లోక్సభ ఎన్నికలకు డీఎంకే సన్నద్ధం అవుతోంది. ఒంటరి పయనమా? కూట మి ఏర్పాటా? అన్న అం శాన్ని తేల్చుకునే పనిలో పడింది.
చర్చించుకుందాం రండి: కరుణ
Aug 16 2013 3:32 AM | Updated on Sep 1 2017 9:51 PM
సాక్షి, చెన్నై : లోక్సభ ఎన్నికలకు డీఎంకే సన్నద్ధం అవుతోంది. ఒంటరి పయనమా? కూట మి ఏర్పాటా? అన్న అం శాన్ని తేల్చుకునే పనిలో పడింది. ఇందుకోసం పార్టీ వర్గాలతో చర్చించాలని కరుణానిధి నిర్ణయిం చుకున్నారు. శుక్రవారం అన్నా అరివాళయంలో జరిగే ఈ సమావేశానికి జిల్లా కార్యదర్శులందరూ తప్పని సరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. యూపీఏతో కటీఫ్ అనంతరం కేంద్రంపై డీఎంకే అధినేత కరుణానిధి విమర్శల స్వరాన్ని పెంచిన విషయం తెలిసిందే. రోజుకో ప్రకటనతో ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల సమయంలో డీఎంకే అభ్యర్థి కనిమొళికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం చర్చకు దారి తీసింది.
లోక్సభకు ఎన్నికలు వస్తే మళ్లీ యూపీఏతో డీఎంకే దోస్తీ కట్టడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అలాగే మతతత్వ పార్టీల్ని వ్యతిరేకించే కరుణానిధి, బీజేపీ ప్రచారకర్త మోడీ వీసా వివాద వ్యవహారంలో స్పం దించిన తీరు అందరినీ విస్మయంలో పడేసింది. లోక్సభకు ఎన్నికలు వస్తే కాంగ్రెస్, డీఎండీకేతో కలిసి డీఎంకే మెగా కూటమి ఏర్పాటు చేసేనా లేక ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొని కేంద్రంలో అధికారంలోకి వచ్చే వారికి అనుకూలంగా వ్యవహరించేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ చర్చలకు, ప్రశ్నలకు ముగింపు పలికే రీతిలో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు డీఎంకే అధినేత కరుణానిధి సిద్ధమయ్యారు. ఇందుకోసం పార్టీ జిల్లాల కార్యదర్శులతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కరుణానిధి పిలుపునిచ్చారని, అందరూ తప్పక హాజరుకావాలని జిల్లాల కార్యదర్శులకు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ గురువారం లేఖలు పంపారు. శుక్రవారం ఉదయం పది గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాళయంలోని మురసోలి అరంగంలో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల్లో కూటమి లేదా ఒంటరి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యే విధంగా సమర శంఖాన్ని పూరిస్తూ , పార్టీ కార్యక్రమాల్ని విస్తృతం చేయనున్నారు.
భద్రతలో ఇంత నిర్లక్ష్యమా..?
ఇక జలాంతర్గామిలో చోటు చేసుకున్న వరుస పేలుళ్లపై డీఎంకే అధినేత కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భద్రతలో ఇంత నిర్లక్ష్యం తగదంటూ కేంద్రంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముంబయిలో ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో జరిగిన పేలుళ్ల ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర గర్భం నుంచి దేశ భద్రతలో అనుక్షణం నిమగ్నమై ఉండే ఈ జలాంతర్గామిలో పేలుళ్లు జరగడం దేశ రక్షణలో నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశ రక్షణలో నిర్లక్ష్యాన్ని వీడి, అప్రమత్తంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు.
Advertisement
Advertisement