పెంచిన చార్జీలు తగ్గించాలి
{పభుత్వానిది ఒంటెద్దు పోకడ డీసీసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి
కాంగ్రెస్తో పాటు పలు పార్టీల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళనలు
మహబూబాబాద్ : పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాతబజారులోని రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనను ఉద్దేశించి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒంటెద్దు పోకడ పోతోందని ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే పలు పార్టీలతో పాటు ప్రజలు సైతం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ ఎన్నో హామీలిచ్చి వాటిని విస్మరించారన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంభిస్తొందని 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పెంచిన చార్జీలను తగ్గించకపోతే పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామన్నారు. కేంద్ర మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు పోరిక బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. చార్జీల పెంపు విషయంపై ప్రతిపక్షాలతో ఎలాంటి సమావేశం నిర్వహించకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగుదామని నోటీస్ ఇస్తే ఆర్టీసీనే ఎత్తేస్తామని మాట్లాడిన ఏకైక సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇంచార్జి జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ భూక్య ఉమ, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, నాయకులు ముల్లంగి ప్రతాప్రెడ్డి, రావుల రవిచందర్రెడ్డి, వెన్నం లక్ష్మారెడ్డి, గుగులోత్ సుచిత్ర, నూనావత్ రాధా పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
పెంచిన విద్యుత్, బస్సు చార్జీలను తగ్గించాలని టీడీపీ ఆధ్వర్యంలో తొర్రూరు రోడ్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భూపతి మల్లయ్య, జిల్లా అధికార ప్రతినిధి చుక్కల ఉదయ్చందర్, పార్టీ మండల అధ్యక్షుడు కొండపల్లి రాంచందర్రావు మాట్లాడారు. ఈ మార్నేని రఘు, భూక్య సునిత, ఆంగోత్ కిషన్, సుబ్బారావు, శ్యాంలోయ, సుతారపు వెంకటనారాయణ, కటకం వెంకన్న, తప్పెట్ల శ్రీను పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
పెంచిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సమ్మెట రాజమౌళి డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద సెంటర్లో రాస్తారోకో నిర్వహించి ఆ తదుపరి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడారు. రేణుక, తార, ఆనంద్, శక్రు, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
పెంచిన చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయం సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను నాయకులు దహనం చేశారు. సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి.అజయ్ మాట్లాడారు. పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, రేశపల్లి నవీన్, నర్ర శ్రావణ్, కేదాసు రమేష్, శ్రీశైలం, యాకాం బ్రం, భద్రం, సాంబలక్ష్మి, పాల్గొన్నారు.
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో..
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ సెంటర్లో పెంచిన చార్జీలకు నిరసనగా రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి హెచ్.లింగన్న మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు దేశెట్టి రాంచంద్రయ్య, తాజ్పాషా, ఎస్.పాపన్న, శేఖర్, నాగన్న, మురళి, శ్రీధర్, రఫి, ఎల్లయ్య, సూర్య, బ్రహ్మం పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ
ఆధ్వర్యంలో..
పెంచిన విద్యుత్ బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కార్యక్రమంలో నాయకులు ముంజంపల్లి వీరన్న, సూరి, పైండ్ల యాకయ్య, కె.భాస్కర్రెడ్డి, తండ సురేష్, ఆవుల కట్టయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు.
కేసముద్రంలో..
కేసముద్రం : పెంచిన బస్సు, కరెంటు చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం మండల నాయకుడు బొబ్బాల యాకుబ్రెడ్డి , మార్తనేని పాపారావు డిమాండ్ చేశారు. ఆ పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరిపెల్లి మొగిలి, నీరుటి జలేందర్, తాడబోయినశ్రీశైలం, కవాటి నర్సయ్య పాల్గొన్నారు.
గూడూరులో..
గూడూరు : రాష్ర్ట ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ బస్సుల చార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నున్న నారాయణ, డివిజన్ కార్యదర్శి ఆకుల రాజ డిమాండ్ చేశారు. స్థానిక బస్స్టాండ్ సెంటర్లో శుక్రవారం పెంచిన చార్జీలను నిరసిస్తూ, సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాధాలు చేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. పార్టీ మండల కార్యదర్శి భరత్నాయక్, వెంకన్న, వీరయ్య, మోహన్, వెంకన్న, లక్ష్మన్, నగేష్ పాల్గొన్నారు.
నెల్లికుదురులో..
నెల్లికుదురు : బస్సు, విద్యుత్ చార్జీలను పెంచి నిరుపేద ప్రజలపై పెను భారం మోపిందని టీడీపీ మండల అధ్యక్షుడు బానోతు బోజ్యానాయక్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు స్థానిక అంబేడ్కర్ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధిరెడ్డి, రామంచ్రు, వెంకటేశ్వర్లు, ప్రభ్రాకర్, అయిలయ్య, హైమద్, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.