Alluri Sitarama Raju District News
-
ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు చీకట్లు చెదిరిపోతున్నాయి. ఏపీఈపీడీసీఎల్ ప్రారంభించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం ద్వారా ప్రజల విద్యుత్ సమస్యలు వేగంగా పరిష్కారమవుతున్నాయి. సీఎండీ పృథ్వీతేజ్ స్వయంగా కాల్స్ స్వీకరిస్తూ అధికారులను కదిలించడంతో మారుమూల గ్రా
సాక్షి, విశాఖపట్నం: ఒక ఫోన్ నంబర్.. 8 వారాలు.. 11 జిల్లాలు.. 11 సర్కిళ్లు.. 345 ఫిర్యాదులు.. వచ్చిన ప్రతి ఫిర్యాదు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు.. మొత్తంగా వినూత్నంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రారంభించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి స్వయంగా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సోమవారం ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిష్కరించేందుకు సంబంధిత విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 345 ఫిర్యాదులు.. 35 పెండింగ్ ఇప్పటివరకు 8 వారాల పాటు డయల్యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 345 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 310 ఫిర్యాదులను ఈపీడీసీఎల్ అధికారులు పరిష్కరించారు. ఫోన్లో ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకే విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ఆ గ్రామానికి రావడంతో ఈ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా లోవోల్టేజీ సమస్యపై ఫిర్యాదులు అందుతున్నాయి. ఇప్పటివరకు 76 వరకూ లోవోల్టేజీ ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ పర్యవేక్షిస్తూ.. పరిష్కరిస్తున్నారు. 76 ఫిర్యాదుల్లో 62 పరిష్కరించారు. లోవోల్టేజీని అధిగమించేందుకు... 43 ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు మార్చారు. లోవోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 7.5 కి.మీ మేర పాత కండక్టర్లు మార్చడం విశేషం. మిస్డ్ కాల్స్పైనా దృష్టి పెడుతున్నాం.. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రతి సోమవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకూ ఫిర్యాదులు తీసుకుంటున్నాం. ఒక ఫిర్యాదు తీసుకున్న సమయంలో ఏవైనా మిస్డ్ కాల్స్ ఉంటే.. 11.30 గంటల తర్వాత ఆ నంబర్లకు ఫోన్ చేసి.. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ప్రతి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు, కొత్త సర్వీస్ కనెక్షన్ జాప్యం, విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి అంశాలను నేరుగా నా దృష్టికి తీసుకురావొచ్చు. –పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీదెబ్బలపాడు గ్రామస్తులతో ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది -
రెవెన్యూ సమస్యలపై సత్వర పరిష్కారం
● అలసత్వం వహిస్తే అధికారులపై కఠిన చర్యలు ● ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, విధి నిర్వాహణలో అధికారులు అసలత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. కలెక్టరేట్ వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారులతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ కాల్స్, కేవైసీ, రేషన్ పంపిణీ, పట్టదారు పుస్తకాల పంపిణీ తదితర వాటిపై సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రజా సమస్యల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యకు మార్గం చూపాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరంగా రేషన్ దుకాణాలు, డీఆర్ డిపోలను తనిఖీలు చేయాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇంటి పన్ను, నీటి పన్ను వసూళ్లపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇన్చార్జి డీఆర్వో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.నీలకంఠేశ్వరరావు, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
రహదారుల పనుల్లో నాణ్యత పాటించాలి
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల రహదారి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని జర్రెల పంచాయతీ కేంద్రంలో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు. గ్రామంలో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జర్రెల నుంచి మండిభ వరకు పంచాయతీరాజ్ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులకు ఎమ్మెల్యే మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గిరిజన గ్రామాల్లో సంక్షేమ పాలన జరిగిందని, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాన్ని కనీసం పట్టించుకోవడం లేదన్నారు. బడులు లేక విద్యార్థుల అవస్థలు పాడేరు ఐటిడిఏ పరిధిలో 168 పాఠశాలలకు భవనాలు లేక గిరిజన విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నాడు–నేడు ద్వారా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో అనేక ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని గుర్తు చేశారు. సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి గడప గడపకు సంక్షేమాన్ని అందించారన్నారు. ఇంటి వరకు పింఛన్లు, రేషన్ సరకులు అందించిన ఘనత నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం మాటల్లోనే తప్ప ఆచరణలో లేదని స్పష్టం చేశారు. పింఛన్ల పంపిణీలో తీసుకువచ్చిన మార్పులతో పింఛన్దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రేషన్ సరకుల కోసం కిలోమీటర్లు నడిచి వెళ్లి తీసుకు రావాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు పనులకు బిల్లుల విషయంలోనే నేటి ప్రభుత్వం అసత్యం ప్రదర్శిస్తుందన్నారు. రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత కోరవడుతుందన్నారు. గిరిజన ప్రాంతానికి మేలు జరిగేలా పాలన అందించాలన్నారు. ఎంపీపీ సీతమ్మ, సర్పంచులు భాగ్యవతి, నరసింగరావు, రమేష్, బాబూరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మీ, వైఎస్సార్సీపీ ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల అధ్యక్షులు పద్మరావు, చంద్రుబాబు, నాయకులు సురేష్, సుందరరావు, రాంప్రసాద్, సన్యాసిరావు, పాపారావు, దేవ, దాసు, తిరుపతి, రామ్మూర్తి, పులిరాజు, కొండలరావు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
ఆత్మీయ సన్మానం
చింతపల్లి: ఉన్నత సేవలతోనే మంచి గుర్తింపు ఉంటుందని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. లంబసింగి గిరిజన సంక్షేమ బాలకల ఆశ్రమ పాఠశాలలో పదవీ విరమణ పొందిన పీజీ హెచ్ఎం (పానల్ గ్రేడ్ హెచ్ఎం) జక్కు శంకరరావు దంపతులను దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గడిచిన 34 ఏళ్లుగా గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ జక్కు శంకరరావు ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఎంతోమంది గిరిజన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారన్నారు. ఉన్నత ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకోగలగారన్నారు. ఈ సందర్భంగా పలువురు శంకరరావు సేవలను కొనియాడారు. పీజీ హెచ్ఎంలు రాజు, సాగిన రామరాజు పడాల్, సింహాచలం, రాజంనాయుడు, పూర్వ విద్యార్థులు నూకరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజానికి సహకరించాలి
● పాడేరు డీఎస్పీ అభిషేక్ ● భూసిపుట్టు వారపు సంతలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ ముంచంగిపుట్టు: డ్రగ్స్ రహిత సమాజానికి ప్రజలంతా సహకరించాలని పాడేరు డీఎస్పీ ఆర్ఆర్విఎస్ అభిషేక్ అన్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు మండలంలోని భూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో పోలీసులు ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గంజాయి నివారణ, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆర్ఆర్విఎస్ అభిషేక్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయన్నారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు జైల్ పాలు అవుతుందని. దీంతో వారి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. గంజాయి రవాణా, సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలపై ఎటువంటి సమాచారం ఉన్న 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలన్నారు. ప్రజలంతా పోలీసుశాఖకు సహకరించాలని ఆయన కోరారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా గ్రామస్తులచే ప్రతిజ్ఞ చేయించారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నాని, పోలీసులు, గిరిజనులు పాల్గొన్నారు. -
మన్యంలో భారీ వర్షం
పాడేరు/గూడెం కొత్తవీది : ఏజెన్సీలో పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులు, భీరక శబ్ధాలతో భారీ వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా రెండు గంటల పాటు జోరు వానా కురిసింది. దీంతో రెండు గంటల పాటు జనజీవనం స్తంబించింది. విద్యుత్ సరఫరాకు కూడా కాస్త అంతరాయం ఏర్పడింది. రోడ్లన్ని పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా పంట పొలాల్లో భారీగా వర్షపు నీరు చేరింది. వేసవి దుక్కులను ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. జి.మాడుగుల: మండలంలో కురిసిన భారీ వర్షానికి పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గం జలమయమైంది. మండలంలో నుర్మతి, మద్దగరువు రోడ్డు, లువ్వాసింగి, సొలభం, వంజరి, గెమ్మెలి పోయే రోడ్డు మార్గాల్లో రాకపోకలు సాగించే ద్విచక్ర వాహహనదారులు వర్షానికి ఇబ్బందులు పడ్డారు. జి.మాడుగుల సంతబయలు గ్రామంలో జరిగిన వారపు సంతలో దుకాణదారులు అవస్థలు ఎదుర్కొన్నారు. పాడేరు మార్గంలో జాతీయ రహదారిలో బొక్కెళ్లు వద్ద ముంచెత్తిన వర్షపు నీటి వలన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
రిసార్ట్స్ నిర్వాహకులపైచర్యలకు డిమాండ్
పాడేరు రూరల్: రూప రిసార్ట్స్ నిర్వాహకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని (సీఆర్పీఎఫ్)బాలల పరిరక్షణ వేదిక రాష్ట్ర కో–కన్వీనర్ కాంగు శుభ(చిన్ని) డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అరకులోయకు చెందిన రూప ప్రైవేట్ రిసార్ట్స్ నిర్వాహకులు అమాయక గిరిజనులను టార్గేట్ చేసుకుని గంజాయి రవాణా చేస్తున్నారన్నారని ఆరోపించారు. గతంలో ఇదే రూప రిసార్ట్స్ నిర్వాహకులు స్థానిక కొంతమంది గిరిజన యువకులకు డబ్బులు ఆశ చూపించి అరకులోయ ప్రాంతం నుంచి గంజాయి రవాణా చేయిస్తుండగా విజయవాడలో పట్టుబడ్డారన్నారు. వారిపై కేసు నమోదైనప్పటికీ రిసార్ట్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇందులో భాగంగా రిసార్ట్స్ని కూడా సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంతో నామమాత్రంగా సుమోటుగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ విషయంపై ఇటీవల కలెక్టర్, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదులు కూడా చేశామన్నారు. సానుకులంగా స్పందించిన వారు తక్షణం చర్యలకు ఆదేశాలిస్తామని హమీ ఇచ్చిన్నట్టు ఆమె తెలిపారు. -
ఈవీఎం గోదాములోకలెక్టర్ తనిఖీ
పాడేరు : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద భద్రపరిచిన ఈవీఎం గోదాములను కలెక్టర్ దినేష్కుమార్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీలు చేశారు. ఈవీఎం గోదాముల వద్ద ప్రధాన ద్వారం సీల్ ఓపెన్ చేయించి గదుల్లో భద్రంగా ఉన్న ఈవీఎంలను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణుంగా తనిఖీలు చేసి అక్కడ పరిస్థితులను గమనించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈవీఎం గోదా ములను సీల్ వేయించారు, అక్కడ భద్రతగా ఉన్న పోలీస్ సిబ్బందికి పలు సలహాలు, సూచనాలు చేశా రు. అనంతరం విజిటింగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ బి.అరుణ్చంద్ర, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లక్ష్మయ్య, ఎలక్షన్ సెల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులున్నారు. -
పరుగు పోటీల్లో కండక్టర్ సత్తా
పద్మనాభం: గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 30, 31 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ అథ్లెటిక్ పోటీల్లో అనంతవరం గ్రామానికి చెందిన కొండిమాని రాంబాబు అద్భుత ప్రతిభ కనబరిచారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన, ఈ క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. విశాఖ జిల్లా తరపున 35, 45 సంవత్సరాల పురుషుల విభాగాల్లో రాంబాబు పాల్గొన్నారు. 100 మీటర్ల పరుగు పందెం, 4x100 మీటర్ల రిలే పరుగు పందెంలో బంగారు పతకాలను సాధించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కండక్టర్గా విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల పట్ల ఆయన చూపుతున్న ఆసక్తిని పలువురు అభినందించారు. -
ఉపాధి పనుల కల్పనలో అలసత్వం వహిస్తే చర్యలు
డుంబ్రిగుడ: ఉపాధి హామీ పనుల ప్రగతి, కల్పనలో అలసత్యం వహిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ విద్యాసాగర్ అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 16వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు. ఎంపీపీ బాకా ఈశ్వరి సమక్షంలో పనులు వివరాలను వివరించారు.ఉపాధి హామీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమశాఖ, సామాజిక పింఛన్లపై సామాజిక తనిఖీల వివరాలతో ప్రజావేదికను నిర్వహించారు. 2024–25 మార్చి 31 వరకు జరిగిన పనులపై సమగ్ర వివరాలతో ప్రజావేదికలో పొందుపరిచారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వేతన రూపంలో రూ 29.46 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ 74.21 లక్షలతో కలిపి రూ.30.20 కోట్ల పనులు, పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.2.98కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.14.68 కోట్లతో పనులు జరిగినట్టు వెల్లడించారు. జాబ్కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైస్ ఎంపీపీ ఆనంద్రావు, ఏపీడీ పవన్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో విశ్వనాథ్, ఏపీవోలు సంగంనాయుడు, దొరబాబు, గిరిజన, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అజయ్కుమార్, అభిషేక్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.డ్వామా పీడీ విద్యాసాగర్ -
సురక్షిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
అల్లిపురం: నగరంలో ప్రజల భద్రతను మెరుగుపరచడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి కోరారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరానికి చెందిన సుమారు 35 మంది ఇన్ఫ్లూయెన్సర్లతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ, సోషల్ మీడియా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుత్సాహంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ధైర్యం నింపడం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, చిట్ఫండ్ మోసాలు, ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించడం, హెల్మెట్ ధారణ ఆవశ్యకత, రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడం, పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన స్పీడ్ లేజర్ గన్స్ పనితీరుపై సమాచారం అందించడం తదితర అంశాలపై వీడియోలు, సందేశాల రూపంలో విస్తృత ప్రచారం కల్పించాలని సీపీ కోరారు. అనంతరం ఇన్ఫ్లూయెన్సర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్ఫ్లూయెన్సర్లకు సీపీ శంఖబ్రత బాగ్చి పిలుపు -
15 కిలోల గంజాయి పట్టివేత
గంజాయిని పట్టుకున్న సెక్యూరిటీ వింగ్ (ఆర్ఐ) టీం పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తరలిస్తున్న గంజాయిని పెందుర్తి రైల్వే స్టేషన్ వద్ద సెక్యూరిటీ వింగ్(ఆర్ఐ) టీం పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పెందుర్తి ప్రాంతంలో ఆర్ఐ బృందం తనిఖీలు నిర్వహించింది. నార్కోటిక్ డాగ్ సహాయంతో రైల్వే స్టేషన్ వద్ద 4 ప్యాకెట్లలో 15 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయితో పాటు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆంగ్లభాష ప్రాముఖ్యత పెరుగుతోంది
అనకాపల్లి : ఆంగ్లభాష ప్రాముఖ్యత నేటి ఆధనిక ప్రపంచంలో ప్రచండ వేగంతో దూసుకుపోతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో ఏపీ ఎంఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ఆంగ్ల అధ్యాపకుడు విల్లూరి ఉమామహేశ్వరరావు రచించిన ‘ట్రాన్స్మ్యుటేషన్ ఆఫ్ హిస్టరీ లిటరేచర్’ పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుస్తక సాహిత్యం ద్వారా ఆంగ్ల భాషాభివృద్ధి చేసుకోవాలనుకునే వారికీ, ఆంగ్లభాష వ్యక్తీకరణని అభివృద్ధి చేసుకోదలచుకునే వ్యక్తులకు క్లుప్తంగా ఆంగ్లభాషపై మంచి పట్టు సంపాదించుకుని తనదైన శైలిలో ఆంగ్లంలో భావప్రకటన చేయదలచుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, ఇతర వర్గాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పుస్తక రచయిత డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో భారతీయుల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు, వారు ఎదుర్కొన్న సవాళ్లు తదితర విషయాలను, వివిధ రకాల రచయితల రచనా పటిమను పరిగణనలోనికి తీసుకుంటూ రాసిన పుస్తకం ఆద్యంతం ఆసక్తిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు అప్పారావు, కిషోర్, సాయిరామ్. పలాసరావు(పోస్టల్ డెవలప్మెంట్ ఆఫీసర్), కాళిదాస్, టి.లక్ష్మీనాయుడు పాల్గొన్నారు. -
రెండు బైక్ల ఢీ... ఇద్దరు యువకుల మృతి
డుంబ్రిగుడ : మండలంలోని గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలోని ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎస్ఐ ఎల్.సురేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అరకులోయ మండలం మాదల పంచాయతీ తోటవలస గ్రామానికి చెందిన కిల్లో జోషప్(23) అనే గిరిజన యువకుడు బంధువుల ఇంటి నుంచి స్వగ్రామానికి బయలుదేరగా, హుకుంపేట మండల గడుగుపల్లి గ్రామానికి చెందిన మువ్వల శ్రీను(28) అనే యువకుడు తన స్నేహితుడితో చటువాలో జరుగుతున్న పండగను చూసేందుకు బయలుదేరారన్నారు. గోరాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటరు దూరంలో రాత్రి వేళ రెండు బైకులు బలంగా ఢీ కొన్నాయని చెప్పారు. సంఘటన స్థలంలోనే శ్రీను మృతి చెందగా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న జోషప్ అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో యండపల్లివలసలో మృతి చెందారని ఎస్ఐ తెలిపారు. వారితో పాటు మరొకరు గాయాలతో ఉండగా ఆసుపత్రిలో చేర్పించారని తెలిపారు. మృతదేహాలను అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించడం జరిగిందన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతి చెందిన మువ్వల శ్రీను, (ఫైల్) -
రూ.3 కోట్ల ప్రభుత్వ భూమికి స్కెచ్?
మధురవాడ: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అక్రమార్కులు తెగబడుతున్నారు. మధురవాడ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన భూమిని కొట్టేయడానికి నియోజకవర్గ ముఖ్యనేత పేరును వాడుకుంటూ దర్జాగా పనులు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కబ్జాదారులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. రూ.3 కోట్లు విలువ చేసే భూమి విశాఖ రూరల్ మండలం, మధురవాడ రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 388 పరిసరాల్లో ఈ దందా సాగుతోంది. మధురవాడ హైవే నుంచి ఐటీ సెజ్కు వెళ్లే మార్గంలో, వికలాంగుల కాలనీ వద్ద అదానీ డేటా సెంటర్ రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం ధర బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.60 వేల వరకు పలుకుతోంది. అంటే సుమారు రూ.3 కోట్ల విలువైన ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా పథకం రచించారు. గతంలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలోని తుప్పలను తొలగించి, కొండ భూమిని చదును చేసే పనులు మొదలుపెట్టారు. ఇంత దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమణకు తెరలేపడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణ పనుల్లో జీవీఎంసీ వాహనం ఈ కబ్జా పర్వంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూ ఆక్రమణను అడ్డుకునేందుకు వచ్చిన గ్రేడ్–2 వీఆర్వో, అక్కడ జరుగుతున్న పనులను నిలిపివేయించారు. భూమిని చదును చేస్తున్న పొక్లెయిన్ను సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలించేందుకు ప్రయత్నించగా.. అది జీవీఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన వాహనమని తేలడంతో విస్తుపోయారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నేత నుంచి ‘సదరు వ్యక్తులు మనవారే.. వదిలేయండి’అంటూ హుకుం జారీ కావడంతో అధికారి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడానికి ఏకంగా ప్రభుత్వ వాహనాన్నే వాడటం చూస్తుంటే, ఈ వ్యవహారం ఎంతటి స్థాయి వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతుందో అర్థమవుతోంది. అసలు సూత్రధారులు ఎవరు? అసలు అక్రమార్కుల పనులకు జీవీఎంసీ వాహనాన్ని పంపిన అధికారులు ఎవరు? ఈ కబ్జా వెనుక జీవీఎంసీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.. లేక ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ వాహనాన్ని ఉపయోగించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
కందిపప్పు కలేనా.. రాగులు గతమేనా?
మహారాణిపేట: పేదల ఆహార భద్రతకు అండగా ఉండాల్సిన రేషన్ దుకాణాలు ఇప్పుడు అరకొర సరఫరాలతోనే సరిపెట్టుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలలు దాటినా, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పూర్తి స్థాయిలో నిత్యావసరాలు అందకపోవడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఎన్నికల ముందు రేషన్ ద్వారా విభిన్న నిత్యావసరాలు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రస్తుతం బియ్యం, పంచదారకే పరిమితమవుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే కందిపప్పు, రాగులు పంపిణీ చేస్తూ ‘మూన్నాళ్ల ముచ్చట’గా మార్చేసిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. పిండితో సరిపెడుతున్న సర్కార్ బియ్యం, పంచదార తప్ప మరేమీ ఇవ్వకుండానే కాలం గడిపేస్తున్న చంద్రబాబు సర్కార్, తాజాగా పట్టణ ప్రాంతాల్లో రూ. 20లకే గోధుమ పిండి ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది. అయితే, గ్రామీణ ప్రజలకు ఈ సౌకర్యం లేకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పోషకాహారం పేరిట చేస్తున్న ఈ హడావుడి, క్షేత్రస్థాయిలో కేవలం కొందరికి మాత్రమే అందుతోంది. జిల్లాలో పరిస్థితి ఇలా... డీఎస్ఓ పరిధిలో మధురవాడ, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి ప్రాంతాలు ఉండగా, జిల్లాలో 5.12 లక్షల తెలుపు కార్డులు, 600కు పైగా చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అయినప్పటికీ సరఫరా లోపాలు సరిచేయడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఆశలు... ఇంకా నిరీక్షణలోనే.. గడప గడపకు రేషన్ అని చెప్పిన పాలకులు, ఇప్పుడు రేషన్ షాపుల్లో సరుకులకే కత్తెర వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరల నేపథ్యంలో, రేషన్ దుకాణాలపై ఆధారపడే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కందిపప్పు, రాగులు వంటి అవసరమైన వస్తువులు అందకపోవడంతో పేదల భోజనంలో పోషకాహారం తగ్గిపోతోంది. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి కందిపప్పు, వంటనూనె వంటి నిత్యావసరాలను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.రాగులు మున్నాళ్ల ముచ్చటే.. రాగులు మూడు కిలోలు ఇస్తామని చెప్పి చివరకు ఒక కిలోకే పరిమితం చేయడం కార్డుదారుల్లో అసంతృప్తిని పెంచింది. అంతేకాకుండా రాగులు ఇచ్చినప్పుడు బియ్యం కోటాలో కోత విధించడం మరో సమస్యగా మారింది. అది కూడా జనవరి నెల వరకే ఇచ్చారు. ఈనెల రాగులకు ఇండెంట్ పెట్టలేదు. అంటే ఈ నెల ఒక్క కిలో పంపిణీ చేసే అవకాశం లేదు.రేషన్ దుకాణాల్లో నిత్యావసరాల కోసం ఎదురు చూసే కార్డుదారులకు నిరాశే మిగులుతోంది. ఎన్నికల హామీల్లో చెప్పిన కందిపప్పు, రాగులు ఇప్పుడు మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోగా, నెలల తరబడి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో అమాంతం పెరిగిన ధరల మధ్య రేషన్పై ఆధారపడే పేదలు కందిపప్పు, రాగుల కోసం కళ్లప్పగించి ఎదురుచూస్తుండటం పరిస్థితి తీవ్రతను చూపుతోంది. కందిపప్పు కోసం కళ్లప్పగింత గత ప్రభుత్వ హయాంలో ప్రతి కార్డుదారుడికి నెలకు ఒక కిలో కందిపప్పు అందించేవారు. ప్రస్తుతం అది గతస్మృతిగా మారింది. ఏప్రిల్లో కూడా కందిపప్పు పంపిణీ చేసే సూచనలు కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి ఇండెంట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. మార్కెట్లో కందిపప్పు ధరలు రూ.150 నుంచి రూ.180 వరకు పెరగడంతో, సాధారణ ప్రజలకు కొనుగోలు భారంగా మారింది. దీంతో రేషన్ ద్వారా తక్కువ ధరకు లభించే కందిపప్పుపైనే అనేక కుటుంబాలు ఆధారపడుతున్నాయి. -
గిరిజన యువతి మృతిపై పోలీసుల విచారణ
దేవరాపల్లి : మండల కేంద్రంలో సోమవారం రాత్రి అనంతగిరి మండలం కొరపర్తికి చెందిన గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. యువతి ఉరి వేసుకున్న గదిలో క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు. దేవరాపల్లికి చెందిన యువకుడు కొల్లి లోకేష్ ప్రేమ పేరుతో వంచించి మోసం చేయడాన్ని తట్టుకోలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి పెంటయ్య ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతురాలి కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు మంళవారం స్థానిక పోలీస్స్టేషన్కు అధిక సంఖ్యలో తరలివచ్చి లక్ష్మి మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్టీ కులానికి చెందిన యువతి కావడంతోనే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించాడని, దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ తల్లిదండ్రులను ఇద్దరు తమ్ముళ్లు, చెల్లిని పోషిస్తున్న లక్ష్మి మృతితో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మాట్లాడుతూ గిరిజన యువతి మృతిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ రక్షణ చట్టం కింద పరిహారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్ట పరిహారం, రెండు ఎకరాల భూమి, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కె.కోటపాడు సీహెచ్సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. -
దేవస్థానం సొసైటీ ఎన్నికల్లో హరి ప్యానెల్ గెలుపు
సింహాచలం: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికలు ప్రహ్లాదపురంలోని సొసైటీ కల్యాణమండపంలో మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 206 ఓట్లకు 168 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి నిరంజన్ పట్నాయక్ తెలిపారు. 9 మంది సభ్యులకు గాను పోటీలో 14 మంది(రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం విధుల్లో నిలిచిన ఉద్యోగులు) నిలిచారు. వీరిలో డి.వి.ఎస్.రామరాజు(హరి) ప్యానెల్ విజయం సాధించింది. డి.వి.ఎస్.రామరాజు, గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సుంకర సన్యాసిరావు(తాతాజీ), టీపీఎన్ మూర్తి, వై.అప్పారావు, ముగ్గు వరహాలరావు, లంక సూరిబాబు, కోరాడ శ్రీనివాస సాయి, గెడ్డపు సన్యాసి విజయం సాధించారు. బుధవారం అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకోనున్నారు. -
నిందితుడు రవీంద్రను ఉరితీయాలి
మహారాణిపేట: ‘నా బిడ్డను అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఈ కష్టం పగవారికి కూడా రాకూడదు’అంటూ మౌనిక తండ్రి పొలిపల్లి వేణుగోపాల్ కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం కేజీహెచ్ మార్చురీ వద్ద తన కుమార్తె మృతదేహాన్ని చూసి ఆయన బోరున విలపించారు. తన కుమార్తెను హత్య చేసిన చింతాడ రవీంద్రను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన సమయంలో మౌనిక ఒంటిపై ఉన్న సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయని వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసుపై ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించి, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని వేడుకున్నారు. -
మేడపై నుంచి పడి యువకుడు మృతి
అచ్యుతాపురం రూరల్ : ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడి అలబాని రామకృష్ణ (22) అనే యువకుడు మృతి చెందిన సంఘటన అచ్యుతాపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లారస్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అచ్యుతాపురం వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న మనోహర్ హాస్టల్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉదయం సుమారు 5.30 గంటల సమయంలో మూడో అంతస్తుపై నుంచి పడిపోవడం చుట్టుపక్కల వారు కొద్ది సేపటికి గమనించి 108 ఆంబులెన్స్ ద్వారా అచ్యుతాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల సమయంలో రామకృష్ణ మృతి చెందాడు. ఘటనపై తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ చంద్రశేఖర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
స్టీల్ప్లాంట్ తల్లీ.. ఇక సెలవు
● ఓ కార్మికుడి వీడ్కోలు స్టీల్ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నమస్కారం చేస్తున్న అప్పలరాజు ఉక్కునగరం: విశాఖ ఉక్కు కర్మాగారం రుణం తీర్చుకోలేనిదని స్టీల్ప్లాంట్ కార్మికుడు గొందేశి అప్పలరాజు అన్నారు. స్టీల్ప్లాంట్ రోల్షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగానికి చెందిన జనరల్ ఫోర్మెన్ అప్పలరాజు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా మంగళవారం పదవీ విరమణ చేశారు. విభాగంలో సహోద్యోగుల మధ్య జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన ఇంటికి బయల్దేరారు. స్టీల్ప్లాంట్ నుంచి బయటకు వచ్చిన అప్పలరాజు ఉద్వేగానికి లోనయ్యారు. స్టీల్ప్లాంట్ మెయిన్ గేటుకు నమస్కారం చేసి కన్నీటి పర్యంతమయ్యారు. 35 ఏళ్ల తన సేవలను పూర్తి చేసుకుని వెళ్లడం బాధగా ఉందన్నారు. తన కన్న తల్లి తర్వాత తల్లి లాంటి స్టీల్ప్లాంట్ తనకు మంచి జీవితం, కుటుంబాన్ని ఇచ్చిందన్నారు. స్టీల్ప్లాంట్ రుణం తీరుకోలేనిదంటూ భావోద్వేగానికి లోనయ్యారు. సహోద్యోగులు ఆయనను ఓదార్చి ఇంటికి పంపించారు. -
రౌడీలతో భూ ఆక్రమణకు యత్నం
పూర్వం నుంచి తమ ఆక్రమణలో ఉన్న పీడబ్ల్యూడీ భూమిలో పెంచుకున్న జీడిమామిడి, పనస చెట్లను దౌర్జన్యంగా నరికివేసి తన భూమిలోకి అక్రమంగా చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించిన విషయమై తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని, దీంతో ఆక్రమణదారులు రౌడీలతో తమపై దాడులకు దిగుతున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించడంతో పాటు నా భూమిని రక్షించాలంటూ అనకాపల్లి మండలం దిబ్బపాలెం గ్రామానికి చెందిన భార్యభర్తలు కాండ్రేగుల సత్యవతి, సూర్యారావు ఫిర్యాదు చేశారు. చెట్ల నరికివేతపై పోలీసులు కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కోరారు. – కాండ్రేగుల సూర్యారావు -
రుణాల పరిమితి పెంచాలి
పాడేరు: వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలు పెంచుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు రైతులకు అందే విధంగా చూడాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ సోమవారం కలెక్టర్ దినేష్కుమార్ అధ్యక్షతన లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మూడో త్రైమాసిక బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారులు, సంఘాలకు పెట్టుబడి రుణ సహాయంతో ప్రోత్సహించాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా కలిగిన రైతులకు రుణ వితరణ, కౌలు రైతులకు, పశు సంవర్ధక , పిషరీష్, పట్టు పరిశ్రమలకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, రుణాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు రుణాలు మంజూరు చేసి ప్రోత్సహించాలన్నారు. పరిశ్రమల శాఖకు సంబంధించి ముద్ర రుణాలు, తయారీ, సేవా రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ రుణాలు మంజూరు చేయాలన్నారు. జిల్లాలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో అరకులోయలో ప్రారంభిస్తామన్నారు. ప్రతినెల రెండు ధఫాలుగా స్వయం ఉపాధి ద్వారా వ్యాపారం ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో కొత్త బ్యాంకులను ప్రారంభించి మారుమూల గ్రామాలకు సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ రాజ, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి నవీన్, నాబార్డ్ డీడీఎం గౌరీశంకర్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు, ఎస్బీఐ, ఏపీజీవీబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ, ఇతర బ్యాంకుల మేనేజర్లు, పరిశ్రమల శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యం అంచనా జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి క్రెడిట్ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2026–27 ఆర్ధిక సంవత్సరానికి రూ.2,730 కోట్ల క్రెడిట్ సామర్థ్యాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం జిల్లా స్థాయి క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ దినేష్కుమార్ -
నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలి
పాడేరు: జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా బడ్జెట్ రూ.3,067.076కోట్లు కాగా అరకు నియోజకవర్గానికి రూ.1545.823 కోట్లు, పాడేరు నియోజకవర్గానికి రూ.1460.793 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఆయా నియోజకవర్గాలకు ఐదుగురు అధికారులతో నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభ దశలో వారానికి రెండుసార్లు సమీప ఆస్పత్రుల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 3426 పీఎం జన్మన్ గృహాలకు 1385 గృహాలు పూర్తయినట్టు చెప్పారు. అనంతరం ఆమె మండలంలోని గొండెలి పంచాయతీ పిల్లిపుట్టు గ్రామంలో నాలుగు గృహాలను ప్రారంభించారు. గృహాలన్నీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, రాష్ట్ర జానపద కళలు, సాంస్కృతిక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సతీష్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి -
గ్యాస్ తంటా.. కట్టెల వంట
ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరతకట్టెలపొయ్యిలే ఆధారం నిర్వాహకులఅవస్థలుపట్టించుకోని అధికారులు పెదబయలు: మండలంలో వంటగ్యాస్ కొరత ఏర్పడింది. మండలంలోని 14 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాలతో పాటుగా గురుకుల పాఠశాల వసతి గృహాలకు గ్యాస్ కొరత వేధిస్తోంది. గత పది రోజుల నుంచి కట్టెల పొయ్యిపైనే వంటలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో గ్యాస్ స్టాక్ లేకపోవడంతో వినియోగదారులు ముంచంగిపుట్టు, పాడేరు. ఇతర ప్రాంతాల నుంచి అధిక రేట్లకు గ్యాస్ కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఆశ్రమ పాఠశాలలకు సరఫరా చేసే గ్యాస్కు సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేయకపోవడంతో కొరత నెలకొందని దీంతో సరఫరాలో జాప్యం జరిగినట్టు పలువురు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం అవస్థలు పెదబయలు భారత్ గ్యాస్ గోదాములో సోమవారం ఉదయం గ్యాస్ లోడ్ వచ్చింది. దీంతో గొదాము వద్ద వినియోగదారులు బారులు తీరారు. గ్యాస్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే సరఫరా జరుగుతుందని జీసీసీ సిబ్బంది ప్రకటించారు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వినియోగదారులు అవస్థలు పడ్డారు. కాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా గ్యాస్ అందకపోవడంతో వినియోగదారులు నానా అవస్థలు పడ్డారు. కొన్ని ఆశ్రమ పాఠశాలలకు మాత్రమే సిలిండర్లు సరఫరా చేశారు. ఆశ్రమ హాస్టళ్లు, పాఠశాలలకు నాలుగు రోజుల్లో గ్యాస్ సరఫరా చేస్తామని గొదాము సిబ్బంది హామీ ఇచ్చి ఆయా పాఠశాలల నిర్వాహకులను పంపినట్టు తెలిసింది. ఇప్పటికై నా ప్రభుత్వం, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. గ్యాస్ కొరత వాస్తవమే ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో గ్యాస్ కొరత ఉంది. వారం రోజుల నుంచి కట్టెల పొయ్యిపై వండుతున్నారు. సోమవారం స్థానిక గ్యాస్ గోదాముకు లోడ్ వచ్చినా సంక్షేమ పాఠశాలలు, ఆశ్రమ హాస్టళ్లకు సరఫరా చేయలేదు. అయితే ముంచింగిపుట్టు గ్యాస్ గోదాము నుంచి అత్యవసరంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –జగత్రాయ్, ఏటీడబ్ల్యూవో, పెదబయలు కొరత లేకుండా చర్యలు గ్యాస్ స్టాక్ రెండు వారాల అనంతరం రావడం జాప్యం వల్ల కొరత ఏర్పడింది. అత్యవసరంగా హాస్టల్స్కు కావాల్సి వస్తే ముంచంగిపుట్టు గోదాము నుంచి సరఫరా చేయిస్తాం. ఒక్క లోడ్ వచ్చినా సరిపడడం లేదు. మరో లోడ్ కోసం ఆర్డర్ పెట్టాం. మరో నాలుగు రోజుల్లో లోడ్ రావచ్చు. గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. –సుబ్బారెడ్డి, గ్యాస్ గోదాము ఇన్చార్జి -
సర్పంచులకు ‘చెక్’ పవర్ కట్
మహారాణిపేట: గ్రామ పంచాయితీల సర్పంచుల పదవీకాలం ముగియక ముందే వారి అధికారాలను కూటమి ప్రభుత్వం పరిమితం చేయడం వివాదాస్పదంగా మారింది. ఏప్రిల్ 2తో సర్పంచుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో, నిధుల దుర్వినియోగం జరుగుతుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తుగా పలు ఆంక్షలు విధించింది. ఇప్పటివరకు స్వేచ్ఛగా చెక్కులు జారీ చేసిన సర్పంచులు, ఇప్పుడు వాటిని నేరుగా వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. చెక్కుల మంజూరు అధికారాన్ని డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (డీఎల్డీవో) చేతుల్లోకి మార్చారు. దీంతో గ్రామ పాలనలో సర్పంచుల పాత్ర గణనీయంగా తగ్గింది. పెత్తనమంతా డీఎల్డీవోలదే.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి సర్పంచుల అధికారాలపై తీవ్రస్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. జిల్లాలోని 79 గ్రామ పంచాయతీల్లో మెజారిటీ సర్పంచులు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కావడమే ఈ ఆంక్షలకు ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచులు జారీ చేసే చెక్కులను నేరుగా ఆమోదించకుండా, పంచాయతీ అధికారుల ద్వారా డివిజన్ లెవల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనుమతిని తప్పనిసరి చేశారు. వృథా ఖర్చులు చేస్తారనే సాకుతో పాలక వర్గాలను ఆర్థికంగా కట్టడి చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపేనా? జిల్లాలోని మూడు వంతుల పంచాయతీల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులే సర్పంచులుగా ఉండటంతో, వారిని ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గతంలో పదవీ కాలం ముగిసే వరకు సర్పంచులకు పూర్తి స్వేచ్ఛ ఉండేదని, కానీ ఇప్పుడు కొత్త పద్ధతుల పేరుతో తమను అధికారులు వేధిస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 3 నుంచి ’స్పెషల్’ పాలన జిల్లాలోని పంచాయతీల రూపురేఖలు ఏప్రిల్ 3 నుంచి మారనున్నాయి. భీమిలి మండలం రేఖవానిపాలెం మినహా (దీనికి ఇంకా ఏడాది గడువు ఉంది), మిగిలిన 78 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగనుంది. ఏప్రిల్ 2వ తేదీ అర్ధరాత్రితో సర్పంచుల పదవీ కాలం ముగియనుండటంతో, మరుసటి రోజు నుంచే పగ్గాలు చేపట్టేందుకు 78 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. -
ఎస్పీ కార్యాలయంలో 64 ఫిర్యాదులు
అర్జీదారుల సమస్యలను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 64 అర్జీలు వచ్చాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు ఎస్పీ తుహిన్ సిన్హాకు వివరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల వేదికలో వచ్చి అర్జీలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు–31, కుటుంబ కలహాలు–2, మోసపూరిత వ్యవహారాలు–5, ఇతర విభాగాలకు చెందినవి–26 వచ్చినట్టు తెలిపారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్జీల్లో భూ సమస్యలే అధికం
పీజీఆర్ఎస్–167, రెవెన్యూ క్లినిక్కు 181 అర్జీలుతుమ్మపాల : పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిల్లోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని దరఖాస్తులపై కారణాలు అర్జీదారులకు వివరంగా తెలియజేయాలన్నారు. పీజీఅర్ఎస్కు 167, రెవిన్యూ క్లినిక్లో 181 మొత్తం 348 అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామ మాణి, మెప్మా పీడీ కె.సరోజిని, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అర్జీల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి...పలు అర్జీదారుల ఫిర్యాదుల వివరాలిలా ఉన్నాయి... మైనింగ్ అధికారులపై ఫిర్యాదు చింతలూరు సర్వే నెం.379–1 లో గ్రాంట్ ఆర్డర్ లేకుండా జరిగిన 3వేల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్పై విచారణ కోరుతూ నర్సీపట్నం మైనింగ్ అధికారులకు చేసిన ఫిర్యాదుపై ముందు తేదీలతో తప్పుడు నివేదికలు ఇచ్చి, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్లను ఉద్దేశపూర్వకంగా నిరాకరించడం, గ్రామస్తులను మోసం చేసి సంతకాలు సేకరించడంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాడుగుల మండలం, చింతలూరు గ్రామానికి చెందిన మెలిపాక మణికంఠ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 379–1లో అక్రమాలపై చేసిన ఆరు ఫిర్యాదులను నీరు గార్చడానికి మైనింగ్ అధికారులు, క్వారీ నిర్వాహకులు కలిసి నేరపూరిత చర్యలకు పాల్పడారని వారిపై చర్యలు తీసుకోవాలని, మైనింగ్ అధికారుల ప్రమేయం లేకుండా స్వతంత్ర టాస్క్ఫోర్స్ కమిటీతో పునర్విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేటు వద్ద బీజేపీ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. -
కౌమార దశలో గర్భధారణతో దుష్ప్రభావాలు
తుమ్మపాల : కౌమార దశలో (చిన్న వయసులో) గర్భం దాల్చడం వల్ల కలిగే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘కౌమార దశలో గర్భధారణ – కారణాలు, దుష్ప్రభావాలు అవగాహన‘ గోడ పత్రికలను ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అక్కడక్కడా బాల్య వివాహాలు జరుగుతుండడం విచారకరమని, దీనివల్ల బాలికలు శారీరక, మానసిక సమస్యలకు గురవుతున్నారని అన్నారు. లైంగిక అవగాహన లోపం, బాల్య వివాహాలు, పేదరికం, సరైన తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. బాల్య వివాహాలను అరికట్టడం, బాలికల విద్యను ప్రోత్సహించడం, అనుమానాస్పద సంఘటనలపై తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి, సిబ్బంది పాల్గొన్నారు. జీరో పావర్టీ పీ4 కార్యక్రమం తొలి వార్షికోత్సవం కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయ కృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తిరుపతి పద్మావతీ మహిళా యూనివర్సిటీలో పీ4 వార్షికోత్సవాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్లో ఆమెతో పాటు జేసీ, గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ల సురేంద్ర, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ కుమార్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని గిరిజన యువతి ఆత్మహత్య
దేవరాపల్లి: గిరిజన యువతి దూసరి లక్ష్మి(22) సోమవారం రాత్రి దేవరాపల్లిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు కొరపర్తి గ్రామానికి చెందిన పెంటయ్య, జమ్ములమ్మ దంపతుల ఇద్దరు కుమార్తెలు దేవరాపల్లిలో ఐదేళ్లగా నివసిస్తున్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి స్థానిక ప్రైవేటు మెడికల్ ల్యాబ్లోను, చిన్న కుమార్తె భవాని సెల్ దుకాణంలోను పని చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో తన అక్క ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోతున్నట్లు వేరొక వ్యక్తి ఫోన్ ద్వారా తెలుసుకున్న చెల్లెలు భవాని వెంటనే తాము అద్దెకుంటున్న గదికి పరుగులు తీసింది. అప్పటికే అక్క చున్నీతో ఉరేసుకొని విగతజీవిగా ఉండటాన్ని చూసి బోరున విలపించింది. ఈమె ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని మృతురాలి చెల్లెలు భవాని చెప్పినట్లు తెలిసింది. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతిరాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని కె.కోటపాడు సీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువతి ఆత్మహత్యతో దేవరాపల్లిలోపాటు కొరపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
పుస్తక పఠనంతో విజ్ఞానం
డుంబ్రిగుడ: మండలం కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో ఉమ్మడి జిల్లాల చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులను అడిగి గ్రంథాలయంలో గల సౌకర్యలపై ఆరా తీశారు. శాఖ గ్రంథాలయంలో కావలసిన అవసరాలను గురించి గ్రంథాలయ అధికారి సునీతకు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కొత్తగా వచ్చిన పుస్తకాలు కొనుగోలు చేయమని కోరారు. పుస్తక పఠనం అలవర్చుకోవాలని, దీంతో విస్తృతంగా విజ్ఞానం పొందవచ్చన్నారు. వైఫై సేవలు ఆధునీకరణ చేస్తామని చైర్మన్ అన్నారు. పాఠకులు తదితరులు పాల్గొన్నారు. -
శేషతల్పంపై అప్పన్న తిరువీధి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మూడవరోజు సోమవారం స్వామికి శేషతల్పవాహనంపై విశేషంగా తిరువీధి నిర్వహించారు. స్వామి కల్యాణ ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను శేషతల్పంపై వేంచేపు చేసి, సింహగిరి మాడవీధిలో ఊరేగించారు. ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఊరేగింపులో ఏర్పాటు చేసిన కోలాటం, పలు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరువీధి అనంతరం రాత్రి వేళ ఆరాధన, విశేష హోమాలు, గ్రామబలిహరణం, మంగళాశాసనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చక బృందం ఆధ్వర్యంలో ఈ క్రతువులు జరిగాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు వైదిక సదస్యం, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పండిత సదస్సు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వారు సర్వజన మనోరంజని వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా మంగళవారం స్వామి మూలవిరాట్ స్వర్ణ నారసింహుడి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి దర్శనాలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై, రాత్రి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని దేవస్థానం అధికారులు తెలిపారు.నేడు పండిత సదస్సు -
లీజు విధానం... ఆలయ భూముల ఆక్రమణలకు ఊతం
జిల్లాలో హిందు దేవాలయాల భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టి భూములను రక్షించడంతో పాటు శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునఃనిర్మాణం చేయాలని బీజేపీ జనతా వారధి కోకన్వీనర్ జిల్లా ఉపాధ్యక్షుడు దొగ్గా ఈశ్వరప్రసాధ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రైవేటు భూములు దేవాలయ భూముల జాబితాలో కలిసిపోయాయనే నెపంతో వందల ఎకరాల దేవాలయ భూములను ఆక్రమించేస్తున్నారని, దీంతో పాటు 33 ఏళ్ల పాటు దేవాలయ భూముల లీజు విధానం సరైంది కాదని అధికారులు పునఃపరిశీలన చేయాలన్నారు. జీవో నెం.139ను పూర్తిగా రద్దు చేయాలని, ఆక్రమణను రెగ్యులరైజ్ చేయడం నిలిపివేయాలని, దేవాలయాల ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికే ఖర్చుచేసేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దింతో పాటు ఏళ్ల తరబడి సంచార జాతులగా నివాసముంటున్న కుటుంబాలను గుర్తించి వారికి కులధ్రువీకరణ పత్రాలు అందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని మరో వినతి పత్రం అందించారు. –దొగ్గా ఈశ్వరప్రసాధ్ -
ఐదు నెలలుగా విద్యుత్ మీటర్ కోసం...
సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుని చీకట్లోనే నివాసముంటున్నామని, నూతన విద్యుత్ మీటర్కు ఫీజు కట్టి ఐదు నెలలు అవుతున్నా విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం లేదని, తక్షణమే తమకు విద్యుత్ సౌకర్యం కల్పించాలంటూ మాడుగుల మండలం చింతలూరు గ్రామానికి చెందిన భార్యభర్తలు గుడేపు దుర్గాలు, లక్ష్మి పీజీఆర్ఎస్లో వినతి అందించారు. రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే తాము చీకట్లోనే నివాసముండాల్సి వస్తుందని, చుట్టుపక్కల అందరికీ అందించిన విద్యుత్ సౌకర్యం తమకు కూడా అందించి న్యాయం చేయాలని ఆమెను కోరారు. –గుడేపు లక్ష్మి అధికారుల అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా కొనుగోలు చేసిన భూమిని తన పేరున కాకుండా రెవెన్యూ అధికారులు రీసర్వేలో ఇతరుల పేరున ఆన్లైన్ చేయడంతో తన భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, తక్షణమే రిజిస్ట్రేషను జరగకుండా నిలిపివేసి తన పేరున ఆన్లైన్ చేయాలంటు కశింకోట మండలం అచ్చెర్ల గ్రామానికి చెందిన కర్రి రాజేశ్వరి రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేశారు. దస్తావేజు నెం.2199/2023 దిన ఉన్నప్పటికీ 2024లో జరిగిన రీసర్వేలో ఇతరుల పేరున వీఆర్వో ఆన్లైన్ చేయడం దారుణమని, తక్షణమే విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. –కర్రి రాజేశ్వరి -
రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నట్టు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగ నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు అల్లూరి జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను వెల్లడించారు. డివిజన్ల పరిధిలో వర్షపాతం 0.2 నుంచి 6.0 మిల్లీ మీటర్లు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 32.2 డిగ్రీలు నుంచి 32.9 డిగ్రీలు మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల నుంచి 16.9 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 77 నుంచి 82 శాతం మధ్యాహ్న సమయాల్లో 50 నుంచి 75 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు ఆరు కిలోమీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నట్టు తెలిపారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు పంటలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ తెలిపారు. -
రాయి పిక్కలు ఏరుకున్నా టాక్స్ కట్టాల్సిందేనా..?
మైనింగ్ సిబ్బందితో గ్రామస్తుల వాగ్వాదంరావికమతం : గ్రావెల్, రాయి ఏదైనా తెచ్చుకోవాలంటే మైనింగ్ సిబ్బందికి డబ్బులు కట్టాల్సిందే.. లేదంటే కుదరదంటున్నారు మైనింగ్ సిబ్బంది. మండలంలో గర్నికంలో ఇంటి నిర్మాణానికి రాయి పిక్కలను తీసుకొస్తుండగా ఏఎంఆర్ సంస్థ మైనింగ్ సిబ్బంది అడ్డుకోవడంపై మహిళలు తిరగబడ్టారు. కొండ ప్రాంతంలో రాయి పిక్కలు ఏరుకొని తీసుకొస్తుండగా టాక్స్ కట్టమనడం ఎంత వరకు సమంజసం.. అంటూ మైనింగ్ కంపెనీ సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం గర్నికం గ్రామస్తులు, సర్పంచ్ భర్త నూకరాజు ిమైనింగ్ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెంధిన కొందరు మహిళలు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. గచ్చులు చేయడానికి రాయి పిక్క అవసరం కావడంతో సమీపంలో గల మెట్ట ప్రాంతంలో చిన్న రాయి పిక్కలను పోగుచేసుకొని వాటిని ట్రాక్టర్లో వేసి తీసుకెళుతుండగా ఏఎంఆర్ మైనింగ్ సంస్థ సిబ్బంది టాక్స్ కట్టాలని అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇస్తుంటే , రాయి పిక్కలకు ట్యాక్స్ కట్టడం ఏంటని ప్రశ్నించారు. దీంతో సర్పంచ్ భర్త నూకరాజు తదితరులు అక్కడికి చేరుకొని మైనింగ్ సంస్థను తప్పు బట్టారు. రాయి పిక్కలకు కూడా ట్యాక్స్ కట్టాలని ఉందా , ఉంటే అందుకు సంబంధించిన జీవో చూపించాలని నిలదీశారు. ప్రతి దానికి ట్యాక్స్ కట్టాల్సి వస్తే సామాన్యులు ఎలా బతకాలి... అని కూటమి ప్రభుత్వం సంపద సృష్టించడం అంటే ఇదేనా? అంటూ మహిళలు వాపోయారు. -
కోర్టు ఆదేశాలు ధిక్కరణ
గొలుగొండ: మండలంలోని సీహెచ్ నాగాపురం చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేయకూడదని కోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ధిక్కరించారు. మళ్లీ పనులు చేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శ్మశాన వాటిక ఉంది. ఆ స్థలాన్ని వదిలేసి కూటమి నేతలు రైతులకు ఉపయోగపడే చెరువు గర్భంలో శ్మశాన వాటిక పనులు చేస్తున్నారు. ప్రస్తుతం చెరువు గర్భంలో ఏర్పాటు చేస్తున్న శ్మశాన వాటిక పాఠశాలకు ఆనుకుని ఉండటం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతారని ప్రజలు ఆర్నెల్ల క్రితం వ్యతిరేకించారు. దీంతోపాటు రైతులు ఇబ్బందులు పడే అవకాశముందని గ్రామస్తులు, పంచాయతీ పాలకులు కోర్టును ఆశ్రయించారు. దాంతో చెరువు గర్భంలో పనులు నిలుపుదల చేయాలని నాలుగు నెలలు క్రితం కోర్టు ఎంపీడీవో, పీఆర్, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పనులు నిలుపుదల చేశారు. మళ్లీ రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా పనులు చేయడంపై గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించి పనులు చేస్తున్న అధికారులుపై జిల్లా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
సరదా కోసం వెళ్తే.. ప్రాణం పోయింది
ఆనందపురం: గంభీరం రిజర్వాయర్లో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన మలిరెడ్డి నితిన్ (20), తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్డీ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మధురవాడలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటున్న నితిన్.. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా తన స్నేహితులతో కలిసి ఆటోలో గంభీరం రిజర్వాయర్ సందర్శనకు వెళ్లాడు. రిజర్వాయర్లో స్నేహితులు ఈతకు దిగగా, నితిన్ ఒడ్డున ఉన్న సిమెంట్ గోడపై కూర్చున్నాడు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అపస్మారక స్థితిలో నితిన్ను బయటకు తీసి, 108కు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నితిన్ను పరీక్షించి.. అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడి సోదరుడు, ఐసీఐసీఐ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్గా పనిచేస్తున్న మలిరెడ్డి దీక్షిత్ ఫిర్యాదు మేరకు ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆ కుటుంబంలో విషాద చాయలు అలముకున్నాయి. ఎస్ఐ పి.శివ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రిజర్వాయర్లో పడి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం -
అడవుల సంరక్షణ అందరి బాధ్యత
ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణముంచంగిపుట్టు: అడవులకు నిప్పు పెట్టకుండా ప్రకృతి సంపదను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ అన్నారు.మండలంలోని రంగబయలు పంచాయతీ గొబ్బరిపడ గ్రామంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అడవులకు నిప్పు పెట్టడం వలన కలిగే అనర్థాలపై అటవీశాఖాధికారులు గిరిజనులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవిలో అడవుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ మాట్లాడుతూ అడవులకు నిప్పు పెట్టడం వల్ల పర్యావరణ వ్యవస్థ, వన్యప్రాణులు, మానవాళికి తీవ్ర ముప్పు కలుగుతుందని, అమూల్యమైన ప్రకృతి సంపద, చెట్లు, జీవ వైవిధ్యాన్ని నాశనమవుతుందన్నారు. వేసవిలో వ్యవసాయ వ్యర్థాలు, ఎండుగడ్డిని కాల్చవద్దని, ఎక్కడైనా మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అటవీ అధికారులకు సమాచారం అందించాలని, అడవులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. అనంతరం జోడిగుమ్మ నుంచి గొబ్బరిపడ వరకు వచ్చే ఆర్వోఎఫ్ఆర్ రహదారిపై ఫారెస్ట్ అధికారులు, పిఆర్ అధికారులు సర్వే వేశారు. పీఆర్ ప్రాజెక్ట్సు ఏఈ అశోక్, ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీను, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
దువ్వాడ మీదుగా మరో రెండు వీక్లీ ఎక్స్ప్రెస్లు
వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ ముంచంగిపుట్టు: జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకై బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సును నిర్వహించనున్నట్టు తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.16.45కోట్లతో సర్వే నెం.5లోని జోలాపుట్టు పంచాయతీలో వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు జోలాపుట్టు గ్రామ సచివాలయంలో సదస్సు నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులు, స్థానికులు హాజరై తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. ఆర్ఐ భాస్కర్, వీర్వోలు తదితరులు పాల్గొన్నారు. -
దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం నర్సీపట్నం: అన్యాక్రాంతమైన దళితుల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం పేర్కొన్నారు. గొలుగొండ మండలం జోగంపేట గ్రామంలో ఆదివారం ఆయన పర్యటించి దళితల భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాండవ నిర్వాసితులమైన తమకు కోటవురట్ల మండలం పందూరు గ్రామంలో అసైన్డ్ భూములు ప్రభుత్వం ఇచ్చిందని బాధిత దళిత రైతులు కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకువెళ్లారు. ఏ సంబంధం లేని పెత్తందారులు తమ భూముల్లో ఫలసాయాన్ని అనుభవిస్తున్నారని వాపోయారు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వివరించారు. దీనికి సీతారాం స్పందిస్తూ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం బాలుర గురుకుల కళాశాల, పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎస్సీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ కె.మరిడియ్య, గురుకుల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చిట్ల చతపతిరావు, తహసీల్దార్ కె.నూకరాజు, ఎంపీడీవో శ్రీనువాసరావు, ఎస్సై రామారావు, రుషికేశ్వరరావు, ఏఎస్డబ్ల్యూవో బాబూరావు, డీహెచ్పీఎస్ నాయకులు డీసీహెచ్ రాజు, డీవీఎంఎస్ సభ్యులు సహదేవుడు, ఈరెల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఉరేసుకుని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని మర్రిబంద కాలనీకి చెందిన మామిడి వెంకటేష్(34) ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. వివరాలివి. మృతుడికి బాగా మద్యం సేవించే అలవాటు ఉండడం వల్ల భార్యతో తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం బంధువులతో కలిసి తలుపులమ్మలోవ దర్శనానికి వెళ్లడానికి అందరూ తయారు కాగా అంతకుముందే ఉదయం వెంకటేష్ మద్యం సేవించడంతో మళ్లీ భార్యభర్తలకు చిన్న గొడవ జరిగింది. దీంతో వెంకటేష్ తలుపులమ్మలోవకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండిపోయాడు. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి పడకగదిలో చీరతో వెంకటేష్ ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. భార్య ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బెట్టింగ్ల ఉచ్చులో పడొద్దు
అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. -
నేత్రపర్వంగా ఎదురు సన్నాహం
నక్కపల్లిలో ఎదురు సన్నాహ మహోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం నక్కపల్లి: ప్రాచీన శైవక్షేత్రం ఉపమాకలో భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమన సంప్రదాయం ప్రకారం కల్యాణోత్సవాలు జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారిని సప్పర వాహనంలోను, పార్వతీ దేవిని పల్లకిలో అలంకరించి కోలాట ప్రదర్శనలతో నక్కపల్లిలో మైలవరభట్ల జోగారావు ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి ఆది దంపతుల పెళ్లి చూపులు, పెళ్లిమాటల కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం మంచిరాజు సూర్యనారాయణ మూర్తి (సహరాపంతులు), శింగంశెట్టి నాని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెండ్లిమాట తంతు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఉపమాక ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు వెలవలపల్లి మహేష్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి కొప్పిశెట్టి బుజ్జి వేదపండితులు పసర కొండ పండు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీవిరామారావు, శ్రీపాద ప్రణవ్రామ్ పాల్గొన్నారు. -
ఇదేం ‘పచ్చ’పాతం
● దేవరాపల్లి పార్కులో శిలాఫలకాల ఏర్పాటులో ప్రొటోకాల్కు తూట్లు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులకు శ్రీకారం ● శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన అప్పటి డిప్యూటీ సీఎం బూడి ● తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు ● శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని మూలన పడేసిన వైనం దేవరాపల్లి: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పార్కులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా మూలన పడేయడం వివాదస్పదమైంది. తాజాగా పార్కు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వీఎంఆర్డీఏ అధికారులు శంకుస్థాపన శిలాఫకం ఏర్పాటులో పక్షపాత వైఖరిని ప్రదర్శించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా శిథిలావస్థకు చేరుకుని దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఇరిగేషన్ క్వార్టర్స్ను తొలగించి ఆహ్లాదకర పార్కు, యోగా భవనం, వాకింగ్ ట్రాక్ నిర్మించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సంకల్పించారు. అప్పట్లోనే వీఎంఆర్డీఏ నుంచి రూ. 75 లక్షలు మంజూరు చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సగం పనులను సైతం అప్పట్లోనే పూర్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేసింది. ఈ నెల 13న పార్క్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్తో కలిసి ప్రారంభించారు. పైలాన్ నిర్మించి ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు, పార్కు నిర్మాణ సమయంలో వేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని యోగా భవనంలో మూలన విడిచిపెట్టడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారదర్శకంగా వ్యవహరించాల్సిన అధికారులు కూటమి నేతల మెప్పు కోసమే ఇలా వ్యవహరించారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో పేర్లు రాయించడంలోను వీఎంఆర్డీఏ అధికారులు ప్రొటోకాల్కు తూట్లు పొడిచారు. ఎంపీపీ, జెడ్పీటీసీ పేర్లు లేకుండా చేసి ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రొటోకాల్ పాటించకుండా పక్షపాతంగా వ్యవహరించిన వీఎంఆర్డీఏ అధికారుల తీరుపై కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
లారీ ఢీకొని యువకుడి మృతి
ప్రమాద స్థలంలో లోకేష్ మృతదేహం మాకవరపాలెం: మండలంలోని తామరం వేంకటేశ్వర ఆలయ సమీపంలో శనివారం అర్ధరాత్రి లారీ ఢీకొని యువకుడి దుర్మరణం చెందాడు. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన చింతాడ లోకేష్(25) కశింకోట మండలం సుందరయ్యపేటలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన మోటార్ సైకిల్పై మాకవరపాలెం వైపు వస్తున్నాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి తాళ్లపాలెం వైపు ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో లోకేష్ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై లోకేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దామోదర్నాయుడు ఆదివారం తెలిపారు. లారీని పట్టుకున్నామన్నారు. -
కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఎంవీపీకాలనీ: నగరంలోని కమ్యూనిటీ ప్రాంతాల అభివృద్ధికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం ఎంవీపీకాలనీలోని అప్పుఘర్, వాసవానిపాలెం సాగర తీర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్లూమ్బర్గ్ ఫిలాంత్రోపీస్ 2025–2026 మేయర్స్ చాలెంజ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంపికై న 24 నగరాల్లో విశాఖ ఒకటిగా నిలవడం గర్వకారణమన్నారు. ఈ విజయం ఫలితంగా నగరంలో ‘వి–పుల్’(విశాఖ–ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్) కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో భాగంగా శివగణేష్నగర్, వాసవానిపాలెంలోని మత్స్యకారులతో మాట్లాడి, ఆయా ప్రాంతాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు, కాలువల మరమ్మతులతో పాటు గ్రీన్ బెల్ట్లను అభివృద్ధి చేయాలని మత్స్యకార గ్రామాల పెద్దలు కమిషనర్కు విన్నవించారు. ‘వి–పుల్’ద్వారా ప్రజా భాగస్వామ్యంతో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు జీవీఎంసీ సిద్ధంగా ఉందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జెడ్సీ శివప్రసాద్, వైద్యాధికారి ప్రసాదరావు, పలువురు వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ -
ఇమ్మానుయేలు సంస్థ హాస్టల్లో అగ్నిప్రమాదం
● ప్రమాద సమయంలో లేని విద్యార్థులు ● తప్పిన పెనుప్రమాదం మాకవరపాలెం: హాస్టల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని కొండల అగ్రహారంలో ఇమ్మానుయేలు సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందిన 80 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా నిత్యం ఉదయం తామరంలో సంస్థకు చెందిన ఎడ్యుకేషన్ క్యాంపస్లోని స్కూల్కు బస్సుపై వెళ్లి తిరిగి సాయంత్రం హాస్టల్కు చేరుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మూడు అంతస్థులు కలిగిన హాస్టల్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో స్థానికులు గమనించిన వెంటనే స్పందించి మంటలు చెలరేగిన గదుల్లో ఎవరూ లేకపోవడంతో రెండో అంతస్థులో ఉన్న పది మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ప్రతి ఆదివారం ఈ విద్యార్థులంతా హాస్టల్కు సమీపంలో సంస్థకు చెందిన చర్చికు వెళతారు. ఆదివారం కూడా సుమారు 70 మంది వరకు చర్చికి వెళ్లడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇదే అగ్నిప్రమాదం రాత్రి వేళలో జరిగితే ఎందరో విద్యార్థులు మృత్యువాత పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరిగి నా గాయపడేవారన్నారు. ఈ సంఘటనలో హాస్టల్లో ఉన్న ఒక బైక్తోపాటు విద్యార్థుల పుస్తకాలు, బట్టలు ఉంచిన పెట్టెలు కాలిపోయాయి. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నా రు. కాగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. హాస్టల్ను పరిశీలించిన ఎంఈవో హాస్టల్ను ఎంఈవో మూర్తి పరిశీలించారు. ఈ సందర్భంగా మంటలు చెలరేగిన హాస్టల్ భవనం, కాలిపోయిన విద్యార్థులు పెట్టెలను పరిశీలించారు. హాస్టల్లో ఉంటున్న విద్యార్థుల సంఖ్యను తెలుసుకున్నారు. నివేదికను డీఈవోకు అందజేశామని, విద్యార్థులను ఇక్కడి నుంచి తామరంలో ఇమ్మానుయేలు సంస్థకు చెందిన మరో హాస్టల్కు తరలించామని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. -
మంచినీటి కోసం గిరిజనుల అవస్థలు
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు మదనగురువులో గిరిజనులు మంచినీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. తాగునీటి సదుపాయం లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న గెడ్డలో ఊట నీరే తమకు శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కలెక్టర్ స్పందించి తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చేతులు జోడించి వేడుకున్నారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి బి.టి. దొర మద్దతు పలికారు. అటవీ ప్రాంతంలో జీవిస్తున్న గిరిజనులను అడవి జంతువుల కంటే హీనంగా చూస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. గిరిజనులను ఉద్ధరించేందుకు అడవి బాట పట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇక్కడ కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గెడ్డలో కలుషిత నీరు తాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ తదితర విష జ్వరాల బారినపడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ పాలకులు యుద్ధప్రాతిపదికన స్పందించి మంచినీటి సదుపాయం కల్పించాలని, లేకుంటే వచ్చే నెల 2న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని బాధిత గిరిజనులు హెచ్చరించారు. కార్యక్రమంలో పాంగి కన్నయ్య, పాంగి రామన్న, మామిడి చిన్నయ్య, పాంగి పెద భీమన్న, పాంగి చిన బీరాజు, పాంగి సన్యాసమ్మ, పి. దేముడమ్మ, సూకురి లక్ష్మి, మామిడి సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలి నిరసన -
మరికొంతకాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరో మూణ్నెల్ల పాటు పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. ● విశాఖపట్నం –షాలిమర్ (08508) స్పెషల్ రైలు ప్రతి మంగళవారం విశాఖపట్నంలో ఉదయం 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్ల వారు 3 గంటలకు షాలిమర్ చేరుకుంటుంది. ఈ రైలును జూన్ 30 వరకు పొడిగించారు. షాలిమర్–విశాఖపట్నం (08507) స్పెషల్ ప్రతీ బుధవారం షాలిమర్లో తెల్లవారుజాము 5గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 8.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలును జూలై 1వ తేదీ వరకు పొడిగించారు. ● సంబల్పూర్– ఈరోడ్ (08311) వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం సంబల్పూర్లో ఉదయం 11.35 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 9.32 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 10.50 గంటలకు ఈరోడ్ వెళ్తుంది. ఈ రైలును మే 27వ తేదీ వరకు పొడిగించారు. ఈరోడ్–సంబల్పూర్ (08312) వీక్లీ స్పెషల్ను మే 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ఈరోడ్లో ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ్నుంచి 1.10 గంటలకు బయల్దేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్పూర్ వెళ్తుంది. ● భువనేశ్వర్–యశ్వంత్పూర్(02811) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 27వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శనివారం భువనేశ్వర్లో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 1.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.55 గంటలకు బయల్దేరి సోమవారం తెల్లవారుజాము 12.15 గంటలకు యశ్వంత్పూర్ వెళ్తుంది. యశ్వంత్పూర్–భువనేశ్వర్ (02812) వీక్లీ ఏసీ స్పెషల్ను జూన్ 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి సోమవారం తెల్లవారుజాము 4.30 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 10.55గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● యశ్వంత్పూర్–కతిహార్(06571) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 14వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి మంగళవారం యశ్వంత్పూర్లో ఉదయం 7 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 5 గంటలకు విజయనగరం చేరుకుంఉటంది. అక్కడి నుంచి 5.10 గంటలకు బయల్దేరి గురువారం తెల్లవారుజాము 4.30గంటలకు కతిహార్ వెళ్తుంది. కతిహార్–యశ్వంత్పూర్ (06572) వీక్లీ ఏసీ స్పెషల్ను జూలై 17వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు ప్రతి శుక్రవారం తెల్లవారుజాము 5.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజాము 3.40 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజుఉదయం 4గంటలకు భువనేశ్వర్ వెళ్తుంది. ● ఎస్ఎంవీ బెంగళూరు–మాల్డా టౌన్(06565) స్పెషల్ రైలును జూలై 12వతేదీ వరకు పొడిగించారు. ఎస్ఎంవీ బెంగళూరులో ఈ రైలు ప్రతి ఆదివారం రాత్రి 11.40 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15గంటలకు బయల్దేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06566) స్పెషల్ను జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. ఈ రైలు బుధవారాల్లో సాయంత్రం 4గంటలకు మాల్డా టౌన్లో బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.33గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.35గంటలకు బయల్దేరి మరుసటిరోజు శుక్రవారం మధ్యా హ్నం 12.45 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. -
మరణంలోనూ వీడని స్నేహం
ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి మునగపాక: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు శారదానదిలో స్నానానికి వెళ్లి ఒకేసారి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఉమ్మలాడలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఇక్కడ శారదానదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరూ మునిగిపోయి మృతి చెందారు. ఎస్ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణ్కుమార్ (26), తాడి హర్షవర్దన్ (24) అనకాపల్లిలోని వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇరువురు కలిసి సమీపంలోని ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన ఇద్దరూ నదిలో ఒక్కసారిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి అనకాపల్లి రెండొందల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అందివస్తారనుకున్న కొడుకులు నదిలో మునిగిపోయి ఇలా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
చంద్రబాబు బినామీల కోసమే అమరావతి నిర్మాణం
అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వంలో మాత్రం చంద్రబాబు బినామీల కోసమే అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పరిపాలన రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూల్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందేనన్నారు. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, అమరావతే రాజధాని అని అసెంబ్లీలో తీర్మానం చేయడం సిగ్గు చేటన్నారు. విచ్చలవిడిగా బెల్టుషాపులు కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటుచేసి, మారుమూల గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్టు షాపులతో మద్యపానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అమాయక గిరిజనులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, పల్టాసింగ్ విజయ్ కుమార్, పార్టీ నాయకులు కొర్రా అర్జున్రావు, విజయదశమి, శెట్టి మోహన్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి ప్రాధాన్యం కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
పరిశోధన, సాధనతోనే మంచి వక్తగా ఎదగగలరు
డాబాగార్డెన్స్: నగరంలోని పలు జేసీఐ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఒక హోటల్లో ‘ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్’ కార్యక్రమం నిర్వహించా రు. జేసీఐ వాల్తేర్, వైజాగ్ అచీవర్స్, స్మార్ట్, రాయల్స్, పెందుర్తి పర్ల్స్, మధురవాడ మ్యాగ్నెట్స్, వైజాగ్ కింగ్స్ , అరకు న్యూలైట్స్ సంస్థలు కలిసి ఈ శిక్షణను ఏర్పాటు చేశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీఐ ఇండియా జోన్–4 అధ్యక్షుడు ఆర్పీపీ చైతన్య వసంతవాడ మాట్లాడుతూ.. సభ్యులు తాము నేర్చుకున్న నైపుణ్యాలను నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలని సూచించారు. జోన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్పీపీ బి. దిలీప్ కుమార్ పాల్గొని సభ్యులను ఉత్సాహపరిచారు. ప్రధాన శిక్షకులుగా డాక్టర్ శివ సత్యనారాయణ, సహ శిక్షకులుగా సేన్ సంతోష్ నిమ్మని వ్యవహరించి, వక్తృత్వ కళలో మెళకువలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే విధానాలపై శిక్షణ ఇచ్చారు. జోన్ కో–ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యశోద కృష్ణ, బి. శిరీష, మోనిక శ్రీనివాస్, టి. ప్రవీణ్ కుమార్, లంక బేబి, అశోక్ కుమార్ పాల్గొన్నారు. -
అల్లూరి జిల్లా నూతన కలెక్టర్గా నిశాంతి
● కలెక్టర్ దినేష్కుమార్ బదిలీ పాడేరు : అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ల బదిలీ కారణంగా దినేష్కుమార్ ను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2017బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న టి.నిశాంతిను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా నియమించారు. ఆమె రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. -
ఇచ్ఛాపురం ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు పెట్టాలి
పాడేరు : టీడీపీకి చెందిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆదివాసీలపై చేసిన వాఖ్యలు ఏ మాత్రం కూడా క్షమించరానివని ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేశారు. ఆయన చేసిన వాఖ్యలకు నిరసనగా ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రామారావు దొర మాట్లాడుతూ ఆదివాసీలు తమ సమస్యను చెప్పుకునేందుకు ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ను కలిసేందుకు వెళ్తే ఆయన పరుషపదజాలంతో ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కించపరిస్తూ బహిరంగంగా దూషించడంపై ఆదివాసీ సమాజం అంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఆదివాసీల పట్ల కనీసం గౌరవం లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదన్నారు. గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అశోక్ చేస్తున్న ప్రయాత్యాన్ని ప్రశ్నించడమే ఆదివాసీల తప్పా అన్నారు. ఓర్పు, సహనం కోల్పోయి కుల, ధనంహాకారం, అధికార మదంతో ఆదివాసీలపై విచక్షణ కోల్పోయి కించపర్చేలా మాట్లాడటం రాజ్యంగా విరుద్ధమన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా ఎస్పీను కలిసి ఎమ్మెల్యే అశోక్పై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ వ్యవహారంపై క్షమాపణతో ఊరుకోమన్నారు. అశోక్పై కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆదివాసీలంతా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టపులి శ్రీనివాస పడాల్, స్టేట్ కో–ఆర్డినేటర్ సోమెలి సింహాచలం, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జీజేఆర్ మజ్జి, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిదే మాధవరావు, జీఎస్యూ రాష్ట్ర సమన్వయకర్త కిరసాని కిశోర్, జీఎస్యూ నాయకులు పార్థసారధి, సత్య, ఆదివాసీ జేఏసీ జిల్లా ప్రతినిధులు నాగరాజు, శంకర్ పాల్గొన్నారు. పదవికి రాజీనామా చేయించి, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి ఆదివాసీలపై అనుచిత వాఖ్యలను సహించం క్షమాపణలతో ఊరుకునేది లేది ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దొర పాడేరులో ఆందోళన -
కల్యాణ వైభోగమే..
సింహగిరి భక్తజన సంద్రమైంది. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది. చైత్రశుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని, లోక కల్యాణార్థం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై పెళ్లిపీటలెక్కారు. విశేష అలంకరణలో దేవేరులతో కూడిన స్వామి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. అంబరాన్నంటిన రథోత్సవం, వేద మంత్రాల సాక్షిగా జరిగిన కల్యాణ ఘట్టంతో సింహగిరి ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. – సింహాచలం ప్రత్యేక అలంకరణలో అప్పన్నశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఆదివారం రాత్రి వైభవంగా జరిగింది. శ్రీమహా విష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనృ సింహస్వామిని పెళ్లికుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లికుమార్తెలుగా అలంకరించి నిర్వహించిన ఈ వేడుకను చూసి భక్తులు పులకించిపోయారు. నృసింహ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కొట్నాల ఉత్సవంతో ప్రారంభం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే కల్యాణోత్సవ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద అర్చకులు, ముత్తయిదువలు పసుపుకొమ్ములను దంచి కొట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ధ్వజారోహణం చేపట్టారు. ముక్కోటి దేవతలను కల్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ ధ్వజస్తంభంపై గరుడాళ్వార్ చిత్రపటాన్ని అర్చకులు ఎగురవేశారు. రసవత్తరంగా ఎదురు సన్నాహోత్సవం కల్యాణ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఎదురు సన్నాహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు వర్ణపు పల్లకీలో, అమ్మవార్లను ముత్యాల పల్లకీలో వేంచేపు చేశారు. సింహగిరి మాడ వీధుల్లో పల్లకీలను ఊరేగిస్తూ, పశ్చిమ మాడ వీధిలోని జోడు భద్రాల వద్ద ఎదురెదురుగా ఉంచారు. స్వామి, అమ్మవార్ల వైభవాన్ని చాటిచెబుతూ సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం రసవత్తరంగా సాగింది. అర్చకులు పూలదండలతో నృత్యాలు చేస్తూ ఉత్సవాన్ని రక్తి కట్టించారు. పుల్లెల సత్యనారాయణ శర్మ, ముష్టి పవన్ కుమార్ శర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. హోరెత్తిన రథోత్సవం సింహగిరి మాడ వీధుల్లో నిర్వహించిన రథోత్సవం కనులవిందుగా సాగింది. ఉత్సవమూర్తులను రథంపై అధిష్టింపజేశారు. జాలరి పెద్ద కదిరి లక్ష్మణరావు రథ సారథిగా వ్యవహరించగా, విశాఖ నలుమూలల నుంచి అమ్మవారి బంధువులుగా వచ్చిన జాలర్లు రథాన్ని లాగే బాధ్యతను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథం తాళ్లను లాగుతూ స్వామి వారిని సేవించుకున్నారు. కనులపండువగా కల్యాణోత్సవం ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాత్రి 10.30 గంటలకు స్వామి వార్షిక కల్యాణోత్సవం ప్రారంభమైంది. రథోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను కల్యాణ ప్రాంగణంలోకి తీసుకొచ్చి, కల్యాణ వేదికపై వేంచేపు చేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకలను దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చక బృందం నిర్వహించారు. ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాతలు రాంభట్ల నృసింహశర్మ, శేషాచారి వ్యాఖ్యానం అందించారు. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. నయనానందకరంగా అప్పన్న వార్షిక కల్యాణోత్సవం విశేషంగా ఎదురు సన్నాహోత్సవం పరవశించిన భక్తజనం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లిన సింహగిరి -
గ్యాస్ డెలివరీ బాయ్ అరెస్టు
గాజువాక: చినగంట్యాడలోని మణికంఠ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీకి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ ఎన్నశెట్టి అప్పారావును గాజువాక పోలీసులు అరెస్టు చేశారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులనుంచి ఖాళీ సిలిండర్లను, ఓటీపీలను సేకరించి పరారైన విషయం తెలిసిందే. తమకు సిలిండర్లు ఇవ్వకుండానే డెలివరీ చేసినట్టు మొబైల్ ఫోన్ద్వారా మెసేజ్లు రావడంతో సంబంధిత గ్యాస్ ఏజెన్సీవద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఏజెన్సీ మేనేజర్ ఎదరపల్లి విజయ రామమోహన్రాజు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగు చూసింది. దీనిపై సీఐ పార్థసారధి నేతృత్వంలో ఎస్ఐ జగదీష్, సిబ్బందితో కలిసి విచారించి 24 గంటల్లో అప్పారావును అరెస్టు చేశారు. నిందితుడు అప్పారావు వినియోగదారలవద్ద సేకరించిన ఖాళీ సిలిండర్లు, ఓటీపీలద్వారా గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ నింపిన సిలిండర్లను సేకరించాడు. వాటిని వినియోగదారులకు ఇవ్వకుండా అధిక మొత్తాలకు బ్లాక్ మార్కెట్లో విక్రయించాడు. వినియోగదారుల నుంచి 33 సిలిండర్లను, ఏజెన్సీకి చెందిన తొమ్మిది సిలిండర్లను సేకరించి అక్రమంగా అమ్ముకున్నట్టు సౌత్ ఏసీపీ వై.శ్రీనివాసరావు తెలిపారు. గ్యాస్ డెలివరీ కోసం కొంతమంది వినియోగదారులనుంచి రూ.13,500 వసూలు చేసి ఆ నగదును కూడా సొంతానికి వాడుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఏసీపీ శ్రీనివాసరావు కోరారు. -
శుభం భూయాత్.. సిలిండర్ దేహి
● వివాహాలకు గ్యాస్ సెగ ● తీవ్ర కొరతతో అల్లాడుతున్న వైనం ● చేతులెత్తేస్తున్న క్యాటరింగ్ నిర్వాహకులు మహారాణిపేట: వేల రూపాయలు ఖర్చు చేసి కల్యాణ మండపాలు బుక్ చేసుకుని, బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపి పెళ్లి పనుల్లో మునిగిపోయిన వారికి ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. అదే ‘వంట గ్యాస్’ కొరత. పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో దాని సెగ కాస్తా మన వంటింట్లో గ్యాస్ సిలిండర్కు తగిలింది. దేశవ్యాప్తంగా గ్యాస్ కష్టాలు రెట్టింపు అవుతుండటంతో, విశాఖలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో, కేటరింగ్ వ్యాపారులు ఇప్పుడు కఠినమైన షరతులు విధిస్తున్నారు. ‘మీరు సిలిండర్లు ఇస్తేనే మేము వంట చేస్తాం, లేదంటే మా వల్ల కాదు’ అని కేటరింగ్ సిబ్బంది, వంట బ్రాహ్మణులు తెగేసి చెబుతుండటంతో పెళ్లి బృందాలు బెంబేలెత్తిపోతున్నాయి. నగరంలో ప్రస్తుతం గ్యాస్ బుకింగ్ల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే సుమారు ఒక లక్షా 65 వేల మందికి పైగా గ్యాస్ బుక్ చేసుకోగా, సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో మొబైల్కు ఓటీపీ వచ్చిన వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేది. కానీ ఇప్పుడు ఓటీపీ వచ్చి పది రోజులు గడుస్తున్నా గ్యాస్ రాని పరిస్థితి నెలకొంది. బుక్ చేసిన 25 రోజుల తర్వాత గానీ సిలిండర్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. అధికారులు మాత్రం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతుండటం, నిరీక్షణ కాలం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ మార్కెట్దే హవా.. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్కు తెరలేపారు. ప్రభుత్వం వాణిజ్య సిలిండర్ల వినియోగంపై ఆంక్షలు విధించడంతో, గృహ అవసరాలకు వాడే సిలిండర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఒక్కో సిలిండర్పై రూ. 300 నుంచి రూ. 600 వరకు అదనంగా వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిశ్చయించుకున్న వారు తప్పనిసరి పరిస్థితుల్లో ఎంత ధరైనా వెచ్చించి సిలిండర్లను సమకూర్చుకుంటు న్నారు. యుద్ధ మేఘాలు తొలగి సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ గ్యాస్ గండం తప్పేలా లేదని వినియోగదారులు వాపోతున్నారు. -
అక్షరంతో పోరాటం చేద్దాం
సీతంపేట: ఆదివాసీల భాషలను పరిరక్షించడమే కాకుండా వారి అస్తిత్వం, సాహిత్యంపై విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జయపూర్ సంస్థానాధీశుడు రాజా విశ్వేశ్వర్ చంద్ర చూడ్ దేవ్ పిలుపునిచ్చారు. ఆదివారం ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో జరిగిన ‘కళింగాంధ్ర లిటరేచర్ ఫెస్టివల్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళింగాంధ్ర చరిత్రకు, సాహిత్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని తన పూర్వీకుడు విక్రమ్దేవ్ వర్మ కాలం నుంచే ఈ ప్రాంతంతో తమకు విడదీయలేని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమ అధ్యక్షత వహించిన ఆచార్య కేఎస్ చలం మాట్లాడుతూ, కళింగ సీమ చరిత్ర తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరుల దోపిడీ వల్ల తూర్పు కనుమల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని, ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షించారు. రైటర్స్ అకాడమీ అధ్యక్షులు వి.వి. రమణమూర్తి మాట్లాడుతూ, కార్పొరేట్ శక్తుల దోపిడీపై అక్షరంతో పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మూర్తి, బొబ్బిలి శ్రీధర్, దుప్పల రవికుమార్, పిల్లా తిరుపతిరావు తదితర రచయితలు రాసిన పలు పుస్తకాలను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు డాక్టర్ మాటూరి శ్రీనివాస్, బండి సత్యనారాయణ, గంటేడ గౌడ్ నాయుడు, అట్టాడ అప్పలనాయుడుతో పాటు పలువురు ప్రముఖ కవులు, రచయితలు పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
● కార్యకలపాలపై పటిష్టమైన నిఘా ● ప్రత్యేక పోలీసు బృందాల ఏర్పాటు ● జిల్లా ఎస్పీ అమిత్బర్ధర్ పాడేరు : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా క్రికెట్ ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగులు జరగకుండా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామని బెట్టింగులు నిర్వహించి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అమిత్బర్ధర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులు, ఏజెంట్లు, ఆన్లైన్ బుకీలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యశతో యువత బెట్టింగ్ల జోలికి వెళ్లి నష్టపోవద్దన్నారు. బెట్టింగ్ అనేది సరదా, వినోదం కోసం కాదని, అసంఘటిత నేరాలు, ఆర్ధిక మోసాలు, దోపి డీతో సంబంధాలు కలిగి ఉండటమన్నారు. బెట్టింగ్ల జోలికి వెళ్లి ఆర్ధికంగా నష్టపోయి అప్పుల పాలై విలువైన జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన సూచించారు. -
వరుస కట్టిన గ్యాస్ కష్టాలు
మన్యంలో గ్యాస్ కష్టాల తీవ్రతకు ఈ చిత్రమే నిదర్శనం. అరకులోయ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో శనివారం గ్యాస్ బండ్ల కోసం ప్రజలు బారులు తీరారు. మైదాన ప్రాంతాలైన ఎస్.కోట, వడ్డాది మాడుగుల నుంచి భారత్, హెచ్పీ ఏజెన్సీల నుంచి గ్యాస్ బండ్లను ఇక్కడి తీసుకువచ్చి సరఫరా చేస్తుంటారు. స్థానికంగా ఇండియన్ గ్యాస్ బండ్లను పంపిణీ చేస్తున్నారు. భారత్ గ్యాస్ వినియోగదారులు తెల్లవారుజాము నుంచి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని రోజూ ఖాళీ బండ్లతో క్యూ కడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మండు టెండలో గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో ఎటువంటి అపోహాలకు పోవద్దని గ్యాస్ కంపెనీల ఏజెన్సీలు చెబుతున్నా.. బుక్ చేసి రోజులు గడుస్తున్నా గ్యాస్ బండ్లు ఇంటికి రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మరో పక్క కమర్షియల్ గ్యాస్ బండ్ల సరఫరా లేకపోవడంతో పలు హోటళ్ల యజమానులు కట్టెల పొయ్యిలతో వంటలు చేస్తున్నారు. – అరకులోయటౌన్ -
బైక్ ఢీకొని మహిళకు గాయాలు
డుంబ్రిగుడ: అరకు–పాడేరు జాతీయ రహదారిని దాటుతున్న పాడేరు మండలం మోదపల్లి పంచాయతీ బుర్రగురువు గ్రామానికి చెందిన కొర్రా కాసులమ్మ బైక్ ఢీకొని గాయాలు పాలైంది. వివరాలిలా ఉన్నాయి. అరకులోయలో నాంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాఫీ రైతులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి పలువురు మహిళలు బయలుదేరి వెళ్లారు. కురిడి సమీపంలోని పెద్దబ్రిడ్జి వద్ద జాతీయ రహదారిలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం తోటి మహిళలతో కలిసి కాసులమ్మ దిగి రోడ్డు దాటే క్రమంలో అరకు నుంచి వస్తున్న బైక్ బలంగా ఢీకొంది. గాయపడిన ఆమెను డుంబ్రిగుడ ఆస్పత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
జాతీయ సదస్సులో ఏయూ విద్యార్థులకు అవార్డులు
మద్దిలపాలెం: గుజరాత్లోని సర్దార్ పటేల్ యూనివర్సిటీలో ‘అప్లైడ్ సైకాలజీ ప్రస్తుత సవాళ్లు – భవిష్యత్తు అవకాశాల దార్శనికత’ అనే ఇతివృత్తంతో జరిగిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లైడ్ సైకాలజీ 61వ జాతీయ, 30వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పలు అవార్డులు సాధించారు. ప్రొఫెసర్ ప్రమోద్కుమార్ యంగ్ సైకాలజిస్ట్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ సైకాలజీ విద్యార్థినులు జె.మనీషా, ముడిదన కారుణ్య అందుకున్నారు. ‘యూనివర్సిటీ విద్యార్థుల్లో నిద్ర నాణ్యత, విద్యాపరమైన జాప్యంపై డిజిటల్ వ్యసనం ప్రభావం’ అనే అంశంపై వారు చేసిన పరిశోధనకు ఈ గుర్తింపు లభించింది. నైనా సింగ్ మెమోరియల్ అవార్డును ఏయూ ఎం.ఎస్సీ విద్యార్థిని గౌరీలక్ష్మి కొరిబిల్లి పొందారు. ‘యువతలో ప్రకృతితో అనుబంధం, అది వారి భావోద్వేగ నియంత్రణపై చూపే ప్రభావం’ అనే అంశంపై చేసిన అధ్యయనానికి ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అవార్డులు సాధించిన విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో అభినందించారు. ఏయూ సైకాలజీ విభాగాధిపతి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్యఎం.వి.ఆర్.రాజు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
డుంబ్రిగుడ: మండలంలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఇన్చార్జీ ఎంపీడీవో విశ్వనాథ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛరథాన్ని వైస్ ఎంపీపీలు శెట్టి ఆనంద్రావు, లలిత అధికారుల సమక్షంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రత్యేక వాహనం సమకూర్చిందన్నారు. ముందుగా స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఇనుము, ప్లాస్టిక్ వస్తువులు, అట్ట పెట్టెలు, తదితర సామాన్లు అందజేస్తే ధరను బట్టి గిరిజనులకు వస్తువులు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. -
10లోగా చందనోత్సవం ఏర్పాట్లు పూర్తి
దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశం సింహాచలం: చందనోత్సవం ఏర్పాట్లను ఏప్రిల్ 10వతేదీ నాటికల్లా పూర్తిచేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సింహాచలం దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసే క్యూలు ఎక్కడెక్కడ నుంచి ప్రారంభమవుతాయో ఆయా ప్రదేశాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేశారు. పకడ్బందీగా క్యూలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పలు చోట్ల ఇంకా సిమెంట్ వర్క్లు జరుగుతుండటంతో ఎన్ని రోజులపాటు చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనవసరమైన పనులు చేయకుండా, భక్తులకు ఉపయోగపడే పనులు చేయాలని ఆదేశించారు. దక్షిణ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు ఏర్పాటు చేసే ఫుట్ ఓవర్ బ్రిడ్జి విషయంపై ఆరా తీశారు. రూ.1500, రూ.1000,రూ.300 క్యూల వద్ద భక్తులకు తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సింహగిరిపై బస్ కాంప్లెక్స్ వద్ద భక్తుల రద్దీని నియంత్రించేందుకు పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 10 నాటికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే అని ఆదేశించారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి తదితరులు పాల్గొన్నారు. -
‘పది’ పరీక్ష కేంద్రాల తనిఖీ
గూడెంకొత్తవీధి: మండలంలో శనివారం చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పర్యటించారు. గూడెంకొత్తవీధిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అంతకు ముందు రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించారు. ఎంవీఐ సాయిరమేష్, సీఐ సుధాకర్కు పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వాహన చోదకులపై కేసులు నమోదు చేయడంతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. గూడెంకొత్తవీధిలో ఏ, బీ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఆయన పరీక్షలు జరుగుతున్న తీరును గమనించారు. చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను స్ధానిక ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా పరిశీలించారు. మాస్ కాపియింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్బాబు, ఎస్ఐ వీరబాబు, వెంకటరమణ, ఎంఈవో ప్రసాద్ పాల్గొన్నారు. -
మన్యంలో ఇటుకల పండగ సందడి
అరకులోయటౌన్: మన్యంలో ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి నెలకొంది. అన్ని గిరిజన పల్లెల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మండలంలోని పెదలబుడు, మాడగడ, గన్నెల, లోతేరు ముఠా పరిధిలోని గ్రామాల్లోని గిరిజనులు ఈ పండగ సందర్భంగా సందడి చేస్తున్నారు. రహదారులపై మహిళలు తాళ్లు, వెదురు గడలతో గేట్లను పెట్టి వాహనదారుల నుంచి నుంచి పండగ చందాలు(పజోరు) వసూలు చేస్తున్నారు. గిరిరైతులు వ్యవసాయ పనులు ప్రారంభానికి ముందు చేపట్టే ఈ పండుగకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏజెన్సీలో ఏటా ఈ నెలలో ఇటుకల పండుగ చేసుకోవడం ఆచారం. ఉగాది పండుగనే మన్యంలో గిరిజనులు ఇటుకల పండగగా నిర్వహిస్తుంటారు. ఈ పండగను వారం రోజుల పాటు జరుపుకొంటారు. ఈ పండగ జరిగే వారం రోజులూ ఎవ్వరూ బయటకు వెళ్లి పనులు చేయకూడదనే ఆచారం ఉంది. మహిళలందరూ గ్రామాల్లో ఇంటింటికి తిరిగి రంగు నీళ్లు చేతపట్టుకుని తమకు వరుస అయ్చేవారిపై నీళ్లను పోసి ఆట పట్టిస్తారు. పురుషులు ఆడవిలో వేటాడాల్సిందే.. పురుషులంతా అడవికి వెళ్లి జంతువులను వేటాడాలన్న నిబంధన ఉంది. ఏదైనా జంతువును వేటాడిన వ్యక్తిని గ్రామ పొలిమేర నుంచి మంచం మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ గ్రామ దేవత వద్దకు తీసుకువస్తారు. ఒక వేళ వేటకు వెళ్లకపోయినా, బయట పనులకు వెళ్లినా పురుషులకు జరిమానా విధించి కొంత డబ్బులు వసూలు చేస్తారు. గ్రామాల్లోని మహిళలంతా కలిసి గ్రామంలోని ప్రధాన రహదారుల వద్దకు చేరి గేట్లు వేసి పజోర్(డబ్బులు) వసూలు చేస్తారు. ఇటుకల పండగ చివరి రోజు గ్రామ పెద్దలు పూజలు నిర్వహించిన విత్తనాలను గ్రామంలోని రైతులకు పంచిపెడతారు. తొలకరి వర్షం తరువాత గ్రామ పెద్దలు ఇచ్చిన విత్తనాలను ముందుగా పంట పొలాల్లో చల్లి వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీ. ఇందుకోసం ఊరి పొలిమేరలో గేటు పెట్టి, అలా వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేసే వారు. ఈ డబ్బులతో పండుగకు అవసరమైన దినుసులు కొనుగోలు చేసి ఊరంతా సహపంక్తి భోజనాలు చేస్తారు. సాయంత్రం పూట ఆదివాసీ మహిళలు థింసా నృత్యాలతో అలరిస్తారు. కానీ మారుతున్న కాలంతో పాటు గిరిజనులు కూడా తమ ఆచారాలను క్రమేణా విస్మరిస్తున్నారు. అడవుల్లో వణ్యప్రాణులు, క్రూరజంతువులు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికితోడు వన్యప్రాణులను వధిస్తే చట్ట ప్రకారం తీవ్ర శిక్షలు పడే అవకాశం ఉండడంతో అడవుల్లో వేటకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. గ్రామాల్లో గేట్లు పెట్టే సంప్రదాయాన్ని వదిలేశారు. రహదారులపై గేట్లు పెట్టి రాకపోకలు సాగించే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. రహదారులపై గేట్లు ఏర్పాటు చేసి పండగ చందాలు వసూలు అడవిలో వేటాడితేనే గ్రామంలోకి పురుషులకు ప్రవేశం లేదంటే కట్టుబాటు మేరకు జరిమానా -
జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఇద్దరు విద్యార్థినులు
చింతపల్లి: జాతీయ స్థాయి ఖేల్ ఇండియా కుస్తీ పోటీలకు స్థానిక డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్రం తరఫున ఎంపికయ్యారు. గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో కళాశాల నుంచి పాల్గొన్న బీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న బి.భార్గవి, కె.కేసియా ప్రతిభ కనబరిచారు. వీరికి ఆదివారం నుంచి ఛత్తీస్గఢ్లో జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందిందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయ భారతి తెలిపారు. జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు తర్ఫీదునిచ్చిన పీడీ శివరాంను ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు. -
అప్పన్న కల్యాణం చూతము రారండోయ్
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ వెలుగుల్లో సింహగిరి -
మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి
● నౌపడలో వైఎస్సార్ సీపీ భారీ బహిరంగ సభ రేపు ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు. -
సోలార్ పంపు సెట్స్,వాటర్ వీల్స్ పంపిణీ
చింతపల్లి: లంబసింగి పరిసర గ్రామ గిరిజనులకు అవసరమైన సోలార్ పంపు సెట్లు, వాటర్ వీల్స్ను స్థానిక పాఠశాల ఆవరణలో శనివారం ఎస్ఎన్ఎఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎన్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్రన్ మాట్లాడుతూ గిరిజనుల సౌకర్యార్థం తమ సంస్థ తరఫున 200 మందికి నడిపించుకుని తాగునీటిని తెచ్చుకొనే వీలర్స్, సోలార్ పంపు సెట్లు అందజేశామన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పి.వి.రఘుపతి మాట్లాడుతూ గిరిజన రైతులు, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే కుటుంబాలు ఆనందదాయకంగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్ఎఫ్ డైరెక్టర్ శశిప్రభ, సిబ్బంది హరిప్రసాద్, కాంతారావు, మధు, వంశీ, నర్సింగరావు పాల్గొన్నారు. -
ఆదివాసీలను దూషించిన ఎమ్మెల్యే అశోక్పై కఠిన చర్యలకు డిమాండ్
పాడేరు రూరల్: ఆదివాసీలను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామరావుదొర డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒడిశా నుంచి ఆంధ్రా ప్రాంతంలోకి వలస వచ్చి ఎస్టీ బెంతు ఒరియాలుగా చెలామణి అవుతూ తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న విషయాన్ని చెప్పుకునేందుకు వెళ్లిన ఆదివాసీలను ‘ఆఫ్ నాలెడ్జీ ఫెలోస్, బ్లేడి బాస్టేట్స్’అంటూ అవమానకరంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇప్పటికే వలసవాదులైన ఇతరులు ఆంధ్రాలో చొరబడి నకిలీ ధ్రువపత్రాలతో ఎస్టీలుగా వివిధ ఉద్యోగాలు సాధించారని ఆరోపించారు. దీంతో నిజమైన ఎస్టీలకు మనుగడ లేకుండా పోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అధికార అండ దండలతో 27 వేల మంది గిరిజనేతరులను ఎస్టీలో కూడా చేర్పించాలని ఎమ్మెల్యే అశోక్ ప్రయత్నం చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆదివాసీలపై చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేపై తక్షణం అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమానికి పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ మీడియా విభాగం ప్రతినిధి బాబూజీ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం
● ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ● నిధుల కొరతపై సభ్యుల పెదవి విరుపు ● జెడ్పీ సభలో వాడీవేడి చర్చ సాక్షి, అనకాపల్లి/మహారాణిపేట(విశాఖ): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపించి ప్రజలకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. శనివారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విభాగాల్లో సమస్యలు అధికంగా ఉండి, నిధులు మాత్రం శూన్యంగా ఉన్నాయని అధికారులు సభలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. సభ్యులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి ‘నిధుల కొరత’అనే సమాధానమే వినిపించింది. చివరకు ఆర్అండ్బీ రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా నిధుల్లేవని అధికారులు పేర్కొన్నారు. గిరిజన ప్రాంత వాసుల సౌకర్యార్థం మహాప్రస్థానం వాహనాల సేవలను విస్తరిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, దినేష్ కుమార్, జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, జెడ్పీ సభ్యులు ఈర్లె అనురాధ, సామి సత్యనారాయణ, పైలా సన్యాసిరావు, దూలీ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● ఏజెన్సీ ప్రాంత జెడ్పీటీసీలు గంగరాజు, బొంజిబాబు, పోతల బాలయ్య, ఎంపీపీలు చేసిన విజ్ఞప్తి మేరకు కేజీహెచ్లో మాదిరిగానే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఎస్టీ సెల్ ఏర్పాటు చేసి అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని జెడ్పీ చైర్పర్సన్ కోరారు. పాడేరు నుంచి రిఫరల్ కేసులను కేజీహెచ్కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే మృతదేహాల తరలింపునకు సంబంధించి తగినన్ని మహా ప్రస్థానం వాహనాలను సమకూర్చాలని, గిరిజన ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. సమస్యలపై సభ్యుల ఏకరువు ● అల్లూరి జిల్లా డీఎంహెచ్వోను తక్షణం సరెండర్ చేయాలని సభ్యులు గంగరాజు, తదితరులు డిమాండ్ చేశారు. డీఎంహెచ్వో సక్రమంగా విధులు నిర్వహించడం లేదని, గిరిజన రోగుల బాగోగులు చూసుకోవడంలో డీఎంహెచ్వో విఫలమయ్యారని ఆరోపించారు. ● ఉపాధి హామీ పథకం అమలులో పారదర్శకత పాటించాలని, సోషల్ ఆడిట్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సభ్యులు కర్రి సత్యం, ఈర్లె అనురాధ కోరారు. సభ్యులు లేవనెత్తిన అంశాలను సీరియస్గా తీసుకొని త్వరగా పరిష్కార చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. 15 అంబులెన్స్ల కొనుగోలుకు ప్రతిపాదనలు గిరిజన ప్రాంత ప్రజల సౌకర్యార్థం కేంద్ర సంస్థ నిధులతో కొత్తగా 15 అంబులెన్స్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించామని, వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర సంస్థ నుంచి సుమారు కోటిన్నర వరకు ఆర్థిక సాయం అందుతుందని, వాటితో కొత్తవి కొనడంతో పాటు, పాత వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. పాడేరు నుంచి కేజీహెచ్కు రిఫరల్ కేసుల తరలింపు, మృతదేహాల తరలింపులో ఉన్న సమస్యలను అధిగమిస్తామన్నారు. -
రామతీర్థానికి అప్పన్న దేవస్థానం పట్టువస్త్రాల సమర్పణ
సింహాచలం: శ్రీరామనవమిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా రామతీర్థంలో శుక్రవారం జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం నుంచి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను వైదిక, అధికారులు తీసుకెళ్లారు. రామతీర్థంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచలం దేవస్థానం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు గత 11 ఏళ్ల నుంచి అందిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా అక్కడికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను దేవస్థానం ఈవో జె.వెంకటరావు, అర్చకులు, అధికారులు తీసుకెళ్లారు. -
సందడిగా ఉమ్మడి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
నాతవరం: పండగలు సందర్భంగా విద్యార్థులకు ఆటలు పోటీలు నిర్వహించేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఎస్ఐ వై.తారకేశ్వరరావు కోరారు. శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం నాతవరంలో అండర్ –14 విభాగంలో బాలబాలికలకు ఉమ్మడి జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థినులు మొదటి స్థానంలో నిలిచారు. నాతవరం హైస్కూల్, శాంతినికేతన్ స్కూల్ విద్యార్థినులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలుర విభాగంలో గోపాలపట్నం హైస్కూల్ విద్యార్థులు విజేతగా నిలిచారు. చోడవరం హైస్కూల్ ద్వితీయ, గొలుగొండ మండలం కృష్ణదేవిపేట స్కూల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వీరికి బహుమతులతోపాటు షీల్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నాతవరం పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి అపిరెడ్డి మాణిక్యం, నాతవరం ఉప సర్పంచ్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటి సభ్యుడు కరక అప్పలరాజు, మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు, నేతల విజయకుమార్, వైఎస్సార్సీపీ మేధావుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైల పోతురాజు పాల్గొన్నారు. -
