శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు | bcci given to Lifetime Achievement Awards | Sakshi
Sakshi News home page

శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు

Published Tue, Feb 28 2017 12:18 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు

శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు

శాంతా రంగస్వామికి కూడా 
8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానం  


న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్‌లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్‌ గోయల్, పద్మాకర్‌ శివాల్కర్‌లు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి నామినేట్‌ అయ్యారు. వీరితో పాటు మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ శాంతా రంగస్వామి కూడా ఉన్నారు. ఈ పురస్కారం పొందనున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె నిలవనుంది. మార్చి 8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ‘గోయల్, శివాల్కర్‌ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని ఎన్‌.రామ్, రామచంద్ర గుహ, డయానా ఎడుల్జిలతో కూడిన అవార్డుల కమిటీ అభిప్రాయపడింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. హరియాణా తరఫున ఆడిన గోయల్‌ రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (637) తీసిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓవరాల్‌గా ఆయన 750 ఫస్ట్‌ క్లాస్‌ వికెట్లు పడగొట్టారు.

ఇక శివాల్కర్‌ ఆడిన 124 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో 589 వికెట్లు తీయగా... ఇందులో 13 సార్లు పది వికెట్ల చొప్పున తీశారు. అయితే బిషన్‌ సింగ్‌ బేడీ ఉజ్వలంగా వెలుగుతున్న దశలోనే వీరి కెరీర్‌ కూడా సాగడంతో జాతీయ జట్టులో మరో ఎడంచేతి వాటం స్పిన్నర్‌కు స్థానం లేకుండా పోయింది. 1975–76లో బేడీపై వేటు కారణంగా శివాల్కర్‌ జట్టులోకి వచ్చినా 12వ ఆటగాడిగా ఉన్నారు. శాంతా రంగస్వామి నేతృత్వంలో భారత మహిళల జట్టు 12 టెస్టుల్లో, 16 వన్డేల్లో తలపడింది. మరోవైపు వామన్‌ విశ్వనాథ్‌ కుమార్, దివంగత రమాకాంత్‌ దేశాయ్‌లకు బీసీసీఐ ప్రత్యేక అవార్డులు దక్కనున్నాయి. అవార్డులకు ముందు రోజు జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజనీర్‌ ఉపన్యసిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement