హారర్ చిత్రంగా చాకోబార్
తమిళ సహాయ దర్శకులకు, వర్ధమాన దర్శకులకు చాకోబార్ ఒక పాఠం అవుతుందని ఆ చిత్ర నిర్మాత మధురాజ్ అన్నారు. ప్రముఖ సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించిన చిత్రం ఐస్క్రీమ్ను ఈయన త మిళంలోకి చాకోబార్ పేరుతో అనువదించారు. నవదీప్,తేజస్వి జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళంలోకి అనువదించిన నిర్మాత మధురాజ్ చిత్రం గురించి తెలుపుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక చిత్రాన్ని కేవలం రెండుంపావు లక్షల్లో నిర్మించడం సాధ్యమా? అసాధ్యం అంటూ ఏమీ లేదని ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ చేసి చూపించారని అన్నారు.
రెండుంపావు లక్షలు ఈ రోజుల్లో కథా చర్చల ఖర్చుకే సరిపోవడం లేదన్నారు. ఒక చిత్ర నిర్మాణ కార్యాలయం అడ్వాన్స్కే రెండు, మూడు లక్షలు అడుగుతున్నార న్నారు. అలాంటిది ఆ మొత్తంతో రామ్గోపాల్ వర్మ ఒక చిత్రాన్ని పూర్తి చేశారని, ఇది తమిళ సహాయ దర్శకులకు, వర్ధమాన దర్శకులకు ఒక పాఠం అవుతుందని అన్నారు. చాకోబార్ చిత్రం నిర్మాణం భారతీయ సినీ చరిత్రలోనే ఒక రికార్డుగా పేర్కొనవచ్చునన్నారు. హారర్, గ్లామర్ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆరుగురు నటీనటులే నటించారని, చిత్రాన్ని ఆరు రోజుల్లోనే పూర్తి చేశారని తెలిపారు.
ఈ చిత్రానికి రామ్గోపాల్వర్మ కోటిన్నర పారితోషికం తీసుకున్నారని తెలిపారు.హైదరాబాద్ వెళ్లిన తాను ఈ చిత్రాన్ని చూసి తమిళంలోకి అనువధించాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే తన చిత్రాన్ని తమిళ ప్రేక్షకులు చూడరు. అందువల్ల అనువాద హక్కులు ఇవ్వనని రామ్గోపాల్వర్మ అన్నారని తెలిపారు. అయితే తాను పట్టుబట్టి మరీ హక్కులు తీసుకున్నానని చెప్పారు. చాకోబార్ చిత్రం హారర్ సన్నివేశాలతో ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా సాగుతుందన్నారు.