చెక్పోస్ట్ కార్మికుని మృతికి నష్టపరిహారం చెల్లించాలి
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం మండలంలో మైనింగ్ను ఏఎంఆర్ సంస్థలకు అప్పగించి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మైనింగ్ చెక్పోస్టులు వద్ద కార్మికులు 24 గంటలూ విధుల్లో ఉండడంతో అనారోగ్యానికి గురై మృత్యవాత పడుతున్నట్లు వాపోయారు. కార్మికుల చట్టాలను ఏఎంఆర్ సంస్థ నీరుగారుస్తుందన్నారు. మండలంలో మామిడిపాలెం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్ట్లో మొబైల్ స్క్వాడ్ విధుల్లో ఉండి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన తాడేపల్లి గూడెంకు చెందిన ముప్పిడి రామిరెడ్డి కుటుంబానికి సదరు సంస్థ రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదే ప్రమాదంలో క్షతగాత్రుడైన కూండం గ్రామానికి చెందిన జగదీష్కు పూర్తి వైద్యం అందించాలని కోరారు. మైనింగ్ చెక్ పోస్ట్లో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందన్నారు. ప్రాణాలకు తెగించి రేయంబవళ్లు మైనింగ్ ప్రాంతాలను చెక్ చేయడంతోపాటు నిత్యం ప్రమాదాలు గురవుతున్న వారికి ఎటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదన్నారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని, పనిగంటలు అదనంగా చేయించుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు వాపోయారు. లేబర్ అధికారులు చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సరఫరా చేయాలని గిరిజనుల నిరసన
గ్యాస్ సరఫరా కోసం ఖాళీ కంచాలతో నిరసన తెలుపుతున్న గిరిజనులు రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ పరిధి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని కోరుతూ శుక్రవారం కల్యాణపులోవలో ఖాళీ సిలిండర్లతో ఖాళీ కంచాలు పట్టుకుని గిరిజనులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు మాట్లాడుతూ కొన్ని రోజులు నుంచి గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయలేకపోవడంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని రావికమతం వస్తేనే గ్యాస్ ఇస్తామని ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వారు చెబుతున్నారని తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకుందామంటే ఏజెన్సీ గ్రామాల్లో తరుచూ సిగ్నల్ సమస్య వస్తుందన్నారు. దిగువ గ్రామాలకు వచ్చి ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రావికమతం ఏజెన్సీ వద్దకు వెళ్తే నాలుగు రోజులు తర్వాత ఇస్తామని చెప్పుతున్నారని వాపోయారు. గ్యాస్ ఏజెన్సీ వారు గిరిజన గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
రామాలయాలకు ‘వేద సంకల్ప సేవా ట్రస్ట్’ ఆర్థిక సాయం
కొయ్యూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ’వేద సంకల్ప సేవా ట్రస్ట్’ ఆధ్వర్యంలో పలు రామాలయాలకు ఆర్థిక సాయం అందజేశారు. కొయ్యూరు మండలంలోని రేవళ్లు, కాకరపాడు, శరభన్నపాలెం గ్రామాల్లోని రామాలయాలకు, అవసరమైన వస్తువుల కొనుగోలు నిమిత్తం ఒక్కో ఆలయానికి రూ. 10 వేలు చొప్పున విరాళం అందించారు. ధార్మిక సంస్థల సేవా ప్రతినిధి డీవీడీ ప్రసాద్, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతల్లి, బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి గౌరి పార్వతి చేతుల మీదుగా ఈ సాయాన్ని అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదా పు 63కు పైగా రామాలయాలకు వేద సంకల్ప ట్రస్ట్ ఆర్థిక సాయం అందజేసిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కొయ్యూరు మండలంలోని మూడు ఆలయాలకు ఈ సాయం అందడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు. -
అట్టహాసంగా ప్రారంభమైన ఇనార్బిట్మాల్
తాటిచెట్లపాలెం: సాలగ్రామపురంలో దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద మాల్గా పేరుగాంచిన ‘ఇనార్బిట్ మాల్’ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇనార్బిట్ మాల్ సీఈవో రజనీష్ మహాజన్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రోహిత్ గోప్లాని, ప్రాజెక్ట్స్ అండ్ డిజైన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూసఫ్ సయ్యద్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ హిమాంశు ధడుధాలు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన క్రీడాకారులు షేక్ కౌసర్ సాహిల్, యాళ్ల సత్తిబాబు, గాలిదేవర శివగంగ దుర్గా, అడ్డగుదురు ప్రణయ్ల చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం విశేషం. మాల్ ప్రారంభం సందర్భంగా మొదటి 500 మందికి ‘గోల్డెన్ టికెట్’ గిఫ్ట్లు ప్రకటించడంతో ఉదయం నుంచే నగరవాసులు భారీగా తరలివచ్చారు. జనం ఒక్కసారిగా లోపలికి రావడంతో స్వల్ప తోపులాట జరగగా, ఫోర్త్ టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పలు అవుట్లెట్లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, నగరంలోని అతిపెద్ద మాల్ను చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బారులు తీరారు. -
నేడు ‘ఎర్త్ అవర్’
రాత్రి 8.30కు విద్యుత్ దీపాలు ఆఫ్ చేయండి డాబాగార్డెన్స్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్–2026’ కార్యక్రమంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. శనివారం రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గంట పాటు అనవసరమైన విద్యుత్ దీపాలను స్వచ్ఛందంగా ఆపివేయాలని ఆయన కోరారు. 2007లో ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్–ఇండియా’ ప్రారంభించిన ఈ ఉద్యమం, ప్రస్తుతం 190కి పైగా దేశాల్లో విస్తరించి అతిపెద్ద పర్యావరణ ఉద్యమంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ ఉద్యమం 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం విశేషమని కమిషనర్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, విద్యుత్ ఆదా, జీవ వైవిధ్య పరిరక్షణే లక్ష్యంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు, గృహ సముదాయాల నివాసితులు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. నివాసిత సంక్షేమ సంఘాలు, యువత, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో కదిలి మన భూమిని, భవిష్యత్ తరాలను కాపాడడంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
నిద్రలో నిఘా.. ముప్పులో భద్రత
మహారాణిపేట: కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారానికి నిలయం, వేలాది కుటుంబాలకు జీవనాధారమైన విశాఖ ఫిషింగ్ హార్బర్లో భద్రత డొల్లగా మారింది. ప్రతిష్టాత్మకమైన ఈ హార్బర్లో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారుతోంది. పోర్ట్ అథారిటీ పర్యవేక్షణ లోపం మత్స్యకారుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. అలంకారప్రాయంగా 60 కెమెరాలు హార్బర్లో నేరాల నియంత్రణ కోసం విశాఖ పోర్టు సుమారు 60 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిలో మెజారిటీ కెమెరాలు మరమ్మత్తులకు గురికావడం, మరికొన్నింటికి నెట్వర్క్ కనెక్షన్లు లేకపోవడంతో నిఘా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న తరుణంలో, కీలకమైన హార్బర్లో కెమెరాలు పనిచేయకపో వడంపై మత్స్యకార వర్గాల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్ నిఘా లేకపోవడంతో హార్బర్ ప్రాంతం మందుబాబులకు, గంజాయి బ్యాచ్లకు ఆవాసంగా మారింది. రాత్రి సమయాల్లో బోట్లపైనే మద్యం సేవిస్తూ ఘర్షణలకు దిగడం నిత్యకృత్యమైంది. అంతేకాకుండా, బోట్లలోని విలువైన సామాగ్రి, వేట కోసం నిల్వ ఉంచుకున్న డీజిల్ దొంగతనానికి గురవుతున్నాయి. సీసీ ఫుటేజీ అందుబాటులో లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. నిషేధ కాలం వేళ.. పెరగనున్న భయం ఫిషింగ్ హార్బర్లో కోట్లాది రూపాయల మత్స్య వ్యాపారం జరుగుతున్నా, భద్రత విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల హార్బర్ అసాంఘిక శక్తులకు, దొంగతనాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బోట్లపై మద్యం సేవించడం, సామగ్రిని దోచుకోవడం వంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. వచ్చే నెల 15 నుంచి వేట నిషేధ కాలం ప్రారంభం కానుంది. ఆ సమయంలో హార్బర్ నిర్మానుషంగా మారుతుంది కాబట్టి బోట్లకు రక్షణ కల్పించడం యజమానులకు పెద్ద సవాలుగా పరిణమించనుంది. ఇప్పటికై నా విశాఖ పోర్ట్ అథారిటీ స్పందించి వెంటనే సీసీ కెమెరాలను మరమ్మతు చేయాలి. అలాగే వేట లేని సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసుపల్లి జానకీరామ్, అధ్యక్షుడు, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ (ఇండియా), ఫిషింగ్ హార్బర్లో అలంకారంగా ఉన్న సీసీ కెమెరాలు -
కమనీయం సీతారాముల కల్యాణం
పాడేరు : శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం పాడేరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పాత పాడేరు వద్ద నిర్వహించిన వేడుకల్లో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తులకు అన్నదానం చేశారు. సుండ్రుపుట్టు రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని అధిక సంఖ్యలో భక్తులు వీక్షించి తరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముంచంగిపుట్టు: మండలంలో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. స్థానిక రామాలయంలో జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మూర్తి దంపతలు, పలువురు దంపతులు కల్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో భారీగా అన్నసమారాధన ఏర్పాటుచేశారు. సీతారాముల విగ్రహాలను డప్పు వాయిద్యాలు, థింసా నృత్యాలతో ఊరేగించారు. జోలాపుట్టు, బొండ్రుగూడ, దొడిపుట్టు, కిలగాడ, దార్రెల, పెదగూడ గ్రామాల్లో వేడుకలు, అన్నసమారాధన నిర్వహించారు. ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: ఆధ్యాత్మిక జీవనం మానవాళికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పేర్కొన్నారు. శుక్రవారం తన స్వగ్రామమైన కొంతిలిలో పర్యటించిన ఆయన, అక్కడ నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, భక్తి మార్గంలో నడవడం ద్వారా ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసి నాయుడు, స్థానిక సర్పంచ్ రేగం రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు పాంగి అనిల్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిరి రవిప్రసాద్, హుకుంపేట సర్పంచ్ సమిడ వెంకటపూర్ణిమ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు వెంకటరావు పాల్గొన్నారు. జి.మాడుగుల: రెండవ భద్రాద్రిగా పేరొందిన జి.మాడుగుల రామకోవెలలో శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. విశాఖ వేద పండితులు గోపాలశాస్త్రి బృందం వేదమంత్రోచ్ఛరణల మధ్య 100 జంటలతో కలిసి ఈ వేడుకను నిర్వహించారు. మాజీ మంత్రి, ఆలయ ధర్మకర్త మత్స్యరాస బాలరాజు–రూపవతి దంపతులు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు,పద్మ, జెడ్పీటీసీ మత్స్యరాస వెంకటలక్ష్మి, సన్యాసినాయుడు దంపతులు ఈ కల్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, శాంతి హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం మేళతాళాలు, థింసా నృత్యాలు, బాణసంచా పేలుళ్ల మధ్య పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు సాగింది. అనంతరం దేవుని గెడ్డ వద్ద అనుపు ఉత్సవం నిర్వహించారు. మండలంలోని జీఎం కొత్తూరు, వంజరి, బందవీధి, నుర్మతి, గెమ్మెలి తదితర గ్రామాల్లోనూ రామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, ఆర్గనైజర్ రామరాజు, సభ్యులు వెంకటరమణ, కొత్తందొర, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొయ్యూరు: మండలంలోని రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజేంద్రపాలెం, కాకరపాడు, కొయ్యూరు, మంప, రేవళ్లు, ఆడాకుల, శరభన్నపాలెం, మర్రివాడ తదితర రామాలయాల్లో సీతారాముల కల్యాణం శాస్తోక్త్రంగా నిర్వహించారు. రాజేంద్రపాలెంలో నిర్వహించిన అన్నసమారాధనలో వైస్ ఎంపీపీ నూకాలు, సర్పంచ్ సింహాచలం, స్థానికులు పాల్గొన్నారు. చింతపల్లి: మండలంలోని చౌడుపల్లి, పశువులుబంద, బయిలుకించంగి, గొందిపాకలు, బౌడ, తాజంగి, లంబసింగి, కొత్తపాలెం, అంజలిశనివారం తదితర గ్రామాల్లోని రామాలయాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అన్నసమారాధనలు ఏర్పాటుచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీలేరు: స్థానిక శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వలస గెడ్డ రామాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హోమం చేపట్టారు. మహిళలు కోలాటం నిర్వహించారు. దుప్పులవాడ, దారకొండ గ్రామాల్లో స్వామివారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముంచంగిపుట్టులో అన్నసమారాధనలో భక్తులు వాడవాడలా ఘనంగా శ్రీరామనవమి వేడుకలు భారీగా తరలివచ్చిన భక్తజనం మార్మోగిన రామనామం భక్తిభావంతో పులకించిన మన్యం -
జీవీఎంసీ కమిషనర్తో బళ్లారి మేయర్ భేటీ
జీవీఎంసీ అభివృద్ధిని బళ్లారి ప్రతినిధులకువివరిస్తున్న కమిషనర్ కేతన్గార్గ్ డాబాగార్డెన్స్: అధ్యయన యాత్రలో భాగంగా బళ్లారి మేయర్ పి.గాదెప్ప, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జె.ఎస్. ఆంజనేయులు శుక్రవారం కమిషనర్ కేతన్ గార్గ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగర సుందరీకరణ, అభివృద్ధి కార్యక్రమాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విశాఖలో అమలవుతున్న ‘ఆపరేషన్ లంగ్స్’, 24 గంటల నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి ద్వారా ఆదాయం..వంటి అంశాలను కమిషనర్ వారికి వివరించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారానికి ఐవీఆర్ఎస్, టోల్ఫ్రీ నంబర్ల పనితీరును తెలియజేశారు. జీవీఎంసీ కార్యాచరణ ఇతర నగరాలకు ఆదర్శంగా ఉందని మేయర్ గాదెప్ప కొనియాడారు. త్వరలోనే బళ్లారి నుంచి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని అధ్యయనం కోసం విశాఖకు పంపిస్తామని, వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బళ్లారి టౌన్ ప్లానింగ్ అధికారి తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఈవీఎం గొడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
తుమ్మపాల: ఈవీఎం గొడౌన్ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జేసీ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్ను గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. తాళాలు తీయించి గొడౌన్ లోపల కూడా తనిఖీ చేశారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్బుక్లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్బుక్ నిర్వహణ ఇతర అంశాలపై నాయకులతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు జేసీకి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయిషా, కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.శ్రీనివాసరావు, వి.రమేష్, మీసాల సుబ్బన్న, కె.హరినాథ్బాబు, స్థానిక రెవెన్యూ, ఎలక్షన్ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్ల వివరాలు పంపండి ●గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు ఏజెంట్ను నియమించి వివరాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు కోరారు. ఈవీఎం గొడౌన్ తనిఖీ అనంతరం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల జాబితా నవీకరణ ప్రక్రియపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు విషయంలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఓటర్ల జాబితా తయారీలో సహకరించాలని కోరారు. -
జలగలగెడ్డ ‘రహదారి రగడ’ సుఖాంతం
● సమస్య పరిష్కరించిన అధికారులు ● 17 రోజుల దీక్ష విరమించిన ఆదివాసీలు పాడేరు: దశాబ్దాల నిరీక్షణ, 17 రోజుల అలుపెరుగని పోరాటం తర్వాత చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలగలగెడ్డ గ్రామస్తుల రహదారి కల సాకారమైంది. జిల్లా యంత్రాంగం చొరవతో ఇన్నాళ్లూ నెలకొన్న వివాదం పరిష్కారం కావడంతో ఆదివాసీలు తమ నిరసనను విరమించారు. వివాద నేపథ్యం..: జలగలగెడ్డ గ్రామానికి సరైన రహదారి లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు, కొర్రుబయలు నుంచి జలగలగెడ్డ వరకు 650 మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 90 లక్షలు మంజూరు చేసింది. అయితే, ఈ రహదారి తమ పట్టా భూములు, కాఫీ తోటల గుండా వెళ్తుందంటూ కొర్రుబయలు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మార్గమధ్యలో ఇనుప కంచెలు వేసి అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఐటీడీఏ వద్ద సుదీర్ఘ పోరాటం.. : తమ గ్రామానికి వెళ్లే దారిని మూసివేయడాన్ని నిరసిస్తూ, తక్షణమే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ జలగలగెడ్డ ఆదివాసీలు తమ పిల్లపాపలతో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట గత 17 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సమస్యపై అఖిలపక్ష బృందం డీఎల్వో ఆధ్వర్యంలో మద్దతు తెలిపింది. ఈ అంశంపై సాక్షిలో ప్రచురితమైన రహదారి రగడ శీర్షికన ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగాన్ని కదిలించింది. అధికారుల జోక్యంతో పరిష్కారం: జిల్లా కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి రెవెన్యూ, పోలీస్ అధికారులు బుధవారం జలగలగెడ్డకు చేరుకున్నారు. వివాదానికి కారణమైన ఇనుప కంచెలను తొలగించి, రక్షణ మధ్య రహదారి పనులను పునఃప్రారంభించారు. సమస్య సద్దుమణగడంతో గురువారం కలెక్టర్తో పాటు ఐటీడీఏ పీవో, జేసీ తిరుమణి శ్రీపూజకు ఆదివాసీలు వినతిపత్రాలు అందజేశారు. అధికారులు సానుకూలంగా స్పందించి పనులు మొదలుపెట్టడంతో, ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ ఆదివాసీ మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. దీంతో 17 రోజులుగా సాగుతున్న నిరసన శిబిరాన్ని గ్రామస్తులు ఎత్తివేశారు. -
బొలేరో– స్కూటీ ఢీకొని ఇద్దరు మృతి
రావికమతం : స్థానిక బీఎన్రోడ్డులో గురువారం ఎదురెదురుగా వస్తున్న బొలేరో, స్కూటీ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మైనర్ యువకులు మృతి చెందారు. మరో మైనర్ గాయపడ్డాడు. ఈ దుర్ఘటనపై ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రావికమతం గ్రామానికి చేఽందిన డి.ఉదయ్కుమార్ (16), సిహెచ్.కోటేశ్వరరావు(17), ఐ.బాజ్జి(17) అనే ముగ్గురు గురువారం ఏపీ 39ఎఫ్డబ్ల్యు 4047 నంబర్ గల స్కూటీపై కొత్తకోట వైపు వెళుతుండగా అదే సమయంలో గర్నికం గ్రామానికి చెందిన నల్లపురెడ్డి శ్రీను బొలేరో(ఏపీ39టీఎల్ 3332) వాహనంపై పాడేరు వెళుతుండగా ఎదురెదురుగా వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఉదయ్కుమార్ (పండు), కోటేశ్వరరావుల తల నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. గాయపడిన ముగ్గురినీ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఉదయ్కుమార్, కోటేశ్వరరావులకు తలపై బలమైన గాయాలు కావడంతో పరిస్థితి విషమించగా నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయ్కుమార్ (పండు) మరణించగా, కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం విమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించి కోటేశ్వరరావు మృతి చెందాడు. మరో యువకుడు బాజ్జి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బొలేరో వాహనం డ్రైవర్ శ్రీనును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. ఇద్దరు మైనర్ యువకులు మృతి చెఽందడంతో రావికమతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వైఎస్సార్ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధికి బీజం
నక్కపల్లి: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలోనే పాయకరావుపేట నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి బీజం పడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిశీలకుడు వీసం రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన నక్కపల్లిలో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఘనత ముమ్మాటికీ వైఎస్సార్సీపీదేనన్నారు. దీనిపై తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామని కొంతమంది టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పాయకరావుపేట నియోజవకర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదన్నారు. 30 ఏళ్లపాటు 1983 నుంచి 2009 వరకు, మళ్లీ 2014 – 19 వరకు టీడీపీ ఎమ్మెల్యేలే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారన్నారు. ఈ కాలంలో నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. చివరికి విద్యార్థుల ఉన్నత విద్య కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఆనాటి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేశారన్నారు. ఈ ప్రాంత రైతులకు రావాల్సిన తాండవ జలాలను సైతం విడుదల చేయించలేకపోయారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖర్రెడ్డి దృష్టికి ఈ ప్రాంత కరువు సమస్యలు తీసుకెళ్లడంతో ఆయన స్పందించి నక్కపల్లిలో హెటెరో డ్రగ్స్, పాయకరావుపేటలో దక్కన్ కంపెనీలను ఏర్పాటు చేయించారన్నారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ బహిరంగ వేదికపై చెప్పారన్నారు. విశాఖ – చైన్నె ఇండస్ట్రియల్ కారిడార్, పరవాడలో ఫార్మాసిటీ, అచ్యుతాపురంలో సెజ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్రెడ్డిదేనన్నారు. నియోజకవర్గానికి 35 క్యూసెక్కుల నీటిని విడుదల చేయించారన్నారు. నక్కపల్లి మండలంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు ప్రతిపాదనలను తీసుకొస్తే భూములు కోసం వచ్చే వారిని చెట్లకు కట్టి కొట్టాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారన్నారు. జగన్ హయాంలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత.. దావోస్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఈవో ఆదిత్య మిట్టల్ను కోరగా, నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూములను మిట్టల్ ప్రతినిధుల బృందం పరిశీలించి వెళ్లిందని వీసం తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన చూపించారు. జూమ్ కాల్లో స్టీల్ ప్లాంట్ తెచ్చేశానని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జూమ్ సమావేశంలోనే రూ.లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలరా? అని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమంలో నిర్వాసితులను కనీసం గౌరవించే ప్రయత్నం చేయలేదన్నారు. రైతుల త్యాగం వల్లే ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీసీఐసీఆర్లో నక్కపల్లిని క్లస్టర్గా చేసిన ఘతన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిదేనన్నారు. నక్కపల్లి మండలంలో సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1100 కోట్లు కేటాయించారన్నారు. నక్కపల్లి ఆస్పత్రిని 50 పడకల స్థాయికి పెంచారన్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులుపై విమర్శలు చేస్తున్నారని, ప్రస్తుత ఎమ్మెల్యే, హోం మంత్రి కూడా స్థానికేతరాలన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన బుద్ధి చెప్తామన్నారు. కంబాల జోగులను విమర్శించే అర్హత టీడీపీ చోటా నాయకులకు లేదన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, ఎంపీటీసీ గొర్ల గోవిందరాజు, సర్పంచ్ తళ్ల భార్గవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఎల్లేటి సత్యనారాయణ, స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు యలమంచిలి చందు, మాజీ ఎంపీటీసీ పిక్కి తాతీలు, వార్డు సభ్యులు పిక్కి అప్పలరాజు, నాయకులు వంకా కృష్ణ, దమ్ము రమణ, ఎస్ చిన్నా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ముంగిటకు వైద్య సేవలు : కలెక్టర్
పాడేరు : జిల్లాలోని గ్రామీణ మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో మీ ఇంటికి మీ డాక్టర్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా మంజూరైన అంబులెన్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు రాలేని రోగుల కోసం ఈ ప్రాజెక్టు ద్వారా నేరుగా గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి అధునాతమైన వైద్య సేవలు, మందులను ఉచితంగా అందజేస్తారన్నారు. ప్రజలంతా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీవో, ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ ఎస్.గంగరాజు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు నాగరాజు, కార్యదర్శి గౌరీశంకర్, కోశాధికారి సూర్యారావు పాల్గొన్నారు. -
జల విపత్తుల నుంచి ప్రాణరక్షణే లక్ష్యం
● సుజనకోటలో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ ● మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల గిరిజనుల్లో చైతన్యం నింపిన విన్యాసాలు ముంచంగిపుట్టు : మండలంలోని సుజనకోట పంచాయతీ మత్స్యగెడ్డ సాక్షిగా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలిపే అద్భుతమైన విన్యాసం జరిగింది. గెడ్డలు, వాగుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి, నీటిలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశాలపై జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం గురువారం భారీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సందడి చేసిన రక్షణ విన్యాసాలు విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న, టీమ్ కమాండెంట్ ప్రదీప్ నేతృత్వంలో 25 మంది సభ్యుల బృందం ఈ మాక్ డ్రిల్లో పాల్గొంది. ప్రవాహంలో బోటు బోల్తా పడితే గల్లంతైన వారిని వెతికే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపారు. సహాయం కోసం నీటిలో ఎదురుచూస్తున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చే ప్రక్రియను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ప్రమాదాలు జరగకుండా సామాన్యులు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలపై బృందం సభ్యులు వివరించారు. ముఖ్య అతిథుల సందేశం ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో మత్స్యగెడ్డను దాటడానికి ఎక్కువగా నాటు పడవలను ఉపయోగిస్తుంటారు.. ఈ క్రమంలోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలోని అన్ని మండలాల్లో నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలి అని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సీతమ్మ, ఎంపీడీవో ధర్మారావు, తహసీల్దార్ భాస్కర అప్పారావుతో పాటు సీఆర్పీఎఫ్ సీఐ శ్రావణ్కుమార్, ఎస్ఐ నాని, సర్పంచులు రమేష్, సుభాష్, త్రినాథ్, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి, వైద్యాధికారి నిఖిల్, వివిధ పార్టీల నేతలు జగబంధు, పద్మారావు, అర్జున్, సన్యాసమ్మ, బలరాం, శ్రీను పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రాణనష్టం జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ చేసిన ఈ ప్రయత్నంపై స్థానిక గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. సుజనకోట వద్ద మత్స్యగెడ్డలో మాక్డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్డ్రిల్ను తిలకిస్తున్న ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర -
విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన
పాడేరు : జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతో పాటు మౌలిక వసతులను కల్పించాలని ఐటీడీఎ పీవో, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం సమావేశ మందిరంలో గురువారం ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎలు, ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి అందిన ప్రతికూల ఫీడ్ బ్యాక్కు గల కారణాలను నిశితంగా పరిశీలిస్తామన్నారు. పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్కు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. హెచ్ఎంలు జవాబుదారితనంలో విధులు నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అభ్యసన వాతావరణం కల్పించాలన్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూఓలు, హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
చింతలూరు కొండలను కొల్లాగొడుతున్నారు..
మైనింగ్ పర్మిట్లు లేకుండానే...! వాస్తవానికి ఏదైనా క్వారీ మైనింగ్ జరపాలంటే పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర మైనింగ్ చేస్తున్నది? ఎంత మొత్తం గ్రానైట్ను తరలిస్తున్నారనే విషయాన్ని పేర్కొంటూ రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ నేత పేరుతో ఎటువంటి మైనింగ్ పర్మిట్లు లేకుండానే సుమారు రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను తరలించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బ్లాస్టింగులు చేపడుతూ గ్రామ ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ క్వారీ ఉన్న ప్రాంతానికి డీఆర్డీవో కూడా కూతవేటు దూరంలోనే ఉంది. రక్షణరంగ సంస్థకు సమీపంలో చేపడుతున్న ఈ బ్లాస్టింగులతో ఇబ్బందులు తప్పవనే ఆందోళన కూడా నెలకొంది. అర్ధరాత్రి సమయాల్లో వాహనాల సామర్థ్యానికి మించి మరీ అధిక లోడుతో భారీ గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. అయినప్పటికీ అటు పోలీసు, ఇటు రెవెన్యూ, మైనింగ్, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. భారీ లోడ్లతో ఈ విధంగా మొత్తం రూ. 10 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్లను అక్రమంగా తరలించినట్టు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మైనింగ్ విజిలెన్స్ అధికారుల తనిఖీలో ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు తేలినప్పటికీ స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం ఇక్కడంతా ఏమీ జరగలేదని నివేదికలు పంపిస్తుండడం గమనార్హం. నర్సీపట్నంలోని మైనింగ్ అధికారి వ్యవహారశైలిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అర్ధరాత్రి సమయంలో అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చింతలూరు నుంచి అక్రమంగా రాత్రి సమయాల్లో గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారు. గుంటూరు నుంచి వచ్చి మరీ వ్యవహారం నడుపుతున్న సదరు టీడీపీ నేత ఆడిందే ఆట...పాడిందే పాటగా వ్యవహారం నడిపిస్తున్నారు. గతంలో ఐటీ కంపెనీ పెట్టి... ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేసి అరెస్టయిన చరిత్ర కలిగిన సదరు నేత చంద్రబాబు, లోకేష్లతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు డీపీగా పెట్టుకుని బెదిరింపులకు దిగుతున్నట్టు విమర్శలున్నాయి. ఇప్పటివరకు అక్రమంగా భారీ గ్రానైట్ బ్లాక్లను అడ్డంగా తరలిస్తూ రూ.10 కోట్ల మేర ఆర్జించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ జరుపుతున్నారని, పర్మిట్లు లేకుండానే గ్రానైట్ బ్లాక్లను తరలిస్తున్నారంటూ దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తమ తనిఖీల ద్వారా తేల్చారు. అయితే స్థానిక మైనింగ్ అధికారులు మాత్రం అంతా సవ్యంగానే ఉందంటూ అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి తప్పుడు నివేదికలు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమిలోని బీజేపీ నేతలు కూడా ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేస్తుండడం గమనార్హం. కూటమి ప్రభుత్వం రాకతో జిల్లాలో అక్రమాల ఘనులు చెలరేగిపోతున్నారు. అధికారపార్టీ నేతలు ఆడింది ఆటగా.. పాడింది పాటగా అధికారులు తాళం వేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. గతంలో ఐటీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను రూ.100 కోట్ల మేర మోసం చేసిన కేసులో అరెస్టయిన టీడీపీ నేత అజయ్ కొల్లా తాజాగా అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా అవతారమెత్తాడు. గ్రానైట్ బ్లాక్ల అక్రమ రవాణాతో రూ.కోట్లు కొల్లగొడుతున్నాడు. స్థానిక మైనింగ్ అధికారులు కొమ్ము కాస్తున్నారు. రూ. 100 కోట్ల మేర నిరుద్యోగులకు టోపీ అనకాపల్లి జిల్లాలో మైనింగ్ డాన్గా వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ చేపడుతున్న సదరు టీడీపీ నేత గుంటూరు నుంచి వచ్చి మరీ ఇక్కడ దౌర్జన్యం చెలాయిస్తున్నారు. ఇతరులకు చెందిన క్వారీని ఆక్రమించి మరీ అక్రమ మైనింగ్ చేస్తున్నారనే విమర్శలున్నాయి. విజ్డమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల నుంచి రూ. 100 కోట్ల మేర వసూలు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం 14 మందిని అరెస్టు చేయగా, ఇందులో సీఈవోగా ఉన్న అజయ్ కొల్లా కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ నిరుద్యోగుల నుంచి రూ.100 కోట్ల మేరకు ఈ ముఠా వసూలు చేసింది. ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ నిరుద్యోగుల జాబితాను ఇతర కంపెనీలకు విక్రయిస్తుందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా విజ్డమ్ జాబ్స్ పేరుతో స్థాపించిన కంపెనీలోని ఉద్యోగులతోనే నిరుద్యోగులకు ఫోన్ చేయించి మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం వచ్చిందంటూ కూడా మోసం చేసి ఆయా అభ్యర్థుల నుంచి ఇంత మొత్తం చెల్లించాలంటూ వసూళ్లకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఎంత మందిని ఉద్యోగాల పేరుతో మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే, అటువంటి ఉద్యోగులకు పర్సంటేజీల రూపంలో చెల్లించే ఏర్పాటు కూడా అజయ్ కొల్లా చేయడం గమనార్హం. -
గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షణ
మాడుగుల రూరల్: గ్యాస్ కొరత లేకుండా నిత్యం పర్యవేక్షిస్తున్నామని మాడుగుల నియోజకవర్గ పౌర సరఫరాల ఉప తహసీల్దారు(సీఎస్డీటీ) కె.రవిబాబు అన్నారు. మాడుగులలోని సీతారామ భారత్ గ్యాస్ గోదామును ఆయన గురువారం సాయంత్రం తనిఖీ చేశారు. ప్రస్తుతం గోదాంలో 342 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఈ వారంలో ఆయిల్ కంపెనీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు గ్యాస్ సిలిండర్లు రాకపోవడం వల్ల బ్యాక్లాగ్ ఎక్కువైపోయిందని సీఎస్డీటీ తెలిపారు. దీని వల్ల ఒకేసారి గోదాం వద్ద రద్దీ ఏర్పడిందని, గురువారం 500 మంది గ్యాస్ వినియోగదారులకు సిలిండర్లు అందించామన్నారు. రాబోయే రెండు రోజుల్లో గ్యాస్ సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంనది ఆయన స్పష్టం చేశారు. ఘాట్రోడ్డు జంక్షన్లో హోటళ్ల తనిఖీ అనంతరం ఘాట్రోడ్డు జంక్షన్లోని పలు హోటళ్లను సీఎస్డీటీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోదమాంబ ఫ్యామిలీ రెస్టారెంట్లో డొమిస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్టు గుర్తించి కేసు నమోదు చేశారు. రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. దేవరాపల్లిలో కూడా హోటళ్లను తనిఖీ చేసి, రెండు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్టు రవిబాబు తెలిపారు. -
కోడిపందాలు ఆడుతున్న 9 మంది అరెస్టు
పట్టుబడ్డ వ్యక్తులు, నగదు, కోళ్లు, సెల్ఫోన్లు పాయకరావుపేట : మండలంలో గల ఈదటం గ్రామ శివారులో 9 మంది వ్యక్తులు కోడి పందాలు ఆడుతున్నట్టు సీఐ జి.అప్పన్నకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ పురుషోత్తం, సిబ్బంది దాడి జరిపి పట్టుకున్నారు. వారి వద్ద రూ.3230 నగదు, 3 బతికిన కోళ్లు, 3 చనిపోయిన కోళ్లు, 9 సెల్ఫోన్లు, 5 మోటారు సైకిళ్లు సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కోడి పందాలు, రబ్బరు గుండాట, పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. -
కూటమి పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యం
పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శ పాడేరు : కూటమి ప్రభుత్వ పాలనలో గిరిజనాభివృద్ధి శూన్యమని జిల్లాలోని గిరిజన గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. మండలంలోని మారుమూల కించూరు పంచాయతీ వంటివీధుల, గొండెలి పంచాయతీ వంచెడిగొంది గ్రామాలను గురువారం ఆయన సందర్శించారు. ఇంటింటా వెళ్లి గిరిజనులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా రక్షిత తాగునీరు, రహదారి సదుపాయాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వివక్ష చూపుతున్న కూటమీ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పార్టీ మండల అద్యక్షుడు సీదరి రాంబాబు, సర్పంచ్లు వంతాల రాంబాబు, సోమెలి లక్ష్మణరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు గుల్లెల లింగమూర్తి, సీనియర్ నేతలు ముదిలి సత్యనారాయణ, పలాసి రామారావు, సింహాచలం, అల్లాడ అశోక్ పాల్గొన్నారు. -
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన
ఏర్పాట్ల ప్రణాళికను పరిశీలిస్తున్న కలెక్టర్, సీపీ సింహాచలం: ఏప్రిల్ 20న జరిగే శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవం ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 మార్గాలను పరిశీలించి భక్తులకు తెలిసేవిధంగా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. ఉచిత దర్శనంలో వచ్చే భక్తులకు రెండు మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఈవో తెలిపారు. క్యూలైన్లలో మంచినీరు, వాష్రూమ్స్, ఎమెర్జన్సీ ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్తర రాజగోపురం నుంచి అన్నదానం భవనానికి వెళ్లే మార్గాలను సీపీ పరిశీలించి భద్రతా పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కొండపై బస్ కాంప్లెక్స్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు రద్దీని క్రమబద్ధీకరించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింహగింపై పార్కింగ్ ఏరియా తక్కువగా ఉండటంతో ప్రైవేటు వాహనాలను నియంత్రించాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన కాఫీ రైతులు
● కాఫీని జీసీసీ కొనుగోలు చేయాలని డిమాండ్ ● లేకుంటే ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరిక చింతపల్లి: సీజన్కు ముందు దళారులను నమ్మవద్దని, గిట్టుబాటు ధర ఇచ్చి మేమే కొంటామని చెప్పిన జీసీసీ.. ఇప్పుడు తీరా సమయం వచ్చాక ముఖం చాటేయడం ఏంటి? అంటూ కాఫీ రైతులు, గిరిజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ గురువారం చింతపల్లిలో భారీ ఆందోళన చేపట్టారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో తొలుత చింతపల్లిలోని జీసీసీ డీఎం కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ కార్యాలయానికి చేరుకుని అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాఫీ గింజల కొనుగోలుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన అధికారులు, ఇప్పుడు అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం గిరిజన రైతులకు తీరని అన్యాయమని ధ్వజమెత్తారు.వెంటనే ఐటీడీఏ, జీసీసీ ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు ప్రారంభించకపోతే, రైతులందరితో కలిసి పాడేరు ఐటీడీఏను ముట్టడిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రోడ్లపైనే వంటా–వార్పూ చేపట్టి నిరసన తెలియజేస్తామన్నారు.తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను జీసీసీ డీఎం, తహసీల్దార్ శంకర్రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు చిరంజీవి పడాల్, సీపీఎం నాయకులు పాంగి ధనుంజయ్, ఎంపీటీసీ సత్తిబాబు, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
‘నడక’ వైద్యం
రాజేంద్రపాలెం వైద్యాధికారి జగదీష్ నాయక్ మానవత్వం కొయ్యూరు: అంబులెన్స్ వెళ్లడానికి దారి లేదు.. కనీసం నడవడానికి సరైన బాట లేదు.. కానీ ఆ గిరిజనుల ఆరోగ్యం కోసం ఆ వైద్యుడు వెనకడుగు వేయలేదు. మండలంలోని రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ గురువారం మారుమూల గ్రామాల్లో పర్యటించి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. అడవి బాటలో అడుగులు.. బూదరాళ్ల పంచాయతీ పరిధిలోని చల్దిగెడ్డ, కొత్తపల్లి గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేదు. దీంతో ఆయన తన బృందంతో కలిసి కొండలు, వాగులు దాటుకుంటూ కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. ఆ రెండు గ్రామాల్లోని సుమారు 50 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఇంటింటికీ తిరుగుతూ గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. వాతావరణ మార్పుల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కలుషిత నీటిని తాగరాదని, నీటిని కాచి వడపోసి తాగాలని సూచించారు. నిల్వ ఉంచిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సేవా కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కష్టతరమైన బాటలో నడిచి వచ్చి తమకు వైద్యం అందించిన వైద్యాధికారిని గ్రామస్తులు కొనియాడారు. -
సీలేరులో సీప్లేన్ సందడి
● ఏప్రిల్ 2న ప్రజాభిప్రాయసేకరణ ● తహసీల్దార్ అన్నాజీరావు గూడెంకొత్తవీధి: పర్యాటక రంగంలో సరికొత్త విప్లవానికి వేదిక కానున్న సీలేరు జలాశయం ’సీప్లేన్ ఏరోడ్రోమ్’ ప్రాజెక్టుపై ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు తహసీల్దార్ అన్నాజీరావు గురువారం వెల్లడించారు. ఏరోడ్రోమ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని తహసీల్దార్ తెలిపారు. ప్రస్తుతం పర్యావరణ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల ప్రక్రియ కొనసాగుతోందని, అందులో భాగంగానే ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని వివరించారు. ఏప్రిల్ 2న జరిగే ఈ కీలక సమావేశానికి ఇన్చార్జి జేసీ స్వయంగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. సీలేరులో సీప్లేన్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయరూ..
రావికమతం: మండలంలో చీమలపాడు పంచాయతీ జెడ్.జోగుంపేట కేంద్రంగా ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని గురువారం గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి నిరసన తెలిపారు. చీమలపాడు పంచాయితీ పరిదిలో గల జెడ్.జోగుంపేటలో ఎంపీపీ స్కూల్ ఉంది. జెడ్.జోగుంపేట గ్రామం చుట్టు కరగెడ్డ, గంగంపేట, రొచ్చుపణుకు,పెద గరువు, రాయపాడు, నేరెడు బంద, బంగారు బందలు, అజేయపురం తదితర గ్రామాల గిరిజన విద్యార్థులు జెడ్.జోగుంపేటలో చదువుకుంటున్నారు. రోలుగుంట, రావికమతం మండలాల పరిధిలో 70 గ్రామాల గిరిజన విద్యార్థులకు జెడ్.జోగుంపేట కేంద్రంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేయాలని చోడవరం నియోజవర్గంలో ఒక్క గిరిజన ఆశ్రమ పాఠశాల కూడా లేదని, ఆశ్రమ పాఠశాల ఉంటే గిరిజన విద్యార్థులకు మేలు జరుగుతుందని, జిల్లా కలెక్టర్ స్పందించి జెడ్.జోగుంపేటలో ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాంగి చంద్రయ్య,పాంగి చంపావతి,వంతల ఐలమ్మ పాల్గొన్నారు. -
వసుధైక కుటుంబానికి నిదర్శనం ఏయూ
మద్దిలపాలెం: ఐక్యత, వైవిధ్యమే మన బలం అని, వసుధైక కుటుంబానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం నిదర్శనంగా నిలుస్తోందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీచ్రోడ్డులోని కన్వెన్షన్ సెంటర్ వేదికగా గురువారం నిర్వహించిన అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక విభావరిని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏయూకు ఉన్న ప్రతిష్టకు నిదర్శనంగానే విదేశీ విద్యార్థులంతా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారని కొనియాడారు. యువతరం శాంతి, సుస్థిరతకు పాటుపడాలని సూచించారు. ఏయూ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో విద్యనందిస్తోందని ప్రశంసించారు. విభిన్న దేశాల సంస్కృతులను పంచుకుంటూ సామరస్య జీవనం సాగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వర్సిటీ నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇది ఒకటని తెలిపారు. కొద్ది రోజుల కిందట నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్ మాట్లాడుతూ.. ఏయూలో ప్రస్తుతం 57 దేశాలకు చెందిన 1,150 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విదేశీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ప్రత్యేక వస్త్రధారణలతో, ఆకట్టుకునే ఆహార్యంతో తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను, నృత్య రీతులను పరిచయం చేస్తూ వారు నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. -
స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
నర్సీపట్నం:రపభుత్వం తక్షణమే స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శంకరరావు మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా మధ్యాహ్న భోజన కార్మికులు.. పిల్లలకు వండి పెడుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట నుంచి స్కూళ్లకు క్యారేజీలు పంపాలని నిర్ణయించాయన్నారు. ఈ స్మార్ట్ కిచెన్ల వల్ల వేలాదిమంది వంట కార్మికులు ఉపాధి కోల్పోతాయరని చెప్పారు. కార్మికులందరూ ఐక్యంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పి కొట్టాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సెంట్రల్ కిచెన్ పేరుతో అక్షయపాత్ర, ఇస్కాన్, నవ ప్రయాస వంటి సంస్థలకు కట్టబెడితే నాడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించినట్టు గుర్తు చేశారు. కేసులు పెట్టి జైలుకు పంపినా ఐక్యంగా పోరాడాం దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ప్రతి మండలంలో రెండు స్మార్ట్ కిచెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలకపోయినా పిల్లలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన భోజనాన్ని కార్మికులు అందిస్తున్నారన్నారు. సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి భోజనం అందిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని కంకణం కట్టుకున్నాయన్నారు. ఒక్కో స్మార్ట్ కిచెన్కు ప్రభుత్వమే స్థలం ఇచ్చి, రూ.55 లక్షలతో నిర్మిస్తుందన్నారు. మనకు మాత్రం వంట షెడ్లు, పాత్రలకు నిధులు ఖర్చు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్డే మీల్ కార్మిక సంఘం నాయకులు ఒ.నూకరాజు, సత్యవతి, ప్రసన్న, ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
అనకాపల్లి: క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు శారీరక దారుఢ్యం చేకూరుతుందని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి పూజారి శైలజ అన్నారు. మండలంలో ఏఎంఎఎల్ కళాశాల క్రీడామైదానంలో సంస్థ ఆధ్వర్యంలో బుధవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందన్నారు. అనంతరం 100, 400, 800, 1500 మీటర్ల రన్నింగ్, లాంగ్జంప్, హైజంప్, త్రోబాల్, డిస్క్త్రో తదితర పోటీలను నిర్వహించారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 30,31 గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
విగ్రహ ధ్వంసం కేసు నీరుగార్చేలా పోలీసుల తీరు
అనకాపల్లి: మండలంలోని తగరంపూడిలో ఈనెల 20వ తేదీ రాత్రి మాజీ మంత్రి, దివంగత గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని అదే గ్రామానికి చెందిన జనసేన నాయకులు ధ్వంసం చేశారని, వారిని అరెస్టు చేయకుండా కేసును నీరుగాచ్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ కార్యాలయంలో ఆపార్టీ పట్టణ, మండల అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెద్దిశెట్టి గోవింద్ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురునాథరావు పార్టీలకు అతీతంగా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారని, ఆయన మరణానంతరం తగరంపూడి గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా 2019లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రోత్సహించిన గ్రామ జనసేన ప్రధాన నాయకుడు భరత్బాబును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 26 జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సీనియర్ నాయకులు, గురునాథరావు అభిమానులు విగ్రహాన్ని సందర్శించనున్నట్టు చెప్పారు. తగరంపూడి సర్పంచ్ యాదగిరి అప్పారావు ఈనెల 21న విగ్రహం వద్ద విలేకరులతో సమావేశం నిర్వహించి 15 రోజుల క్రితం గ్రామ జనసేన నాయకులు విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారని తెలిపారని, అదే సర్పంచ్ ఈనెల 24న విగ్రహాన్ని జనసేన నాయకులు తొలగించమని చెప్పలేదని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్పంచ్ మాటమార్చే విధంగా కూటమి నేతలు ఒత్తిడి చేశారని ఆరోపించారు. 2004లో ఏఎంఎఎల్ కళాశాలలో దేశనాయకుల విగ్రహాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై పార్టీలకు అతీతంగా అప్పటి వర్తకసంఘం నాయకులు కేసులు నమోదు చేయించారని చెప్పారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులపై కూడా పార్టీలకు ఆతీతంగా కేసు నమోదు చేయించి, అరెస్టు చేయాలని కోరారు. ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యహరించాలన్నారు. దోషులను అరెస్టు చేసేవరకూ పోరాటాలు చేస్తామన్నారు. గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తులను అరెస్టు చేయకపోతే వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కచ్చితంగా అరెస్టు చేస్తామని తెలిపారు. వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ విగ్రహాలను ధ్వంసం చేసిన కూటమి నాయకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిశెట్టి గోవింద్ మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన అసలైన నిందితులను అరెస్టు చేయకుండా, తూతూ మంత్రంగా చిన్ననాయకులను అరెస్టు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పార్టీ సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు, 81వ వార్డు ఇన్చార్జి బొడ్డేడశివ, పట్టణ, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మి గున్నయ్యనాయుడు, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మర్రిపల్లి శోభ, పార్టీ నాయకులు బుద్దిరెడ్డి దేముడుబాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వక కలయిక
దేవరాపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, అనకాపల్లి సమన్వయ కర్త మలసాల భరత్కుమార్ బుధవారం వేర్వేరుగా మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్గా నియమించినందుకు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ముత్యాలనాయుడు చెప్పారు. -
సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి
దేవరాపల్లి: ఆరోగ్యకరమైన పంటల సాగుకు రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజ్కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు సూచించారు. మండలంలోని మారేపల్లిలో ఆత్మ పథకం సౌజన్యంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్థానిక వ్యవసాయ అధికారి ఎల్.వై.కాంతమ్మ ఆధ్వర్యంలో రైతులకు రెండో రోజు బుధవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పిందె దశలో ఉన్న నువ్వు పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు 13.0.45 మల్టీ–కె, 19.19.19 పిచికారి చేయాలని సూచించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వాడాలని తెలిపారు. రైతులకు జీవామృతం తయారీ విధానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తర్ణ అధికారి ఎస్. కిరణ్కుమార్ తదితర వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
28 నుంచి అప్పన్న వార్షిక కల్యాణోత్సవాలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి: ఉత్సవాల కార్యక్రమాలు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల నుంచి విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, ఉత్సవాంగీకారం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు. ● 29న మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 5.30 నుంచి 6.30 వరకు ధ్వజారోహణం, 6:30 నుంచి 7:30 వరకు ఎదురుసన్నాహోత్సవం, రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రథోత్సవం, రాత్రి 10.30 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు మూలవిరాట్ దర్శనం ఉండదు. రాత్రి 8.30 నుంచి 10.30 వరకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. ● 30న సాయంత్రం 5 గంటలకు శేషవాహనంపై స్వామివారి తిరువీధి. ● 31న మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 వరకు పండిత సభ, సాయంత్రం 6 గంటలకు సర్వజన మనోరంజని వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 1న సాయంత్రం 5 గంటలకు సూర్యప్రభ వాహనంపై తిరువీధి. ● ఏప్రిల్ 2న ఉదయం 6 గంటలకు పూర్ణాహుతి, 7 గంటలకు కొట్నాల ఉత్సవం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, గంగధార వద్ద చక్రస్నానం. ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు. రాత్రి దొంగలదోపు ఉత్సవం. ● ఏప్రిల్ 3న ఉదయం 8 నుంచి 10.30 వరకు వినోదోత్సవం, 10.30 నుంచి 11.30 వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం. దర్శనాల సమయాల్లో మార్పులు ● ఈనెల 28న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. ● 29 నుంచి ఏప్రిల్ 2 వరకు (మార్చి 29 మినహా) రాత్రి 7 గంటల తర్వాత దర్శనం ఉండదు. ● ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనం లేదు. సేవల రద్దు ఈనెల 28 నుంచి ఏప్రిల్ 4 వరకు సుప్రభాత సేవ, ఆరాధన సేవ టికెట్లు, 28 నుంచి ఏప్రిల్ 13 వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 29న కల్యాణోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 4 వరకు రాజగోపురం సమీపంలోని కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు. కొండ దిగువ పుష్కరిణి సత్రం వద్ద ఈనెల 30 నుంచి ఏప్రిల్ 3 వరకు పౌరాణిక నాటకాలు, తోలుబొమ్మలాట ప్రదర్శనలు నిర్వహించనున్నారు. -
యలమంచిలిలో భారీ చోరీ
యలమంచిలి రూరల్ : పట్టణ ఠాణా పరిధి కట్టుపాలెం చెరకు కాటా సమీపంలో కొత్తపాలెం వెళ్లే రహదారి పక్కనున్న ఓ ఇంట్లో బుధవారం భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు కాజేశారు.ఇక్కడ నివాసముంటున్న రైతు బొడ్డేటి సతీష్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం బీరువాలో భధ్రపరిచిన సుమారు 9 తులాల బరువున్న 4 బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. బాధితుడు, ఘటనా స్థలంలో స్థానికుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం రైతు సురేష్ పొలం పని చేసుకోవడానికి వెళ్లారు.అతని భార్య యలమంచిలి పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో పిల్లల చదువుకు సంబంధించి వాకబు చేయడానికి వెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కనే ఒక ప్రదేశంలో దాచి వెళ్లారు.ఇంట్లో ఎవరూ లేరని ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో దాచిన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన భార్య బీరువా తెరిచి ఉండడం చూసి పరిశీలించగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు తెలిసింది. దీంతో బాధితుడు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామెవరూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2 గంటల మధ్యలో చోరీ జరగడాన్ని బట్టి తెలిసిన వారి పనే అయి ఉంటుందని బాధిత కుటుంబీకులు అనుమానిస్తున్నారు. సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్ఐ కె.సావిత్రి, ఏఎస్ఐ చెల్లారావు, అనకాపల్లి నుంచి క్లూస్ టీం బృందం చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. బాధిత కుటుంబీకుల నుంచి చోరీకి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. చోరీ సమాచారాన్ని పోలీసులు మీడియాకు వెల్లడించలేదు. ఆధారాలు సేకరిస్తున్న క్లూస్ టీం సభ్యులు -
శారదా నదిలో వృద్ధుడు గల్లంతు
ప్రమాద స్థలంలో గాలింపు చర్యలు చేపడుతున్న సీఐ అల్లు స్వామినాయుడు కశింకోట: మండలంలోని తేగాడ గ్రామం వద్ద శారదా నదిలో బుధవారం ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. తేగాడకు చెందిన గొంతిన లోవరాజు (60) కూలి పని కోసం గ్రామ సమీపంలోని నదిని నడిచి దాటడానికి అవతలకు వెళ్తుతుండగా మునిగిపోయి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందడంతో సీఐ అల్లు స్వామినాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వృద్ధుడ ఆచూకీ దొరకలేదు. లోవరాజుకు భార్య సూర్యకాంతం, వివాహమైన కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
పర్యాటకుడి దారుణహత్య
అరకులోయ టౌన్/ తెర్లాం (విజయనగరం జిల్లా): ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ మండలం, చినలబుడు పంచాయతీ పరిధిలోని హట్టగుడ సమీపంలోని ‘రూప రిసార్ట్స్’ ప్రధాన రహదారిపై పర్యాటకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగింది?విజయనగరం జిల్లా తెర్లాం మండలం, జన్నివలస గ్రామానికి చెందిన నాగళ్ల సురేష్ (25) రెండేళ్ల కిందట అరకులోని పద్మాపురం వద్ద ఉన్న ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. ప్రస్తుతం అతను హైదరాబాద్లోని లలితా జ్యుయలరీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత వారం తన స్వగ్రామంలో జరిగిన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైన సురేష్ విజయనగరం వెళ్లివస్తానని ఇంటి వద్ద చెప్పి అరకులోయ వచ్చాడు. ఉషోదయ రిసార్ట్స్లో పనిచేస్తున్న ఓ యువతితో కలిసి అతను రూప రిసార్ట్స్లో గది అద్దెకు తీసుకున్నాడు. ఈ క్రమంలో లాడ్జిలో పనిచేస్తున్న కొంతమంది యువకులతో సురేష్కు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. గొడవ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేసిన సురేష్ను, రిసార్ట్స్ సమీపంలోని రహదారి వద్ద దుండగులు కత్తితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పాడేరు డీఎస్పీ అభిషేక్ వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. ఈ కేసులో రిసార్ట్స్లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. అరకులోయ ఎస్ఐ గోపాలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి... విజయనగరం వెళ్లి వస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి మోటార్ సైకిల్పై బయలుదేరి వెళ్లిన వ్యక్తి అదే రోజు రాత్రి సమయంలో అరకులోయలో హత్యకు గురైయ్యాడన్న సమాచారం బుధవారం ఉదయం తెలుసుకున్న అతని భార్య, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. జన్నివలసకు చెందిన నాగళ్ల అప్పలనాయుడు, సూరమ్మలకు ముగ్గురు వివాహితులైన కుమారులు, ఒక అవివాహిత కుమార్తె ఉన్నారు. వారిలో సురేష్ మూడవ కుమారుడు. రెండేళ్ల కిందట సురేష్ అరకులోయ మండలం పద్మాపురంలోని ఉషోదయ రిసార్ట్స్లో పనిచేసేవాడు. హైదరాబాద్లోని లలిత జ్యూయలరీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. సురేష్కు ఏడాది కిందట అదే గ్రామానికి చెందిన తులసితో వివా హం జరిగింది. ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆలయ ప్రారంభానికి వచ్చి హత్యకు గురికావడంతో కన్నీరుపెడుతున్నారు. సురేష్ మృతితో జన్నివలస గ్రామంలోని యాదవ వీధిలో విషాదం అలముకుంది.పర్యాటక స్వర్గథామం అరకులోయలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ యువకుడు రిసార్ట్ సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యాడు. పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో జరిగిన గొడవలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. అరకులోయలో గొంతు కోసినదుండగులు పాత పరిచయాలు, రిసార్ట్ సిబ్బందితో గొడవలే కారణం? అనుమానిస్తున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించిన పాడేరు డీఎస్పీ అభిషేక్ విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతుడి స్వగ్రామం జన్నివలసలో విషాదఛాయలు -
ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి
● జిల్లా ఆహార భద్రత అధికారి గ్రీష్మ జి.మాడుగుల: గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో వంట గదుల శుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలపై వార్డెన్లు, వంట సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఆహార భద్రతా అధికారి గ్రీష్మ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ బీకే పరిమళ సూచించారు. బుధవారం స్థానిక ఏటీడబ్ల్యూవో కార్యాలయంలో మండలంలోని వసతి గృహాల వార్డెన్లు, వంట సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వసతి గృహాల్లో ఆహార పరిరక్షణ, వంట గదిలో పాటించవలసిన పరిశుభ్రత ప్రమా ణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, వంట చేసేటప్పుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు వంట గది పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో నాగ శిరీష, మినీ గురుకులం స్పె షల్ ఆఫీసర్ ఎం. విజయకుమారి, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు, వంట సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రామాల్లో ఇటుకల పండగ సందడి
డుంబ్రిగుడ: మండలంలో గిరిజనుల సాంప్రదాయ ఇటుకల పండగ సంబరాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అరకు – పాడేరు జాతీయ రహదారితో పాటు పలు గ్రామాల రోడ్లపై గిరిజన మహిళలు గేట్లు ఏర్పాటు చేసి, వాహనదారుల నుంచి పజోర్లు (చందాలు) వసూలు చేస్తూ సందడి చేశారు. ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ పండుగలో పజోర్ల ద్వారా వసూలు చేసిన మొత్తాన్ని గ్రామంలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఈ వారం రోజుల పాటు గిరిజనులు ఎటువంటి పనులకు వెళ్లకుండా గ్రామాల్లోనే ఉంటారు. ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ, ఊయలలు కట్టుకుని మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా గడుపుతారు.ఈ పండగలో భాగంగా పురుషులు సమీపంలోని అడవికి వేటకు వెళ్తారు. పండుగ ముగింపు రోజున గుడ్డును కొట్టడం లేదా ఏదైనా జంతువును వేటాడటం ద్వారా ఉత్సవాన్ని ముగిస్తారు. -
సీలేరును నిర్వాసిత గ్రామంగా ప్రకటించాకే ‘పంప్డ్ స్టోరేజ్’ పనులు
జేఏసీ నేతలు డిమాండ్సీలేరు: ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మించబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో సీలేరును నిర్వాసిత గ్రామంగా గుర్తించాలని కోరుతూ స్థానిక జేఏసీ నాయకులు బుధవారం జెన్కో అధికారులతో చర్చలు జరిపారు. జెన్కో చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు, ఎస్ఈ జాకీర్ హుస్సేన్, డీఈ బాలకృష్ణ, సర్పంచ్ దుర్జో, జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. తొలివిడతగా పార్వతీ నగర్, సాండ్ కోరి, బూసుకొండ గ్రామాల్లో ప్యాకేజీ అమలు చేశాక, సీలేరు యువతకు మెగా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని సీఈ హామీ ఇచ్చారు. సీలేరును పూర్తిస్థాయి నిర్వాసిత గ్రామంగా అధికారికంగా ప్రకటించాలని, అప్పటి వరకు పనులు ప్రారంభించవద్దని నాయకులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వల్ల దెబ్బతినే ప్రస్తుత స్మశాన వాటికకు బదులుగా, అన్ని సదుపాయాలతో వేరే చోట కొత్తది నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిర్వాసిత గ్రామంగా సీలేరును చేర్చే అంశాన్ని ఎండీ దృష్టికి తీసుకెళ్లి, వారి ఆదేశాల మేరకు నిర్ణయం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అయితే, డిమాండ్లు నెరవేర్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలని జేఏసీ నాయకులు తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సాంబమూర్తి, ఉప సర్పంచ్ వల్లి ప్రసాద్, మాజీ ఉప సర్పంచ్ కార్య శ్రీనివాస్, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
చిన్నారులకు సకాలంలో టీకాలు
● జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పసుపులేటి నారాయణ గూడెంకొత్తవీధి: చిన్నారులకు సకాలంలో టీకాలను వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పసుపులేటి నారాయణ ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పలు పీహెచ్సీల వైద్యసిబ్బందికి శిక్షణ ఇచ్చారు. రాజేంద్రపాలెం, యూ.చీడిపాలెం, ఆర్వీనగర్, జీకేవీధి, సీలేరు, సప్పర్ల, దారకొండ పీహెచ్సీల సిబ్బంది హాజరయ్యారు. మాతృ, శిశుమరణాల నివారణ, వ్యాక్సినేషన్, హెల్త్కార్డులు, ఆర్సీహెచ్ పోర్టల్ నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈహెచ్ఆర్ నోడల్ అధికారి హరిప్రియ, పీహెచ్సీ వైద్యాధికారి రుషశ్రీ, డీపీహెచ్ఎన్వో భూలోకమ్మ, ఎంపీహెచ్ఈవో వెంకటేష్, హెచ్ఎస్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
మత్స్యగెడ్డలోనేడు ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
ముంచంగిపుట్టు : మండలంలో గల సుజనకోట మత్స్యగెడ్డలో ఈ నెల 26వ తేదీన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాక్డ్రిల్ నిర్వహిస్తాయని ఎంపీడీవో ధర్మారావు,తహసీల్దార్ భాస్కరఅప్పారావు తెలిపారు. బుధవారం సుజనకోట, కొత్తసుజనకోట, కుమ్మరి పుట్టు గ్రామాల గుండా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డను విజయవాడకు చెందిన 10వ బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్నతో కలిసి మండల స్థాయి అధికారులు పరిశీలించారు. స్థానిక గిరిజనులతో మాట్లాడారు. నాటు పడవలపై గెడ్డ దాటేటప్పుడు జరుగుతున్న ప్రమాదాల వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేశారు. మండలంలోని 23 పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, నేతలు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.సర్పంచ్ రమేష్, పాల్గొన్నారు. -
సచివాలయ వ్యవస్థనుసద్వినియోగం చేసుకోండి
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హుకుంపేట: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. బుధవారం మండలంలోని సంతరి గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో జగనన్న హయాంలో నిర్మించిన సచివాలయ భవనాలు ‘గ్రామ స్వరాజ్యానికి’ నిలువెత్తు సాక్ష్యాలని, ఇవి ప్రజల గుండెల్లో చెరగని గుర్తుగా మిగిలిపోతాయని కొనియాడారు. ప్రస్తుత కూటమి పాలకుల నిర్లక్ష్యం వల్ల అనేక పంచాయతీ భవనాలకు మోక్షం కలగలేదని, నేటికీ అవి మొండిగోడలతోనే దర్శనమిస్తున్నాయని విమర్శించారు. నిజమైన నాయకుడంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలా ఉండాలని, మోసపూరిత హామీలతో గద్దెనెక్కడం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్, వైస్ ఎంపీపీ గంజాయి సుశీల, సర్పంచ్లు కాసులమ్మ, వెంకట పూర్ణిమ, నాయకులు సంజీవ్, కామేష్, నాగేష్ పాల్గొన్నారు. -
చిల్లిగవ్వే మిగిలేది!
