వంతెన కూలి.. 20 మంది గల్లంతు
ఎప్పుడో బ్రిటిష్ వాళ్ల హయాంలో నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో దాదాపు 20 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. ఈ దారుణం మహారాష్ట్రలో ముంబై-గోవా జాతీయ రహదారిలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సంభవించింది. భారీ వర్షాల కారణంగా ఈ వంతెన కుప్పకూలడంతో రెండు బస్సులతో పాటు పలు వాహనాలు నదిలోకి పడిపోయాయి. బస్సులలో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గల్లంతైనవారిని గుర్తించేందుకు వీలుగా సీకింగ్ 42బి హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా ప్రయాణించగలదు.
మహద్ పట్టణంలో దాదాపు ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కూలిపోయింది. సావిత్రీ నదిలోకి వరదనీరు వచ్చి చేరడంతో వంతెన పడిపోయింది. బస్సులు, ప్రైవేటు కార్లు కూడా నీళ్లలోకి పడిపోయాయని అంటున్నారు. ముంబై నుంచి బయల్దేరిన రెండు బస్సులు గమ్యస్థానాలకు చేరుకోలేదు. ఇవి కూడా ఈ నదిలో పడిపోయాయనే స్థానికులు చెబుతున్నారు. జాతీయ విపత్తు నివారణ బృందాలు రంగంలోకి దిగాయి. 80 మంది రెస్క్యూ సిబ్బందితోపాటు డైవర్లను కూడా అక్కడకు పంపారు. ప్రధాని నరేంద్రమోదీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు ఫోన్ చేసి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఆ ప్రాంతంలో పక్కపక్కనే రెండు వంతెనలున్నాయని, వాటిలో పాతది కూలిపోయిందని ఫడ్నవిస్ తెలిపారు. మహారాష్ట్రలోని కొంకణ్, ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.