
శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే.. కీళ్లనొప్పులను నివారించవచ్చునని అంటున్నారు బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.
శరీరంలో తగినంత విటమిన్ డి ఉంటే.. కీళ్లనొప్పులను నివారించవచ్చునని అంటున్నారు బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. అయితే ఒకసారి ఈ వ్యాధి వచ్చిన తరువాత ఈ విటమిన్ను సాధారణ మోతాదులో తీసుకోవడం వల్ల ఫలితం తక్కువని తాము నిర్వహించిన పరిశోధన ద్వారా స్పష్టమైందని ప్రొఫెసర్ మార్టిన్ హ్యూయిసన్ తెలిపారు. వ్యాధి కారణంగా శరీరం విటమిన్ డీకి వ్యతిరేకంగా స్పందించడం దీనికి కారణమని ఆయన తెలిపారు.
సాధారణంగా కీళ్లనొప్పులతో బాధపడే వారిలో అత్యధికులకు విటమిన్ డి లోపం ఉంటుందని.. అందువల్ల వీరికి సాధారణం కంటే ఎక్కువ మోతదులో ఈ విటమిన్ను ఇవ్వడం ద్వారా వాపును నియంత్రించే అవకాశం ఉంటుందని వివరించారు. లేదంటే ఈ విటమిన్ను శరీరం శోషించుకునేందుకు అనువైన చర్యలు చేపట్టాలని చెప్పారు. కీళ్లనొప్పులు ఉన్న వారి నుంచి సేకరించిన రోగనిరోధక కణాలపై తాము పరిశోధనలు చేసినప్పుడు ఈ విషయాలన్ని తెలిశాయని మార్టిన్ తెలిపారు. విటమిన్ డీ లోపంతో కీళ్లల్లో వాపు/మంట ఎందుకు వస్తుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నామని, తద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు వీలేర్పడుతుందని తెలిపారు.