breaking news
Annamayya District News
-
చెట్లు నరికి అక్రమంగా తరలింపు
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ దద్దాలవారిపల్లె గ్రామానికి సమీపంలోని శ్రీ రెడ్డెమ్మకొండ పరిసరాల్లో ఉన్న కొండలు, గుట్టలతో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున కలపచెట్లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్నుపడింది. కన్నుపడిందే తడవుగా చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలించుకుపోతున్నారు. గత పదిహేను రోజులు ఈ తంతు సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బయట మండలాలకు చెందిన వ్యాపారులు ఇక్కడే మకాం వేసి ఇష్టానుసారం కలపచెట్లను నరికి అక్కడే కుప్పలుగా వేస్తున్నారు. కట్టెలు ఎక్కువగా సేకరించి ట్రాక్టర్ల ద్వారా బయట మండలాలకు తరలిస్తున్నారు. ఎంతో విలువైన వృక్షసంపదను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఉన్నాతాఽధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
న్యాయవాదుల విధుల బహిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : వివిధ కారణాలతో చనిపోతున్న న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజు ఉదయం కోర్టు పనిగంటల్లో సంతాపాన్ని తెలిపే సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేయడాన్ని న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులుఐదవ అదనపు జిల్లా జడ్జి కృష్ణన్కుట్టి, సీనియర్ సివిల్ జడ్జి ప్రసూన, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుయోధనతో కలిసి విధులు బహిష్కరించడానికి గల కారణాలను తెలియజేసిన అనంతరం కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పి.రెడ్డిబాషా మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ కారణాలతో చనిపోయిన న్యాయవాదులకు సంవత్సరంలో ఏదో ఒక రోజున ఉదయం. 10.30 గంటలకు సంతాపాన్ని తెలియజేసే సంస్కృతి ఎప్పటి నుంచో ఉందని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిందని అన్నారు. దీనిని తక్షణం వెనక్కి తీసుకోవాలని భారత న్యాయవాదుల సంఘం అన్నమయ్య, కడప జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, సహాయ కార్యదర్శి ఖాదర్బాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి : అర్జీదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీసు యంత్రాంగం సత్వర చర్యలు చేపట్టాలని, వారికి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదు నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళల సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. నడవలేని స్థితిలో ఉన్న బాధితుల వద్దకు ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు ఎలాంటి సమస్య అయినా భయపడకుండా పోలీసు వద్దకు రావాలని ఎస్పీ సూచించారు. పొలం యజమానిపై హత్యాయత్నంమైదుకూరు : గొర్రెలు మేపుకునే విషయంలో తగాదా ఏర్పడి మండలంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్య పై అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ హత్యాయత్నం చేసినట్టు అర్బన్ సీఐ కె. రమణారెడ్డి తెలిపారు. జీవి సత్రంలోని శ్రీరామ్ నగర్ కు చెందిన ఆవుల గురవయ్యకు చెందిన బెండ తోటలో శనివారం ఆదినారాయణకు చెందిన గొర్రెలు మేస్తుండగా అడ్డుకోవడంతో వారి మధ్య గొడవ ఏర్పడినట్లు సిఐ పేర్కొన్నారు. ఆ మేరకు ఆదినారాయణ మచ్చు కత్తితో గురవయ్య పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఆదినారాయణపై సోమవారం హత్యాయ త్నం కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రాజంపేట మండలం ఊటుకూరు ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోడూరు మండలం బొజ్జవారిపల్లి గ్రామానికి చెందిన లకిడి రామకృష్ణ (50) మృతి చెందాడు. బద్వేలులో ఉన్న బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంలో రామకృష్ణ బయలుదేరాడు. ఊటూరువద్ద పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మతిస్దిమితంలేని వ్యక్తి వీరంగం రాజంపేట : రాజంపేట స్టేట్బ్యాంక్ సమీపంలో మతిస్థిమితం లేని సుధాకర్ అనే వ్యక్తి సోమవారం వీరంగం సృష్టించాడు. పలువురిపై దాడి చేసిన క్రమంలో స్థానికులు పట్టుకొని కాళ్లు చేతులు కట్టేశారు. భార్యపై అనుమానంతో తన కొడుకు మతిభ్రమించిందని సుధాకర్ తల్లి ఆవేదన చెందారు. పోలీసులు రంగం ప్రవేశం చేశారు. మతిస్థిమితంలేని వ్యక్తి ఆసుపత్రిలో చేర్చిన క్రమంలో విచారణ చేశారు. పనిచేస్తుండగా విద్యుత్ సరఫరా: ఒకరికి గాయాలు బి.కొత్తకోట : విద్యుత్ పనులు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం మండలంలోని తుమ్మనంగుట్టకు గౌస్పీర్ (19) కోటావూరు వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సంబంధించి విద్యుత్ స్తంభంపై జంపర్ల పనులు చేస్తున్నాడు. అంతకుముందు వరకు విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా ఒక్కసారిగా సరఫరా పునరుద్ధరణ అయ్యింది. దీంతో గౌస్పీర్ షాక్కు గురయ్యాడు. బాధితున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై డిస్కం ఏడీ గోవిందరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్ తన సిబ్బందితో పనులు చేయిస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిపి ఉండగా మళ్లీ ఎలా సరఫరా వచ్చింది, ప్రమాద ఘటనపై ఏఈ విచారించి నివేదిక ఇస్తారని చెప్పారు. ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరికి.. మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. చింతపర్తికి చెందిన సత్యనారాయణ, మరో బాలిక పల్లవి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో వ్యక్తిగత పనులపై వెళుతుండగా, బైపాస్రోడ్డులోని అరేబియన్ హోటల్ సమీపంలో మరో బైక్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలిక తీవ్రంగా గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
రెండు నిమిషాల్లోనే చంపేశారు
● హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల చేతిలో హతమైన ఫైనాన్షియర్ ● బాకీ దారుల ఆస్తుల అటాచ్ కోసం కోర్టులో కేసు వేసిన వేణుగోపాల్రెడ్డి ● ఆ కోపంతోనే హత్య చేయించిన బాకీ దారులుప్రొద్దుటూరు క్రైం : వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిరాయి హంతకుల చేతిలో హతమయ్యాడు. వేణుగోపాల్రెడ్డి వద్ద బాకీ తీసుకున్న ఇరువురు వ్యక్తులు హైదరాబాద్కు చెందిన కిరాయి హంతకుల ద్వారా అతన్ని చంపించినట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరులోని బొల్లవరం ప్లాట్లలో నివాసం ఉంటున్న వడ్డీ వ్యాపారి కొండా వేణుగోపాల్రెడ్డి శుక్రవారం రాత్రి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం రూరల్ పోలీసులు ఆదివారం సాయంత్రం అతని మృతదేహాన్ని చాపాడు వద్దనున్న కుందు వంతెన వద్ద గుర్తించారు. అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీంతో కలిసి రూరల్ పోలీసులు అతికష్టం మీద వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని నదిలో నుంచి వెలికి తీశారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ప్రొద్దుటూరుకు చెందిన వేణుగోపాల్రెడ్డి బంధువు, మరో వ్యక్తి కలసి వేణుగోపాల్రెడ్డిని హతమార్చేందుకు కొన్ని రోజుల ముందే వ్యూహ రచన చేశారు. ఈ క్రమంలోనే హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులను శుక్రవారం ప్రొద్దుటూరుకు పిలిపించారు. వారు తమ కారును వేణుగోపాల్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ఆర్చి వద్ద ఆపుకున్నారు. అక్కడ వారు ఉన్న సమయంలోనే సాయంత్రం వేణుగోపాల్రెడ్డి ఇంటి నుంచి స్కూటీలో పట్టణంలోకి వెళ్లాడు. అదే రోజు రాత్రి సుమారు 8.30 గంటల తర్వాత ఇంటికి బయలుదేరాడు. ఇంటి సమీపంలో ఉన్న ఆర్చీ దాటగానే కారులో ఉన్న కిరాయి హంతకులు అతన్ని ఆపినట్లు తెలిసింది. ఎవరు మీరు అని అడిగే లోపే వారు వేణుగోపాల్రెడ్డిని కొట్టడంతో కింద పడిపోయాడని, ఈ క్రమంలోనే దుండగులు కాళ్లతో గొంతు నులిమి చంపేసినట్లు విశ్వసనీయ సమాచారం. ‘నన్ను చంపొద్దు.. మీకు ఏం కావాలో చెప్పండి ఇస్తాను’ అని బతిమాలుకున్నా దుండగులు కనికరించలేదని తెలిసింది. వేణుగోపాల్రెడ్డి స్కూటీలో అక్కడికి రావడం, వారు హత్య చేయడం ఇదంతా రెండు, మూడు నిమిషాల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఫైనాన్స్ వ్యాపారి చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న దుండగులు మృతదేహాన్ని అదే కారులో వేసుకొని దువ్వూరు దారిలోని కామనూరు బ్రిడ్జి వద్ద కుందు నదిలో పడేసి అదే రాత్రికి హైదరాబాద్కు వెళ్లిపోయినట్లు పోలీసు వర్గాల సమాచారం. తర్వాత నిందితులు హైదరాబాద్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిచ్చిన సమాచారంతోనే కుందు నదిలో ఉన్న వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించి వెలికి తీశారు. నిందితుల్లో వేణుగోపాల్రెడ్డి భార్య తరపు బంధువు కూడా.. వేణుగోపాల్రెడ్డిని హతమార్చిన వారిలో అతని భార్య సమీప బంధువు ఒకరు ఉన్నట్లు తెలిసింది. కాగా 2016లో నిందితుల్లోని ఒక వ్యక్తితో గొడవ జరిగింది. వేణుగోపాల్రెడ్డి డబ్బు అడగటానికి వెళ్లగా అతను దాడి చేశాడు. దీంతో వేణుగోపాల్రెడ్డికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో రెండేళ్ల క్రితం వీరి మధ్య రాజీ కుదిరింది. కాగా నిందితుల్లోని ఇద్దరు వ్యక్తులకు వేణుగోపాల్రెడ్డి రూ. లక్షల్లో బాకీ ఇచ్చాడు. ఈ డబ్బు గడువు ముగిసినా వారు ఇవ్వకపోవడంతో ఫైనాన్షియర్ కోర్టులో కేసు వేశాడు. అంతేగాక కొంత కాలం తర్వాత వారి ఆస్తులు అటాచ్ కోరుతూ ఫైనాన్షియర్ మరో మారు కోర్టును ఆశ్రయించాడు. ఇది ఇరువురు బాకీ దారులకు ఆగ్రహాన్ని కలిగించింది. ఈ విషయమై పలువురు వేణుగోపాల్రెడ్డికి నచ్చచెప్పినట్లు తెలిసింది. అయినా కూడా అతను ఆస్తుల అటాచ్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ కారణంతోనే ఇద్దరు కలిసి హైదరాబాద్కు చెందిన నలుగురు కిరాయి హంతకులతో వేణుగోపాల్రెడ్డిని హతమార్చినట్లు సమాచారం. కాగా కేసులోని ప్రధాన నిందితులు, కిరాయి హంతకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా అనే కోణంలో ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో జరిగే గ్యాస్ బిల్లుల స్కాంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఏ అధ్యక్షుడు కిరణ్కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్స్రాజేంద్రన్కు ఏఐఎస్ఏ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తున్న అవినీతి అధికారులను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. నీతి నిజాయితీగా విద్యార్థుల సంరక్షణకు పాటుపడే అధికారులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంమలో ఏఐఎస్ఏ నాయకులు షేక్ రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు. -
ఉచిత న్యాయ సేవలు పొందాలి
రాయచోటి : జైలులోని ఖైదీలు మంచి ఆరోగ్యంతోపాటు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత న్యాయ సలహాలను పొందాలని కడప జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా ఫకృద్దీన్ తెలిపారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు డాక్టర్ సి యామినీ ఆదేశాల మేరకు రాయచోటి సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లీనిక్ను సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జైలులో రిజిస్టర్లను పరిశీలించారు.. ఖైదీలకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలియజేశారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ను వివరించారు. ఖైదీలతో ఒక్కొక్కరిగా మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబరు 15100పై వారికి తెలియజేశారు. సమస్యలుంటే రాయచోటి మండల న్యాయ సేవా సమితి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. -
ఆర్టీపీపీలో ఉద్రిక్తత
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో సోమవారం ఏపీఎస్సీ జేఏసీ, టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్ల మధ్య తోపులాట జరిగింది. కొంచెం సేపు ఉద్రిక్త చోటు చేసుకుంది. పోలీస్, విజిలెన్స్, ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరువురు వర్గాల వారితో మాట్లాడి సర్దిచెప్పారు. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఏపీ జేఏసీ నిరసనలు, రిలే దీక్షలు చేసి సోమవారం ఫౌంటెయిన్ వద్ద నుంచి ర్యాలీ చేపట్టింది. అదే సమయంలో ప్రభుత్వంలో భాగమైన టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిరసనలు చేపట్టి సోమవారం రిలే దీక్షలు ప్రారంభించి గేటు బయట ఽఆందోళన చేసింది. జేఏసీ ర్యాలీ అనంతరం ఉద్యోగ, కార్మికులు విధులకు వెళ్తుండుగా, గేటు బయట టీఎన్వీకేఎస్, బీఎంఎస్ యూనియన్లు విధులకు పోకుండా అడ్డుకుంది. దీంతో ఒక్కసారిగా జేఏసీ, ఆ రెండు యూనియన్ల మధ్య తొపులాట జరిగింది. ఈ తోపులాటలో జేఏసీకి చెందిన ఓ ఉద్యోగి చొక్కా చినిగింది. అక్కడే ఉన్న పోలీసులు సర్దిచెప్పారు. అనంతరం జేఏసీ నాయకులు ఆర్టీపీపీ సీఈ ని కలిసి వినతి పత్రం అందించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలికడప కోటిరెడ్డి సర్కిల్ : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రైతులకు వ్యవసాయ పనిముట్లకు రుణాలను ఇస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాజంపేట రీజినల్ మేనేర్ సుశాంత్ కుమార్ స్వరూప్, కడప ఆర్ఎం శ్రీనివాస ప్రసాద్, ఎల్డీఎం జనార్ధనం తెలిపారు. సోమవారం కడపలోని జాన్డీర్లో నర్సిరెడ్డి, శివకుమార్లకు నూర్పిడి యంత్రాలను అందజేశారు. డీఆర్డీఏ డీపీఎం రఘునాథరెడ్డి, రాజంపేట ప్రాంతీయ కార్యాలయ సీపీసీ మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం
రాజంపేట/పెనగలూరు : సోమశిల జలాశయం బ్యాక్వాటర్ (వెనుక జలాల) ముంపు పరిహారం పరిహాసంలా మారింది. దశాబ్దాలుగా కొనసాగు తున్నా.. పూర్తి స్థాయిలో చెల్లించలేదు. దీంతో బాధి తులు గ్రామాలకు వదలలేక.. ఏటా ముంపునకు గురవుతున్నారు. ఇంకెన్నాళ్లు పడుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి వేదన అరణ్య రోదనగా మారింది. విధిలేని పరిస్థితుల్లో న్యాయస్థానంవైపు అడుగులు వేస్తున్నారు. పరిహారం విషయంలో అనేక విధాలుగా.. పలు మార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ కేసులు కొనసాగుతున్నాయి. కొందరికి కోర్టు అనుకూల తీర్పులు ఇచ్చింది. మరికొన్ని కేసులు పెండింగ్లో న్నాయి. ముంపు గ్రామాలు నెల్లూరు జిల్లాలోని పెన్నా నదిపై సోమశిల జలాశయం నిర్మాణం 1979 నుంచి ప్రారంభమైంది. 1981లో రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చింది. 1986కి పూర్తయింది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో నందలూరు, ఒంటిమిట్ట, పెనగలూరు, గోపవరం, ఒంటిమిట్ట మండలాల్లో సోమశిల ముంపు గ్రామాలు ఉన్నాయి. 1979 నుంచి జలాశయం వెనుకజలాలతో మునకకు గురయ్యే గ్రామాలను గుర్తించి దశలవారీగా పరిహారం చెల్లిస్తూ వచ్చారు. సోమశిల వెనుకజలాల కింద 130 గ్రామాలు మునకకు గురవుతున్నాయి. రాజంపేటలో సోమశిల స్పెషల్ డిప్యూటీ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని గ్రామాలకు పరిహారం పంపిణీ చేసి ఖాళీ చేయించారు. అయితే అనేక కారణాలతో పరిహారం పంపిణీ పెండింగ్లో ఉండిపోయింది. జలాశయంలో పూర్తి స్థాయిలో (77.988 టీఎంసీ)నీటి నిల్వ ఉంచలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుత నీటిమట్టం 99.857 మీటర్లలో ఉంది. ఇన్ఫ్లో 12649 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రహసనంలా.. ఉమ్మడి కడప జిల్లాలోని నందలూరు, ఒంటమిట్ట, గోపవరం, అట్లూరు, పెనగలూరు మండలాల్లోని ముంపు గ్రామాలకు సకాలంలో పరిహారం పంపిణీ చేయలేకపోయారు. ప్రస్తుతం జలాశయంలో 72.25 టీఎంసీలు ఉండగా.. ముంపుగ్రామాలకు నీరు చేరింది. నందలూరు మండలం పొత్తపి, నూకినేనిపల్లె, పెనగలూరు మండలం సిరవరం, ఎస్ఆర్పురం గ్రామాల పరిధిలో 296 ఎకరాల్లో సాగుచేసిన పంటలు నీట మునిగాయి. అధికారులు కూడా గుర్తించారు. భూసేకరణ చేయాలనే ప్రతిపాదన అటకెక్కించారు. సోమశిల అధికారులు కన్సల్టెంట్ అవార్డు చేసి, ఒకేసారి పరిహారం చెల్లింపులు జరిపి ఉంటే ఇప్పుడు పరిహారం పంపిణీ విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తేవి కాదని ముంపు బాధితులు చెబుతున్నారు. భూములకు పరిహారం.. గ్రామానికి ఏదీ? ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామానికి పరిహారం ఇవ్వలేదు. వారికి జీవనాధారమైన పంట పొలాల్లో వెనుకజలాలు తిష్ట వేసి ఉన్నాయి. పరిహారం ఇచ్చేస్తే ఖాళీ చేసి వెళ్లిపోతామని ముంపు బాధితులు కోరుతున్నప్పటికీ.. ప్రభుత్వం వారి మాట పెడచెవిన పెడుతోంది. ఇదే పరిస్థితి నందలూరు మండలంలోని పొత్తపి గ్రామంలో కూడా నెలకొని ఉంది. ఈ విధంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని ముంపు గ్రామాల్లో రైతులు తమ భూములకు పరిహారం రాక.. మరికొందరు గ్రామాలకు అందక ఇబ్బంది పడుతున్నారు. పూర్తి సామర్థ్యంలో నీళ్లు పెడితే.. సోమశిల జలాశయంలో 77.988 టీఎంసీల నీటి నిల్వ పెడితే ఉమ్మడి కడప జిల్లాలోని ముంపుగ్రామాలతోపాటు సమీప పొలాలు మునిగిపోతాయి. గతంలో అనేక మార్లు ఇలాంటి పరిస్ధితులు ఏర్పడ్డాయి. జలాశయం పూర్తిసామర్థ్యం వరకు రాకుండా, ముంపుగ్రామాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొని నీటి విడుదల విషయంలో అడుగులు వేస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా.. నాలుగున్నర దశాబ్దాలుగా ముంపుగ్రామాలకు పరిహారం పంపిణీ కొనసాగుతూనే ఉంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ముంపు బాధితులకు న్యాయంగా పరిహారం అందజేసేందుకు కడపలో లోక్ అదాలత్ ద్వారా ఒకేసారి సెటిల్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో రూ.330 కోట్లకు పైగా పరిహారాన్ని బాధితులకు అందజేసేందుకు చర్యలు తీసుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సోమశిల ముంపు బాధితులు గుర్తు చేసుకుంటున్నారు. సోమశిల బ్యాక్ వాటర్ గ్రామాలకు పూర్తి కాని పంపిణీ నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న వైనం ఏటా ముంపునకు గురవుతున్న పొలాలు అష్టకష్టాలు పడుతున్న బాధితులు -
యూరియా వాడకం తగ్గించాలి
చిన్నమండెం : రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి నానో ఎరువులు, జీవన ఎరువులు వాడాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచించారు. సోమవారం చిన్నమండెంలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో సహకార సంస్థ వారి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ సమావేశం, మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యూరియా వాడకం వల్ల పర్యావరణంపై కలిగే నష్టాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి గీత, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరు అర్బన్ : గుంజనేరు రక్షణ గోడ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి రక్షణ గోడ నిర్మాణ పనులను పరిశీలించి, గుత్తేదారుతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో వర్షాలు అధికంగా కురుస్తున్నాయన్నారు. గుంజనేరు నది పరీవాహక ప్రాంతాల్లో వర్షం కురిస్తే యేరు ఉధృతంగా ప్రవాహిస్తుందని, దీంతో కోడూరు పట్టణం, సరసరాం పేట తదితర ప్రాంత ప్రజలు ముంపునకు గురి కాకూడదు అనే దృష్టితో గత ప్రభుత్వంలో రక్షణగోడను మంజూరు చేయించామన్నారు. అలానే వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిపామన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయకుండా చిత్తశుద్ధితో వ్యవహరించి పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, శివయ్య, ఎంపీటీసీ మహేష్, దుర్గయ్య, వెంకటరెడ్డి, రమణ, రాజగోపాల్, కృష్ణారెడ్డి, వినోద్, రఘు, మణి తదితర నాయకులు పాల్గొన్నారు. పెనగలూరు : మండలంలోని ఎన్ఆర్ పురం పంచాయతీ పల్లంపాడు గ్రామానికి చెయ్యేరు నదిపై రోడ్డు వేస్తామని జెడ్పీటీసీ సుబ్బరాయుడు అన్నారు. సోమవారం జెడ్పీటీసీ సుబ్బరాయుడు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కేతా చక్రపాణిలు చెయ్యేరు నదిపై తెగిపోయిన రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ విజయరెడ్డిల ఆదేశాల మేరకు ఈ రోడ్డును పరిశీలించడం జరిగిందన్నారు. జెడ్పీ నిధులు ద్వారా ఈ రోడ్డును వేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. చెయ్యేరు నదిపై రోడ్డు వేసేటప్పుడు సిమెంటు బొంగులు ఏర్పాటు చేసి రోడ్డు వేస్తామని చెప్పారు. రోడ్డు నిర్మాణం విషయమై అజయ్రెడ్డి, విజయ్రెడ్డిలతో చర్చించినట్లు జెడ్పీటీసీ తెలియజేశారు. -
అధికారమే అండ.. కరుగుతున్న కొండ
అధికార పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కొండలను కరగదీస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు, ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ముగ్గురాయి ఖనిజం వంద మీటర్లలోపు భారీస్థాయిలో డ్రిల్లింగ్ నిర్వహించి స్థానిక టీడీపీ నాయకుడు అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నాడు. జాతీయ రహదారి పక్కనే భారీ పేలుళ్లకు అనుమతులు అధికారులు ఎలా ఇచ్చారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నిర్వహించిన బ్లాస్టింగ్తో పెద్ద శబ్దాలు రావడంతో అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దుమ్ము, దూళితో దట్టమైన పొగలు అల్లుకున్నట్లు ఉండటంతోపాటు రాళ్లు తమపైన పడతాయోమేనని భయాందోళన చెందుతున్నారు. ఈ పేలుళ్లధాటికి గతంలో కొండపై నుంచి బండరాయి జాతీయ రహదారిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది. ఏపీఎండీసీ అధికారులు బండరాయిని తొలగించారు. డేంజర్ జోన్లో ఎలా అనుమతిస్తారు? మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 500 మీటర్ల వరకు డేంజర్ జోన్గా ప్రకటించారు. అయితే వందమీటర్ల లోపు భారీ ఎత్తున డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ ఎలా అనుమతించారని, అక్రమంగా మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏ విధంగా చూస్తున్నారని సమీప గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులు ఐదువందల మీటర్ల డేంజర్ జోన్లో ఈ కంకర మైనింగ్కు ఏ విధంగా అధికారులు మినహాయింపు కల్పించారని ప్రశ్నిస్తున్నారు. గ్రామాల ప్రజలు ఆందోళన జాతీయ రహదారి పక్కనే మైనింగ్లో పెద్దఎత్తున కంప్రెసర్తో ప్రస్తుతం బ్లాస్టింగ్ కోసం పెద్దఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. బ్లాస్టింగ్ నిర్వహిస్తే ఏమి జరుగుతుందోనని సమీప గోవిందంపల్లి గ్రామ ప్రజలు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఏపీఎండీసీ నుంచి వచ్చే వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతుంటే.. కంకర క్వారీ కోసం అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉండటంతో కాలుష్యం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని గోవిందంపల్లి గ్రామ ప్రజలు గతేడాది నుంచి అధికారులకు మెరపెట్టుకుంటున్నారు. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ బ్లాస్టింగ్కు అనుమతి ఇవ్వలేదు. ఆయన బదిలీపై వెళ్లగానే స్థానిక టీడీపీ నాయకుడు మరలా పెద్దఎత్తున బ్లాస్టింగ్ నిర్వహించేందుకు పనులు చేస్తున్నాడు. అధికారులు చర్యలు తీసుకోవాలి ఇలాగే బ్లాస్టింగ్ కారణంగా బద్వేలు నియోజకవర్గం కలస్పాడులో అనేక మంది మృతి చెందారు. ఇటువంటి బ్లాస్టింగ్ల ద్వారా ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా అధికారులు ఏ విధంగా అనుమతులు ఇస్తున్నారని గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ప్రస్తుతం కంకర కోసం అక్రమంగా బ్లాస్టింగ్ చేసేందుకు నిర్వహిస్తున్న పనులను అడ్డుకోవాలని గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. మంగంపేట ఏపీఎండీసీ గనుల సమీపంలో అక్రమ మైనింగ్ జాతీయ రహదారి పక్కనే పెద్ద ఎత్తున లేచిన దుమ్ము దూళీ మంగంపేట గనుల సమీపంలో అక్రమ మైనింగ్ జాతీయ రహదారి పక్కనే పేలుళ్లు ఆందోళనలో ప్రయాణికులు, సమీప గ్రామస్తులు పట్టించుకోని అధికారులు -
● జగన్మాతా.. నమోస్తుతే !
‘అమ్మలగన్న అమ్మ.. ముగ్గురమ్మల మూలపుటమ్మ.. మాయమ్మ పెద్దమ్మ’.. అంటూ జగన్మాతకు ప్రణమిల్లారు. జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో ఆలయాలు శోభిల్లాయి. తొలి రోజు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. సిరులతల్లిని దర్శించుకున్న భక్తులు పరవశించి పోయారు. ‘చల్లగా చూడమ్మా’ అంటూ వేడుకున్నారు. – సాక్షి, నెట్వర్క్ రాయచోటి : వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి అమ్మవారు గుర్రంకొండ: బాలాత్రిపుర సుందరీదేవిగా రెడ్డెమ్మతల్లి రైల్వేకోడూరు : దీక్షాబంధన అలంకారంలో వాసవీకన్యకాపరమేశ్వరీదేవి తంబళ్లపల్లె : మల్లయ్యకొండపై ప్రత్యేక అలంకరణలో ఏనుగుమల్లమ్మ -
అర్జీదారుల వేదన తీరడం లేదు. ‘దరఖాస్తులు కొండంత.. పరిష్కారం గోరంత’ అనే చందంగా పరిస్థితి తయారైంది. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్ వరకూ వచ్చి వినతిపత్రం ఇచ్చినా మళ్లీ రావాల్సి వస్తోంది. వాస్తవానికి మండల, డివిజన్ స్థాయిలో కూడా అర్జీలు సమర్పించవచ్చు. కానీ, అష్
● సమస్యలతో సతమతమవుతున్న జనం ● పరిష్కారం కాక ఆందోళన ● కలెక్టరేట్కు పరుగులు ● కూటమిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత సాక్షి రాయచోటి : ప్రజలకు అనేక హామీలు ఇచ్చి పట్టించుకోకపోవడంతో అన్ని వర్గాలు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నాయి. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం’ అని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మమ అనిపిస్తుండడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. ఆక్రమణల పర్వంపై ప్రజలు, భూకబ్జాలపై బాధితులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు, సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు ఇలా అన్ని వర్గాలు రోడ్డెక్కుతున్నాయి. ప్రతి సోమవారం కూటమి సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు బాధితులు బారులు తీరుతున్నారు. ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోతుండటం... తీర్చే వారు కనిపించకపోవడంతో కలెక్టరేట్ వైపు కదులుతున్నారు. మరోపక్క ప్రభుత్వంపై పలు వర్గాలు ఆందోళనకు పిలుపునిస్తున్నాయి. వీఆర్ఏల డిమాండ్లు నెరవేర్చాలి అన్నమయ్య జిల్లాలోని వీఆర్ఏల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఏపీ వీఆర్ఏల సంఘం ఉపాధ్యక్షుడు రెడ్డెప్ప ఆధ్వర్యంలో సుమారు 30 మంది వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకై ఉద్యమించారు. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల రాష్ట్ర పిలుపు మేరకు ఇప్పటికే తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ కలెక్టరేట్ కార్యాలయాల వద్ద నిరసన తెలియజేశామని, ఇప్పుడు కలెక్టరేట్ వద్ద ఉద్యమించినట్లు వివరించారు. వీఆర్ఏలకు సంబంధించి వెంటనే పే స్కేలు అమలు చేయాలని, రాత్రిపూట నైట్ డ్యూటీలు తప్పించాలని నినందించారు. అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలని, వీఆర్ఏల సర్వీసులను పర్మినెంట్ చేయాలని, రికవరీ చేసిన డీఏలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు నినాదాలు చేశాక లోనికి వెళ్లి జిల్లా జాయింట్కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు వినతిపత్రాన్ని సమర్పించారు. మెడికల్ కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయండి : ఏఐటీయూసీ రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వైద్య విద్యను పీపీపీ పద్ధతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకుందని, ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విలువైన ప్రజాధనాన్ని ప్రైవేట్ వారికి అతి చౌకగా కట్టబెట్టే పీపీపీ విధానం వైద్యరంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించడంలో భాగమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలో ప్రారంభమైన కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దారుణమన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు జారీ చేసిన పీపీపీ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కబ్జాదారుల నుంచి చెరువును రక్షించాలిమదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె గ్రామంలోని ఓటుకుంట చెరువును అక్రమార్కులు కబ్జా చేశారని, వారి బారి నుంచి చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరారు. గత ప్రభుత్వంలో రీ సర్వే చేశారని, అయితే సర్పంచులు, వీఆర్ఓలు సక్రమంగా సర్వే చేయించకుండా రైతులకు 1బి అడంగల్ రాకుండా చేశారన్నా రు. డీకేటీ భూములకు ఇప్పటికీ కూడా 1బీ రావడం లేదన్నారు. 50 ఏళ్ల కిందట ఇచ్చిన భూములను ప్రభుత్వ భూమిగా మార్చారన్నారు. ఆయా భములకు 1బీ అడంగల్ వచ్చేలా చేయాలని కోరారు. కదం తొక్కిన కరెంటు ఉద్యోగులు -
ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
రాయచోటి టౌన్ : ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఎస్ఎల్ బకాయిలు వెంటనే చెల్లించాలని జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు దండు వెంకటేశ్వర్లురెడ్డి అన్నారు. రాయచోటి ఎన్జీవో హోంలో శనివారం జరిగిన నూతన కార్యవర్గ సమావేశంలో ఆయన ఉద్యోగుల హక్కుల రక్షణకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం నూతనంగా ఎంపికై న ఏపీ ఎన్జీవో ప్రధాన కార్యదర్శి డివి.రమణ, జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి నిత్యపూజయ్యలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు పల్లపుమహాదేవ, బడిశెట్టి దేవేంద్ర, బి.రవిశంకర్ పాల్గొన్నారు. -
రాజంపేటలో రూ.5కే టీ షర్ట్!
