జబీర్‌ ముందంజ | Jabir Through To Semifinals at World Athletics Championship | Sakshi
Sakshi News home page

జబీర్‌ ముందంజ

Published Sat, Sep 28 2019 4:09 AM | Last Updated on Sat, Sep 28 2019 4:09 AM

Jabir Through To Semifinals at World Athletics Championship - Sakshi

దోహా: ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ను భారత్‌ కాస్త ఆశాజనకంగా ప్రారంభించింది. ఈ మెగా టోర్నీ ప్రారంభ ఈవెంట్‌ లాంగ్‌జంప్‌లో భారత ఆశాకిరణం శ్రీ శంకర్‌ మురళీ నిరాశపరిచినా... 400మీ. హర్డిల్స్‌లో మదారి పిళ్లై జబీర్‌ ముందంజ వేశాడు. పోటీల తొలిరోజు శుక్రవారం 400మీ. హర్డిల్స్‌ తొలి హీట్స్‌లో పాల్గొన్న జబీర్‌ మూడో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. అతను 49.62 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేశాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత ఆటగాడు ధరుణ్‌ అయ్యసామి హీట్స్‌లోనే వెనుదిరిగాడు. ధరుణ్‌ 50.93 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని... ఎనిమిది మంది పాల్గొన్న హీట్స్‌లో ఆరో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన వారు మాత్రమే సెమీస్‌కు అర్హత పొందుతారు. మరోవైపు లాంగ్‌జంప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడు శ్రీ శంకర్‌ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు.

20 ఏళ్ల ఈ యువ లాంగ్‌ జంపర్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో అత్యుత్తమంగా కేవలం 7.62 మీ. మాత్రమే జంప్‌ చేశాడు  27 మంది పాల్గొన్న ఈ పోటీల్లో 22వ స్థానంలో నిలిచాడు. తొలి ప్రయత్నంలో 7.52మీ. జంప్‌ చేసిన అతను రెండో ప్రయత్నంలో కాస్త మెరుగ్గా 7.62మీ. నమోదు చేశాడు. చివరిదైన మూడో ప్రయత్నంలో ఫౌల్‌గా వెనుదిరిగాడు. ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టాప్‌–12లో స్థానం దక్కించుకోవాల్సి ఉంటుంది. లేదా నిర్దేశిత ప్రమాణం 8.15మీ. జంప్‌ చేయాలి. శంకర్‌ పేలవ ప్రదర్శనతో పోటీల నుంచి ని్రష్కమించాడు. నేడు జరిగే పోటీల్లో భారత్‌ నుంచి 100మీ. మహిళల హీట్స్‌లో ద్యుతీచంద్, పురుషుల 400మీ. హర్డిల్స్‌ సెమీఫైనల్లో జబీర్‌... పురుషుల 4గీ400మీ. మిక్స్‌డ్‌ రిలే ఈవెంట్‌లో భారత జట్టు బరిలో దిగుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement