎక్కువ. నీకేమైంది. ఇదుగో ఈ కారు తాళం. తీసుకొని వెళ్ళో, తోసుకొని వెళ్ళో డంపింగ్ యార్డ్లో పడేయ్’. రాముడు ఆ మాటలకి నివ్వెరపోయాడు. ‘ఏంటి రాముడు అలా చూస్తున్నావ్? ఇదుగో తాళం. తీసుకొని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరు’. ఏదో ఆలోచిస్తూ రాముడు తాళం తీసుకున్నాడు. నాకు గుండెల్లో కవ్వం పెట్టి చిలికేస్తున్నట్టు ఉంది. రాముడు ఎన్నడూ నన్ను నడిపించింది లేదు. అలాంటిది మొదటిసారి ఎక్కి కీ ఆ¯Œ చేశాడు. ఇంజి¯Œ లో వణుకు పుట్టింది. నేను అమ్మాయి గారి వైపు చూశాను. ఒకప్పుడు అన్నీ తన ఇష్టంగా జరిపించుకున్న అమ్మాయి గారు. తన మాటే నెగ్గాలనుకునే అమ్మాయిగారు. బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని అంటే షావుకారు గారు హడలిపోయి వద్దన్నా ‘చేస్తాను. నా ఇష్టం. అందులో తప్పేముంది’ అని మాట చలాయించుకున్న అమ్మాయిగారు, పెద్దమ్మాయిగారు ఉన్నప్పుడు ఇద్దరం రోజూ ఒకే రంగు బట్టలేసుకుందాం అనంటే నీ ఇష్టం నీది నా ఇష్టం నాది... ఏంటి నీ కోరిక యూనిఫారంలాగా అని పడీపడీ నవ్విన అమ్మాయి గారు, పుస్తకాలు తెగ చదివే అమ్మాయి గారు, పెళ్ళి అయిన నాలుగు రోజులకే...రాముడు మెల్లగా నన్ను కదిల్చాడు.‘సాయంత్రం షికారుకెళ్దామా’ కొత్తపెళ్లికొడుకు అడుగుతున్నాడు.‘మీ ఇష్టం’ అంటోంది అమ్మాయిగారు.‘ఆ ఫ్యాష ఎందుకు... తాళిబొట్టు బయటకు కనిపించేలా వేసుకో’‘అలాగే. మీ ఇష్టం’‘నాకు చెప్పకుండా ఎప్పుడూ డ్రైవింగ్ చేయకు’‘సరే’...రాముడు నన్ను బంగ్లా బయటకు తోలుకెళ్తున్నాడు.నేను అమ్మాయిగారినే చూస్తూ ఉన్నాను.ఆమె అక్కడే ఉండిపోగా నేను గేటు దాటి, మలుపు తిరిగిపోయాను. ఒకప్పుడు నన్ను చూడటానికి ఏదో ఒక వంకతో కనీసం రోజుకి ఒక్కరైనా వచ్చే వాళ్ళు మా షావుకారు గారికి దగ్గరవాళ్ళు. మరీ దగ్గరవాళ్ళు వస్తే ఫొటోగ్రాఫర్ని పిలిపించి నా పక్కన ఒక ఫొటో తప్పనిసరి. -
యువ కథ: ది ప్రపోజల్
డియర్ రియా! ఆఫ్టర్ మచ్ థాట్ ఐ హావ్ కమ్ టు ద కంక్లూజన్ దట్ ఐ కెన్ నాట్ సస్టెయిన్ దిస్ ఫీలింగ్ వెరీ లాంగ్. ఐ జస్ట్ వాంట్ టు బి యువర్ పార్టనర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. ఇప్పటికే రెండు రోజులయింది ఇన్స్టాలో మేసేజ్ చేసి. కనీసం రిప్లయి కూడా లేదు తన నుండి. ఒక చిన్న మేసేజ్కే ‘యస్’ చెపుతుందని కాదు. కానీ ఒక చిన్న ‘నో’కి కూడా నోచుకోలేకపోయాననే బాధ. ఎలా ప్రపోజ్ చేయాలో కూడా తెలియలేదు కానీ చేసేశాను. ఎలాగైతేనేం తనకి విషయం అర్థం అయితే చాలు. అసలు ఈ మెసేజెస్, కాల్స్లో ప్రపోజ్ చేయడం ఏంటి? డైరెక్ట్గా చెప్పేస్తే ఏదోఒక సమాధానం వచ్చేది కదా! ఆ ధైర్యమే ఉంటే ఇన్నిరోజులు ఎందుకు ఆలోచిస్తా. ఎప్పుడో చెప్పేసే వాడిని కదా! నన్ను నేను తిట్టుకుంటూ తనని ఆఫీస్లో ఎలా ఫేస్ చేయాలో అని భయపడుతూ ఆఫీస్ బాట పట్టాను. బెంగళూరులోని మా ఆఫీస్లో రియా నా కొలీగ్. కన్నడ కంటెంట్ రైటర్. నేను తెలుగులో పని చేస్తున్నాను. తనది బళ్ళారి కావడం వలన తెలుగు బాగా మాట్లాడుతుంది. నాకు తనతో పరిచయం తక్కువే. ఆఫీస్లో తను మాట్లాడని, తనతో మాట్లాడనివారు ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప. నేను మాట్లాడకపోవడానికి కారణం లేకపోలేదు. తనతో మాట్లాడే ప్రతి ఒక్కరినీ బ్రో అని సంబోధిస్తుంది. తన నుండి ఆ పిలుపుకి నోచుకోకపోవడమే ఉత్తమమని ఆల్మోస్ట్ దూరంగానే ఉంటాను. ఎంత దూరంగా అంటే నా ఎదురు క్యాబిన్ తనదే అయ్యి ప్రతీ అయిదు నిమిషాలకొకసారి గత్యంతరం లేక ఒకరి ముఖం ఒకరు చూసుకునేంత. అయినా సరే నేను మాట్లాడకపోగా తనకి మాట్లాడే అవకాశం ఇచ్చిన పాపాన పోలేదు. గడుస్తుంది కాలం తనని చూస్తూ, తన పలుకులను వింటూ, తన ఊహలతో జీవనం గడుపుతూ. ఆ గ్రిల్డ్ చికెన్ తింటూ నేను వేసిన ‘స్నాప్’ చూసి మరుసటి రోజు రెస్టరెంట్ చిరునామా వాకబు చేసింది. నేను లోకేషన్తో పాటు టేస్ట్ కూడా షేర్ చేశాను. నోట్లో లాలాజలపాతాలు పొంగాయో ఏమో కానీ ఉన్నపాటున లేచి ‘వెళదాం పదా’ అంటూ నిలబడింది. నన్ను మించిన భోజన ప్రియురాలు కాబోలు అనుకుంటూ వెళదాం అన్నట్టుగా లేచాను. ఈ తంతంతా తెలుగు రాకపోయినా వింటున్న రాజ్దీప్కి ఎంత అర్థం అయ్యిందో గాని ‘నేనూ వస్తా’ అంటూ కదిలాడు. అలా ముగ్గురం నడుచుకుంటూ రెస్టరెంట్కి వెళ్ళి ఆర్డర్కి ముందు ముచ్చట్లు తిన్నాం. ఆ తర్వాత తనని పీజీ దగ్గర డ్రాప్ చేయడానికి నేను, రాజ్దీప్ తీసుకెళుతూ ఉంటే తను మరిన్ని ముచ్చట్లు తినిపించింది. ఎంత బాగా మాట్లాడుతుందో.. ఒక్కోపదాన్ని పేర్చినట్టు, ఆ పదాలు తన నోటి నుండి రావడానికి పోటీ పడుతున్నట్టు.. భాషే కాదు, వ్యక్తీకరణ కూడా సరళంగానే ఉంది. మాటల మధ్యలో రాజ్దీప్ ‘అర్జున్ కుక్స్ వెల్’ అని చెప్తే ‘నిజమా విచ్ ఐటెమ్స్ డు యు కుక్ వెల్’ అని అడిగింది. ‘అదీ ఇదీ అని ఏం లేదు అన్నీ చేస్తా’నని బదులిచ్చాను. ‘నీ వైఫ్ చాలా లక్కీ’ అంది. ‘నాకింకా పెళ్లి కాలేదు’ అన్నాను. ‘సారీ, ఫ్యూచర్’ అని జోడించింది. ఆ లక్ నీకు ఇస్తున్నానని మనసులో అనుకోబోయి బయటకు అనేశాను ఏమరపాటుగా. నడుస్తున్నది కాస్త ఆగి ఒక్క క్షణం నా వైపు చూసి ‘ముఖద్ మేలే హొడిత్తిని నన్మగ్నే’ అంది కన్నడాలో. నాకు అర్థం కాకపోలేదు. తను ఆ మాట అంటున్నప్పుడు తన ముఖంలో ముసిముసిగా తొణుకుతున్న నవ్వుని గమనించాను. మా మధ్య పెద్దగా మాట పరిచయం లేకపోయినప్పటికీ ఉన్న ముఖ పరిచయంతోనే ఏదో తెలియని బంధం ఏర్పడిందేమోనన్న భావన నాలో ఎప్పుడూ కలుగుతూనే ఉంటుంది. ఆ భావనే లేకపోతే ఈరోజు ఈ క్షణం తనతో ఇంత స్వేచ్ఛగా మాట్లాడేవాడినే కాదేమో! తనతో వేసిన ఆ కొన్ని అడుగులలో నాకు అవసరమైన ఏడు అడుగులను తన అడుగుల్లోనే జాగ్రత్తగా వేస్తూ తన పీజీ దగ్గరకు చేరాము. తనకి ఒక బై చెప్పి, సీ యూ టుమారో అంటూ నేనూ, రాజ్దీప్ మా ఫ్లాట్కి మేము బయలుదేరాము. ఫ్లాట్కి వచ్చి స్నానం చేసి బెడ్ మీద వాలగానే గుండెల్లో ఏదో అలజడి. ఆమెతో గడిపిన ఆ కొన్ని క్షణాలు నా మదిని పదేపదే ఢీకొడుతున్నాయి. మా పరిచయం కాస్త స్నేహంగా మారుతుందేమోననే ఆలోచన నన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అలా జరిగితే ఆమెకున్న స్నేహితుల్లో నేను ఒకడిగా మిగిలిపోవడం ఖాయం. ఒక స్నేహితుడిగా ప్రేమను తెలియజేయడం కన్నా ప్రేమికుడిగా ప్రేమను వ్యక్తపరచడం మేలనిపించింది. ఎన్ని కోణాల్లో ఆలోచించినా ఆ క్షణాన నా మస్తిష్కానికి అంతకన్నా ఉన్నతమైన ఆలోచన తట్టలేదు. ఏదో తట్టినట్టుగా తటాలున టెర్రస్ పైకి వెళ్ళాను. అప్పటికే టైమ్ అర్ధరాత్రి. ఒకటీ యాభై అవుతోంది. కొద్దిసేపు భూగోళాన్ని విడిచి ఆకాశానికేసి చూస్తూ నక్షత్రాల సోయగాల్ని ఆస్వాదిస్తుంటే ఏదో కొత్త ప్రపంచంలోకి టైమ్ ట్రావెలింగ్ చేసినట్లు అనిపించింది. దాదాపు రెండు దశబ్దాల కాలం ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. ఆరవ తరగతిలో అనుకుంటా ఊరికి దూరంగా హాస్టల్లో చేర్పించారు. అప్పుడు మొదలైన జీవనపోరాటం ఇప్పుడు ఈరోజు ఈ మహానగరంలో జాబ్ చేస్తూ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి, ట్రాఫిక్ ని జయించి ఫ్లాట్కి వచ్చేసరికి రాత్రి అవుతుంది. అప్పుడప్పుడూ టెర్రస్ మీదకు వచ్చినా.. ఫోన్లో రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ తిరగడం మినహాయించి అంత నిశితంగా ఆకాశానికేసి చూసింది లేదు. ఇప్పుడు ఇలా పరికించి చూస్తుంటే చిన్నప్పుడు ఆరుబయట మంచం మీద పడుకుని ఒక్కో నక్షత్రాన్ని జాగ్రత్తగా లెక్కపెట్టిన క్షణాలు గుర్తొచ్చాయి. అదేంటో ఎన్ని అంకెలు జత చేసినా లెక్క తేలేదికాదు. అలసిపోయి ఆదమరిచి నిద్రపోవడం తప్ప ఏనాడూ లెక్క పూర్తి చేసింది లేదు. చుక్క రాలిపడుతున్నప్పుడు మనసులో కోరుకున్నది నిజమైపోతుందని నాయనమ్మ చెప్పిన కథలు మనసులోనే నాటుకుపోయాయి. రియా పట్ల నా ప్రేమ సత్యమైతే, తన ప్రేమను పొందగలను అనేది నా నమ్మకం. ఆ వేళ ఆకాశంలో చుక్కలేవీ రాలి పడటం లేదు. నిలిచి ఉన్న చుక్కలే నా ప్రేమను నిలబడతాయని అనుకున్నాను. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమీ తెలియకపోయినా పెట్టని ఆ సుముహూర్తాన రెండోపొద్దు జామున రెండుగంటల ముప్ఫై ఆరు నిమిషాలకు మేసేజ్ చేశాను. ఏంటో ఈ భావన! భయమో, ఆత్రమో తెలియడం లేదు. రెండుగటలయింది ఆఫీస్కి వచ్చి. కానీ తనవైపు తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కారే చెమటని ఏసీ కూడా నియంత్రించలేకపోతోంది. ఇదంతా గమనించింది కాబోలు వచ్చి పక్కన కూర్చుంది. గుండె వేగం కాంతితో పాటు పయనిస్తున్నట్లు ఉంది. ఏమీ మాట్లాడకపోయినా నా వైపే చూస్తుందన్న విషయం నాకు అర్థమవుతోంది. మెల్లిగా తన అరచేతిని నా చేతిమీద పెట్టింది. ఎన్ని హిమపాతాలను తోడు తెచ్చుకుందో కానీ ఆ స్పర్శ నా శరీరాన్నే కాదు నా హృదయాన్ని కూడా చల్లబరిచింది. మెల్లిగా తనవైపు తిరిగాను. ‘డు యు థింక్ ఇట్ వాజ్ ఎ ప్రపోజల్?’ అన్నది సున్నితంగా. నాకు నోట మాట రాలేదు. బలవంతంగా గొంతు పెకల్చి ‘ఐ యామ్ సారీ ఫర్ దట్’ అని చెప్పాను. ‘ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు’ అదే సున్నితమైన స్వరంతో. నేను మౌనం దాల్చాను. ‘చూడూ.. ఈ ఫీలింగ్స్, ప్రేమ, వ్యక్తీకరణ ఇవన్నీ జీవితంలో ఒక భాగం మాత్రమేనని నేను నమ్ముతాను. వాటి కొరకే జీవించాలి, ఆ భావాలే జీవితాన్ని నడిపిస్తాయి అంటే నమ్మను. నీ ప్రేమను గౌరవిస్తాను. నా మీద నీకున్న ప్రేమకి నా మనసు అంగీకారం తెలిపితే నిన్ను నమ్మి ఎంత దూరమైనా వస్తాను. కానీ ఆ ప్రయాణంలో నా వ్యక్తిత్వాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం ఇష్టపడను. నిన్న పుట్టి ఈరోజు మరణించే ప్రేమలను నేను నమ్మను. నీకు ప్రేమ పుట్టినంత సులభంగా నాకూ పుట్టాలనుకోకు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించలేను. నేను ప్రేమను ప్లాన్ చేయలేను దానంతట అది జరిగిపోవాలి. ముందు మనిద్దరికిద్దరం అర్థమవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోకుండా అర్థంలేని భావోద్వేగాలతో అనుక్షణం నేను చస్తూ నిన్ను చంపుతూ బతకడం నాకిష్టం లేదు. మనమింకా అర్థం చేసుకునేంత దూరం ప్రయాణించలేదు. ఓపికతో ఉండు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతుంది!’‘నాది ప్రశ్న కాదు ప్రేమ’ అనాలోచితంగా అనేశాను. ‘నాకు ప్రేమ అనేదే పెద్ద ప్రశ్న! దానికి సమాధానం అన్వేషించడానికి నేనిప్పుడు సిద్ధమవ్వాలేమో!’ అంటూ కుర్చీలో నుంచి లేచి తన క్యాబిన్ వైపు అడుగులు వేసింది. ఈ అర్థం చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక మనిషిని ఇంకో మనిషి సంపూర్ణంగా అర్థం చేసుకోగలరా? ఒకవేళ ప్రయత్నించినా దానికేమన్నా గడువు ఉంటుందా. ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, భావజాలాలు.. ఇవన్నీ నిరంతరం మారేవే కదా. వీటన్నిటి సమాహారమే కదా మనిషి అంటే. కాలానుగుణ మార్పుల వల్ల కోతకు గురవ్వని మనిషి ఎవరైనా ఉంటారా! మనం మన గతాన్ని తవ్వి చూసుకున్న ప్రతిసారీ మనకు మనమే ఒక నూతన వ్యక్తిగా పరిచయమవుతాం. అలాంటిది ఈ రోజు ఉన్న నన్ను తన భవిష్యత్ మొత్తానికి ఆపాదించుకుని చూసుకోవడం, దానినే అర్థం చేసుకున్నానని భ్రమపడటం హాస్యాస్పదం కాదా? మనిషి మస్తిష్కంలో పొరలు పొరలుగా దాగున్న స్వభావాన్ని, అవే లక్షణాలు కలిగిన మరొకరు తెలుసుకోగలరా. ఒకవేళ ప్రయత్నించినా అది అంత సులభమా. ఇవన్నీ తనతో మాట్లాడలేను. తన కోసం ‘ఎన్సెఫలాటోస్ వూడి’ అనే చెట్టులాగా ఎదురుచూడటం తప్ప నాకు మరొక ప్రత్యామ్నాయం లేదు. మేము జంటగా కోల్పోతున్న ఈ క్షణం గురించి బాధ తప్ప మరో ఆలోచన లేదు. ‘రియా నాకు దక్కాలి’ అని కోరుకున్నాను. ‘మనో వాంఛ ఫల సిద్ధిరస్తు’ అని నన్ను నేను దీవించుకున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని ముహూర్తాల గురించి, గ్రహాల అనుకూలతల గురించి ఏమి తెలియకపోయినా.. -
యువ కథ.. లాయర్ నోటీస్
పేషంట్లు, నర్సులు, డాక్టర్లతో గైనిక్ వార్డంతా హడావిడిగా ఉంది. ఒక్కొక్కరి మొహంలో ఒక్కో భావం. కూతురి వైపు చూశాడు లాయర్ బ్రహ్మారెడ్డి. తల గోడకు ఆన్చి, నిద్ర పోతున్నట్టుగా ఉంది. ఆమెకిప్పుడు ఆరో నెల. తాత కాబోతున్న సంతోషం తొలి రెండు నెలలు మాత్రమే. మాటా మాటా పెరిగి, అల్లుడు చెయ్యి చేసుకున్నాడంట. నేరుగా ఇంటికి వచ్చింది కూతురు. కొత్త సంసారంలో చిన్న చిన్న మనస్పర్థలు మామూలే అనుకున్నాడు. రోజులు గడుస్తున్నకొద్దీ అర్థమైంది సర్దుకునేంత చిన్నది కాదని.చూస్తుండగానే మూడు దాటి, నాలుగో నెల వచ్చింది. వీళ్లు చూస్తే పంతంబట్టినట్టు ఎవరి లోకంలో వాళ్లున్నారు. రేపేదైనా తేడా జరిగితే పుట్టబోయే బిడ్డ ప్రధాన సమస్య అవుతుందని ఎన్నో కేసులు వాదించిన అనుభవం మెదడు తడుతోంది.బిడ్డ పుడితే కలవకపోతారా అనే దింపుడు కల్లం ఆశ కూడా లేకపోలేదు. తీరా బిడ్డ పుట్టేక వాళ్లు రాకుంటే? కూతురు ఇంకో పెళ్లి వద్దంటే? కూతురు ఒప్పుకున్నా బిడ్డ తల్లిని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారా? చేసుకున్నా కూడా కూతురు జీవితం సంతోషంగా ఉంటుందా? ఇవన్నీ లేకుండా కడుపులో బిడ్డకు ఏదో ఒక అవయవ లోపముంది అని డాక్టరే అబార్షన్ సూచిస్తే మేలనిపిస్తోంది. వాళ్లు చెప్పకుండా మనమే ఆ మాట అడిగితే బాగుండదేమో.పొంతనలేని ఆలోచనలు ఎటెటో తరుముతున్నాయి. చుట్టూ చూశాడు. ఎంతకూ తరగడం లేదు జనాలు. తమ పేరు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. న్యూస్, వీడియోలు, కోర్టు కేసులు దేని మీదా ధ్యాస కుదరక బయటికి నడిచాడు. లోపల స్థలం సరిపోనోళ్లంతా మెట్ల మీద, గేటు దగ్గర ఎక్కడపడితే అక్కడ కూర్చున్నారు.ఇంతలో గలగలా మాట్లాడుతూ బయటికొచ్చింది ఒక గుంపు. నడి వయస్కురాలి చేతిలో బెడ్, మధ్యలో చిన్న ఆకారం. పాపో బాబో గానీ అందరి మొహాల్లోనూ మురిపెం తెలుస్తోంది. చూస్తేనే చెప్పొచ్చు అబ్బాయి తరపు వాళ్లని. ఇలాంటివి చూసినప్పుడే అల్లుడి నుంచి గానీ, వాళ్ల తల్లిదండ్రుల నుంచి గానీ కనీసం ఇందులో పది శాతం కూడా అమ్మాయి మీద ఆపేక్ష లేదే అని బాధపడిపోతాడు బ్రహ్మారెడ్డి. వీటన్నింటి మధ్యన మరింత కుంగదీసేది కూతురి మౌనం. జీవితమంతా అయిపోయిన దానిలా ఎప్పుడూ దిగాలేసుకుని ఉంటుంది. ఇప్పుడు దిగులుపడితే మాత్రం చెయ్యగలిగేదేముందీ..!ఏదో పెళ్లిలో అమ్మాయిని చూశారంట. బాగా నచ్చింది, రూపాయి కట్నం వద్దు అని తెలిసిన మనిషిని పంపించారు. ఒక జిల్లా డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తి కోరి కోడలిగా చేసుకుంటాం అని ఇంటికొస్తే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అబ్బాయి ఏ ఉద్యోగం చెయ్యకున్నా తండ్రి సంపాదించిన ఆస్తి దండిగా ఉంది. కూతురు భవిష్యత్తే కాదు, కలెక్టర్ వియ్యంకుడిగా సమాజంలో తనకెంత గౌరవం, పరపతి! అందుకే ఒప్పుకున్నాను. ఇప్పుడు చూస్తే ఇలా..! కూతురి పేరు అనౌన్స్మెంట్లో రావడంతో ఆలోచనలు ఆపి, లోపలికి నడిచాడు. ‘బేబీ గ్రోత్ బాగుంది. మదర్ కొంచెం వీక్గా ఉంది. హెల్దీ డైట్ మెయింటెయిన్ చెయ్యండి’ అంటూ జాగ్రత్తలు చెప్పింది డాక్టర్.రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. అల్లుడు రాలేదు.‘డెలివరీ అయ్యాకైనా వస్తాడా రాడా?’ అంటూ బెదిరిపోతున్నాడు బ్రహ్మారెడ్డి. అమ్మాయికి నార్మల్ డెలివరీ కుదరక, సీరియస్ అయ్యి, సిజేరియన్ చేసినారని తెలిసినా కూడా రాలేదు. అల్లుడే కాదు, వాళ్ల తరపునుంచి ఒక్కరూ రాలేదు. తెలిసిన వాళ్ల చేత మాట్లాడించాడు. పెద్దవాళ్లు అదీ ఇదని ఏదో చెప్పబోయారంట గానీ ‘నాకే పుట్టిందని గ్యారెంటీ ఏముందీ’ అన్నట్టు అన్నాడంట అబ్బాయి. ఇదే మాట ఎదురుగా అని ఉండుంటే తల పగలగొట్టాలి అనేంత కోపం వచ్చింది. కూతురితో చెప్పలేదు. భార్యతో అంటే ‘వానికి లేని చెడ్డలవాట్లు లేవంట. ఆ విషయం వాళ్లమ్మా నాయనకు ముందే తెలిసినా పెళ్లి చేస్తే అయినా దారికొస్తాడని చేశారంట. కొత్తవాళ్లతో సంబంధం మంచిది గాదని చెప్తున్నా వినకుండా పెద్ద వాళ్ల సంబంధం అని దాని గొంతు కోశావు’ అన్నాళ్లూ లోపల దాచుకున్న ఆక్రోశమంతా బయటికి వెళ్లగక్కింది.ఏదో ఫంక్షన్లో స్నేహితుడు కలిస్తే జరిగిందంతా చెప్పాడు.‘ఇలాంటి కేసులు నీ సర్వీసులో ఎన్ని చూసుంటావు! అయినా ఈ కాలంలో ఎవర్రా విడాకులకు భయపడేది?’ అన్నాడు.నిజమే. లాయర్ బ్రహ్మారెడ్డి అమ్మాయి తరపున వకాల్తా పుచ్చుకున్నాడంటే అబ్బాయి వాళ్లు, అబ్బాయి తరపునైతే అమ్మాయి వాళ్లు తలలు పట్టుకుంటారు. కానీ ఇది స్వంత కూతురి విషయం. మధ్యవర్తిత్వం ద్వారా కొంత ప్రయత్నం చేశాడు. కుదరలేదు.‘అందరికీ విడాకులు ఇప్పించి ఇప్పించి వాళ్ల ఉసురు కొట్టుకుని కూతురి జీవితం ఇలా చేసుకున్నాడని తలా ఒక మాట అంటారని ఇన్నాళ్లూ రాజీ కోసం చూశాను. అది నా అసమర్థత అనుకుంటున్నారు’ అనుకుంటూ ఆఫీసుకెళ్లి గృహహింస కేసు, వారం తర్వాత మెయింటెనె¯Œ ్స కేసు ఫైల్ చేశాడు. ఈ రెండింట్లో వీలైనంత వరకూ విసిగించి, వాళ్లే విడాకులకు అప్లై చేసేలా చేస్తే భరణం అడగొచ్చు అనుకుంటే ఎన్నాళ్లు చూసినా కేసు హియరింగ్కి రాలేదు. పంపించిన నోటీసులు వెనక్కి వచ్చాయి. ఏమైందని కనుక్కుంటే ఇచ్చిన అడ్రస్లో వాళ్లు లేరన్నారంట. క్లైంట్ల కోసం తను వాడే పోస్ట్ మ్యాన్ మేనేజ్మెంట్ టెక్నిక్ను తిరిగి తన మీదకే ప్రయోగిస్తున్నారని అర్థమైంది లాయర్ బ్రహ్మారెడ్డికి.మరో నెల చూసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. అయితే అనుకున్నట్టుగా సాగడంలేదు. చిన్న చిన్న విషయాలకు కూడా వాయిదాలు అడుగుతున్న అవతలి లాయర్ను చొక్కా పట్టుకుని కొట్టాలన్నంత కసి. లాయర్ అంటే పోనీ చంటి బిడ్డను తీసుకుని కోర్టుకు వచ్చే నా కూతురి గురించి ఒకసారి ఆలోచిస్తే అర్థం కాదా ఆ జడ్జికి..! ఆమె కూడా మహిళే కదా. తీర్పు దగ్గరకొస్తోంది అనంగా పై కోర్టుకు అప్లై చేశారు. అక్కడా అదే సాగతీత. చేసేదేం లేదు చట్టంలో వెసులుబాటు అలాంటిది. ఇన్నాళ్లూ క్లైంట్ తరపున ఇవన్నీ చూస్తుంటే తనేదో విజయం సాధిస్తున్నట్టుగా అనిపించేది గానీ ఇప్పుడు తనే ఒక పిటిషనర్గా అవి అనుభవిస్తుంటే ఆక్రోశంగా ఉంది. ప్రతి చిన్న విషయానికి కోపం, చిరాకు. కానీ ఎవరి మీద చూపించాలో తెలియట్లేదు. కేసును అంత సులభంగా వదలనని బ్రహ్మారెడ్డికీ తెలుసు గానీ, వాళ్లకున్న పలుకుబడి, డబ్బుతో తీర్పును ఎక్కడ అనుకూలంగా మార్చుకుంటారోనని చిన్న సంశయం.అదే జరిగితే శ్రమ, సంపాదన, జీవితం గురించి కనీసం ఆలోచన కూడా చెయ్యని కూతురి భవిష్యత్ ఏంటో అర్థం కాలేదు అతనికి. ఆరోజు కోర్టు కేసులు ఏమీ లేకపోవడంతో టీవీ పెట్టుకుని, సోఫాలో పడుకున్నాడు.‘పాప బర్త్డేకి లంగా జాకెట్ కుట్టించమని చెప్పొస్తాం. చూస్తూ ఉండు నాన్నా’ అంటూ కూతురు, భార్య బయటికి వెళ్లారు.మనమరాలి వైపు చూశాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ నేల మీదనే నిద్రపోయినట్టుంది. ‘కేసు గెలుస్తామో, ఓడిపోతామో? భరణం వస్తుందో, రాదో? విడాకులైతే తీసుకోవాలి. తీసుకుంటుంది సరే, కానీ కూతురి భవిష్యత్..! పాపను వదిలెయ్యి అంటే కూతురు ఒప్పుకుంటుందా? ఎక్కడెక్కడి ఆలోచనలన్నీ పాప దగ్గరే ఆగుతున్నాయి. అసలు ఆ పాపే పుట్టకుండా ఉండుంటే ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు కదా! ఆరోజే అబార్షన్ చేయించాల్సింది.. తప్పు చేశాను’ అనుకుంటూ నిద్రకు, మెలకువకు కాని స్థితిలో కళ్లు మూసుకున్నాడు.మెలకువ వచ్చి చూసేసరికి పాప అక్కడ లేదు. వరండాలో పారిజాతం చెట్టుకింద రాలిపడిన పూలతో ఆడుకుంటోంది. పక్కనే వాటర్ సంప్ ఉంది. కొంచెం కదిలినా అందులో పడిపోతుంది.పక్కకు తీసుకొద్దామా, వద్దా..! చుట్టూ చూశాడు. తనను ఎవరూ గమనించలేదు అని అర్థమైంది. ఇదే అవకాశం. డోరు చాటుకు నక్కి, కిటికీలో నుంచి తొంగి చూస్తున్నాడు. అయిదు నిమిషాలు గడిచాయి. పాప కదలకుండా కింద పడిన పూలన్నీ ఏరి కుప్పగా పోస్తోంది.‘పాప పడిందా, రెండే రెండు నిమిషాలు చాలు. గమనించకుండా నిద్రపోయినందుకు కూతురు నన్ను తిట్టుకుంటుంది, వారం పది రోజులు మహా అయితే ఓ నెల రోజులు బాధపడుతుంది. పడనీ తర్వాత మెల్లిగా మరిచిపోతుంది. నిదానంగా పెళ్లి చెయ్యొచ్చు. ఒకవేళ పాప నీళ్లల్లో పడిన శబ్దం పక్కింటోళ్లో, దారిలో పొయ్యే వాళ్లో ఎవరైనా గమనించారా మన దరిద్రం’ రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి ఒక్కసారిగా.గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒళ్లంతా చెమటలు. పది నిమిషాలకు కదిలింది. చెయ్యి తీసి మరో చెయ్యి మారిస్తే చాలు పడబోతుంది అనంగా గేటు తీసిన శబ్దం. గట్టిగా కేకేసి పరిగెత్తుకుంటూ వచ్చి పాపను ఎత్తుకుంది కూతురు. మొహానికి పట్టిన చెమట తుడుచుకుని, ఏం తెలియనట్టు వెళ్లి సోఫాలో పడుకున్నాడు.‘ఒక్క అడుగు ఆలస్యమైనింటే..!’ కేకలేస్తూ ఇంట్లోకి వచ్చింది భార్య. ఆ అరుపులకు మెలకువొచ్చినట్టు లేచి ‘ఏమైందీ’ అడిగాడు అమాయకంగా.మనమరాలి ప్రాణాపాయం నుంచి మొదలు కోర్టు కేసు, విడాకులు, అత్తగారింట్లో కూతురి కష్టాలు, పెళ్లి మొదలు మొగుడి చేతగానితనం వరకూ అన్నీ చదువుతూనే ఉంది సాయంత్రం వరకూ. ఎలా తప్పించుకోవాలి అనుకుంటుండగా ‘స్టేషన్కి కొత్త ఎస్సై వచ్చిందంట. వెళ్లి ఫార్మాలిటీగా కలిసొద్దాంరా’ అని లాయర్ ఫోన్ చెయ్యడంతో వెళ్లాడు.యంగ్ ఆఫీసర్. ట్రైనింగ్ తర్వాత తొలి పోస్టింగ్. అందరూ పరిచయం చేసుకున్నారు. అవీ ఇవీ మాట్లాడి, కదలబోతుండగా నేమ్ ప్లేట్ చూశాడు. ఈ పేరు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ మొహం చూశాడు. గుర్తుకొచ్చింది. నాలుగేళ్ల కిందట తాను వాదనలు వినిపించిన విడాకుల కేసులో ఆ అమ్మాయి రెస్పాండెంట్.లాయర్ బ్రహ్మారెడ్డి మనసులోని భావం గ్రహించినట్టు నవ్విందామె. ఇంటికొచ్చాడు. తిని పడుకున్నా కూడా అదే నవ్వు వెంటాడుతోంది. నిద్రపట్టలేదు. ఆ అమ్మాయి కేసు కళ్ల ముందు మెదిలింది. తిరిగి చూస్తే ఇప్పుడు తన కూతురిదీ అదే పరిస్థితి. మనసులో ఎంత సంఘర్షణ అనుభవించేదో గానీ బయటికి మాత్రం నిండు కుండలా ఉండేది. అంత బాధనూ దిగమింగుకుని, పడిలేచిన కెరటంలా ఇప్పుడు ఎస్సైగా రావడం చూసి తల తీసేసినట్టుగా ఉంది. ఏదో అపరాధభావం.నెల రోజులు గడిచాయి. ఒకట్రెండు సార్లు కలిసే అవకాశం వచ్చినా కూడా ఎదురుపడే ధైర్యం లేక కలవలేదు. కూతురి కేసు వాయిదా ఉంటే కోర్టుకు వచ్చాడు. ఏదో కేసు అటెండ్ అవ్వడానికి కోర్టుకొచ్చి, టైమ్ ఉండడంతో జీప్లో కూర్చుని ఉంది ఎస్సై.‘నేను నీ కేసు విషయంలో బాగా ఇబ్బంది పెట్టాను. ఆరోజు అలా చెయ్యాల్సింది కాదు’ అంటూ బాధపడ్డాడు. అతని మాటల్లో తేడా తెలుస్తోంది.అంతా విని, ‘ఇన్నాళ్లకు తెలిసిందా లాయర్ బ్రహ్మారెడ్డి గారూ. నేను మగాన్ని ఏమైనా అంటాను, నువ్వు ఆడదానివి పడాలి అన్నట్టు బిహేవ్ చేసేవాడు. నా వల్ల కాలేదు. విడిపోదాం అనుకునేంతలో కడుపులో బిడ్డ. తెలిసో తెలియకో పెళ్లి చేసుకున్న పాపానికి పుట్టబోయే బిడ్డనెందుకు ఒంటరి చెయ్యడం అని సర్దుకుపోదామనుకున్న ప్రతిసారీ వాళ్లమ్మొక మాట, నాన్నొక మాట, అక్కొక మాట. ఎంతకాలం పడాలి? అసలెందుకు పడాలి? విడిపోతాం. ఎవరి బతుకు వారిది. మరి పాప పరిస్థితి? పాప భవిష్యత్ కోసం మెయింటెనె¯Œ ్స, భరణం అడిగితే చట్ట పరంగా ఒకపక్క, నా క్యారెక్టర్ను తక్కువ చేస్తూ మరోపక్క ఎంతలా వేధించారు. నీకూ ఒక కూతురుండి, తనకు ఇలా జరిగినా కూడా ఇలాగే చేస్తావా అని అడుగుదామని ఆరోజు మీ దగ్గరికి రాబోతుంటే అద్దాల చాటున మీరు చూసిన చూపు గుర్తుందా?’ అతని వైపు చూసింది.ఆమె కళ్లల్లోకి చూసే ధైర్యం చాలక పక్కకు చూస్తూ నిలబడ్డాడు.‘ఏదోకరోజు కాళ్ల బేరానికి రాకపోదా అని మీరనుకున్నారు. నేను నాలా బతుకుతున్నా’ జీప్ దిగి, క్యాప్ సర్దుకుంటూ కదిలిపోయింది.ఆమె వెళ్లిన వైపు చూస్తూ నిలబడ్డాడు. ఆమె నోటి నుంచి వచ్చిన ఒక్కొక్కమాట ఒక్కో సూదిలా గుచ్చుతున్నాయి. నిజమే. ఆ అమ్మాయికి సమస్య వస్తే సమస్యను సవాలు చేసి గెలిచింది. మరి నేను..? పాప మరణాన్ని కోరుకున్నాను. తన అల్పత్వానికి వణికిపొయ్యాడు. కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీళ్లు తుడుచుకుని చుట్టూ చూశాడు. ఇంతకుముందు క్లైంట్లు, రెస్పాండెంట్లు కనపడేవాళ్లు. ఇప్పుడు మనుషులు కనిపిస్తున్నారు. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
అద్వైత: బజ్ మంటున్న అలారం శబ్దానికి?
ఎలెక్సా 4 ఎకో డాట్ 6.59 అని చూపిస్తోంది. బజ్ మంటున్న అలారం శబ్దానికి నూరు గొంతుకల్లో నుంచి మెలకువ వచ్చేసింది. తెరుచుకున్న కళ్ళు మళ్ళీ మూసుకున్నాయి. నిద్ర కూడా కొందరికి బాధే, వచ్చి పోయే పీడకలల మధ్య. మూసుకున్న కనురెప్పల తెరల వెనుక కొన్ని దృశ్యాలు మూడు ముక్కలుగా, ముక్క చెక్కలుగా.బూతు భూయిష్టమైన మాటల్ని వినలేని చెవులు, తమను తాము మూసుకోవటం చేతకాక నిస్సహాయంగా నిటారుగా నిల్చున్నాయి. చిట్లిన పెదాలు, రెండు ముక్కల రామములక్కాయ లాగా. మోకాళ్ళు ముడుచుకొని డౌన్ కంఫర్టర్లో దాక్కుంది బుజ్జి కుక్కపిల్ల లాగా. తానెవరో తనకే తెలియని ఓ ఉదయపు అజ్ఞానం. స్నూజ్లోకి వెళ్ళిన అలారం నిద్ర లేవమని మరోసారి బతిమిలాడింది.ఓపికను అరువు తెచ్చుకుంటూ సరస్వతి లేచే ప్రయత్నం చేసింది. మొద్దు బారిన కాళ్ళల్లో కొద్దిపాటి కదలిక. మైనస్ డిగ్రీల చలికి వణికిపోతూ సూర్యుడు కొంచెంగా తొంగి చూస్తున్నట్లు, కిటికీలోంచి లేత కాంతి గదిలోకి వస్తోంది. కాళ్ళకు చెక్క నేల తగలగానే, సాక్సులో నుంచి చలి పెట్టిన ముద్దుకు, కాళ్ళను మళ్ళీ పైకి లాక్కుంది. మోయలేనంత బరువుగా అనిపిస్తున్న శరీరాన్ని, బలవంతాన నిలబెట్టి పల్లవి పడక గదిలోకి వెళ్ళింది సరస్వతి.గాఢ నిద్రలో పల్లవి. పదిహేడేళ్ళ యవ్వనపు కలలన్నీ పెదాల మీద పువ్వులై పూస్తుంటే అబ్బురంగా, ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లు నిలబడిపోయింది. ‘ఇది నా కూతురేనా?’ ‘నా కడుపు చీల్చుకొని పుట్టినదేనా?’.. తన మీద తనకే నమ్మకం లేనట్లు ఇంకొన్ని క్షణాలు అలా ఆలోచనల్లో మునిగిపోయింది. పల్లవి క్లాస్ షెడ్యూల్ గుర్తుకొచ్చింది. కోవిడ్ పుణ్యమా అని క్లాసులు ఆన్లైన్కి మారడంతో, కూతుర్ని ఇంకాసేపు పడుకోనివ్వాలని అనిపించింది. నిద్రపోతున్న కూతుర్ని, గదిగోడల మీద ఫొటోల్ని, డెస్క్ మీదున్న మెమెంటోలను కొత్తగా చూస్తోంది. ఒక్కో ఫొటో జ్ఞాపకంగా వెలుగుతోంది. ఒక్కో మెమెంటో కూతురు సాధించిన విజయాన్ని గుర్తుచేస్తోంది.ఓ ఫొటోలో విక్రమ్కు, తనకు మధ్య పిల్లి పిల్ల లాగా ఒదిగి కూర్చొని నవ్వుతున్న చిన్ననాటి పల్లవిని చూస్తుంటే మరో ఆరు నెలల్లో ఫాల్ సెమిస్టరుకి కాలేజీ చదువు కోసం ఇల్లొదిలి వెళ్తుందని గుర్తురాగానే మనసు భారమైంది. ‘ఎంత మంచిది ఈ కోవిడ్! అందరిని మళ్ళీ ఇంటికి చేర్చింది. ఇంట్లో ఉండేలా, ఇంట్లో వాళ్ళతో ఉండేలా. ఇల్లు, ఇంట్లోని బంధాలు ఎంత ముఖ్యమో వైరస్ కుదుపుతో మళ్ళీ అందరికీ తెలిసి వచ్చింది.’ ఆన్లైన్ క్లాసెస్, వర్క్ ఫ్రమ్ హోమ్తో కూతురితో ఎక్కువ సమయం గడపగలుగుతున్న పాజిటివ్ అంశాన్ని గుర్తు చేసుకుంది సరస్వతి, థెరపిస్ట్ సూచించినట్లు. ‘బీ పాజిటివ్, బీ హోప్ ఫుల్.’ప్రయత్నిస్తోంది సరస్వతి తన శాయశక్తులా. మందులేసుకోవటానికి, మిగతా అందరి.. తల్లిలాగా ఉండేందుకు. రోజూ ఓ యుద్ధం. మందులేసుకోవటం ఓ నరకం. వేసుకోకపోతే మరో నరకం. ఇరవైఏళ్ళుగా మరింత ఎక్కువైన ఈ నరకాన్ని ఇక తట్టుకోలేననిపిస్తోంది సరస్వతికి ఏ రోజుకారోజు. ‘పల్లవే లేకపోతే.. అవును అప్పుడు తన జీవితమే మరోలా!’ఫొటోల్లో మాత్రమే మిగిలి, జీవితంలో నుంచి తప్పుకున్న విక్రమ్ వంక నిర్లిప్తంగా చూసింది సరస్వతి. అతని మీద ఆమెకు కోపం లేదు. ‘వదిలించుకున్న తల్లిదండ్రుల కంటే ఏమంత తప్పు చేశాడు?’ ‘‘కోవిడ్ ఈజ్ హిట్టింగ్ బట్ హైస్కూల్ సీనియర్ పల్లవి ఈజ్ ఏ సర్వైవర్’’ చుట్టూ ఆర్ట్ వర్క్తో తన డెస్క్ ఎదురుగుండా, గోడ మీద పల్లవి పిన్ చేసుకున్న పోస్టరును చూస్తూ నిలబడింది. పల్లవి ఫోన్ అలారం మోగిన శబ్దానికి ఉలికిపడ్డ సరస్వతి గుండె వేగంగా కొట్టుకుంది.కళ్ళు తెరిచిన పల్లవికి ఎదురుగా తల్లి. నిద్ర మత్తులో కూడా తల్లిని గుర్తు పట్టేసింది. అమ్మ లాగా. పల్లవి చేతులు చాపడంతో ఆప్యాయంగా కూతుర్ని హత్తుకొని పక్కన పడుకొని కళ్ళు మూసుకుంది. రెండో అలారం శబ్దానికి తప్పనిసరై ఇద్దరూ కళ్ళు విప్పి సన్నటి చిరునవ్వుతో లేచి కూర్చున్నారు. ‘ఇట్ విల్ బి ఎనదర్ గుడ్ డే’.. ఒకరికొకరు చెప్పుకున్నారు, గట్టి నమ్మకంతో. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం సరస్వతి, ఆన్లైన్ క్లాసుకి పల్లవి ఇద్దరూ సిద్ధమయ్యారు. ఇంట్లో ఆఫీసు పని చేస్తుంటే, ఒక్కోసారి ఇంటి జ్ఞాపకాలు ఆఫీసు రూమును గిరగిరా తిప్పేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు దుఃఖాన్ని మళ్ళీ మళ్ళీ రగిలిస్తాయి ఆరనిమంట లాగా! ఎవరి గదుల్లో, ఎవరి ప్రపంచంలో, ఎవరి బాధల్లో వాళ్ళు. ఎవరి ఒత్తిళ్ళు, చికాకుల్లో వాళ్ళు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమే! కొన్ని కుటుంబానివి, మరి కొన్ని సమాజానివి కూడా. అందరి కథలకు కాలం సాక్ష్యం. కొందరి జీవితాల్ని తన కడుపులో కాలం రహస్యంగా దాచుకుంటుంది, సమయం వచ్చేవరకు!పల్లవి పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ కోసం ఆస్పత్రిలో పేరు రాయించారు. పదమూడో రోజు బాలింత స్నానం చేయించి, పురోహితుడు వచ్చేలోగా పసి గుడ్డును, సరస్వతిని ఇద్దరినీ తయారు చేసేందుకు తల్లి లక్ష్మీదేవమ్మ నానా హడావిడి పడుతోంది. పచ్చి బాలింత వొళ్ళు, ఆ పైన తలంటు స్నానం సరస్వతికి కళ్ళు మూతలు పడిపోతున్నాయి. సరస్వతి పాలు కుడుపుతున్నా పసిదాని ఏడుపు ఆగటం లేదు. విక్రమ్ చేయగలిగిన సహాయం చేస్తూ, ఇండియాలోని తల్లి తండ్రుల కోసం బారసాల లైవ్లో చూపించటానికి ఐపాడ్ సిద్ధం చేశాడు.ముగ్గురు స్నేహితులు కుటుంబసమేతంగా ఆ వేడుక చూడటానికి వచ్చారు. సరస్వతికి ఊపిరాడటం లేదు. చీకి చీకి పాలు తాగుతూ కూడా ఏడుస్తున్న పసిగుడ్డును చూస్తే ఆ నోరు నొక్కేయాలని పిస్తోంది. కార్యక్రమానికి కావాల్సిన సంబారాలన్నీ సిద్ధం చేస్తోంది లక్ష్మీదేవమ్మ. సహాయం చేస్తామని అందరూ కిచెన్లోకి వచ్చేస్తుండటంతో అక్కడంతా గందరగోళంగా వుంది. బారసాలతో పాటు సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నారు. పురోహితుడు చదివే మంత్రాలు, చెప్పే వ్యాఖ్యానాలు ఏవీ సరస్వతి బుర్రలోకి ఎక్కటం లేదు. ఒడిలో ఉన్న పాపను, ఒంటి మీదున్న చీరను గిరాటేసి మంచం మీద వాలిపోవాలని ఉంది.ఏవేవో పలకరింపులు. మాటలు.. ఏమీ అర్థం కావటం లేదు. తనెవరో తనకు తెలియనట్లు ముభావంగా, అభావంగా, నిస్తేజంగా, నిర్లిప్తంగా కూర్చుంది సరస్వతి. అయోమయంగా ఉన్న భార్య వంక చూసి, పాపం అలసిపోయిందనుకున్నాడు విక్రమ్. సరస్వతి చెయ్యి పట్టుకొని కార్యక్రమం నడిపించారు. కార్యక్రమం పూర్తి కాగానే పాపకు పాలివ్వటానికని బెడ్రూమ్లోకి వెళ్ళిన సరస్వతి మళ్ళీ బయటకు రాలేదు. పిల్లదాని ఏడుపు అంతకంతకూ పెద్దగా బయటకు వినిపిస్తుంటే, గదిలోకి వెళ్ళిన విక్రమ్ కళ్ళకు మంచానికి అడ్డంగా పడుకొని నిద్రపోతున్న భార్య కనిపించింది.పిల్లను చేతుల్లోకి తీసుకొని సముదాయిస్తూ, భార్యను లేపాడు. లక్ష్మీదేవమ్మ కూడా వచ్చి కూతుర్ని లేపేందుకు ప్రయత్నించింది. బలవంతాన కళ్ళు తెరిచిన సరస్వతి మొహం ఉగ్రంగా, భయానకంగా. ఎరుపెక్కిన కళ్ళతో సూటిగా వాళ్ళను చూసింది. ఆ చూపుకు విక్రమ్ అప్రయత్నంగానే రెండడుగులు వెనక్కేశాడు, పసిగుడ్డును గుండెకు హత్తుకుంటూ. లక్ష్మీదేవమ్మ కూతురు పక్కన కూర్చొని, ‘సరూ, పాపకు పాలు ఇవ్వాలమ్మా’ నెమ్మదిగా చెపుతూ అల్లుడి చేతుల్లో నుంచి పసిదాన్ని అందుకుంది.సరస్వతి పాపను అందుకోలేదు. విక్రమ్కేమీ అర్థంకాక అత్తమ్మ వంక చూశాడు. ఆమె కళ్ళు దించుకుంది. కూతుర్ని పట్టి కుదుపుతూ, ఆమె జాకెట్టు గుండీలని విప్పే ప్రయత్నం చేసింది. తల్లి చెంప మీద ఛెళ్ళున కొట్టి మళ్ళీ దుప్పటి లాక్కొని పడుకుండిపోయింది సరస్వతి. ఏం జరిగిందో అర్థమై, కానట్లు లక్ష్మీదేవమ్మ పిల్లదానితో సహా ఆ గది నుండి బయటకు వచ్చి, ఫార్ములా కలిపి బాటిల్లో పోసి పిల్లకు పాలు పట్టింది. ఒడిలో పడుకొని ఆత్రంగా పాలు తాగుతున్న పసి గుడ్డుని చూసి లక్ష్మీ దేవమ్మ కళ్ళల్లో నీళ్ళు.కొన్నేళ్ళ పాటు ఎలాంటి ఎపిసోడ్లు లేని కూతురు జీవితం ఇప్పుడెటు మళ్ళుతుందో, ఈ చిన్నదాని జీవితం ఎలా ఉంటుందోనన్న ఆలోచనలు ఆమెలో సుళ్ళు తిరుగుతున్నాయి. అత్తమ్మ మొహంలోని ఆందోళన విక్రమ్కు చెప్పకనే ఏదో చెప్పినట్లనిపించింది. ‘అమ్మాయికి పాలు రావటం లేదు. అంతే. బాలింతలకు కొద్దిసార్లు ఇలాగే వుంటుంది’ అత్తమ్మ మాటలకు తలూపాడు విక్రమ్.ఆ పగటికి సరికొత్త మొహం ఆ రాత్రి. మంచి నిద్రలో తనపైన ఎవరో ఉండటంతో హఠాత్తుగా మెలకువ వచ్చింది విక్రమ్కి. అతని మీద ఆమె. సరస్వతిని చూసి బిత్తరపోతూ లేవబోయాడు. అతడ్ని లేవనివ్వలేదు. పొద్దుట భయపెట్టిన సరూ రాత్రి ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా, అమాయకమైన మొహంతో. ఆమె ఏం చేస్తోందో అతనికి తెలుస్తోంది. ఆమె స్పర్శ కొత్తగా. ఆమె ప్రవర్తన కూడా. అతని శరీరం ఆమెకు స్పందిస్తోంది. కానీ ఏదో తెలియని భయం. పక్కన పాప కోసం చూశాడు. కనిపించలేదు. విక్రమ్ ఆందోళన చూసి క్రిబ్ వంక చూపించింది. గాఢంగా, తీవ్రంగా ఇద్దరూ అల్లుకుపోయారు. విక్రమ్కు ‘ఆ రాత్రి సరస్వతి’ నచ్చింది.ఆ ‘రాత్రి సరస్వతి’కి విక్రమ్ పెట్టుకున్న పేరు సంపెంగ. తనకు తెలిసిన తన భార్య సరూ కంటే, కొత్తరూపు దాల్చిన సంపెంగనే అతనికి బాగా నచ్చింది. ఉదయం భార్యను చూసి ఆందోళన చెందిన విక్రమ్ మనసు కుదుటపడింది. నిశ్చింతగా అనిపించింది. పక్కకు తిరిగి మాట్లాడబోయిన విక్రమ్, అప్పటికే గాఢనిద్రలోకి జారుకున్న తన సంపెంగ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు.విక్రమ్ ఇంట్లోకి రాగానే, హాల్లో కూర్చొని హోమ్వర్క్ చేసుకుంటున్న పల్లవి కనిపించింది. పల్లవి పక్కనే తిని పడేసిన చాక్లెట్ రాపర్స్, సగం తిని వదిలేసిన సీరీయల్ చూడగానే పరిస్థితి అర్థమైంది. ఆరేళ్ళ పిల్లకు తల్లి ప్రేమ, ఆదరణ సంగతి అటుంచి కనీసం సమయానికి తిండి కూడా దొరకటం లేదని బాధ తన్నుకొచ్చింది.‘ఆకలేస్తోందా తల్లీ?’ తలూపింది పల్లవి. ఆకలితో వాడిపోయిన ఆ పసిదాని మొహం, ‘నేనేం పాపం చేశా?’నని నిలదీస్తున్నట్లనిపించింది అతనికి. ఫ్రిజ్లో నుంచి అన్నం, పప్పు, గోంగూర పచ్చడి ప్లేట్లో పెట్టి మైక్రోవేవ్లో వేడి చేసి కూతురికిచ్చాడు. ఆవురావురుమని అన్నం తింటున్న కూతుర్ని చూసి విక్రమ్ కళ్ళమ్మట నీళ్ళు. కోపమొచ్చింది. సరస్వతి మీద, ఆమె తల్లిదండ్రుల మీద, తన జీవితాన్ని నాశనం చేసినందుకు. సరస్వతి కోసం వెతుకుతూ వెళితే, కింద బేస్మెంట్లో ఒంటరిగా కూర్చొని ఉంది ఎటో దిక్కులు చూస్తూ. తన్నుకొచ్చిన కోపాన్ని తమాయించుకున్నాడు. చికాకు, కోపం, అసహనం, తగువులు, కేకలు వీటివల్ల లాభం లేదని పల్లవి పుట్టిన దగ్గర నుంచి అర్థమవుతూనే ఉంది విక్రమ్కు.‘సరూ, పైకి రా. పల్లవికి ఆకలేస్తోంది పాపం’ తెచ్చి పెట్టుకున్న మృదుత్వంతో మాట్లాడుతున్న విక్రమ్ గొంతు ఆమెకు చేరలేదు. కళ్ళెత్తి భర్త వంక చూసింది నువ్వెవరన్నట్లు? తల తిప్పేసుకుంది అతన్ని చూడటం ఇష్టం లేదన్నట్లు. అతనెవరో తెలియదన్నట్లు. నెమ్మదిగా సరస్వతి మీద చెయ్యి వేశాడు. పైకి తీసుకెళ్లటానికి. ఛెళ్ళున చెంప మీద కొట్టి ఏమీ ఎరగనట్లు శూన్యంలోకి చూస్తుండి పోయింది.‘మాత్రలేసుకున్నావా?’ సరస్వతి నుంచి యే సమాధానం రాలేదు. ‘సరూ, పద. పైకెళదాం. టీ చేస్తా’ మృదువుగా మాట్లాడుతూ చెయ్యి పట్టుకొని ఆమెను పైకి తీసుకొచ్చాడు. క్షణం క్రితం అతడిని కొట్టిన ఆమె, మళ్ళీ పసిపిల్లలా అతని వెంట యే గొడవ చేయకుండా వచ్చింది.సరస్వతిని సోఫాలో కూర్చోబెట్టి టీ చేయటానికి వంటింట్లోకెళ్ళాడు విక్రమ్. కిచెన్లో నుంచి హాల్లోని వాళ్ళిద్దరినీ గమనిస్తూనే స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు, టీ పొడి, ఎండిన లెమన్ గ్రాస్, ఏలక్కాయ పొడివేసి తెర్లుతున్న నీళ్ళను చూస్తూ నిలబడ్డాడు. సరస్వతి ద్వంద్వ ప్రవృత్తి, తరచూ మారిపోయే ఉద్వేగాలు, ఒక్కోసారి హింసాత్మకంగా, ఉద్రిక్తంగా మారిపోయే ఆమె ప్రవర్తన, పల్లవి పట్ల నిరాదరణ ఇవన్నీ అతనిలో తెర్లుతున్నాయి. తెల్లటి నీళ్ళు నల్లటి డికాక్షన్, ఏలకుల వాసనతో.పల్లవి అరిచిన అరుపులకు విక్రమ్ ఉలిక్కిపడి చూసి పరుగెత్తాడు హాల్లోకి. డికాక్షన్ పొంగి, బర్నర్ ఆరిపోయింది. నోటుబుక్కుని చింపేస్తున్న తల్లి నుంచి పుస్తకంలాగే ప్రయత్నం చేసి విఫలమై దూరంగా జరిగి ఏడవటం మొదలెట్టింది పల్లవి. పరుగున వచ్చిన విక్రమ్, సరస్వతి నుంచి బలవంతాన పుస్తకాన్ని లాక్కోగలిగాడు. మొండి బలంతో చేతులు బిగించి తనను గుద్దుతుంటే, చేతులు అడ్డం పెట్టుకొని ఆమెని ఆపటానికి ప్రయత్నించాడు. కొంచెం ధైర్యం తెచ్చుకొని తల్లిని లాగే ప్రయత్నం చేసినందుకు, పల్లవిని కూడా కొట్టసాగింది.‘సింకు కింద ఏమైనా వుంటే పట్టుకురా’ సరస్వతిని గట్టిగా అదిమిపట్టుకున్నాడు. పల్లవి తెచ్చిన వైరుతో ఇద్దరూ కలిసి సరస్వతి చేతులు కట్టేశారు. వాళ్ళు ఆమెను ఆపుతున్న కొద్దీ ఆమె మరింత రెచ్చిపోయింది. పళ్ళు గట్టిగా కొరుకుతూ, బూతులు మాట్లాడుతూ, కాళ్ళు చేతులూ విదిలిస్తూ. ‘ఇది అమ్మ కాదు, మాన్స్టర్’ ఆ భూతాన్ని చూడలేనట్లు భయంతో, బాధతో కళ్ళు మూసుకుంది పల్లవి.ఇదంతా అలవాటైనట్లే ఉంటుంది. ప్రతిసారి కొత్తగానూ ఉంటుంది పల్లవికి. ‘అమ్మకు ఎందుకిలా?’మెడిసిన్ కిట్లో నుంచి పల్లవి తెచ్చిచ్చిన మాత్రను సరస్వతి చేత బలవంతాన మింగించి అలసటతో కూలబడ్డాడు విక్రమ్. కొద్ది క్షణాల్లో సరస్వతి నేల మీద ఒరిగి పోయింది మత్తులోకి జారిపోతూ. సరస్వతి చేత అత్యవసర పరిస్థితుల్లో మిగించే ఆ మాత్ర మనిషి కన్నా బలమైనది. ఆలోచనని, ఆగ్రహాన్ని నిర్జీవం చేయగలిగేంత శక్తివంతమైనది. తండ్రి పక్కనుంటే ధైర్యంగానే ఉన్నట్లనిపిస్తున్నా, పల్లవికి గుండె దడ తగ్గలేదు. ఎన్నోసార్లు,‘అమ్మకు బాగైపోతుందని’ ధైర్యం చెప్పిన విక్రమ్, ఇప్పుడిక అది కూడా చేయలేనట్లు నిస్సహాయంగా, నిస్సత్తువుగా తల పట్టుకొని కూర్చుండిపోయాడు ఇంకేమీ చేయలేనట్లు.‘నువ్వు నాతో వచ్చేయి బంగారు’ తండ్రి మాటలకు రాలేనన్నట్లు తలూపింది పదమూడేళ్ళ పల్లవి. ‘అమ్మకున్నది ఈ మానసికరోగం కాకుండా క్యాన్సర్ అయితే ఇలాగే చేసేవాడివా?’ కూతురు సూటిగా ప్రశ్నించేసరికి దెబ్బతిన్నట్లు చూశాడు విక్రమ్.‘పదమూడేళ్ళుగా మీ అమ్మ మూడ్ స్వింగ్స్తో మనం పడ్డ నరకయాతన పగవాడికి కూడా వద్దు తల్లీ. థెరపీ సెషన్స్, మందులు వీటితో ఒక రోజు బాగున్నట్లే ఉన్నా, మీ అమ్మకు పూర్తిగా నయమవుతుందన్న నమ్మకం చచ్చిపోయింది. ఎప్పుడెలా ఉంటుందో, ఎలా ప్రవర్తిస్తుందో, ఏరోజు విపరీతంగా పనిచేస్తుందో, ఏరోజు పక్క మీద నుంచి కూడా లేవదో తెలియదు. ఇన్నేళ్ళు నేచేయగలిగింది చేశా. ఇక నావల్ల కాదు. నాకు నా జీవితం కావాలి. ఈ కొత్త జీవితంలో నువ్వుండాలనుకోవటం కూడా తప్పేనా బంగారు?’ అతని కంఠంలో నిజాయితీతో కూడిన బాధ.‘అమ్మను నువ్వెంతలా చూసుకున్నావో తెలుసు డాడీ. కానీ పాపం అమ్మ! తనకు తెలియదు కదా తానేం చేసేది? మనిద్దరం వదిలెళ్ళిపోవటం క్రూయల్ డాడీ. మనం వదిలేస్తే అమ్మ రోగం ఎక్కువవుతుంది కానీ తగ్గుతుందా? అవసరమైతే రీహేబ్ సెంటర్లో చేర్పిద్దాం. అయినా ఇప్పుడు మందులేసుకుంటోంది కదా. అమ్మకు బాగైపోతుంది’ పల్లవి కంఠం రుద్ధమైంది.వయసుకు మించి ఎదిగిపోయిన కూతుర్ని చూస్తే అతనిలో చెప్పుకోలేని బాధ. ఆ పిల్ల పసితనాన్ని, అమాయకత్వాన్ని, ఆనందాన్ని అన్నింటినీ మింగేసిన సరస్వతి మీద చెప్పలేనంత కోపం. మళ్ళీ అంతలోనే ఆమె మీద సానుభూతి కూడా. కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు విక్రమ్.‘మీ అమ్మకు పెళ్లికి ముందు నుంచీ ఈ సైకోటిక్ మూడ్ డిసార్డర్ ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేయకుండా ఉండాల్సింది..’ ‘తగ్గిపోయిన రోగం డెలివరీ టైమ్లో తిరగబెట్టిందన్నది కదా .. నేను పుట్టకుండా వుంటే అమ్మ బావుండేదేమో!’ ‘ఈ పెళ్లి వల్ల జరిగిన మంచి ఏదైనా ఉంటే అది నువ్వే బంగారు. నీ కోసమైనా ఇక నుంచి అమ్మ మందులు క్రమం తప్పకుండా వేసుకుంటుందేమో?’‘అందుకే డాడీ, నేను అమ్మతోనే ఉంటా. నువ్వుండేది ఊర్లోనే కదా. వారంవారం వస్తాగా నీ దగ్గరకు’ తండ్రి కళ్ళల్లో నీళ్ళు చూసి పల్లవికి కూడా ఏడుపు ఆగలేదు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకొని ఏడ్చేశారు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో సరస్వతి క్రమం తప్పకుండా మందులేసుకోవటం మొదలెట్టింది. తల్లీ కూతుళ్ళు కొత్త జీవితం మొదలెట్టారు. నాలుగేళ్ళు గడిచిపోయాయి చూస్తుండగానే. తల్లి మూడ్ స్వింగ్స్ పరిణామాల్ని ఒక్కర్తే తట్టుకొని నిలబడింది. యేరోజు ఎలావుంటుందో తెలియని అనిశ్చితి నుంచి పారిపోవాలని ఎన్నోసార్లు అనిపించినా, మునిపంటితో భరించింది తండ్రికి చెప్పినట్లు. తల్లికి తల్లిగా మారింది పల్లవి. పల్లవికిప్పుడు పదిహేడేళ్ళు. తల్లికి దూరంగా కాలేజీకి వెళ్లటం గురించి మొదట్లో కొంచెం భయపడినా, ఈ మధ్య కాలంలో ఎలాంటి ఎపిసోడ్లు లేకపోవటంతో, తల్లికి నయమైపోయిందని భ్రమపడింది. మందులేసుకుంటే తనకెలా వుంటుందో కూతురికెప్పుడూ తెలియనివ్వలేదు సరస్వతి. గత కొద్దికాలంగా తల్లి మందులు మానేసిన సంగతి పల్లవి గ్రహించలేకపోయింది. సరస్వతి ప్రవర్తన ఆమెకు అంతా బాగయిపోయినట్లే ఉంది.‘అతను నిన్ను చీట్ చేస్తున్నాడు. అతని మీద పగ తీర్చుకో!’‘అది నీకూతురు కాదు. దానికి పుట్టిన కూతురు.’‘చంపేయి, వాళ్ళంతా దుర్మార్గులు.’‘ఎర్రటి రక్తం తాగు!?’చెవుల్లో వినిపిస్తున్న మాటల్ని వినలేక చెవుల్నే కోసేసుకోవాలని ఉంది సరస్వతికి. మెదడు ఏదేదో చెప్తోంది. మనసు ఏదేదో అంటోంది. తనెవరో, తన పేరేమిటో కూడా తెలియకుండా పోతోంది ఒక్కోసారి ఆమెకు. మందులేసుకుంటే నిద్ర నిద్ర నిద్ర. ఉద్యోగం చేయకపోతే, పల్లవి చదువెలాగా? ఏవేవో ఆలోచనలు సరస్వతిని ఊపిరాడకుండా చేస్తున్నాయి. మందులేసుకోవాలని వుంది పల్లవి కోసం. కానీ ఈ నరకం వద్దు. నేను లేకపోతే పల్లవికి ఎలా? విక్రమ్ నమ్మకద్రోహి. నన్ను వదిలిపెట్టినట్లే, దాన్ని కూడా వదిలేస్తాడు అవకాశం వచ్చినప్పుడు. పల్లవిని రక్షించాలి, కాపాడాలి.తనతో తాను యుద్ధం. ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి గెలుపు. ఎవరెవరో వచ్చి వెళ్లిపోతున్నారు. ఏవేవో చెప్తున్నారు. ఒళ్ళు రగిలిపోతోంది. చావాలనిపిస్తోంది. చంపేయాలనిపిస్తోంది.ఒకే మనిషి.. వేర్వేరు ముఖాలు. అనేక జీవితాలు. అందరూ బద్ధశత్రువుల్లాగా కనిపిస్తున్నారు. శరీరంతో పెనుగులాట. మాటల్లో, ఆలోచనల్లో హింస. ఏవేవో మాటలు. ఎవరెవరివో గొంతుకలు. ఎవరెవరో వచ్చేస్తున్నారు. కళ్ళ ముందు రకరకాల మనుషులు. కళ్ళు మూసుకోవాలంటే భయం. నిద్ర పోవాలంటే భయం. మెలకువగా ఉండాలంటే భయం. రావద్దని వాళ్ళను బతిమిలాడుతోంది. బెదిరిస్తోంది. భయపెడుతోంది. సరస్వతిని వాళ్ళు ఆక్రమించుకున్నారు.వాళ్ళా? నేనా? ఓడిపోకూడదు వాళ్ళ చేతిలో. నే గెలవాలి. గెలిచి తీరాలి. వీళ్ళందరి నుంచి పల్లవిని కాపాడాలి? ఎలా? ఏం చేయాలి? నిరంతరం అదే ఆలోచన సరస్వతిలో. ఎదురుగా నిల్చున్న ఆమెను చూస్తూనే సరస్వతి కళ్ళు కోపాన్ని వర్షించాయి. విక్రమ్ పక్కన ఆమెను చూడగానే కోపం, అసూయ, ద్వేషం. అతనామెను ముద్దుపెట్టుకుంటున్నాడు. సరస్వతి మనసు రగిలిపోతోంది. విక్రమ్ కొత్త పెళ్ళాం భళ్ళున ఆకాశం బద్దలయ్యేలా నవ్వుతోంది.డైరెక్షన్స్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్న సరస్వతి సరిగ్గా ఫైర్ ఆర్మ్స్ షాపు ముందు ఆగింది. ఆమె మొహంలో ప్రశాంతతతో పాటు చిన్నపాటి ఉత్సాహం.తలుపు తీయగానే గంట శబ్దం రావటంతో కౌంటర్ దగ్గరున్న వ్యక్తి తలతిప్పి చూశాడు. కురచగా ఉండటంతో వున్నదాని కంటే లావుగా కనిపిస్తోంది ఆమె. బీఎమ్డబ్ల్యూ కారు. గూచీ బ్యాగ్, ఖరీదైన కూలింగ్ గ్లాసెస్ ఆమె ఆర్థిక స్థోమతను చెప్తుంటే, ఆమె రూపు రేఖలను బట్టి ఏషియన్ అని అతనికి అర్థమైంది. వ్యాపారంలో ఎవరనేది లెక్క కాదు, ఎంతనేది మాత్రమే ముఖ్యం. ఆ ఊర్లో అదో పెద్ద ఫైర్ ఆర్మ్స్ స్టోర్. గోడల మీద పెద్ద పెద్ద పొడవాటి తుపాకులున్నాయి. చిన్నగా, చేతిలో ఇమిడిపోయే పిస్టల్స్ వంటివి అద్దాల కింద దాక్కొని తమ కోసం ఎవరొస్తారోనని ఎదురుచూస్తున్నాయి.‘కెన్ ఐ హెల్ప్ యు?’తనకు కావాల్సిన మోడల్ ధీమాగా చెప్పింది సరస్వతి. ఆ మోడల్ ఉన్న కౌంటర్ దగ్గరకు తీసుకెళ్ళాడు సేల్స్మన్. అదే కౌంటర్ దగ్గర మరో ఇద్దరు మగవాళ్ళు కూడా నిలబడి రకరకాల మోడల్స్ను పరీక్షిస్తున్నారు.సరస్వతి అడిగిన పిస్టల్ని తీసి సేల్స్మన్ చేతిలో పట్టుకొని చూపించి ఆమె చేతికిచ్చాడు. మొదటిసారి పిస్టల్ పట్టుకోగానే ఏదో తెలియని ఉత్తేజం ఆమె అరచేతిలో ఇమిడిపోయినట్లు అనిపించింది. ఓ శక్తిని పట్టుకున్నట్లు. వెయ్యేనుగుల బలం వచ్చినట్లు. రెండు చేతుల్లోకి మార్చి మార్చి చూసింది. సేల్స్మన్కు తెలియలేదు, ఆమెకు అనుభవం ఉందా? లేదా? అనేది.రెండు క్షణాలు ఆమెను ఆ తుపాకీతో ఆడుకొనిచ్చి బుల్లెట్ ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఎలా తీసి జాగ్రత్త చేయాలో అన్నీ చూపించాడు. అర్థమైనట్లు ఆమె తలూపింది. చేతిలోకి మళ్ళీ తుపాకిని తీసుకొని కుడివైపు తిరిగి షూట్ చేస్తున్నట్లు చేసి చూసుకుంది. సేల్స్మన్కి తన మొబైల్ ఇచ్చి ఫొటో తీయమంది. అప్పుడర్థమైంది ఇదామె మొదటి తుపాకీ అని. ‘కంగ్రాట్స్, వెల్కమ్ టు రియల్ వరల్డ్’ అంటూ ఆమె అంగీకారం కోసం చూశాడు. ఆమె తల ఊపడంతో బిల్లింగ్ కౌంటర్ వైపు చూపించాడు.ఆమె దగ్గర డ్రైవర్ లైసెన్స్ తీసుకొని ఒక పుస్తకంలో ఆమె పేరు, అడ్రస్, హేండ్ గన్ వివరాలు రాశాడు. క్రెడిట్ కార్డుతో పే చేశాక ఆమె చేతికి గ్లాక్(ఎ ౌఛిజు) 19 సెమీ ఆటోమేటిక్ పిస్టల్, 9 మిమి బుల్లెట్స్ జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చాడు. ఆడవాళ్ళు ఒంటరిగా వచ్చి తుపాకీలు కొనడం ఆ షాపులోని వాళ్ళకు కొత్త కాదు. కానీ ఓ భారతీయురాలు ఒంటరిగా వచ్చి పిస్టల్ కొనడం అతని షాపులో ఎప్పుడూ జరగకపోవటంతో అతను కొంత వింతగా చూశాడు.ఆమె వెళ్లిపోయాక సేల్స్మన్, షాపు ఓనర్ ఆమె గురించి కొంత మొరటు హాస్యంతో మాట్లాడుకొని ఆ తర్వాత మర్చిపోయారు. కానీ రెండు వారాల తర్వాత ఆమె గురించి, ఆమె కొన్న షాట్ గన్ గురించి పోలీసులొచ్చి అడుగుతూ ఏం జరిగిందో చెప్పినప్పుడు కానీ వాళ్ళకు పూర్తి వివరాలు తెలియలేదు. అక్కడ ఆ ఇంట్లో పల్లవి గది గోడ మీద పోస్టర్ జాలిగా చూస్తోంది, రక్తపు చారికలతో! – కల్పనా రెంటాలఇవి చదవండి: మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి.. -
కేతు విశ్వనాథ రెడ్డి గారి తెలుగు కథలు!
నాకు ఇష్టమైన కథకుల కేతు విశ్వనాథరెడ్డి గారున్నారు. నేను ఇష్టపడిన తెలుగు కథల్లో ఆయన రెక్కలు కథ ఉంది. నాకు దక్కిన అదృష్టాల్లో చిన్నతనాననే చదువుకున్న ఆ కథకు పెద్దయ్యాకా బొమ్మ వేయడం అని రాసి పెట్టబడి ఉంది. రెక్కలు అనే ఆ కథకు నా బొమ్మ ఎంత బాగా కుదిరింది అంటే, అంతకన్నా బాగా ఇంకెవరు ఆ కథను బొమ్మల్లో చెప్పలేరన్నంతగా. కేతు గారికి నాకు వ్యక్తిగత పరిచయం తక్కువే, నన్ను ' నాయనా ' అని సంభోదిస్తూ ఆయన మాటాడేవారు. మహానుభావులకు, గొప్పవారికి, ప్రాంతీయాభిమానం లేదంటారు. నా పూర్వ జన్మ పుణ్యం కొద్ది నేను ఆ కేటగిరివాడిని కాకపోవడం వలన కేతు విశ్వనాథరెడ్డి పలకరించే ఆ ’"నాయనా" అనే పిలుపులో మా రాయలసీమ ఒక మానవ ఆకారం రూపు దాల్చి పలకరిస్తున్నట్టుగా పులకించి పోతాను నేను. పెద్దలు, ఇష్టులు, నాకు దగ్గరువారు శ్రీ మైనంపాటి భాస్కర్ గారు కూడా నన్ను అల్లానే పిలిచేవారు. నాకు ప్రాంతీయాభిమానం పుష్కల బాగా ఉంది. నాకు తెలిసిన కేతు విశ్వనాథరెడ్డి గారి ఇంకా పెద్ద గొప్పతనం ఏమిటంటే ఆయన విశాలాంద్ర వారు ప్రచురించిన కొకు సమగ్ర సాహిత్యానికి సంపాదకీయం వహించడం. తరాలు గడిచినా ఆ పుస్తకాల విలువ ఎన్నటికీ తరగనంత నాణ్యమైన పనిగా చేసి తెలుగు పాఠకుల చేతిలో పెట్టడం. కోకు గారి పుణ్యమో, లేదా నావంటి కొకు అభిమానుల పుణ్యమో తెలీదు కానీ కుటుంబరావు గారి రచనలు ఒక ఎత్తయితే దానికి వందల ఫుట్నోట్స్ చేర్చి ఆ సాహిత్యాన్ని ఇంకాస్త ఎత్తు పెంచారు కేతు గారు. రాను రాను ఇంకా మళ్ళీ మళ్ళీ కొకు రచనా సంపుటాలు వస్తున్నాయి కానీ కొత్తగా వచ్చే వాటి గురించి మాట్లాడుకోవడం శుద్ద దండగ. ఈ కొత్తగా తెచ్చే పుస్తకాల ముద్రణలో సరైన ఎడిటింగ్ లేక , అచ్చుతప్పుల పురుగు పట్టి లోపలి రచనలు ఎట్లాగూ నాశనం అయిపోతున్నాయి. చేయవలసినంత ఆ నాశనపు పని సంపూర్ణం కాగానే పుస్తకాల అట్ట మీద కుటుంబరావు గారి ఫోటో బదులుగా, టెలిఫోన్ సత్యనారాయణ గారి బొమ్మ వేసి కొకు రచనలు అని నమ్మించే, అమ్మించే నాటికి చేరుకొవడానికి తెలుగు సాహిత్యం, దాని ముద్రణ ఎన్నో అడుగుల దూరంలో లేదు. వాటిని సరైన దారిలో పెట్టగలిగిన కేతులు మరియొకరు మనకు లేరు. కేతు గారిని రచనల పరంగా మాత్రమే ఎరిగి ఉన్నప్పట్టికీ ఆయనని ప్రత్యక్షంగా తెలిసి ఉండని కాలానికి ముందే హైద్రాబాదులో ఆర్టిస్ట్ మోహన్ గారు, పతంజలి గారిని ఎరిగి ఉన్నాను నేను. పతంజలి గారి "ఖాకీ వనం" వ్రాసిన కొత్తలో దానిని విశాలాంద్ర నవలల పోటీకి పంపితే ఆ నవలను వెనక్కి పంపించారు. ఆ నవలా పోటీ న్యాయనిర్ణేతల కమిటీ లో కేతు ఉండేవారని , ఆయన ఈ నవలను కాదన్నారని మోహన్ గారికి, పతంజలి గారికి ఆయన మీద కాస్త మంట ఉండేది. మోహన్ గారిలో ఇంకో ఒక ప్రత్యేక గుణం ఉండేది. వ్యక్తిగతంగా మనకంటూ తెలియని ఎవరి మీదయినా సరే మనలోకి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలివిగా ఇంజెక్ట్ చేసేవాడు. తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి అతి గొప్పగా, అయిష్టుల గురించి అతి చెత్తగా స్వీకరించడాన్ని మన బుర్రలోకి చొప్పించేవాడు. ఎవరి సంగతో ఏమో కానీ, నేను మోహన్ గారికి అత్యంత అభిమానిని కాబట్టి ఆయన ఎస్సంటే ఎస్సని, నో అన్నది నో అనే అని నమ్మేవాడిని. ఇప్పుడు కేతు గారు లేరని కాదు కానీ. ఆయన కథలు ఎప్పటి నుండో చదివి ఉండటం వలన మోహన్ గారు చెప్పారు. కదా, పతంజలి గారి నవలని తిప్పి కొట్టారు కదాని ఎందుకో కేతు గారి మీద ప్రత్యేకమైన వారి అభిప్రాయాన్ని స్వీకరించి పుచ్చుకున్నది మాత్రం జరగలేదు, ఎందుకో! బహుశా నాకు గల ప్రాంతీయాభిమానమేమో ! ఆర్టిస్ట్ చంద్ర గారికి కేతు గారు అంటే బాగా అభిమానం. కేతు గారికి కూడా చంద్ర గారు అంటే అదే. ఊరికే అటూ ఇటూ తిరిగి ప్రీలాన్సింగ్ బొమ్మలు వేసుకుంటూ ఉండే చంద్రగార్ని పట్టుకుని తను డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డైరెక్టరుగా ఉన్న కాలంలో అదే విశ్వవిద్యాలయం లో ఆర్టిస్ట్ కమ్ డిజైనర్ గా హోదా ఇచ్చి ఆ ఇష్టం ప్రకటించుకున్నాడు. కేతు గారి ’కూలిన బురుజు" కథ అంటే చంద్ర గారికి ఇష్టం. దానిని సినిమాగా తీయాలనే కోరిక చంద్ర గారికి ఉండేది. విశ్వనాథరెడ్డిగారి పుస్తకాల కవర్లకు చంద్ర గారి కొల్లాజ్ పొకడలు నాకు ఎప్పుడూ సంభ్రమాన్నే కలిగిస్తూ ఉండేవి. విశ్వనాథరెడ్డి గారు తన కాలేజీ ఉద్యోగబాధ్యతల నుండి రిటైర్ అయ్యాకా సి. సి. రెడ్డిగారి "ఈ భూమి" పత్రికకు చీఫ్ ఎడిటర్గా తన సేవలందించారు. పంజాగుట్టలో ఉండేది ఆ ఆఫీసు. నేను అప్పుడప్పుడు అటు వెళ్ళినపుడు శ్రీ కేతు గారిని కలిసేవాడిని. అక్కడే పొనుగోటి కృష్ణారెడ్డి గారిని కూడా చూసేవాడ్ని. ఆయనా ఈ భూమికి వర్క్ చేసేవారు. అయితే నాకు గుర్తుండి కృష్ణారెడ్డి గారితో ఆంద్రజ్యోతి లో నా తొలి పరిచయం. శ్రీ రమణ గారిని కలవడం కొరకు రోజూ ఆ పత్రిక అఫీసు కి వెళ్ళేవాడిని, ఆ పక్కనే శ్రీ కృష్ణారెడ్డి గారు కనపడేవారు. అదే సి. సి. రెడ్డి గారి ఆఫీస్ లో అప్పుడప్పుడూ వంశీ అని ఒక పాత దర్శకుడు గారు కూడా కనపడేవారు. నాకు గుర్తు ఉండి అప్పట్లో "తను నేనూ సావిత్రి" అనే సినిమా తీస్తున్నా, టైటిల్ ఎలా ఉంది అని నన్ను ఒకసారి అడిగారు. అప్పటి సాహితీ సభల్లో తరుచుగా కేతు గారు కనపడినా , ఊరికే భక్తి గా చూసి పలకరింపుగా నవ్వేవాడిని తప్పా అతి వేషాలు వేసి అతి చనువు నటించే పాడులూ పద్దతుల అవసరాలు నాకు ఎప్పుడూ ఉండేవి కావు. అలా అలా అలా చాలా రోజుల తరువాతా కేతు గారు ఇక ఇక్కడ లేరని, కడపకు వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయారని కబురు తెలిసింది. ఆర్టిస్ట్ చంద్ర గారికి 70 ఏళ్ళు వచ్చిన సందర్భానా నేను ’"ఒక చంద్రవంక" అనే పుస్తకం ఒకటి తీసుకు వచ్చా. ఆ సందర్భానా చాలా విరామం అనంతరం కేతు గారికి ఫోన్ చేసి చంద్ర గారిమీద ఒక వ్యాసం వ్రాసి ఇమ్మని ఆడిగా. అదే చివరి సారిగా ఆయనతో మాట్లాడ్డం. అది 2016. ఈ మధ్య కాలంలో అయితే చాగంటి తులసి గారి ముచ్చటైన రచన "ఊహల ఊట" కి కేతు గారు ముందు మాట రాస్తున్నారని ఆవిడ భలే సంతోషంగా చెప్పారు. నాకూనూ సంబరం అనిపించింది. "మంచి కథలు రాయాలనే పోటి మనస్తత్వాన్ని నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరో రకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను" అని చెప్పుకున్న విశ్వనాథరెడ్డి గారికి పొద్దస్తమానం సాహితీ చలామణిలో ఉండాలని అనుకున్న రచయిత గా మా వంటి కథా ప్రేమికులకు ఎప్పుడూ అనిపించలేదు. ఆయన జంటిల్ మేన్, ఆయన మంచి రచయిత, ఆయన మా రాయలసీమ పెద్ద మనిషి, ఆయన చల్లగా నవ్వే పెద్ద మర్రిమాను. ఈ రోజుకీ రేపటికీ కూడా ఆయన కథల అదే మాను మాదిరిగా, ఆ ఆకుల గలగల మాదిరిగా వినపడుతూ, కనపడుతూనే ఉంటాయి. అవి చదివినప్పుడల్లా మన మనసుల మీద ఆయన చల్లగాలిలా వీస్తూనే ఉంటాడు.--అన్వర్ సాక్షి(చదవండి: 'గోల్డెన్ ఏజ్ ఆఫ్ తెలుగు ఇలస్ట్రేషన్' కాలపు మనిషి.. గోపి!) -
Neelima Penumarthy: కథలకో గంట 1/24.. నీలిమ చెప్పే కథ చదవండి!
స్కూల్లో మ్యాథ్స్ అవర్... సైన్స్ అవర్ అంటుంటాం. చట్టసభలో జీరో అవర్ అనే మాట వింటుంటాం. స్టోరీ అవర్... ఈ గంట ఎక్కడ నుంచి వచ్చింది?నీలిమ పెనుమర్తి ఆలోచన నుంచి వచ్చింది. రోజుకో గంట కథలు వినమని చెప్తున్నారీమె. యూకేలో ఆచరణలో పెట్టి... ఇండియాకి తెచ్చారు. విశ్వవ్యాప్తం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆడియో బుక్స్తో స్వచ్ఛమైన భాష నేర్పిస్తున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన నీలిమ ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. పిల్లల పెంపకంలో కథలు కూడా ఒక భాగం అయి తీరాలని నమ్ముతారామె. మనదేశంలో స్కూల్ కరికులమ్లో పిల్లలకు కథలు లేక΄ోవడం విచారకరం అంటారామె. కథ ్రపాధాన్యం తెలిసిన అభివృద్ధి చెందిన దేశాలు పిల్లల రోజువారీ క్రమంలో ఓ గంట కథల కోసం కేటాయిస్తున్నాయని, మన దగ్గర అది లోపించడంతో ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ ఒక విషయాన్ని చక్కగా కళ్లకు కట్టినట్లు వివరించగలిగిన నైపుణ్యం కొరవడుతోందన్నారు నీలిమ. భాష ఏదైనా ఆ భాషలో పదాలను స్పష్టంగా ఉచ్ఛరించడం అలవాటు చేయాలంటే ఇంట్లో తల్లిదండ్రులు అంత స్వచ్ఛంగా మాట్లాడే నేపథ్యం ఉండాలి. ఆ వెసులుబాటు లేని పిల్లలకు తన ప్రయత్నం మంచి భాషను, చక్కటి భావ వ్యక్తీకరణను నేర్పిస్తుందన్నారు నీలిమ. ఏడేళ్ల కిందట ‘స్టోరీ అవర్‘ ఆలోచనకు బీజం పడిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నా రామె.ఓ గంట నిడివిలోనే కథ ‘‘నాకు లండన్ ఇంపీరియల్ కాలేజ్లో కెమిస్ట్రీలో ఎంఎస్ చేయడానికి స్కాలర్షిప్ వచ్చింది. మా వారు కూడా స్కాలర్షిప్ మీద లండన్లోనే వచ్చారు. అలా 30 ఏళ్ల కిందట యూకేకి వెళ్లడం, చదువు, ఉద్యోగం, ఇద్దరు పిల్లలతో అక్కడే సెటిలయ్యాం. రెండవసారి గర్భిణిగా ఉన్నప్పుడు పీహెచ్డీలో విరామం తీసుకున్నాను. ఆ విరామం నా ఆలోచనలను కథల మీదకు మళ్లించింది. పెద్ద బాబుకి కథలు చెప్పడం మొదలుపెట్టాను. అమరచిత్ర కథ చదవడం అలవాటు చేశాను. అదే చిన్నబాబుకి కూడా అలవడింది. మా అబ్బాయిలిద్దరూ గ్రీక్ ΄ûరాణిక గ్రంథాలను కూడా చదివారు. వాళ్లిద్దరి మాటల్లో ఆ పాత్రల గురించిన చర్చ వస్తుండేది.అప్పుడు మన రామాయణాన్ని పరిచయం చేశాను. అదే సమయంలో మా పెద్దబ్బాయి స్కూల్ వాళ్లిచ్చిన ్రపాజెక్ట్ కోసం ఒక స్టోరీ బోర్డ్ చేయాల్సి వచ్చినప్పుడు రామాయణం ఇతివృత్తంగా చేశాడు. ఆ తర్వాత పిల్లలకు సెలవుల్లో రామాయణం మీద వాళ్ల వెర్షన్ రాయమని చె΄్పాను. ఆ టాస్క్లో మరో చాలెంజ్... కథనం గంటకు మించరాదు. తమకు తోచినట్లు ఎడిట్ చేసుకుంటూ సీతారామలక్ష్మణులు యుద్ధం తర్వాత విజేతలై అయోధ్యకు రావడం దీపావళి వేడుక చేసుకోవడంతో ముగింపు ఇవ్వాలన్నమాట. ఆ సాధన ఆడియో బుక్ ఆలోచనకు రూపమిచ్చింది.పిల్లలే పాట రాశారు!మాల్గుడి డేస్ వీడియోలకు సిగ్నేచర్ ట్యూన్ ఉన్నట్లే మా ఆడియో బుక్స్కి కూడా ట్యూన్ ఉండాలని పాట కోసం ప్రయత్నించాను. పిల్లలకు ఇస్తే ఎలా రాస్తారో చూద్దామని యూకేలో శచి అనే అమ్మాయికిచ్చాను. తాను రామాయణం కథను ఒక్క వాక్యంలో ‘వారధి నిర్మాణం సీత మీద రాముడికి ఉన్న ప్రేమకు ప్రతిబింబింబం’ అనే భావంతో రాసింది. అలాగే భారతీయ మూలాలు ఏ మాత్రం లేని ‘ఎవీ సిమన్స్’ అనే అమ్మాయి ‘లైట్ ద ల్యాంప్స్’ పేరుతో సీతారాములు విజేతలుగా అయోధ్యకు వచ్చి దీపావళి వేడుక చేసుకోవడాన్ని రాసింది. మంథర విషపూరిత వచనాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో వివరించింది.క్రియేటివ్గా సైన్స్ పాఠాలు బాల్యంలో మేము బాలానందం వినేవాళ్లం. సరళంగా సాగే కథనాలు పిల్లల్ని అలరించేవి. నా ఆడియోబుక్స్ కూడా సులువుగా ఉంటాయి. ఇవన్నీ ‘స్టోరీ అవర్ డాట్ కో డాట్ యూకే’ వెబ్సైట్లో ఉచితంగా ఉన్నాయి. భాష శుద్ధంగా ఉంటే ఆలోచనలు కూడా అంతే శుద్ధంగా ఉంటాయని నా అభి్రపాయం. మంచి భాష మాట్లాడితే వ్యక్తి గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారాల కోసం ప్రపంచంలో ఎక్కడికెళ్లినా సరే... మంచి భాష ద్వారా చక్కటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. మంచి ఉచ్చారణ వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది. అందుకే సైన్స్ సబ్జెక్ట్ని కూడా ఈ క్రియేటివ్ మీడియం ద్వారా వివరించాలనేది నా ఆకాంక్ష’’ అని తన ప్రయత్నం వెనుక ఉన్న పరమార్థాన్ని వివరించారు నీలిమ పెనుమర్తి. సమయం లేని తల్లిదండ్రుల కోసం...ఇప్పుడు ఉద్యోగాలు దాదాపుగా అందరి జీవితాలనూ సంక్లిష్టంగా మార్చేస్తున్నాయి. ఇలాంటప్పుడు పిల్లలకు కథ చె΄్పాలని ఉన్నప్పటికీ కొంతమందికి అందుకోసం ఓ గంట సమయం కేటాయించలేని పరిస్థితి ఉంటోంది. వాళ్లకు ఉపయోగపడేటట్లు కథలకు ఆడియో బుక్ రూపమిచ్చాను. దానిని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో తెచ్చాను. మా పిల్లలు శ్రేయాస్, ఆయుర్ ఇద్దరూ హిస్టరీ చదివారు. అక్కడ హిస్టరీ అంటే రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, ప్రపంచ యుద్ధాలు ప్రధానంగా ఉంటాయి.మా పిల్లలు అలాగే యూకేలో ఉన్న భారతీయమూలాలున్న పిల్లలకు మన చరిత్ర తెలియచేయాలనే ఉద్దేశంతో ‘ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద మొఘల్స్ టు ద మహాత్మా’ పేరుతో మరో ఆడియో బుక్ చేశాను. ఆ స్టోరీ ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో అడుగు పెట్టడం నుంచి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సముపార్జన వరకు సాగింది. అలాగే మన సామెతలను పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నమే ‘తాతమ్మ కథలు’. మా అమ్మ, నాన్న, అత్త, మామగారితో ఒక్కో సామెతకు ఒక్కో కథ రాయించి వాటిని ఐదు నిమిషాలకు మించకుండా ఎడిట్ చేసి రికార్డ్ చేశాను. మొత్తం పన్నెండు కథలు, గంట ఆడియో.ఈ కథలకు నాకు మాల్గుడి డేస్ స్ఫూర్తి. యూకేలోని తెలుగు కుటుంబాల పిల్లలు ఈ కథలను వినడం మొదలు పెట్టిన తర్వాత తొలి రోజుకి పన్నెండవ రోజుకీ వారి ఉచ్చారణ మారి΄ోయింది. కథకు అంతటి శక్తి ఉంటుందనే నా నమ్మకం నిజమేనని నిరూపితమైంది. తోలుబొమ్మలతో చేసిన ప్రయోగానికి చాలా ఖర్చయింది, కానీ అది కూడా సంతృప్తినిచ్చింది. ఆరు పాత్రలతో కథను అల్లుకుంటూ రాసుకున్నాం. ఆడియో బుక్ అనువాదాలకు హైదరాబాద్లోని కేంద్రీయ విద్యాలయ (ఉప్పల్) విద్యార్థులు, బేగంపేటలోని దేవనార్ (అంధ విద్యార్థుల పాఠశాల) స్కూల్ విద్యార్థులు గళమిచ్చారు.– నీలిమ పెనుమర్తి, స్టోరీ అవర్ రూపకర్త– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఫొటోలు : అనిల్ కుమార్ మోర్ల -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
కథల అమ్మమ్మ
నాగరకత ముసుగులో... ఆదివాసీలకు ఆధునిక సమాజం పెట్టే పరీక్షలు... అడవి బిడ్డల చుట్టూ ఊహకందని ప్రమాదాలు... పల్లెపదాలు... జానపదజావళులకు... ఆమె అక్షరమైంది. అలాగే... అమెరికా ప్రకృతి అందాలు... మనవాళ్ల ప్రగతి సుగంధాలు కూడ. ఆరుపదులు దాటిన ఆమెలోని రచయిత్రి...ఇప్పుడు... పిల్లలకు కథల అమ్మమ్మ అవుతోంది. విజయనగరం జిల్లా... స్వచ్ఛతకు, అమాయకత్వానికి నిలయం. అణచివేత, దోపిడీలను ప్రశ్నించే గళాలను పుట్టించిన నేల. ఇంటి గడపలే సప్తస్వరాలుగా సరిగమలు పలికే గుమ్మాలు ఒకవైపు. అరాచకాన్ని ఎదిరిస్తూ గళమెత్తిన స్వరాలు మరొకవైపు... పడుగుపేకల్లా అల్లుకుని సాగిన జీవన వైవిధ్యానికి ప్రత్యక్ష సాక్షి కోరుపోలు కళావతి. నాటి అమానవీయ సంఘటనలకు సజీవ సాక్ష్యాలు ఆమె రచనలు. చదివింది పదవ తరగతే. కానీ ‘వాస్తవాలను కళ్లకు కట్టడానికి గొప్ప పాండిత్యం అవసరం లేదు, అన్యాయానికి అక్షరరూపం ఇవ్వగలిగితే చాలు. వాస్తవ జీవితాలు చెప్పే నీతి సూత్రం కంటే పాండిత్యం చెప్పగలిగిన న్యాయసూత్రం పెద్దదేమీ కాద’ని నిరూపిస్తోందామె. ఇటీవల ‘మన్యంలో మధురకోయిల’ రచనను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న అక్షర జ్ఞాపకాలివి. ‘‘మాది విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామం. మా నాన్న పెదపెంకి కూర్మినాయుడు కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా ఉండేవారు. వంగపండు ప్రసాదరావుగారితో కలిసి ప్రజాచైతన్యం కోసం పనిచేశారు. నేను చదివింది పదవ తరగతి వరకే. కానీ రాయాలనే దాహం తీరనంతగా ఉండేది. యద్దనపూడి సులోచనారాణి పెద్ద చదువులు చదవకపోయినా లెక్కలేనన్ని నవలలు రాశారని తెలిసి నాలో ఉత్సాహం ఉరకలు వేసింది. ఆమె స్ఫూర్తితోనే రచనలు మొదలుపెట్టాను. మా వారు టాటా స్టీల్లో అధికారి కావడంతో పెళ్లి తర్వాత మేము పాతికేళ్లపాటు ‘కడ్మా’లో నివసించాం. కడ్మా అనేది జార్ఖండ్లో జెమ్షెడ్పూర్ నగరానికి సమీపంలో, టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులు నివసించేప్రాంతం. అక్కడ అన్నిప్రాంతాలు, రకరకాల భాషల వాళ్లతో కలిసి జీవించడం నాకు మంచి అనుభవం. పిల్లలు పెద్దయ్యే వరకు ఇంటి బాధ్యతలే ప్రధానంగా గడిచిపోయింది నా జీవితం. కడ్మాలో ఉన్న తెలుగు అసోసియేషన్ ఉగాది సంచిక కోసం వ్యాసాలు సేకరించడం, రాయడంతో సంతోషపడేదాన్ని. పదిహేనేళ్ల కిందట యూఎస్లో ఉన్న మా అమ్మాయి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడి ప్రకృతి, మనవాళ్లు సాధిస్తున్న ప్రగతిని ‘అమెరికా అందాలు గంధాలు’ పేరుతో నవల రాశాను. అదే తొలి నవల. నేను రాయగలననే నమ్మకం వచ్చిన రచన కూడా. ఆ తర్వాత మా జిల్లా సంగీత కౌశలాన్ని వివరిస్తూ ‘భారత్లో భాసిల్లిన విద్యల నగర సౌధము’ రాశాను. మా గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు జీవితాన్ని చిన్న పదాలతో అల్లేసి, రాగయుక్తంగా పాడుతారు. ఆ వైనాన్ని ‘జానపద జావళి’ పేరుతో రాశాను. ఆదివాసీల స్వచ్ఛతకు అద్దం పట్టే ‘గడ్డిగులాబీలు’, ప్రతిమ, చిగురించే ఆశలు, వసివాడిన వసంతం, అవనిలో ఆంధ్రావని, జీవన స్రవంతి... ఇలా రాస్తూ ఉన్నాను, రాయడంలో ఉన్న సంతోషాన్ని ఇనుమడింప చేసుకుంటున్నాను. ‘మన్యంలో మధురకోయిల’ సుమారు యాభై ఏళ్ల కిందట ఆత్మహత్యకు పాల్పడిన మన్యం బాలికల యదార్థగాధ. అంతకుమునుపు రాసిన ‘ప్రతిమ’ అరకు చుట్టూ సాగింది. ఒక ఫొటోగ్రాఫర్ అరకు ప్రకృతి సౌందర్యాన్ని, అడవిబిడ్డ అచ్చమైన స్వచ్ఛతను ఫొటో తీయడానికి తరచూ వస్తుండేవాడు. ఒక గిరిజన అమ్మాయిని ఫొటోలు తీసి, పోటీకి పంపించి అవార్డు తెచ్చుకుంటాడు కూడా. ఫొటోల పేరుతో మళ్లీ అరకు బాట పట్టిన ఆ ఫొటోగ్రాఫర్ అవకాశవాదం నుంచి తమ అడవి బిడ్డను కాపాడుకోవడానికి గిరిజనులు పెట్టిన ఆంక్షలకు కథారూపమిచ్చాను. ఆలయాలు సరే... ఆశ్రమాలూ కట్టండి! నన్ను నేను వ్యక్తం చేసుకునే అవకాశాన్నిచ్చింది అక్షరమే. కథ అంటే ఊహల్లో నుంచి రూపుదిద్దుకోవాలని అనడం కూడా విన్నాను. కానీ నా కథాంశాలన్నీ వాస్తవాలే. అమెరికాలో మనవాళ్లు... మన సంస్కృతికి ఆనవాళ్లుగా పెద్ద పెద్ద ఆలయాలను నిర్మిస్తుంటారు. భాషల పరంగా సంఘాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. కానీ భారతీయుల కోసం ఒక్క వృద్ధాశ్రమాన్నయినా కట్టారా? వార్ధక్యంలో ఉన్న తల్లిదండ్రులను ఇంగ్లిష్ వాళ్లు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలోనే చేరుస్తారు. అక్కడ మనవాళ్లకు భాష తెలియక పోవడంతో మాట రాని మూగవాళ్లుగా జీవిస్తుంటారు. అదే మన భారతీయులే వృద్ధాశ్రమాలను నిర్మించి నిర్వహిస్తే... రిటైర్ అయిన తల్లిదండ్రులు మన ఆహారం తింటూ, మన భాష వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ అక్కడ సేదదీరుతారు కదా! అలాగే పండుగలు, సెలవులప్పుడు వీలు చూసుకుని కొడుకులు, కూతుళ్లు, మనవలు, మనవరాళ్లు వెళ్లి కలవడానికి వీలవుతుంది. నాకు కలిగిన ఈ ఆలోచననే ఆ రచనలో చెప్పాను. నా అక్షరాలకు చిత్ర రూపం! నా రచనలకు ముఖచిత్రం నా మనుమరాలు హర్షిత వేస్తుంది. తను సెవెన్త్ క్లాస్, ఇంగ్లిష్లో చిన్న చిన్న కథలు సొంతంగా రాస్తుంది. యూఎస్లో ఉన్న పెద్ద మనుమరాలు నందిని నా తొలి నవలను ఇంగ్లిష్లో ట్రాన్స్లేట్ చేస్తానని తీసుకువెళ్లింది. నా ఇద్దరబ్బాయిలూ విజయనగరంలో ఇంజనీర్లే. నేను, మా వారు వాళ్ల దగ్గర శేషజీవితాన్ని గడుపుతున్నాం. నా రచనల్లో కర్పూరకళిక, వలస వచ్చిన వసంతం, వాడినపూలే వికసించునులే, కలలగూడు’ వంటి వాటికి పుస్తకరూపం ఇవ్వాలి. పిల్లలకు కథలు చెప్పే నానమ్మలు, అమ్మమ్మలు కరవైన ఈ రోజుల్లో ‘బాలానందం’ పేరుతో పిల్లల కథల పుస్తకం రాశాను. అది ముద్రణ దశలో ఉంది. అక్షరంతో స్నేహం... నాకు జీవితంలో ఎదురైన ఎన్నో సమస్యలను ఎదుర్కోగలిగిన మనోధైర్యాన్నిచ్చింది. నా ఈ స్నేహిత ఎప్పటికీ నాతోనే ఉంటుంది’’ అన్నారు కళావతి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: కంది గౌరీ శంకర్, సాక్షి, విజయనగరం తొలివాక్యం ఆత్మవిశ్వాసాన్నిచ్చింది! నేను రాసిన తొలివాక్యం ‘కొట్టు కొనమంటుంది– పోట్ట తినమంటుంది’. ఈ వాక్యానికి ఐదు రూపాయల పారితోషికం అందుకున్నాను. ఆ ఐదు రూపాయలను ఖర్చు చేయకుండా చాలా ఏళ్లు దాచుకున్నాను. అప్పుడు నేను ఐదవ తరగతి. చందమామ పత్రికలో ఫొటో ఇచ్చి ఒక వాక్యంలో వ్యాఖ్యానం రాయమనేవారు. మా పెద్దన్నయ్య భాస్కరరావు పుస్తకం తెచ్చిచ్చి క్యాప్షన్ రాయమన్నాడు. ‘ఒక చిన్న కుర్రాడు ఆకలితో పచారీ కొట్టు ముందు బేలగా నిలబడి వేలాడదీసిన అరటి గెల వైపు చేయి చూపిస్తూ ఉన్నాడు. కొట్టతడేమో డబ్బిస్తేనే ఇస్తానంటూ కసురుకుంటున్నాడు’ ఇదీ అందులో విషయం. ఆ తొలివాక్యమే కవయిత్రి కావాలనే కలకు కారణం అయింది. నేను చూసిన సంఘటనలు, నా గమనింపునకు వచ్చిన అంశాలు కొత్త రచనకు ఇంధనాలయి తీరుతాయి. అలా ఒక వాక్యంతో మొదలైన నా అక్షరవాహిని జీవనదిలా సాగుతోంది. – కోరుపోలు కళావతి,రైటర్ -
భారత్లోనే మొట్టమొదటి దాస్తాంగోయి.. ఈ కళ గురించి మీకు తెలుసా?
‘దాస్తాంగో ప్రదర్శన ఇస్తున్నది ఓ అమ్మాయా!!’ అని బోలెడు ఆశ్చర్యపడుతూనే ప్రేక్షకుల మధ్య కూర్చున్నాడు ఒక ప్రేక్షకుడు. ఇలా కూర్చొని అలా వెళ్లిపోదాం... అనుకున్నాడు.అయితే ప్రదర్శన పూర్తయ్యే వరకు కదలకుండా కూర్చున్నాడు. ఆ హాల్లో నవ్వుల్లో నవ్వు అయ్యాడు. ఏడుపులో ఏడుపు అయ్యాడు. సకల భావోద్వేగాల సమ్మేళనంతో ‘దాస్తాంగోయి’ ఫౌజియాను ఆశీర్వదించాడు. ఉర్దూలో మౌఖిక కథాసాహిత్య కళారూపం... దాస్తాంగో. పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ కళారూపంలో అపారమైన పేరు తెచ్చుకొని ‘ఫస్ట్ ఫిమేల్ దస్తాంగోయి’గా గుర్తింపు పొందింది ఫౌజియా... దిల్లీకి చెందిన ఫౌజియాకు స్కూల్ రోజుల నుంచి సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్లో ప్రదర్శించే నాటకాల్లో పాల్గొనేది. ఫౌజియా తండ్రి మోటర్బైక్ మెకానిక్. ఆర్థిక పరిస్థితి రీత్యా ఫౌజియా ఎప్పుడో చదువు మానేయాలి. ట్యూషన్లు చెప్పగా వచ్చిన డబ్బుతో పై చదువులు చదివింది. మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసింది. దయాల్ సింగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరోజు తొలిసారిగా ‘దాస్తాంగో’ ప్రదర్శన చూసింది ఫౌజియా. ఇక అప్పటి నుంచి ‘దాస్తాంగో’ పై ఆసక్తి, అభిమానం పెరిగాయి. తాను కూడా ‘దాస్తాంగోయి’గా పేరు తెచ్చుకోవాలనుకుంది. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) ‘ఇది పురుషులకు మాత్రమే పరిమితమైన కళారూపం. మహిళలు చేయలేరు. ఒకవేళ చేసినా ప్రేక్షకులు ఆదరించరు’ అన్నట్లుగా చాలామంది మాట్లాడారు. ఆ మాటలు విని ఫౌజియా కొంచెం కూడా నిరాశపడలేదు. తనపై తనకు గట్టి నమ్మకం ఉంది. ‘జీవితాంతం దాస్తాంగో చెంతనే ఉండాలనుకున్నాను. ఎంతో చరిత్ర ఉన్న ఈ కళ గురించి ఈ తరంలో కొద్దిమందికి మాత్రమే తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తరానికి కూడా తెలిసేలా దాస్తాంగోకు ప్రాచుర్యం తీసుకురావాలనుకున్నాను’ అంటుంది ఫౌజియా.డానీష్ హుస్సేన్, మహ్మద్ ఫారూఖీలాంటి గొప్ప కళాకారుల నుంచి ‘దాస్తాంగో’ను నేర్చుకుంది ఫౌజియా. ఫౌజియా కథాసంవిధానంలో కృత్రిమమైన భాషా గాంభీర్యం వినిపించదు. పాత దిల్లీ యాస మాత్రమే వినిపిస్తుంది. ‘మన దేశంలో ఎన్నో భాషలకు సంబంధించి ఎన్నో మాండలికాలు ఉన్నాయి. ప్రతి మాండలికానికి తనదైన సొగసు ఉంటుంది. ఈతరంలో చాలామంది తమ యాసను దాచి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. ఇది సరికాదు. మన ఊరు, తల్లిదండ్రులు, సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకున్నట్లే మన మాండలికం గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి’ అంటుంది ఫౌజియా. ఫౌజియాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. ముఖ్యంగా ఉర్దూ సాహిత్యం. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ, నానమ్మల నుంచి ఎన్నో కథలు విన్నది. అద్భుతమైన రీతిలో కథలు చెప్పేవారు. కథను ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ విరామం ఇవ్వాలి, మళ్లీ ఎక్కడ మొదలు పెట్టాలి... అనే దాంట్లో వారు సిద్దహస్తులు. ఆ మెళకువలు ఊరకే పోలేదు...‘దాస్తాంగో’లో ఫౌజియాకు బాగా ఉపకరించాయి. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) జానపద కథలు మాత్రమే కాకుండా సామాజిక సందేశం ఉన్న ఆధునిక కథలను కూడా చెబుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఫౌజియా. దేశవిభజన సమయంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, హింస గురించి కథగా చెబుతున్నప్పుడు ప్రేక్షకులు కదిలిపోయారు. కోవిడ్ కల్లోల సమయంలో ఫౌజియాకు ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వడానికి కుదరలేదు. దీంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారానే ప్రదర్శన ఇచ్చింది. మహాభారతం కథల నుంచి స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం వరకు ‘దాస్తాంగోయి’గా ప్రేక్షకులను మెప్పిస్తున్న ఫౌజియాకు ఉర్దూ భాషలోనే కాదు హిందీ, ఇతర భాషలలోనూ ‘దాస్తాంగో’ ప్రదర్శనలు ఇవ్వాలనేది కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Fouzia Dastango (@fouziadastango) -
గురువు సందేశం తర్వాత..ఇంత నిశబ్దమా! ఇదేలా సాధ్యం?
