
షరీఫ్కు పదవి గండం.. కీలక తీర్పు నేడే
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భవితవ్యం నేడు తేలనుంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భవితవ్యం నేడు తేలనుంది. పనామా పేపర్ల ద్వారా బయటకొచ్చిన ఆయన కుంభకోణం కేసుకు సంబంధించి పాక్ సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. 11:30గంటల ప్రాంతంలో కోర్టు షరీఫ్ ఆయన కుటుంబ సభ్యులపై తీర్పు ఇవ్వనున్నట్లు పాక్ మీడియా వర్గాలు తెలిపాయి.
ఇది వరకే రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన షరీఫ్ 1990లో పెద్ద మొత్తంలో కుంభకోణానికి పాల్పడ్డారని, అక్రమంగా వెనుకేసుకున్న సొమ్ముతో లండన్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోళ్లు చేశారని, పలువురు బినామీల పేరిట, ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోళ్లు చేశారని పనామా రహస్య పేపర్ల లీకేజీ ద్వారా బయటపడింది. దీంతో పాక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం, షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులపై విచారణ చేస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిపై నేడు కీలక తీర్పును కోర్టు ఇవ్వనుంది. ఒక వేళ షరీఫ్ నిజంగానే తప్పు చేసినట్లు తీర్పు వెలువరిస్తే ఆయన వెంటనే ప్రధాని పదవిగా అర్హత కోల్పోవడంతోపాటు జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది.