యాపిల్ను మించిన రిలయన్స్
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అంతర్జాతీయంగా అత్యుత్తమ బ్రాండ్స్ జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టి, లిస్టులో ఏకైక భారతీయ కంపెనీగా నిల్చింది. సోమవారం విడుదలైన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2024 జాబితాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2023లో 13వ స్థానంలో ఉన్న రిలయన్స్ తాజాగా రెండో స్థానానికి ఎగబాకింది. కొరియన్ బ్రాండ్ శాంసంగ్ ఈ లిస్టులో అగ్రస్థానంలో నిల్చింది. ఇందులో యాపిల్, నైకీ, వాల్ట్ డిస్నీ, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టయోటా మొదలైనవి ఉన్నాయి. ఎప్పటికప్పుడు మార్కెట్లో మార్పులను సమర్థంగా ఎదుర్కొంటూ, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించే వ్యూహాలతో ముందుకెళ్తున్న బ్రాండ్లకు జాబితాలో చోటు దక్కింది. మార్కెట్ క్యాపిటలైజేషన్పరంగా పీడబ్ల్యూసీ టాప్ 100 కంపెనీలను 18 అంశాల ప్రాతిపదికన ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ మదింపు చేస్తుంది. భవిష్యత్తులో విజయం సాధించగలిగే సత్తా ఉన్న బ్రాండ్లకు లిస్టులో చోటు కల్పిస్తుంది. ‘గత పదేళ్లుగా పరిణతి చెందిన గ్లోబల్ దిగ్గజాలు, సవాలు విసిరే కొత్త సంస్థలు, తమ లక్ష్యానికి కట్టుబడి ఉంటూ మెరుగైన అనుభూతిని అందిస్తున్న శక్తివంతమైన బ్రాండ్లు అనేకం కనిపించాయి‘ అని ఫ్యూచర్బ్రాండ్ ఇండెక్స్ నివేదిక పేర్కొంది. గతంలో అమెరికా, యూరప్లో చూసినట్లుగా ఆసియా పసిఫిక్, మధ్యప్రాచ్య దేశాలు బ్రాండ్లపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.