
అంకెల మోళీ
- రూ. 4599 కోట్లు..
- ‘గ్రేటర్’ మాయా బడ్జెట్
- వరుసగా మూడో ఏడాదీ ‘రికార్డు’
- గణాంకాలతో గారడీ
- ఏటా రూ.1500 కోట్లయినా దాటితే ఒట్టు
- అంచనాలు హెచ్చు.. ఖర్చు తీసికట్టు
- సామాన్యులకు ఊతమేదీ?
సాక్షి, సిటీబ్యూరో: షరా మామూలు.. మునుపటి మాదిరి గానే భారీ అంకెలు.. ‘ఘనా’ంకాల గారడీ.. వాస్తవానికందని లెక్కలతో.. ‘అంచనా’లకే తప్ప చేతికందని కేంద్ర, రాష్ట్ర సర్కారు గ్రాంట్ల ఊరింపుతో రూ.4599 కోట్ల ‘రికార్డు’ బడ్జెట్ అంకాన్ని పూర్తిచేసి అరచేతిలో వైకుంఠాన్ని చూపారు. పేదలకు ఉపకరించే రూ. 5కే సబ్సిడీ భోజనం, నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటు, ఫంక్షన్హాళ్లు, ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఫెలోషిప్స్, నైట్షెల్టర్లు వంటివి మినహాయిస్తే ఈ బడ్జెట్లో సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. వీటి కేటాయింపులన్నీ లెక్కించినా రూ. 100 కోట్లూ దాటలేదు. ఏళ్ల తర బడి చెబుతున్న ఆర్ ఓబీలు, జంక్షన్ల అభివృద్ధి, నాలాల ఆధునీకరణ పనుల గురించి ఏటా చెప్పేదే చెప్పారు.
అంతా ఆర్భాటమే.. ఆచరణేదీ?
మూడేళ్లుగా రూ.1500- రూ.2000 కోట్లు కూడా ఖర్చుచేయలేకపోయిన వారు ఈసారి ఏకంగా రూ. 4599 కోట్లు లెక్క చూపారు. పాలకమండలికి చివరి ఏడాది కావ డం, త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ బడ్జెట్ను రూపొం దించినట్లు కని పిస్తోంది. ఇక, పేదల గృహ నిర్మాణానికి గతం లో వేల కోట్లు చూపిన వారు ఈసారి రూ. 274 కోట్లకే పరిమితమయ్యారు. రాజీవ్ ఆవాస్ యోజనకు రూ.10 కోట్లే కేటాయించారు. వరద కాలువలకు రూ. 335 కోట్లు కేటాయిం పుల్లో చూపినప్పటికీ, గతానుభవాలు తెలిసిన వారు విస్తుపోతున్నారు.
ఇక వివిధ గ్రాంట్ల ద్వారా రూ. 1200 కోట్లు రాగలవని అంచనా. ఇందులో రూ. 500 కోట్లు రావడమైనా గగనమే. గతానుభవాలతోనైనా బడ్జెట్ను వాస్తవ దృక్పథంతో రూపొందించలేదు. ఆర్భాటమే తప్ప అమలయ్యేది అనుమానమేననే విమర్శలున్నాయి. మహిళలు, ఎ స్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 290 కోట్లు చూపినా ..వారికి ప్రత్యేక పద్దు కిం ద ఖర్చు చేసిన దాఖలాల్లేవు.
2013-14లో సైతం క్యాపిటల్ వ్యయం కింద రూ. 2271 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చూపినా, రివైజ్డ్ బడ్జెట్లో దానిని రూ.1637 కోట్లకు తగ్గించారు. రోడ్లు, ఫుట్పాత్ల కోసం అత్యధికంగా రూ. 833 కోట్లు కేటాయించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరం లో కేటాయించిన రూ. 431 కోట్ల పనులే చేయలేదు. ఇలా అంకెల్లో ఘనంగా తప్ప..ఆచరణకు నోచని బడ్జెట్తో సిటిజన్లను మాయ చేశారు.
నైబర్హుడ్ కాన్సెప్ట్ అవసరం
మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలకు అధిక నిధులు కేటాయించాలి. పేదలుండే మురికివాడలు, బస్తీల్లో సౌకర్యాలను మెరుగుపరచా లి. వృథా వ్యయాన్ని తగ్గించుకోవాలి. నైబర్హుడ్ కాన్సెప్ట్తో బడ్జెట్ రూపకల్పన జరగాలి. పాదచారులకు, సైకిళ్లకు ధాన్యమివ్వాలి.పచ్చదనానికి పెద్దపీట వేయాలి.
- వేదకుమార్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్
అంకెలగారడీ ఇది..
గ్రేటర్ బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోంది. ప్రజాస్వా మ్య విరుద్ధంగా కార్పొరేటర్లు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కలిసి రూపొందించిన ఈ బడ్జెట్తో ప్రజల అవసరాలు తీరవు. వార్డు కమిటీ సభ్యులు సూచించిన సమస్యలకు పరిష్కారం లభించట్లేదు. నాలుగేళ్ల బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే నిధు లు లేకున్నా ఆర్భాటం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్నికల దృష్టితోనే రూపొందిం చారు. నీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి వాటిని విస్మరించారు. రోడ్ల పనుల తో కాంట్రాక్టర్లు పబ్బం గడుపుకుంటున్నారు.
- పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్గవర్నెన్స్ ప్రతినిధి