
బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎస్బీఐలో క్యూలో నిల్చున్న కస్టమర్లకు టీ అందజేస్తున్న సిబ్బంది
బంజారాహిల్స్ : పాత నోట్ల రద్దు, కొత్త నోట్ల మార్పిడి, పాత నోట్ల డిపాజిట్ తదితర అంశాల నేపథ్యంలో బ్యాంకులన్నీ ఖాతాదారులతో కిటకిటలాడుతున్నాయి. చాలా చోట్ల క్యూలైన్లు అదుపుతప్పుతూ ఖాతాదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. అరుుతే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎస్బీఐలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంగా ఖాతాదారులకు సకాలంలో మెరుగైన సేవలు అందించే దిశలో తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
గంటల తరబడి క్యూలలో నిలబడే పరిస్థితి తప్పుతున్నది. ఇక్కడ వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. మహిళలకు కూడా వేరొక కౌంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనరల్ పబ్లిక్ కోసం మూడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక క్యూలైన్లలో నిలబడే వారికి ఎప్పటికప్పుడు మంచినీళ్లు, టీ సరఫరా చేస్తున్నారు. కూర్చునేందుకు వీలుగా అందుబాటులో కుర్చీలు ఉంచారు. విసుగు లేకుండా ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇక్కడి ఉద్యోగులు చేసిన ప్రయత్నం ఖాతాదారులను సంతృప్తిపరుస్తున్నది.