ఆమెకు బెయిల్ లభించలేదు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఇంకు చల్లిన 26 ఏళ్ల భావన అరోరాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఆమెను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్పై భావన ఇంకు చల్లడం పబ్లిసిటీ స్టంట్ లాంటిదని, ఆమె చర్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, న్యాయంపై దాడి చేయడమేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. భావన ఇంకు దాడి వెనుక వాస్తవ ప్రేరేపణ ఏమిటో తాము తెలుసుకోదలిచామని న్యాయస్థానానికి నివేదించారు. ఈ కేసులో కోర్టు రహస్యంగా విచారణ జరుపుతున్నది.
'సరి-బేసి' అంకెల విధానం విజయవంతమైన సందర్భంగా ఢిల్లీలోని ఛత్రసల్ మైదానంలోని జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా గత ఆదివారం భావన ఆరోరా ఇంకు చల్లిన సంగతి తెలిసిందే. సీఎన్జీ స్టిక్కర్స్ కుంభకోణంలో ఆప్ ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తూ ఆమె ఈ చర్యకు పాల్పడింది.