రాజంపేట : రాజంపేట పట్టణంలో రూ.5 లకే టీషర్ట్ ఇస్తామని ఆర్ఎస్ రోడ్డులోని ఓ రెడిమేడ్ షాపు నిర్వహకుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆదివారం ఉదయం పాత బస్టాండు నుంచి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న దుకాణానికి జనం తండోపతండాలుగా వచ్చారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకూ ఉంటుందని సోషల్మీడియా వేదికగా ప్రచారం సాగడంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా జనం తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. పోలీసుల అనుమతి కూడాలేకుండా బిజినెస్ పోస్టింగ్లు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడంపై పలువురు పెదవి విరిస్తున్నారు. ఆఫర్లతో ట్రాఫిక్కు అంతరాయం కలిగించేందుకు కారణమైన షాపు నిర్వహకుడిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దుకాణం ఎదుట జనం తొక్కిసలాట -
పూలతోట.. నష్టాలబాట
గుర్రంకొండ: పూలతోటలు సాగు చేసిన రైతులకు ప్రస్తుతం కష్టకాలం దాపురించింది. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆరుగాలం కష్టపడి చమటోడ్చి పండించిన పూలకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో పూల ధరలు రూ.10కి పడిపోయాయి. రానున్న దసరాపండుగ సమయంలోనైనా ధరలు పుంజుకొంటాయనే ఆశతో రైతులు ఉన్నారు. 1048 ఎకరాల్లో పూల సాగు... జిల్లాలో ప్రస్తుత సీజన్లో1048 ఎకరాల్లో బంతి పూలతోటల సాగు చేపట్టారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో తోటలు అదునుకొచ్చి దిగుబడి ప్రారంభమైంది. ఎకరం పూలతోట సాగు చేయాలంటే రూ.1.50లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఖర్చు వస్తుంది. పూలనారు కొనుగోలు నుంచి పొలం దుక్కులు, డ్రిప్ మెటీరియల్, మల్చింగ్ఖర్చు, కోతకొచ్చేవరకు రైతులకు ఈ పాటి ఖర్చు వస్తుంది. మార్కెట్లో కనీసం కిలో పూల ధర రూ.30 నుంచి 50లోపు ఉంటే రైతుకు పెట్టుబడి చేతికొస్తుంది. ● పది రోజులుగా మార్కెట్లో పూల ధరలు పతనమయ్యాయి. పదిహేను రోజుల కిందట మార్కెట్లో కిలో రూ. 70 నుంచి రూ.85వరకు ధరలు పలికాయి. తదనంతరం పరిణామాలతో బంతిపూల ధరలు మార్కెట్లో రోజురోజుకు తగ్గిపోయాయి. ప్రస్తుతం కిలో రూ.12 నుంచి రూ.10 వరకు ధరలు పలుకుతుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతంలోఇదే సీజన్లో కిలో రూ. 60 వరకు ధరలు పలికాయి. అదే ఆశతో రెండునెలలుగా పూలతోటల పెంపకం చేపట్టిన రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలకు దెబ్బతిన్నతోటలు: ప్రస్తుతం కురుస్తు న్న వర్షాలకు బంతిపూల తోటలు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు వాపోతున్నారు.35 కిలోల పూల బ స్తా బెంగళూరుకు తరలించాలంటే రూ. 250 వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.10 పలుకుతోంది. ఈలెక్కన ఒక బస్తాకు రూ.525 మా త్రమే ఒక్కోసారి గిట్టుబాటు లభిస్తోంది. అంత దూరం మార్కెట్కు తీసుకెళ్లినా బస్తాపైనా రూ.275 మాత్రమే రైతుకు గిట్టుబాటు అవుతోంది. దీంతో పూలను మార్కెట్లకు తరలించినా ప్రయోజనం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పూల సాగు, ధరల వివరాలు రానున్న దసరా పండుగ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకొన్నారు. ధరలు పతనమవడంతో వ్యాపారులు పూల కొనుగోలుపై పెద్ద ఆసక్తి చూపించడంలేదు.జిల్లాలో సాగు చేసేపూలను మదనపల్లె, కడప, తిరుపతి, బెంగళూరు, చైన్నె లాంటి పట్టణాలకు తరలిస్తుంటారు. ఇటీవల పూల బస్తాలతో బెంగళూరు మార్కెట్కు వెళ్లిన రైతులకు కనీసం వ్యాపారులు కొనుగోలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు దసరా పండుసీజన్లో గిట్టుబాటుధరలు లభిస్తాయనే ఆశతో ఉన్నారు. పూల ధరలు భారీగా పతనం ఆందోళనలో అన్నదాతలు జిల్లాలో 1048 ఎకరాల్లో పూలసాగు ధరలు పడిపోయాయి ప్రస్తుతం మార్కెట్లో పూలధరలు పడిపోయాయి. పదిహేనురోజుల కింద కిలో రూ.65 వరకు ఉండేది. ఇప్పుడు అష్టకష్టాలు పడి మార్కెట్కు పూలను తరలించినా అంతంత మాత్రంగానే ఆదాయం వస్తోంది. – నారాయణ, పూలరైతు,మొరంపల్లె పెట్టుబడి నష్టపోయాం రెండు ఎకరాల్లో పూలతోటలు సాగు చేశాను. వర్షాలతో తోటలు దెబ్బతిన్నాయి.ఇప్పటివరకు రూ.3 లక్షలు ఖర్చు వ చ్చింది. ప్రస్తుతం ధరలు పడిపోయాయి. దీంతో పెట్టుబడి నష్టపోయాం. – సావిత్రమ్మ, పూలరైతు, కొత్తపల్లె నియోజకవర్గం పూలసాగు 3 నెలలుగా ధరలు (ఎకరాల్లో) (కిలోల్లో) పీలేరు 325 జూన్ 15 రూ. 45 మదనపల్లె 245 జులై 01 రూ.40 తంబళ్లపల్లె 295 జులై 15 రూ. 57 రాయచోటి 55 ఆగస్టు 01 రూ.75 రైల్వేకోడూరు 63 ఆగస్టు 15 రూ.85 రాజంపేట 65 సెప్టెంబర్ 17 రూ.10 -
అక్రమ ప్రమోషన్లపై ప్రభుత్వానికి నివేదిక
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశ మదనపల్లె సర్కిల్–3 పరిధిలో జరిగిన అక్రమ పదోన్నతుల వ్యవహరం కొలిక్కి వచ్చింది. హంద్రీ–నీవాలో ‘అక్రమ ప్రమోషన్’ శీర్షికన అగస్టు 7న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై సమగ్ర వివరాలతో నివేదిక పంపాలని ఈఎన్సీ నుంచి మెమోలు జారీ అయ్యాయియి. ఈ విషయంలో ఎస్ఈ విఠల్ప్రసాద్ వివరాలతో నివేదికను పంపడం ఆలస్యంగా తెలిసింది. ఏపీఈఎస్ఎస్ నిబంధనల షెడ్యూల్ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, సూచనలను కచ్చితంగా పాటించాలి. అయితే హంద్రీ–నీవా ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగుల విషయంలో పాటించలేదని తేలింది. మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగికి మూడు ప్రమోషన్లను నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని నిర్ధారించారు. ఎస్ఈ చిట్టిబాబు టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగ నియామకం చేయగా ఎస్ఈ పి.కృష్ణ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా, ఎస్ఈ బీవీ.సుబ్బారావు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్గా, ఎస్ఈ సీఆర్.రాజగోపాల్ టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగోన్నతి కల్పించారని, ఆ సమయంలో పనిచేసిన డీఎస్ఈ, సూపరింటెండెంట్ వివరాలను పేర్కొన్నారు. అలాగే కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కె.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాలకు అర్హతలేకున్నా టెక్నికల్ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను ఎస్ఈ బీవీ.సుబ్బారావు ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఈ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు వెలుగులోకి రాలేదు. నివేదికతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 22వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒకక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో 24న ధ్వజస్తంభానికి సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. ఆదివారం ఆమె ఇక్కడ మాట్లాడుతూ..ధ్వజస్తంభం పునరుద్ధరణలో భాగంగా కొన్ని రోజుల కిందట బాలాలయం ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో ధ్వజస్తంభం పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో మంగళవారం సంప్రోక్షణకు అంకురార్పణ చేసి, బుధవారం బాలాలయంలో ఉంచిన కలిశంలోని ప్రాణ ప్రతిష్టను ధ్వజస్తంభంలోకి సంప్రోక్షణ ద్వారా పంపనున్నట్లు చెప్పారు. లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయంతోపాటు మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీ మారెమ్మ ఆలయంలో ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తల్లీ ..కాపాడమ్మా అంటూ అమ్మవార్లను వేడుకున్నారు. పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎన్సీసీ సి సర్టిఫికెట్ క్యాడెట్ సి. నాగేంద్ర వర్మ ఆలిండియా ధాల్ సైనిక్ క్యాంప్లో రజిత పతకం సాధించారు.ఆంధ్ర, తెలంగాణ డైరెక్టరేట్ తరపున న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో ధాల్ సైనిక్ క్యాంపు నిర్వహించారు. ఇందులో నాగేంద్ర వర్మ ఫైరింగ్ ఈవెంట్లో ప్రతిభ కనబరిచినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. అంతేగాకుండా నాన్ మెయిన్డ్ టగ్ ఆఫ్ వార్ పోటీలో రజిత పతకం సాధించాడని, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్ పాల్ సింగ్ ద్వారా ప్రశంసాపత్రం అందుకున్నాడని తెలిపారు. నాగేంద్ర వర్మను చాన్స్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో చాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాథ్ అభినందించారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయం కబడ్డీ పురుషుల క్రీడా జట్టు ఎంపికలు ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్నట్లు వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ రామసుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన క్రీడాకారులు వైవీయూ అనుసంధానమైన కాలేజీల్లో అభ్యసించినవారై ఉండాలన్నారు. ఎంపికలకు వచ్చే సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్ లేదా ఫిజికల్ డైరెక్టర్తో సంతకం చేసినటువంటి ఎలిజిబిలిటి ఫామ్ను, కాలేజీ స్టడీ సర్టిఫికెట్పై ప్రిన్సిపాల్తో సంతకం చేయించాలన్నారు. ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు జులై 1వ తేదీ 2025 నాటికి 17 ఏళ్లు నిండి ఉండి 25 ఏళ్లలోపు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులు ఉదయం 9 గంటలలోపు తమ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు. -
ఫైనాన్షియర్ దారుణ హత్య
● ఇంటి పక్కనే హతమార్చి కుందూ నదిలో పడేసిన దుండగులు ● రెండు రోజులు గాలించి మృత దేహాన్ని గుర్తించిన పోలీసులుప్రొద్దుటూరు క్రైం : అవసరానికి అప్పులివ్వడమే ఆయన చేసిన నేరమా. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించమని అడిగిన పాపానికి రుణదాతనే దుండగులు హతమార్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ఫైనాన్షియర్ కొండా వేణుగోపాల్ రెడ్డి (54) శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు దారుణంగా హతమార్చి చాపాడు సమీపంలోని కుందూ నదిలో పడేశారు. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ సభ్యులు ఊహించినట్టే ప్రముఖ వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి బాకీ దారుల చేతిలోనే హత్యకు గురయ్యాడు. పోరుమామిళ్ల మండలం రెడ్డికోట గ్రామానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి స్ధిరపడ్డారు. కొన్నేళ్ల వరకూ వైఎంఆర్ కాలనీలో నివాసం ఉండే వారు. జమ్మలమడుగు రోడ్డులోని మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నారు. వేణుగోపాల్రెడ్డికి భార్య ప్రమీలాదేవి, కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, కుమార్తె స్వప్న ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. కుమార్తె బీటెక్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వేణుగోపాల్రెడ్డి తెలిసిన వారికి వడ్డీకి డబ్బులు ఇస్తూ గడువు ముగిసిన తర్వాత తిరిగి తీసుకునేవాడు. ఇలా పట్టణంలో పెద్ద మొత్తంలో అప్పులిచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి సమీపంలోనే కాపు కాచి.. వేణుగోపాల్రెడ్డి ఇల్లు జమ్మలమడుగు రోడ్డు పక్కన బొల్లవరం ప్లాట్లో ఉంది. ప్రధాన రహదారికి అతి సమీపంలో ఆయన ఇల్లుంది. శుక్రవారం సాయంత్రం 6.30 సమయంలో ఇంటి నుంచి స్కూటీలో అతను బయటికి వెళ్లాడు. రోజూ రాత్రి 8–15, 8–30 గంటల్లోగా ఇంటికి వచ్చేవాడు. అయితే శుక్రవారం రాత్రి 8.50 దాటినా వేణుగోపాల్రెడ్డి ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న ఫోన్ చేసింది. అతని ఫోన్ నంబర్లు పని చేయలేదు. రోడ్డుపై ఉన్నాడేమో చూసి రమ్మని వాచ్మెన్ను పంపించారు. అతను బయటికి వెళ్లగానే ఇంటి సమీపంలో వేణుగోపాల్రెడ్డి స్కూటీ పడిపోయి ఉంది. పక్కనే అతని చెప్పులతోపాటు కారం పొడి ఉండడంతో ఫైనాన్షియర్ కిడ్నాప్నకు గురయ్యాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇదిలా ఉండగా రాత్రి 8 గంటల తర్వాత వేణుగోపాల్రెడ్డి ఇంటికి వస్తాడని భావించిన దుండగులు ప్రధాన రహదారిలోని ఆర్చీ వద్ద కాపు కాసినట్లు తెలుస్తోంది. స్కూటీలో ఇంటికి వెళ్తున్న సమయంలో ఆర్చీ దాటగానే దుండగులు అడ్డగించి, కళ్లలో కారం పొడి చల్లి ఘటనా స్థలంలోనే హత్య చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కిడ్నాప్ చేసి అతన్ని ఎత్తుకెళ్లాలని ముందుగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. వేణుగోపాల్రెడ్డి ఘటనా స్థలంలోనే మృత్యువాతపడడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి కుందూలో పడేసినట్లు సమాచారం. కుటుంబసభ్యుల అనుమానమే నిజమైంది.. బాకీ తీసుకున్న వారు గడువు ముగిసినా డబ్బు చెల్లించకపోవడంతో కొందరిపై వేణుగోపాల్రెడ్డి కోర్టులో కేసు వేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కేసు తుది విచారణకు వచ్చినట్లు వేణుగోపాల్రెడ్డి భార్య ప్రమీలాదేవి మీడియాతో వెల్లడించారు. కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించిన బాకీ దారులు తన భర్తను కిడ్నాప్ చేసి హాని తలపెట్టాలని చూస్తున్నారని ఆమె అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకు ప్రమీలాదేవి అనుమానమే నిజమైంది. బాకీ దారుల్లో కొందరు ఆమె భర్తను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరిలో వేణుగోపాల్రెడ్డి బంధువు కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కుందూలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వడ్డీ వ్యాపారి వేణుగోపాల్రెడ్డి కిడ్నాప్నకు గురయ్యాడని తెలిసిన వెంటనే ప్రొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఆధ్వర్యంలో రాజుపాలెం ఎస్ఐ వెంకటరమణ, రూరల్ ఎస్ఐ రాజుతో కలిసి నాలుగు టీంలుగా ఏర్పడి రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కారులో ఫైనాన్షియర్ను తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా గుర్తించారు. ఇలా కారు వెళ్లిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని కుందు బ్రిడ్జి వద్ద నదిలో ఆదివారం వేణుగోపాల్రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక రెస్క్యూ టీంతో కలిసి అరుణ్రెడ్డి నదిలోని మృతదేహాన్ని వెలికి తీశారు. కుందూ నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో మృతదేహాన్ని వెలికి తీయడం అతి కష్టంగా మారింది. ఎట్టకేలకు శ్రమించి మృతదేహాన్ని బయటికి తీశారు. అతని మృతదేహాన్ని చూపి భార్య ప్రమీలాదేవి, కుమార్తె స్వప్న బోరునా విలపించసాగారు. కేసులో అనుమానం ఉన్న కొందరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలను తమదైన పద్దతిలో వారి నుంచి రాబట్టే పనిలో పోలీసు అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. -
ఆర్టీసీ బస్సు బోల్తా
మైదుకూరు : విజయవాడ నుంచి కడపకు వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వరదాయపల్లె సమీపంలో శనివారం బోల్తా పడింది. బస్సు డ్రైవర్తో సహా పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. విజయవాడ నుంచి వస్తున్న బస్సులో జీవీసత్రం ప్రాంతానికి చెందిన కొందరు విద్యార్థులు బయలుదేరారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో నెల్లూరు–బళ్లారి జాతీయ రహదారిపై వరదాయపల్లెకు సమీపంలో ఆపాలని కండక్టర్ను విద్యార్థులు కోరారు. ఆ మేరకు డ్రైవర్ కొన్ని మీటర్ల మేరకు బైపాస్పై ఉన్న బస్సును రివర్స్ చేసేందుకు యత్నించాడు. దాంతో బస్సు అదుపుతప్పి బోలాం్త పడింది. డ్రైవర్తోపాటు బస్సులో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కడప డిపో అధికారుల సమాచారంతో గ్యారేజీ కార్మికులు సంఘటనా స్థలానికి చేరుకొని బస్సును యథాస్థితికి తెచ్చారు. -
నాణ్యత నీళ్లకే ఎరుక
కాలువ పక్కన పడిన గండి మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)కు కాంక్రీట్ లైనింగ్ పిడకలా ఊడిపోవడం పనుల నాణ్యతను ప్రశ్నించేలా చేస్తోంది. బి.కొత్తకోటలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం నీళ్లు వాగులు, వంకలు, చెరువుల్లోకి ప్రవహించాయి. ఇదే విధంగా బి.కొత్తకోట–బడికాయలపల్లె మార్గం సమీపంలోని పీబీసీ కాలువ 102 కిలోమీటర్ వద్ద కాలువకు వేసిన కాంక్రీట్ లైనింగ్ కూలిపోయింది. లైనింగ్ ఒకరకమైన ఆకారంలో కూలగా అంచున చీలింది. దానివద్ద నీళ్లు కాలువ నుంచి గండిపడి బయటకు వెళ్లాయి. ఇలా ఎందుకు జరిగింది అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైనింగ్ పనుల్లో నాణ్యత లోపించిందా లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పలుచోట్ల కాలువలో నీటి ప్రవాహం వెళ్తున్న ఎత్తులో కాంక్రీట్ పనులు దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే నీటి ప్రవాహం తగ్గాక కాని కాంక్రీట్ లైనింగ్ పనులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కానీ 102 కిలోమీటర్ వద్ద ఊడిన కాంక్రీటు లైనింగ్ వ్యవహరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాణ్యతలేక ఊడిందా లేకపోతే నీటి మళ్లింపు కోసం ఎవరైనా తెగ్గొట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ మాట్లాడుతూ కాంక్రీట్ దెబ్బతిన్న ప్రాంతానికి చెందిన రైతులు లైనింగ్ను తెగ్గొట్టడం వల్లే ఊడిపోయిందని,నాణ్యతా లోపం కాదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈఈ, డీఈలకు ఆదేశించగా పరిశీలించినట్లు చెప్పారు. -
పనుల్లో నాణ్యత డొల్ల
జమ్మలమడుగు : జాతీయ రహదారి నిర్మాణంలో డొల్లతనం బయటపడుతోంది. నంద్యాల–జమ్మలమడుగు 167 నెంబర్ జాతీయ రహదారి పనులు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అప్పడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చే అధికారులు నామామాత్రంగా తనిఖీలు చేసి పోతున్నారనే విమర్శలున్నాయి. కీలకంగా ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారేగానీ నేషనల్ హైవే అధికారుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడే నాణ్యతలో డొల్లతనం బయటపడుతోంది. కనీసం 16 ఎంఎం కడ్డీలను ఉపయోగించితేనే పిల్లర్లు పటిష్టంగా ఉంటాయి. కానీ కంపెనీ 10 ఎంఎం, 8 ఎంఎం, 6 ఎంఎం కడ్డీలు రెండు, మూడు కడ్డీలు 16ఎంఎం ఉపయోగించడం జరుగుతోంది. దీంతో ఈ పిల్లర్లు ఎంత వరకు నిలబడుతాయోనని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిజైన్ ప్రకారమే పిల్లర్ల నిర్మాణం పెన్నానదిపై హై లెవల్ వంతెన నిర్మాణం జరుగుతోంది. డిజైన్ ప్రకారమే జరుగుతున్నాయి. ఒక్కొక్క పిల్లర్ ఒక్కో రకంగా ఉంటాయి. – సురేందర్రెడ్డి, ఏఈ, జమ్మలమడుగు -
రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ మృతి
పోరుమామిళ్ల : స్థానిక అంబేడ్కర్ సర్కిల్ వద్ద శనివారం రాత్రి మోటార్ బైక్ను ఐచర్ వాహనం ఢీకొన్న ఘటనలో షేక్ నాయబ్రసూల్(45) గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. మహబూబ్నగర్కుకు చెందిన రసూల్ కుమార్తె కోసం వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఐచర్ వాహనం ఢీకొంది. రసూల్ తీవ్రంగా గాయపడి కింద పడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. రసూల్కు భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు. రసూల్ భార్య రెహానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొండారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పచ్చ మీడియా రాతలకు ప్రజలే బుద్ధి చెబుతారు
రైల్వేకోడూరు అర్బన్ : చంద్రబాబు డైరెక్షన్లో వక్ర భాష్యాలతో రాతలు రాస్తున్న పచ్చ పత్రికలకు ప్రజలే బుద్ధి చెబుతారని రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా విలువలు కాలరాస్తూ రాసేవారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. వైస్.జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజూ వైఎస్.భారతి జోక్యం చేసుకోలేదని గుర్తుచేశారు. తనకు నచ్చిన సేవా కార్యక్రమాలు, పేదలకు సాయం చేయడం తప్ప.. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఆర్భాటం చేయలేదన్నారు. పేదల హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల కోరు అని నిరూపించారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రచురించడానికి వారికి సమయం లేదా అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు అధికంగా పెంచడం, నిత్యావసర ధరలు అధికమవడం, పాఠశాలలు, పోర్టులు, మెడికల్ కాలేజీలు ప్రవేటుపరం చేసి దండుకో వాలని చూడడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం
● మహిళను కాపాడిన పోలీసులు ● సిబ్బందిని అభినందించిన ఎస్పీకడప కోటిరెడ్డిర్కిల్ : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహిళను బ్లూ కోల్ట్ పోలీసులు రక్షించారు. జిల్లా ఎస్పీచే అభినందనలు అందుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. కుటుంబ కలహాలతో కడప ఎర్రముక్కపల్లి సమీపంలో ఉంటున్న ఓ మహిళ, ఇద్దరు పిల్లలను తీసుకుని ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో భాకరాపేట రైల్వే గేట్ వద్ద ట్రాక్పై నడచి వెళ్తోంది. విధుల్లో ఉన్న ట్రాక్మెన్ కిశోర్ గుర్తించి 112కు సమాచారం చేరవేశారు. గస్తీలో ఉన్న బ్లూకోల్ట్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమాకాంత్రెడ్డి, శ్రీనివాసులు రంగంలోకి దిగి రైలు కింద పడి తనువు చాలించాలనుకున్న మహిళ, ఇద్దరు పిల్లలను సురక్షితంగా తీసుకువచ్చారు. కుటుంబసభ్యులకు అప్పగించి స్థానికుల మన్ననలు పొందారు. నిమిషం ఆలస్యమైనా స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు క్రిందపడి ముగ్గురు విగత జీవులుగా మిగిలేవారు. మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి బంధువులకు అప్పగించారు. సురక్షితంగా కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బలవన్మరణానికి పాల్పడడం అత్యంత భయంకరమైన నిర్ణయమని, ఉద్వేగంతో క్షణాల్లో ఇక జీవించలేనంటూ స్వస్తి పలకడం పొరపాటు నిర్ణయమని వివరించారు. సమస్యలతో సతమతమవుతున్న వారు ఎందరో కాలంతో పోరాడి ఎలా బ్రతుకుతున్నారో చూసి, ఆత్మస్థైర్యంతో జీవించాలని ఎస్పీ సూచించారు. -
వీఆర్ఏల జిల్లా కమిటీ ఎన్నిక
రాజంపేట రూరల్ : ఏపీ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గ్రామ సేవకుల సంఘం జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందంగీసాహెబ్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా సీహెచ్.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడిగా మోడీప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా కొరముట్ల సుధాకర్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఎ.తిరుపాల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా పి.నరసింహులు, ఉపాధ్యక్షుడిగా ఇ.మధుబాబు, కే.మణి, ఎం.రామచంద్రయ్య, షేక్ ఖాదరవలి, కె.రమణయ్య, బి.రత్నమ్మ, ఎన్.లావణ్య, సహాయ కార్యదర్శులుగా ఎన్.నరసింహులు, ఎం.కోటేశ్వరరావు, బి.హరీష్, ఎన్.నరసయ్య, కోశాధికారిగా లకీ్ష్ మకర్, కమిటీ సభ్యులుగా ఎం.పీరయ్య, ఎ.శ్రీను, బి.సుబ్రహ్మణ్యం, పి.కులశేఖర్, ఇ.బలరామ్, సురేంద్ర, పి.గిరిజ, తదితరులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా
కమలాపురం : కమలాపురం పట్టణం క్రాస్ రోడ్డు ఆర్చి వద్ద గుంతల్లో పడి ఆటో బోల్తా పడింది. కడప నుంచి కమలాపురం పట్టణంలోనికి ఆటో వస్తోంది. ఆర్చి వద్ద పెద్ద గుంత ఉంది. అందులో వర్షపునీరు నిలవడంతో గుర్తించలేక అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే స్థలంలో ఇది వరకూ ఓ వాహనంతోపాటు, మోటార్ బైక్ బోల్తా పడ్డాయని స్థానికులు తెలిపారు. ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని ఉమ్మారెడ్డిపల్లె సమీపంలో లారీ–మినీ ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు.. పిడుగురాళ్ల నుంచి అనంతపురానికి పెయింట్స్ లోడ్తో ఓ లారీ ప్రయాణిస్తోంది. ఎదురెదురుగా ఉమ్మారెడ్డిపల్లి సమీపంలో రెండూ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలోనే ఇరుక్కపోయి డ్రైవర్ రాజేష్ను స్థానికులు బయటకు తీసారు. ఆసుపత్రిలో పాము కలకలంజమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పాము ఆదివారం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక భాగంలో ఖాళీ ప్రదేశం ఉండడం, ఇటీవల వర్షాలు పడడంతో గర్భిణులు ఉండే వార్డులోకి పాము ప్రవేశించింది. గమనించిన రోగులు ఆసుపత్రి సిబ్బందికి తెలిపారు. సెక్యూరిటీ వచ్చి కర్రతో కొట్టి చంపివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఒంటిమిట్ట రామయ్యకు పూజలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం, నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయాల్లో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు రెండు చోట్ల ఆలయ మర్యాదలతో స్వాగతం లభించింది. ముందుగా రామయ్య మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సౌమ్య నాథుడి సన్నిధిలో పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సోమ, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రోడ్డుపై కూలిన నీలగిరి చెట్టుమదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం సమీపాన కంకరమిషన్ వద్ద ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా నీలగిరి చెట్టు కూలింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భూమి బాగా తడిచి ఉండడంతో బలంగా వీస్తున్న ఈదురుగాలులకు చెట్టు నేలకొరిగింది. సమయానికి రోడ్డుపై వాహన, జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు విషయాన్ని పంచాయతీ అధికారులకు తెలుపడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో చెట్టును తొలగించారు. తెలుగు తమ్ముళ్లపై కేసులు నమోదు.. రాయచోటి : ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం పట్టణంలోని మదనపల్లె మార్గంలో టీడీపీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై మరో దాడులు చేసుకునే విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తెలుగు యువత అధ్యక్షుడు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్లకు రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ సీరియస్ కావడంతో రాయచోటి అర్బన్ పోలీసులు ఇరువురిపై ఆదివారం కేసులు నమోదు చేశారు. అక్రమంగా కలప తరలింపుమదనపల్లె రూరల్ : అక్రమంగా కలప తరలిస్తున్న ట్రాక్టర్ను అదుపులోకి తీసుకుని అటవీ అధికారులు జరిమానా విధించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న చెట్లు కొందరు తొలగించి ముక్కలుగా చేసి ట్రాక్టర్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఇన్చార్జ్ డీఆర్వో శివకుమార్ జిల్లా ఆస్పత్రికి చేరుకుని, అనుమతులు లేకుండా కలప తరలిస్తున్న మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శంకర్రెడ్డిని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే అనుమతితో తరలిస్తున్నామని, కావాలంటే ఫోన్ చేయిస్తానని చెప్పాడు. దీంతో అటవీ అధికారులు ఎమ్మెల్యే షాజహాన్బాషాకు ఫోన్ చేశారు. ఆయన స్పందిస్తూ తాను ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీంతో ట్రాక్టర్ను సీజ్ చేసి అటవీ కార్యాలయానికి తరలించారు. ఎఫ్ఆర్వో జయప్రసాదరావు విచారించి రూ.8,500 జరిమానా విధించారు. -
వ్యక్తి అదృశ్యం
ఎర్రగుంట్ల : పట్టణంలోని ప్రకాశ్ నగర్లో నివాసముంటున్న నాగన్న కుమారుడు వలస గాళ్ల నాగరాజు(40) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు అదివారం తెలిపారు. ప్రకాశనగర్ కాలనీకి చెందిన నాగరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు, ఇతడికి భార్య పెద్దక్క, కుమారుడు ఉన్నారు. నాగరాజుకు అప్పులు అధికంగా ఉండడంతో వాటిని తీర్చలేదని భావించి ఈ నెల 18న బయటకు పోయాడు. ఇప్పటివరకూ రాకపోవడంతో అతని భార్య పెద్దక్క పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు యర్రగుంట్ల పోలీసులు తెలిపారు. ఇంటి సామగ్రి దగ్ధంచింతకొమ్మదిన్నె : మండలంలోని టి.క్రిష్ణాపురం గ్రామంలో ఉంటున్న నాగూరు భార్గవరెడ్డి ఇంట్లో ఆదివారం సాయంత్రం విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అధికారులు ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఇంట్లోని ఎలక్ట్రికల్ పరికరాలు, వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, టీవీ, బీరువాలు, అందులోని సర్టిఫికెట్లు, బట్టలు, డబ్బులు కాలిపోయాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో దాదాపు మూడు లక్షల రూపాయల విలువ మేర నష్టం జరిగినట్లు బాధితుడు భార్గవరెడ్డి తెలియజేశారు. పల్లెల్లో జోరుగా పేకాటసాక్షి టాస్క్పోర్స్ : కొండాపురం మండలంలోని కొన్ని గ్రామాల్లో కూటమి నాయకుల కనుసన్నుల్లో పేకాట జోరుగా సాగుతోంది. యర్రగుడి పునరావాస కేంద్రం సమీపంలోని సపోట తోట, దొబ్బుడుపల్లె పమీపంలోని కంపచెట్ల వద్ద, కె.సుగుమంచిపల్లె పునరావాస కాలనీలోని చెట్ల వద్ద, కొండాపురం ఈసర్ పెట్రోల్ బంకు సమీపంలోని ఓ చీనీ తోటలో చాలామంది పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిసినా వాటిని ఉన్నతాధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అసాంఘిక కార్యకలపాలపై దృష్టి పెట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : మండలంలోని నల్లపురెడ్డిపల్లె గ్రామం శోచరీపురం పొలం పరిధిలో 20మంది రైతుల తోటల్లో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి శనివారం కేబుల్ వైర్లు అపహరించారు. రైతులు మాట్లాడుతూ పంట పండక, గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తోటల వద్ద బోర్ల కేబుల్ను అపహరించడంతో నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతికడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వే స్టేషన్ మధ్య గూడ్స్రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో దిగువ రైలు పట్టాల వద్ద మృతిచెందిన వ్యక్తి 40–45 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆర్టీపీపీలో యూనియన్ల మధ్య ఘర్షణ
