ఎయిర్కోస్టా విమాన సేవలు షురూ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో / గన్నవరం, న్యూస్లైన్: రాష్ట్రానికి చెందిన తొలి విమానయాన సంస్థ ఎయిర్కోస్టా సేవలను రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయవాడకు బయలుదేరిన విమానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన కంపెనీ విమానయాన రంగంలోకి అడుగుపెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ రంగం మరింత వృద్ధి చెందేలాగా త్వరలోనే పౌర విమానయాన విధానాన్ని ప్రకటించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ విమానాశ్రయాల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జేడీ శీలంతో పాటు స్వీకర్ నాదెండ్ల మనోహర్, ఎయిర్ కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని తదితరులు పాల్గొన్నారు.
గన్నవరం నుంచి సర్వీసులు ప్రారంభం: ఎయిర్కోస్టా తొలి విమానం మంగళవారం విజయవాడ నుంచి 56 మంది ప్రయాణికులను తీసుకుని బెంగళూర్కు బయలుదేరి వెళ్లింది. తొలి ప్రయాణ టికెట్ను గన్నవరం ఎయిర్పోర్టు డెరైక్టర్ బీజీ పాటిల్ జ్యోతి ప్రయాణికులకు అందజేశారు. మరో 3 నెలల్లో ఈ సంస్ధ ఇక్కడి నుంచి చెన్నై, గోవా, త్రివేండ్రం, వైజాగ్కు విమానాలను నడపనున్నట్లు తెలిపారు. ఎయిర్కోస్టా మేనేజర్ కృష్ణంరాజు మాట్లాడుతూ ప్రతిరోజూ ఈ సర్వీస్ గన్నవరం నుంచి ఉదయం 6.45కు బయలుదేరి 7.45కు బెంగళూర్కు చేరుకుంటుందని, అక్కడి నుంచి 10.30కు జైపూర్ వెళ్తుందన్నారు. తిరిగి ఈ సర్వీసు బెంగళూర్లో సాయంత్రం 4.40కు బయలుదేరి 5.40కు ఇక్కడికి చేరుకుంటుందని చెప్పారు.