
నేడు వాయుసేనలోకి భారీ రవాణా విమానం
భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) రవాణా సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సోమవారం ఐఏఎఫ్లో లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ: భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) రవాణా సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సోమవారం ఐఏఎఫ్లో లాంఛనంగా ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీలోని హిండన్ ఎయిర్బేస్లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. ఐఏఎఫ్ వద్దనున్న రవాణా విమానాల్లోకెల్లా సీ-17 ఎయిర్క్రాఫ్ట్ అతిపెద్దది కానుంది.
ఇప్పటివరకూ ఐఏఎఫ్లోని 40 టన్నుల సామర్థ్యంగల రష్యా తయారీ ఐఎల్-76 రవాణా విమానాలే అతిపెద్దవి. కొత్తగా ఏర్పాటు చేసిన 81 ‘స్కైలార్డ్’ స్క్వాడ్రన్లో సీ-17 ఎయిర్క్రాఫ్ట్లను ఐఎల్-76 విమానాల స్థానంలో వాడనున్నారు. సీ-17 రవాణా విమానం దాదాపు 80 టన్నుల బరువైన యుద్ధ సామగ్రితోపాటు 150 మంది సైనికులను ఏకకాలంలో మోసుకెళ్లగలదు. 2011లో అమెరికాతో సుమారు రూ. 20 వేల కోట్లకు కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అమెరికా అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి.