
భారీగా పెరిగిన ఎమ్మెల్యేల ఆస్తులు
'భారీగా జీతభత్యాలే కాకుండా బడా వ్యాపారవేత్తలను తలదన్నేలా సంపద పోగేసుకోగలిగే మార్గం.. రాజకీయం' ఐదేళ్ల తీవ్ర పరిశోధన అనంతరం ప్రజాస్వామిక పరిశోధనల సంఘం, ఎన్నికల నిఘా బృందం సంయుక్తంగా తేల్చిచెప్పిన సత్యమిది.
'భారీగా జీతభత్యాలే కాకుండా బడా వ్యాపారవేత్తలను తలదన్నేలా సంపద పోగేసుకోగలిగే మార్గం.. రాజకీయం' ఐదేళ్ల తీవ్ర పరిశోధన అనంతరం ప్రజాస్వామిక పరిశోధనల సంఘం, ఎన్నికల నిఘా బృందం సంయుక్తంగా తేల్చిచెప్పిన సత్యమిది.
ఈ స్టేట్ మెంట్ కు రుజువులుగా గడిచిన ఐదేళ్లలో మన ప్రజాప్రతినిధులు.. నయా కుబేరులుగా అవతరిస్తున్న తీరును వెల్లడించాయి ఆ సంస్థలు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న బిహార్ లో ప్రస్తుత ఎమ్మెల్యేల సంపద.. సంచలనాత్మక రీతిలో ఏకంగా 2వేల శాతానికిపైగా పెరిగినట్లు తెలిపాయి.
సంపద భారీగా పోగేసిన ఎమ్మెల్యేల జాబితాలో మహిళలే ముందజలో నిలవటం గమనార్హం. అధికార జేడీయూ ఎమ్మెల్యే పూనం దేవీ యాదవ్.. 2010లో తన ఆస్తుల విలువ రూ. 1.87 కోట్లుగా చూపింది. తూర్పు బిహార్ లోని ఖగారియా నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీకి దిగిన ఆమె.. తాజాగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో రూ. 41.34 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. అంటే ఆవిడ సంపద 2013 శాతం వృద్ధి చెందినట్లు అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీసెర్చ్(ఏడీఆర్), ఎలక్షన్ వాచ్ లు పేర్కొన్నాయి. అయితే పూనం వివరణ మాత్రం మరోలా ఉంది. తన పేరుమీదున్న భూముల విలువ పెరగటం వల్లే ఆస్తి విలువ కూడా పెరిగినట్లు ఓ జాతీయ వార్తా సంస్థకు వివరణ ఇచ్చింది.
మొన్నటివరకు జేడీయూ ఎమ్మెల్యేగా ఉన్న పూర్ణిమా యాదవ్.. మహాకూటమి పొత్తులో భాగంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నవద సీటును కోల్పోయారు. దీంతో జేడీయూను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రస్తుతం గోవింద్ పూర్ నుంచి బరిలోకి దిగారు. 2010లో రూ. 2.75 కోట్ల ఆస్తున్నట్లు ప్రకటించిన ఆమె ప్రస్తుతం రూ. 16.14 కోట్ల (480 శాతం వృద్ధి) సంపద ఉన్నట్లు వెల్లడించారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే (లాఖీసరాయ్ నియోజకవర్గం) విజయ్ కుమార్ ఆస్తులు రూ. 4.13 కోట్ల నుంచి రూ.15.64 కోట్లకు పెరగగా, దర్భాంగ (రూరల్) స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్జేడీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ ఆస్తులు రూ. 2.83 కోట్ల నుంచి రూ. 12.89 కోట్లకు పెరిగింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన చిరాయి ఎమ్మెల్యే అన్వేశ్ కుమార్.. రూ.1.25 కోట్ల నుంచి రూ.8.18 కోట్లకు ఎగబాకారు.
ఏడీఆర్ బయలుపర్చిన వివరాల ప్రకారం గడచిన ఐదేళ్లలో 160 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ఆస్తులు దాదాపు 200 శాతం పెరిగాయి. పార్టీల వారిగా బీజేపీకి చెందిన 66 మంది ఎమ్మెల్యేలు, 52 మంది జేడీయూ ఎమ్మెల్యేలు, 12 మంది ఆర్జేడీ ప్రజాప్రతినిధులు, జీతన్ రామ్ మాంఘీ పార్టీ హెచ్ఏఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెలు సంపదపోగేయటంలో చక్కటి ప్రతిభకనబరిచారు. మరో విశేషమేమంటే ఈ జాబితాలో ఓ సీపీఐ ఎమ్మెల్యే (అవాదేశ్ కుమార్- బచ్వారా నియోజకవర్గం) కూడా స్థానం సంపాదించారు. ఈ కమ్యూనిస్ట్ నాయకుడి ఆస్తి 60 శాతం పెరిగినట్లు ఏడీఆర్ పేర్కొంది.