Aman Tandel
-
ముంబై నుంచి వెళ్లి సిరియాలో..
ముంబై: ముంబై లోని కళ్యాణి ప్రాంతం నుంచి సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన అమన్ టాండెల్ మృతి చెందినట్లు ఐఎస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఇస్లామిక్ స్టేట్ అఫిషియల్ మీడియా చానల్ ఖిలాఫా న్యూస్లో.. అమన్ అమరుడయ్యాడంటూ ఓ కథనాన్ని ఫోటోతో సహా ప్రచురించింది. అమన్తో పాటు విదేశాల నుంచి వచ్చి తమ తరఫున పోరాడుతూ మృతి చెందిన మరికొంత మంది వివరాలను సైతం ఐఎస్ ప్రకటించింది. అమన్ రక్కా ప్రాంతంలో మృతి చెందినట్లు ఖిలాఫా న్యూస్ తెలిపింది. అమన్ మృతి గురించి గత నెలలోనే అతడి కుటుంబసభ్యులు సమాచారం అందుకున్నప్పటికీ.. భారత భద్రతా సంస్థలు దీనిని ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ స్టేట్ ప్రకటనతో అమన్ మృతిపై క్లారిటీ వచ్చినట్లైంది. 2014 లో ఇరాక్లోని పవిత్ర ప్రాంతాలను సదర్శించేందుకని కళ్యాణి ప్రాంతం నుంచి అమన్తో పాటు మరో ముగ్గురు సిరియాకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపారు. ఈ ఏడాది మొదట్లో విడుదల చేసిన ఓ వీడియోలో అమన్తో పాటు అతడి మిత్రుడు.. ఇండియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుంటామని శపథం చేశారు. అమన్తో పాటు వెళ్లిన ముగ్గురిలో సహీమ్ టంకీ ఇంతకుముందే మృతి చెందగా.. అరీబ్ మజీద్ గత ఏడాది ఇండియాకు తిరిగివచ్చి విచారణనను ఎదుర్కొంటున్నాడు. మరో వ్యక్తి షేక్ ప్రస్తుతం సిరియాలో ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్నట్లు సమాచారం. -
‘వైమానిక దాడుల్లో మీ కొడుకు చనిపోయాడు’
ముంబై: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన మహారాష్ట్రలోని కల్యాణ్కు చెందిన యువకుడు అమన్ టాండెల్ మరణించినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వైమానిక దాడుల్లో అమన్ చనిపోయినట్టు ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా అమన్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పలేదు. 2014 మేలో అమన్తో పాటు కల్యాణ్కు చెందిన నలుగురు యువకులు ఐఎస్లో చేరడానికి ఇరాక్ వెళ్లారు. అప్పటి నుంచి ఐఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు భావిస్తున్నారు. గత శనివారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి అమన్ ఇంటికి ఫోన్ చేసి.. వైమానికి దాడుల్లో అతను చనిపోయినట్టు చెప్పాడు. ఫోన్లో మాట్లాడుతున్నది ఎవరని అమన్ తండ్రి ప్రశ్నించగా, గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కట్ చేశాడు. అమన్ బంధువు ఈ విషయాన్ని వెల్లడించాడు. అమన్తో పాటు ఐఎస్లో చేరిన షహీన్ టంకీ అనే యువకుడు కూడా మరణించినట్టు గత జనవరిలో అతని కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. కాగా టంకీ చనిపోయాడా లేదా అన్న విషయం ఇప్పటికీ నిర్ధారణ కాలేదు. అమన్ మరణవార్తపై మహారాష్ట్ర పోలీసులు మాట్లాడుతూ.. అతని కుటుంబ సభ్యులు ఈ విషయం తమకు చెప్పలేదని, అవసరమైతే విచారణ చేస్తామని చెప్పారు.