చెమట చిందించినా..వారపు సంతల్లో మద్దతు ధర లేక గిరి రైతు విలవిల● కొనసాగుతున్న దళారుల దోపిడీ ● గిట్టుబాటు కాక నష్టాలు ● ఆర్థిక ఇబ్బందుల్లో అన్నదాత అడవిని నమ్ముకుని, ఆకాశమే హద్దుగా శ్రమిస్తూ.. రక్తాన్ని చెమటగా మార్చి ఆదివాసీ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కరువైంది. వారపు సంతలే వేదికగా సాగుతున్న ఈ ధరల దోపిడీలో దళారులు లాభపడుతుంటే, గిరి రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. బయట మార్కెట్లో ధరల మంట.. సంతలో మాత్రం గిరిజన పంటల ధరలు పతనం.. ఈ వైరుధ్యాల మధ్య ఆదివాసీ రైతులు విలవిల్లాడుతున్నారు. జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జరిగే వారపు సంతల్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిలకడగా లేకపోవడంతో ఆదివాసీ రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత రైతులు ప్రధానంగా పసుపు, మిరియాలు, పిప్పలి, అల్లం, కాఫీ వంటి వాణిజ్య పంటలను ఎంతో కష్టపడి పండిస్తున్నారు. అయితే, తాము పండించిన పంటను విక్రయించుకోవడానికి వీరికి స్థానిక వారపు సంతలే ప్రధాన దిక్కవుతున్నాయి. రైతుల ఆవేదన సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్న ధరలు, గత మూడు వారాలుగా క్రమంగా పడిపోతుండటం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జి.మాడుగుల సంతబయలు మంగళవారం, మద్దిగరువులో గురువారం జరిగే సంతల్లో ధరల తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. ధరల వ్యత్యాసమిలా.. మిరియాలు: కిలో రూ. 670 నుంచి రూ. 640, పసుపు: కిలో రూ. 140 నుంచి రూ. 120, పిప్పలి మోడి: కిలో రూ. 300 నుంచి రూ. 260కు తగ్గింది. పాచ్మెంట్ కాఫీ: కిలో రూ. 510 నుంచి రూ. రూ.425కు, కాఫీ గుల్లరకం రూ.270 నుంచి రూ.230కు పతనమైంది. మొత్తంగా కిలోకు రూ. 20 నుంచి రూ. 50 వరకు ధరలు తగ్గడంతో గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతోంది. మోసపోతున్న వైనం మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొండ కోనల నుంచి ఎంతో శ్రమటోడ్చి పంటను సంతకు తీసుకొచ్చిన రైతులు, తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, రవాణా ఖర్చుల భారంతో నష్టానికై నా వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. బయట మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, మేము పండించిన పంటలకు మాత్రం ధరలు పడిపోతున్నాయి అని ఆదివాసీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోని అధికార యంత్రాంగం వారపు సంతల్లో వాణిజ్య పంటల ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాలని గిరిజనులు కోరుతున్నారు. గిరిజన సహకార సంస్థ ద్వారా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని, తద్వారా దళారుల దోపిడీ నుంచి తమను రక్షించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.కొనుగోలుకు వెనుకాడుతున్నాం మార్కెట్లో వాణిజ్య, వ్యవసాయ పంటలు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనివల్ల వారపుసంతలో ధరలు తగ్గడంతో రైతులకు కొంత వరకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. గత మూడు వారాల నుంచి ఉత్పత్తుల ధర కిలో రూ. 20 నుంచి 50వరకు తగ్గుతుండటంతో కొనుగోలు చేసేందుకు వెనుకాడుతున్నాం. తెగించి కొనుగోలు చేస్తే నష్ట పోవాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, వ్యాపారి, మాడుగుల ధరలు నిలకడగా లేక నష్టం ఏజెన్సీ ప్రాంతంలోని వారపుసంతల్లో పసుపు, పిప్పలి, కాఫీ, మిరియాలు వంటి వాణిజ్య, వ్యవసాయ పంటలకు ధరలు నిలకడగా ఉండటం లేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. వారపుసంతల్లో ధరలు రానురాను పెరుగుతాయని భావించి నిల్వ చేసుకున్న పంటలు ధరలు తగ్గుముఖం పడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో అమ్ముకోవాల్సి వస్తోంది. – నాయుడు, పసుపు రైతు, పెదలోచలి, జి.మాడుగుల మండలం -
షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల కోసం ‘ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర’
జి.మాడుగుల: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకానికి ప్రత్యేక చట్టం చేయాలని కోరుతూ మండలంలోని పెదలోచలి, గొడుగుమామిడి, వంతాల పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ఈ యాత్ర నేటితో 136వ రోజుకు చేరుకుంది. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో, సొలభం సర్పంచ్ ఐసరం హనుమంతరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ జిల్లా చైర్మన్ రామన్నదొర ప్రభుత్వంపై పలు డిమాండ్లు ఉంచారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానిక గిరిజనులకే కేటాయించేలా వెంటనే చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని, కొత్త జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయడానికంటే ముందే ఈ నియామక చట్టం ప్రక్రియను పూర్తి చేసి, ఆదివాసీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా, వచ్చేనెల 3న (శుక్రవారం) పాడేరులో నిర్వహించబోయే భారీ బహిరంగ ర్యాలీకి జేఏసీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు, జెఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరింది. -
అభివృద్ధి పనులకు వెంటనే అనుమతులు మంజూరు
● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: జిల్లా సమగ్రాభివృద్ధికి, పర్యాటక రంగానికి ఊతమిచ్చే రహదారులు, సెల్ టవర్ల నిర్మాణానికి అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయం నుంచి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రహదారుల నిర్మాణానికి తీసుకునే అటవీ భూములకు బదులుగా, రెవెన్యూ భూములను ప్రత్యామ్నాయంగా చూపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పర్యావరణ నిబంధనలకు లోబడే అభివృద్ధి పనులు జరగాలన్నారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. అటవీ, రెవెన్యూ లేదా ప్రైవేటు భూములకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులతో బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇన్చార్జ్ జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు, రంపచోడవరం ఆర్డీవో అంబేడ్కర్, పాడేరు, చింతపల్లి డీఎఫ్వోలు ఉమామహేశ్వరి, నర్సింగరావు పాల్గొన్నారు. జనగణనపై ముగిసిన శిక్షణ జనగణన–2027పై ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు స్థానిక కలెక్టరేట్లో గత మూడు రోజులుగా నిర్వహించిన శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణన ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లాలోని 11 మండలాల నుంచి శిక్షణ పొందిన 22 మంది ఉపాధ్యాయులకు ధ్రువీకరణ పత్రాలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, జనగణన సెన్సెస్ అధికారి త్రినాథరావు పాల్గొన్నారు. -
మంచినీటి పరీక్షలుతప్పనిసరిగా నిర్వహణ
● చింతపల్లి ఎంపీడీవో సీతామహలక్ష్మి ఆదేశం చింతపల్లి: రానున్న వేసవి దృష్ట్యా మండలంలోని ప్రతీ గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి వనరులకు సంబంధించి ఇంజనీరింగ్ సిబ్బంది విధిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో సీతామహాలక్ష్మి ఆదేశించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అదికారులు, అసిస్టెంట్లతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీరు సేవించేలా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఏ గ్రామంలోనైనా తాగునీటిలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత గ్రామ కార్యదర్శితో పాటు పంచాయతీ అధికారులకు తెలయజేయాలన్నారు.గ్రామాల్లో వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో బీఏబీల్ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వర్ణలత పాల్గొన్నారు. -
సీలేరు పీహెచ్సీ సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు
సీలేరు: ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు మంగళవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవో తిరుమణి శ్రీపూజ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు. స్థానిక పీహెచ్సీకి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ వంజరి శివ, ఫార్మసిస్టు అరుణ, హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ, ఏఎన్ఎం దుచ్చరి దేవి, ఆశా కార్యకర్త జ్యోతి విశిష్ట సేవలకు గానూ ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. -
రహదారుల పనులు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకు చేపడుతున్న రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. బుదవారం తన ఛాంబర్ నుంచి ఎస్పీ అమిత్బర్దర్తో కలిసి గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో అనుమతి పొందిన 30 పనుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. పది రోడ్లు పూర్తయ్యాయని మరో పది రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ అనుమతుల ప్రక్రియలో ఉండగా మరో ఏడు పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో మూడు పనులు అనుమతుల కోసం పంపించామన్నారు. జిల్లాలో జరుగుతున్న పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెవెన్యూ, ఫారెస్ట్ అనుమతులు, అడ్డకుంలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమీక్ష సమావేశంలో పలు శాఖల ఇంజనీరింగ్ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలి
పాడేరు: జిల్లావ్యాప్తంగా గంజాయి వినియోగం, రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన అంకార్డ్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.గంజాయి ప్రభావం ఉన్న ప్రతి గ్రామం, మండలంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి వల్ల వ్యక్తికి, సమాజానికి కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. గంజాయికి బానిసైన వారిలో మార్పు తెచ్చి, వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలన్నారు. ముఖ్యంగా అధిక దిగుబడినిచ్చే ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేసి గిరిజనుల జీవనోపాధికి తోడ్పడాలన్నారు. చట్టవిరుద్ధంగా గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ యంత్రాంగం నిఘా.. ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ.. చెక్పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రవాణా జరుగుతోందని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇప్పించి వారిని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచవచ్చని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి నందు, డీఎల్పీవో కుమార్, డ్వామా పీడీ విద్యా సాగర్, డీఆర్డీఏ పీడీ మురళి పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్ కుమార్ -
కొత్త జోష్
ఉమ్మడి విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలుఉమ్మడి విశాఖలో కొత్తగా 6–7 అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం సీట్ల సంఖ్య 21 నుంచి 22కు పెరిగే అవకాశం ఎస్సీ, ఎస్టీలకు మరింత ప్రాధాన్యం ఆశావహుల్లోసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ ముఖచిత్రం త్వరలోనే పూర్తిగా మారిపోనుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 15 నియోజకవర్గాల సంఖ్య 21 నుంచి 22కు చేరుకోనుంది. అంటే కొత్తగా 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పరిణామాలు స్థానిక రాజకీయ ఆశావహుల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసిన నాయకులకు ఇది గోల్డెన్ ఛాన్స్గా మారగా, కొత్త తరం నేతలకు రాజకీయ ప్రవేశానికి మార్గం సుగమమవుతోంది. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ తమ గళాన్ని వినిపించాలన్న కలలు కనే వారికి ఈ పునర్విభజన ప్రక్రియ కొత్త ఆశలు, అవకాశాలు తెరచి పెడుతోంది. ఓట్ల సంఖ్యను బట్టి విభజన పునర్విభజన ప్రక్రియ 2011 జనాభా లెక్కల ఆధారంగా సాగనున్నా.. ప్రధానంగా ఓటర్ల సంఖ్యే కీలక ప్రమాణంగా మారనుంది. ఒక నియోజకవర్గంలో సుమారు 1.6 లక్షల ఓటర్ల పరిమితి ఉండేలా రూపకల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం 3 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాలు రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ తూర్పు, ఉత్తర నియోజకవర్గాలు కూడా ఇదే బాటలో నడవొచ్చు. ఈ నియోజకవర్గాల్లో కూడా 2029 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఓటర్ల సంఖ్య 3 లక్షలకు దాటే అవకాశం ఉంది. అలాగే నగరంలో కొత్తగా ‘విశాఖ సెంట్రల్’ నియోజకవర్గం ఏర్పడే సూచనలు బలంగా ఉన్నాయి. తూర్పు, ఉత్తర, దక్షిణ, పశ్చిమ నియోజకవర్గాల నుంచి కొన్ని వార్డులు కలిపి దీనిని రూపొందించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త సమీకరణలు పాయకరావుపేటలో అధిక ఓటర్ల సంఖ్య కారణంగా అది రెండు నియోజకవర్గాలుగా విడిపోయే అవకాశం ఉంది. యలమంచిలి, అనకాపల్లి పరిధిలో కొత్తగా ‘అనకాపల్లి రూరల్’ నియోజకవర్గం కూడా తెరపైకి రావొచ్చు. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మార్పులు తప్పవు. నర్సీపట్నంలోని కొన్ని గ్రామాలు కలిపి... పాడేరు, అరకు నియోజకవర్గాలను పునర్విభజించి.. కొత్తగా ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక గతంలో ఉన్న పరవాడ, చింతపల్లి నియోజకవర్గాలు మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ మ్యాప్ కూడా మారే చాన్స్ అరకు పార్లమెంట్ నియోజకవర్గం పరిమితి మారి.. కొత్తగా ఏర్పడే అసెంబ్లీ సీట్లతో రీడిజైన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం ప్రాంతంలో కొత్త పార్లమెంట్ నియోజకవర్గం కూడా రావచ్చనే చర్చ నడుస్తోంది. ద్వితీయ శ్రేణి నేతల జోరు సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ద్వితీయ శ్రేణి నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అధ్యక్షా.. అని పిలిపించుకోవాలని తపించే రాజకీయ నేతలకు కేంద్రం నిర్ణయం ఒక వరంగా మారింది. నియోజకవర్గాల హద్దులు మారనుండటంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పునర్విభజనతో మారనున్నఉమ్మడి విశాఖ జిల్లా ముఖచిత్రం పెరగనున్న మహిళా ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని సీట్లు 2029 సమరానికి ఇప్పుడే మొదలైన లెక్కలు జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాతినిధ్యం పెరగనుంది. ప్రస్తుతం ఉన్న ఒక ఎస్సీ (పాయకరావుపేట), రెండు ఎస్టీ (అరకు, పాడేరు) స్థానాలకు అదనంగా.. మరో ఎస్సీ, మరో ఎస్టీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. -
రూ.1.50 కోట్లతో 13 కొత్త అంబులెన్స్లకొనుగోలు
పాడేరు: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా రోగులకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కొనుగోలు కమిటీ ఆదేశాల మేరకు, రూ.1.50 కోట్ల నీతి ఆయోగ్ నిధులతో 13 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేయనున్నట్లు ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ–టెండర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.అర్హత కలిగిన ఏజెన్సీలు, సరఫరాదారులు ఈ అవకాశాన్ని సద్వీనియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల సంస్థలు టెండర్ నిబంధనలు, పూర్తి వివరాల కోసం అల్లూరిసీతారామరాజు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె సూచించారు.ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ -
అధికారుల నిర్లక్ష్యం.. గిరిజనుల శ్రమదానం
ముంచంగిపుట్టు: అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు.. నిత్యం ఎదురవుతున్న ప్రయాణ కష్టాలు మరోవైపు.. వెరసి మండలంలోని బరడ పంచాయతీ సోలగంపుట్టు గ్రామ గిరిజనులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో, మంగళవారం వారే స్వచ్ఛందంగా తరలివచ్చి శ్రమదానం చేశారు. సోలగంపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న కల్వర్టు పాడై నెలలు గడుస్తోంది. దీనివల్ల అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లాలన్నా, నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా గ్రామస్తులు నరకయాతన అనుభవిస్తున్నారు. పాడైన కల్వర్టును బాగు చేసేందుకు గ్రామస్తులంతా ఏకమయ్యారు. రాళ్లు సేకరించి తెచ్చి, గుంతలు పడిన చోట పూడ్చి, మట్టి వేసి రాకపోకలకు వీలుగా కల్వర్టును తాత్కాలికంగా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, గ్రామానికి కొత్త కల్వర్టును మంజూరు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన రహదారిని నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని సోలగంపుట్టు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. స్వచ్ఛందంగా కల్వర్టును బాగు చేసుకున్న సోలగంపుట్టు గ్రామస్తులు -
వాలాబులో జీడి తోటల పరిశీలన
జీడి రైతులతో మాట్లాడుతున్న ఉద్యాన శాఖ అధికారి కిరణ్మయి దేవరాపల్లి: మండలంలోని వాలాబు పంచాయతీలోని పలు గ్రామాల్లో ఉద్యానశాఖ అధికారి కిరణ్మయి, గరిశింగి సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్ శరత్కుమార్ మంగళవారం పర్యటించారు. ఇక్కడ మంచు, తెగుళ్లు, అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని పూర్తిగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యలే శరణ్యమని సోమవారం గిరిజన రైతులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపిన విషయం విదితమే. దీనిపై ఉద్యానవన శాఖ అధికారులు స్పందించారు. దెబ్బతిన్న జీడి పంటలను పరిశీలించి, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి గుర్తించిన నష్ట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. సీపీఎం మండల కార్యదర్శి బీటీ దొర, జీడి రైతులు బలిజ నాగేశ్వరరావు, కధల రాము, కూడ దేముడు, సోమల కృష్ణ, దుప్పి సోమయ్య, పంది రాజు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోర్ ఘనుడు చంద్రబాబు
నక్కపల్లి: రాష్ట్రానికి మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. దీన్ని తన ఖాతాలో వేసుకుంటూ డప్పా కొట్టుకుంటున్న చంద్రబాబును మించిన క్రెడిట్ చోర్ ఘనుడు లేరన్నారు. మంగళవారం అడ్డురోడ్డులో విలేకరుల సమావేశంలో జోగులు మాట్లాడుతూ 2022లో దావోస్ పర్యటనలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డిని మిట్టల్ గ్రూపు ఇండియా సీఈవో ఆదిత్య మిట్టల్ కలిసి రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నారన్నారు. ఈ విషయం అప్పట్లో పలు జాతీయ ప్రసార మాధ్యమాల్లో వచ్చిందన్నారు. దీన్ని కప్పిపుచ్చుతూ స్టీల్ ప్లాంట్ ఘనత తమ ప్రభుత్వానిదేనని కూటమి నాయకులు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను సేకరించి నిర్వాసితులను, రైతులను అనాథలుగా వదిలేశారన్నారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు ఆందోళన చేస్తే, కేవలం రూ.9 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మిట్టల్ కంపెనీ వారు స్టీల్ ప్లాంట్ పెడుతుంటే టీడీపీ వాళ్లు నానా హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ చంద్రబాబు కుటుంబం కంపెనీ పెడుతున్నట్లుగా హంగామా చేశారని ఎద్దేవా చేశారు. మిట్టల్ సోమ్ముతో జల్సాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి జనాలను తరలించేందుకు వందలాది ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం దారుణమన్నారు. దాంతో పదో తరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఏరు దాటాక తెప్ప తగలేసే చందంగా ఉందన్నారు. భూములు త్యాగం చేసిన నిర్వాసితులను భూమిపూజ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఘోరంగా అవమానించారని ఆరోపించారు. బహిరంగ సభ కేవలం టీడీపీ ప్రచార సభగా మార్చేశారన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు వీవీఐపీ పాసులు ఇచ్చుకుని వారితోనే సభ మమ అనిపించారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను సైతం స్టేజ్పైకి ఆహ్వానించకుండా ప్రొటోకాల్ ఉల్లంఘించడం దారుణమన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడిగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమానర్ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, దత్తుడు సీతబాబు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, జెడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, ఎంపీపీ పార్వతి తాతారావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవిందు, జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, వైస్ ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, పాయకరావుపేట మండలాధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాస్, మండల మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుందర లత, ఎస్. రాయవరం మండల శాఖ అధ్యక్షుడు మధువర్మ, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వంగలపూడి రామారావు, ఎస్సీ విభాగం అధ్యక్షుడు కాకర వెంకటరావు, యువజన విభాగం అధ్యక్షుడు పోచిన నాగేశ్వరరావు, పాయకరావుపేట ఉప సర్పంచ్ జగతా భవానీ శ్రీనివాస్, నూకినాయుడు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
పాడేరులో భారీ వర్షం
పాడేరు : ఎండ వేడి, ఉక్కపోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పట్టణవాసులకు మంగళవారం సాయంత్రం ఉన్నట్టుండి కురిసిన భారీ వర్షంతో సేదతీరారు. పాడేరు పరిసర ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా విభిన్న వాతావరణం చోటుచేసుకుంటోంది. ఉదయం పూట దట్టంగా పొగమంచు కురుస్తోంది. ఉదయం 9గంటల తరువాత ఎండ ప్రభావం కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం పూట ఆకాశం మేఘావృతమై చలిగాలులు వీస్తోంది. మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక్కసారిగా మొదలైన వర్షం సుమారు గంటపాటు దంచికొట్టింది. పాడేరు పరసర ప్రాంతాల్లో ఒకే రోజు మూడు విభిన్న వాతావరణాన్ని స్థానికులు ఆస్వాదిస్తున్నారు. సీలేరులో ఉరుములు, మెరుపులతో.. సీలేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఒడిశా, పోలవరం సరిహద్దుల్లో వాతావరణం ప్రతిరోజూ విభిన్నంగా మారుతోంది. గత వారం రోజులుగా ఏదో ఒక సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు గంటపాటు కురవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
పారదర్శకంగా జనగణన
డాబాగార్డెన్స్(విశాఖ): జనగణన (2027) ప్రక్రియను ఫీల్డ్ ట్రైనర్లు బాధ్యతాయుతంగా నిర్వహించాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి ఆదేశించారు. మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ కళాశాలలో మంగళవారం సెన్సస్–2027 ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. దేశంలో తొలిసారిగా జనగణనను డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నందున, డేటా నమోదులో ఎటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. తొలి దశలో 2026 మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల జాబితా, గృహ గణన ప్రక్రియ జరుగుతుందన్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జనాభా లెక్కల సేకరణ కొనసాగుతుందని వివరించారు. సుమారు 16 ఏళ్ల విరామం తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఆర్వో శేష శైలజ మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాదని, ఇది ఒక చట్టబద్ధమైన విధి అని గుర్తుచేశారు. దేశాభివృద్ధికి, భవిష్యత్తు ప్రణాళికల రచనకు ఈ గణాంకాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నందున, అన్ని వివరాలను పారదర్శకంగా, కచ్చితత్వంతో సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సెన్సస్ జాయింట్ డైరెక్టర్ దయాసాగర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, మాస్టర్ ట్రైనర్ జి.నాగార్జునరావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వోద్యోగులను మోసం చేయడం అన్యాయం
అనకాపల్లి: సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీ అమలు చేయకపోవడం అన్యాయమని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ విమర్శించారు. మంగళవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద యూటీఎఫ్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ పీఆర్సీ అమలు, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దు వంటి వాటిపై ప్రభుత్వం నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల అండదండలతో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్ డాక్టర్.మన్మోహన్ సింగ్ తన బాధ్యతలకు రాజీనామా చేసి ఏడాదిన్నర కావస్తున్నా నూతన చైర్మన్ను నియమించకుండా తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడంలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలను ఆరు నెలల్లోగా చెల్లిస్తామని చెప్పి రూ. 9 వేల కోట్లను మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుందన్నారు. ఇంకా రూ.30 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదన్నారు. వీటిని ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఏలు సకాలంలో చెల్లించకపోతే ఉద్యోగులు ఎలా జీవిస్తారని ప్రతిపక్ష హోదాలో గగ్గోలు పెట్టిన కూటమి పెద్దలు ఇప్పుడు నాలుగు డీఏలను చెల్లించకుండా కాలయాపన చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ విధానంలో మార్పు రాకపోతే ఇక పోరాటం తప్పదన్నారు. కొత్త పీఆర్సీ అమలయ్యే వరకు 29 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లోనూ అదే నెల 15 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర రాజధానిలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 28వ తేదీ ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునిచ్చి ముట్టడిస్తామన్నారు. అంతకుముందు ఏపీ ఎన్జీవోఎస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీలా రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి. శేషుకుమార్, ఖజానా శాఖ సంఘ నాయకులు డి. ఆనంద్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుత్తుల సూర్యప్రకాష్, వైరాల రమేష్ రావు, ఆడిట్ కమిటీ కన్వీనర్ బైలపూడి దేముడునాయుడు, రాష్ట్ర కౌన్సిలర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
లివిటిపుట్టులో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ లివిటిపుట్టు గ్రామంలో మంగళవారం స్థానిక పోలీసులు డ్రోన్ కెమెరాతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాల మేరకు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి గృహాన్ని తనిఖీ చేసి, స్థానిక కుటుంబాలతో మాట్లాడారు. గతంలో గంజాయి కేసుల్లో ఉన్న నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు.గంజాయి వంటి మత్తు పదార్థాల సాగు, రవాణా వంటి నేరాలకు ఎవరూ పాల్పడకూడదని, అటువంటి వారికి సహకరించవద్దని పోలీసులు హెచ్చరించారు. పాత నేరస్తులు మళ్లీ పట్టుబడితే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.2018లో లివిటిపుట్టు సమీపంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో, ఆ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.లివిటిపుట్టులో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేస్తున్న పోలీసులు డ్రోన్ నిఘాలో లివిటిపుట్టు గ్రామం గ్రామాన్ని చుట్టముట్టిన పోలీసులు -
సామాన్య భక్తులకే పెద్దపీట
