
గ్రేటర్ పై రాజముద్ర
హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు రావటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఎంతో ఉంది.
నేడు మహానేత వైఎస్ఆర్ జయంతి
హైదరాబాద్కు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకు రావటంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఎంతో ఉంది. వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 5965 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 849 గ్రామాలతో హెచ్ఎండీఏ విస్తరణ చేపట్టారు. శివారు మున్సిపాలిటీలను కలుపుతూ 625 చదరపు కిలోమీటర్ల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గంటకు 120 కి.మీల వేగంతో ప్రయాణించేలా నగరానికి అవుటర్ హారం, అధునాతన హంగులతో శంషాబాద్ విమానాశ్రయం, త్వరలో పట్టాలెక్కనున్న మెట్రో రైలు ప్రాజెక్ట్, రూ.600 కోట్ల వ్యయంతో పీవీ ఎక్స్ప్రెస్ ఎలివేటెడ్ హైవే ఆయన హయాంలో జరిగిన అభివృద్ధే.. ఇపుడు మహానగర ప్రజల దాహార్తి తీరస్తున్న గోదావరి,కృష్ణా రెండు,మూడవ దశల దార్శనికుడూ వైఎస్సే.. ఇంకా ఐఐటీ, బిట్స్ పిలానీ, టిస్ క్యాంపస్ల ఏర్పాటుతో విద్యారంగంలో విప్లవాలకు శ్రీకారం చుట్టగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఐటీ రంగం పురోగమించింది వైఎస్సార్ హాయాంలోనే. హైదరాబాద్ నగరాన్ని వందేళ్ల వరకు వసతుల కల్పన దిశగా అడుగేయించి తనదైన రాజవుుద్ర వేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎవరూ వైద్యం, చదువుకు దూరం కాకూడదని భావించి రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలతో జనం మదిలో నిలిచిపోయిన మహానేత వైఎస్ఆర్..
పైసా ఖర్చులేకుండా చికిత్స
సనత్నగర్: మాది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. రోజూ పనికి వెళితేనే పూట గడిచేది. అలాంటి పరిస్థితుల్లో 2009 జులై 10న గుండెలో తీవ్ర నొప్పి వచ్చింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళితే గుండెలో మూడు వాల్వ్స్ పూడిపోయాయని, బైపాస్ సర్జరీ చేయాలన్నారు వైద్యులు. లక్షలు ఖర్చవుతాయన్నారు. అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిలా నిలిచింది. పైసా ఖర్చు లేకుండా లక్షలు ఖర్చయ్యే బైపాస్ సర్జరీని అయ్యిందంటే వైఎస్ఆర్ పుణ్యమే. - గంగధారిస్వామి, బాలయ్యనగర్, సనత్నగర్
ఉన్నత చదువులు చదివాం
పేద కుటుంబానికి పెద్ద చదువులను రుచిచూపించిందంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకమే. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగానే ఉంటుంది. మాకేమో ఉన్నత చదువులు చదవాలనే కోరిక బలంగా ఉండేది. ఆ సమయంలో వైఎస్ రాజేశేఖరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ మా లక్ష్యాన్ని చేరువచేసే ఆయుధమైంది. ఇప్పుడు నేను బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి అమెరికాలో పీహెచ్డీ చేస్తున్నానంటే మహానుభావుడు వైఎస్సార్ చలవే. -జి.కీర్తి, పీహెచ్డీ విద్యార్థి
జీవితాన్నిచ్చిన రీయింబర్స్మెంట్
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్రెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో లక్షల సంఖ్యలో తెలుగు ప్రజలు లబ్ధిపొందారు. అందులో నేనూ ఒకడిని. నేను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాను. ప్రస్తుతం హెచ్ఎస్బీసీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రత్యేకించి పేదలు, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం పొందారు. నాతోపాటు చదివిన సగంమందికి పైగా విద్యార్థులు ‘రీయింబర్స్’ ద్వారానే చదువుకున్నారు. - జోయరిన్షీలా, బోరబండ, హెచ్ఎస్బీసీ
ఆయన దేవుడితో సమానం
అబిడ్స్: మహానేత ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతోనే నేను ఎంబీఏ పూర్తి చేయగలిగాన. పేదరికంతో ఉన్న తనకు వై.ఎస్. పథకం లేకపోతే ఎంబీఏ చదివేవాడిని కాదన్నారు. రోజుకు ఒక్కసారైనా దివంగత వైఎస్సార్ను మనసులో గుర్తుచేసుకుంటాన. ఆయన నాకు దైవంతో సమానమన్నారు. -ఎస్. గణేష్, పుప్పాలగూడ
వైఎస్.. నా రాజకీయ గురువు
కుత్బుల్లాపూర్ : 1991లో కడప ఎంపీగా కొనసాగుతున్న మహానేత వైఎస్తో నాకు అనుబంధం ఏర్పడింది. అప్పటినుంచీ ఆయన వెన్నంటే ఉన్నా. ఆయన దీవెన వల్లే నేను రాజకీయాల్లో ఈ స్థితిలో కొనసాగుతున్నా. 2000 సంవత్సరంలో కుత్బుల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చారు. 2005లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచినా తిరిగి కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలికా. దివంగత నేత వైఎస్సార్ మరణించిన తరువాత ఆయన చిత్రపటాన్ని మా ఇంట్లో తల్లిదండ్రుల ఫొటోల పక్కన పెట్టి ప్రతిరోజూ పూజించడం అలవాటు. ఆయన హయాంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో నేను భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. జీవితంలో రాజకీయంగా ఎంత ఎత్తుకు ఎదిగినా నా గురువు మాత్రం వైఎస్సాఆర్.. - కూన శ్రీశైలంగౌడ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే
నేనున్నానంటూ అండగా నిలిచాడు
లింగోజిగూడ: మాకు ఇద్దరు కుమారులు. రెండవ కుమారుడు సదాశివరెడ్డి ఎంటెక్ పూర్తిచేసి ట్రాన్స్ఫార్మర్ సీనియర్ డిజైనింగ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 25, 2007 రాత్రి కోఠిలోని గోకుల్ చాట్ వద్ద ఉగ్రవాదులు బాంబులు పేల్చివేసిన ఘటనతో మా జీవితంలో అంధకారం నెలకొంది. మొదటి నుంచి చదువులో టాపర్గా ఉన్న మా కొడుకు సదాశివరెడ్డి బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి జీవచ్చవంలా మారి నరకం అనుభవిస్తున్నాడు. నోటి మాట లేదు. ఎడమకన్ను చూపు పోయింది. కాళ్లు, చేతులు చచ్చుపడ్డాయి. అప్పట్లో ఆసుపత్రి ఖర్చులను ప్రభుత్వమే భరించినప్పటికీ సంవత్సర కాలంలో మాకు మరో రూ.5లక్షలు ఖర్చయ్యాయి. రాజకీయ నాయకుడిగా ఉంటూ మానవత్వపు విలువలకు జీవం పోసి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ను కలువాలనుకున్నాము. అప్పట్లో హుడా చైర్మన్గా పనిచేస్తున్న దేవిరెడ్డి సుధీర్రెడ్డి సహాకారంతో సంవత్సరం తరువాత సీఎం క్యాంపు ఆఫీసులో వైఎస్ను కలిసి మా బాధను వివరించాము. ఆత్మీయ పలకరింపుతో ఆదరించాడు. ‘నేనున్నాను... ధైర్యంగా ఉండండి’ అంటూ మా భుజంపై చేయి వేసి చెప్పిన మాట మాకు సంతోషం కలిగించింది. పెద్ద కుమారుడు శ్రీనివాస్రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన ప్రకారం మా పెద్ద కుమారుడికి ఉద్యోగం వచ్చింది. జనవరి 2009లో పోలీస్శాఖ రాష్ట్ర కార్యాలయం ఇంటలిజెన్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరాడు. మా కొడుకులో నిత్యం మేము వైఎస్ను చూసుకుంటూ మా బాధను దిగమింగుకుని జీవిస్తున్నాము. ఆయన భూమి మీద లేకపోయిన మా గుండెల్లో దీపమై ఉన్నాడు. దేవుడిలాంటి మనస్సున్న వైఎస్ను మేము ఎన్నటికీ మరువము. ఇప్పటికీ నెలకు రూ.20వేల వరకు ఖర్చవుతోంది. ఆస్పత్రి ఖర్చులను కేంద్రప్రభుత్వమే భరించాలి. - గోరంటల వసంత, మోహన్రెడ్డి, బృందావన్ కాలనీ, ఎల్బీ నగర్
మనవరాలికి ప్రాణం పోశారు
ఆల్విన్కాలనీ : మాది ఒంగోలు. నగరంలోని బాలాజీనగర్లో వలస ఉంటున్నాం. నా మనవరాలి గుండెకు చిల్లు పడిందని పాప పుట్టిన ఆరో నెలలో తెలిసింది. చికిత్సకు డబ్బులేక మేం అన్నిదేవుళ్లకు మొక్కాం. ఆపద్బాంధవుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకం నా మనవరాలికి నూరేళ్లు పోశాయి. ఇప్పుడు ఎనిమిదేళ్ళ ఆ చిన్నారి మూడవ తరగతి చదువుతుంది. ఉదయం లేచినప్పటి నుంచీ నిద్రపోయేవరకు రాజశేఖర్ తాత అంటూ పలుకరిస్తూ ఉంటుంది. మా ఇంట్లో ఎటు చూసినా రాజశేఖర్రెడ్డి ఫోటోలు కనిపిస్తుంటాయి. పూజ గదిలో రాజన్న చిత్రపటాన్ని పెట్టుకుని దేవుడిగా పూజలు చేస్తున్నాం. ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. - పాప ఇందుతో నాయనమ్మ జయమ్మ
ఆరోగ్యశ్రీతోనే బతికున్నా
ఏఎస్రావునగర్ / కాప్రా : ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని జై జవాన్కాలనీలో నివసించే పరమేశ్వర్ నేను మూత్రపిండాల వ్యాధితో భాధపడుతున్న తరుణంలో డా. వైఎస్. రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వరంలా కన్పించింది. ఈ పథకంలో భాగంగా చికిత్స చేయించుకుంటున్నాను. పంజాగుట్ట నిమ్స్లో డయాలసిస్ చేయించుకుంటూ ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. హోటల్ సర్వర్గా పని చేస్తూ చాలీచాలనీ డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ వారానికి మూడు సార్లు పంజాగుట్ట నిమ్స్కి వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నానని, దీంతో మరింత ఆర్థిక భారం తప్పటం లేదు. - పరమేశ్వర్, జె జవాన్కాలనీ, ఏఎస్రావు నగర్
మహానేతకు రుణపడి ఉన్నా
మియాపూర్ : ఏడేళ్ల క్రితం గుండెనొప్పి వచ్చింది. ఆ సమయంలో ఆరోగ్య శ్రీ పథకం నాకు వరంగా మారింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆరోగ్య శ్రీ కింద పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ను ప్రభుత్వం ద్వారా అమీర్పేట్లోని మైత్రి హాస్పిటల్లో నిర్వహించారు. కేవలం బస్ చార్జీలకే ఖర్చయింది. ఆర్థికంగా చితికిపోయిన నా పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నాకు ఎంతో ఉపయోగపడింది. ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటికీ నాకు పింఛన్ కూడా రావడం లేదు. ఆ మహానేతకు రుణపడి ఉన్నా. - భాస్కర్రావు, మియాపూర్ ప్రేమ్నగర్
‘రీయింబర్స్’తో చదవగలిగా
బీఈడీ కోర్సును అభ్యసించేందుకు తగిన ఆర్ధిక స్థోమత లేక విద్యాభ్యాసాన్ని వాయిదా వేసుకున్నాను. తరువాత అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వినియోగించుకొని 2009లో రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో గల వివేకానంద బీఈడీ కళాశాలలో చేరి 2011లో కోర్సును పూర్తిచేశాను. ఆయన ప్రవేశపెట్టిన పథకం ద్వారా రూ.లక్షన్నర విలువ చేసే కోర్సును కేవలం రూ.500 కౌన్సిలింగ్ ఫీజు చెల్లించి పూర్తిచేశాను. ఇలా ఎంతోమంది పేదలకు అప్పట్లో లబ్ధిచేకూరింది. నాలాంటి వారేందరో వృత్తివిద్యా కోర్సులను ఉచితంగా అభ్యసించగలిగారు. ఆయన పథకం ద్వారా పొందిన లబ్ధి కారణంగా ప్రస్తుతం నేను పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాను. - జి.వినోద్కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ
ఆరోగ్యశ్రీతో పునర్జన్మ
శాలిబండ: ఆరోగ్యశ్రీ పథకం నాకు పునర్జన్మనిచ్చింది. పేదరికం.. ఆపై గుండెజబ్బు.. ఆపరేషన్ చేయకపోతే కష్టమని వైద్యులు చెప్పారు. కుటుంబం గడవడమే కష్టంగా నాకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు కావాలన్నారు. ఆ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పథకం నన్ను, నా కుటుంబాన్ని ఆదుకుంది. ఈ పథకంలో భాగంగా ఎనిమిది నెలల క్రితం మెడిసిటీలో ఓపెన్ హర్ట్ సర్జరీ చేయించుకున్నాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాను. - సయ్యద్ అహ్మద్ హుస్సేన్, శాలిబండ ఖాజిపురా
వైఎస్ వల్లే నేనున్నా
సుభాష్నగర్: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన మేము 1984లో సూరారం కాలనీకి వచ్చి స్థిరపడ్డాడు. ఓ ప్రై వేటు పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తుండగా 2010లో గుండె నొప్పి వచ్చింది. గాజులరామారంలోని యశోద ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు 1.80 లక్షల ఖర్చు అవుతుందని చెప్పారు. మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారని తెలుసుకుని నాంపల్లిలోని మెడ్విన్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స చేయించుకున్నాం. కాళ్లలో నరాలను తీసి గుండెకు అతికించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ లేకుంటే నేను లేను. - వై.యేసన్న, సూరారం కాలనీ
ఉచితంగా గుండె చికిత్స
జీడిమెట్ల: ఏడవ రంజాన్ పండుగను నా కుటుంబ సభ్యులతో నేను సంతోషంగా జరుపుకున్నానంటే దానికి కారణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్. నాకు గుండె నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా స్టంట్లు వేసి బతికించారు. అప్పుడు ఆరోగ్యశ్రీ పథకం లేకపోయి ఉంటే అంత ఖర్చుపెట్టి గుండె ఆపరేషన్ చేయించుకునే దానిని కాను. నాటి నుంచి నేటి వరకు నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆపరేషన్ అనంతరం దేవుడు నాకు మరో జన్మను ప్రసాదించినట్లు అనిపించింది. ఆ దేవుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి.
- రజియాబేగం, షాపూర్నగ ర్