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులో యూనియన్ల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుంది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు స్వల్పంగా గాయలయ్యాయి. యూనియన్ నాయకులు కలమల్ల పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేయగా పోలీసులు సర్ది చెప్పాల్సి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికుల డిమాండ్ల సాధన కోసం 23 యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడిడి ఈ నెల 15వ తేదీ నుంచి నిరసన చేపట్టారు. ప్రభుత్వంలో భాగమైన టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు కాంట్రాక్టు కార్మికుల కోసం వేరుగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. శనివారం జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహర దీక్షలు ప్రారంభం కాగా, అదే సమయంలో గేటు బయట టీఎన్టీయూసీ, బీఎంఎస్ యూనియన్లు నిరసన చేపట్టాయి. విధులకు వెళ్తున్న ఉద్యోగ, కార్మికులను రెండు యూనియన్ల నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుని తోపులాట జరిగింది. టీఎన్టీయూసీ యూనియన్కు చెందిన మనోహర్, పులి సుధాకర్రెడ్డిలకు గాయాలయ్యాయి. దీంతో యూనియన్ నేతలు కలమల్ల పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ అంతా కలిసి చర్చించుకుని సర్దుబాటు అయ్యారు. జేఏసీ నేతలు క్షమాపణ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతిమదనపల్లె రూరల్ : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామం పడమట వీధికి చెందిన గీర్వాణి(60) మాజీ సైనికోద్యోగి అయిన తన భర్త మురళీతో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళుతోంది. మదనపల్లె నుంచి పీలేరు వెళుతున్న ఆర్టీసీ అద్దె వాహనం ఓవర్టేక్ చేస్తూ పక్కకు వెళ్లే క్రమంలో వారి ద్విచక్రవాహనాన్ని తాకింది. దీంతో బైక్ అదుపుతప్పి గీర్వాణి, మురళీ కిందపడ్డారు. ప్రమాదంలో గీర్వాణి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె మృతితో ఆవేశానికి లోనైన కుటుంబసభ్యులు బస్సు డ్రైవర్ జానకిరామ్పై దాడి చేశారు. తమకు కేసు, పోస్టుమార్టం వద్దంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. తాలూకా పోలీసులు విచారణ చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. నిందితుల అరెస్టుమదనపల్లె రూరల్ : తమ్ముడితో కలిసి కట్టుకున్న వాడిని అంతమొందించిన హత్య కేసులో నిందితులను అరెస్ట్చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. టూటౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రామన్న(40) మద్యం మత్తులో రోజూ భార్య రమణమ్మతో గొడవపడేవారు. 2025 మార్చి, 12న యథాప్రకారం గొడవపడగా.. భార్య రమణమ్మ పప్పుగుత్తితో భర్త రామన్నపై దాడి చేసింది. అప్పటికే అక్కడే ఉన్న ఆమె తమ్ముడు ఈశ్వర్ కూడా అక్కను కాపాడే క్రమంలో రుబ్బురోలు తీసుకుని రామన్నపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హంద్రీనీవా కాల్వ వద్ద మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. మృతుడి సోదరుడు జరిపిటి లక్ష్మన్న ఫిర్యాదుతో విచారించిన పోలీసులు ఈశ్వర్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిపారు. నిందితులను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన పప్పుగుత్తి, రుబ్బురోలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, హెడ్ కానిస్టేబుల్ వేణు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామసముద్రం దిగువహరిజనవాడకు చెందిన వెంకటప్ప కుమారుడు అంజప్ప(45) భార్య నాలుగేళ్ల కిందట మృతి చెందడంతో ఒంటరి జీవితాన్ని భరించలేకపోయాడు. మానసికంగా కుంగిన అతడు ఇంటివద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గుర్రంకొండ మండలం సరిమడుగు పంచాయతీ కృష్ణాపురానికి చెందిన చౌడప్ప కుమారుడు చలపతి(48) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. తమ్ముళ్లు డిష్యుం.. డిష్యుం..టాస్క్ ఫోర్స్ : ఓటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి దౌర్జన్యాలు, రౌడీయిజం, దాడులు అధిక మయ్యాయి. పార్టీలతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలే పెట్టుబడిగా తెలుగు తమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కోసారి ఆర్థిక, భూ పంపకాలు, మద్యం మత్తుల్లో తెలుగు తమ్ముళ్లే ఒకరికి ఒకరు దాడులు చేసుకుంటూ ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం రాయచోటి పట్టణ తెలుగు యువత అధ్యక్షులు జాబీర్, మరో తెలుగు మైనార్టీ నాయకుడు సయ్యద్ వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో జాబీర్, సయ్యద్ భాషాలు ఇరువురికి తీవ్రంగా రక్త గాయాలు అయ్యాయి. మదనపల్లి మార్గంలోని భూ తగదా విషయంపై ఇరువురి మధ్య ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. అయితే అధికార పార్టీకి చెందిన ఇరువురు పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.ఇద్దరు మైనర్ల అరెస్టువేంపల్లె : స్థానిక పిల్లస్వామి గుట్ట సమీపంలోని జగనన్న కాలనీలో ఈ నెల 18వ తేదీన వాణి తన ఇంటికి తాళం వేసి వెళ్లారు. అదే కాలనీకి చెందిన ఖాదర్వలి, మరో ఇద్దరు మైనర్లు పట్టపగలే ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో బంగారు, వెండి చోరీ చేశారు. విచారించిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అభరణాలు స్వాధీనం చేసుకున్నారు.కూలీ ప్రాణాలు తీసిన టిప్పర్..!కురబలకోట : హైవే పక్కన రాంగ్ సైడ్లో నిలిపిన టిప్పర్ను మోటార్ సైకిల్పై వచ్చిన వ్యక్తి ఢీకొని మృతి చెందిన విషాదకర సంఘటన కురబలకోట మండలంలో శనివారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం వాల్మీకీ నగర్కు చెందిన పి.సుధాకర్ (56) కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుమార్తెను శుక్రవారం రాయచోటిలోని చెల్లెలు ఇంటి వద్ద వదిలి వస్తానని సుధాకర్ మోటార్సైకిల్పై వెళ్లాడు. భార్య రాత్రి పది గంటల సమయంలో పోన్ చేయగా వర్షం ఆగగానే ఇంటికి వచ్చేస్తానని బదులిచ్చాడు. శనివారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా ముదివేడు సమీపంలోని తానా మిట్ట వద్ద ఆగిన టిప్పర్ను ప్రమాదవశాత్తూ ఢీకొట్టాడు. టిప్పర్ను రాంగ్ సైడ్లో ఆపి సిగ్నల్స్ కూడా వేయకపోవడమే ఇందుకు కారణమైంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణాన్ని బలితీసుకుంది. శనివారం వేకువ జామున మృతి వార్త తెలుసుకుని భార్య, పిల్లలు విలపించారు. అమ్మా.. నాన్నకు ఏమైంది.. నాన్న ఎక్కడమ్మా..అని పిల్లలు రోధించడం చూపరుల కళ్లను చెమర్చాయి. మదనపల్లె ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు.సోమశిల జలాలతో మునిగిన పొలాలుపెనగలూరు : సోమశిల వెనుక జలాలు పెరగడంతో సిరివరి గ్రామానికి చెందిన వందల ఎకరాల పంట నీట మునిగింది. మామిడి తోటల్లోకి నీరు చేరడంతో చెట్లు చనిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్టు సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 72 టీఎంసీలు నిల్వచేశారు. దీంతో సిరివరం, ఎన్ఆర్.పురం గ్రామంలోని చాలా పొలాలకు నీరు చేరింది. వారం పది రోజులలో కోసేందుకు వరి ప ంట సిద్ధంగా ఉండగా. నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. అధికారులు, పాలకులు పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కోడిపందేల రాయుళ్లు అరెస్టుసిద్దవటం : మండలంలోని మిట్టపల్లి సమీపాన రైల్వే బ్రిడ్జి వద్ద కోడి పందేలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. తనకు అందిన సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం సోదాలు చేయగా రైల్వేబ్రిడ్జి వద్ద కోడి పందెం ఆడుతూ కనిపించారన్నారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 10500 ల నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుసిద్దవటం : మండలంలోని భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజంపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో కడప నుంచి రాజంపేటకు బయలుదేరారు. భాకరాపేట సమీపంలోని రాజస్థాన్ డాబా వద్దకు రాగానే ముందు వెళ్తున్న కారు వేఉగంగా ఓవర్టేక్ చేసి వెళ్లింది. ద్విచక్ర వాహనంలో వస్తున్న వీరు ముందు వెళ్తున్న ఐచర్ వాహనాన్ని వెనుకవైపు ఢీకొన్నారు. ప్రమాదంలో ఆకేపాడుకు చెందిన కమల్, మనక్కాయల పల్లికి చెందిన రితేష్, రాజంపేటకు చెందిన మున్నాకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని వైద్యంకోసం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు మైదుకూరు : తనను బెదిరించి తన మోటార్ బైక్ను అగంతుకుడు ఎత్తుకెళ్లాడని ఓ భవన నిర్మాణ కార్మికుడు చేసిన ఫిర్యాదు ఓ అంతర్ రాష్ట్ర దొంగను పట్టించింది. బద్వేల్ ఎన్జీఓ కాలనీ వాసి బ్రహ్మాదేవి రాజశ్రీ గణేష్ను బ్రహ్మంగారిమఠం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల విలువచేసే పది మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని వివేకానంద కాలనీకి చెందిన షేక్ హుస్సేన్షా బేల్దారిగా పనిచేస్తున్నారు. బ్రహ్మంగారిమఠం ఈశ్వరీదేవి గుహ వద్ద ఈ నెల 16న పనులకు వెళ్లి కొద్ది దూరంలో బైక్ పార్కింగ్ చేశాడు. సాయంత్రం వచ్చి చూడగా.. నిందితుడు రాజశ్రీ గణేష్ తన బైక్ను స్టార్ట్ చేస్తుండడడంతో హుస్సేన్షా ఎందుకు స్టార్ట్ చేస్తున్నావని ప్రశ్నించాడు. పక్కకు తప్పుకోకుంటటే చంపేస్తానంటూ చాకుతో బెదిరించి బైక్లో పరారయ్యాడు. బాధితుడు బ్రహ్మంగారిమఠం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుడు రాజశ్రీ గణేష్ను పోలీసులు అనుమానించి విచారించారు. విచారణలో హుస్సేన్షా మోటార్ బైక్ అని తేలడంతో మరింత విచారణ చేశారు. దీంతో రాష్ట్రంతోపాటు తెలంగాణలోని పలు స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ బైక్లు చోరీ చేసినట్లు తెలిసింది. ఓ పాడుబడిన షెడ్లో నిందితుడు దాచిన పది మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక కడప, ఒంటిమిట్ట, నందలూరు ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు నిందితుడిపై కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకున్న సీఐ జె.శివశంకర్, బ్రహ్మంగారిమఠం ఎస్ఐ శివప్రసాద్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రలకు నగదు రివార్డులను అందజేశారు. ముగ్గురిపై చీటింగ్ కేసుకడప అర్బన్ : కడప హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన విజయభాస్కర్రెడ్డితోపాటు కుమార్తె రూప తన్మయి, సుజిత్కుమార్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రామకృష్ణ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. అరవింద్నగర్కు చెందిన నిత్య పద్మావతి 2019లో ఐదు ఆయిల్ ట్యాంకర్లను కొనుగోలు చేశారు. వాటి నిర్వహణ బాధ్యత విజయభాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన నిపద్మావతి దగ్గర సంతకాలు చేసిన చెక్కు ఇప్పించుకున్నాడు. కుట్రపన్ని దాదాపు రూ.90 లక్షల మేర తాను, తమ ఇద్దరు పిల్లల ద్వారా డబ్బు డ్రా చేసుకుని ఖర్చు చేసుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ల ఈఎంఐలను కట్టించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. 10 మోటార్ బైక్లు స్వాధీనంరక్త గాయాలతో ఆసుపత్రికి చేరిక -
వైద్య కళాశాలలకు మంగళం పాడిన ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూటమి ష్ట్రప్రభుత్వం మంగళం పాడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పాడె కట్టి శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో వ్యాపారానికి పెట్టిందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని దూరం చేయడంతో పాటు వైద్యవిద్యను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థుల ఆశలను చిదిమేస్తోందన్నారు. ప్రైవేటీకరించకుంటే ఆయా కళాశాలల్లో ఓపీ, మెడికల్ టెస్టులు, మందులకు ఎలాంటి ఫీజులు వసూలుచేయమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. పీ–4 పేరుతో కార్పొరేటైజేషన్, కమర్షిలైజేషన్, కమ్యూనలైజేషన్, సెంట్రలైజేషన్ అమలు చేస్తోందన్నారు. బనకచర్లకు రూ.81వేల కోట్లరూపాయలు ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వం రూ.8వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు ఎందుకు ఖర్చుపెట్టలేకపోతోందని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వరంగంలో కొనసాగించేలా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి, తీర్మానం చేసి ఆమోదం తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి మురళి, రెడ్డి, నరేష్, ఏఐఎస్ఎఫ్ మాధవ్, దేవా, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు. -
విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
రాయచోటి జగదాంబసెంటర్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్తు కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో శనివారం రాయచోటి పట్టణంలోని విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్కం అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరాజు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తెలంగాణ తరహాలో సంస్థలో విలీనం చేయాలని, థర్డ్ పార్టీ వ్యవస్థను రద్దు చేయాలని కోరారు. అనంతరం కార్మికులకు విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర్రెడ్డి, డీఈ యుగంధర్ మద్దతు తెలిపారు. డిమాండ్ల సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరి, ఏవీ.రమణ, రెడ్డప్ప, కిరణ్, శ్రీనివాసనాయుడు, అమరనాథరెడ్డి, రామాంజి, శ్రీనివాసులు, స్వాతి, సుజాత, సరస్వతి, నాగేష్గౌడ్, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణ, సురేంద్ర, నారాయణ, కార్మికులు పాల్గొన్నారు. -
వీఆర్ఏలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాజంపేట రూరల్ : రాష్ట్రంలో వీఆర్ఏలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా కూటమి ప్రభుత్వం అడుగడుగునా విస్మరిస్తోందని వీఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మండిపడ్డారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఎ)ల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో బందగీ సాహెబ్ మాట్లాడుతూ వీఆర్ఎలకు 8 సంవత్సరాలుగా వేతనాలు పెరగలేదని వాపోయారు. జీతం బెత్తెడు ఇస్తూ అక్రమంగా బండ చాకిరీ చేయించుకుంటాన్నారని వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పేస్కేల్ అమలు చేయాలన్నారు. అనంతరం ఎన్జీఒ హోమ్ నుంచి సబ్ కలేక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ భావనకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సీహెచ్.చంద్రశేఖర్, రవికుమార్, మధు, మోడీప్రసాద్, లక్ష్మీకర్, మని, నరసింహులు, కోటీ, తిరుపాలు, ఖాదరవల్లి, లావణ్య, రత్నమ్మ, తదితరులు పాల్గొరు. -
కళ్లల్లో కారం చల్లి.. ఫైనాన్షియర్ కిడ్నాప్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ప్రముఖ ఫైనాన్షియర్ వేణుగోపాల్రెడ్డిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. శుక్రవారం రాత్రి స్కూటీలో ఇంటికి వస్తుండగా దారి మధ్యలో కాపు కాచిన దుండగులు కళ్లలో కారంపొడి చల్లి కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లవరం ప్రాంతానికి చెందిన వేణుగోపాల్రెడ్డి కొన్నేళ్ల క్రితం జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్లలో విశాలమైన భవంతి నిర్మించుకొని అక్కడే ఉంటున్నారు. ఆయన వడ్డీకి అప్పులిస్తుంటాడు. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో కుమార్తె స్వప్న వేణుగోపాల్రెడ్డికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్లో ఉంది. మరో నంబర్ అందుబాటులో లేదు. కొద్ది సేపటి తర్వాత వాచ్మెన్ బయటికి వెళ్లి చూడగా జమ్మలమడుగు రహదారిలోని ఆర్చి వద్ద వేణుగోపాల్రెడ్డి స్కూటీ కిందపడిపోయి ఉంది. వాచ్మెన్ కేకలు వేయడంతో ప్రమీలాదేవి, కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారు. స్కూటీ పక్కనే వేణుగోపాల్రెడ్డి చెప్పులతోపాటు కారంపొడి పడి ఉండటంతో ఎవరో ఆయనను కిడ్నాప్ చేశారని భావించిన కుటుంబ సభ్యులు బోరున విలపించసాగారు. రూరల్ ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి రాత్రంతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా కొందరు వ్యక్తులు కారులో వేణగోపాల్రెడ్డిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యే క బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పా రు. తమకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్లే తన భర్త వేణుగోపాల్రెడ్డిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లి ఉంటారని ప్రమీలాదేవి తెలిపారు. తమకు బాకీ ఉన్నవాళ్లు తన భర్త కు హాని తలపెట్టేలా ఉన్నారని ఆమె రోదించింది. -
‘జై భీమ్’ కొనసాగాలంటే
రాజంపేట: రాష్ట్రంలో జైభీమ్ నినాదం కొనసాగాలంటే జగనన్న పాలన రావడం తప్పనిసరి అని, ఆ దిశగా జగనన్న దళితఫోర్స్ సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్ సుధాకర్బాబు అన్నారు. శనివారం ఆకేపాటి ఎస్టేట్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి అధ్యక్షతన జిల్లా ఎస్సీసెల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న దాడులను, సామాజిక అన్యాయాన్ని ప్రతి ఒక్క దళితుడు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో దళితులను బహిష్కరణకు గురైన సంఘటనను ఆయన వివరించారు. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగపల్లైపె దాడులు చేసిన తరుణంలో ప్రాణరక్షణ కల్పించాలని మొరపెట్టుకున్నా ప్రభుత్వం, పోలీసులు స్పందించకపోవడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేసే విధంగా తీసుకున్న నిర్ణయం వల్ల పరోక్షంగా సామాజిక అన్యాయం చేసినట్లే అని అన్నారు. కూటమి దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును చరిత్ర ఎన్నటికీ మరిచిపోదన్నారు. చంద్ర బాబు పాలనలో జరుగుతున్న సామాజిక అన్యాయంపై తిరుగుబాటుతప్పదన్నారు. సూపర్సిక్స్లో మూడు పథకాలతో దళితులకు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దళితుల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. రాజకీయంగా, ఆర్ధికంగా దళితులను ఎదగడానికి జగనన్న పాలన దోహదపడిందని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చినా ఈ సారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని జోష్యం చెప్పారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్ధాయి వరకు ఎస్సీ కమిటీలను బలోపేతం చేస్తామన్నారు. ఆదిశగా మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలో మండల, గ్రామ, నియోజకవర్గ స్ధాయి కమిటీల నియామకం పూర్తవుతోందన్నారు. జిల్లాలో ఎస్సీ కమిటీలు పూర్తి చేయడంలో ముందంజలో ఉందని, ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి కృషి ఉందని కొనియాడారు. ఎస్సీల సంక్షేమాన్ని చంద్రబాబు మరిచారన్నారు. ఎస్సీ,ఎస్టీలను డిప్యూటీసీఎం చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. డీబీటీ విధానంలో రాష్ట్రంలో ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికే రూ.9,154 కోట్లు ఆర్ధిక ప్రయోజనం కల్పించారన్నారు. జగన్మోహనరెడ్డి మళ్లీ సీఎం చేసుకోవాలని, లేదంటే నష్టపోతామని దళిత సామాజికవర్గాలు గుర్తుంచుకోవాలన్నారు. ● ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనను, ఇప్పటి కూటమి పాలనను దళితలు బేరీజు చేసుకుంటున్నారన్నారు. బాబు పాలన దళితవర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో పెద్దపీట వేసినట్లు చెప్పారు జగనన్నకు దళితులు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాజంపేటలో మార్కెట్యార్డు చైర్మన్ ఎస్టీకి రిజ్వరుడ్ అయితే, దానిని మార్చి ఓసీ నేతకు కట్టబెట్టడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం సామాజిక అన్యాయం చేస్తోందని అవగతమవుతోందన్నారు.వైఎస్సార్సీపీ దళితనేతలు పులిసునీల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్, నందలూరు మండల ఉపాధ్యక్షుడు నాయనపల్లె అనుదీప్, రమణ, చంద్ర, జయరామచంద్ర, మోహన్, తిప్పన దుర్గయ్య, అంజనప్ప, లింగం లక్ష్మీకర్, చిన్నయల్లయ్య, ఎముక దుర్గయ్య, నాగసుబ్బయ్య, భక్తుడు, రామ్మోహన్లు ప్రసంగించారు. అంతకుముందు రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్, దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు నివాళులు అర్పించారు. సమావేశంలో డీసీఎంస్ మాజీ చైర్మన్ దండుగోపి, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చుక్కా అంజనప్ప, వైస్ఎంపీపీ బాబు, జెడ్పీటీసీ దాసరి పెంచలయ్య, కాకిచంద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళ కార్యదర్శి బీరంగి రేవతి, నేతలు బీఎం కుసుమకుమారి, జీ.నాగమణి, రాజంపేట ఎంపీపీ ఆరెళ్ల రమణమ్మ యాదవ్, రైల్వేకోడూరు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు తిప్పన దుర్గయ్య, రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు అంకె ఆంజనేయులు,బూత్కమిటి నియోజకవర్గ అధ్యక్షుడు తిప్పన నాగభూషణం, రెడ్డయ్య, నాగరాజు, సురేష్, చలపతి, నాగరాజు,ఓబులేశు, ప్రసాద్,నాగయ్య, రెడ్డప్ప, ఆంజనేయులు,సాయికుమార్,సంతోష్, రామాంజులు, శ్రీనివాసులు, పవన్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ఎస్సీసెల్నేతలు, ఆకేపాటి ఎస్టేట్లోని ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సీసెల్రాష్ట్ర అధ్యక్షుడు టీజెఆర్ సుధాకర్బాబు దళితవర్గాలను చైతన్యవంతులు చేయాలి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై దళితవర్గాలను చైతన్యం చేయాల్సిన బాధ్య త ఎస్సీ, ఎస్టీ అనుబంధ సంఘాల నేతలపై ఉంది. కూటమి ప్రభుత్వం పాల నలో విఫలమైంది. దళితులు ఎప్పుడూ వైఎస్సార్కుటుంబానికి వెన్నుదున్నగా ఉంటారన్నారు. దివంగత వైఎస్సార్, పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే దళితులకు ఎనలేని అభిమానం. –ఆకేపాటి అమరనాఽథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట కార్యకర్తలకే పెద్దపీట వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పెద్దపీట. జగన్ 2.0 పాలన తప్పకుండా వస్తుంది. దళితుల అభ్యున్నతి జగనన్నతోనే సాధ్యం. సమష్టి కృషితో జగన్ను మరోసారి సీఎం చేసుకుందాం. అన్ని వర్గాల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకోవడం చంద్రబాబు నైజం. దళితులకు వైఎస్సార్, జగన్ల హయంలోనే న్యాయం జరిగింది. –గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, వైఎస్సార్సీపీ కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగాయి.రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోంది. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ను మళ్లీ సీఎం చేసుకోవాల్సిన బాధ్యత దళితులు, మైనార్టీలు, పేదలపై ఉంది. –నిసార్ అహమ్మద్, ఇన్చార్జి, మదనపల్లె కూటమి పాలనలో సామాజిక అన్యాయం సూపర్సిక్స్ పథకాలతో దళితులకు గుండుసున్న వైఎస్సార్సీపీ ఎస్సీసెల్రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు -
విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : విద్యుత్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జేఏసీ చైర్మన్ జాఫర్వలి, కన్వీనర్ నరసింహులునాయక్, కో చైర్మన్ నరేంద్రనాథరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి విద్యుత్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ, రాయచోటి, రాజంపేట డివిజన్ జేఏసీల ఆధ్వర్యంలో విద్యుత్తు కార్మికులు, సిబ్బంది శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్ఛైర్మన్ రెడ్డప్పరెడ్డి, చంద్రశేఖర, జి.చంద్రశేఖర్, పాపయ్య, కె.వెంకటరమణ, మహేశ్వరయ్య, రియాజ్అహమ్మద్, సిబ్బంది పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి
రాజంపేట : రాజంపేట నియోజకవర్గ సమగ్ర అబివృద్దికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో సమస్య గుర్తించి పరిష్కరించే విధంగా పాలన సాగాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ, ప్రజారోగ్యంపై మున్సిపల్ కమిషనర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పంటలు, వాటి విస్తీర్ణం వివరాలు వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ హెచ్.భావన, రాజంపేట నియోజకవర్గ ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఎర్రచందనం దుంగలతో అటవీ అధికారులు నిందితుడి అరెస్టు చూపుతున్న అటవీ అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు అటవీశాఖ పరిదిలోని కోడూరు రేంజ్ కేవీ భావి సౌత్ బీట్ వద్ద శుక్రవారం 24 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకొన్నారు. కోడూరు రేంజర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కూంబింగ్ జరుపుతుండగా తమిళనాడు రాష్ట్రం కూనీకత్తూర్కు చెందిన వెంకటేశన్ దుంగలు తరలిస్తూ కనిపించాడు. అటవీ అధికారులు అతడిని అరెస్టు చేసి రూ.2.22 లక్షల విలువచేసే 24 దుంగలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, మహేష్శంకర్, దామోదర్, పెంచలయ్య పాల్గొన్నారు. తమిళనాడు వాసి అరెస్టు పీలేరు : పీలేరు–యల్లమంద మార్గంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్ తెలిపారు. వివరాలిలావున్నాయి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పీలేరు – యల్లమంద మార్గంలో అటవీ అధికారులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ఒక వాహనంలో రూ. 8.24 లక్షల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు డీఎఫ్వో తెలిపారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో చంద్రశేఖర్, ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. -
వేధింపులు భరించలేక భర్తను హతమార్చిన భార్య
ఆరునెలల తర్వాత విచారణలో వెలుగు చూసిన ఉదంతం మదనపల్లె రూరల్ : మద్యం తాగి గొడవపడడమేగాక, తనను కొడుతూ కూలి డబ్బులు లాక్కుని వెళ్లే భర్త వేధింపులను భరించలేని భార్య, తన తమ్ముడి సాయంతో హత్య చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సంఘటన జరిగిన ఆరు నెలల తర్వాత పోలీసుల విచారణలో ఈ సంఘటన బయటపడింది. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. సత్యసాయిజిల్లా తనకల్లు మండలం నందివారిపల్లెకు చెందిన జరిపిటి రెడ్డెప్ప కుమారుడు రామన్న(40), భార్య రమణమ్మతో కలిసి ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వచ్చాడు. రామారావుకాలనీలోని ఓ అద్దె ఇంటిలో నివాసముంటూ కూలి పనులుచేసి జీవనం సాగిస్తున్నారు. కొద్ది కాలం తర్వాత మద్యానికి బానిసైన రామన్న ఇంట్లో భార్యతో గొడవపడేవాడు. మద్యం తాగేందుకు అవసరమైస డబ్బులు భార్య నుంచి లాక్కునివెళ్లేవాడు. ఈ క్రమంలో మార్చి 12ణ మధ్యాహ్నం పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చిన రామన్న భార్యతో గొడపవడ్డాడు. అప్పటికే అతడి వేధింపులు భరించలేని ఆమె కర్రతో దాడిచేసింది. కిందపడిన అతడిపై రమణమ్మ తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో తలపై కొట్టాడు. దీంతో రెడ్డెప్ప అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య విషయం రాత్రివరకు గుట్టుచప్పుడు కాకుండా చూసిన రమణమ్మ, ఈశ్వర్ అనంతరం సంచిలో మృతదేహాన్ని మూటగట్టి బి.కొత్తకోట కస్తూర్బా స్కూల్ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తిరిగి ఇంటికి చేరుకున్నారు. తన అన్న కనిపించకపోవడంపై వదిన రమణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్పై అనుమానం వ్యక్తం చేస్తూ టూటౌన్ పోలీస్స్టేషన్లో రెడ్డెప్ప సోదరుడు ఫిర్యాదుచేశాడు. సీఐ రాజారెడ్డి విచారించి వారిని అదుపులోకి తీసుకున్నారు. బి.కొత్తకోటలో పాతిపెట్టిన విషయాన్ని తెలుసుకుని అక్కడకు వెళ్లి పంచనామా చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : కు క్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన మహేష్, గంగోత్రిల కుమారుడు తరుణ్(4) ఇంటి వద్ద ఆడుకుంటుండగా, వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి. దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆలయ స్థలాలను పరిరక్షించుకుంటాం చిట్వేలి : ఆలయ స్థలాలను పరిరక్షించుకుంటామని చిట్వేలి సోమేశ్వరాలయం కమిటీ చైర్మన్ వీరాంజ నేయులు, ఆర్గనైజర్ బొంతల నాగేశ్వరరావు, సభ్యులు మోహన్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ధర్మనిధి అఖండ సభ్యుల ఆధ్వర్యంలో శివాలయం ఆవరణంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని శుక్రవారం ఎక్సలేటర్లతో చదును చేయించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసి పరిరక్షించుకుంటామన్నారు. ఎవరైనా స్థలాల ఆక్రమణకు పాల్పడితే సహించమన్నారు. ఈ కార్యక్రమంలో శివ, నాని, కొనిశెట్టి సుబ్బరాయుడు, కడుమూరి రమణయ్య, నవీన్, తేజ, మణి, సురేంద్ర, నరసింహ, వెంకటరత్నం, ,సాయి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 252 రేషన్ బియ్యం బస్తాల స్వాధీనం రాజంపేట రూరల్ : అక్రమంగా తరలించేందుకు మండలంలోని మిట్టమీదపల్లి గ్రామంలో ఉంచిన 252 రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు బుధవారం గుర్తించారు. రాత్రి వరకు గోప్యంగా ఉంచి అనంతరం అసంపూర్తిగా ఉన్న ప్రెస్నోట్ విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఒక రోజే అటు 309 బస్తాలు లారీలో లభ్యం కావడం, ఇటు నిల్వ వుంచిన 252 బస్తాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. పే కమిషన్ సభ్యుల పేర్లు ప్రకటించాలి నందలూరు : 8వ పే కమిషన్ కమిటీ సభ్యులను కేంద్రం ప్రభుత్వం ప్రకటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యదర్శి విశ్వనాథ్ అన్నారు. రైల్వే కార్మికులతో కలిసి శుక్రవారం ఆయన నిరసన తెలిపారు. విశ్వనాథ్ మాట్లాడుతూ జనవరిలో 8వ పే కమీషన్ వేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పేర్లను ప్రకటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే తక్కువ జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం, ఆకులనాగరాజు, సాయి సందీప్, షేక్షావలి, సయ్యద్ గయాజ్, విశ్వదీపక్, శ్రీహర్ష, పి.రాజు, భరత్, లెనిన్ బాబు, పి.వెంకటేశ్వర్లు, అరుణ్కుమార్, సుశీల్కుమార్, కార్మికులు పాల్గొన్నారు. మదనపల్లె రూరల్ : నీళ్లు అనుకుని టర్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. కర్నాటకకు చెందిన సాదియా తన కుమార్తె అలీజా(2)తో కలిసి పట్టణంలోని సైదాపేటలో నివాసముంటోంది. నీరుగట్టువారిపల్లెలోని రీలింగ్ కేంద్రంలో పనులు చేస్తూ జీవిస్తోంది. శుక్రవారం పని ప్రదేశానికి కుమార్తెను తీసుకువెళ్లింది. ఆమె రీలింగ్కేంద్రంలో పనులు చేస్తుండగా, చిన్నారి ఆడుకుంటూ దప్పిక అవడంతో టర్పెంట్ ఆయిల్ను నీరు అనుకుని తాగింది. తీవ్ర అస్వస్థతకు గురికాగా, సాదియా, చిన్నారిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చింది. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మార్గ మధ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతిచెందిన చిన్నారి అలీజా, టర్పెంట్ ఆయిల్ బాటిల్ -
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు
రాజంపేట : భవిష్యత్తులో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమార్పులు ఉంటాయని ఆస్ట్రేలియాలని కాలహాన్, న్యూ సౌత్వేల్స్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.ఆసాది శ్రీనివాసులు అన్నారు. ఏయూలో సీఎస్ఈ ఆధ్వర్యంలో ఎంఎల్,డీఎల్ సాంకేతికతో జనరేటివ్ ఏఐ అనువర్తనాలు అంశంపై అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో జనరేటివ్ ఏఐ ద్వారా కొత్త ఔషధాల రూపకల్పన, రోగ నిర్ధారణకు ఎక్స్రే, స్కాన్ ఇమేజీ ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ చేయవచ్చునన్నారు. పరిశోధనలో భాగస్వామ్యం అవడానికి కావాల్సిన నైపుణ్యాలను అభివృద్ధి చేసేలా మార్గదర్శనం పొందాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్డీ స్కాలర్ జి. శ్రీనివాసులు, హెచ్వోడి డా.ఎం.సుబ్బారావు, నవీన్కుమార్, బోధనాసిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు. -
ఐదు దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లరును టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ సూచన మేరకు ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐ అల్లిబాషా, పోలీసులు రాజంపేట రోళ్లమడుగు ఫారెస్ట్ బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. శుక్రవారం ఉదయం పుట్టంగి మడుగు ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు తరలిస్తూ కంటపడ్డారు. టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని చుట్టుముట్టే ప్రయత్నించగా వారు తప్పించుకున్నారు. వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు తమిళనాడుకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ అతడిని విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
కడప రూరల్ : వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్లో ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ..లాభ–నష్టాలు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలందించడం ద్వారా వైద్య రంగంలో మెలకువలు తెలుసుకునేందుకు పేద విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పీపీపీ విదానాన్ని ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యతిరేకించారని తెలిపారు. రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలుండగా, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తగదన్నారు. 66 ఏళ్లకు కోట్ల రూపాయల ఆస్తులను రూ.5వేలకు లీజుకు ఇవ్వడం శోచనీయమని తెలిపారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటుపరం చేయడం ద్వారా సీట్లను అమ్ముకుని వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో వ్యతిరేకిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సామేల్ తదితరులు పాల్గొన్నారు. పులివెందులలో అన్ని హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. ప్రైవేటీకరణతో విద్యాబోధన సక్రమంగా ఉండదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది. – డాక్టర్ ఎస్.గౌస్పీర్, కడప రోగులకు సేవలందించే కీలకమైన వైద్య విధానంలో రాజకీయాలు తగవు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటపుడు వైద్యులు, ఇతర విద్యార్థులు, తదితర సంస్థలకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ రామచంద్రయ్య, కడప వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతి ముసుగు ఉంది. వైద్యులతోపాటు కీలకమైన పారా మెడికల్ స్టాఫ్ను పెంచాలి. కడపలో కేన్సర్ ఆస్పత్రి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు అక్కడ సిబ్బంది, సౌకర్యాలను కల్పించకపోవడం శోచనీయం. – డాక్టర్ రాంగోపాల్వర్మ, కడప ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. వైద్య విద్య కాలేజీల ప్రైవేటుపరం చేయడంతో సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఉండవు. అలాగే అక్కడికి వచ్చే రోగుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బాలిరెడ్డి, కడప -
నేడు జాబ్ మేళా
మదనపల్లె సిటీ: స్థానిక నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. జాబ్మేళాకు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్ననట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 9553202509, 6301612761 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. రాజంపేట: రాజంపేట మండలం ఆకేపాడులోని ఆకేపాటి ఎస్టేట్లో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశం శనివారం మధ్యాహ్నాం 3 గంటలకు జరుగనుంది. ఈ విషయాన్ని విభాగం జిల్లా అధ్యక్షుడు రంగాల కమలాకర్ శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జి, ఎస్సీ జిల్లా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సమావేశానికి ఎస్సీసెల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పీజే సుధాకర్బాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. ఎస్సీసెల్ విభాగంలో వివిధ హోదాలలో ఉన్న ఎస్సీసెల్ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాయచోటి: జిల్లా అభివృద్ధి విషయంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్, ఎస్పీలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి సమావేశమయ్యారు. జిల్లా అభివృద్ధి, చట్టవ్యవస్థ బలోపేతం, ప్రజాసేవలో పరస్పర సహకారంపై చర్చ, జిల్లా పోలీసు, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలన్న ఆత్మీయత, ప్రజల శ్రేయస్సుకోసం కలిసి కృషి చేయాలన్న సంకల్పం తదితర విషయాలపై చర్చించుకున్నట్లు తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీతో జిల్లా పరిపాలనలో నూతనోత్సహం, సమన్వయం మరింత బలపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కడప ఎడ్యుకేషన్: న్యూఢిల్లీలో ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సభకు కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్కు చెందిన గణిత ఉపాధ్యాయుడు సురేష్ వెళ్లి పాల్గొన్నారు. న్యూఢిల్లీ భారత మండపంలో ఈ నెల 15 నుంచి 19 వరకు జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో సుమారు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. 59వ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ (ఐఈసీ) జనరల్ మీటింగ్, ఎక్స్పోలో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అకడమిక్ డెలిగేట్గా కడప గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ గణిత ఉపాధ్యాయుడు బి.సురేష్కు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎ) ఏపీ విజయవాడ బ్రాంచ్ నుంచి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన ఐఈసీ– 2025 జనరల్ మీటింగ్కు వెళ్లి పాల్గొన్నారు. రాయచోటి: విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే నూతన ఆవిష్కరణల పోటీలకు సంబంధించి ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లను శనివారం సాయంత్రంలోపు సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయలకు సూచించారు. రాయచోటిలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ హెల్ప్ డెస్కును శుక్రవారం మధ్యాహ్నం సందర్శించారు. దసరా సెలవులు వస్తున్నందున జిల్లాలోని అన్ని పెండింగ్ పాఠశాలలు శనివారం సాయంత్రంలోపు విద్యార్థులతో ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించాలని డీఈఓ తెలియజేశారు. అలా చేయని వారు సెలవు రోజుల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నామినేషన్లు సమర్పించాలన్నారు. ఆరు నుంచి పన్నెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో దాగి ఉన్న అన్వేషణాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, సైన్స్ రిసోర్స్ పర్సన్ రంజిత్ నాయక్ పాల్గొన్నారు. -
ధనికులకే విద్య
మదనపల్లెకు వరమైన వైద్య కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడం ద్వారా ధనికులకే వైద్య విద్యను పరిమితం చేస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం అవుతారు. చంద్రబాబు బినామీలకు కట్టబెట్టే ప్రయత్నాలు విరమించి ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి. వైఎస్.జగన్మోహన్రెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు దక్కాలన్న లక్ష్యంతో కళాశాలలను ప్రారంభించారు. వీటిద్వారా కూటమి ప్రభుత్వం దోచుకునే కుట్ర చేస్తోంది. –దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
ముంచెత్తిన వాన
రాయచోటి: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి అనంతరం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి ఇంటిపై పిడుగు పడింది. దీంతో గోడలు దెబ్బతిన్నాయి ఇంటిలోపలకు పిడుగుచొచ్చుకొని వె ళ్లింది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. వర్షాలకు తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ములకల చెరువు, పెద్దతిప్ప సముద్రం, కొత్తకోట, పెద్దమండెం మండలాల్లోని చెరువులన్నీ నిండాయి. సుండుపల్లిలోని పింఛా ప్రాజెక్టులనుండి నదుల్లోకి ప్రవాహం సాగుతోంది. తెగిన చెరువుకట్ట...దెబ్బతిన్న రహదారి..... గురువారం రాత్రి కురిసిన వర్షానికి సుండుపల్లి మండల పరిధిలోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో సమీపంలోని వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించాయి. రాయచోటి– పింఛా మార్గంలోని బహుదా నదిపై నిర్మించిన రహదారి తెగిపోయింది. దీంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రమైన సుండుపల్లితో రవాణా ఆగిపోయింది. శుక్రవారం ఉదయానికి జిల్లాలోని ములకల చెరువులో 256 మిల్లీ మీటర్ల మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. పెద్ద తిప్ప సముద్రంలో 163.6, బి కొత్తకోటలో 75.4, పెద్దమండెంలో 69.6, గాలివీడు 60.8, పెనగలూరు 58.6, వీరబల్లి 55.4, తంబళ్లపల్లి 49.2, సుండుపల్లి 46.2, రాయచోటి 406., రామాపురం 40.2, వాల్మీకిపురం 32.6, రామసముద్రం 29, మదనపల్లి 28.2, కురబలకోట 28, కలికరి 25, చ్ని మండెం 20., కలకడ 18.8, నిమ్మనపల్లి 15.4, సంబేపల్లి 13.4, నందలూరు 10.4, కెవిపల్లి 12.2 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. పుల్లంపేట, ఓబులవారిపల్లి, కోడూరు మండలాల్లో చుక్క వర్షపాతం నమోదు కాలేదు. జి ల్లాలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పెనగలూరు: మండలంలో చెయ్యేరు నది నీరు ప్రవహించడంతో పల్లంపాడు గ్రామానికి గురువారం రాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. సుండుపల్లె: మండలంలోని చెరుకువాండ్లపల్లి లోని అయ్యవారి చెరువు కట్ట తెగిపోవడంతో నీరు రోడ్డు మీదకు చేరింది. దీంతో రాయచోటి– పింఛా ప్ర ధాన రహదారి దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి.పెద్దమండ్యం: వర్షానికి పెద్దమండ్యంలో కుషావతీ నది ప్రవాహంతో శుక్రవారం వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.మదనపల్లె– గాలివీడు మార్గంలో తిరిగే ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఉదయం పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల వేళలో నది ప్రవాహంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ములకలచెరువులో 256 మి.మీ వర్షం పొంగుతున్న వాగులు రాయచోటిలో ఇంటిపై పడిన పిడుగు.. తప్పిన ప్రాణ నష్టం -
ప్రజల ఆస్తి
ప్రభుత్వ ఆధ్వర్యంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి చేపట్టిన మదనపల్లె వైద్యకళాశాల జగన్ ఆస్తికాదు, ప్రజల ఆస్తి. ఇప్పటిదాకా ఎంత నిర్మాణం పూర్తయ్యిందో.. మిగిలిన పనులను ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా పూర్తి చేయాలి. దీనిని విస్మరించి చంద్రబాబు బినామీలైన కార్పొరేట్ సంస్థలకు వైద్యకళాశాలను అప్పగించి అమ్మేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గం. జగన్ చెప్పినట్టు కళాశాలను ఎవరు తీసుకున్నా తమ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రభుత్వపరం చేస్తాం. –ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు -
ఎకరం రూపాయికేనా
మదనపల్లె వైద్యకళాశాల 95 ఎకరాల కోట్ల విలువైన భూమిని ఎకరం ఒక రూపాయికి కట్టబెట్టి ద్రోహానికి పాలప్పడుతున్నారు. రూ.80 కోట్ల పనులు పూర్తయిన భవనాలను నిర్లక్ష్యం చేయడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రజలు వద్దంటున్నా టెండర్లను పిలిచి ప్రజల సొమ్మును దోచుకోంటున్నారు. వేలమందికి వైద్యం అందించే కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడంపై కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాలల నిర్వహణ చేపట్టాలి. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అడుగుపెట్టనివ్వం
మదనపల్లె వైద్య కళాశాల టెండర్లలో ప్రైవేటు వ్యక్తులు పాల్గొని ఎవరు టెండర్ దక్కించుకున్నా కళాశాల ఆవరణలోకి అడుగుపెట్టనివ్వం. కూటమి పాలనలో జలవనరుల పరంగా ప్రాజెక్టులను కోల్పోయిన ప్రజలు ఇప్పుడు పేదలకు వరమైన వైద్య కళాశాలను పోగొట్టుకునే పరిస్థితుల్లో లేరు. ఉద్యమాలు, ఆందోళనలు చేసైనా వైద్య కళాశాలను కాపాడుకుంటాం. వైద్య కళాశాల ఎదురుగానే ఆరోగ్యవరం ఉంది. ఇలాంటి ప్రాంతంలోని కళాశాలను ప్రైవేట్కు ఇవ్వడం దుర్మార్గం. –పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే -
రాకపోకలకు అంతరాయం
సుండుపల్లె మండలంలో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తోంది. ఊటచెరువు నిండి మొరవలో నీరు అధికంగా వస్తోంది. దీంతో మండల కేంద్రం నుంచి గుండ్లపల్లికు వెళ్లే రహదారి వడ్లపల్లె సమీపంలో.. ప్రధాన రహదారిపై తూముల దగ్గర మట్టి రోడ్డుపైన నీరు అధికంగా వచ్చి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ మెహబూబ్చాంద్, పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు. వాహనదారులు, ప్రజలను అటువైపు వెళ్లనీయకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఇలాగే ఉంటే రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులు తెలిపారు. –సుండుపల్లె చిన్నమండెం మండల పరిధిలోని మాండవ్యనది జలకళ సంతరించుకుంది. నదికి భారీగా నీరు వచ్చింది. నీటి ప్రవాహం వేగంగా సాగుతోంది. – చిన్నమండెం -
జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి
పీలేరు: జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పీలేరు నియోజకవర్గంలోని అన్ని శాఖల నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలని సర్పంచ్ హబీబ్బాషా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 12 నెలలుగా ఆర్వో ప్లాంట్ల వాటర్మెన్లకు జీతాలు ఇవ్వలేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, డీపీవో రాధమ్మ, జీఎస్డబ్ల్యూ ఎస్.లక్ష్మీపతి, నియోజకవర్గంలోని మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. రాయచోటి నియోజకవర్గ ప్రగతికి చర్యలు రాయచోటి: రాయచోటి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకునేలా శాఖల వారీగా ప్రాధాన్యత అంశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో రాయచోటి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగునీరు, తాగునీటిపై సమీక్ష చేసి, నియోజకవర్గంలోని చిన్న మధ్య తరహా ప్రాజెక్టులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వాన.. వెల్లువాయె!
మండలం వర్షం (మిమీ) రాయచోటి: అల్పపీడన ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారుకు పైగా వర్షం కురిసింది. రెండు రోజులుగా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటం వర్షాధార పంటలకు ఊతమైంది. జిల్లాలోని 23 మండలాల్లో మోస్తరు వర్షం కురవగా మిగిలిన ఏడు మండలాల్లో చిరుజల్లులతో సరిపెట్టుకుంది. మామిడి, బొప్పాయి, కర్బూజా, వరి, వేరుశనగ, టమాటా, ఇతర కూరగాయలు, పూల తోటలకు ఈ వర్షం రాక ఎంతో ఊరటనిచ్చింది. చీడపీడలతో ఉన్న వరిపంటకు కలిసి వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని తంబళ్లపల్లెలో 86.2 మిమీ వర్షపాతం, సంబేపల్లిలో 83.6 మిమీ వంతున అధికంగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయానికి పెనగలూరు, చిట్వేలి, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కురబలకోట, పీలేరు, కలకడ మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదైంది. పెద్దమండెం 50.6 చిన్నమండెం 46.6 గుర్రంకొండ 45.8 బి.కొత్తకోట 32.2 పెద్దతిప్పసముద్రం 31.6 ములకలచెరువు 26 రామాపురం 25.6 వీరబల్లి 25.4 రాయచోటి 24.8 లక్కిరెడ్డిపల్లి 23 పుల్లంపేట 20.6 నిమ్మనపల్లి 19.2 టి.సుండుపల్లి 15.4 రామసముద్రం 13.2 గాలివీడు 12.8 మదనపల్లి 9.2 నందలూరు 7.4 వాల్మీకిపురం 7.2 కేవీ పల్లి 6.4 కలికిరి 3.2 ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రెండు రోజులుగా.. మోస్తరుగా.. వర్షాధార పంటలకు ఊతం -
డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ వాయిదా
మదనపల్లె సిటీ : మెగా డీఎస్సీ నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. జిల్లా నుంచి మెగా డీఎస్సీలో ఎంపికై న వారిని గురువారం ఉదయం కడప ఆర్ట్స్ కాలేజీ చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. అక్కడి నుంచి విజయవాడలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి తీసుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. దీంతో నాన్ లోకల్ కింద ఎంపికై న వారు సుదూర ప్రాంతాల నుంచి కడపకు చేరుకున్నారు. ఉద్యోగం కావాలంటే నీవే కాదు తోడుగా ఒకరిని తప్పక తీసుకురావాల్సిందేనని ఆదేశించారు. దీంతో చిన్నపిల్లల తల్లులు, గర్భవతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఎంతో వ్యయపయాసాలకు ఓర్చి వెళితే వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. చేసేది లేక అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వ తీరుపై పలువురు మండిపడుతున్నారు. చదవలేదని పంపేశారంటూ విద్యార్థి ఫిర్యాదు మదనపల్లె రూరల్ : చదువురాని విద్యార్థులు పాఠశాలకు అక్కర్లేదని వివేకానంద హైస్కూల్ హెచ్ఎం రాజేంద్రబాబు తనను పాఠశాల నుంచి పంపేశారని పదోతరగతి విద్యార్థి లోకేష్ తల్లిదండ్రులతో కలిసి సబ్కలెక్టర్ చల్లా కల్యాణికి ఫిర్యాదు చేశారు. స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట హెచ్ఎం రాజేంద్రబాబు తీరుపై తల్లిదండ్రులు, బీఎస్పీ నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. లోకేష్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పాఠశాలలో పదోతరగతి చదువుతున్న పది మంది విద్యార్థులను చదువులో వెనుకబడ్డారని దుర్భాషలాడి హెచ్ఎం ఇంటికి పంపేశారన్నారు. తాము వెళ్లి హెచ్ఎంను నిలదీయడంతో చదువురాని విద్యార్థులు పాఠశాలకు వద్దని అసభ్యంగా తిట్టారన్నారు. తమ బిడ్డల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు. హెచ్ఎం రాజేంద్రబాబు వివరణ ఇస్తూ... ఆగస్టు 13వ తేదీ నుంచి లోకేష్ పాఠశాలకు రాలేదని, తల్లిదండ్రులకు విషయం తెలిపినా పట్టించుకోలేదన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రాకుంటే పాస్ కాలేరని మాత్రమే చెప్పానని, విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మిద్దెపల్లె బాలాజీ, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలి రాయచోటి టౌన్ : దివ్యాంగుల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆవరణంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ గతంలో రూ.3వేలు ఉన్న పెన్షన్ను కూటమి ప్రభుత్వం రూ.6వేలకు పెంచిందన్నారు. రూ.10 వేలుగా ఉన్న పెన్షన్ రూ.15 వేలకు పెంచడంతో దివ్యాంగుల కుటుంబాలు ఎంతో సంతోషించారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏవో సాకులు చూపుతూ సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మాత్రం బోగస్ సర్టిఫికెట్లు తొలగించమని చెప్పితే వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా అర్హత కలిగిన వారందరినీ తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం దృష్టి పెట్టి దివ్యాంగులకు న్యాయం చేయాలని కోరారు. మట్టిని తవ్వి.. అక్రమంగా తరలిస్తూ పకృతి సిద్ధంగా లభించిన మట్టిని కూటమి నేతల అండతో జేసీబీలు, ఇటాచీలతో తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. లక్షల రూపా యల మట్టి దోపిడీ చేస్తున్న వారిని అధికారులు నిలువరించలేకపోతున్నారు. సంబేపల్లి మండలం గుట్టపల్లె వద్ద పట్ట పగలే ఇలా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. గురువారం మట్టి రవాణాను అడ్డుకున్నట్లు స్థానికులు తెలిపారు. అక్రమంగా మట్టి తరలించేవారిపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు సుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపారు. – సంబేపల్లె -
పొంగుతున్న ప్రాజెక్టులు
తంబళ్లపల్లె మండలంలో బుధవారం రాత్రి కురిసిన 86.2 మి.మీ భారీ వర్షానికి ప్రాజెక్టులు నిండి మొరవ పారుతున్నాయి. 2006లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అప్పటి ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్రెడ్డి కృషి ఫలితంగా చిన్నేరు, దబ్బలగుట్ట ప్రాజెక్టులు నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది మళ్లీ మొరవ పోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వైపు ఇరిగేషన్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని, అభివృద్ధి చర్యలు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు కూడా కాలువల నిర్మాణాలు చేయలేదు. కాలువలకు తీసుకున్న భూములకు సైతం నష్టపరిహారం చెల్లించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూర్తయివుంటే సుమారు 500 ఎకరాలకు సాగునీరు అందేది. ఈ ప్రాజెక్టులలో పలు రకాల చేపలు అభివృద్ధి చెందాయి. రెండు ప్రాజెక్టుల కట్టలపై కంపచెట్లు కమ్ముకుపోయి కట్టలు దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. –తంబళ్లపల్లె -
మద్యం మత్తులో బిడ్డలపై తల్లి దాడి
మదనపల్లె రూరల్ : మద్యం మత్తులో కన్నబిడ్డలపై తాగుబోతు తల్లి దాడిచేసి, భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బుధవారం అర్ధరాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన లక్ష్మన్న, వాణి దంపతులు. వీరికి కిరణ్కుమార్(13), రుషి(12) ఇద్దరు సంతానం. కొంతకాలం క్రితం లక్ష్మన్న యాక్సిడెంట్ కేసులో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో వాణి మద్యానికి బానిసైంది. మద్యం తాగిన ప్రతిసారీ ఇంట్లో గొడవచేస్తూ కన్నబిడ్డలను విచక్షణారహితంగా కొట్టేది. బుధవారం రాత్రి ప్లూటుగా మద్యం తాగిన వాణి మరోసారి బిడ్డలు కిరణ్కుమార్, రుషిపై దాడిచేసి కొట్టింది. అడ్డుకోబోయిన తల్లి అనసూయపై దాడికి పాల్పడింది. దీంతో భయపడిన పిల్లలు ఇంటి నుంచి కేకలు వేసుకుంటూ బయటకు పరిగెత్తుకు వెళ్లి ఇద్దరు యువకులను కాపాడాల్సిందిగా అభ్యర్థించారు. ఇంతలో వాణి అక్కడకు చేరుకుని పిల్లలపై మరోసారి దాడిచేయబోగా యువకులు అడ్డుకున్నారు. వారిపై కూడా కొడవలితో దాడికి పాల్పడింది. యువకులు గాయపడిన పిల్లలు, అనసూయమ్మను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఘటనపై టూటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. వెదురు మొక్కల పెంపకం రాయచోటి : అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో డీఆర్వో మధుసూదనరావు గురువారం వెదురు మొక్కలు నాటారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా జరగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఏటా సెప్టెంబరు 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు తెలిపారు. అంతకు ముందుగా మేదరి వెదురు వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ది సంస్థ నాయకులు రాయితీపై వెదురు ఇవ్వాలని, రాయచోటిలో వెదురు క్లస్టర్ ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాయచోటి మున్సిపాల్టీ, తహసీల్దార్, రహదారులు, భవనాల శాఖ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద వెదురు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గజపనేని రెడ్డయ్య, గజపనేని వెంకటసుబ్బయ్య, ఆర్ల నాగరాజు, టంగుటూరి నాగార్జున, గజపనేని వెంకట జయప్రసాద్, నరసింహులు, ఎల్లయ్య, వెంకటా చలపతి, కోలే గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాల్ట్ పథకంతో విద్యా రంగం నిర్వీర్యం
రాజంపేట టౌన్ : సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫర్మేషన్(సాల్ట్) పథకంతో విద్యా రంగం నిర్వీర్యం అవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్జీఓ హోంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వతేదీ నుంచి 19వతేదీ వరకు నిర్వహిస్తున్న యూటీఎఫ్ రణభేరి కార్యక్రమంలో భాగంగా రాజంపేటలో పాల్గొన్నట్లు తెలిపారు. సాల్ట్ పథకంతో పాఠశాల పనిదినాల్లో శిక్షణ ఇస్తున్నారని, అనేక రకాల బోధనేతర కార్యక్రమాలను ఉపాధ్యాయులపై రుద్దుతున్నారన్నారు. ఈ పథకానికి గణాంకాలను ఇవ్వడం కోసం, గిన్నీస్ రికార్డుల కోసం ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేయడం తగదన్నారు. బోధనేతర కార్యక్రమాల బాధ్యతలను ఉపాధ్యాయులు చేస్తుండడంతో విద్యార్థులకు మెరుగైన బోధన చేయలేకపోతున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు స్వేచ్చాయుత వాతావరణం కల్పించాలని కోరారు. 2023 జూలైలో నియమించాల్సిన 12వ పీఆర్సీ ఛైర్మన్ను ఇప్పటికీ నియమించలేదని, నాలుగు డీఏలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం ఒక్కరోజు చర్చించలేదని తెలిపారు. అంతకు ముందు బోయినపల్లె నుంచి ఎన్జీఓ హోం వరకూ యూటీఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బి.లక్ష్మీరాజ, ఎస్.జయచంద్రారెడ్డి, బిళ్లా హరిప్రసాద్, జాబీర్, చెంగల్రాజు, వెంకటసుబ్బయ్య, రమణమూర్తి, నాగేంద్ర, శివయ్య తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి
కలకడ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కలకడ పోలీసుల వివరాల మేరుక. వాల్మీకిపురం మండలం దయ్యాలబండ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటరమణ భార్య శోభారాణి(34) తన వ్యక్తిగత పనులపై ఈ నెల 14న కలకడకు వచ్చింది. తిరుగుప్రయాణంలో ఇతరుల ద్విచక్ర వాహనంలో(లిప్ట్) వెళ్తుండగా.. కదిరాయచెర్వు వద్ద రోడ్డుపై వేగ నిరోధకం వద్ద వాహనం అదుపు తప్పి తలకు తీవ్రగాయమైంది. ప్రమాదంలో గాయపడ్డ శోభారాణిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. మృతురాలి తమ్ముడు శబరీష్ ఫిర్యాదుమేరకు హెడ్ కానిస్టేబుల్ రమేష్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ బియ్యం విక్రయించడం నేరం పుల్లంపేట : రేషన్ బియ్యంను ప్రజలు విక్రయించటం చట్టరీత్యా నేరమని తహసీల్దార్ పుల్లారెడ్డి అన్నారు. మండలంలోని జాగువారిపల్లి పొలిమేరలో గురువారం అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీ బురదలో ఇరుక్కుపోయింది. ప్రజలు గుర్తించి పుల్లంపేట తహసీల్దారు పుల్లారెడ్డికి సమాచారం అందించారు. రైల్వే కోడూరు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ డి.శ్రీనివాసులు తనిఖీచేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఈ లారీని బీదర్ జిల్లా వంగూరు గ్రామానికి చెందిన క్రాంతికుమార్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలియజేశారు. అందులో 50 కిలోల బియ్యం బస్తాలు 309 ఉన్నట్లు శ్రీనివాసులు తెలియజేశారు. బియ్యాన్ని రాజంపేట స్టాక్ పాయింట్కు తరలించి లారీని సీజ్ చేశారు. కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
