ముగిసిన మేరీమాత ఉత్సవాలు
వేగేశ్వరపురం (తాళ్లపూడి): మేరీమాత దర్శనమాత అని పుణ్యక్షేత్ర డైరెక్టర్ జి.డేవిడ్ అన్నారు. వేగేశ్వరపురంలోని నిత్య సహాయ గోదావరి మేరీమాత మహోత్సవాలు ఆదివారంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో బిషప్ పొలిమెర జయరావుకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పశువుల పాక, (బాలేసు ప్రభు మందిరం), ఫాతిమా మాత విగ్రహాలను ఆవిష్కరించారు. ఫాదర్ ఐ. మైఖేల్, దగాని జేవియర్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మేరిమాత ఆలయ ప్రాంగణంలోని గెత్సమనే తోటలో ఏసుప్రభువు విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విజయవాడ కళాదర్శన్ వారితో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఫాదర్ జె.డేవిడ్ మాట్లాడుతూ మేరీమాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోందన్నారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా దేవుడి అనుగ్రహం పొందవచ్చన్నారు. వేగేశ్వరపురంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.