
దేశంలో వాహన విక్రయాల జోరు
న్యూఢిల్లీ: భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ వాహన అమ్మకాలలో గణనీయ వృద్ధిని సాధించింది. దేశీయ కార్ల అమ్మకాల్లో 10 శాతం వృద్ధిని, ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో 17 శాతం వృద్ధిని సాధించాయి. కార్ల అమ్మకాల్లో మారుతి, హ్యుందాయ్, బైక్స్ అమ్మకాల్లో హీరోమోటో కార్ప్, హోండా మోటార్ సైకిల్ , స్కూటర్ ఇండియా అగ్రభాగంలో నిలిచాయి. కార్ల అమ్మకాలు 9.62 శాతం ఎగబాకాయి. ముఖ్యంగా మార్కెట్ లీడర్గా గుర్తింపు పొందిన మారుతి సుజుకి విటారా బ్రెజా, హ్యుందాయ్ క్రెటా లాంటి యుటిలిటీ వాహనాలఅమ్మకాలు జోరు కొనసాగింది. దీంతో గతనెలలో పాసింజర్ వాహనాల అమ్మకాలు 16.78శాతానికి పెరిగాయి. భారత ఆటోమొబైల్ తయారీ సొసైటీ(ఎస్ఐఏఎం) ప్రకటించిన వివరాల ప్రకారం డొమెస్టిక్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,59,685 గా నమెదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో 2,22,368 యూనిట్లుగా ఉంది. వివిధ కేటగిరీల్లో మొత్తం వాహనాల అమ్మకాలు 18,33,976 యూనిట్లు. గత యేడాది 16,19,771 యూనిట్లతో పోల్చుకుంటే జూలైలో 13.22 శాతం పెరుగుదల నమోదయ్యింది.
యూవీ సెగ్మెంట్ లో మహీంద్ర అండ్ మహీంద్రా 15,962 యూనిట్ల అమ్మకాలతో 21 శాతం పెరిగాయి. టాటా మెటార్స్ 12,209 యూనిట్ల అమ్మకాలతో 43.29 గ్రోత్ సాధించింది. ద్విచక్రవాహనాల అమ్మకాలు 11 శాతం పెరిగాయి. 8,97,092 యూనిట్లు అమ్ముడుబోయాయి. గత జులైలో ఈ సంఖ్య 8,08,332 .అయితే టూవీల్ మార్కెట్ లీడర్ హీరో మోటో కార్ప్ 6.7 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది 4,19,950 గా వున్న అమ్మకాల సంఖ్య 4,48,119 యూనిట్లు కు పెరిగింది. కమర్షియల్ వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది 51,795 యూనిట్లుగా ఉండగా ప్రస్తుతం 51,853 గా నమోదయ్యాయి. 7వ వేతన సంఘం సిఫారసుల ఆమోదం, మంచి వర్షపాతం అంచనాలు సెంటిమెంట్ ను బలపర్చాయని ఎస్ఐఏఎం డిప్యూటీ సెక్రటరీ జనరల్ సుగాతో సేన్ మీడియాకు తెలిపారు.