
ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు
లక్నో: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె.. శనివారం యూపీ సీఎం ఆదిత్యనాథ్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రామజన్మభూమిలో ఆలయ నిర్మాణానికి అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమన్నారు. 'ఆలయ నిర్మాణం కోసం జైలుకు వెళ్లడానికైనా, ఉరికంబం ఎక్కడానికైనా నేను రెడీ'అని ఉమాభారతి అన్నారు.
సీఎం యోగితోనూ ఇదే విషయంపై చర్చించారా? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ముఖ్యమంత్రితో రామాలయం గురించి మాట్లాడలేదని, అయితే, ఈ అంశం తమకు కొత్తదేమీ కాదని బదులిచ్చారు. అయోధ్యలో మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వారిలో సీఎం యోగి గురువు గురు మహంత్ అవైద్యనాథ్ ఒకరని ఉమాభారతి గుర్తుచేశారు. వివాదానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నందున ఇక తానేమీ మాట్లాడలేనన్నారు.