
అందమైన అనుబంధం - ‘దిల్’ రాజు
‘‘కూతురు ఉన్న ప్రతి తండ్రితో పాటు అమ్మాయిలందరూ ఈ సినిమా చూస్తారు. తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే అనుబంధంతో సాగే సినిమా ఇది. ఆ అనుబంధం చాలా అందంగా ఉంటుంది. హెబ్బా పటేల్ కోసం యూత్ ఈ సినిమా చూస్తారు. ఈ నెల 16న విడుదలవుతోన్న ఈ చిత్రాన్ని స్వర్గీయ జయలలితగారికి అంకితం చేస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ (గోపి) నిర్మించిన చిత్రం ‘నాన్న... నేను... నా బాయ్ఫ్రెండ్స్’.
ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు రిలీజ్ చేస్తున్నారు. రావు రమేశ్, హెబ్బా పటేల్, తేజస్వి మదివాడ, అశ్విన్, పార్వతీశం, నోయల్ సేన్ ముఖ్య తారలు. శేఖర్చంద్ర స్వరపరచిన పాటలను హీరో నాని విడుదల చేయగా, నిర్మాతలు ‘దిల్’రాజు, శిరీష్, లక్ష్మణ్ సీడీలను అందుకున్నారు. ‘‘ఇది లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్’’ అని దర్శకుడు అన్నారు. నిర్మాత బెక్కెం వేణు గోపాల్, దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత డీవీవీ దానయ్య, హీరోలు నాని, సందీప్ కిషన్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.