
మే 5న ‘పది’ ఫలితాలు!
హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5వ తేదీన విడుదల చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. గత నెల 14వ తేదీ నుంచి ప్రారంభమైన పరీక్షలు 30వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ప్రస్తుతం జవాబు పత్రాల మూల్యాకనం పూర్తి కావచ్చింది. డీకోడింగ్, ఫలితాల ప్రాసెస్ చేసేందుకు మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో 5వ తేదీన ఫలితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాల ప్రాసెస్లో ఏమైనా జాప్యం జరిగితే, 5వ తేదీన ఫలితాల వెల్లడి వీలుకాకపోతే 6వ తేదీన విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది.