ఆ దుర్మార్గులకు రేపే శిక్ష ఖరారు
కోలకత్తా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన (పార్క్ స్ట్రీట్ రేప్) సామూహిక అత్యాచారం దోషులకు న్యాయస్థానం శుక్రవారం నాడు శిక్షను ఖరారు చేయనుంది. ఈ కేసులో అయిదుగురిపై కేసు నమోదుకాగా, ప్రధాన నిందితుడు సహా ఇద్దరు ఇంకా పరారీలో ఉన్నారు. జైల్లో ఉన్న మిగతా ముగ్గురు నిందితులు సహా అయిదుగురిని కోలకత్తా సెషన్స్ కోర్టు గురువారం దోషులుగా తేల్చింది. దీంతో రుమాన్ ఖాన్, నాజిర్ ఖాన్, సుమిత్ బజాజ్ లకు రేపు శిక్ష ఖరారు కానుంది. అడిషనల్ సెషన్స్ జడ్జ్ భట్టాచార్య రేపు తన తుది తీర్పును వెలువరించనున్నారు.
2012 ఫిబ్రవరిలో అయిదుగురు యువకులు కోలకత్తాలోని పార్క్ స్ట్రీట్ ఏరియాలో జోర్డాన్ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులో అత్యాచారం చేసి బయటికి విసిరేసిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనను కట్టుకథగా వ్యాఖ్యానించి విమర్శల పాలయ్యారు.
కాగా బాధితురాలు జోర్డాన్ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులకు వ్యతిరేకంగా కోలకత్తా వీధుల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. లైంగికదాడికి గురైన వారి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, మౌనాన్ని వీడి మన బాధను పంచుకోవడం ద్వారా ఆ భయంకర గాయాల నుంచి బయట పడాలంటూ బాధితులకు ధైర్యం చెప్పేవారు. అంతేకాదు అత్యాచార బాధితుల పునరావాసం కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. జోర్డాన్ అనారోగ్య కారణాలతో గత మార్చిలో కన్నుమూశారు.