అది చంపానగర సమీపంలో ఉన్న గర్ఘరా పుష్కరిణీ తీరం. ఆ పుష్కరిణి దక్షిణపు ఒడ్డున సువిశాలమైన మర్రిచెట్టు. ఆ చెట్టుకింద బుద్ధుడు తన భిక్షుసంఘంతో కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో ఏనుగులకు శిక్షణ ఇచ్చే పేస్సుడు, కందరకుడు అనే పరివ్రాజకుడు ఇద్దరూ వచ్చారు. వారు వచ్చి మౌనంగా ఒకపక్క కూర్చున్నారు. కొంతసేపటికి బుద్ధుని ప్రబోధం ముగించాడు. అప్పుడు వారిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. కొన్ని అనుమానాలు అడిగి నివృత్తి చేసుకున్నారు. అప్పటికి చాలా సమయం గడిచింది. భిక్షుసంఘం అంతసమయం నిశ్శబ్దంగానే ఉండటం చూసి వారిద్దరూ ఆశ్చర్యపడ్డారు. వారు అనేక ఇతర పరివ్రాజక సంఘాల్ని చూశారు. గురువులు చెప్పే సందేశాలు ముగిశాక గానీ ఇంత ప్రశాంతత కానరాదు. ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనో, గుసగుసలాడుకుంటూనో, గొణుక్కుంటూనో ఉంటారు. ఆ గురువులు ‘నిశ్శబ్దం నిశ్శబ్దం’ అని అరుస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ అలాంటిదేమీలేదు. ఎవ్వరూ అసహనంగా లేరు. ఇతరుల్ని సహనాన్ని చెడగొట్టడం లేదు. తాము బాధపడటం లేదు, ఇతరుల్ని బాధపెట్టడం లేదు. అప్పుడు కందరకుడు ‘‘భగవాన్! విచిత్రం! మనుషుల ప్రవర్తన రకరకాలుగా ఉంటుంది. కానీ, ఇక్కడ అందరూ ఒకే శ్రద్ధతో ఉన్నారు’’ అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడు బుద్ధుడు–‘‘కందరకా! మనుషుల్లో ముఖ్యంగా తాపసుల్లో నాలుగు రకాల వారు ఉంటారు. మొదటి రకం వారు, తమని తామే బాధించుకుంటారు. తాము బాధపడుతూ తమ శరీరాల్ని అతిగా బాధలకి గురిచేస్తారు. నిరాహారంతో శుష్కింపచేస్తారు. అతి చలికి, అతి వేడిమికి గురిచేస్తారు. తినకూడని పదార్థాల్ని తింటారు. అలా తమని తాము శిక్షించుకోవడమే సరైన శిక్షగా భావిస్తారు. ఇంకొందరు ఇతరుల్ని బాధించి తాము సుఖంగా బతకాలనుకుంటారు. దొంగలూ దోపిడీదారులు, ఇతర జీవుల్ని పట్టి చంపి వాటి మాంసాన్ని అమ్మేవారు. ఇలా పరుల్ని నష్టపరచి తాము లాభాలు పొందాలనుకునే వారంతా ఈ కోవలోకి వస్తారు. అలాగే తాము దుఃఖపడుతూ ఇతరుల్ని దుఃఖపరిచే వారు మూడోరకం. ఒక మహారాజు గొప్ప యజ్ఞం చేయాలనుకుంటాడు. దాని నిర్వహణ కోసం ఎంతో సొమ్ము... ఎన్నో జంతువులూ కావాలి. కాబట్టి ఆజ్ఞలు జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞల్ని అమలు చేయడానికి ఉద్యోగుల్నీ, సైనికుల్నీ నియమిస్తాడు. వారు గ్రామాల మీద పడి పేద ప్రజల నుండి, సామాన్య రైతుల నుండి పశువుల్ని, డబ్బుల్నీ బలవంతాన లాక్కు వస్తారు. అలా వారు తమకి ఇష్టం లేకపోయినా బాధపడుతూనే... బలవంతంగా ఆ పనులు చేస్తారు. తాము బాధపడుతూ, ఇతరుల్నీ బాధపెడతారు.’’ ఇక కొందరు తమ శరీరాన్ని, తమ మనస్సునీ తాము బాధించుకోరు. తమ సుఖం కోసం పరుల్నీ బాధించరూ– ఇలాంటి వారు స్వీయ క్రమశిక్షణతో నడుచుకుంటారు. అలా ఉంటే ఆ వినేది తామూ శ్రద్ధతో వింటారు. పక్కనున్న వారినీ విననిస్తారు. అది ఉభయులకీ శ్రేయస్సునిస్తుంది. నా భిక్షువులు అలాంటి వారు’’ అన్నాడు బుద్ధుడు. శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమో వారికర్థమయ్యింది. ఇద్దరూ బుద్ధునికి ప్రణమిల్లి ‘‘మమ్మల్ని, మీ సంఘంలో చేర్చుకోండి’’ అని ప్రార్థించారు. బుద్ధుడు అంగీకరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: "కృష్ణ భక్తి" ఎంతపనైనా చేస్తుంది అంటే ఇదే కదా..ఏకంగా 88) -
ఇంట్లో వాళ్లే కాదు... మొత్తం ఊరంతా
కొండకు బోయొచ్చినప్పటి నుంచి కత్తి గెలిసిన కోడే గతం మా జయక్క మగం ఎలిగిపోతావుంది. కుమ్మరి ఎంగటప్ప చేత్తో తయారు చేసిన మొంటి ఉండీని మా జయక్క పది రూపాయలుకి ఇంటికి కొనక్కచ్చింది. ఎంగటప్ప దానికి ఎంతో సుందరంగా పూజులు కూడా తీర్సినాడు. ఆ ఉండీని ఎంగట్రమణ సామి పటాలకాడ పెట్టి ‘ఉండీ నిండిన్నాపొద్దు దావకర్సులకు ఈ దుడ్డు పెట్టుకొని నీ కొండకు వస్తాను సామీ’ అని మొక్కుంది. ఆ పొద్దు నుండి జయక్క చీర కొంగున ముడేసిన రూపాయి బిల్లలు, అరుదుగా చేతికి మిగిలే ఐదు రూపాయల బిల్లలు, ఎబుడన్న కతగెతిగ మిగిలిన యాబై రూపాయల నోట్లు, పంటపలం అమ్మిన సొమ్ములో అవసరం కోసం అప్పుచేసిన డబ్బుల్లో, కూలి డబ్బుల్లో కొద్దిగా తీసి ఉండీలో ఏసేది. అన్ని రకాల డబ్బుల్లో నుండి ఈ నోటు పక్కకు పోయిన బాద లేదులే అనుకోని ఏసిన నూరు రుపాయల నోట్లు, ఎంత ఉన్నా మనచేతిలో కర్సయిపోతుంది అనుకోని తెంపుచేసి ఏసిన ఒగటో రెండో ఐదు నూర్లు కాగితాలు కూడా ఉండేవి. ఈ రకంగా మూడేండ్ల నుండి కూడేసిన ఉండీ నిండి నిబ్బాలాడతా ఉంది. "మా ఊర్లోవాల్లు తిరుపతి కొండకు పోవాలంటే ఒగ ఇంట్లోవాల్లే పోరు. ఊర్లో కాగలిగినోల్లు అమ్మలక్కలు, అబ్బలబ్బలు మాట్లాడుకుని ఒగ పది పదైదు మందన్న జమై పోతారు." జయక్క నన్ను నా మొగున్ని పైనం చేసే. ‘ఇద్దరం వొచ్చేస్తే ఇంటికాడ మనిసి ఉండల్ల ఆ యమ్మిని తోడుకొనిపో’ అనే నా మొగుడు. ‘ఏం పాపా ఈ పైనం అట్ల పదాం పద మూడేళ్ల నాటి మొక్కుబడి తీర్సుకొని వద్దాము’ అనే జయక్క. ‘సర్లే’ అంటి. తిరపతికి పోను జతకు మనిసి దొరికితే సాలు అని కాసుకోనుండేవాల్లు. మా ఊరి లింగమ్మత్త, రెడ్డమ్మ, సరోజి, మగోల్లు నాగన్న, ఎంగటప్ప, రమణన్న.. అంతా తొమ్మిది మంది జమైనాము. మా ఊరు దావన పోయే తొమ్మిదిగంట్ల రైలు ఎక్కితే సరిగ్గా రెండు గంటలకు తిరపతిలో దిగతాం అని ఈ పొద్దే అందరం మాట్లాడుకొని పయనాలు కడతా ఉండాము. మా జయక్క ఉండీని చేతికి ఎత్తుకొని బరువు చూసే. కోటీసురాలు ఐనట్టు ఎలిగిపోతా వుంది మగం. ఆ వుండి పగలగొట్టే. సిల్లరంతా జల్లున రాలే. నోట్లన్నీ ఓపక్క, సిల్లరంతా ఓ పక్క లెక్కేసుకుండే. అంతా మూడేలు పైచిలుకు ఉన్నింది. ‘ఈ దుడ్డు మల్ల మిగిలించుకొని రాకూడదంట పాపా. అంతా కర్సు పెట్టేయలంట’ అని నాకు బింకంగా సెప్తా ఉంది. ఆ మరుసునాడు తెల్లారుజామునే లేసి అందరం తయారై ఒగ పూటకు సింతపులుసన్నం, గోదుమ రొట్లు, చెనిగ్గింజల గెట్టూరిబిండి ఏసి మనిసికి ఒగ పట్లాము కట్టుకొని బ్యాగుల్లో పెట్టుకొని పోతిమి. మా జయక్క వక్కాకు బలే ఏస్తుంది. ‘పాపా నాకు అన్నము లేకపోయినా ఉంట. వక్కాకు లేకుండా ఉండ్లేను’ అంటుంది. ఈ అమ్మకు దోడుమైనోల్లే సరోజమ్మ.. లింగమ్మ కూడా. ఈ ముగ్గురూ మేము పోయే తొక్కు వక్కాకు సిక్కదేమో అని మల్ల కొండ నుంచి తిరుక్కోని ఇంటికి వొచ్చిందంక ఉండేటిగా టౌనుకు పోయి కాలకట్ట తమలపాకులు, పిడుకుడు వక్కలు, పావు సేరు దుగ్గు తెచ్చుకున్నారు. మొగోల్లు మా యంగటన్న బీడీలు ఇపరీతంగా తాగతాడు. నాగన్న, రమణన్న కూడా తాగేవాల్లే. వాల్లకు కావాల్సిన బీడీలు, అగ్గిపెట్లు తెచ్చుకొని బ్యాగుల్లో పెట్టుకున్నారు. రెడ్డెక్క నేను తప్పనిడిసి మిగతా ఏడు మందికి బస్సెక్కినా రైలెక్కినా కిటికీ పక్కన వారసీటే కావాలంటారు వక్కాకు ఊంచుకోను. గెడిసేపన్నా వాల్ల నోర్లు ఊరికే ఉండవు. మేక నమిలినట్లు నమలతానే ఉంటారు. యాడబడితే ఆడ ఊంచుతారు. మాకు సగిచ్చదు. మేము వాల్ల మింద సిటుమొరుక్కుంటానే తిరపతి అలిపిరి మెట్లకాడికి పోతిమి కాలిదావన పోదామని. మా జయక్క కొండకు ముందే రెండుసార్లు వొచ్చింది. ఎంగటన్న కూడా ముందు వొచ్చినోడే. మిగతావాల్లకు ఇదే తొలిసారి. అందరం కియిలోకి పొయి నిలబడి ఆడ నుంచి బ్యాగుల్ని మనుసుల్ని తనికీ చేసే తావుకు పొయినాం. వీలంతా ఎనకెనకనే గుంజిట్లు పెడతా ఉంటే నేను రెడ్డెక్క ముందుగా పోతిమి. మావి చూసి అంపించేసిరి. మేము కడగా బారడు దూరం నిలబడితిమి. ఈల్లు ఎంచేపటికీ రాలా. మల్లొచ్చిరి. ఏమట ఇంతసేపు అంటే మా జయక్క మగం తప్ప మిగతా అందరివీ చింతాకంత అయిపొయినాయి. లింగమత్త ఐతే ఏడుపు మగమే పెట్టేసింది. ఎంగటన్న మటుకు నగుమొగంతో కనపడే. సరోజమ్మ ఉండుకొని ‘నేను నా వక్కాకు తిత్తి కనపడదు కదా అని పావడ నాడాకు కట్టి రెండు కాళ్ళ సందులో దిగేసుకోనుంటే అదెవుతో పోలీసిది ఒల్లంతా పామేటప్పుడు మూట పెద్దగా ఉండి చేతికి తగిలింది. తీయే అని పెరుక్కొని అంతా ఇసిరి పారేస. వక్కాకు పోతేపానీ బంగారట్ల తిత్తి ఆరు పారవులు ఏసి కుట్టిండేది. ఆరు ఏండ్లుకు ముందు కనుపూరి గంగమ్మ తిరణాల్లో తీసుకోనుంటి. ఎంత దుడ్డు మోసిందో ఎంత వక్కాకు మోసిందో! దుడ్డుతో ఎక్కువ బిక్కటైనబుడు తిత్తిని గాలిస్తే ఏదో ఒగ పార్వలో అంతో ఇంతో దొరికేది. అంత అచొచ్చిన తిత్తి పాయనే’ అని ఒకటే బాధపడే. ఇంతలో లింగమ్మ ‘ఓ నీ తిత్తి పోతే మల్ల తీసుకోవచ్చులే నాది సీమెండి పొడువు సున్నంకాయి. మాయమ్మ వాల్ల అమ్మ కాడ నుండి మూడు తరాల కాయి. మాయమ్మ గుర్తుగా అట్లే పెట్టుకో నుంటి. కాయినిండా ఒకసారి సున్నం పెడితే వారమంతా నమిలినా అయిపోయేదికాదు. ఆ సున్నంగాయి మూతకు ఎండి గొలుసు ఏసి, మూడు గెజ్జిలు కట్టి సున్నం లోడుకోను చిన్నగెంటి, పొల్లు గుచ్చుకునే పుల్ల, గుబిలిగెంటి ఇవన్నీ మూతకు కుచ్చు ఏసింటి. నా శనికాటం దాన్ని యాడన్న దాసిపెట్టుకోకూడదా! కడుపు సెన్నిట్టు అయిపోయా’ అని బాధపడే. నేను ఉండుకొని ‘పోతేపోనీలే వక్కాకే కదా ఏమో కలిమి పోయినట్టు ఏడస్తుండారే’ అంటే ‘అయ్యో నాయనా అదే మా పానాదరవ. పది దినాలు పస్తయిన ఉంటాము. గెడిసేపు వక్కాకు లేదంటే తలకాయి ఎర్రియాకోలం పడుతుంది. తెలిసినోల్లను గాని తెలీనోల్లను గాని అడగదామా అనిపిస్తుంది. మే జయా నువ్వు ముందే వచ్చింటివి కదా మాకు చెప్పిండకూడదా ఇంతకు నువ్వేమి చేసినావు’ అని అడిగిరి. ‘నేను వొట్టి తిత్తి నడుములో చెక్కోని వక్కాకు అంత మూటగట్టి గుడ్ల బ్యాగులో నడన పెట్టిన. ఆ నడుసుకొని పోయే మిసన్లో బ్యాగు ఏస్తే అది కిర్రుమనే. ఆ పోలీస్ది బ్యాగులో ఏందో ఉంది తీ బయటికి అనే. అమ్మా బజన చెక్కలు గిని అంటే ఏది చూపించు అనే. అవి పైనే ఉన్నాయి ఒగ జత అవి తీసిచూపిస్తే సరే పో అనే. పోనిలే మా ఇల్లిలప దేవుడు ఆ ఎంగట్రమన సామే నన్ను కాపాడినాడు. ఆ యప్ప సాస్టాగా నాపాలిటున్నాడు’ అని చెప్పే జయక్క. కత్తి గెలిసిన కోడేగతం మా జయక్క మగం ఎలిగిపాతా ఉంది. లింగమ్మకు కోపమొచ్చే ‘ఎంత మోసకారుదానివే! నీ యట్లాదాని మాటలకు ఎంగట్రరమణ సామే యామారి పోయినాడంట. నీ యట్లాడిది సామీ నేను అనుకునింది జరిగితే నీకు సిటికెల పందిరి ఏపిస్తాను అని మొక్కునిందంట. దేవుడు ఒరే ఇంతవరకు ఎవరు "తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు." ఏపీలేదే ఎట్లుంటుంది ఈ సిటికెల పందిరి చూద్దాం అని అసోద్దపోయి ఆ యమ్మ కోరిన మొక్కుతీర్సినాడు. దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడంట ఇంగ ఎప్పుడు వచ్చి ఏపిస్తుంది సిటికెల పందిరి అని. ఆ యమ్మ నలగరు ఆడోల్లను పిలుసుకొనిబొయ్యి నలగర్నీ నాలుగు సమకాలంగా నిలబెట్టి నడిమిద్ద ఆ యమ్మ నిలబడుకొని అందరూ కలిసి సుట్టూ సిటికెలు ఏసిరంట. ఇదేసామి సిటికెల పందిరి నా మొక్కు సెల్లిపోయింది అంటే సామే బెబ్బిర్లకపోయి ఓరే ఎంత యామారిపోయినాను అనుకున్నంట. అట్లా దానివి నువ్వు’ అనే! లింగమ్మ చెప్పిన కతకు అందరం నగుకుంటూ ఉండగానే మగోల్ల మగాలు కూడా సప్పగిల్లినాయి. ఈల్ల బీడీలకట్టలు కూడా పెరుక్కొన్నారు. రమనన్న బీడీలకట్టని సరాయి లోజోబిలో పెట్టుకొని ఉన్నాడు. పోలీసులు తడిమేటప్పుడు చేతికి తగిలి పెరికి అక్కడ బారేసినరంట. నాగన్నది కూడా అట్లే పెరుక్కొన్నారు. ఎంగటప్ప మాత్రానికి బీడీలు కట్ట అగ్గిపెట్టి కట్ డ్రాయర్లో ఆయప్ప మాను కింద పెట్టుకున్నాడంట! ఈయప్ప ముందే రెండుసార్లు కొండకు వచ్చి పోయినాడు అందుకే తెలివి చేసినాడు. ఆయప్పవి మిగిలినాయి. మెటికిలు ఎక్కేటప్పుడు నాగన్న ఊరికే ఉండేదిలే కొండంతా పారజూస్తా ఎదో ఒకటి చెబతానే ఉంటాడు. ‘తిరపతి కొండన మనకు పావలా బాగం వస్తుంది. దాని ఆనవాలు ఇబుటోల్లకు తెలియక గమ్మునుండారు. అది ఎట్లంటే ముందు కాలాన సామి అడివి మార్గాన తిరగతా ఉంటె దినానికి మూడు జతల చెప్పులు అరిగిపోయేవంట. పతిరోజూ మూడు జతల మెట్లు కుట్టకపోయి ఇచ్చేవాల్లంట మనోల్లు. ఎంగట్రమణ సామికి పెండ్లి పెట్టుకున్నారు. చెప్పులు కుట్టే ఆయప్పకు జరం వొచ్చి మూర్తం టయానికి ఇవ్వలేక పెండ్లి అయిపోనంక చెప్పులు కుట్టకపోయి ఇచ్చినాడంట. మూర్తం టయానికి చెప్పులు బిన్నతేలేదని నువ్వు ఎన్ని మెట్లు కుట్టిన నీకు మెట్టు కరువైతుంది అని ఆ దేవుడు శపించినాడు. అందుకే కుట్టేవోనికి మెట్టు కరువు అనేది. ఇప్పుడు కూడా దినామూ మన మాదిగోడు జత మెట్లు కుట్టకపోయి ఆడ పెట్టాల అందుకే కొండన మనకు పావలా బాగం వస్తుంది’ అనే! అయితే ‘మనం దీని గురించి సెరియ తీసుకోవాల్సిందే’ అని ఎకసక్కలాడిరి. సద్ది మూట్లు మోయాలంటే బరువు అదే కడుపులో ఉంటే అంత బరువు ఉండదని నడన అందరూ కూసోని తినేస్తిమి. కొండెక్కి గుండ్లు కొట్టుకొని ఆ దేవుని దర్శనం బాగా చేసుకుంటిమి. గుళ్లో నుండి బయట పన్నాము. లింగమ్మ, సరోజమ్మ.. జయక్క యాడికిపోతే ఆడికి పోయేది ఎనకాలే వక్కాకు కోసం. ఎంగటప్ప యాడికి పోతే ఆడికి నాగన్న రమనన్న బంట్రోతులే గతం బీడీల కోసం పోయేది. అవి ఆయప్ప సామాన్లో పెట్టుకోనున్నివైనా సరే వాల్లు ఇడిసిపెట్లా. ఇదే తంతు ఇంటికి వచ్చిందంక. మా జయక్క మాత్రానికి వక్కాకు మిగిల్చినందుకు ఎంగట్రమణ సామి పటం తెచ్చుకుంది పూజించుకోను! (చదవండి: అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం! ) -
అన్నింటిలో కన్నా అన్నదానమే గొప్ప దానం!
పూర్వం ‘విద్యానగరం’ అను పట్టణంలో కుబేర వర్మ అను గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతని వద్ద అపారమైన సంపద ఉండేది. అదంతా తన పూర్వీకుల నుండి సంక్రమించిందే. తన వద్ద ఉన్న సంపదనంతా దానధర్మాలు చేసి తాను ఒక అపర కర్ణుడిగా పేరు సంపాదించుకోవాలనే కీర్తి కాంక్ష కలిగింది అతనికి. ఆ ఉద్దేశంతోనే అడిగిన వారికి లేదనకుండా ధన, కనక, వస్తు, వాహనాలను దానం చేస్తూ వచ్చాడు. అంతేకాదు గుళ్ళు గోపురాలు కట్టించి వాటి మీద తన పేరు చెక్కించుకున్నాడు. తాను చేసిన ప్రతి దానం అందరికీ తెలియాలని తాపత్రయపడ్డాడు. అలా పూర్వీకుల ఆస్తిని దానం చేసి అతను కోరుకున్నట్టుగానే అపారమైన కీర్తిని సంపాదించుకున్నాడు. అది దేవలోకానికీ చేరింది. ఈ విషయంలో దేవలోకం కుబేర వర్మను పరీక్షించాలనుకుంది. ఒకసారి ఒక సన్యాసి కుబేర వర్మ వద్దకు వచ్చి ‘నాకు ఆకలిగా ఉంది. మూడు రోజులైంది తినక కాస్త భోజనం పెట్టించండి’ అని అడిగాడు. అందుకు కుబేర వర్మ నవ్వి ‘అన్నదానం ఏముంది.. ఎవరైనా చేస్తారు. మీకు వెండి.. బంగారం.. డబ్బు.. ఏం కావాలన్నా ఇస్తాను. అంతేగాని ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసి నా ప్రతిష్ఠ తగ్గించుకోను. అన్నమే కావాలంటే ఇంకో ఇంటికి వెళ్ళండి’ అని చెప్పాడు. సన్యాసి ‘నేను సన్యాసిని. నాకెందుకు అవన్నీ? భోజనం లేదంటే వెళ్ళిపోతాను’ అంటూ అక్కడి నుండి కదిలాడు. పక్క వీథిలోని దేవదత్తుడి ఇంటికి వెళ్లాడు ఆ సన్యాసి. దేవదత్తుడు సామాన్య కుటుంబీకుడు. గొప్ప దయా గుణం కలవాడు. ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టేవాడు. అంతేకాదు సాటివారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు. తను చేసే దానధర్మాల వల్ల తనకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఏనాడూ ఆశించలేదు. అలాంటి దేవదత్తుడి ఇంటికి వచ్చిన సన్యాసి తనకు ఆకలిగా ఉందని.. భోజనం పెట్టించమని కోరాడు. దేవదత్తుడు ఆ సన్యాసిని సాదరంగా ఆహ్వానించి కడుపునిండా భోజనం పెట్టించాడు. అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు సన్యాసి. కొంతకాలం తర్వాత వయసు మీద పడి దేవదత్తుడు చనిపోయాడు. ఆ తర్వాత కుబేర వర్మ కూడా చనిపోయి స్వర్గం చేరుకున్నాడు. అక్కడ స్వర్గంలో.. చాలామందితో పాటు తనకంటే ముందుగానే చనిపోయిన దేవదత్తుడూ ఉన్నాడు. ప్రథమస్థానంలో ప్రత్యేక ఆసనంపై కూర్చొని. కుబేర వర్మకు పదకొండవ స్థానం లభించింది. అది సహించలేని కుబేర వర్మ మండిపడుతూ దేవదూతలతో వాగ్వివాదానికి దిగాడు.. ‘నా ముందు దేవదత్తుడెంత? మా పూర్వీకులు సంపాదించిన అపార సంపదనంతా ప్రజలకు పంచిపెట్టాను. ధన,కనక, వస్తు, వాహనాలు దానం చేశాను. అలాంటి నాకంటే పట్టెడన్నం పెట్టిన దేవదత్తుడు గొప్పవాడు ఎలా అవుతాడు? అసలు నాకంటే ముందున్నవాళ్లంతా ఎవరు?’ అంటూ. అందుకు దేవదూతలు ‘అందరికంటే ముందున్న దేవదత్తుడు ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాడు. అన్నిటికన్నా అన్నదానం గొప్పది. అతనిలో ఎలాంటి స్వార్థం లేదు. కేవలం జాలి,దయ, ప్రేమతోనే అన్నార్తుల ఆకలి తీర్చాడు. సాటివారికి సహాయం చేశాడు. ఇకపోతే మిగిలినవారిలో.. ఆసుపత్రులను కట్టించి ఎంతోమంది రోగులకు ఉపశమనం కలిగించినవారు కొందరు. వికలాంగులను ఆదరించి పోషించిన వారు మరికొందరు. ఇంకా కొందరు చెరువులు తవ్వించి ప్రజలకు, పశువులకు నీటి కొరత లేకుండా చేశారు. వాటన్నిటినీ ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండానే చేశారు. కాబట్టే నీకంటే ముందున్నారు. ఇక నువ్వు కీర్తి కోసం స్వార్థంతో మీ పూర్వీకుల సంపదనంతా అపాత్రదానం చేశావు. అందుకే నీకు పదకొండవ స్థానం లభించింది. ఎప్పుడైనా దానం అనేది గుప్తంగా ఉండాలి. కాని నువ్వు అలా చేయలేదు’ అని చెప్పారు. అంతా విన్నాక కుబేర వర్మకు జ్ఞానోదయం అయింది. తన పూర్వీకులు సంపాదించిన సంపదనంతా కీర్తి కాంక్షతో దుర్వినియోగం చేసినందుకు పశ్చాత్తాపపడ్డాడు. (చదవండి: ప్రపంచంలో చిట్టచివరి గ్రామం ఏదో తెలుసా! ఎక్కడుందంటే..) -
సహజ జీవన గమనం! అదే అత్యంత శుభదాయకం
మనిషి ఆనందంగా ఉండాలంటే ఎలా ఉండాలి. ఏవిధంగా ప్రవర్తించాలి అని తెలిపే జైన్ కథలు మానావళి ఓ గోప్ప వరం. అవి మనిషి బుద్ధిని వికసింప చేసి ఆలోచింప చేసేవిగా ఉంటాయి. ధర్మా ధర్మాలని చాలా చక్కగా విపులీకరించి ఎంతటి చిన్నపిల్లవాడికైన సులభంగా అర్థమవుతాయి. ఇలాంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఈ కథలు మనస్సు ప్రశాంతతకు ఓ చక్కటి ఔషధంలా ఆహ్లాదాన్ని ఇస్తాయి ఈ జైన్ కథలు. ఈ రోజు చెప్పే జైన్ కథ దేని గురించి తెలుసా..! అసలైన మహత్యం అంటే.. జెన్ గురువు ‘బన్కెయి’ ఓ నాడు బౌద్ధ విహారంలో ప్రవచనం చేస్తుండగా వేరే బౌద్ధ శాఖకు చెందిన ఒకాయన అక్కడకు వచ్చి సభలో పెద్దగా మాట్లాడుతూ అలజడి సృష్టించాడు. బన్కెయికి వచ్చిన మంచిపేరంటే అతడికి అసూయ. బన్కెయి మాట్లాడటం ఆపి గొడవకు కారణం ఏమిటని అడిగాడు. వచ్చిన ఆ ఆగంతకుడు అన్నాడు: ‘మా శాఖను స్థాపించిన గురువు ఎటువంటి గొప్ప మాహాత్మ్యాలు చెయ్యగలడంటే, నదికి ఇవతల గట్టు మీద కుంచె పుచ్చుకొని ఉండి, అవతల గట్టుమీద ఎవరైనా అట్ట పుచ్చుకొని ఉంటే, దానిమీద ఆ కుంచెతో బొమ్మ గీయగలడు. నీవు అలాంటి మహత్తు చెయ్య గలవా?’ బన్కెయి సమాధానం చెప్పాడు: ‘అలాంటి తంత్రం మీ గురువు చెయ్యగలడేమో కాని, అది జెన్ పద్ధతి కాదు. నేను చేసే మహత్తు ఏమిటంటే, నాకు ఆకలైనప్పుడు తింటాను. దాహమైనప్పుడు తాగుతాను.’ అదే అత్యంత శుభదాయకం ఓ ధనవంతుడు, జెన్ గురువు ‘సెన్గయి’ని అడిగాడు, తన వంశాభివృద్ధికి శుభదాయకమైన వాక్యం ఒకటి వ్రాసివ్వమనీ, దాన్ని తరతరాలుగా దాచి ఉంచుకొంటామనీ! సెన్గయి పెద్ద కాగితం ఒక దాన్ని తెప్పించుకొని, దాని మీద ఇలా రాశాడు: ‘తండ్రి చనిపోతాడు, కొడుకు చనిపోతాడు, మన వడు చనిపోతాడు. ’ధనవంతుడికి కోపం వచ్చింది. ‘నేను నిన్ను నా కుటుంబం ఆనందంగా ఉండటానికి ఏదైనా రాసివ్వమని అడిగాను. నీవేంటి ఇలా నన్ను ఎగతాళి పట్టిస్తున్నావు?’ ‘ఇందులో ఎగతాళి ఏం లేదు’ వివరించాడు సెన్గయి. ‘నీవు చనిపోకముందే నీ కొడుకు చనిపోయినాడనుకో. అది నిన్ను ఎంతగానో బాధిస్తుంది. నీకంటే, నీ కొడుకు కంటే ముందే, నీ మనవడు చనిపోయినాడనుకో, మీ ఇద్దరి గుండె పగిలిపోతుంది. అలా కాకుండా, నీ కుటుంబం తరతరాలుగా నేను పేర్కొన్న వరుసలో గతించినారనుకో, అది సహజమైన జీవన గమనం అవుతుంది. దీన్ని నేను శుభదాయకం అంటాను.’ – దీవి సుబ్బారావు -
మిత్రద్రోహికి మించిన ద్రోహి! కుష్టి వ్యాధి కంటే భయంకరమైన వ్యాధి..
బుద్ధుడు ధర్మ ప్రబోధం చేస్తూ, సుబాహుడనే ఓ రైతు కథ చెప్పాడు. పూర్వం ఒక గ్రామంలో సుబాహుడు అనే రైతు ఉండేవాడు. అతనికి అడవిని ఆనుకుని పంటపొలం ఉంది. ఒకరోజున పొలం దున్ని నాగలి విప్పాడు. ఎద్దుల్ని పచ్చికలో తోలాడు. తాను పొలం పనుల్లో మునిగిపోయాడు. చాలాసేపటికి గమనిస్తే ఎద్దులు కన్పించలేదు. వాటిని వెతుక్కుంటూ అడవిలోకి పోయాడు. అడవి మధ్యకు చేరాడు. దారి తప్పాడు. ఆకలి వేసింది. అక్కడ కొండ అంచున తిందుక వృక్షం కనిపించింది. మెల్లగా చెట్టెక్కాడు. ఒక కొమ్మ మీదికి చేరి పండ్ల గుత్తిని అందుకోబోయాడు. కొమ్మ విరిగి బావి లాంటి పెద్ద గుంటలో పడ్డాడు. బయటకు రాలేకపోయాడు. అలా రోజులు గడిచాయి. నీరసించి శక్తి సన్నగిల్లి మూలుగుతూ పడి ఉన్నాడు. ఆ మరునాడు ఉదయం తిందుక ఫలాల కోసం ఒక పెద్ద తోక వానరం అక్కడికి వచ్చింది. గుంటలోంచి వచ్చే మూలుగును వింది. జాలి పడింది. అరచి పిలిచింది. వాడు కళ్ళు తెరచి చూశాడు. ‘‘మానవా! భయపడకు నిన్ను కాపాడుతాను’’ అంది. ఆ పక్కనే ఉన్న రాతిబండలు గోతిలోకి జారవిడిచి మెట్లుగా పేర్చింది. గోతిలోకి దిగి, అతణ్ణి భుజాన ఎత్తుకుని పైకి చేర్చింది. ఆకు దొన్నెలో నీరు తెచ్చింది. తిందుక ఫలాలు తినిపించింది. వాడు నెమ్మదిగా శక్తి తెచ్చుకున్నాడు. తన వివరాలు చెప్పాడు. ‘‘సుబాహూ.. చింతిల్లకు.. నా వీపున ఎక్కి భుజాలు పట్టుకో’’ అంది. సుబాహుని తీసుకుని అతని గ్రామంవైపు సాగింది. కొంతసేపటికి అలసిపోయింది. ‘‘సుబాహూ... అలసటగా ఉంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను. ఈ ప్రాంతంలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, చిరుతలు తిరుగుతూ ఉంటాయి. నీవు జాగ్రత్తగా చూస్తూ ఉండు. అవసరమైతే నన్ను లేపు’’ అని, ఆ ప్రక్కనే ఉన్న చెట్టుకి ఆనుకుని కునుకు తీసింది వానరం. ‘ఈ వానరం బలంగా ఉంది. దీని మాంసం చాలా రుచిగానూ ఉంటుంది. దీన్ని చంపి తిన్నంత తిని మిగిలినది దార్లో తింటూ పోవచ్చు.’ అనే దురాలోచన కలిగింది సుబాహుకు. వెంటనే పక్కనే ఉన్న రాయి ఎత్తి తలమీద కొట్టబోయాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల చేయి వణికింది. గురి తప్పింది. వానరం లేచింది. సుబాహు వైపు చూసింది. వాడు గడగడ వణికిపోతున్నాడు. దానికి జాలి వేసింది. ‘‘మానవా! అన్నిటి కంటే పెద్దనేరం మిత్రద్రోహం. అయినా, నేను ధర్మాన్ని తప్పను. నిన్ను నమ్మను. నేను చెట్లకొమ్మల మీదినుండి వెళ్తూ ఉంటాను. నీవు నేలమీద ఆ వెనుకే రా.. నీ గ్రామానికి చేరుస్తాను’’ అంది. అలా అడవి చివరకు చేర్చి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాడు ఆ నీటిలో దిగి దాహం తీర్చుకున్నాడు. స్నానం చేశాడు. ఆ తరువాత వాడి శరీరంలో మార్పులు వచ్చాయి. ఒళ్ళంతా బొబ్బలు లేచాయి. అవి మానని గాయాలుగా మారాయి. సుబాహు కుష్ఠువ్యాధి పీడితుడయ్యాడు’’ అని చెప్పి–‘‘భిక్షువులారా! కుష్ఠువ్యాధి కంటే భయంకరమైంది మేలు చేసిన వారికి కీడు చేయడం. మిత్ర ద్రోహిని, చేసిన మేలు మరిచే వారిని చూసి అసహ్యించుకోవాలి. వ్యాధిగ్రస్తుల్ని, రోగాల్ని చూసి కాదు’’ అన్నాడు. – బొర్రా గోవర్ధన్మిత్రధర్మం (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!) -
సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా హయిగా ఉంటుంది!
సద్ధర్మంఅది శ్రావస్తి నగరానికి దాపున ఉన్న జేతవనం. ఆ వనం మధ్యలో ఉన్న ఆనందబోధి వృక్షం కింద ప్రశాంత వదనంతో కూర్చొని ఉన్నాడు బుద్ధుడు. భిక్షు సంఘం ఆ చెట్టు చల్లని నీడలో కూర్చొని ఉన్నారు. వారు ధరించిన కాషాయ వస్త్రాలు కాంతిమంతంగా ఉన్నాయి. ఆ వెలుగు వారి దేహం మీద పడి ప్రకాశిస్తోంది. ‘‘భిక్షువులారా! మనం ఎలాంటి ధర్మాన్ని తెలుసుకోవాలి? ఎలాంటి ధర్మాన్ని సేవించాలి? ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి? అని ఆలోచించాలి’’ అన్నాడు గంభీరంగా. భిక్షువులందరూ ప్రశాంతంగా వినసాగారు. మనం పాటించే ధర్మం నాలుగు విధాల ఫలితాలనిస్తుంది. అందులో మొదటిది విషపదార్థం కలిసిన చేదు గుమ్మడికాయ రసం లాంటిది. దీని రుచీ, వాసన, రంగూ ఏదీ బాగోదు. పైగా తాగితే ప్రమాదం కూడా. అలాగే... వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దుఃఖాన్ని ఇచ్చే ధర్మం అలాంటిది.అలాంటి కుశలం ఇవ్వని ధర్మాన్ని గ్రహించి దూరంగా ఉండాలి. ఇక, రెండోరకం ధర్మాచరణ బంగారు పాత్రలో ఉన్న కుళ్ళిన పదార్థం లాంటిది. ఈ పదార్థం రంగు, రుచి, వాసనలు ఇంపుగా ఉంటాయి. పైగా బంగారు పాత్రలో ఉంది. కానీ, దీన్ని సేవిస్తే అనారోగ్యం కలిగి, ప్రాణాలకే ముప్పు. వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘకాలంలో దుఃఖాన్ని ఇచ్చే ధర్మాచరణ ఇలాంటిది. మరి, భిక్షువులారా! ఒక చెక్క పాత్ర ఉంది. దానిలో ఎన్నో మూలికలతో మరిగిన మూత్రం ఉంది. పాండు రోగానికి అది మంచి ఔషధం. దాని రంగు, రుచి, వాసనలు ఏవీ బాగోలేదు. అయినా దాన్ని సేవిస్తే రోగం తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది. అలాగే... వర్తమానంలో దుఃఖాన్ని, దీర్ఘకాలంలో సుఖాన్ని ఇచ్చే ధర్మాచరణ కూడా ఇలాంటిదే!’’ అన్నాడు. ‘‘అలాగే... ఒక పాత్రలో పెరుగు, తేనె, నెయ్యి కలిపిన బెల్లం రసం ఉంది. అది కడుపులో బాధల్ని హరించే ఔషధం. ఆ బెల్లం రసం రంగు బాగుంటుంది. రుచి బాగుంటుంది. వాసన కూడా బాగుంటుంది. అది చేసే మేలు కూడా బాగుంటుంది. ఇలా వర్తమానంలో సుఖాన్ని, దీర్ఘ కాలంలో కూడా సుఖాన్ని ఇచ్చేది సద్ధర్మం.’’ ‘‘భిక్షువులారా! సద్ధర్మం అనేది శరత్కాలంలోని సూర్యుని కాంతి లాంటిది. అది ప్రకాశిస్తుంది. మనిషి దుఃఖాన్ని పారద్రోలుతుంది’’ అని చెప్పి, అందరి వంకా ఓసారి చూశాడు. అందరి మనస్సుల్లోని ఉషస్సు వారందరి ముఖాల్లో తేజస్సుగా ప్రతిఫలిస్తోంది! – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: సద్ధర్మం! శరత్కాలంలోని సూర్యుని కాంతిలా ప్రకాశిస్తూ నేఉంటుంది!) -
ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!
అది మండు వేసవి. అప్పుడే సూర్యోదయం అయింది. లేత కిరణాలు సోకి సాలవృక్షం పచ్చదనాన్ని వెదజల్లుతూ పరవశించిపోతోంది. ఆ అడవిలో తానే ఎత్తైన వృక్షాన్ని అనే గర్వంతో కూడిన ఆనందం అది. అంతలో..ఒక కాకి ఎగిరి వచ్చి ఆ వృక్షం కొమ్మల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో వాలింది. దాని ముక్కున పండిన మాలువా పండు ఉంది. ఆ పండును కాలివేళ్ళతో తొక్కి పట్టి, గుజ్జునంతా తినేసింది. ముక్కును అటూ ఇటూ రాచి, వాలుగా చూసి, ‘కా..కా’’ అంటూ ఎగిరి వెళ్ళిపోయింది. అలా కాకి వెళ్ళిపోగానే, తన మీద వదిలి వెళ్ళిన మాలువా విత్తనాన్ని గమనించిన ఆ సాలవృక్షం ఆలోచనలో పడింది. భయం పుట్టి వణికింది. అయినా తనని తాను సమాధాన పరచుకుని శాంతించింది. వేసవి ముగిసింది. మాలువా విత్తనం టెంకె పగిలింది. దానిలోంచి నిగనిగలాడే విత్తనం బయటకొచ్చి పడింది. ఆ విత్తనాన్ని చూడగానే సాలవృక్షానికి వేళ్ళు కుంగినట్లయింది. పెనుగాలికి కూలినట్లు భావించింది. కార్చిచ్చుకి తగలబడి బూడిద అయినట్లు అనిపించింది. నిలువెల్లా వణకసాగింది. మొత్తుకోసాగింది. అప్పుడు ఆ వృక్షం చుట్టూ ఉండే ఇతర వృక్ష మిత్రులంతా ‘‘దుఃఖ కారణం ఏమిటి?’’ అని అడిగారు. ‘‘సాలవక్షం విషయం చెప్పింది. అప్పుడు ‘‘సాలవృక్షమా! చింతించకు. అనవసరంగా భయపడుతున్నావెందుకు? ఆ విత్తనాన్ని నెమలి తినవచ్చు. జింక నమిలి వేయవచ్చు. కార్చిచ్చు కాల్చవచ్చు. ఎవరైనా మనిషి చూసి తీసుకుపోవచ్చు. ఎండకు ఎండిపోవచ్చు. నీడలో నాని కుళ్ళిపోవచ్చు. చెద పురుగులు తినొచ్చు. చీమలు తీసుకుపోవచ్చు. ఇన్ని అవరోధాలు ఉన్నాయి. వీటన్నింటినీ దాటుకుని అది మొలకెత్తలేదు. ఒకవేళ మొలకెత్తినా వెంటనే వానలు ఆగిపోతే, మొలకలోనే మాడిపోవచ్చు. కాబట్టి లేనిపోని భయాన్ని ఊహించుకుని వణికిపోకు’’ అంటూ ధైర్యం చెప్పాయి. తోటి వృక్షాల ఓదార్పుకు ఆ సాలవృక్షం ధైర్యాన్ని తెచ్చుకుంది. కానీ ఆ విత్తనం మొలవడానికి ఏ అవరోధం కలగలేదు. ఆ ఏడాది సకాలంలో వర్షాలు పడడంతో చక్కగా మొలకెత్తింది. వేగంగా పెరిగింది. పెద్ద పెద్ద తమలపాకుల్లా లేత పచ్చని ఆకుల తీగపైకి లేచింది. దాన్ని చూసి సాలవృక్షం లబోదిబోమంది. మరలా వృక్షాలన్నీ– ‘‘నీవు మహావృక్షానివి. అది చిన్న తీవె. అయినా ఆ బుజ్జి కాడ ఎంత ముచ్చటగా, అందంగా ఉందో, అది నీకు మంచి అలంకారంగా ఉంది. ఈ చిన్న తీవె నిన్నేమి చేయగలదు’’ అని మరలా ధైర్యం చెప్పాయి. వాటి మాటలు విని సాలవృక్షం కొంత సాంత్వన పడింది. కానీ.. అతి తక్కువ కాలంలోనే ఆ తీగ బలపడింది. దాని బెరడును చీల్చుకుని వేళ్ళను లోనికి పంపింది. ఆ వృక్ష సారాన్నే పీల్చుకోసాగింది. చివరికి చెట్టంతా కమ్ముకుపోయింది. సారాన్ని కోల్పోయిన సాలవృక్షం ఎండి.. క్రమంగా జీవాన్నీ కోల్పోయింది. ఒకప్పుడు అడవిలో తిరిగే మనుషులు ఏదైనా విషయం గురించి మాట్లాడుకుంటూ ‘‘ఆ పెద్ద సాలవృక్షం దగ్గర ఆ మహా సాలవృక్షం పక్కన..’’ అని ఆనవాళ్ళను చెప్పుకుంటూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు.. ఆ మాలువా పొద పక్కన’’ అంటూ చెప్పుకోసాగారు. చెడ్డవారిని చేరదీయడం వల్ల, చెడ్డతనం పట్ల ఉపేక్ష భావంతో ఉండటం వల్ల అది మన ఉనికికే చేటు తెస్తుంది. మనిషి మనసులో చెడు కోరికలు రేగినప్పుడు.. ‘‘ఇది చిన్న కోరికే కదా! ఈ ఒక్కసారికీ ఈ పని చేసి ఇక ఆ తరువాత చేయకుండా ఉంటే మనకు వచ్చే నష్టం లేదు. కలిగే కష్టమూ లేదు’’ అనుకుని ఆ చెడ్డ కర్మలకు పూనుకుంటారు. కానీ, ఆ తర్వాత వాటిని మానడం అటుంచి, మరింత లోతుకు కూరుకుపోతారు. కామ రాగాలన్నీ ఇలానే ప్రవేశించి, పెరిగి పెరిగి మన ఉనికికే ప్రమాదాన్ని తెస్తాయి. వాటిని మనస్సులో పుట్టకుండా చేసుకోవాలి. లేదా పుట్టిన వెంటనే నివారించుకోవాలి. ఆపేక్షతో ఉపేక్ష చూపితే మన ఉనికికే నిక్షిప్తం చేస్తాయి. ఇది కామరాగాల పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో బుద్ధుడు చెప్పిన కథ ఇది. ఆ రోజుల్లో ‘మోక్షానికి కామం కూడా ఒక మార్గమే’ అని చెప్పే సాధువులు కొందరు ఉండేవారు. వారికి కనువిప్పు కలిగించడం కోసం, బుద్ధుడే ఈ కథ చెప్పాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: పుట్టిన మూడు రోజులకే మిస్సింగ్..ఇప్పటికీ అంతు తేలని ఓ మిస్టరి గాథ!) -
యూట్యూబ్ క్రియేటర్స్ కి బిగ్ షాక్.. ఆ ఫ్యూచర్ తొలగింపు..!
-
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
కథ చెబుతాం ఊ కొడతారా..
చిన్నప్పుడు ‘అనగనగా..’అంటూ అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పే రోజులు గుర్తున్నాయా? కథను ఊరిస్తూ.. ఊహించేలా చెబుతుంటే ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసేవాళ్లం. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’గురించి విని నేర్చుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. దృశ్య రూపంలో కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. అందుకే మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యం అనన్య సామాన్యం. అయితే నేటి కంప్యూటర్ యుగంలో ఆ అదృష్టం పిల్లలకు పూర్తిగా దూరమైంది. కెరీర్ పరుగులో పడిపోయి.. పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ తల్లిదండ్రులకు దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లలు కథలంటే గుగూల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ చదువుపై వారికి ఆసక్తి కలిగించి.. తద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని, నిద్రాణంగా దాగి ఉన్న కళలను వెలికి తీసే ఉద్దేశంతోనే పుట్టిందే స్టోరీ టెల్లింగ్ డే. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది. – విశాఖపట్నం డెస్క్ నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా.. వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా యాజమాన్యాలకు అభ్యర్థిస్తున్నారు . ఈ పరిస్థితుల్లో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ‘మియావాకీ’ అలా మొదలైంది కథల ద్వారా పిల్లలను చదువు వైపు మళ్లించడం సులభమని ఉపాధ్యాయురాలు, ప్రముఖ స్టోరీ టెల్లర్ షింపీ కుమారి అంటున్నారు. జార్ఖండ్లోని ధన్బాద్ నివాసి అయిన షింపీ కుమారి ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఉద్యోగ రీత్యా 2006లో విశాఖ వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేట్ పాఠశాలలో సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ద్వారకానగర్లోని పౌరగ్రంథాలయం కమిటీ కార్యదర్శి డీఎస్ వర్మ చొరవతో 7 నెలల కిందట మియావాకీ స్టోరీ టైమ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పౌర గ్రంథాలయంలో నెలలో రెండు రోజులు ఒకటి నుంచి 4వ తరగతి పిల్లలకు ఉదయం 10.15 నుంచి 11.30 వరకు, 5వ తరగతి నుంచి 8 తరగతి చదివే పిల్లలకు 11.15 నుంచి 12.30 వరకు కథలు చెప్పడం ప్రారంభించారు. తొలుత షింపీ కుమారి ఒక్కరే పిల్లలకు చక్కని కథలు చెబుతూ.. వివిధ అంశాలు వివరించేవారు. ఆమె తలపెట్టిన ఈ కార్యానికి తర్వాత నగరానికి చెందిన స్టోరీ టెల్లర్, వాయిస్ ఆరి్టస్ట్ సీతా శ్రీనివాస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఎడ్యుకేటర్ శ్రావ్య గరుడ, ఉపాధ్యాయిరాలు రబియా నవాజ్ తోడయ్యారు. వారు స్వచ్ఛందంగా తమ సేవలందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతలో భాగస్వాములయ్యారు. ఒక్క స్టోరీ టెల్లింగ్ ఎన్నో కళలను వెలికి తీస్తుందని షింపీకుమారి తెలిపారు. స్టోరీ టెల్లింగ్ క్లాస్ పూర్తయిన ప్రతిసారీ తాము పిల్లలతో డ్రాయింగ్, క్రాఫ్టŠస్, సింగింగ్, పప్పెట్రీ, ఒరిగామి తదితర కృత్యాలు పిల్లలతో చేయిస్తామని.. తద్వారా పిల్లల్లో తాము అనుకున్నది వ్యక్తీకరించే స్వతంత్రత వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయం మూడో అంతస్తులోని పిల్లల విభాగంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. కథ అంటే ఓకే అంటారు సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లలను అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఓ కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రలను ఊహించుకుంటారు. అందుకే కథలను అందరూ ఇష్టపడతారు. కెనడాలో మూడేళ్ల కిందట స్కూల్ కరిక్యులమ్లో స్టోరీ టెల్లింగ్ను చేర్చారు. మన సంప్రదాయంలో అది ఎప్పట్నించో ఉంది. చరిత్ర, పురాణాలను కథల ద్వారానే మనం చెప్తాం కదా.. ఊహాశక్తితో పాటు భాషా పరిజ్ఞానం కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పే పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఓ కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. మాతృభాషతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. కథ చెప్పడం ఓ కళ శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ. కథల్లోని అంశాలకు తగ్గ ట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇప్పటి స్టోరీ టెల్లర్స్ వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారు. ఎంచుకున్న కథతోపాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఓ స్టోరీ టెల్లర్ నైపుణ్యాన్ని తెలియజేస్తా యి. కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. కథల్లా పాఠాలు కథలు వింటూ పాఠాలు వినడం.. కథలే పాఠాలైపోవడం నాకెంతో నచ్చింది. ఇంతకు ముందు చదివింది గుర్తుండేది కాదు. ఇప్పుడు మా బుక్స్లోని లెసన్స్ కథల్లా మారిపోయాక.. బాగా గుర్తుంటున్నాయి. మార్కులు కూడా బాగా వస్తున్నాయి. – బి.తనూశ్రీ, 3వ తరగతి, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ క్లాసెస్ బాగుంటున్నాయి స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ చాలా బాగుంటున్నాయి. లైబ్రరీలో కొత్తకొత్త పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. బుక్స్ రీడింగ్ వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కథలు నేర్చుకోవడంతో పాటు చెప్పడం అలవాటు చేసుకుంటున్నా.. – సూర్య విహాన్ వర్మ, 3వ తరగతి, టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అద్భుతాలు చేయవచ్చు కథలు ఎవరికైనా నచ్చుతాయి. అవి ఏ వయసు వారికైనా గుర్తుండిపోతాయి. కథ, కథలు చెప్పే విధానంలోను నవ్యత ఉంటే అవి మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. మేం చేస్తున్నది అదే. కథల ద్వారా చిన్ని మనసుల్లో నైపుణ్యాన్ని చొప్పిస్తున్నాం. ఈ నెల 26న మియావాకీ స్టోరీటైమ్లో మళ్లీ కలుద్దాం. – సీతా శ్రీనివాస్, స్టోరీ టెల్లర్, వాయిస్ ఆర్టిస్ట్ విద్యార్థులకు మేలు చేస్తుంది స్టోరీ టెల్లింగ్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా కథలా చెబితే వారికి ఇట్టే గుర్తుండిపోతుంది. ఒక్క చదువే కాదు.. సరైన రీతిలో భావవ్యక్తీకరణ అనేక విధాలుగా జీవితంలో ఉపయోగపడుతుంది. స్టోరీ టెల్లింగ్ ద్వారా ఆ నైపుణ్యం పిల్లలకు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. – శ్రావ్య గరుడ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) ఎడ్యుకేటర్ -
మీ పిల్లలు స్మార్ట్ ఫోన్కు అతుక్కుపోతున్నారా?
