
వైఎస్సార్ సీపీలో చేరిన ఎమ్మెల్యే రౌతు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్
అభ్యర్థుల విజయానికి కృషి చేస్తా
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి రౌతును పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం రౌతు సూర్యప్రకాశరావు పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఒక నిబద్ధత, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకత్వం కలిగిన జగన్ వల్లే సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశచరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకేసారి అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిలాంటి సువర్ణ పాలనను ప్రజలు కోరుకుంటున్నారని, అది జగన్ వల్లే సాధ్యమవుతుందని అన్నారు.
తనకు వైఎస్ఆర్తో 25 ఏళ్ల రాజకీయ అనుబంధముందని గుర్తుచేశారు. వైఎస్ వల్లే తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, అయితే వైఎస్సార్ సీపీలోకి రావడానికి కొంత ఆలస్యం జరిగిందని వివరించారు. రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసం జగన్ నాయకత్వంలో పనిచేయాలని నిశ్చయించి వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న తాను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని, వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయనున్న బొమ్మన రాజ్కుమార్, ఆకుల వీర్రాజుల విజయానికి సహాయపడతానని చెప్పారు. అలాగే రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి విజయానికి కృషి చేస్తానన్నారు.
కర్నూలు నేతల చేరిక
కర్నూలు జిల్లాకు చెందిన నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి, రాజవర్ధన్రెడ్డిలు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనాయకురాలు భూమా శోభానాగిరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు డా.నౌమాన్ కూడా జగన్ను కలుసుకున్నారు.