మదనపల్లె రూరల్ : డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి నిమ్మనపల్లె మండలం బోయకొండ సమీపంలోని మామిడి తోటలో పేకాడుతున్నారనే సమాచారంతో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. ఆరుగురు జూదరులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 వేల నగదు 16 ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కే.మహేంద్ర తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నిమ్మనపల్లె మండల సరిహద్దులో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో డ్రోన్ సాయంతో జూద స్థావరాన్ని గుర్తించామన్నారు. ఎస్ఐలు రహీముల్లా, అన్సర్ బాషాల బృందం దాడులు నిర్వహించి మదనపల్లెకు చెందిన ఈ.శ్రీనివాసులు, వి.శ్రీరాములు, కలికిరికి చెందిన వెంకటరమణ, పుంగనూరుకు చెందిన అక్కులప్ప, రెడ్డెప్పనాయక్, హరిలను అరెస్ట్ చేశారన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించామన్నారు. ఎవరైనా పేకాట ఆడినా, నిర్వహించినా సాంకేతికత సాయంతో గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ములకలచెరువు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు అన్సర్బాషా, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. డ్రోన్లతో జూదగాళ్లపై పోలీసుల నిఘా రాయచోటి : జిల్లాలో ఆసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేలా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి నిర్ణయం పేకాట రాయుళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే కార్యక్రమానికి ఎస్పీ పూనుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా పేకాట, ఇతర జూదాలు, అసాంఘిక కార్యక్రమాలు జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సమయంలో ఎస్పీ నిర్ణయం జిల్లా ప్రజలకు కొంత ఊరటనిస్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. పేకాట స్థావరాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో డ్రోన్ల సాయంతో పారిపోతున్న వారిని పట్టుకోవడం సులభతరంగా మారింది. డ్రోన్ కెమెరాల సహాయంతో జూదం, బహిరంగ మద్యపానం లాంటి చట్ట వ్యతిరేక పనులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిమ్మనపల్లి అటవీప్రాంతంలో చేపట్టిన డ్రోన్ల ద్వారా చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైనట్లు పోలీసులు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని వదిలిపెట్టరాదని ఎస్పీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎక్కడైనా అసాంఘిక సంఘటనలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందిస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి నిర్వహకులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్పీ జిల్లా ప్రజలకు సందేశం ఇచ్చారు. 16 బైక్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనంపేకాట స్థావరంపై దాడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మహేంద్ర మామిడితోటలోని పేకాటస్థావరం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం
రాయచోటి : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పది మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడం తగదన్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ పెట్టి సామాన్యులకు సైతం మెడికల్ కోర్సులు అందుబాటులోకి తెచ్చే విధంగా 17 కాలేజీలను మంజూరు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి ప్రైవేటీకరణకు పూనుకోవడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత వైద్యం అందకుండాపోతుందన్నారు. వెంటనే 107, 108 జీఓలను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించి గత ప్రభుత్వం రూ.390 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఇందులో రూ.20 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన మెడికల్ కళాశాలను నేడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమంటే వైద్య రంగం కేవలం కార్పోరేటర్ల కోసమేనా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పి మణి, రామాంజులు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి వెంకటేశ్వర్లు -
ఉపాధ్యాయుడి హఠాన్మరణం
చిన్నమండెం : మండలంలోని టి.చాకిబండ జడ్పీ హైస్కూల్(తెలుగు)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్రెడ్డి(55)కి పాఠశాలలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. రోజు మాదిరిగా ఉదయం పాఠశాలకు వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా తూర్పుపల్లి వద్దకు రాగానే మృతి చెందారు. శ్రీధర్రెడ్డి సొంత ఊరు సంబేపల్లె మండలం మొటుకువాండ్లపల్లె. ప్రస్తుతం చిన్నమండెం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మండలంలోని తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.వైన్ షాపులో చోరీగుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండలోని ఆర్కే బ్రాందీషాపులో చోరీ జరిగింది. స్థానిక తూముకుంట రోడ్లో ఆర్కే బ్రాందీషాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం వేకువ జామునే గుర్తుతెలియని దుండగులు బ్రాందీషాపు పైభాగంలో రేకు కత్తిరించి దుకాణంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని ఓ ల్యాప్టాప్, రూ.50 వేల విలువ చేసే మద్యం సీసాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ రఘరామ్ సిబ్బందితో కలసి వచ్చి వైన్ షాపు, చోరి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.ఎరచ్రందనం దుంగలు స్వాధీనంతిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కేవీ.బావి అటవీ ప్రాంతంలో తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, సిబ్బంది కోడూరు పరిధిలోని కెవీ.బావి ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నొక్కోడి గుండం వద్ద కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ఫోర్స్ పోలీసులను చూసి వారు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో పాటు వారిద్దరినీ తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి హత్యకేసులో సంచలన తీర్పు
రాజంపేట : ఎర్రబల్లికి చెందిన నర్రెడ్డి సమిత్రమ్మ(60) హత్య కేసులో రాజంపేట మూడో అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితురాలు వెలమచల ఇందిరమ్మకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. పట్టణ సీఐ నాగార్జున, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2019 మే, 2న తన తల్లి నరెడ్డి సుమిత్రమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంట్లో బంగారు వస్తువులను దోచుకెళ్లారని మృతురాలి కుమారుడు నర్రెడి్డ్ మహీధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పటి సీఐ నిరంజన్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ దర్యాప్తు చేసి 2020 మార్చి, 9న వెలచలమల ఇందిరమ్మ(దేవరపల్లె, వెలిచలమల్ల పంచాయితీ,నంబూలపూలకుంట మండలం,అనంతపురం జిల్లా), నర్రెడ్డి శ్వేత(ఎర్రబల్లి,రాజంపేటటౌన్), ఓర్సు నాగరాజు (డ్రైవర్, కొండ్లవాండ్లపల్లె,నంబూపూలకుంట మండలం, అనంతపురం), మల్లెల రమేష్ (కూలి, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం, అనంతపురం), ఒర్సు మల్లికార్జున (డ్రైవర్, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం అనంతపురం)లను అరెస్టు చేశారు. వారి వద్ద మృతురాలికి చెందిన సరుడు, రెండు గాజులు, డైమండ్ నెక్లస్, జత కమ్మలు, రెండు వెండి దీపాలు, హత్యకు ఉపయోగించిన దిండు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ చంద్రశేఖర్ వారిపై చార్జ్షీట్ దాఖలు చేయగా మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలు నిజమని తేలడంతో వెలిచెలమల ఇందిరమ్మ(47)కు జీవిత ఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో నేరారోపణ రుజువు కానందున నర్రెడ్డి శ్వేత, ఒర్సు నాగరాజు, మల్లెల రమేష్, ఒర్సు మల్లికార్జున (విచారణలో మరణం)లకు విముక్తి కలిగించారన్నారు. సీఐ నిరంజన్కుమార్, హనుమంత్నాయక్, ఎం.చంద్ర శేఖర్, పీపీ షేక్జానీ, ప్రస్తుత పీపీ కొమ్మినేని వేణుగోపాల్, జీ.సుబ్బరాయుడు, ఏఎస్ఐ శంకరయ్యలను రాజంపేట ఎఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే అభినందించారని వెల్లడించారు. కేసులో ఇందిరమ్మకు జీవిత ఖైదు -
పింఛా ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్
వివరాలు తెలుసుకుంటున్న సబ్ కలెక్టర్ భావన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు సుండుపల్లె : మండలంలోని పింఛా ప్రాజెక్టును రాజంపేట సబ్ కలెక్టర్ భావన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకు జరిగిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చే జల వనరులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి పంపిణీ తీరుపై ఆరా తీశారు. ప్రాజెక్టు వద్ద వాతావరణం ఆహ్లాద కరంగా ఉందని, పర్యటకులకు మరిన్ని వసతులు కల్పించి పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టిరోడ్డు సుండుపల్లె : పింఛా ప్రాజెక్టు పైభాగంలో మోస్తరు వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. దీంతో నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహానికి రాయవరం బహుదా నదిపై ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పీలేరు పట్టణం కట్టుకాలువ వీధికి చెందిన షేక్ ముబారక్ (25) పట్టణంలోని కడప రోడ్డు మార్గంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారనిమిత్తం ఆన్లైన్ యాప్లో అప్పు తీసుకుని వ్యాపారం నిర్వహించాడు. వ్యాపారం సరిగ్గా జరగక అప్పు చెల్లించలేక ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో ఆన్లైన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తాళలేక మంగళవారం తన ఇంటిలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కూలిన పాఠశాల గోడ చిట్వేలి : చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీకి సంబంధించిన గోడ బుధవారం కురిసిన వర్షానికి ఒకచోట కూలిపోయింది. పాఠశాల ప్రారంభంగాక మునుపే ఉదయం ఏడు గంటల సమయంలో గోడ కూలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సంఘటనా స్థలాన్ని ప్రధానోపాధాయులు దుర్గరాజు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పక్షవాతాన్ని జయించలేక ఇంటిలోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఓ యువతి తనువు చాలించింది. పట్టణంలోని పాత రాయచోటిలో నివాసముంటున్న గౌస్ మొహిద్దీన్ భార్య షేక్ మునీరా(39) గత ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆసుపత్రులలో చికిత్స పొందినా.. ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో మానసికంగా కుంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. సాయంత్రం 5.30గంటలకు భర్త వచ్చి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పేద విద్యార్థులకు వైద్యరంగంలో మరింత అవకాశాలు కల్పించాలనే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడకల్ కాలేజీల స్థాపనకు శ్రీకారం చుట్టిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని అందరూ వ్యతిరేకించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగం రెడ్డకిశోర్దాస్ అన్నారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.8,500 కోట్ల వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోపిడీ చేయగా ప్రభుత్వాసుపత్రులు మాత్రం పేదలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.2.15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం ఆపేయాలన్నారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 19న ఉదయం 9.30 గంటలకు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటోరియం వద్ద చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామని రెడ్డికిశోర్దాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
రూ.20వేల చెక్కును రూ.2.20 లక్షలుగా మార్చి
● పెద్దినేనికాలువ సర్పంచ్ బంధువు ఫోర్జరీ ● చెక్కు మార్చారని ప్రశ్నిస్తే అధికారులపై దూషణపర్వం ● గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శికి గుండెపోటు సుండుపల్లె : గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఇచ్చిన రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలకు మార్చిన సంఘటన సుండుపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. పెద్దినేనికాలువ పంచాయతీలో పనులు చేసినందుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి సర్పంచ్ సంతకంతో కూడిన రూ.20 వేల చెక్కును ఆ సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్రెడ్డి సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్రకు రాసి ఇచ్చారు. అయితే ఆ సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్ర రూ.20 వేల చెక్కులో అంకెలు మార్చి రూ.2.20 లక్షలుగా రాసి ఆ నగదును తన సొంత అకౌంట్లోకి జమచేసుకున్నాడు. పంచాయతీ నిధుల నుంచి రూ.2.20 లక్షల నగదు డ్రా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి చరవాణికి సమాచారం రావడంతో చూసి ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే తమపై అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ సురేష్బాబుతో కలిసి బ్యాంకుకు నిధులు ఆపాలని బ్యాంకు మేనేజర్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు నిధులు డ్రా చేసిన వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేశారు. అప్పటికే ఆ అకౌంట్ నుంచి రూ.20 వేల నగదు డ్రా చేసినట్లు వారు తెలిపారు. రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలుగా ఎందుకు మార్చావని డ్రా చేసిన వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి ప్రశ్నించగా తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెనొప్పి వస్తుండటంతో సిబ్బంది గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వాహనం ఢీకొని మహిళ మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన పెద్దరెడ్డెప్ప భార్య శెట్టిపల్లె జయమ్మ(54) మంగళవారం పొలం వద్దకు నడచి వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయమ్మ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ.. కలికిరి : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కలికిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన పాలగిరి నూరుల్లా తన భార్య షరీఫా(46)తో కలిసి ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి క్రాస్ రోడ్డుకు బయలుదేరారు. వెనుకవైపు నుంచి వచ్చిన మదనపల్లె డిపో బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షరీఫాను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. కారు ఢీకొని ఒకరు దుర్మరణం సంబేపల్లె : మండలంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఓ కారు స్కూటర్ను డీ కొన్న ప్రమాదంలో భాస్కర్రెడ్డి(77) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం బాలయ్యగారిపల్లెకు చెందిన నగిరిమడుగు భాస్కర్రెడ్డి స్కూటర్లో సొంత పనుల నిమిత్తం కలకడకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బాలయ్యగారిపల్లె క్రాస్ సమీపంలో రాయచోటి నుంచి చైన్నెకి వెళ్తున్న కారు స్కూటర్ను ఢీకొనడంతో భాస్కర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటితాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ఎర్రగుంట్ల : మండలంలోని హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దుద్దేల శ్యామల(42) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. శ్యామలకు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి కనిపించలేదు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. -
ఆర్టీసీ అద్దెబస్సు బోల్తా
సిద్దవటం : సిద్దవటం నుంచి కడపకు వెళ్తున్న ఏపీ39యుజీ4591 నెంబర్ అల్ట్రా పల్లె వెలుగు ఆర్టీసీ అద్దె బస్సు బుధవారం భాకరాపేట సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో బస్సు డ్రైవర్ వెంకటనారాయణ, కండెక్టర్ శివయ్యతోపాటు భారతీ, వెంకటేష్, సుబ్బనరసమ్మ, లక్ష్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. అద్దె బస్సు డ్రైవర్ వెంకటనారాయణ కథనం మేరకు..భాకరాపేట సమీపంలోని పెద్దవంక కల్వర్టు వద్ద కడప నుండి బద్వేల్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తుండగా కల్వర్టు రహదారిపై బస్సు నిలిపివేయడం జరిగిందన్నారు. బస్సులో అరవై మందికిపైగా ప్రయాణీకులు ఉన్నారని, బస్సు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కండక్టర్ శివయ్యపై ప్రయాణికులు పడటంతో చేతికి గాయాలయ్యాయన్నారు. మరో నలుగురు ప్రయాణీకులకు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. విషయాన్ని తెలుసుకున్న 11వ బెటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులుగొట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, బద్వేల్, కడప ఆర్డీఓలు జాన్ఇర్విన్, చంద్రమోహన్, 11వ ఏపీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, కమాండెంట్ ఆనంద్రెడ్డి, ఒంటిమిట్ట సీఐ బాబు, ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఆర్అండ్బీ ఏఈ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు మాధవీలత సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకొని బోల్తాపడిన ఆర్టీసీ బస్సును రెండు క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కల్వర్టు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. డ్రైవర్, కండక్టర్తో సహా, నలుగురికి స్వల్ప గాయాలు -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని తెలిపారు.బుధవారం మండలంలోని చింతరాజుపల్లి పంచాయతీలోగల చింతరాజుపల్లి హరిజనవాడ, గాండ్లపల్లి గ్రామాలలో విష జ్వరాలు, కీటక వ్యాధులపై మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ ఐ సుబ్బరాయుడు, మండల వైద్యాధికారి డాక్టర్ భావనతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేశారు. ఇంటింటికి తిరిగి లార్వా, వైరల్ జ్వరాల సర్వే నిర్వహించారు. అక్కడ అనారోగ్యంతో బాధఫడుతున్న కొంతమందికి విష జ్వరాలకు సంబంధించి రక్త పరీక్షలు చేయగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్ద మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మలేరియా అధికారు పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ జి భాస్కర్ రెడ్డి, ఏ లక్ష్మీనరసమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్ కరిమున్నీషా, ఎ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
కష్టపడి పనిచేసేవారికి విశ్వకర్మ ఆదర్శం
రాయచోటి: వృత్తులకు ఆధ్యుడైన దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయను స్ఫూర్తిగా తీసుకుని చేతి, కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఆర్ఓ మధుసూదన్ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. డిఆర్ఓ మధుసూదన్ రావు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాడవులకోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారన్నారు. విశ్వకర్మను దివ్య వడ్రంగి అని కూడా భావిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సురేష్, కలెక్టరేట్ ఏఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఘన నివాళి: విశ్వకర్మ భగవానుడు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి ఆదేశాల మేరకు రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా (ఆర్కిటెక్చర్), ఆధ్యుడిగా భావిస్తారన్నారు. చేతి వృత్తుల కళాకారులు, ఇంజినీర్లు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
రాయచోటి: జిల్లా ప్రజల భద్రతను కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. జిల్లా నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. నేరాల నివారణకు పటిష్ట చర్యలు, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన నిబంధనలు అమలుతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా పారదర్శక సేవలు అందించాలని, నేరస్తులకు కఠిన శిక్ష, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే పోలీసు వ్యవస్థ లక్ష్యమని సూచించినట్లు తెలియపరిచారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, న్యాయం, శాంతి స్థాపనలో తన వంతు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. -
పంట నమోదు ప్రక్రియ తనిఖీ
రాయచోటి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం, ఎగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను జేసీ పరిశీలించారు. రాయచోటి అర్బన్ ఆర్ఎస్కె ఇన్చార్జిని పంట నమోదు ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలకు పంట నమోదు ముఖ్యమన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ, మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్, విఏఏ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ .వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ విద్యార్థులకు సీఓఏ(కౌన్సిల్ ఆఫ్ అర్టికల్చర్) నుంచి కోర్సులకు అనుమతులు, ఎన్రోల్మెంట్ నంబర్లు మంజూరయ్యాయని వైస్ చాన్సలర్ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో ఆర్కెటెక్చర్ విభాగానికి సంబంధించి 2020–21, 2021–22, 2022–23 బ్యాచ్ల విద్యార్థులకు సీఏఓ నుంచి కోర్సు అనుమతులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్ఆర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9.00 గంటలకు జమ్మలమడుగులోని సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదివి ఉండాలన్నారు. 18–40 సంవత్సరాల మధ్య వయస్సుగల అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన సూచించారు. రాయచోటి టౌన్: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం వృద్ధి చెందుతుందని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మినరసయ్య అన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో రాయచోటి ఏరియా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలకు పాల ద్వారా బలమైన ఆహారం అందుతుందన్నారు. మహిళలు సమయానుకూలంగా వైద్యుల సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ మధుకర్, డాక్టర్ డి. సంద్య, డాక్టర్ శివప్రతాప్, ఏరియా ఆస్పత్రి సూపరిడెంటెంట్ డాక్టర డేవిడ్ సుకుమార్, ఐసీడీఎస్ పీడీహైమావతి, దేవశిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు
సాక్షి రాయచోటి: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిషాంత్కుమార్, ఎస్పీ ధీరజ్లకు సమస్యలు సవాలుగా మారనున్నాయి. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4న ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆరు నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పీఎస్ గిరీషా, అభిషిక్త్ కిశోర్, చామకూరి శ్రీధర్లు పనిచేయగా, నూతనంగా నాలుగో కలెక్టర్గా నిషాంత్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపోలీసు సూపరింటెండెంట్లుగా మొదటగా హర్షవర్దన్రాజు, గంగాధర్రావు, కృష్ణారావు, విద్యాసాగర్నాయుడులు పనిచేయగా జిల్లా ఐదో ఎస్పీగా ధీరజ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించగానే విజయవాడలో సీఎంతో కలెక్టర్లు, ఎస్పీల సమీక్షల నేపథ్యంలో అక్కడికి వెళ్లారు. అయితే జిల్లాలో వేళ్లూనుకున్న సమస్యలు, ఇతర శాంతిభద్రతల పరంగా అనేక రకాల సమస్యలు కలెక్టర్, ఎస్పీలకు సవాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో సాగని అభివృద్ధి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనంతరం వైఎస్ జగన్ సర్కార్ హయాంలో అభివృద్ధి పరంగా పరుగులు తీసింది. ఎక్కడికక్కడ జాతీయ రహదారుల్లో మహానీయుల విగ్రహాలు, డివైడర్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల ఏర్పాటు ఇలా ప్రతి ఒక్క పని పరుగులు పెట్టింది. డీఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం, సచివాలయాలు, ఆర్బీకేలు ఇలా చెబుతూ పోతే చాలావరకు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. కొత్తహంగులు అద్దుకునే దశలో పనులు పెండింగ్లో పడిపోయాయి. ప్రధానంగా క్రికెట్ స్టేడియం, శిల్పారామం, నగరవనం, ఎంఐజీ లేఅవుట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్కడక్కడ రోడ్లు మినహా మిగతా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రణాళికతో నూతన కలెక్టర్ పెండింగ్ పనులతోపాటు ఇతర అభివృద్ది పనులను పరుగులు పెట్టించాలని ప్రజలు కోరుతున్నారు. ● జిల్లాకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు ఉన్నాయి. మదనపల్లె, సిద్దవటం మండల పరిధిలోని చేనేత రంగం బాగా పటిష్టంగా ఉంది. అక్కడ ప్రభుత్వ పరంగా టెక్స్టైల్స్ పరిశ్రమలు తేవడం ద్వారా పలువురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట చెక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధి. అలాగే రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, రాజంపేట, పీలేరు ప్రాంతాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటల సాగు అధికంగా ఉంది. హార్టికల్చర్ పరంగా ఏదైనా అభివృద్ది చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. జ్యూస్, గుజ్జు పరిశ్రమలు తీసుకు రావడం ద్వారా అటు రైతులకు, ఇటు యువతకు ఉపాధి లభిస్తుంది. తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో గ్రానైట్తోపాటు మైనింగ్ పరిశ్రమలు ఉన్నాయి. మంగంపేటలో పేరెన్నికగన్న బైరెటీస్, ముగ్గురాయి పరిశ్రమలు ఉన్నాయి. ఏపీఎండీసీపై ఆధారపడి వందల సంఖ్యలో చిన్నచిన్న పరిశ్రమలు ఉన్న నేపద్యంలో పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తే పెద్ద ఎత్తున ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరితేరిన అక్రమార్కులు జిల్లాలో శాంతిభద్రతల పరంగా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోయినా చాలాచోట్ల అక్రమార్కులు ఆరితేరిపోయారు. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తూ అధికారం మాటున సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం పేకాట, దౌర్జన్యాలు, దాడులు అధికంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రచందనానికి ప్రసిద్ధిచెందిన శేషాచలం అడవుల నుంచి అక్రమార్కులు దుంగలను తరలిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులతో అప్పుడప్పుడు కొన్ని దుంగలు దొరకుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రతినిత్యం ఆవులు, పశువులను పెద్ద సంఖ్యలో లారీలలో తరలిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాయచోటి, మదనపల్లె మీదుగా బెంగుళూరుకు పెద్ద ఎత్తున పశువుల దందా సాగుతోంది. ఇందులో భాగంగా పలువురు పోలీసులతో మామూళ్లు మాట్లాడుకుని పశువుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నట్లు పోలీసు వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్జిల్లాలోనే ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన మదనపల్లెలో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో గంజాయి చాపకింద నీరులా విద్యార్థుల దరిచేరుతోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో ఇద్దరు విద్యార్థులు గంజాయి మత్తులో రైలు కిందపడి మృతి చెందారు. మదనపల్లెలో కూడా గంజాయి వాసనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల అనేక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. క్షణికావేశంలో జరిగే హత్యలు కొన్ని అయితే, ఓ సీఐ తల్లికి మాటమాటలు చెప్పి నగలు దోచుకుని మట్టుబెట్టిన వైనం గతంలో సంచలనం సృష్టించింది. బాలలపై అఘాయిత్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. జిల్లా ఎస్పీగా బాద్యతలు చేపట్టిన ధీరజ్ మదనపల్లైపె కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్, రాయచోటి–చిత్తూరు జాతీయ రహదారితోపాటు కడప–రేణిగుంట ప్రధాన రహదారిలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు జిల్లాలో భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగింది. రాయచోటి ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై నూతన ఎస్పీ ఉక్కుపాదం మోపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్వాగతం పలుకుతున్న సమస్యలు జిల్లాలో ఎక్కడ చూసినా పేకాట, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు మదనపల్లె కేంద్రంగా హత్యలు అధికార పార్టీ ఆగడాలు, పెరిగిపోయినభూ ఆక్రమణలు, కబ్జాలు శేషాచలం అడవుల నుంచి తరలిపోతున్న ఎర్ర బంగారం -
వైఎస్ఆర్ జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లిపంట కోతలు ప్రారంభించారు. తడికి ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం వరిపంట సాగు చేసిన రైతులకు చాలా మేలు.వరికి సోకిన చీడపీడలు తొలిగి పంట ఏపుగా పెరిగే అవకాశశం ఉంటుంది. మిగతా ఆరుతడి పంటలైన పత్తి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలకు, మామిడి, సపోట, చీని, నిమ్మ, డ్రాగెన్ ప్రూట్ వంటి ఉద్యాన పంటలకు కూడా ఈ వర్షం మేలేనని రైతులు తెలిపారు. చాపాడులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్లు, కాశినాయనలో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది. -
ఆర్భాటం.. హంగామా?
మదనపల్లె సిటీ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాను తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ● ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లారు. న్యా యం చేయాలని వేడుకున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అఽ దికారులు సమాధానం చెప్పలేని స్థితిలో మిగిలిపోయారు. ● గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఇందులో పలు అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు.ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది నష్టపోయారు. ● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాలు పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 500 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. డీఎస్సీకి ఎంపికై న వారిలో గర్భిణులు, చంటిపిల్లల తల్లులు కూడా ఉన్నారు. వీరు అంతదూరం వెళ్లాలంటే ఇబ్బందులు పడాలి. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా! మండిపడుతున్న అభ్యర్థులు -
దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర
కలికిరి: దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని సీఆర్పీఎఫ్ డీఐజీపీ అనుపమ్ శర్మ అన్నారు. కలికిరి సీఆర్పీఎఫ్ (సీఐఏటీ–3) 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం(ఎల్డబ్ల్యూఈ) ప్రాంతాల్లో మోహరించిన దళాలకు కౌంటర్ ఇన్సర్జెన్సీ శిక్షణను అందించడానికి తమిళనాడు రాష్ట్రం అవడిలో 2014 సెప్టెంబరు 15న గ్రూప్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, తరువాత కలికిరిలో ప్రస్తుతం పూర్తి స్థాయి శిక్షణా సంస్థగా ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. సైనిక్ సమ్మేళన్ నిర్వహించి కేంద్రంలో జరుగుతున్న వివిధ రకాల శిక్షణ, వసతి, ఇంకా అవసరమైన సదుపాయాలపై వివరించారు. జవాన్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సీఆర్పీఎఫ్ దేశ సేవలో ముందుంటుందని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలికిరి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీఐఏటీ స్కూల్ కమాండెంట్ రాజేష్కుమార్, అధికారులు, జవాన్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
7 నుంచి భవ్య గుజరాత్ యాత్ర
కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భవ్య గుజరాత్ యాత్రను చేపట్టనున్నామని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కడప రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాత్రకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజులపాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని వివరించారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతోపాటు ప్రతి యాత్రికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.18,400.. 3 టైర్ ఏసీ టిక్కెట్ రూ.ఽ30,200.. 2 ఏసీ టిక్కెట్ ధర రూ.39,900 గా నిర్ణయించారని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం బి.యేసయ్య (9281495853), కె.పవన్కుమార్ ( 8287932313)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ప్రతినిధులు భాస్కర్ బాబు, యేసయ్య, ఈరన్న, దుర్గాప్రసాద్, ఇన్చార్జి స్టేషన్ మేనేజర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు
అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వారం రోజులుగా తన సమస్య పట్టించుకోలేదనే మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాఽధితురాలి వివరాల మేరకు.. మండలంలోని సీటీఎం పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన మల్లికార్జున భార్య యశోద(32) ఏడాది కిందట భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. తన భర్త హార్ట్ పేషంట్ కావడంతో వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం కోసం, డ్వాక్రా గ్రూపులో రూ.4 లక్షల రుణం తీసుకుంది. భర్తతో విడిపోయే సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తానని మల్లికార్జున ఒప్పందం చేసుకున్నారు. అయితే అప్పు చెల్లించకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు యశోదపై ఒత్తిడి తెచ్చారు. రుణం నీవు తీసుకున్నావు చెల్లించాల్సిందేనని పట్టుపట్టారు. తన సమస్యను పరిష్కరించాలని తాలూకా పోలీసు స్టేషన్కు వచ్చి యశోద ఫిర్యాదు చేసింది. పోలీసుల ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ యశోదను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ బాఽధితురాలు యశోద ఎనిమిది నెలల క్రితం భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నారు. ఆమె భర్త పిల్లలను పోషిస్తూ అప్పులు చెల్లిస్తూ, గుండె వైద్యం చేయించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం అతడి భార్య యశోధ గ్రామంలోని ఇంటిని సైతం ఆమె పేరుపై మార్చి ఇవ్వాలని, పెద్ద మనుషులను తీసుకుని తాలూకా స్టేషన్కు వచ్చిందన్నారు. ఇది సివిల్ సమస్య కావడంతో కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. వారం రోజులుగా స్టేషన్కు వచ్చినట్లు చెప్పడం అవాస్తమన్నారు. -
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
నిఖిల్గౌడ్(153 పరుగులు) కనిష్(5 వికెట్లు) వికాస్(109 పరుగులు) మహేంద్రారెడ్డి(239) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లో రెండో రోజున చిత్తూరు, అనంతపురం జట్లు భారీ స్కోర్లు చేశాయి. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 375 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 103.3 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని నిఖిత్ గౌడ్ అద్భుతంగా బ్యాంటింగ్ చేసి 22 ఫోర్లతో 153, బాలాజీ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని కనిష్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు, సాయి సూర్యతేజరెడ్డి రెండు, అక్షిత్రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 68 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 46, ధనుష్ నాయుడు 46 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బ్రహ్మ సాయి తేజ్రెడ్డి మూడు వికెట్లు తీశాడు. కర్నూలు జట్టు ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో...... వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 364 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 150.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 537 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని మహేంద్రారెడ్డి 30 ఫోర్లుతో అద్భుతంగా చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 239, వికాస్ 109 పరుగులు చేశాడు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ మూడు, నరసింహ రెండు, చెన్నారెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 29 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయరామిరెడ్డి 59 పరుగులు, భరత్రెడ్డి 40 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
కొత్త సార్లొస్తున్నారు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు. కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇటీవల అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియను కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు గానూ, 680 మందిని ఎంపిక చేస్తూ తుది జాబితా విడుదల చేసింది. మరో 32 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ భర్తీ చేయకుండా మిగిల్చింది. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్నీ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించేవారు. కూటమి ప్రభుత్వం అలాకాకుండా సంబంధిత అభ్యర్థి లేకపోతే అ పోస్టును వదిలేసి తరువాత డీఎస్సీలో భర్తీ చేస్తామని చెబుతోంది. నిరుద్యోగిత పెరిగిన పరిస్థితుల్లో 32 పోస్టులు మిగిల్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలువుల్లో చేరే వారికి శిక్షణ... కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 680 మంది అభ్యర్థులకు ఈ నెల 19న అపాయింటెంట్ అ ర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎంపికైన స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ లకు శిక్షణ అనంతరం వారికి స్థానాలు కేటాయించి పంపనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం ఉంది. ఎంపికైన జాబితా వివరాలు... సబ్జెక్టు నోటిఫైడ్ ఎంపిక పోస్టులు చేసినవిఎస్ఏ సంస్కృతం 01 01 ఎస్ఏ తెలుగు 26 25 ఎస్ ఉర్దూ 07 06 ఎస్ఏ హింది 18 18 ఎస్ఏ ఇంగ్లీస్ 81 78 ఎస్ మ్యాథ్స్ 44 44 ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ 01 01 ఎస్ఏ పీఎస్ 29 29 ఎస్ఏ పిఎస్ ఉర్దూ 03 01 ఎస్ బయాలజీ 52 50 ఎస్ఏ బయాలజీ ఉర్దూ 02 02 ఎస్ఏ సోసియల్ స్టడీ 60 58 ఎస్ఏ ఎస్ఎస్ ఉర్దూ 05 05 ఎస్ఏ పిఈ 82 80 ఎస్జిటి తెలుగు మీడియం 256 254 ఎస్జిటి ఉర్దూ మీడియం 45 28 మొత్తం 712 680 ఎంపిక తుది జాబితా విడుదల డీఈఓ ఆఫీసు, కలెక్టరేట్ల వద్ద జాబితా ప్రదర్శన జిల్లాలో 712 పోస్టులకు 680 మంది ఎంపిక 19న కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెల 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ? -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి..
మదనపల్లె రూరల్ : అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతిచెందిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. శానిటోరియం కొత్తపల్లెకు చెందిన సందీప్, రుక్మిణి దంపతుల కుమారుడు సుచిత్(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీసీఏ చదువుతున్నాడు. తండ్రి సందీప్ ఎనిమిదేళ్ల కిందట చనిపోగా, తల్లి రుక్మిణి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో సుచిత్, అవ్వ సుగుణమ్మతో కలిసి శానిటోరియం కొత్తపల్లెలో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడి నిద్రపోయిన సుచిత్ ఉదయం బాత్ రూమ్లో చీరతో ఉరివేసుకున్నాడు. అవ్వ సుగుణమ్మ గమనించి బిగ్గరగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చురీ గది వద్ద డీఎస్పీ మహేంద్ర, సీఐ కళా వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించారు. మృతిపై సందేహాలు ఉండడంతో అవ్వ సుగుణమ్మ ఫిర్యాదుమేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతికి ప్రేమ వ్యవహారం కారణమా...? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
వరి రైతు విలవిల..
రాయచోటి : వర్షాకాలంలో తెగుళ్లతో వరి రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు ఇపుడు తమ వరి పైరుకు తెగుళ్లు సోకడంతో లబోదిబోమంటున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులకు వరి పంటకు కంకినల్లి, దోమ, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. వరి కర్రలు ఎర్రబారిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు 11432 హెక్టార్లకుగానూ, లోటు వర్షపాతం కారణంగా ప్రస్తుతం 4154 హెక్టార్లలో వరి సాగు చేశారు. 11 వేల ఎకరాలలో టమాట, 5వేల ఎకరాల్లో వంగ, మిరప పంటలు సాగుచేశారు. ఈ సారి వరిపంటకు తెగుళ్లు బెడద తీవ్రమైంది. వెలిగల్లు, పింఛా ప్రాజెక్టు క్రింద ఆయకట్టు, మదనపల్లి వాయల్పాడు, పీలేరు ప్రాంతాలలో చెరువుల కింద కొంతమేర, బావులు, బోరుబావుల్లో నీరు ఉన్న రైతులు వరిసాగు చేశారు. వరిపొట్ట దశకు వస్తుండటంతో క్రిమి కీటకాలు ఎక్కువయ్యాయి. కంకినల్లి, దోమ, ఆకు, ఎండు తెగుళ్లకు రైతులు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే దున్నడానికి, నాటు వేయడానికి ఎరువులకు పెట్టుబడి పెట్టి సతమతమవుతుంటే కొత్తగా తెగుళ్లు రావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వరికి తెగుళ్లు సోకాయి..... వరికి దోమ, కంకినల్లి, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. మందులను ఇప్పటికే పిచికారీ చేశాం. వాతావరణ మార్పులతో వరి పొట్ట దశలో ఉండగా రోగాలు వస్తున్నాయి. పెట్టుబడులు తడిసి మోపడయ్యాయి. దీనికి తోడు యూరియా దొరకడం లేదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలకృష్ణారెడ్డి, రైతు, పెద్దకాలవపల్లి -
ఐదుగురు నిందితులకు జైలు శిక్ష
సిద్దవటం : దొంగనోట్ల మార్పిడి కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేల్ జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీలోని సాయి వైన్స్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన యు.మాధవరెడ్డి, ఎం.షర్పుద్దీన్, టి.వెంకటేశ్వర్లు, ఎస్.అల్తాఫ్, ఎస్.హుస్సేన్వల్లి వేయి రూపాయల దొంగనోటు ఇచ్చి చెలామణి చేశారు. వైన్ షాపు క్యాషీయర్ జయ నరసింహులు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బొజ్జప్ప కేసు నమోదు చేయగా ఒంటిమిట్ట సీఐ రవిబాబు విచారణ చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేయగా సదరు కేసు బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి వై పద్మశ్రీ విచారించి ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరిపై నేరం రుజువు కానందున కేసు కొట్టి వేయడం జరిగిందన్నారు. సాక్షాధారాలతో నేరం రుజువు చేసి ఐదుగురికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కే నితికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
నీటి సంపులో పడి బాలుడు మృతి
బి.కొత్తకోట : సరదాగా ఆడుకునే పసివాడిని నిర్మాణంలోని ఇంటి సంపు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బి.కొత్తకోట పట్టణం పిటిఎం రోడ్డులో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పెద్దతిప్పసముద్రం మండలం సామాడపల్లెకు చెందిన కె.ఈశ్వరప్ప కొన్నేళ్ల క్రితం బి.కొత్తకోటకు వలస వచ్చి పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న వీధిలో నాలుగో తరగతి చదువుతున్న ఈశ్వరప్ప కుమారుడు కే.కళ్యాణ్ (9) మంగళవారం దేవాన్ష్, నాను తదితర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే వీధిలో ఓ ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండడంతో అక్కడి సంపుపై మూత వేయకుండా వదిలేశారు. పిల్లలు ఆడుకుంటూ ఉండగా..కళ్యాణ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు. ఆందోళనతో కళ్యాణ కోసం వెతగ్గా సంపులో పడి వుండగా గుర్తించి బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అడుకుంటూ ప్రమాదవశాత్తూ సంపులో పడి ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు కళ్యాణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు, ప్రజలు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. ఈశ్వరప్పకు కుమార్తె కల్పన (13), కుమారుడు కళ్యాణ్ ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన వివాహిత గాయత్రి(30) ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. సదరు మహిళ మంగళవారం పొలం వద్దకు వెళుతూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకోగా బాధిత కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి మృతి మదనపల్లె రూరల్ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని గ మనించి స్థానికులు పోలీసులకు తెలిపారు. టూ టౌన్ పోలీసులు అతడి మృతిపై విచారించారు. గుర్తు తెలియని వ్యక్తి చుట్టుపక్కల యాచిస్తూ ఉండేవాడని చెప్పడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తి బ్లూ కలర్ గళ్లలుంగీ, గోధుమ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడని, సంబంధీకులు ఉంటే టూటౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు. బొలేరో ఢీకొని వృద్ధురాలు మృతి మదనపల్లె రూరల్ : బొలేరో ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన ఘటన మంగళవారం కలకడ మండలంలో జరిగింది. కదిరాయనిచెరువు ఎస్టీ కాలనీకి చెందిన పెద్ద రెడ్డెప్ప భార్య జయమ్మ(64) మర్రిపాడు రోడ్డు మార్గంలో పొలం వద్దకు నడిచి వెళ్తోంది. బొంతలవారిపల్లె సమీపంలో బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కలకడ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పిచ్చి కుక్క దాడిలో వృద్ధురాలికి గాయాలు రాయచోటి టౌన్ : పిచ్చి కుక్క దాడిలో లక్ష్మమ్మ(50)కు గాయాలయ్యాయి. రాయచోటి – సుండుపల్లె రోడ్డులో జగనన్న కాలనీ వద్ద అదే ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ నడచి వెళ్తుండగా వెనుక నుంచి పిచ్చికుక్క వచ్చి దాడి చేసింది. గాయాలైన ఆమెను స్థానికులు రాయచోటి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు రేబీస్ వ్యాధి టీకాలు వేశారు. పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన జడపాల వెంకటరమణకు కడప జిల్లా ప్రధానకోర్టు న్యాయమూర్తి సి.యామని మంగళవారం శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జడపాల రమణ 2021లో నారాయణరెడ్డిపల్లెకు చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే రమణకు జిల్లా ప్రధాన కోర్టు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష రూ.20 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. -
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జార్జికారొనేషన్ క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, ఈసీ మెంబర్ రామసుబ్బారెడ్డి, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటమురళీమోహన్, శివారెడ్డి, శివకృష్ణ, అల్లాబకాష్, రాఘవ తదితరులు పర్యవేక్షించారు. -
గురుకుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
కడప రూరల్ : తన కుమారుడు కన్ను పోవడానికి కారణమైన రిషి వాటిక వ్యక్తి వెంకటేష్ వేద వ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రిషి వాటిక గురుకుల యాజమాన్యంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కొండా అమర్నాథ్రెడ్డి కోరారు. సోమవారం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామం వద్ద ఉన్న శ్రీ వేద వ్యాసా భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిషి వాటిక గురుకులంలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడని తెలిపారు. ఇతర విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉండగా గురుకుల యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ రాయితో తన కొడుకును కొట్టడంతో కన్ను పోయిందని ఆలస్యంగా తెలిసిందన్నారు. చికిత్స చేయించినా.. కంటి చూపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదన్న కోపంతోనే ఈ ఘటన జరిగిందని తన కుమారుడు తెలిపారని చెప్పారు. విషయం తెలుసుకునేందుకు స్కూల్కు వెళితే తననే చంపుతానని బెదిరించారని చెప్పారు. తనకు, తన కుమారునికి గురుకుల యాజమాన్యం నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పోలీసులు నామమాత్రం సెక్షన్ల కింద కేసు పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. -
నా బిడ్డను కాపాడండి
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య ● ప్రభుత్వం సహకరించాలంటూ తల్లి వేడుకోలుసుండుపల్లె : అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు నాగచైతన్య(15)కి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని తల్లి బోనంశెట్టి సుమలత ప్రభుత్వం, దాతలను వేడుకుంటోంది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని దిన్నెమీద బలిజపల్లి గ్రామానికి చెందిన బోనంశెట్టి నాగచైతన్య ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో రాయచోటిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. జ్వరం తగ్గకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో.. మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఇతనికి బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స కోసం దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో.. ఆ నిరుపేద కుటుంబ సభ్యులు ఎటూతోచని దీనస్థితిలో కుప్పకూలిపోయారు. తన భర్త జీవనోపాధి కోసం కువైట్ దేశంలో పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడని, తమ బిడ్డకు ఈ వ్యాధి రావడంతో ఏమి చేయాలో తమకు దిక్కు తోచడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె ప్రాధేయపడుతోంది. దాతలు కూడా ముందుకు వచ్చి తమ బిడ్డ వైద్యానికి సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. -
మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం
పులివెందుల : పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే.. వద్దని వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వమిదని కూటమిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పూర్తయిన నిర్మాణాలు, ఆసుపత్రి భవనాలు, నర్సింగ్ కళాశాలను పరిశీలిస్తూ.. పూర్తయిన భవనాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం వారు మెడికల్ కళాశాల ఎదురుగా.. కళ్లు ఉండి చూడలేని సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, పులి సునీల్కుమార్, వేముల సాంబశివారెడ్డి, సర్వోత్తమరెడ్డి, రసూల్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి కాకపోతే.. సీట్లు ఎలా కేటాయిస్తారు? పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయిస్తే.. కూటమి వద్దని వెనక్కి పంపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి చూసి 50 సీట్లు కేటాయించిందంటే.. మెడికల్ కళాశాల పూర్తయినట్లా, పూర్తి కానట్లా? మెడికల్ కళాశాల పూర్తి కాకపోతే ఈ కళాశాలకు 50 సీట్లు ఎందుకు కేటాయిస్తారు. కోట్లు వెచ్చించి నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన విద్య, వైద్యం అందిచ్చాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం ఏమిటి? – రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు విష ప్రచారం 2024 మార్చిలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కాలేజీ, హాస్పిటళ్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వైఎస్సార్సీపీ పాలనలోనే వచ్చేసింది. రోజుకు ఓపీ 500 నుంచి 1000 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. టీడీపీ ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులిందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని విష ప్రచారం చేయిస్తోంది. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తగదు. – ఎస్బీ అంజద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎంజగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు పులివెందుల మెడికల్ కళాశాల 90 శాతం పూర్తి కేవలం రూ.120 కోట్ల మేర పనులు పెండింగ్ ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి అలుపెరగని పోరాటాలతో అడ్డుకుంటాం వైఎస్సార్సీపీ నాయకులు -
ఆర్టీపీపీ నుంచి గుట్టుగా స్క్రాప్ తరలింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాత ఇనుము (స్క్రాప్)ను కొందరు బయటికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొన్నేళ్ల కిందట పూర్తి అయ్యాయి. అందులో భాగంగా స్క్రాప్ (పాత ఇనుప ముక్కలు) నిలువ పేరుకుని పోయింది. అయితే ఇలా పక్కన పడి ఉన్న స్క్రాప్ను పరిశ్రమ యజమాన్యం టెండర్ల ద్వారా అమ్మకం వీలు ఉన్నప్పటికీ.. ఏ కారణం చేతనో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు స్క్రాప్పై కన్నేశారు. సంబంధిత అధికారులకు రాజకీయ వత్తిళ్లు కూడా లేకపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్ బయటకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కార్మిక వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆర్టీపీపీ నుంచి బయటికి వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని పట్టుకోవడం, వదిలి పెట్టడటం కూడా జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో ఆ వాహనాన్ని వదిలేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పట్టుకున్న వాహనం సచివాలయ వద్ద ఉంచి మంతనాలు చేసిన తర్వాత.. వదిలి వేసినట్లు సమాచారం. కూటమి నేతలు ఆర్టీపీపీని ఆదాయ వనరుగా మర్చుకున్న విషయం బహిరంగ రహస్యం. ఆర్టీపీపీలో పని చేస్తున్న కొందరి సహాయ సహాకారాలు ఉండటం వల్ల స్క్రాప్ సులువుగా బయటకు పోతుంది. ఆర్టీపీపీ ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ విధంగా బయటికి పోతుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయినా ఏ కారణం చేతనో సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు విధినిర్వహణలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావును వివరణ కోరాగా.. ఆరా తీస్తామన్నారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేస్తామని, సంబంధిత వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా ఆర్టీపీపీలోని అన్ని విభాగాల అధికారులతో సంప్రదించి విచారణ చేస్తామన్నారు. ఆర్టీపీపీ అధికారులు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు. -
డీఎస్సీలో మూడో ర్యాంక్ సాధించిన హేమలత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరానికి చెందిన హేమలత 43 ఏళ్ల వయసులో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు విభాగంలో మూడో ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 2004లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానన్నారు. వివాహం అయ్యాక తన భర్త పల్లేటి శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్స్కూల్ టీచర్గా పనిచేశానన్నారు. 2012 డీఎస్సీలో సైన్స్ సబ్జెక్టు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీలో తన సబ్జెక్టులు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కావడం, బోటని లేదా జువాలజీ ఉండాలన్న నియమంతో తన దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసి 2018 డీఎస్సీలో 20వ ర్యాంకు సాధించాను. కానీ కేవలం రెండే పోస్టులు ఉండటంతో తనకు జాబ్ రాలేదన్నారు. అనంతరం ఇంటర్ కాలజీ ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తూ 2025 డీఎస్సీకి ప్రయత్నించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషులో 3వ ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించానన్నారు. ఎంఈడీ కూడా పూర్తి చేశానన్నారు. వ్యవసాయం చేస్తూ తనకు సహాయ సహకారాలు అందించిన తన భర్త ప్రోత్సాహాన్ని, తన తల్లి సహకారాన్ని మరువలేనన్నారు. -
● వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం
2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నివేదనలే..పరిష్కారం లేదు
● ఎంతో ఆశతో కలెక్టరేట్కు వస్తున్న బాధితులకు జరగని న్యాయం ● ప్రజా వేదికకు భూములకు సంబంధించిన ఫిర్యాదుదారుల అధికం సాక్షి రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరుగులు పెడుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారం అండగా...ఆగడాలు మెండుగా...జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూర్చొనేందుకు కూడా బరువుగా భావిస్తుండడంతో బాధితులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా తల్లడిల్లిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు న్యాయం మాత్రం కొండంత దూరంలో కనిపిస్తోంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వచ్చి గోడు వెళ్లబోసుకునేందుకు బారులు తీరుతున్నారు. ప్రతిసారి వచ్చినవారే మళ్లీమళ్లీ వస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నారు. కొత్త కలెక్టర్ రాకతోనైనా తమ సమస్యలు తీరుతాయని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. న్యాయం కోసం జిల్లాలోని అటు తంబళ్లపల్లె, ఇటు రైల్వేకోడూరు, మదనపల్లె, రాజంపేట ఇలా చెబుతూపోతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలెక్టరేట్కు కదులుతున్నారు. కానీ పెన్షన్లు, ఇతరత్రా చిన్నపాటి సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం గగనంగా మారుతోంది. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి ఆన్లైన్, అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్థలాలను విడిపించమని, ఇతరత్రా దాడులు, వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. దివ్యాంగులు, వృద్దులు, ఇ తర వ్యక్తిగత సమస్యలతో ప్రతి సోమవారం 250– 300 మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా ఇంటి ప ట్టా, ఆన్లైన్ సమస్యలు, భూ కబ్జాలు, ఉద్యోగాలు, రుణాల కోసం, పరిహారం ఇలా అనేక సమస్యలతో కలెక్టరేట్కు న్యాయం కోసం వస్తున్నారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికకు సంబంధించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా డుమ్మా కొడుతుండడం.....కిందిస్థాయి సిబ్బందిని కార్యక్రమానికి పంపుతుండడంతో సమస్యల పరిష్కారం గగనంగా మారింది. కొత్త కలెక్టర్పైనే ఆశలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు భారీగా బాధితులు వస్తున్నా న్యాయం జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్తోపాటు కొంతమంది అధికారులు సమస్యల పరిష్కారంలో కొంతమేర కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్పై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ ఆక్రమణలతోపాటు రెవెన్యూలో ఆన్లైన్, దాడులతో బెంబేలెత్తించడం, ఇతరుల భూములు లాక్కొవడం, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం ఎక్కువైంది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలై మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా చేశారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధముతున్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ అనేక వ్యవహారాలపై మార్పునకు కృషి చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. టమాట, బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించాలి టమాట, బొప్పాయికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. మార్కెట్లో దళారీ వ్యవస్థ కారణంగా అన్నదాతలు మోసపోతున్నారన్నారు. టమాట, బొప్పాయి పండ్లను మార్కెట్కు తీసుకెళ్లినా అమ్ముడుపోక రోడ్లమీద పారవేయాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో ఆత్మహత్యల వరకు పరిస్థితులు వెళుతున్నాయి. ఇప్పటికై నా రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. నా పేరు సఫియాబీ. పీలేరు మండలం జాండ్ల గ్రామానికి చెందిన తనకు 1.5 ఎకరాల భూమి ఉంది. ఆన్లైన్కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాను. పీలేరు తహసీల్దార్ పట్టించుకోవడం లేదు. నేను లేని సమయంలో మా పక్క భూమి వాళ్లు ఆన్లైన్ చేసుకున్నారు. జరిగిన తప్పును గుర్తించి తనకు న్యాయం చేయాలి. నా పిత్రార్జితం వారసత్వ రీత్యా లభించిన భూమికి సంబంధించి 1బీ అడంగల్, పాసు పుస్తకం మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఫలితం లేదు. నాసమస్యను సత్వరమే పరిష్కరించాలి. – డి.సుధాకర్, బూర్లపల్లి కస్పా, పెద్దతిప్పసముద్రం మండలం -
నూతన ఎస్పీ బాధ్యతల స్వీకరణ
రాయచోటి : అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కనుబిల్లి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం రాయచోటిలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ఎస్పీ బాధ్యతలను స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ఎస్పీగా పనిచేసిన విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన ధీరజ్ కనుబిల్లి ఇక్కడి వచ్చారు. ఈ సందర్భంగా ఏఆర్ సిబ్బందితో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. నేపథ్యం ఇదీ.. ధీరజ్ కనుబిల్లి 2020 బ్యాచ్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2021లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. వీరి తల్లి పార్వతీ (గృహిణి), తండ్రి కె వెంకటరమణ. అడిషనల్ ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్గా ఎంపికై నా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఐపీఎస్గా కొనసాగుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం శ్రీనివాసులు కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రత్యేకతను కాపాడతాం.... రాయచోటి : జిల్లా ప్రత్యేకతను కాపాడటంతో పాటు శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తామని నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపట్ల అలసత్వం చేయకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ పరిధిలోని కాటిమాయకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అజ్మత్ ఆలీ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు.ఈ నెల 12వ తేదీ కడప డీఎస్ఏ స్టేడియంలో ఎస్జీఎఫ్ అండర్–14 విభాగంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలో ఎస్. అజ్మత్ అలీ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. పీడి రమేష్ నాయక్ను కూడా ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ రాయచోటి : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నిర్వహించే జాతీయ పశు వ్యాధి నివారణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పిలుపునిచ్చారు. గాలికుంటువ్యాధికి ఇంటి వద్దనే పశువులకు టీకాల పంపిణీ జరుగుతుందని జేసీ తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్పిళ్లై, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ – ఒకే సారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కడప ఎడ్యుకేషన్ : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు కడపకు చెందిన మేకల గురు గోవర్ధన్ యాదవ్. తన మొదటి ప్రయతనంలోనే ఒకేసారి టీచర్ ఉద్యోగంతోపాటు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన లక్ష్యం వైపు ప్రణాళికతో ముందుకు సాగి విజయం సాధించాడు. మేకల గురు గోవర్ధన్ యాదవ్,76.436 మార్కులతో 200 ర్యాంకుతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు.మా అమ్మగారి కోరిక మేరకు శ్ఙ్రీకష్టపడి చదివి టీచర్ ఉద్యోగం సాధించినట్లు గోవర్థన్ తెలిపారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూనే తీరిక సమయంలో గ్రూప్–1 చదువుతానని పేర్కొన్నారు. -
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ రాయచోటి జగదాంబసెంటర్ : ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ లభిస్తుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్ తెలియజేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఏడీ త్యాగరాజు రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యేక స్టాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయ కూరగాయల వినియోగం వలన కలిగే లాభాలను వివరించారు. అనంతరం డీపీఎం వెంకటమోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి విధానంలో పండే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అవి తినడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతందని తెలిపారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పవన్, పద్మావతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చాపాడు : వైఎస్సార్ కడప జిల్లా అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసంకృషి చేస్తానని ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. మండలంలోని అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఈఓగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్తో కలిసి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొగమూరు వంక ప్రవాహంతో ఇబ్బందులు పడేవారం. గ్రామానికి రాకపోకల కోసం వంతెన ని ర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది. వంతె న నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరైంది. వంతెన నిర్మాణం పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది.తర్వాత వచ్చిన కూటమి సర్కార్ బిల్లులు చెల్లించకుండా కాలాయాపన చేస్తోంది. దీంతో కోర్టు మెట్లు ఎ క్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బత్తల వీరయ్య యాదవ్, మాజీ ఎంపీపీ, ఓబుల్రెడ్డిపల్లె కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్రెడ్డిపల్లె. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఓబుల్రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు. పద్మవ్యూహంలాంటిది ఈ వంక వస్తే ఓబుల్రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం 2022 నవంబరులో ఓబుల్రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు. వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం ఓబుల్రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది. చదువులకు తప్పని తిప్పలు గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. వర్షాకాలంలో అక్కడున్న వంక ప్రవాహంతో పై చదువులు చదివేందుకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. 5వ తరగతి తర్వాత 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి. కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్ ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్క నపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లు లు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం వంక నీళ్లలోనే మృతదేహాలను వదిలేసే దుస్థితి చదువులకూ తప్పని తిప్పలు వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం తొలగిన అన్ని ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం -
17 నుంచి స్వస్థ నారీ సశక్త్ అభియాన్
రాయచోటి టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమశాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కె. లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ని వైద్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యాధికారులందరూ సమన్వంతో పని చేయాలని సూచించారు. -
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబుతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం రిమ్స్ను పరిశీలించినవైఎస్ఆర్సీపీ నేతలు -
కారు ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కారు ఢీకొని కర్నాటకకు చెందిన అన్నదమ్ములు తీవ్రగాయాలపాలైన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. కర్నాటక చేలూరు తాలూకా బైరప్పనహళ్లికి చెందిన మంజునాథరెడ్డి కుమారుడు మనీష్(25), శంకరరెడ్డి కుమారుడు శశి(17) వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ బోయకొండకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం గాయాలపాలైన శశిని మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. నాపై పోలీసులు దాడి చేశారుకడప అర్బన్ : హోటల్లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన శశిప్రమాదంలో తీవ్రంగా గాయపడి మోనిష్ -
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు. -
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు. – సాగర్, గర్భిణి భర్త -
కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా బిల్డింగ్లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం
రాయచోటి : తిరుపతి పట్టణంలో రాష్ట్ర మంత్రి సవిత చౌదరి ఆధ్వర్యంలో అక్టోబర్ 5న జరిగే కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కురబ సంఘం సభ్యులు, నాయకులు ప్రకటించారు. రాయచోటిలోని అజయ్ కల్యాణ మండపంలో కురబసంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కురవ, కురబ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో కురబ కులం పేరు చెప్పుకుంటూ తన భర్త వెంకటేశ్వరచైదరిని పదవిని కాపాడుకునే ప్రయత్నం మంత్రి సవిత చేయడాన్ని తాము ఒప్పుకోమన్నారు. కురబలు సహకరించకపోతే సంఘం నాయకులనే మార్చేస్తామని హెచ్చరించడం తగదన్నారు. అధికారంకోసం ప్రగల్బాలు పలుకుతూ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహావిష్కరణను బహిష్కరించాలని కురబ సంఘం ఏకపక్షంగా తీర్మానించిందన్నారు. అలాగే అక్టోబర్ 12న విజయవాడలో నిర్వహించనున్న సమావేశంలో కురబలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెపర్డ్ జిల్లా కురమ, కురబ, కురవ అధ్యక్షుడు, కె.రవిశంకర్, జిల్లా కురవ సంఘం అధ్యక్షుడు తరిగొండఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కప్పల రాజన్న, జిల్లా కోశాధికారి గోవిందు సుధాకర్, గుడి రామానుజులు, గుడిశ్రీనివాసులు, గౌనుపల్లి రెడ్డన్న, మంగిరి రమణ, బోనే మురళీ కుమార్, మంగిరి సురేష్, గుడి శివ, రవీంద్ర, శ్రీనివాసులు, రవి, చెన్న కృష్ణయ్య, నాగయ్య, గోవిందు, దనార్జన, రఘు, గిరి, మంచూరి అంజి తదితరులు పాల్గొన్నారు. -
చాలీ చాలని జీతాలతో చాకిరి
కడప ఎడ్యుకేషన్ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో.. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్ఎంటీలు, 19 మంది మండల లెవల్ అకౌంటెంట్స్, 34 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కనికరించని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం ఎదురుచూపు -
మల్లయ్యకొండ ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెఇపారు. ఈ సర్వీసలో సీ్త్రశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందని తెలిపారు. రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండలం, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. గంగమ్మా.. చల్లంగ చూడమ్మా లక్కిరెడ్డిపల్లి: కష్టాలు తొలగించి.. వర్షాలు కురిపించి సుభిక్షంగా ఉండేలా చూడు తల్లి అంటూ భక్తులు అనంతపురం గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆదివారం అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు అర్పించి.. స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సంబేపల్లె: మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా వేపాకులతో ఆలయ ప్రాంగణమంతా శుద్ధి చేశారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో బీజాక్షరాలతో కలిగి ఉన్న మహిమగల రాయికి భక్తులు పూజలు నిర్వహించారు. గంగమ్మా చల్లంగ చూడమ్మా అని వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. -
బాబు మాటలకు అర్థాలే వేరులే..
