
కేసీఆర్ ను గట్టిగా నిలదీయండి: వైఎస్ జగన్
పరకాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా రెండో రోజు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం పరకాలలో బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కేసీఆర్ మోజుతోనే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని వైఎస్ జగన్ అన్నారు. ఎంపీకి మంత్రి పదవి ఇచ్చి ఉప ఎన్నిక తెచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ 18 నెలల పరిపాలనలో ఎన్నికల హామీలను నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు. రైతు కష్టాలు, అన్నదాతల ఆత్మహత్యలపై కేసీఆర్ ను నిలదీయాలని ప్రజలకు సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి పాలనలో రైతులు, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 5 ఏళ్లలో 45 లక్షల ఇళ్లు కట్టిస్తే... కేసీఆర్ 18 నెలల పాలనలో 396 ఇళ్లు మాత్రమే కట్టించారని తెలిపారు.
వరంగల్ లో టీఆర్ఎస్ గెలిస్తే తన పాలన అంతా బాగుందని కేసీఆర్ భావిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దన్నారు. టీడీపీ ఓటు అడిగే అధికారం లేదన్నారు. ఎన్నికల హామీలపై బీజేపీని నిలదీయాలని సూచించారు. ఓటు అడిగే అధికారం తమ పార్టీకే ఉందని వైఎస్ జగన్ అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
- ఇవాళ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయన్నది ప్రజలు తమను తాము ప్రశ్నించుకోవాలి
- ఒక సవాలు విసిరి ఎన్నికలు జరిపి ఉంటే శభాష్ ముఖ్యమంత్రి అనేవాళ్లం
- కానీ ఓ ఎంపీతో రాజీనామా చేయించడం వల్ల ఈ ఎన్నికలు వచ్చాయి.
- మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లాలోనే ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినా వారికి మంత్రి పదవి ఇవ్వలేదు.
- ఎంపీని రాజీనామా చేయించి కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. అందుకే ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
- కేసీఆర్ పాలనలో కొచ్చిన 18 నెలల్లో ఒక్క వరంగల్ జిల్లాలోనే 158 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
- పత్తిరైతుల బాధను సీఎం కేసీఆర్ ఒక్కసారైనా ఆలకించారా?
- పత్తి క్వింటాలుకు రూ. 4,500 మద్దతు ధర అని చెప్పి.. రూ 3,500లకు కూడా పత్తి కొనడం లేదు
- దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు పత్తి క్వింటాలుకు రూ. 6,500 దాకా పలికింది.
- కేసీఆర్ 18 నెలల పాలనలో ఎన్ని ఎకరాల భూమిని దళితులకు పంచారు?
- ఈ 18 నెలల పాలనలో 1600 ఎకరాలు కూడా పంచలేదు
- అదే వైఎస్ఆర్ హయాంలో 20లక్షల 60 వేల ఎకరాల భూమిని పేదలకు పంచారు
- పేదవాళ్లు ఎందుకు అప్పులపాలు అవుతారని ఎప్పుడైనా కేసీఆర్ గారు ఆలోచించారా?
- అనారోగ్యం, రోగాల చికిత్స కోసం వడ్డీలకు అప్పులు తేవడం వల్లే పేదవాళ్లు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారు
- అందుకే పేదలందరినీ ఆదుకునేందుకు దివంగత నేత వైఎస్ఆర్ 108 హెల్ప్లైన్ ఏర్పాటు చేశారు.
- ఒక్క ఫోన్ కాల్ చేస్తే.. కుయ్యికుయ్యిమని అంబులెన్స్ వచ్చేలా ఏర్పాటు చూశారు.
- ఒక్కపైసా ఖర్చు లేకుండా పెద్దాస్పత్రుల్లో వైద్యం చేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు.
- కేసీఆర్ పాలనలో ఒక్క కొత్త అంబులెన్సును కూడా కొనలేదు.
- 8, 9 ఏళ్లుగా వాడుతున్న పాత అంబులెన్సులనే తిప్పుతున్నారు.
- ఈ రోజు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేరు
- మీ పాలనలో ఎందుకీ పరిస్థితి అని కేసీఆర్గారిని ప్రజలు ప్రశ్నించాలి
- చదువుల కోసం ఏ పేదవాడు కూడా అప్పులపాలు కాకూడదని దివంగత నేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకువచ్చారు.
- ఈ సంవత్సరం మొదలై ఆరు నెలలైంది. విద్యార్థులు కూడా కాలేజీలకు కూడా వెళుతున్నారు. అయినా గత సంవత్సరం ఫీజు బాకాయిలనే ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. ఫీజులు, స్కాలర్షిప్పులు విడుదల చేయడం లేదు.
- ఇదా ప్రభుత్వాన్ని నడిపించే పద్ధతి అని కేసీఆర్ను నిలదీయండి
- మార్కెట్కు ఎప్పుడైనా వెళ్లారా? ఎప్పుడైనా కందిపప్పు కొన్నారా? కేసీఆర్ గారు? అని అడుగండి.
- కందిపప్పు ధర ఇప్పుడు రూ. 200 దాటింది.
- ఈనాడు నిత్యావసర వస్తువుల రేట్లని ఆకాశాన్నంటుతున్నాయి. ఎలా సరుకులు కొనాలి?
- వరి కనీస మద్దతు ధర కన్నా తక్కువకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.
- ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఓటు వేసినా, వేయకపోయినా.. కేసీఆర్ ప్రభుత్వం పడిపోదు. కానీ పొరపాటున కేసీఆర్ పార్టీ గెలిస్తే మాత్రం తమ ప్రభుత్వ పాలన బాగుందని ఆయన ప్రజలను మరింతగా పట్టించుకోకుండా వదిలేసే అవకాశం ఉంది.
- 18 నెలల పాలనలో అది హైదరాబాద్లో మాత్రమే అక్షరాల 3,090 డబుల్ బెడ్ రూం ఇళ్లను మాత్రమే ప్రారంభించారు.
- ఇన్ని రోజుల పాలనలో మీరు కట్టించిన కొత్త ఇళ్లు ఎన్ని అని కేసీఆర్ గారు నిలదీయండి
- దివంగత నేత వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించారు.
- ఈ ఉప ఎన్నికలో ఓడిపోతేనే కేసీర్ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది.
- కేసీఆర్ది చేతగాని పాలన
- కాంగ్రెస్ అంత అధ్వాన్న పార్టీ దేశంలోనే ఉంది.
- బతికున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడ్డారు.
- ఆయన బ్రతికున్నంతకాలం మంచివారిగా పేర్కొన్న కాంగ్రెస్కు ఆయన చనిపోగానే చెడ్డనేతగా మారారు
- చంద్రబాబు ప్రభుత్వం కేసీఆర్ కన్నా దారుణమైన అబద్ధాలు చెపుతున్నది
- చంద్రబాబు ప్రభుత్వం మోసం, దారుణం తప్ప మరేమీ కాదు
- రాష్ట్రాన్ని విభజన సమయంలో బీజేపీ రెండు రాష్ట్రాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు.
- కాబట్టి ఈ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే నైతిక అర్హత, విలువలు గల ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే.
- వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్కు ఓట్లు వేసి.. అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నా.