breaking news
Bisleri water Bottle
-
బిస్లెరీని విక్రయించం: రమేష్ చౌహాన్
న్యూఢిల్లీ: ప్యాకేజ్డ్ వాటర్ బిజినెస్ బిస్లెరీ ఇంటర్నేషనల్ను విక్రయించే ప్రణాళికలేవీ ప్రస్తుతానికి లేవని వెనుకటితరం పారిశ్రామికవేత్త రమేష్ చౌహాన్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు ఎవరితోనూ చర్చలు నిర్వహించడంలేదని తెలియజేశారు. బిస్లెరీ విక్రయానికి నాలుగు నెలలుగా టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్తో కంపెనీ చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే బిస్లెరీ కొనుగోలుకి ఎలాంటి ఒప్పందమూ కుదుర్చుకోలేదని, చర్చలు విరమించుకున్నామని ఇటీవలే టాటా కన్జూమర్ ప్రకటించింది. వెరసి టాటాతో డీల్ చర్చలకు తెరపడిన మూడు రోజుల తదుపరి చౌహాన్ తాజాగా ఇచ్చిన వివరణకు ప్రాధాన్యత ఏర్పడింది. కాగా.. గతేడాది నవంబర్లో టాటా కన్జూమర్సహా పలు సంస్థలతో బిస్లెరీ విక్రయానికి చర్చలు జరుపుతున్నట్లు చౌహాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. కుమార్తెకు ఆసక్తి లేదు: బిస్లెరీ బిజినెస్ను ఇకపై ప్రొఫెషనల్స్ హ్యాండిల్ చేయవలసి ఉన్నట్లు చౌహాన్ వ్యాఖ్యానించారు. అయితే తన కుమార్తె జయంతికి బిస్లేరీ బిజినెస్పట్ల ఆసక్తి లేదని తెలియజేశారు. బాటిల్డ్ వాటర్ విభాగంలో బిస్లేరీ ఇంటర్నేషనల్ ప్రధానంగా బిస్లేరీ బ్రాండుతో బిజినెస్ నిర్వహిస్తోంది. వేదికా బ్రాండుతో స్ప్రింగ్ వాటర్ను సైతం అందిస్తోంది. అంతేకాకుండా స్పైసీ, లిమొనాటా, ఫోంజో, పినాకోలాడ బ్రాండ్లతో ఫిజ్జీ డ్రింకులను సైతం ఆఫర్ చేస్తోంది. సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్లు థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కాలను మూడు దశాబ్దాల క్రితం(1993) యూఎస్ దిగ్గజం కోకకోలాకు చౌహాన్ కుటుంబం విక్రయించిన సంగతి తెలిసిందే. హిమాలయన్ బ్రాండుతో ఇప్పటికే టాటా కన్జూమర్ బాటిల్డ్ వాటర్ విభాగంలో బిజినెస్ను కలిగి ఉంది. గ్రూప్ కంపెనీలు టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బెవరేజెస్ కలయికతో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆవిర్భవించింది. హైడ్రేషన్ విభాగంలోని టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో బ్రాండ్లు సైతం ఈ కంపెనీవే. -
బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలంటున్నారు
ఆర్టీసీ సర్క్యులర్పై హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని ఆర్టీసీ అధికారులు జారీ చేసిన సర్క్యులర్పై పలువురు వ్యాపారులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. తమ వ్యాపారంలో జోక్యం చేసుకోకుండా వారిని ఆదేశించాలని డి.జాహెద్ బాషా, మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సి.రామచంద్రరాజు వాదనలు వినిపిస్తూ.. బస్టాండ్లలో బిస్లరీ వాటర్ బాటిళ్లనే అమ్మాలని, ఒకే పంపిణీదారు నుంచి వాటిని కొనుగోలు చేయాలని ఆర్టీసీ అధికారులు గత డిసెంబర్ 9న సర్క్యులర్ జారీ చేశారని చెప్పారు. దీంతో సాధారణం కన్నా ఎక్కువ ధరకు బాటిళ్లను వ్యాపారులు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. ఇతర కంపెనీల బాటిళ్లను విక్రయించొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారని, అధికారుల నిర్ణయం వల్ల పిటిషనర్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. అన్ని కంపెనీల వాటర్ బాటిళ్లనూ విక్రయించేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.