రాయచోటి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు అర్థాలే వేరు అని లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్కుమార్రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయలేదంటూనే కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న వైనంపై రమేష్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేదొకటి ప్రజలకు చెప్పేది ఒకటి అన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు మంజూరైన విషయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకుంటూనే మరోవైపు స్థలాలు కేటాయించినంత మాత్రాన అభివ్దద్ది కాదని అబద్ధాలు చెప్పడం తగదన్నారు. మెడికల్ కళాశాలల నిర్వహణ చేతగాకనే పిపిపి ముసుగుతో ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. పేద, మద్యతరగతి పిల్లల విద్యా బోధనకు, ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి పనిచేశారని, చంద్రబాబు నాయుడు మాత్రం విద్య, వైదాన్ని కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఇంత భారీ స్థాయిలో మూటకట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కూటమి పాలనలో అవినీతి దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమార్చన, రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి -
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది. ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు. ● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు. ● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది. ● ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా అనేక మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గుంతకల్ రైల్వేడివిజన్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.వీరికి ఈ రైలు సౌకర్యవతంగా ఉంటుంది. ● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది. ● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్కాగజ్ నగర్లకు చేరుకోవచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్క్లియర్ ఉమ్మడి కడప జిల్లా లైన్లో రక్సౌల్–చర్లపల్లి వీక్లీ 20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు -
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్వో, బార్క్, డీఆర్డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. ’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. వివిధ స్థాయిల్లో పరీక్ష వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లెవిద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు -
జేఎన్టీయూ వాచ్మెన్ మృతి
కలికిరి : రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ హరినాథ్(47) మృతిచెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిమ్మారెడ్డిగారిపల్లికి చెందిన హరినాథ్ జేఎన్టీయూ కళాశాలలో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం కళాశాల నుంచి సొంత పని నిమిత్తం స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో చింతలవారిపల్లి బస్టాపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో హరినాథ్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆటోలో కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పుల్లంపేట : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పుల్లంపేట శ్రీరాములుపేటకు చెరందిన శివ, మణి ద్విచక్ర వాహనంలో చిట్వేలి నుంచి తమ గ్రామానికి వెళ్తున్నారు. దిగువపల్లి సమీపాన రోడ్డు ప్రక్కన ఉన్న కంచెను ఢీకొని కింద పడ్డారు. శివ, మణిలకు తీవ్ర గాయాలవగాయ్యా పోలీసులు రాజంపేట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యంకోసం రాజంపేట నుంచి తిరుపతికి తరలించారు. -
ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి
నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి: ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం నిశాంత్ కుమార్ నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు కల్యాణి, భావన, డీఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ నాగభూషణం నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. . ● జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రో యాక్టివ్గా పనిచేయాలన్నారు. అమరావతిలో ఈనెల 15, 16న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని శ్రీ వీరభద్రస్వామిని ఆదివారం నూతన కలెక్టర్ నిశాంత్కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. -
యువతిని మోసగించిన కేసులో వ్యక్తికి రిమాండ్
కలికిరి : యువతిని మోసగించిన కేసులో కలికిరికి చెందిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ(ఉన్నతవిద్య) చదువుతున్న యువతిని కలికిరి పట్టణానికి చెందిన పఠాన్ ఇమ్రాన్ఖాన్ ప్రేమ పేరుతో వెంటబడి వంచించాడు. అనంతరం యువతితో వున్న ఫొటోలను ఆమె బంధువులు, స్నేహితులకు పంపి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె కలికిరికి చేరుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ అనీల్కుమార్ నిందితుడిని శనివారం సాయంత్రం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితుడిని రిమాండ్ విధించినట్లు తెలిపారు. గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్ట్రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని బిజ్జవారిపల్లి క్రాస్ వద్ద ఆదివారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠ, సీఐ తులసీ ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఐదుగురు 2.700 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రాకేష్, హరి, సుమన్లను అరెస్ట్ చేసి ఆటో, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో ఇరువురు పరారీలో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరు పరిచారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంకేవీపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని దిగవగళ్ల గంటావారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గంటావారిపల్లెకు చెందిన అనసూయమ్మ ఇంటిలో విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఆదివారం మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంటిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు. యువతి ఆత్మహత్యఎర్రగుంట్ల : మండలంలోని పెద్దనపాడు గ్రామానికి చెందిని చిలంకూరు గంగమ్మ (25) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పెద్దనపాడుకు చెందిన వీరాంజనేయులు, లక్ష్మీదేవి కుమార్తె గంగమ్మ. గంగమ్మకు పెళ్లి చూపులు చూస్తున్నా.. అవి కుదరడం లేదు. దీంతో గంగమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పెద్ద వలంటీర్లమట
కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను పెద్ద వలంటీర్లని ఎగతాళి చేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేయిస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగి స్తున్నారు. సర్వేల సమయంలో ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. –జంగాల నందిని, మహిళా పోలీసు జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి -
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు -
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్ను మెగా లోక్ అదాలత్లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్తో కలిసి బైక్లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..... వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది. నగదు తిరిగి ఇవ్వమన్నందుకు ఇద్దరిపై దాడి మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్వలిలపై దాడి చేయించాడు. గాయపడిన బాధితులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అదేవిధంగా మండలంలోని పోతబోలు పంచాయతీ నడింపల్లెకు చెందిన వెంకటరమణ భార్య రెడ్డెమ్మ(50) అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
వాకర్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్గా చేజర్ల
రాజంపేట: వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్గా రాజంపేటకు చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యంరాజు ఎన్నికయ్యారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 302 కేబినెట్ సమావేశం జరిగిందని తెలిపారు. నడకతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చేజర్లను వాకర్స్ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ప్రెసిడెంట్ డా.రవిరాజు, డిస్ట్రిక్ గవర్నర్ మాధవ నాయుడు, కొండూరు శరత్రాజు, కోనేటి రవిరాజు, వినాయగం, మనోహర్, పాండ్యన్, మునికృష్ణ, రామ్మోహన్వర్మ, శంకర్రాజు, సురేష్రాజు పాల్గొన్నారు. కాలువలో పడ్డ స్కార్పియో పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరస్పాండెంట్పై పోక్సో కేసు మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు – సెప్టెంబరు 23 వరకు దరఖాస్తుల స్వీకరణ రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు. -
కాయ్ రాజా కాయ్
క్రికెట్ బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్ రాజా కాయ్ అంటూ యాప్లపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ● ప్రొద్దుటూరు క్రికెట్ బుకీలకు కళ్లెం వేసేది ఎవరు? ● ఆసియా కప్ టీ20 టోర్నీతో జోరందుకున్న బెట్టింగ్ ● నేడు ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ అంటే టీవీ, మొబైల్ పోన్లు, రాసుకోవడానికి నోట్ బుక్కులు, లైన్బాక్స్ సెటప్ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ బెట్టింగ్ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్, వరల్డ్కప్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసేవారు. సొంతంగా యాప్ల నిర్వహణ కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ మొబైల్తో టెక్నాలజీని క్రికెట్ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్ యాప్లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. యాప్ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యాప్ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో చెక్ పడుతుందా? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్ లాంటి వరుస మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లను చెక్పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమ్లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్లైన్లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్లైన్లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి. -
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు. -
శ్రీ భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించి పూలు, బంగారు ఆభరణాలు, బంగారు ఆభరణాలతో పాటు నిమ్మకాయలతో హారాలతో అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచి పెట్టారు. అత్తపై దాడిచేసిన అల్లుడు అరెస్టు నందలూరు : లేబాక గ్రామ పంచాయతీ మరాటి పల్లి గ్రామంలో అత్తపై దాడి చేసి పారిపోయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7 తేదీన సాయంత్రం లేబాక మరాఠ పల్లి కి చెందిన సింధే పద్మావతిభాయిని చంపాలనే ఉద్దేశంతో మచ్చుకత్తితో దాడిచేసి పారిపోయిన వాయకారి నరసింహులును నందలూరు బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని అతని నుంచి మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతపురం టౌన్ కి చెందిన నరసింహులుకి 13 సంవత్సరాల క్రితం పద్మావతి భాయి కుతూరు మంజుల భాయితో వివామైంది. వారికి ఒక కొడుకు, కుతూరు ఉన్నారు. నరసింహులు చెడు అలవాట్లకు భానిసై భార్యను పిల్లలను పట్టించుకోకుండా హింసిస్తూ ఉండటంతో మంజుల భాయి భర్తకు దూరంగా తన ఇద్దరి పిల్లలను తల్లి పద్మావతి భాయి దగ్గర ఉంచింది. బతుకుదెరువు నిమిత్తం కువైట్కి వెళ్ళింది. అయితే భార్యా, పిల్లలు దూరం కావడానికి అత్తే కారణమని పగ పెంచుకొని, అతడి జల్సాలకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో పద్మావతి భాయిని చంపాలని ప్లాన్ వేసుకొని ఈనెల 7వ తేదీ సాయంత్రం మచ్చుకత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పద్మావతి భాయి కోడలు శ్యామల భాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి వాయకారి నరసింహులును ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం నందలూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. -
బతికుండగానే చంపేశారు
● రూ.2కోట్లు విలువైన ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని డెత్ సర్టిఫికెట్తో అమ్మేశారు ● ఎన్జీఓ ప్లాట్ 300కు సంబంధించి వెలుగుచూసిన సంఘటన ప్రొద్దుటూరు : బతికుండగానే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినట్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్ను సృష్టించి రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మరొకరికి అమ్మారు. ప్రభుత్వ ఉద్యోగి వీఆర్ఎస్ పొంది ప్రతినెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంఘటన ఎవరు చేశారు.. ఎలా జరిగింది... ఎవరెవరి హస్తం ఉంది అనే వివరాల గురించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆరా తీయలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1980 ప్రాంతంలో ఎన్జీఓ ప్లాట్లు వేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ కాలనీలోనే గంజికుంట సుబ్బరాయుడు (నీటి పారుదల శాఖ రిటైర్డు ఎస్ఈ)కు 1986లో సర్వే నంబర్ 194, 196లోని ప్లాట్ నంబర్ 300లోని 7.5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆయన గత 40 ఏళ్లుగా తన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ సృష్టించి... గంజికుంట సుబ్బరాయుడు నీటి పారుదల శాఖలో ఎస్ఈగా పనిచేసి 2003లో వీఆర్ఎస్ పొంది ప్రభుత్వం నుండి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి పెన్షన్ పొందుతున్నారు. గంజికుంట సుబ్బరాయుడు, తన భార్య గంజికుంట వెంకటసుబ్బమ్మ ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న (ఆధార్ కార్డు 994947290378) వివరాలతో గంజికుంట సుబ్రహ్మణ్యం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన వద్ది నారాయణ కుమారుడు నాగరాజు (ఆధార్ కార్డు నంబర్ 879824061289)కు రిజిస్టర్ చేయించారు. తన తండ్రి గంజికుంట సుబ్బరాయుడుతోపాటు తల్లి గంజికుంట లక్ష్మీదేవి మరణించినట్లు ఏకంగా మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని జత చేశారు. వాస్తవానికి గంజికుంట సుబ్బరాయుడుకు గంజికుంట సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో వీరికి తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్టర్ జరిగింది. స్టాంప్ రైటర్ తొండలదిన్నె శ్రీనివాసులు ఈ డాక్యుమెంట్ను తయారు చేయగా, దొరసానిపల్లెకు చెందిన వరద ఆంజనేయులు, డ్రైవర్ కొట్టాలకు చెందిన నల్లు జయశంకర్ సాక్షులుగా ఉన్నారు. తనకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న గంజికుంట సుబ్బరాయుడు కొద్ది రోజుల క్రితం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీఎన్జీ రామదాసును సాక్షి వివరణ కోరగా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. బతికుండగానే గంజికుంట సుబ్బరాయుడు మరణ ధృవీకరణ పత్రం గంజికుంట సుబ్బరాయుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని అమ్మిన వారు, కొన్నవారు -
అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా?
కడప కార్పొరేషన్: కూటమి అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10వ తేదీ కూటమి నేతలు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి విజయోత్సవ సభ నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. పదహారు నెలలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో.. 5లక్షల పింఛన్లు తొలగించడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడంలో.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేయడంలో సూపర్ హిట్ సాధించారని ఎద్దేవా చేశారు. 87లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఇవ్వాల్సి ఉండగా, 54లక్షల మందికే ఇచ్చి, 16 నెలల్లో ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి బంపర్హిట్ కొట్టారని ఎద్దేవా చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మొదటి ఏడాది పంగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చి 7లక్షల మందికి కోత వేశారన్నారు. యాభై ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసగించారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొనగాడుగా నిలిచారన్నారు. వాటిలో 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటుకు అమ్మేయాలను కోవడం దారుణమన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలను నిర్వీర్యం చేయడంలో..రైతులకు యూరియా దొరక్కుండా చేయడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఆ వ్యవస్థనే ఎత్తేశారన్నారు. ప్రభుత్వ బడులు, వైద్యశాలలను.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పతనావస్థకు తీసుకుపోయారన్నారు. కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించిన జిల్లాలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా అవమానిస్తే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో సూపర్హిట్ పదిహేనేళ్లు ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించారా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మంజూరు ఘనత వైఎస్ జగన్ది మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కక్షపూరితం..దుర్మార్గం
పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఏ ప్రసాదించింది. ప్రజల గొంతుకై న పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. పత్రికలో వచ్చే వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వవచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. అంతేకాని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభసభ్యుడు -
ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి కడప: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లి పంచాయతీ కేతరాజుపల్లె గ్రామ రెవెన్యూ 205, 206 సర్వే నంబర్లలోని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని... అంతేకాకుండా ఆక్రమించారని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం ఎంత వరకు న్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. అందుకు సంబంధించి శుక్రవారం ఈశ్వరయ్య జరిగిన ఆక్రమణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు ఆయన ఫిర్యాదు చేశారు. సత్వరం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దళాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, ప్రభుత్వ భూమిని ఆక్రమించడం.. ఈనెల 9న పుల్లంపేట తహసీల్దార్కు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని సీపీఐ నాయకత్వానా విన్నవించామన్నారు. ఆ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓ కబ్జాదారులకు సమాచారం అందించగా అది తెలుసుకున్న టీడీపీ నాయకులు 10 తేదీ రాత్రి 9 గంటలకు పుల్లంపేట మండల సీపీఐ కార్యదర్శి సెల్వకుమార్కు ఫోన్ చేసి రాత్రి పూట పిలిపించి అత్యంత దారుణంగా తిట్టారని, బెదిరించారని వివరించారు. దాంతో సరిపెట్టుకోకుండా 11వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో సెల్వకుమార్, నిండు గర్భిణి అయిన భార్య బిందు ప్రియపై దాడి చేశారని తెలిపారు. ఆరుబయట నిద్రిస్తుండగా సెల్వకుమార్తోపాటు ఆయన భార్యపై టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, సాయికుమార్తోపాటు మరో పది మంది దాడి చేయడంతోపాటు భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. అప్పటికి భార్యభర్తలు ఇరువురు ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకోగా వాకిళ్లను తన్నుతూ భయపెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంటి ఆవరణలో ఉన్న ఎయిర్ కూలర్, టీవీఎస్ ఎక్సెల్ను ధ్వంసం చేయడంపై ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ పలు పర్యాయాలు భూమి కబ్జా జరుగుతున్న విషయం తెలియజేసినా తహసీల్దార్ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించడంతోపాటు ఈవీఎంలు పగులగొట్టిన చరిత్ర ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి, డీజీపీలను ఈశ్వరయ్య కోరారు. అందుకు సంబంధించి వారికి వినతి పత్రం అందించారు. పట్టించుకోని అధికారులు ఫిర్యాదు చేసిన సీపీఐ మండల కార్యదర్శి సెల్వకుమార్ ఫిర్యాదు చేశారనిభార్యతోపాటు సెల్వకుమార్పై టీడీపీ నాయకుల దాష్టీకం సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య -
మళ్లీ వాయిదా పడిన గుత్తల వేలం
● పాత పాటదారులకు ఆమోదం ఇవ్వకపోవడంతో అవస్థలు ● గేటు వసూళ్ల ఆరోపణలపై అధికారులు దృష్టి పెట్టాలి మదనపల్లె : 2025–26 ఏడాదికి మదనపల్లె మున్సిపాలిటికి చెందిన వారపుసంత, దినసరి మార్కెట్, టౌన్హాలు, ప్రైవేటు బస్టాండ్ గుత్తలను అప్పగించేందుకు వరుసగా ఏడుసార్లు వేలం పాటలను నిర్వహించినా కనీస స్పందన లేకపోతోంది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఏడోసారి వేలంపాటలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు పాటలను నిర్వహిస్తామని కమిషనర్ ప్రమీల ప్రకటించగా పాటదారుల కోసం కార్యాలయంలో ఎదురుచూశారు. పాత పాటదారుడు ఎస్ఏ.మస్తాన్ పాటలో పాల్గొనేందుకు వచ్చారు. ఎవరూ రాకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం పాటదారులు హాజరవుతారని సమాచారంతో అధికారులు ఎదురుచూడగా ఇద్దరు హాజరైనప్పటికి వేలంపై ఆసక్తి చూపకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనితో గుత్తలను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించినా వాటిని నిర్వహించుకునేందుకు లీజుదారుల్లో ఆసక్తి లేదని తేలిపోతోంది. వరుసగా జూలై తొమ్మిది, జూలై 17, జూలై 25, జూలై 30, ఆగష్టు 19, తర్వాత శుక్రవారం ఏడుసార్లు వేలంపాటలను నిర్వహించారు. దీనికోసం పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చే శారు. పరిస్థితి చూస్తుంటే ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వృథా అయినట్టే కనిపిస్తోంది. హెచ్చుపాట..ఆమోదం లేదు వాస్తవానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుత్తలకు ఈ ఏడాది మార్చి 25న నిర్వహించారు. ఇందులో వారపుసంతకు రూ.పఠాన్ జాఫర్ ఖాన్ రూ.46.38 లక్షలతో హెచ్చుపాటదారునిగా నిలిచారు. దినసరి మార్కెట్కు ఎస్ఏ.మస్తాన్ రూ.1,18,64,000తో హెచ్చుపాటదారునిగా నిలిచారు. వీరికి గుత్తలను ఏప్రిల్ ఒకటి నుంచి అప్పగించాలి. అయితే కౌన్సిల్ ఆమోదం లేదని అధికారులు తదుపరి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. ఈలోపు గత లీజుదారుని గుత్తలీజు పూర్తవ్వడంతో కొత్త లీజుదారులకు అప్పగించలేదు. దీనితో ఏప్రిల్ నుంచి కొంతకాలం మున్సిపల్ సిబ్బంది గేటు ఫీజును వసూలు చేయగా, ఇటివల ప్రయివేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీనితో గేటు ఆదాయం ఎంత రావాలో, మున్సిపాలిటికి ఎంత జమ అవుతోందో అధికారులు గుర్తించాలి. గేటు వసూళ్లపై ఆరోపణలు వస్తున్నాయి. గత కౌన్సిల్ సమావేశంలో ఓ కౌన్సిలర్ ప్రయివేటు వ్యక్తులతో గేటు వసూళ్లు చేస్తున్నారని ఫోటోలు చూపి ఆరోపించడం తెలిసిందే. సిబ్బందికి బాధ్యతలు: లీజు అప్పగించే వరకు మున్సిపల్ సిబ్బందికి గేటు ఫీజు వసూలు బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పారదర్శకంగా ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం గుత్త ఆదాయం ఎంత, ఇప్పుడు రోజువారీ వసూళ్లు ఎంత, ఎంత వసూళ్లు తేడా ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. ఏటా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఆంచనావేసి మున్సిపాలిటికి ఎంత ఆదాయం దక్కాలన్న దానిపై అధికారులు సమీక్షించి బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పక్కదారి పట్టకుండా ఆదాయం సమకూరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మళ్లీ వేలం ప్రకటన : శుక్రవారం నిర్వహించిన వేలంపాటలకు ఇద్దరు హాజరైనా పాటల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీనితో మరోసారి వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుని ప్రకటన వెలువరిస్తామని కమిషనర్ కే.ప్రమీల తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ముగిసిన కళా ఉత్సవ్–2025 పోటీలు జ్ఞాపికలను అందుకున్న విజేతలతో డీఈఓ సుబ్రమణ్యం కళా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థినులు రాయచోటి : పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలలో తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు సత్తాచాటి శభాష్ అనిపించుకున్నారు. రాయచోటిలోని జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలు రెండురోజులపాటు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగి శుక్రవారం ముగిశాయి. ఆరు కళారూపాలలో పన్నెండు అంశాలకు సంబంధించి వ్యక్తిగత, బృందాలకు నిర్వహించిన ఈ పోటీలలో 37 పాఠశాలలకు సంబంధించి 110 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం విద్యార్థుల ప్రదర్శనలపట్ల అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు వీరే... గాత్ర సంగీతం వ్యక్తిగత విభాగంలో నజియా తబస్సు (పభుత్వ బ్లైండ్ పాఠశాల, కడప) బృందం విభాగంలో హాసిని, హర్షిత, హిమబిందు (ఎంజేపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), వాద్య సంగీతం వ్యక్తిగత విభాగంలో ఎస్ మహమ్మద్ సల్మాన్ (ప్రభుత్వ బ్లైండ్ పాఠశాల కడప), బృందం విభాగంలో జీవన్ కుమార్, సందీప్ రెడ్డి, భావన కుమార్, హరిప్రసాద్ (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), నృత్యం వ్యక్తిగత విభాగంలో ఎస్ హాసిని (ఎంజీపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), బృందం విభాగంలో గౌతమి, గంధర్విక, నాగ నిషిత, నందిని (జిల్లా పరిషత్ హైస్కూల్ కె రామాపురం, రాయచోటి మండలం), నాటకం విభాగంలో భాను ప్రసాద్, భాను ప్రకాష్, రామ్ గణేష్ రెడ్డి, పృద్విరాజు (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి) దృశ్యకళల వ్యక్తిగత విభాగం, చిత్రలేఖనంలో ఎస్ మహమ్మద్ జయిద్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డైట్, రాయచోటి) శిల్పకళలో యశ్వంత్ రెడ్డి (ఏపీ మోడల్ స్కూల్, సంబేపల్లి), బొమ్మల తయారీలో వీర అశ్విని (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), సాంప్రదాయ కథ చెప్పడం (బుర్రకథ) నందు సమీరా, పూజా(ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి)లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీలలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలకు డిఈఓ జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా కేంద్ర, సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్, నాట్యకళాకారుడు స్వతంత్ర బాఉ, సంగీత ఉపాధ్యాయాఉలు నాగబూషణంలు వ్యవహరించారు. జిల్లాస్థాయి విజేతలుగా ఎంపికై న వారు అక్టోబర్ 24, 25వ తేదిలలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే కళా ఉత్సవ్ పోటీలలో పాల్గొంటారని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, డిసిఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి, డైట్ అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు, జిల్లాలో వివిధపాఠశాలల నుండి వచ్చిన గైడ్ టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
మదనపల్లె సిటీ : విద్యార్థులు క్రీడల్లోరాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక జరిగింది. విద్యార్థులు తమకు ఆసక్తికలిగిన క్రీడను ఎంచుకుని రాణించాలన్నారు. ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారన్నారు.కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్, హెచ్ఎం సుబ్బారెడ్డి, పీడీలు మురళీదర్రెడ్డి, సుధాకర్, దేవకమ్మ, అన్సర్, నరేష్, మహేంద్రనాయక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అండర్–19 బాలుర ఫుట్బాల్ జట్టు: పి.రేవంత్, డి.నరేష్, జి.రాఘవేంద్ర, వై.వంశీకళ్యాణ్, వి.కార్తీక్,, ఎం.జీవన్సాయి, పి.దీక్షిత్రెడ్డి, కె.త్రివేది, టి.జాకబ్జయంత్, ధామస్, వి.ఉదయ్ముని, జి.హరీష్భారత్, సి.సుధీర్, పి.మనోజ్కుమార్, ఎ కెల్విన్కెనత్, డి.శివరంగ్, పి.నికిత్ స్టాండ్బైలుగా సాయికిరణ్, ఎన్.జ్యోతిష్సాయి, ఎస్.ఇమ్రాన్సయ్యద్,పి.యాసర్లు ఎంపికయ్యారు. అండర్–19 బాలికల జట్టు: ఎన్.విష్ణుప్రియ, కె.నిశ్చిత,జి.హేమశ్రీ, ఎం.తన్మయ, పి.స్వాతి, యు.హారిక, జి.నూతనహర్షవర్థిని, బి.శశికళ,ఎ.హాతిక, జి.హాన్సిక, ఈ.దేవిక,ఎస్.సహనాజ్, జి.పూజిత, కె.నందిని, ఎం.భావ్య, ఎన్.పల్లవి, జె.అనిత, స్టాండ్బైలు కె.స్నేహ, ఎస్.తబుసుమ్, జి.మాలతి, కె.శుభశ్రీలు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు తెలిపారు. ఎంపికై నవారు హిందుపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై వారికి స్తానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పీడీలు దేవకమ్మ,అన్సర్, సుదాకర్,జలజ తెలిపారు. స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి నాగరాజు -
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూనియర్ కబడ్డీ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలికలు 150 మంది, బాలురు 200 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరి శ్రీకాంత్రెడ్డి, సెక్రటరి చంద్రావతి, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ గురుశేఖర్, సెక్రటరి సుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాణి,ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరి చంద్రహాజరాజు, విక్టర్ కోచ్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి కబడ్డీ పోటీలకు ఎంపికై నది వీరే.. బాలురు జట్టు : వేణుసాయి, దుర్గశంకర్, బ్రహ్మయ్య, నూర్ భాష, మల్లి ఖార్జున, కలాం, సాయి ప్రసాద్, యశ్వంత్, జయంత్ నాయక్, హుస్సేన్, మల్లిఖార్జున, నరేంద్ర, జశ్వంత్, గఫార్ బాషా. బాలికల జట్టు : జ్యోత్న, నీల మహేశ్వరి, రంగ శివజ్యోతి, సునీత, పల్లవి, సిఎం రామలక్ష్మీ, వర మేఘన, హేమ ప్రియ, షషీనా, మైధిలి, అయ్యవారమ్మ, గంగాదేవి, అనిత, కృపా జ్యోతి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న బాలుర జట్టు రాష్ట్ర పోటీలకు ఎంపికై న బాలికల జట్టు -
ఉచిత బస్ ఎఫెక్ట్ .. పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీలకు ఉచిత బస్సు పథకం.. రైల్వే ఆదాయానికి గండికొండుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మహిళా ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో మహిళా బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైళ్లలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు తొలగిస్తూ వస్తున్న క్రమంలో.. ఈ పథకం రైల్వే ఆదాయానికి మరో దెబ్బ కొట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తోందో.. వేచి చూడాల్సిందే. రాజంపేట: ఉభయ జిల్లాల మీదుగా మార్గంలో 25 స్టేషన్లు ఉండగా, డైలీ 30 (అప్ అండ్ డౌన్) రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో రైల్వేలకు వస్తున్న ఆదాయం పట్టాలు తప్పుతోంది. ఇప్పటి నుంచే అధికారుల్లో ఎర్నింగ్స్(ఆదాయం)పై ఆందోళన రోజురోజుకు హెచ్చరిల్లుతోంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో నడిచే నంద్యాల–రేణిగుంట డెమో ప్యాసింజర్, అరకోణం నుంచి కడప వరకు నడిచే అరక్కోణం, తిరుపతి నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఉచిత బస్ (సీ్త్రశక్తి పథకం) ప్రభావం పడింది. దీంతో రైల్వే ఆదాయనికి ఉచిత బస్ (ఆర్టీసీ) గండికొట్టిందనే రైల్వే నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మోదీ సర్కారు రాయితీలను రానురాను తీసేసుకుంటూ వస్తోంది. జర్నలిస్టుల పాస్లతోపాటు అన్ని రకాల రాయితీలకు మంగళం పాడిన సంగతి విదితమే. రైల్వేకమర్షియల్ విభాగాన్ని.. ఇప్పుడు ఉచితబస్తో ఎర్నింగ్స్ కోల్పోతున్న అంశం వేధిస్తోంది.రైలు ప్రయాణానికి మహిళలు దూరంఏ రైలులో అయినా గార్డుబ్రేక్ ముందు ఉండే లేడీస్కోచ్లో సీట్ల కోసం మహిళలు పోటీపడే పరిస్థితులు నిత్యం కొనసాగుతుండటం విదితమే. ప్రతి స్టేషన్లో అధికంగా మహిళలు ఈ కోచ్లో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లేడీస్కోచ్లో కనీసం పదిమంది కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఆసక్తి చూపుతుండటమే.. ఇందుకు కారణమని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితమే అన్న భావనలో రైలు ప్రయాణాలకు స్వస్తి చెపుతుండటం గమనార్హం.మచ్చుకు.. ఒంటిమిట్ట తీసుకుంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక రామాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఉమ్మడి కడప జిల్లా కానీ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి ఒంటిమిట్టలో ఆగే రైళ్లకు వచ్చేవారు. ఫలితంగా నిత్యం రూ.4 వేలు లోపు ఎర్నింగ్స్ వచ్చేంది. ఇప్పుడు అది రూ.400కు పడిపోయింది.చాలా బోగీల్లో ఖాళీగా సీట్లుముంబయి–చైన్నె రైలు మార్గంలోని ఉమ్మడి కడప జిల్లా మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లు బోసిపోతున్నాయి. ప్రయాణపు ధర తక్కువ అయిన క్రమంలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉండేవి. బోగీలు మహిళలతో కళకళలాడేవి. ఇప్పుడు ఆ దృశ్యాలు రైలు బోగీలు దూరమయ్యాయి. చాలా మటుకు బోగీల్లో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.తెలంగాణ, తమిళనాడుకు వెళ్లే రైళ్లలో..తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో లాంగ్ జర్నీ లేడీస్ కనిపిస్తున్నారు. ఈ రైళ్లలో తిరుపతి, రేణిగుంట, రైల్వేకోడూరు, కడప, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, అనంతపురం, రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితంగానే మహిళలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంత రైళ్లపై కూడా లోకల్ జర్నీ తగ్గిపోయిందని రైల్వే వర్గాలు పేర్గొంటున్నాయి. ఫలితంగా ఈ విధంగా కూడా రైల్వే ఆదాయాన్ని ఉచిత బస్ పథకం గండికొట్టింది.ప్యాసింజర్ రైళ్లపై తీవ్ర ప్రభావం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైలు మార్గంలో ప్రతి రైల్వేస్టేషన్లో ఎరి్నంగ్స్ పడిపోతున్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల ప్రయాణంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పేదోడి రైళ్లుగా నడు స్తున్న వీటిలో.. తక్కువ వ్యయంతో గమ్యాలకు చేరుకోవచ్చన్న భావనలో మహిళలు ప్రయాణాలు సాగించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సుతో రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపడం లేదు. కడప నుంచి ఒంటిమిట్ట, నందలూరు, తిరుపతి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు నంద్యాలడెమో, ఇంటర్సిటీ, అరకోణం రైళ్లను మహిళలు ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నంద్యాల నుంచి కడప, తిరుపతి కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా ఈ మూడు రైళ్లు ఆగే స్టేషన్లలో ఎర్నింగ్ పడిపోతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా సమాచారం మార్గం: ముంబయి–చెన్నై రైళ్లు : 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25కిలోమీటర్లు: 180 -
