
కూలిన విమానం (ఫైల్ ఫొటో)
పారిస్: ఫ్రాన్స్లో ప్రమాదానికి గురైన విమానం నుంచి సిబ్బంది ఎటువంటి ఆపద సంకేతాలు పంపలేదని పౌర విమానయాన అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు కూడా తెలియదని వారు చెప్పారు. ప్రమాదానికి గురైన విమానం ఎయిర్బస్ ఎ320 విమానం జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు అనుబంధ సంస్థ అయిన జర్మన్వింగ్స్కు చెందినది. స్పెయిన్ దేశంలోని తీర నగరం బార్సెలోనా నుంచి బయల్దేరిన ఈ విమానం జర్మనీలోని డ్యుసెల్డార్ఫ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. అయితే మార్గ మధ్యలో ఫ్రాన్స్లోని ఆల్ప్స్ పర్వతాల మధ్య గల బార్సెలోనెటె స్కీ రిసార్ట్ సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10:30 -11.00 గంల మధ్యలో ఇదికూలిపోయింది. ఆ విమానంతో సంబంధాలు తెగిపోయాయని పౌర విమానయాన అధికారులు ప్రకటించారు.
విమానం కూలినపుడు భారీ శబ్దం వినిపించిందని, ఆ సమయంలో ఆ ప్రాంతంలో స్కీయింగ్ చేస్తున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు ఫ్రెంచ్ టెలివిజన్ చానల్తో చెప్పారు. ''విమానం కూలిపోవడానికి కారణాలేమిటనేది మాకు తెలియదు. కూలిన పరిస్థితులను బట్టి విమానంలోని 150 మందీ చనిపోయినట్లు అక్కడికి వెళ్లిన సిబ్బంది నిర్ధారించారు'' అని ఫ్రాన్స్ ప్రధాన మంత్రి మాన్యుయెల్ వాల్స్ మీడియాకు చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించిన వారిలో 67 మంది జర్మన్ వాసులు, 45 మంది స్పెయిన్ పౌరులు ఉన్నట్లు భావిస్తున్నారు. జర్మనీకి చెందిన 16 మంది స్కూలు విద్యార్థులు కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు.