
పాక్ మమ్మల్ని బానిసల్లా చూస్తోంది
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో దాయాది ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలపై అక్కడి ప్రజలు గళమెత్తుతున్నారు
- దాయాదిపై మండిపడుతున్న పీవోకే ప్రజలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో దాయాది ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలపై అక్కడి ప్రజలు గళమెత్తుతున్నారు. పీవోకేలో కనీస అభివృద్ధి, స్వేచ్ఛ, రాజకీయ హక్కులు లేకపోవడంపై మండిపడుతున్నారు. పాక్ ప్రభుత్వం తీరుపై పీవోకే రాజకీయ నాయకులు, హక్కులు కార్యకర్తలు తాజాగా ధ్వజమెత్తారు. పీవోకే ఎంతమాత్రం పాకిస్థాన్ భూభాగం కాదని, ఈ విషయంలో పాక్ రాజకీయ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలని హితవుపలికారు.
'పీవోకేలోని ప్రజలను బానిసలుగా చూస్తున్నారు. ఇక్కడ రోడ్లు లేవు. ఫ్యాక్టరీలు లేవు. భావప్రకటనా స్వేచ్ఛ లేదు. పుస్తకాలను సైతం నిషేధించారు' అని పీవోకే రాజకీయ కార్యకర్త తైఫూర్ అక్బర్ తెలిపారు. 'ప్రజలను దేశద్రోహులుగా చూస్తున్నారు. జాతీయ యాక్షన్ ప్లాన్ పేరిట వారిని అపహరించి జైళ్లలో పెడుతున్నారు' అని వివరించారు.
'గిల్గిత్-బాల్టిస్తాన్, పీవోకే ప్రాంతాలు పాకిస్థాన్లో భాగం కాదు. ఈ విషయంలో పాక్ రాజకీయ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలి. గిల్గిత్-బాల్టిస్తాన్, పీవోకే ప్రాంతాల్లో పాక్ రాజకీయ పార్టీలు చేస్తున్న దోపిడీని అడ్డుకట్ట వేయాలి' అని పీవోకే రాజకీయ నాయకుడు మిస్ఫర్ ఖాన్ అన్నారు. పాక్ ప్రభుత్వ నీడలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పీవోకేలో గత కొన్నాళ్లుగా ప్రజల అసంతృప్తి భగ్గుమంటోంది. పాక్ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న సంగతి తెలిసిందే.