పర్యవేక్షణ శూన్యం.. పచ్చదనం మాయం
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పచ్చదనం మాయమవుతోంది. టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పచ్చదనం పరుచుకుంది. ఆలయ పరిసర ప్రాంతంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద పచ్చదనం ఆహ్లాదం కలిగిస్తోంది. మిగిలినవి మొక్కలు స్థానిక సీఎం విడిది గృహం వద్ద ఉంచారు. అయతే పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ నిత్యం పశువులు మొక్కలను పాడు చేస్తున్నాయి. మొక్కలను పెంచిన టీటీడీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మొక్కలను పశువులు తినేస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. – ఒంటిమిట్ట -
రెడ్బుక్ రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ కూడా లేదు
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి కూడా స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. స్టేట్మెంట్ పబ్లిష్ చేస్తే కేసులు పెడతారా? కంటెంట్ మారినా.. ఒక నాయకుడి ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు ఈ రాష్ట్రంలో లేవా? ప్రజాస్వామ్య దేశంలో మొదటి సారి ఇలాంటి విచిత్రాలు చూస్తున్నాం. ఎంతో కాలం ఇలాంటి ఆగడాలు సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం సమంజసం కాదు ఒక రాజకీయ నాయ కుడు తన అభిప్రా యాన్ని తెలియయజేసినప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రజల పక్షాన ఉన్న పత్రికల బాధ్యత. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం సమంజసం కాదు .అది పత్రికా స్వేచ్ఛను,వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే.కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఆగడాలు ఎంతో కాలం సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీవిప్, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు మీడియా స్వేచ్ఛను హరించడమే రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని, ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, ఎడిటర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం..ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది.ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు..ప్రజల ముందు కూడా నిలబడవు. –గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ -
భార్య కోసం బైక్ పై వెళ్తూ దుర్మరణం
మదనపల్లె : భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై వెళ్తున్న భర్త దుర్మరణం పాలైన ఘటన గురువారం రాత్రి మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మదనపల్లె ఎస్టేట్లో కాపురం ఉంటున్న వి.నాగార్జున (29) చేనేత కార్మికుడుగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. వాల్మీకిపురం మండలం చింతపర్తిలో ఉన్న తన భార్య లావణ్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై చింతపర్తికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో కాశీరావుపేట వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం నాగార్జున ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగార్జున అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలుమదనపల్లె : గర్భిణీ అయిన భార్య ఆస్పత్రికి తరలించగా.. ఆమె కోసం బైక్ పై మదనపల్లి వస్తున్న భర్త, అతని మిత్రుడు ప్రమాదానికి గురైన ఘటన గురువారం రాత్రి కురబలకోట మండలం అంగళ్లు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు. బి.కొత్తకోటకు చెందిన శ్రీనాథ్ భార్య గర్భిణీ కావడంతో ఆమెను మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె వద్దకు వెళ్లేందుకు శ్రీనాథ్.. ములకల చెరువుకు చెందిన మిత్రుడు సురేష్ తో కలిసి బైక్ మీద బి.కొత్తకోట నుంచి మదనపల్లె కు బయలుదేరారు.మార్గ మధ్యంలో కురబలకోట మండలం అంగళ్లు హైవే పై వెళ్తుండగా వెనుక వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొంది. దీనితో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మస్తాన్, మనోహర్ స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని తిరుపతికి రెఫర్ చేశారు. -
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వీరబల్లి (సుండుపల్లె): అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళ్లితే.. సానిపాయి అటవీ ప్రాంతంలో అప్పయ్యగారిపల్లి సమీపంలో తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు సుబ్బరాయుడు, ఆర్ఎస్ఐ లింగాధర్ టీం కూంబింగ్ చేపట్టింది. అక్కడ రెండు కార్లలో కొందరు ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. వారిని వెంబడించి 15 మంది నిందితులను పట్టుకుని తనిఖీ చేయగా 15 ఎర్రచందనం దుంగలు లభించాయని పేర్కొన్నారు. పట్టుబడిన వారు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాసులు విచారించినట్లు తెలిపారు. అనంతరం సీఐ సురేష్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్
రాయచోటి: అన్నమయ్య జిల్లా నూతన కరెక్ట్ గా నిశాంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. స్థానికంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది జూలై 7వ తేదీన శ్రీధర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె సిటీ: క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా జ్ఞాన పరీక్ష–25 దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభారతి అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్, నరేష్ తెలిపారు. వ్యక్తిగత, బృందం కుటుంబం, స్నేిహితుల కూటమి విభాగాలుగా క్రీడాభారతి డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈనెల 14వ జరిగే ఆన్లైన్ పరీక్షలో 25 నిమిషాల్లో 50 క్రీడా క్విజ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో స్థానం పొందిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, నాలుగో స్థానం పొందిన వారికి రూ.10వేలు చొప్పున బహుతులు అందజేయనున్నట్లు చెప్పారు. కురబలకోట: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో గ్లోబల్ అవకాశాలు లభిస్తాయని, ఇది ప్రపంచంలో సరికొత్త ప్రబల సాంకేతిక శక్తిగా మారుతోందని తమిళనాడులోని కేఎస్ రంగస్వామి ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఆర్. గోపాలకృష్ణన్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కేరీర్ గైడెన్స్ కార్యక్రమంలో గురువారం ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. సాఫ్ట్, టెక్నికల్ స్కిల్స్, లీడర్షిప్ నైపుణ్యాలతో ఉపాధి, ఉద్యోగావకాశాలు సాకారం అవుతాయన్నారు. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించేది కూడా ఏఐయేనన్నారు.వివిధ రంగాల్లో కీలకంగా మారుతున్న ఈ టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించి భవిష్యత్ నిర్మాణం చేసుకోవాలని సూచించారు. రాయచోటి టౌన్: రైతులు ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి జి. శివనారాయణ తెలిపారు. గురువారం గొర్లమొదివీడు, యండపల్లె గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులుసేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీలత, డీపీఎం బీవీ మోహన్, రాయచోటి ఎంఏవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన కృష్ణమూర్తి, సుజాతమ్మ దంపతుల కుమారుడు కె.వెంకటేష్(35) తన స్వగ్రామంలో రైస్మిల్, పౌల్ట్రీఫారం నిర్వహిస్తున్నారు. ఇతడు భార్య కీర్తి, కుమారుడు రేషంత్, కుమార్తె వెన్నెలతో కలిసి మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరీనగర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం మద్యం అలవాటు కారణంగా లివర్ దెబ్బతిని అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆరు నెలలపాటు చిత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మూడునెలల క్రితం ఇంటికి వచ్చి వచ్చాడు. భార్య కీర్తి కోళ్లఫారం నిర్వహణకు వెళ్లగా.. మంగళవారం స్వగ్రామానికి వెళ్లిన వెంకటేష్ బుధవారం రాత్రి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అయోధ్యనగర్ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నయం కాదనే బెంగతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య కీర్తి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. -
రాయచోటిలో కళా ఉత్సవ్
రాయచోటి : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం రాయచోటి డైట్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం ప్రారంభించి మాట్లాడుతూ తమ ప్రతిభ ప్రదర్శించేందుకు విద్యార్థులకు చక్కటి వేదిక కళా ఉత్సవ్ అన్నారు. జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, కథా కథనం పోటీల్లో 146 మంది విద్యార్థులు పాల్గొన్నాని తెలిపారు. ఆరు విభాగాలలోని పన్నెండు అంశాలలో రెండు రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రథమ, ద్వితీయ. తృతీయ స్థానాలు పొందిన వారిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగమునిరెడ్డి, స్వతంత్ర బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి
మదనపల్లె సిటీ: నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా టీబీ, ఎయిడ్స్,లెప్రసీ అధికారి డాక్టర్ రమేష్బాబు అన్నారు. గురువారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఆర్టీ,ఐసీటీసీ,ఎస్టీఐ సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. హెచ్ఐవీ కేసులు నమోదు చేసి ఏఆర్టీలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించాలన్నారు. ఐఈసీ క్యాంపెయిన్ కాలేజీలు, హైరిస్క్ ప్రాంతాల్లో చేయాలన్నారు.హెచ్ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి హెచ్ఐవీ పాజటివ్ కేసులోనూ టీబీ పరీక్షలు చేయించాలన్నారు.ఐసీటీసీ,ఏఆర్టీ కేంద్రాల్లో సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్జీఓలతో కలిసి హైరిస్క్ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డేవిడ్ భాస్కర్, ఐసీటీసీ కౌన్సిలర్లు జయకుమార్,చంద్రమోహన్, పుల్లయ్యనాయుడు, దీప్తితో పాటు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎఎల్టీఓ రమేష్బాబు -
చోరీ కేసులో ఏడాది జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : చోరీ కేసుల్లో ముద్దాయికి మదనపల్లె రెండో అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జే.కీర్తన, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీకి చెందిన కావడి సోమశేఖర్, 2021లో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. అప్పటి పోలీస్ అధికారులు క్రైమ్నెంబర్.64/2021, 969/2021 కేసులు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం గురువారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు చోరీ కేసుల్లోనూ 248(2) సీఆర్.పీ.సీ. కింద దోషిగా నిర్ధారిస్తూ ఏడాది పాటు సాధారణ జైలుశిక్ష, రూ.1,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. టూటౌన్ పోలీసులు నిందితుడిని సబ్జైలుకు తరలించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యరామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అప్పులబాధ తాళలేక రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ వడ్డెపల్లికు చెందిన కుంచపు నాగేంద్ర(35) ఆత్మహత్య చేసుకున్నట్లు రామాపురం పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కుంచపు నాగేంద్ర ఎక్కువగా అప్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కలరు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని వైకోట గ్రామానికి చెందిన అంకిపల్లి చందన (08) అనే చిన్నారి విష జ్వరంతో గురువారం సాయంత్రం మృతిచెందింది. బంధువుల కథనం మేరకు.. అంకిపల్లి విజయ్, రాజేశ్వరీ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె చందన. వివాహం జరిగిన 18 ఏళ్ల తరువాత చందన పుట్టడంతో గారాబంగా ెపెంచుకున్నారు. బ్రతుకుదెరువుకోసం చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశానికి వెళ్లగా పెద్దనాన్న సుబ్రహ్మణ్యం వద్ద చందన ఉంటూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన చందన రెండుసార్లు వాంతులు కావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపారు. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ 105 డిగ్రీల జ్వరం చూపించింది. దీంతో పాపకు వాయువు వచ్చింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతిచెందింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి బయలుదేరారు. చందన మృతితో వైకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వర్షం కురవడంతో చెత్తా చెదారం కుళ్లి వారం రోజుల నుండి దోమలు అధికం కావడంతోవైకోట గ్రామంలోని ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివిరాజంపేట : అటవీ అమరవీరులు త్యాగాలు మరువలేనవని జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ అన్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయం(రాజంపేట)లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్ఓ క్యాంపస్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అటవీ ఉద్యోగులనుద్దేశించి డీఎఫ్ఓ మాట్లాడుతూ అటవీశాఖలో సేవలందిస్తూ ప్రాణాలు పొగొట్టుకున్నవారిని ఆ శాఖ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అటవీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు. బంగారం చోరీపెనగలూరు : మండలంలోని వడ్డి కాలనీ వద్ద జయమ్మ ఇంట్లో 13 తులాల బంగారం, పదివేల రూపాయలు నగదును దొంగలు అపహరించినట్లు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జయమ్మ కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటికి తాళం వేసి కడపలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి బుధవారం రాత్రి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులకొట్టి ఉన్నాయి. బీరువా తాళాలు పగులకొట్టి బంగారు, నగదు అపహరించినట్లు గుర్తించి ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాయచోటి నుంచి క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించింది. బంగారు చోరీ కేసు సీఐ బివి.రమణ విచారిస్తున్నట్లు తెలిపారు. షాపులలో సీసీ కెమెరాలు బిగించుకోవాలని ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి కోరారు. వాహనం ఢీకొని రైతుకు తీవ్రగాయాలుబి.కొత్తకోట : పనిమీద బి.కొత్తకోటకు వచ్చి బైక్ పై తిరిగి వెళుతున్న రైతును గురువారం రాత్రి స్థానిక రంగసముద్రం రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. వివరాలు..పీటీఎం మండలం రంగసముద్రంకు చెందిన రైతు సవరాల అన్నయ్య(60) సొంత పనిమీద బైక్ పై బి.కొత్తకోటకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రంగసముద్రం రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీనితో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని మదనపల్లెకు తరలించగా మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు.రోడ్డు ప్రమాదంలో... గాలివీడు : మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయలయ్యాయి. నూలివీడు నుంచి గాలివీడు వైపు వస్తున్న టెంపో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం ఢీ కొన్నాయి. ఇరువురికి గాయాలవడంతో క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పశువులు అడ్డొచ్చి.. మదనపల్లె: ఓ మహిళ బైక్ మీద పశువులు అడ్డొచ్చి ప్రమాదాన్ని గురైన ఘటన గురువారం రాత్రి జరిగింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లికి చెందిన అనురాధ ( 33) కురబలకోట మండలం ముదివేడులో నర్సరీ నిర్వహిస్తోంది. పనులు ముగించుకొని రాత్రి ఇంటికి బైక్ మీద వెళుతుండగా ముదివేడు వద్ద పశువులు ఒక్కసారిగా అడ్డు రావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో గాయపడింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినికి జాతీయ పురస్కారం సుండుపల్లె : కేరళ రాష్ట్రం కొచ్చిన్లో ఆల్ఏజీ గ్రూప్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్షిప్లో సుండుపల్లి వాసి కూరపాటి మౌక్తిక ప్రతిభ చూపారు. గ్రూపు, సింగిల్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. సుండుపల్లె సాయన్నగారిపల్లెకు చెందిన రంగనాథ్బాబు కుమార్తె బెంగళూరు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నారు. కేరళలో జరిగిన జిమ్నాస్టిక్ చాంపియన్స్ పోటీలలో ప్రతిభ కనపరిచి నేషనల్ అవార్డు అందుకున్నారు. -
కొరత.. కలత
యూరియా కోసం అన్నదాతల ఆవేదన రోదనగానే మారుతోంది. యూరియో.. రామచంద్రా అంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒక బస్తా ఎరువుకోసం మండే ఎండలో.. పస్తులతో రోజంతా పడిగాపులు తప్పడం లేదు. చాంతాడంతా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుకు.. కూటమి ప్రభుత్వం విషమ పరీక్ష పెడుతోంది. ● కొనసాగుతున్న యూరియా కష్టాలు ● క్యూలైన్లలో అవస్థలు పడుతున్న రైతులు నిమ్మనపల్లె/కురబలకోట: రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లెలో 250, బండ్లపైలో 250, వెంగంవారిపల్లెలో 290, నిమ్మనపల్లెలో 224, ముష్టూరులో 200 మొత్తంగా 1,214 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. అయితే తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో తమకు అందుతుందో లేదో అన్న భయంతో అధికసంఖ్యలో పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరికి యూరియా అందినా మరికొందరికి పూర్తిగా దక్కకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండవేడిమి, ఉక్కపోత అధికంగా ఉన్నా క్యూలైన్లో వేచిచూస్తూ అవస్థలు పడ్డారు. నిమ్మనపల్లె రైతుసేవా కేంద్రాల వద్ద ఒకరిద్దరు స్పృహ తప్పారు. వెంటనే స్థానికంగా ఉన్న రైతులు నీరు అందించి సపర్యలు చేయడంతో కోలుకున్నారు. యూరియా కొరత లేదని ఇప్పటికే 200 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, మరో 150 మెట్రిక్ టన్నులు మండలానికి కేటాయించారని అధికారులు తెలిపారు. ● కురబలకోట మండలంలోనూ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రైతు సేవాకేంద్రాల వద్ద రైతులు బారులుతీరారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో ఒక్కో రైతుకు ఒక బస్తామాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎలా సాగు చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై స్థానిక వ్యవసాయాధికారితో మాట్లాడగా మండలానికి 40 టన్ను లు వచ్చిందని, ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభం అయ్యాయి. స్థానిక కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 57 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా చక్కగా బ్యాటింగ్ చేసి 107 పరుగులు, సాయి గణేష్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని షేక్ కమిల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్సార్ఆర్ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోషన్ పవన్ కుమార్ 213 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో అద్బుతంగా బ్యాటింగ్ చేసి 226 పరుగులు చేశాడు. సోహర్ వర్మ 53 పరుగులు, సూతేజ్ రెడ్డి 89 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులా?
రాయచోటి : సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేసేలా కలెక్టర్, ఎస్పీలు అక్రమ కేసులు బనాయించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ అన్నారు. సీపీఐ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులపై దేశంలో చేయని కుట్రలు, పెట్టని కేసులు లేవన్నారు. సమస్యలపై పోరాటాలు చేసే సందర్భంలో లాఠీ దెబ్బలు పడినా, తూటాలు పేలినా రక్తాన్ని చిందించడమేగానీ, వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు అవస్థపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఎనభై శాతం యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిందంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 8న వందలాది మంది రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిపై కేసులు పెట్టని పోలీసులు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. యూరియా పుష్కలంగా ఉంటే ఎందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ప్రశ్నించారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల చుట్టూ రైతులు తిరగడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను అమలు చేయాలని అడిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిని స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టడం సిగ్గు చేటన్నారు. మంత్రుల పర్యటనల సమయంలో కమ్యూనిస్టులను గృహనిర్భంధాల పేరుతో అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. కోడూరు ప్రాంతంలో బొప్పాయి పండించే రైతన్నకు మద్దతు ధర కల్పించాలని అడిగిన కమ్యునిస్టు నాయకులపైనా బైండోవర్ కేసులు పెట్టడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబరుకు ఎనిమిది ఫిర్యాదులందినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని కలెక్టర్, ఎస్పీలను ఆయన ప్రశ్నించారు. జిల్లాలో భూ కబ్జాదారులు పెరిగిపోయి ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా దోచుకుంటున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు. ఎస్ఐలను పోలీసు స్టేషన్లో అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నా కేసులు పెట్టని ఎస్పీ ప్రజలు, రైతుల సమస్యలపైన నిరసన తెలిపిన వారిపై నమోదు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కలెక్టర్, ఎస్పీలపై దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, మండెం సుధీర్, పి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ -
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు ● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత బద్వేలు అర్బన్/ప్రొద్దుటూరు క్రైం : బద్వేల్ పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ వార్డులో చూసినా ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్సకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యుల కొరత ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల్లో బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 250 నుండి 400 ఓపీ నమోదవుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఆస్పత్రి కిటకిటలాడుతున్నా తగినంతమంది వైద్యులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఆరుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్పై వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షలు నిర్వహించే యంత్రం మరమ్మతులకు గురికావడంతో రోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రక్తనమూనాలు సేకరించి గాంధీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో పరీక్ష చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. కిక్కిరిసిన చిన్నపిల్లల వార్డు ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజూ సుమారు 1100 దాకా ఓపీ నమోదవుతోంది. మరోవైపు రాజుపాళెం, కామనూరు, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఓపీ పెరిగింది. కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు వర్షాలు పడుతుండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జ్వరం, జలుబు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కిటకిటలాడుతోంది. 20 మంచాలు మాత్రమే ఉండడంతో 30 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. మంచాల కొరత కారణంగా ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటుగా మరింతమంది చికిత్స పొందుతున్నారు. రక్త పరీక్షల కోసమే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఓపీ కోసం బారులు తీరిన జ్వరపీడితులు చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు -
హైవేపై తప్పిన ప్రమాదం
సిద్దవటం : బియ్యం రవాణా చేస్తున్న ఐచర్ హనం అతి వేగంగా వస్తూ మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై చర్చి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. రహదారికి అడ్డంగా ఉన్న వాహనాన్ని తొలగిస్తున్నామని, క్రాసింగ్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. భూమి కోసం ఘర్షణ కలకడ : భూమి కోసం జరిగిన ఘర్షణలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్కుమార్–ప్రసాద్రెడ్డిలకు భూవివాదం ఉంది. బుధవారం ఈ విషయమై మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. దీంతో ప్రవీణ్కుమార్పై కొడవలితో ప్రసాద్రెడ్డి, సునీతలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకీపురం ప్రభుత్వం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైధ్యం కోసం మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
రేషన్ కోసం వెళ్తూ... కారు ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : ఇంటింటికీ బియ్యం వాహనం ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ బియ్యం తెచ్చుకోవాలని వెళ్తూ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా, అతని మనవరాలు గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లెలో జరిగింది. బి.కె.పల్లెలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న బుడెన్సాబ్ కుమారుడు మస్తాన్(59) స్థానిక రేషన్ దుకాణానికి, మనవరాలు సమీహకౌసర్(09)తో కలసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. బైపాస్ రోడ్డులోని చంద్ర కాలనీ వద్ద, అనంతపురం నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లగా, మనవరాలు గాయపడింది. స్థానికులు బాధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు మస్తాన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. కాగా మృతునికి భార్య హబీబున్నీసా, ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. -
ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీని, జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వ విధానాలు బలహీన పరుస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు శివ దాసన్ తీవ్రంగా విమర్శించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అధ్యక్షతన బుధవారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సెమినార్ లో సీపీఎం రాజ్యసభ్యులు శివదాసన్ మాట్లాడుతూ దేశంలో యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని, విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేటాయింపులు తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రించలేని స్థితి నెలకొన్నదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు విగ్రహాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, కానీ స్కూళ్లను, హాస్పిటల్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై ఉందని, పెన్షన్ సదుపాయం అన్నది రాజ్యాంగ హక్కు అని పాలకులు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవధానం శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మి రాజా, నాగమునిరెడ్డి, రాజశేఖర్ రాహుల్, రవితేజ, ఎన్.శివశంకర్ , రామ్మూర్తి నాయుడు, అజీజ్, లలిత, రామకృష్ణా రెడ్డి, సుధాకర్, వెంకటరామరాజు, సుబ్బారెడ్డి, డి.మొహమ్మద్, ఎ. సుబ్బారావు, వి.రామంజులరెడ్డి పాల్గొన్నారు. -
సారా విక్రేత అరెస్ట్
నిమ్మనపల్లె : బుధవారం ముష్టూరు గ్రామానికి చెందిన చిన్నఅప్పోడు(60) స్థానికంగా సారా తయారుచేసి విక్రయిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి పది లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. భార్య కోసం సెల్ టవర్ ఎక్కిన భర్త రైల్వేకోడూరు అర్బన్ : తన భార్య ఇంటికి రాలేదని పట్టణంలోని ధర్మాపురానికి చెందిన బాలయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. కల్యాణ్ పదేళ్ల కిందట లతను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లత పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత అడిగినా భార్య రాకపోవడంతో దిగులు చెందిన భర్త పట్టణంలోని పాత తహసీల్దారు కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దారు అమర్నాథ్, ఎస్సై లక్ష్మప్రసాద్రెడ్డి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడతామని హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు. ఆగిన ఐచర్ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి సంబేపల్లె : సిగ్నల్ లైట్లు వేయకుండా పిన ఐచర్ను ఢీకొని జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గుట్టపల్లె సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా రామాంజులు (52) బుధవారం మృతిచెందారు. కలకడ మండలం బాటవారిపల్లెకు చెందిన రామాంజులు ద్విచక్ర వాహనంలో బుధవారం తెల్లవారుజామున రాయచోటికి వసుత్న్నారు. గుట్టపల్లె సమీపంలోకి రాగానే సిగ్నల్ లైట్లు లేకుండా జాతీయరహదారిపై ఆపిన ఐచర్ వాహనాన్ని డీకొన్నారు. ఈ ప్రమాదంలో రామాంజులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని పాయిరామన్న వీధిలో కాపురముంటున్న సోమ శేఖర్(20) డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామసముద్రం మండలంలో చెంబుకూరుకు చెందిన మహేష్ భార్య సునీత (25)కు జ్వరంతో బాధపడుతూ, మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త మహేష్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. మహేష్ కుదరదనడంతో మనస్థాపం చెంది, జ్వరానికి తెచ్చుకున్న మాత్రలు ఒకేసారి మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
రామసముద్రం : అక్రమాలకు పాల్పడిన ఎలవానెల్లూరు, కురిజల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి నందకుమార్ రెడ్డి తెలిపారు. రామసముద్రం తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. నందరకుమార్రెడ్డి మాట్లాడుతూ 1 ఏప్రిల్, 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన వివిధ రకాల పనులపై సామాజిక తనిఖీ జరిగిందన్నారు. గడచిన ఏడాదిలో 1287 పనులకు రూ.9.63 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.31,365 వేలు, రైతుల నుంచి రూ.1,07,113 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎస్టీఎం లోకేశ్వర్ రెడ్డి, వెంకయ్య, గపూర్, మాధవి, గౌరీశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..
నేను ఎమర్జెన్సీ రోజులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో చెబుతున్నాను. ఆరోజుల్లో పత్రికలపై సెన్సార్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పటిలాగా సాక్షి పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై ప్రత్యక్ష దాడులకు పా ల్పడటం, కేసులు నమోదు చేయడం వంటివి చూడలేదు. వ్యక్తులు లేదా ప్రభుత్వంపై ఏవైనా వ్యతిరేక వార్తలు వచ్చిన సందర్భాల్లో వాటిని ఖండించాలి. నిజానిజాలేవో తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. ఒకవేళ పత్రికా యాజమాన్యం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులను పక్కకు నెట్టి దాడులు, ‘సాక్షి’ ఎడిటర్పై కేసులు నమోదు చేయడం అంటే అది పూర్తిగా అప్రజాస్వామికమవుతుంది. ఇలాంటి ధోరణులను ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలి. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే పరిణించాల్సి ఉంటుంది. ఓ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురిస్తే కేసు నమోదు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదు. డీఎస్పీల పదోన్నతుల్లో లంచాలు చోటుచేసుకున్నాయనే కథనంపై ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒకవేళ ‘సాక్షి’లో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయని భావిస్తే వివరణ ఇవ్వాలి. నిజాలేవో వెల్లడించాలి. అంతేగానీ కేసులు, దాడులకు దిగడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుంది. – పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రోజురోజుకూ రాష్ట్రంలో పత్రికలపై దాడు లు పెచ్చరిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలను వెలుగులోకి తీసుకు వస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయిస్తోంది. ఓ ప్రెస్కాన్ఫరెన్స్ వార్తను రాసినందుకు ఎడిటర్కు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో అర్థమవుతుంది. ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు ఖండన లేదా వివరణ లాంటివి ఇవ్వకుండా ఎడిటర్పై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయాలనుకోవడం తగదు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ధోరణులను ప్రతి ఒక్కరూ ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. – సి.వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ -
మహిళా సాధికారత కోసమే మిషన్ శక్తి పథకం
రాయచోటి : మహిళల భద్రత, సాధికారత పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించిందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా మిషన్ శక్తి పథకంలో భాగంగా సంకల్ప కార్యక్రమాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రతకు చట్టాలను చేయడం జరిగిందని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం భేటీ భచావో, భేటీ పడావో, మహిళల భద్రత, చట్టపరమైన అవగాహన, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మహిళలు–కౌమార బాలికల ఆరోగ్యం, పోషకాహారం, సమాజంలో జరిగే క్రైమ్ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారిణి హైమావతి, తదితరులు పాల్గొన్నారు.