
వార్షికాదాయం 5 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం
సాక్షి, అమరావతి : రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి రూ.7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్షనేత విజయసాయి రెడ్డి తెలిపారు. రైతన్నల పట్ల తనకున్న ఆపేక్షను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ బీమా స్కీమ్తో కనబర్చారని కొనియాడారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబం నిశ్చింతగా జీవించడానికి ఈ పథకం భరోసా కల్పిస్తుందన్నారు. శనివారం ఆయన ట్విటర్ వేదికగా రాష్ట్ర బడ్జెట్ను కొనియాడారు.
‘వార్షికాదాయం 5 లక్షల వరకు ఉన్న మధ్యతరగతి కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం సాహసోపేత చర్య. రాష్ట్రంలోని మూడొంతులకు పైగా ప్రజలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. మధ్యతరగతి ప్రజలకు కొండంత ధైర్యాన్నిచ్చింది. తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తుంది. వడ్డీ లేని రుణం, ధరల స్థిరీకరణ నిధి, కౌలు రైతులకు పంట రుణాలు చరిత్రలో నిలిచి పోతాయి. జగన్ గారు రైతులకిచ్చిన మాట నిలుపుకున్నారు.’ ’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
గత ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదని, ప్రపంచంలోనే ఐదో పెద్ద సిటీ చేస్తామన్న అమరావతి గ్రాఫిక్స్ దశలోనే ఉందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు విచ్చల విడిగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. కార్పోరేషన్లు, ప్రభుత్వ సంస్థల ద్వారా రుణంగా తెచ్చిన రూ.లక్ష కోట్లు ఏమయ్యాయో అంతుబట్టడం లేదన్నారు.