‘అనగనగా’ అనే కథలకంటే ‘కొకోమెలెన్, సూపర్ జోజో’ అంటేనే ఊకొడుతున్నారు ఇప్పటి బుజ్జాయిలు. కార్టూన్ వీడియోలను, టామ్ అండ్ జెర్రీ కథలను ఆస్వాదిస్తూ.. అనుకరిస్తూ పెరుగుతున్నారు! ఈ ‘స్మార్ట్’ చిచ్చరపిడుగులు. సరైన పద్ధతిలో సాంకేతికతను స్వీకరించేలా చేయడమే ఈ తరం తల్లిదండ్రులకున్న టఫ్ టాస్క్! బలవంతంగా ఫోన్ లాక్కుని.. వాళ్లకు బోరుకొట్టకుండా సమయాన్ని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. మరెలా? సింపుల్.. మీ స్మార్ట్ ఫోన్లో ఈ కిడ్స్ యాప్స్ను డౌన్లోడ్ చేస్తే సరి. మెంటల్అప్ యాప్ ఈ ఎడ్యుకేషనల్ లెర్నింగ్ యాప్.. అన్ని వయసుల వారికీ వినోదభరితమైన సైంటిఫిక్ లెర్నింగ్ గేమ్లను అందిస్తుంది. ఇది క్రిటికల్ థింకింగ్ గేమ్స్, డెసిషన్ మేకింగ్ గేమ్స్, అనేక ఇతర సూపర్ బ్రెయిన్ కాగ్నిటివ్ గేమ్స్ను ఉపయోగించి పిల్లల మెదడుకి పదునుపెడుతుంది. 123 కిడ్స్ అకాడమీ అక్షరాలు, సంఖ్యలు, పదాలు, రంగులు వేయడం, అద్భుతమైన కథలు, నర్సరీ రైమ్స్.. ఇలా అన్నింటినీ ఈ యాప్ అందిస్తుంది. ఆహ్లాదకరంగా, ఆకర్షణీయంగా వీటన్నింటినీ నేర్చుకోవచ్చు. ఎడ్యుకేషనల్ గేమ్స్, ఇంటరాక్టివ్ వర్క్షీట్స్, క్విజ్ వంటివెన్నో ఇందులో ఉంటాయి. ముస్సిల మ్యూజిక్ స్కూల్ ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్ మ్యూజిక్, మ్యూజిక్ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్ నేర్పిస్తుంది. ఫోనిక్స్ జీనియస్ (ఐఫోన్, ఐప్యాడ్స్లో మాత్రమే) ఇది అక్షర శబ్దాలతో ఆంగ్ల పదాలను గుర్తించడంలో సహకరిస్తుంది. స్పష్టంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం నేర్పిస్తుంది. ఫోనెమిక్ అవగాహనను కల్పించడానికి, ఆంగ్లంలో మెరుగైన పద్ధతిలో కమ్యూనికేట్ చే యడానికి యూజ్ అవుతుంది. ముస్సిల మ్యూజిక్ స్కూల్ ఇది పిల్లలకు సంగీతం నేర్పిస్తుంది. పిచ్, రిథమ్, రీడింగ్ మ్యూజిక్, మ్యూజిక్ థియరీ.. ఇలా ప్రతి దాని మీద అవగాహన కలిగిస్తుంది. వాయిద్యాలు, వాయిద్య శబ్దాలు, లయ, శ్రావ్యతలను గుర్తించడం వంటి టెక్నిక్స్ నేర్పిస్తుంది. ఆసమ్ ఈట్స్ (ఐఫోన్లో మాత్రమే) ఈ యాప్..హె ల్దీ ఫుడ్ మీద చాలా వివరాలను అందిస్తుంది. జంక్ ఫుడ్కు దూరం చేస్తుంది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలతో పిల్లలకు వినోదభరితంగా ఆటలు ఆడిస్తూనే.. పోషకాహారం మీద అవగాహన కలిగిస్తుంది. స్మార్ట్ టేల్స్ (లెర్నింగ్ గేమ్స్) సైన్స్ , టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్ట్స్ను తేలికగా పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఈ యాప్. ఆహ్లాదకరమైన, వినోదాత్మకమైన పద్ధతిలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరిన్ని యాప్స్: ఖాన్ అకాడమీ కిడ్స్ (రెండేళ్ల తర్వాత వారికి) ఎబిసీ మౌస్, ఎపిక్(అన్ని వయసుల వారికి), డుయోలింగో(హైస్కూల్) నిక్ జూనియర్ (ప్రీస్కూల్), క్విక్ మ్యాథ్ జూనియర్(ఎలిమెంటరీ స్కూల్) స్విఫ్ట్ ప్లేగ్రౌండ్స్(కోడింగ్), సింప్లీ పియానో(పియానో నేర్చుకోవడానికి) -
నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా!
ఊరికే ఆ ద్వారం నుండి ఈ ద్వారం వరకు, ఈ ద్వారం నుండి ఆ ద్వారం వరకు ఇంటిలోనుండి బయటికి బయటి నుండి ఇంట్లోకి అలా పరిగెడుతూ ఉంటానా, తలుపు పక్కనున్ను బియ్యం గచ్చులో చేయి పెట్టి ఇంత బియ్యం జేబులోకి, మరింత బియ్యం నోట్లో వేసుకుని నములుతూ ఉంటే బియ్యం ఎంత తియ్యగా ఉండేదో. పచ్చి బియ్యమే అంత తియ్యగా ఉంటే ఇంటి బయట కట్టెల పొయ్యి మీద, మట్టి కుండలో వెలుతురూ, గాలి తగులుతూ గంజి వార్చి వండిన అన్నం ఇంకెంత రుచిగా ఉండాలి? గంజి అంటే గుర్తుకు వచ్చింది. నాకు ఊహ తెలిసి కార్టూన్ అనేది ఒకటి ఉంటుంది అని తెలుసుకున్న వ్యాఖ్యా-బొమ్మల తొలి కార్టూను గంజి మీదే. పొలీసాయన చాకలాయన్ని గద్దిస్తూ ఉంటాడు. ఏమిరా అప్పిగా ! నా నిక్కరుకి గంజి పెట్టి ఇస్త్రీ చేయమన్నానా, గంజి పెట్టలేదే?" "మా ఇంట్లో తాగనీకే గంజి లేదు దొరా, ఇక నీ నిక్కరకు ఏమని పెట్టేది?" అప్పుడు అది చూసి భలే నవ్వుకున్నాం కానీ కాస్త ఆకలి, కాస్త గంజి మెతుకులు అనే పెద్ద మాటలు బుర్రకు పట్టాకా’అయ్యో! అనిపించింది. అలా గంజి వార్చి వండిన వేడి వేడి అన్నంలో చాలా నెయ్యి పోసి, ఎర్రపప్పు , ఎర్రెర్ర ఆవకాయ ఊర్పు కొంచెం కలిపి చిన్న చిన్న ఆవకాయ ముక్కలని గిల్లి ముద్దలుగా కట్టి కథలు చెబుతూ తినిపించేది మా జేజి. పప్పన్నం అయ్యాక పాలు చక్కర అన్నమో లేదా పెరుగన్నంలో బెల్లం ముక్కలు కలిపి తినిపిస్తే దానితో స్వస్తి. కథల్లోకి అన్నం నంజుకుంటున్నామా. అన్నం లోకి కథలు నంజుకుంటున్నామా అనేది విషయం కానే కాదు అది నాంది. అన్నం బావుండేది. కథలూ బావుండేవి. అయితే ఆ చిన్నప్పుడు బావోనివి కూడా ఉంటాయని తెలీదు కాబట్టి, బావున్నవి అప్పుడు బావున్నాయనే విషయం కూడా తెలీదు. పెరిగి పెద్దయ్యాకా ఈ ఇంటి వంట ఈ ఇంటి వంట ఆ హోటలు వంట ఈ రెస్టారెంట్ వంట తినవలసి వచ్చినపుడు అక్కడ కూర బావుంటుంది, ఇక్కడ చారు బావుంటుంది, ఆ ఇంటి వాళ్ళు పచ్చడి బాగా చేస్తారు, మా ఇంట్లో మటన్ మహత్తరం అనే సింగులర్ అప్రిషియేషన్సే అమృతం అనే భావనకు దిగ పడిపోయా. ఒకసారి మధ్యాహ్నం ఆకలి సమయాన మదరాసులో ఒక హోటలు వైపు దారి తీశారు మహా గొప్ప చిత్రకారులు సురేష్ గారు. బయట వేడిగా ఉన్నా, లోపల గాలి చల్లగా వీస్తుంది. అరవ సర్వర్ గారు వచ్చి అరిటాకు పరిచారు. వరుసగా పదార్థాలు వడ్డిస్తూ ఉన్నారు. తినడం మొదలు పెట్టా, తఠాలున వెలిగింది రుచి అనేది. ఆ రుచికి నెమలీకమీది తడి పచ్చదనంలా ఉంది అరటి ఆకు తళ్ళెం. అరటి పొలం మీదికి పొగ మంచు వచ్చి కొబ్బరి కోరులా కురిసినట్లుగా ఉంది తెల్లని అన్నం. గంగమ్మ శివుడి నెత్తి మీది నుండి జాలువారుతుండగా ఒక పక్క పాయ కుంకుమ తడిసిన రంగులో అన్నాన్ని తడుపుతుంది చారు. మరో పాయ తెల్ల విభూదితో కలిసిన మజ్జిగ ధార. నక్షత్రాలు చాలా తెలుసు కానీ తెల్లని నెలవంక ఒకటేగా, నూనెలో వేగి వంకర తిరిగిన చల్ల మిరపకాయలన్నీ చంద్ర వంకలే! ఆ కూరా, ఈ పచ్చడి, అక్కడ అప్పడం, ఇక్కడ నెయ్యి, వేలు ముంచి నోటి దాకా ఎత్తిన తీపి... ఏది తిన్నా బావుందే! ఎంత తిన్నా బావుందే! ఇది కదా భోజనం అంటే, సంపూర్ణం అంటే. ఇంతకాలం భోజనం అని, అన్నం అని పేరు పెట్టుకుని ఏం తింటున్నాం? దశాబ్దాలుగా తిండిముందు సర్దుకు పోతున్నాం అంతే. ప్రపంచంలో చాలా మందికి ఈ మాత్రం అన్నం కూడా గతిలేదు అని సర్దుకుపోయి బావుంది, బాలేదు అనే మాటలే మర్చిపోయాం. మంచి భోజనం మాదిరిదే మంచి కథ కూడా, గొప్ప కథ కూడా, అద్భుతమైన కథ కూడా. భోజనం మొత్తంలో అన్నమొక్కటి బావున్నట్టో, కూర బావున్నట్టో, చారు మజ్జిగ లేదా మజ్జిగ పులుసు బావున్నట్టో, ఏదో ఒకటి బావుంటే అది చాలులే అనుకునేట్టు అయిపోయింది కథా కాలం. వొస్తువు కొత్తగా ఉంది కదా? ఇతివృత్తం మంచిది ఎన్నుకున్నాడు, శిల్పం చూశావా? ఆ శైలి ఉందే! అబ్బో!! వచనంలో నడక కొత్త దారి దొక్కింది. ఈ కాలం మరీ అన్యాయం, కథ ఏవుందిలే! కథ రాసి వడ్డిస్తున్న పిల్లను చూడు, కత్తి కదూ! దేనికదేగా బావున్నాయి. మొత్తంగా బావుందో లేదో తెలీదు, తెలుసుకోవాలసిన అక్కరలేదు. ఈ రోజు బావుందని అనుకుంటున్న కథను అసలు కళ్లకద్దుకుని మళ్లా మళ్లా చదువుతున్నామా అసలు? నాకై నేను కథని వెదుక్కుని చదువుకుని ఎంత కాలం అయ్యింది? బలివాడ కాంతారావు గారి బయ్యన్న మాదిరి కథ ఒకటి వచ్చి గుండెలో మెత్తగా పడుకుని ఎంత కాలం అయ్యింది? అయితే ఒక అదృష్టమున్నది భోజనమైతే రోజూ తినాలి, మంచిది ప్రతి రోజూ దొరక్క పోవచ్చు, బ్రతకడానికి ఏదో ఒకటి తిని బ్రతకాలి తప్పదు. అయితే కథలు మాత్రం కొత్త వాటి కొరకు ఎదురు చూడనక్కరలేదు, ప్రపంచంలో కథావాంగ్మయం అనేది ఒకటి పాతది చాలా తయారయ్యి ఉంది. మళ్ళా మళ్ళా చదువుకునెందుకు చాలా దయతో గొప్ప కథని దానం చేసి పోయిన కథకులు చాలా మందే ఉన్నారు. తరగని కథ చాలా ఉంది. కొత్త కథల కొరకు ఎదురు చూడాల్సినంత కథ ఏమీ తరిగిపోలేదు తరిగేదల్లా చదవడానికి సమయం లేని మన వయసు. ఉండండి, పాత కాలంలోకి పరిగెత్తి పోవాల్సిన శ్రమ తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను రండి. నార్మన్ గార్డ్స్ బై అనే మనిషి వచ్చి పార్క్ లో వచ్చి కూచుని మనుషులకేసి చూస్తున్నాడు. అది సంధ్యా సమయం. ఆయన దృష్టిలో సంధ్యా సమయం అంటే మనుషులు పగలంతా పోరాడి ఓడిపోయిన తమ అదృష్టాలను, చనిపోయిన తమ నమ్మకాలను చేతనయినంతవరకు లెక్కలు చూసుకునే సమయం, ఈ రోజుకు ఇక మనం మరణించి రేపటి పోరాటానికి మరలి పుడదామనుకుంటూ వంగిపోయిన భుజాలతో ఆశలు అడుగంటిన కళ్లతో బరువుగా ఇంటి వైపుకో, సారా కొట్టుకొ సాగే సమయం. వారిని చూస్తూ ఉంటే నార్మన్ గార్డ్స్ బై కళ్లకు ఈ లోకమనే ఆనందక్షేత్రంలో హక్కుగా ఉండవలసిన వాళ్ళెవరూ కనపట్టం లేదు. నిజానికి ఈ ఓడిపోయిన వాళ్లల్లో తనని తాను కూడా ఒకడిగా లెక్కించుకునే ప్రయత్నంలో ఉన్నాడు గార్డ్స్ బై. అతనికి పోయిన గంటు అంటూ ఏమీ లేదు, డబ్బుకు కొదువా లేదు. అయినా మనిషి అనేవాడికి సంతోషపడ్డానికి ఒక కారణం కావాలి కానీ దిగాలు పడ్డానికి కారణం అవసరం లేదు, కారణం లేకపోయినా దుఖ కారణం కోరి తెచ్చుకునేంత సమర్దత ఒక మనిషిలో మాత్రమే ఉంటుంది. సరే, గార్ద్స్ బై పక్క బెంచి మీదికి ఒక ముసలాయన వచ్చి చేరాడు. ఆయనని చూస్తే మరీ ఘోరంగా ఉన్నాడు. మనిషి కుందించుకు పోయినట్లు, ఆత్మగౌరవం అడుగంటి పోయినట్లు ఉన్నాడు. దిగాలు దరిద్రం దురదృష్టం అనే ముగ్గురమ్మలు వచ్చి మూర్తీభవించిన మూర్తిలా ఉన్నాడు. పాపమని ఒక గులాబి పువ్వును తెచ్చి అతని కోటుకు అలంకరించే ప్రయత్నం చేయండి అలా చేస్తే ఆ పువ్వు బలవంతాన అతని గుండి బొత్తానికి ఉరివేసుకుని చచ్చి పోతానని బెదిరిస్తుంది. అంత దుర్భాగ్యంగా ఉన్నాడు అతను. అతను ఈ ప్రపంచంలోని పరమ ఏడుపుగొట్టు వాళ్లలో ఒకడు. కానీ ఈ ప్రపంచంలో ఒకడయినా అతడి గురించి ఏడుస్తారని మనం ఆశించలేనంత దిక్కుమాలిగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వెడితే, ఇంట్లో వాళ్లతో నిద్రపోయే సమయం వరకు ఎక్కువ చీవాట్లు తినాల్సి వస్తుంది కాబటి తక్కువ చీవాట్లు తినడం కోసం వీలయినంత ఆలస్యంగా ఇంటికి వెళ్లడానికే నిశ్చయించుకున్నట్టుగా ఉన్నాడితను అనుకుంటాడు గార్డ్స్ బై. మొత్తానికి ఒక సమయం తరువాత ఆ ముసిలాయన లేచి చీకట్లో కలిసిపోయాడు. అతని వెళ్ళిన కాసేపటికి ఒక యువకుడు వచ్చి ఆ ముసిలాయన ఖాలీ చేసిన బెంచిలో కూచున్నాడు. ఇతని దుస్తులు బావున్నాయి, పైగా మంచి వయసు తాలూకు ఆరొగ్యం. అయితే ముఖంలో మాత్రం అంతకు ముందు మనిషికన్నా ఆనందం ఎక్కువగా ఏ మాత్రం లేదు. గార్డ్స్ బై ఇక ఉండబట్టలేక ఇతనితో మాట కలుపుతాడు. ఏమిటి విషయం, ఎందుకంత నిరాశ అని. ఇతగాడి కథ భలే విచిత్రంగా ఉంది. ఈ రోజే కొత్తగా ఈ ఊరికి పనిమీద వచ్చాడు. టాక్సీ డ్రైవర్ తనని ఇది మంచి హోటల్ అని ఒక హోటలులో దింపి వెళ్లాడు. బస బానే ఉంది. ఆ తరువాత స్నానానికి హోటల్ వారి సబ్బు వాడ్డం ఇష్టం లేక కొత్త సబ్బు కొనుక్కుందామని బయటికి వచ్చాడు. వస్తూ వస్తూ నాలుగు డబ్బులు మాత్రమే జేబులో వేసుకుని మిగతా అంతా తన పెట్టెలో భద్రపెట్టి దిగాడు. సబ్బు ఒకటి కొనుక్కుని ఆ వీధి ఈ వీధి సరదాగా చూసుకుంటూ ఒక బార్ లో దూరి చిన్న డ్రింక్ కూడా తాగాడు, అప్పటికే చీకటి పడింది. బార్ నుండి బయటికి వచ్చాకా అసలు సంగతి అర్థమయ్యింది. అసలే ఊరికి కొత్త . బసకు దిగిన హొటల్ అడ్రస్ గుర్తు పెట్టుకోలేదు, వీధి పేరు అవసరం అనుకొలేదు. సబ్బుకోసం దిగిన వాడు సబ్బు కొని వెనుదిరిగి పోక వీధులు కొలిచే పనిలో పడి, ఉన్న డబ్బుతో తాగి ఇప్పుడు ఈ చీకట్లో దిక్కు తోచక వచ్చి కూచున్నాడు. "ఇది నా కథ, కాబట్టి నా కథని నమ్మి నా పరిస్థితిని దిగమింగగలిగిన మీ వంటి ఏ మంచి మనిషయినా ఎదురయ్యి నాలుగు రాళ్ళు అరువిస్తే ఈ రాత్రి ఈ దగ్గరలోని ఏ హోటల్లోనో తల దాచుకుని, రేపు ఉదయమే నా బస వెదుక్కోగలను" అన్నాడు. "అదేలే! దాందేముందిలే! ఇటువంటి కథలకేం గొడ్డు పోయిందిలే? నువ్వు ఏ సబ్బు ముక్క కొసం ఇన్ని తంటాలు పడ్డావో ఆ సబ్బు ముక్క నాకు చూపిస్తే, నీ చిక్కు తీరిపోదూ" అన్నాడు గార్డ్స్ బై. యువకుడు గబ గబా జేబులు తడుముకున్నాడు, తనమీద తనే కొపడ్డాడు, చిరాకు పడ్డాడు, ఈ గందరగోళంలో సబ్బు ముక్క ఎక్కడో పడిపోయినట్లుంది అని తన దురదృష్టానికి తనే చింతించాడు. (క్లిక్: మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!) "చూసావా? నువ్వు కథ బాగా చెప్పగలిగావు. నీ మాటల్లో సత్యం, కళ్లల్లో దీనత్వం కొట్టొచ్చినట్లు చూపించగలిగావు. అయితే నువ్వు మరిచి పొయిందల్లా కనబడినవాడికల్లా నీ దీన కథ వినిపించాలనుకోవడానికి ముందుగా ఒక సబ్బు ముక్కను సాక్ష్యంగా తోడు తెచ్చుకోడమే" అన్నాడు గార్డ్స్ బై వెటకారంగా. ఆ యువకుడు ఇదంతా వినదలుచుకోలేదు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. హాస్యాస్పదంగా నవ్వుకుంటూ గార్డ్స్ బై కూడా అక్కడి నుండి ఇక వెళ్ళిపోదామని లేచాడు. అయితే ఉన్నట్టుండి నేల మీద పడి ఉన్న ఒక పొట్లం ఆకర్షించింది. ఏమిటా అని దానిని అందుకుని చూస్తే, పొట్లం కట్టి ఉన్న సబ్బు బిళ్ళ, అరెరే! ఎంత పని జరిగి పోయింది, అనుకుని ఆ కుర్రాడు వెళ్ళిన దారి వైపు కదిలాడు గార్డ్స్ బై. అదిగో అతను అక్కడున్నాడు. అబ్బాయి నీ నిజాయితికి ఇదిగో సాక్షం దొరికింది. నీ అవసరంపై నా అపనమ్మకాన్ని నువ్వు మన్నిస్తావనే అనుకుంటాను. ఈ డబ్బు పట్టు నా అడ్రస్ కాగితం కూడా. నువ్వు డబ్బు నాకు ఎప్పుడు పంపించినా తొందరలేదు. అదృష్టం నీకు తోడుగా ఉండుగాక. యువకుడు ధన్యవాదాలు చెబుతూ అక్కడి నుండి నిష్క్రమించాడు. ఈ కథ వ్రాసిన వారు హెచ్ హెచ్ మన్రో అనే బ్రిటీష్ రచయిత. కలం పేరు సాకీ. నేను స్కూలు పిల్లవాడిగా ఉన్నప్పుడు సరిగా గుర్తు లేదు కానీ శారదా విద్యామందిరం లోనే నేతాజీ పబ్లిక్ స్కూల్ వారో దీనిని పిల్లలతో ఇంగ్లీష్ లోనే నాటకం వేపించారు. ఒక బ్రిటిష్ కథ మా చిన్న ఊరిలో ఒక చిన్న బడిదాకా ఎట్లా చేరిందా అని నా ఆశ్చర్యం. ఆ మధ్య కె.బి. గోపాలం గారు దీనిని తెలుగులోకి అనువదించారు. కథ ఎలా మొదలవాలి? ఎక్కడ ఆపెయ్యాలి ఈ రెంటి మధ్య ఏం జరగాలి అది ఎంత ఉండాలి అని కదా కథ. ఇక వినండి. "పాపం కుర్రవాడు అన్యాయమైన పరిస్తితులకు దొరికిపోయాడు, అదృష్టవశాత్తు అతని సబ్బు దొరికింది లేకపోతే నేను అతి తెలివితో ఆలోచించినట్లే అతని గోడు విన్న ప్రతి ఒక్కరు నాలా సాక్ష్యం అడిగితే అతనికి మానవ జాతిమీద ఏం నమ్మకం మిగిలేట్లు. "గార్డ్స్ బై కి వెంటనే ఇంటికి వెళ్ళాలనిపించలేదు వెను తిరిగి తను కూచున్న బెంచి దగ్గరికి వచ్చాడు. అక్కడ ఎవరో ఉన్నారు, మోకాళ్ళ మీద వంగి ఏమో చేస్తున్నాడు. (క్లిక్: అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఏం చెబుతున్నాడంటే..) 'ఎవరది?" అతను తల తిప్పి చూశాడు, ఇందాకటి దురదృష్ట మొహం పెద్దాయన. ఏమిటండి సంగతి?" "నా సబ్బు ముక్క ఎక్కడో పోగొట్టుకున్నానండయ్యా" - అన్వర్