
దుబాయ్ : ఒక చోటు నుంచి మరో చోటుకు వస్తువులను చేరవేసే డ్రోన్లను ఇప్పటికే కొన్ని దేశాలు ఉపయోగిస్తున్న విషయం తెల్సిందే. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనుషులను అంటే ప్రయాణికులను ఒక చోటు నుంచి వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లేందుకు వీలుగా తయారు చేసిన పైలెట్లేని ‘వెలోకాప్టర్’ను దుబాయ్ రోడ్డు అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ శుక్రవారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యంతో తయారు చేసిన ఈ వెలోకాప్టర్ను ప్రయాణికులు లేకుండా ప్రయోగించి విజయం సాధించింది.
గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ వెలోకాప్టర్ను జర్మనీకి చెందిన ఓ డ్రోన్ సంస్థ తయారు చేసింది. రిమోట్ కంట్రోల్తో అవసరం లేకుండా నడిచే ఈ వెలోకాప్టర్ 30 నిమిషాలపాటు నిరాటకంగా గాల్లో ఎగురగలదు. 18 ప్రొపెల్లర్లు, రోటర్లతో నడిచే ఈ వెలోకాప్టర్లో బ్యాటరీ బ్యాకప్ను, అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు పారాసూట్లను కూడా ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వెలోకాప్టర్ను ప్రయాణికులే ఆపరేట్ చేయవచ్చని, యాప్ ద్వారా వెలోకాప్టర్ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తామని వెలోకాప్టర్ సీఈవో ఫ్లోరియన్ రాయిటర్ తెలిపారు.