
కల్తీ మద్యం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
హైదరాబాద్ : బెజవాడలో కల్తీ మద్యం ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. కల్తీ మద్యం బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. విజయవాడ స్వర్ణ బార్లో మద్యం సేవించి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 15మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మరోవైపు కల్తీ మద్యం సేవించి అస్వస్థతకు గురైన బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా పరామర్శించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన సోమవారం పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.