మహారాణిపేట: సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ సింహాచలం చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని, ఆ దిశగా అధికార యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టికెట్ల జారీ ప్రక్రియలోనూ, ఇతర ఏర్పాట్లలోనూ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏప్రిల్ 17వ తేదీ నాటికి అన్ని పనులను పూర్తి చేయాలని, ఈ లోగా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ వివరించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000, రూ.1,500 టికెట్ల వారికి విడివిడిగా క్యూలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని, 3 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. భక్తుల రవాణా కోసం 50 ఆర్టీసీ బస్సులతో పాటు, ప్రత్యేక టికెట్లు కొన్న వారి కోసం మరో 30 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గందరగోళం లేకుండా టికెట్ల జారీ ఉండాలి దర్శన టికెట్ల జారీలో గందరగోళం లేకుండా చూడాలని పలువురు ఎమ్మెల్యేలు సూచించారు. టికెట్ల అమ్మకం సమయం, ఆన్లైన్ లభ్యత, విక్రయ కేంద్రాల వివరాలను ముందుగానే భక్తులకు తెలియజేయాలన్నారు. నకిలీ టికెట్లు రాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే యంత్రాలను సిద్ధం చేసుకోవాలని, ఎండ లేదా వాన కురిసినా భక్తులకు ఇబ్బంది కలగకుండా షెడ్లు నిర్మించాలని కోరారు. భద్రతపై ప్రత్యేక నిఘా భద్రతా పరంగా విరివిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. జేబు దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని, క్రేన్లు, పొక్లెయిన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్ రాజు, గంటా శ్రీనివాసరావు(వర్చువల్ విధానంలో), జేసీ విద్యాధరి, ఈవో జె.వెంకటరావు, డీసీపీలు మేరీ ప్రశాంతి, మణికంఠ చందోలు, విశాఖ ఆర్డీవో సుధాసాగర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ను తొలగించడంతో ధర్నా
డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ)లో చిన్నపాటి రోడ్డు ప్రమాదాలకు శాఖ డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ విధులు నుంచి తొలగించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ఎ.నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక డిపో గ్యారేజీ గేటు వద్ద మంగళవారం తెల్లవారుజామున డిపోలో డ్రైవర్ కె.శ్రీనుపై సస్పెన్షన్ వేటు వేయడంపై ఆగ్రహిస్తూ యూనియన్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ డ్రైవర్ శ్రీనును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 1/2019 సర్క్యులర్కు విరుద్ధంగా డిపో అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
● మరో ఇద్దరికి స్వల్ప గాయాలు ● కేజీహెచ్కు తరలింపు కొయ్యూరు: మండలంలోని రామరాజుపాలెం వంతెన సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..శరభన్నపాలెంకు చెందిన ఉల్లి హరికృష్ణ, రవితేజతో కలిసి కృష్ణదేవిపేట నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. రామరాజుపాలెం వంతెన వద్దకు వచ్చేసరికి, నడింపాలెంకు చెందిన పాంగి బెన్నస్వామి నడుచుకుంటూ వెళ్తుండగా హరికృష్ణ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బెన్నస్వామి కాలు విరిగింది. నియంత్రణ కోల్పోయి బైక్ పైనుంచి కింద పడటంతో హరికృష్ణకు తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. బైక్ వెనుక కూర్చున్న రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి.క్షతగాత్రులను తొలుత నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యా సామగ్రి పంపిణీ
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలోని పరమసింగవరం గ్రామ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయుడు పవన్ అండగా నిలుస్తున్నారు. మంగళవారం నర్సీపట్నం శ్రీ గణేష్ అకాడమి ఆర్థిక సహకారంతో పాఠశాలలోని 70 మంది గిరిజన విద్యార్థులకు పలకలు, పెన్సిల్ బాక్సులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.పరమసింగవరం పాఠశాలకు ఉపాధ్యాయుడిగా వచ్చిన పవన్, ఇక్కడి గిరిజన పిల్లల దీన స్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్పందించి యలమంచిలిలోని ఒక వస్త్ర దుకాణ యాజమాన్యంతో మాట్లాడి, సుమారు 100 మంది విద్యార్థులకు రెండేసి జతల దుస్తులను అందజేశారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా, గ్రామానికి అవసరమైన రహదారి సౌకర్యం, పాఠశాల భవన నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి సమస్యల పరిష్కారానికి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
కొబ్బరి చెట్టుపై నుంచి జారిపడి యువకుడి మృతి
రోలుగుంట : కొబ్బరిచెట్టు పై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కొమరవోలు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నక్కా శ్యామ్(20) అనే వ్యక్తి మూడు రోజుల క్రితం కొబ్బరికాయలు తీసేందుకు చెట్టెక్కి ప్రమాదవశాత్తూ కిందపడి గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు విశాఖ కేజీహెచ్కు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందాడు. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎస్ఐ రామకృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి తండ్రి దేముడు, తల్లి రాజేశ్వరి, చెల్లి కుమారి ఉన్నారు. -
విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బందితో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి సంసిద్ధంగా ఉండాలని విశాఖ పోర్టు డిప్యూటీ చైర్పర్సన్ కె.రోష్ని అపరంజి సూచించారు. 55వ జాతీయ భద్రతా దినోత్సవం–డాక్ సేఫ్టీ వారోత్సవాల ముగింపు వేడుకలు పోర్టు అథారిటీ పరిపాలన భవనంలోని శ్రీ సాంబమూర్తి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు. ఈనెల 4 నుంచి 10 వరకు నిర్వహించిన ఈ వారోత్సవాల్లో భాగంగా భద్రతపై అవగాహన, అత్యవసర పరిస్థితుల ఎదుర్కొనే సంసిద్ధతపై పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పోర్టు చైర్మన్ డా. అంగముత్తు హాజరుకాగా.. సేఫ్టీ కమిటీ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ డాక్ సేఫ్టీ ట్రైనింగ్ పోస్టర్ని ఆవిష్కరించారు. చీఫ్ విజిలెన్స్ అధికారి టి.అరుణ్ ప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీరామచంద్రమూర్తి, సెక్రటరీ ఎం.శంకర్బాబు, సీఎంఈ రామ్ప్రసాద్తో పాటు వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, టెర్మినల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్యకలాపాల్లో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు అందరూ తమ సంసిద్ధతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు. -
మోదమ్మ ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
పాడేరు: మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది మే 10,11,12 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. ఉత్సవాల పోస్టర్లను సోమవారం ఉదయం అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, పట్టణ ప్రముఖులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ జాతర సందర్భంగా మూడు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అన్నసమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పాడేరు పట్టణమంతా భారీ విద్యుత్దీపాంలకరణ, భారీ సెట్టింగులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. అమ్మవారి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలు, భక్తులు, అధికారులు, అనాధికారులు, ప్రజాప్రతినిధులు విరివిగా విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
మండలి స్పీకర్ దృష్టికి కూటమి నేతల ఆగడాలు
చోడవరం : అధికార కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను శాసనమండలి స్పీకర్ మోషన్రాజుకి మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ చోడవరం సమన్వయకర్త అమర్నాథ్ వివరించారు. వైఎస్సార్సీపీ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఇటీవల నియమితులైన అమర్నాఽథ్ ఆ జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో శాసనమండలి స్పీకర్ మోషన్రాజును సోమవారం కలిశారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆగడాల గురించి స్పీకర్కు వివరించారు. శాసనమండలిలో ఈ విషయాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు అమర్నాఽథ్ తెలిపారు. ఆయనతోపాటు సోషల్మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పందిరి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పల్లా నర్సింగరావు, వైస్ ఎంపీపీ బైన ఈశ్వరరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు దొడ్డి వెంకట్రావు, ఓరుగంటి నెహ్రూ జిల్లా బీసీసెల్ ఉపాధ్యక్షుడు మొల్లి సోమునాయుడు, యూత్ జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, బీసీసెల్ ప్రతినిధి పల్లా మోహన్కృష్ణ, నియోజకవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, తదితరులున్నారు. మర్యాద పూర్వక కలయిక పాయకరావుపేట: శాసనమండలి సభాపతి కొయ్యే మోషేన్రాజును వైఎస్సార్సీపీ నేతలు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోషేన్రాజును ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, పెందుర్తి నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత పైల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నార్త్జోన్, సెంట్రల్జోన్ జట్ల విజయం
సౌత్,నార్త్ జోన్ల మధ్య మ్యాచ్ విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పవర్ఫుల్
సీలేరుసీలేరు విద్యుత్ కాంప్లెక్స్సీలేరు: రాష్ట్రంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్కు విశిష్టస్థానం ఉంది. ఏడాదిలో 365 రోజులూ నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ కాంప్లెక్స్ సొంతం.పుష్కలంగా నీటి నిల్వలు ఉండడంతో నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించింది. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ జల విద్యుత్ కేంద్రాలు గడిచిన 10 రోజులుగా నిరంతరాయంగా పనిచేస్తున్నాయి. లోడ్ డిస్పాచ్ అధికారులు ఇచ్చిన లక్ష్యాల మేరకు విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం జోరుగా ఉత్పత్తి జరుగుతోంది. సీలేరు కాంప్లెక్స్ పరిధిలో మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలున్నాయి. ఈ కాంప్లెక్స్లో 2025–26 సంవత్సరంలో 2,314 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం కాగా సోమవారం సాయంత్రానికి 2,320 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసి, లక్ష్యాన్ని అధిగమించింది. ఇండివిడ్యువల్ లక్ష్యాన్ని కూడా అధిగమించేందుకు పోటాపోటీగా పనిచేస్తున్నాయి. గోదావరి డెల్టాలో రబీ పంటలకు సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ నుంచి గడిచిన 10 రోజుల్లో రోజుకు 6,900 క్యూసెక్కుల నీరు నేరుగా వెళుతోంది. దీంతో మాచ్ఖండ్, సీలేరు, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. 2025–26 సంవత్సరంలో సీలేరు కాంప్లెక్స్ విద్యుత్ కేంద్రాలకు 2,314 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం నిర్ధేశించగా ఇప్పటికే 2,320 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సాధించినట్టు కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కె.వి. రాజారావు తెలిపారు. మాచ్ఖండ్లో అదనంగా .. ఆంధ్ర,ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రం ఇప్పటికే తన టార్గెట్ను పూర్తిచేసుకుని అదనంగా విద్యుత్ ఉత్పత్తిని చేసి, మిగతా జలవిద్యుత్ కేంద్రాలకు భిన్నంగా రికార్డు సృష్టించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారిగా నిర్మించిన ఈ విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది 657 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం ఇవ్వగా జనవరి 22 నాటికే పూర్తి చేసి మార్చి 15 నాటికి 802 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఇప్పటికి 145 మిలియన్ యూనిట్లు అధికంగా ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 477 మిలియన్ యూనిట్లు లక్ష్యం ఇవ్వగా సోమవారం సాయంత్రం నాటికి 429 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఈఈ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా ప్రస్తుతం జోరుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది ఇచ్చిన టార్గెట్ 1,084 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటికే 1,020 పూర్తయినట్లు అధికారులు తెలిపారు. సీలేరు కాంప్లెక్స్లో లక్ష్యాన్ని మించి విద్యుత్ ఉత్పత్తి వేసవిలో విద్యుత్తి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చర్యలు వేసవిలో విద్యుత్కి అంతరాయం లేకుండా.. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటికే లక్ష్యాన్ని పూర్తి చేశాం. వేసవిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాం. మరోపక్క గోదావరి డెల్టాలో పంట భూములకు గడిచిన పది రోజులుగా డొంక రాయి మెయిన్ డ్యామ్ ద్వారా నీటిని విడుదల చేస్తూ ఇంజనీర్లు కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. –కె.వి రాజారావు, చీఫ్ ఇంజనీర్ పుష్కలంగా నీటి నిల్వలు ఏపీ జెన్ కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో పలు రిజర్వాయర్లలో ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తికి సరిపడా నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆంధ్ర,ఒడిశా సరిహద్దు బలిమెల జలాశయంలో ప్రస్తుతం 71.1740 టీఎంసీల నీరు ఉంది. దీంతో పాటు అదనంగా గుంటవాడ, సీలేరు రిజర్వాయర్లలో మరో 12 టీఎంసీలు ఉంది. ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. మరోపక్క గోదావరి డెల్టా పంట భూములకు నీరుఅందిస్తూ.. ఈ వేసవిలో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రానికి నిరంతరం వెలుగులు అందించడంలో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ కీలక పాత్ర పోషిస్తోందని జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ సిక్స్ పేరుతో దగా
అరకులోయటౌన్: సూపర్సిక్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ముఖ్యంగా నిరుద్యోగులు, మహిళలను బురిడీకొట్టించిందని వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అధ్యక్షతన స్థానిక క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కూటమి నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి లోకే ష్లు చేసిన వాఖ్యలను కూటమి పార్టీల్లో ఉన్న బీజేపీ నాయకుడు సుజనా చౌదరి ఖండించారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల కింద రూ. 2లక్షల 80వేల కోట్లను నేరుగా లబ్ధిదారులకు అందించిన ఏకై క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్త విధిగా పార్టీ సభ్యత్వం తీసుకోవాలని, సభ్యత్వం తీసుకున్నవారికి భవిష్యత్తులో వారికి పార్టీ గుర్తింపు కార్డుతోపాటు ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు పొందే అవకాశం ఉందన్నారు. వైఎస్సార్సీపీ అరకులోయ అసెంబ్లీ పరిశీలకుడు బోనాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలను నియమిస్తున్నారని, అరకులోయ అసెంబ్లీనియోజకవర్గ పరిధిలో శతశాతం కమిటీల నియామకం వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నను సీఎం చేస్తేనే మనందరికీ భవిష్యత్ ఉంటుందన్నారు. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండా బిల్లులు మార్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తే తాము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా దానిని ఉపసంహరించుకున్నారన్నారు. అంతకు ముందు గౌరవ అతిథులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు అసెంబ్లీ పరిశీలకుడు సత్యారావు,వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి తడబారికి సురేష్ కుమార్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీలు చటారి జానకమ్మ, ఎంపీపీలు బాక ఈశ్వరి, తడబారికి మిధుల, ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, పార్టీ మండల అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, అనిల్, కొర్రా సూర్యనారాయణ, చంద్రుబాబు, ఉపాధ్యక్షులు పల్టాసింగి విజయ్కుమార్, గుడి వాడ ప్రకాష్, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, సర్పంచ్ రాధిక, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ పరిశీలకుడు సీహెచ్. వెంకటరామయ్య -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యం
పాడేరు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా పనిచేయాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల నియమించిన గ్రామ కమిటీలు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి, డిజిటలైజేషన్ ప్రక్రియ ద్వారా కార్యకర్తకు భద్రత కల్పించే విధంగా పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు. వచ్చే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు మేలు జరుగుతుందని చెప్పారు. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీ ఏడువాక సత్యారావులు మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న మోసాలు, అన్యాయాలను కార్యకర్తలు ప్రజల్లో తీసుకువెళ్లాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్య దర్శి సీదరి మంగ్లన్నదొర, జిల్లా మహిళ విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, ఎంపీపీలు కోరాబు అనూషాదేవి, బోయిన కుమారి, బడుగు రమేష్, పార్టీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండం నాయు డు, కంకిపాటి గిరిప్రసాద్, బిడిజన అప్పారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమో తి, పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బూసరి కృష్ణారావు, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, మహిళ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయితి రాజులమ్మ, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్, నియోజకవర్గ ఎస్టీ విభాగం అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశీరాణి, ఎస్టీ సెల్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
సీఎం సభకు బస్సుల మళ్లింపు..
నర్సీపట్నం: ఆర్టీసీ ప్రయాణికులకు 2014 టీడీపీ పాలన నాటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. నక్కపల్లిలో సీఎం చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులను రద్దు చేసి, సభకు జనాలను తరించేందుకు మళ్లించారు. డిపోకు చెందిన వంద బస్సుల్లో సగానికి పైగా సీఎం సభకు మళ్లించడంతో ప్రయాణికులు గమ్యస్థానాలను చేరేందుకు నానా ఇక్కట్లకు గురయ్యారు. బస్సులు రావని ఆర్టీసీ సిబ్బంది మైక్లో చెప్పినప్పటికీ వస్తాయనే ఆశతో కాంప్లెక్స్లో ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షణ చేశారు. విజయవాడ, రాజమండ్రి కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు వరుసగా సెలవులు రావడంతో ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు నరకం చూశారు. తల్లిదండ్రులు ప్రైవేటు వాహనాలను పెట్టి కాలేజీలకు పంపించారు. ఇదే అదునుగా ప్రైవేటు వాహనదారులు రెట్టింపు చార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. కూలీ పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి ఇళ్లకు చేరుకునేందుకు కాంప్లెక్స్లో దిగారు. బస్సులు లేకపోవడంతో మూటలు మోసుకుని ఆటోల కోసం మెయిన్ రోడ్డుపైకి వచ్చి నిరీక్షణ చేశారు. స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు రావడంతో సామాన్య ప్రజలు బస్సులు కోసం పడరాని పాట్లు పడ్డారు. -
చందనోత్సవానికి పక్కాగా వైద్య ఏర్పాట్లు
మహారాణిపేట: వచ్చే నెల 20న జరగనున్న సింహాచలం చందనోత్సవానికి పటిష్టమైన వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. సోమవారం ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవం కోసం మూడు షిఫ్టుల్లో 304 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం 90 అంబులెన్సులు, కొండపై 6 పడకల తాత్కాలిక ఆసుపత్రులు, 24 గంటల కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంటాయన్నారు. అత్యవసర సేవల కోసం అపోలో, కేజీహెచ్, విక్టోరియా ఆస్పత్రులను రెఫరల్ ఆస్పత్రులుగా గుర్తించామన్నారు. ఈ ఏర్పాట్లకు ప్రైవేటు ఆస్పత్రులు సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో నోడల్ అధికారి డాక్టర్ ఉమావతి, ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం మోసం
జి.మాడుగుల: జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్ ఆరోపించారు. స్థానిక విలేకర్లతో సోమవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1.72లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 10,060పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదుల చేసిందన్నారు. తక్కువ ఉద్యోగావకాశాలు కల్పించి, ప్రచారం మాత్రం ఊదరగొడుతున్నారని విమర్శించారు. ఈ పోస్టులు కూడా నాలుగు విడతల్లో వచ్చే అక్టోబర్లోగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాల చొప్పున ఐదేళ్ల కాలంలో 20లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగం ఇచ్చేంతవరకు నిరుద్యోగికి నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, 22నెలలు కాలంలో నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆయన విమర్శంచారు.ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, అత్యధిక ఉద్యోగాల కల్పనకు ఎంఎస్ఎంఈ సెక్టార్కు ప్రోత్సాహమందిస్తామంటూ ప్రకటించి ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరుద్యోగ యువతను కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని రానున్న కాలంలో ప్రజలు, యువత చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లు, జన సముదాయాలు ఉన్న చోట్ల ప్రత్యేక చలివేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో సమీక్షించారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఎటువంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని, పశువులు, మేకలు, మూగ జీవాల కోసం గ్రామాల్లో నీటి కుండీలను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయానికి సాగుకు నీటి కొరత లేకుండా చెక్ డ్యామ్ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలన్నారు. వడదెబ్బ నివారణ కోసం వైద్యారోగ్య కేంద్రాల్లో అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు రావాలని, మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్పా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెండు జిల్లాల పోలీసు, ఐటీడీఏ, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఇరిగేషన్, డ్వామా, అగ్రికల్చర్, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మరణంలోనూ నలుగురికి పునర్జన్మ
బీచ్రోడ్డు : పెను విషాదంలోనూ ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం నలుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి ధర్మాల మాధవరావు (57) అవయవాలను దానం చేసి, ఆయన కుటుంబ సభ్యులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. ఈనెల 20న గాజువాక వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవరావు తలకు తీవ్ర గాయమైంది. నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జీవన్ దాన్ ప్రతినిధుల అవగాహనతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో ఆయన శరీరం నుంచి లివర్, కిడ్నీ, రెండు కళ్లను సేకరించి, ప్రోటోకాల్ ప్రకారం సీనియారిటీ లిస్టులో ఉన్న బాధితులకు కేటాయించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అవయవ దాతలకు గౌరవప్రదంగా వీడ్కోలు పలకాలన్న ప్రభుత్వ జీవో (నం. 95) ప్రకారం.. మాధవరావు పార్థివ దేహానికి పోలీస్ బ్యాండ్తో ఘనంగా నివాళులర్పించారు. సీపీ శంఖబ్రత బాగ్చి, జీవన్ దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కె. రాంబాబు స్వయంగా విచ్చేసి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చిన మాధవరావు కుటుంబాన్ని అభినందించారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని, దాతలకు ప్రభుత్వ గౌరవం దక్కడం శుభపరిణామమని పేర్కొన్నారు. -
ఘాట్ రోడ్డులో అంబులెన్స్ బోల్తా
చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం జెర్రెల ఘాట్రోడ్డులో సోమవారం రాత్రి అంబులెన్స్ బోల్తా పడి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జెర్రెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి మణిదీప్ అందించిన వివరాలిలా ఉన్నాయి.జెర్రల పీహెచ్సీ నుంచి లక్ష్మి అనే రోగిని చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తీసుకువస్తుండగా జెర్రల ఘాట్రోడ్డులో అంబులెన్స్ అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న లక్ష్మి, చిన్నారావు, సీతమ్మ, రూప తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరూ జెర్రల ప్రాంతంలో గల పలుగ్రామాలకు చెందిన వారని, వీరందరినీ చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు. -
టమాటా రైతు కన్నీరు
గొలుగొండ: మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా టమాటా రైతుల పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టమాటా ధర పతనం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్న తరుణంలో అకాల వర్షాలు ఉన్న పంటను దెబ్బతీశాయి. దాంతో రైతు వద్ద కిలో రెండు రూపాయల ధర లేకపోవడంతో వీటిని సేకరించకుండా పొలంలోనే వదిలేస్తున్నారు. 300 ఎకరాల్లో సాగు గొలుగొండ మండలంలో లింగంపేట, జోగుంపేట, గొలుగొండ, సాలికమల్లవరం, ఏఎల్పురం ప్రాంతాల్లో 300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఈ నెలలోనూ ధరలు పతనం కావడం ఇదే తొలిసారిగా రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.40 నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడలు పెడితే కనీసం ఇప్పుడున్న ధరలు ప్రకారం రూ.5 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలంలో కాయలు మార్కెట్లో 30 కేజీల టమాటా రూ.60కు ధర రావడంతో కనీసం టమాటా ఏరే కూలీల ఖర్చు రావడం లేదని వాపోతున్నారు. దీంతో కష్టపడి సేకరించి మార్కెట్కు తరలించే ప్రయత్నంలో రైతులు విసిగివేసారి కాయలు ఏరకుండానే పొలంలో వదిలేస్తున్నారు. కనీసం వీటి ధరలు పెరుగుతాయని ఆశ కూడా లేదని చెబుతున్నారు. కోసిన కాయలకు ధరలు లేకపోవడంతో కొన్ని చోట్ల పొలం వద్దే పారేస్తున్నారు. మూడు రోజుల నుంచి అకాల వర్షాలు ధరలు లేవని ఆందోళన చెందుతున్న రైతులు అకాల వర్షాలు మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మూడు రోజులుగా వర్షాలు కురవడంతో కాయలకు మచ్చలు రావడంతోపాటు టమాటా పంట కుళ్లిపోయి చనిపోతోందని వాపోతున్నారు. ఒక వైపు ధరలు లేకపోగా, మరోవైపు వర్షాలు పంట నష్టం వాటిల్లిందని తీవ్ర ఆవేదన చెందున్నారు. ఇంత కష్టంలో కనీసం ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తే ఎంతో కొంతమేలు జరిగేదని చెబుతున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టమాటా గిట్టుబాటు లేక... మాడుగుల : టమాటా పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం మాడుగుల వారపు సంతకు శంకరం, తాటిపర్తి తదితర గ్రామాలు నుంచి రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకు వచ్చారు. కనీసం కిలో రూ.4 కూడా ధర రాలేదు. దీంతో కొంత మంది రైతులు సంతలో టమాటాలు వదిలి వెళ్లిపోయారు.మూడు నెలలు క్రితం కిలో రూ.50 నుంచి రూ.70 వరకు ధరలు పలికేవి. ప్రస్తుతం ధరలు కుదేలు అవడంతో టమాటా రైతులు కనీసం కూలి అయినా గిట్టుబాటు లేదని ఆవేదన చెందుతున్నారు.


