మహిళలకు మోదీ వరాలు!
కాంగ్రెస్ పాలనలో గడచిన సమయం మొత్తం పలు అవకాశాలను కోల్పోయిన కాలంగా ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ పదే పదే ప్రకటిస్తూ వస్తున్న అంశం. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నరేంద్రమోదీ ప్రభుత్వ తొలి పూర్తిస్థాయి ఆర్థిక సంవత్సరం (2015-16) బడ్జెట్లో ఉండనున్న అంశాలు ఏమిటి? ఎటువంటి అవకాశాలను తిరిగి చేజిక్కించుకుని, కొత్తదనాన్ని ఆవిష్కరిస్తుంది అన్న ప్రశ్నపై ఆర్థికవేత్తలు దృష్టి సారిస్తున్నారు. వీటిలో మహిళల సాధికారత ఒకటై ఉండవచ్చని సైతం కొందరి అంచనా.
మహిళల అభివృద్ధే లక్ష్యంగా...
ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యంతో దేశం మరింత ముందుకు వెళుతుందని తాము విశ్వసిస్తున్నట్లు పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొంటూ వచ్చారు. ఈ దిశలో బడ్జెట్లో చర్యలు ఉండవచ్చని భావిస్తున్నారు. మహిళలకు సంబంధించి కార్యక్రమాలు, విధానాలకు తగిన నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ 2014 ప్రకారం 142 దేశాలను చూస్తే, భారత్ ర్యాంక్ 114. ప్రధానంగా ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచీ కూర్పు ఉంది. అందులో ఒకటి ఆర్థిక భాగస్వామ్యం - అవకాశాలు. రెండవది విద్య. మూడవది రాజకీయ సాధికారత. నాల్గవది ఆరోగ్యం-జీవన ప్రమాణాలు. ఐదవది మహిళలపై జరుగుతున్న నేరాలు. ఈ నేపథ్యంలో మహిళాభివృద్ధికి కేంద్రం బడ్జెట్లో పలు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి...
దేశంలో మహిళాభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా 2005లో భారత్ ‘జండర్-రెస్పాన్సివ్ బడ్జెటింగ్’ (జీఆర్బీ) విధానాన్ని ప్రారంభించింది. మహిళా హక్కుల పరిరక్షణ-లింగ వివక్షత నిర్మూలన లక్ష్యంగా ప్రణాళికలు, కార్యక్రమాల అమలు, నిధుల కేటాయింపులు ఈ విధాన ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకూ దాదాపు 57 ప్రభుత్వ శాఖలు జండర్ బడ్జెటింగ్ సెల్స్ను ఏర్పాటు చేశాయి. తద్వారా కోట్లాది మంది మహిళలు పలు రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఎంతోకొంత కృషి జరుగుతోంది. అయితే గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మొత్తం బడ్జెట్లో దామాషా ప్రాతిపదికన మహిళాభివృద్ధికి కేటాయింపులు దాదాపు 5.5 శాతంగానే కొనసాగుతున్నపరిస్థితి ఉంది.
ఇందుకు సంబంధించి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎండబ్ల్యూసీడీ)కు కేటాయింపుల్లో స్వల్ప వృద్ధి మాత్రమే కనిపించింది. 2012-13లో ఈ కేటాయింపుల మొత్తం రూ.18,584 కోట్లు కాగా, 2014-15లో ఈ మొత్తం కేవలం రూ.21,193 కోట్లకు చేరింది. ఒక్క మహిళా సంక్షేమానికి నిధుల కేటాయింపు విషయానికి వస్తే, 2011-12లో రూ.930 కోట్లు కాగా, 2014-15లో ఈ మొత్తం రూ.920 కోట్లకు తగ్గిపోయింది. సాహస్ అనే మహిళా పథకానికి గత ఏడాది రూ.50 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపుల్ని వచ్చే బడ్జెట్లో పెంచుతారన్న అంచనాలు వున్నాయి.
‘బేటీ బచావో’పై మరింత దృష్టి...
కొత్త ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ‘బేటీ బచావో బేటీ పఢావో (ఆడపిల్లలను కాపాడండి. ఆడపిల్లలను చదివించండి) పథకం పటిష్ట అమలుకు సంబంధించిన ప్రకటన ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వుండవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.